SHARE

Wednesday, June 27, 2012

30. " మంత్ర ద్రష్ట " ముప్పైయవ తరంగము



ముప్పైయవ తరంగము

     రాను రాను అతనికి ఇదే ఆలోచన ఎక్కువైంది . దుంపలు పళ్ళను బయటికి వెళ్ళి తెచ్చుకోవడము తగ్గించాడు . " నావలన ఎవరికైనా సరే , ఎందుకు కష్టము కలగాలి ? ఏమీ తినకుండా , కూర్చున్నచోటే ప్రాణశక్తిని ప్రేరేపించి ఆకలిని ఆకలే తిని వేయునట్టు ఆకలి పుట్టగానే దాన్ని తుంచేయకూడదా ? " అనిపించింది .

     విశ్వామిత్రుడు కూర్చున్నాడు . ఎప్పటిలాగానే తన ధ్యాన బలముతో తన దేహపు ప్రతి కణములోనూ ప్రాణశక్తిని నింపాడు . ఒళ్ళంతా కళ్ళతో ,  ఆ శక్తి దేహమునుండి సమసి పోకుండా చూసుకుంటున్నాడు . ధ్యానము ఎటుతిరిగితే అక్కడే కేంద్రమవుతున్నదే తప్ప , నిజమైన కేంద్రము ఏదో తెలియుటే లేదు . 

     ఇటులే ఒక వారమయినది . విశ్వామిత్రునికి ఆకలి దప్పుల బాధ తాళలేకున్నంత గా అయింది . అప్పుడు ప్రాణాన్ని బంధిస్తాడు . ఆకలి , దప్పులు నిలుస్తాయి . మరలా ప్రాణపు బంధనము విప్పి ప్రాణ శక్తిని పొంగించితే , ఆకలి దప్పులు మళ్ళీ తల ఎత్తుతాయి . దీపాన్ని చిదిమి వత్తిని పైకి లాగితే వెలుగు ఎక్కువై , దానితో పాటే చుట్టూ చీకటి కూడా ఎక్కువైనట్లు , ఆకలి దప్పులు విజృంభిస్తాయి . ప్రాణాన్ని కట్టివేయాలి . లేదా ప్రాణ శక్తికి ఆహారము  , నీరు అందించాలి . ఇదే ఒక పెద్ద సమస్యగా మారింది . 

     చివరికి విశ్వామిత్రునికి ఒక ఆలోచన మెరిసింది . ’ అన్నీ పెరిగేదీ , తగ్గేదీ ప్రాణ శక్తి వలన . ఈ పాణ శక్తిని ఒక పండు కో , దుంపకో నింపి , శక్తి నిండిన ఆ ఫల మూలాన్ని తిని చూద్దాము. అప్పుడేమైనా ఆకలి దప్పులు కలగకుండా ఉంటాయేమో ? ’ అనిపించింది . వెంటనే వెళ్ళి నిత్య కర్మాదులను ముగించుకుని  వస్తూ , దారిలో అప్పుడే తన ఎదురుగనే పెరిగి పెద్దదైన ఒక పండు తెచ్చి , ప్రాణ శక్తిని దానిలో నింపి స్వీకరించాడు . ప్రాణ శక్తి హాహాకారము తప్పింది . ఆకలి అణగింది . దాహమూ తగ్గింది . 

     దీనితో విశ్వామిత్రుడు , ’ అట్లయిన, ప్రాణానికి ప్రాణమే ఆహారమా ? ప్రాణము తప్ప వేరేదీ ప్రాణానికి ఆహారము కాలేదా ? అలాగయితే ఈ ప్రాణపు స్వరూపమేమి ? ఒకవైపు అన్నమై , ఇంకొకవైపు అన్నాన్ని తిను అన్నాదుడై ఉన్నపుడు , ప్రాణము ఇక్కడుంది , అక్కడ లేదు అనుటకు లేదు ? అంటే , లోకములో అన్ని చోట్లా ఉన్నది ప్రాణమొకటేనా ? ఇదేనా , ఆపో దేవీ , అశ్వినీ దేవతలూ చెప్పిన సృష్టి రహస్యము ? అలాగైనప్పుడు , ప్రాణాన్ని అర్థం చేసుకున్న వాడు ప్రాణాన్ని సృష్టించ గలవాడవుతాడు . ఇంతకు ముందు  నేను , పోయిన ప్రాణాన్ని తిరిగి తెచ్చాను . ఉన్న ప్రాణాన్ని ఎక్కువ చేశాను . ఇంకొక ప్రాణాన్ని ఎందుకు సృష్టించకూడదు ? ’

     ఇలాగే నూతన సృష్టిని ప్రారంభిస్తే తప్పేమి ? అశ్వినీ దేవతలు ఆ రోజు , పంచభూతాలను కలగలిపి శరీరాన్ని తయారు చేయుటను చెప్పారు . ఇప్పుడు నేను ప్రాణాన్ని వేరు చేయగల వాడినైతే అది నిజంగానే వినూతన సృష్టి అవుతుంది . అయితే , ఆ రోజు బ్రహ్మణస్పతి హెచ్చరించారు . " ఇద్దరు మహర్షులూ చెలరేగి సృష్టికి సిద్ధమయ్యారు . సృష్టిని చేస్తున్నారు . కానీ దానివలన అగు అనర్థమేదో గమనించారా ? " అని అడిగారు కదా ! 

" అలాగ అనర్థమయితే ? "

     " అనర్థమేమయింది ? కొత్తది పాతదాన్ని చంపి తినేసింది. చెడగొట్టింది . ఇంతేకదా ! చెడిపోతే , చంపితే , సరిదిద్దుకొనే పద్దతి తెలిసింది . పాతది తింటే మరలా ఇంకో పాతదాన్నే పుట్టిస్తే సరి . దానికేమిటి  మహా ? జరిగేది జరగనీ , కానీ సృష్టి చేయాలి " 

     " అయినా , వీలయినంతవరకూ అనర్థము కాకుండా చూసుకోవాలి . చెడుటకు అవకాశమిచ్చి తర్వాత సరిచేసుకోవడము అదేమంత పెద్ద పని ? చెడకుండానే చేయాలి . అప్పుడు ఆవేశముతో చెలరేగి చేయాలనుకున్న పనిని , ఇప్పుడు స్తిమితముగా , సావధానముగా చేద్దాము . అలాగని , శాంతముగా సావధానముగా కూర్చుంటే ఏ పనవుతుంది ? ప్రాణము విజృంభించాలి . అన్నిటా ఏకాండముగా ఉన్న ప్రాణము పగిలిపోవాలి . అది శాంతముగా ఉంటే అవుతుందా ? పెనుగాలికి చిక్కిన సముద్రములాగా ప్రాణశక్తి అల్లకల్లోలమై పడిలేచి కరాళ నృత్యము చేయకపోతే అది ఎలా వేరవుతుంది ? ఎలా విడదీయ బడుతుంది ? 

     " పడిలేవాలంటే అది ఎలాగ ? అప్పుడు దానికి కారణమైన తన అవస్థ ఏమవుతుంది ? నేనూ ప్రాణమూ ఒకటేనా లేక వేరే వేరేనా ? నేనే ప్రాణమా లేక , నేను ప్రాణాన్ని ఆడించే వేరొక చైతన్యమా ? " ఏమీ అర్థం కాలేదు . 

     పెద్ద చిక్కే వచ్చింది . విశ్వామిత్రుడు ధ్యానానికి కూర్చుంటాడు . ప్రాణ శక్తి విజృంభిస్తుంది . అప్పుడు తాను ఆ ప్రాణము నుండీ వేరు కాలేక , ప్రాణమంటే తానే అనుకుంటాడు . అతని ప్రాణ శక్తి వీచేగాలిలో , పారే నీటిలో , అతడు కూర్చున్న నేలలోనూ కలిసి ఏకమై పోతున్నది . అలాగ చెదరిపోకుండా దాన్ని నిరోధిస్తే నిప్పు కణాల లాగా  బయటకు చిమ్ముతున్నది . చెదరిపోనిచ్చినా , పట్టి నిలిపినా అదీ తానూ ఒకటేనా లేక వేరేవేరేనా అన్నది మాత్రము తెలీలేదు . 

     ఇలాగే రెండుమూడు నెలలు గడచిపోయాయి . విశ్వామిత్రుని మనసు  , ఆరు నూరైనా , నూరు ఆరైనా , పట్టిన పట్టు ను సాధించేవరకూ ఆగలేకపోతున్నది . అతనికి బయటి సృష్టిని వదలి కనులు మూసుకొని లోపలికి చూస్తూ కూర్చొనుటకు మనసొప్పదు . అలాగని లోపలి తినేస్తున్న ఆలోచనను వదలి బయటి సృష్టినే చూస్తూ సుఖముగా ఉండుటకూ మనసొప్పదు . ఇలాగే మనసు లోపలికీ బయటికీ ఊగిసలాడుతున్నది . కొంతసేపు అంతర్ముఖుడై ప్రాణ శక్తితో ఆటలాడతాడు . మరలా బహిర్ముఖుడై దాని ఫలమేమయిందో అని చూడ్డానికి కన్ను తెరుస్తాడు . 

     చివరికొక రోజు విశ్వామిత్రుని మనసుకు ఎందుకో ఏమో ఒక గట్టి నిశ్చయము ఒచ్చేసింది . " ఈ రోజు అనుకున్నది జరగాలి . దీని అంతేదో చూడాలి . రేపు పున్నమి . జగమంతా కళాపూర్ణోదయమయ్యే రోజు . , ఈ రోజు కళలు సంపూర్ణమగుటకు సిద్ధమయ్యే రోజు. ఈ సమయము ఏమైనా సరే , ధ్యానానికి కూర్చుని అనుకున్నది సాధించాలి . " అనిపించింది 

     కానీ ’ ఏదో విఘ్నము వస్తుంది , కార్యము పూర్తి కాదు ’ అని ఏదో అంతరంగంలో అస్పష్టముగా చెబుతున్నది . మౌనీంద్రుడు దాన్ని గమనించినా , గమనించనట్టే , ’ విఘ్నమంటే ఏమి ? దాన్ని కూడా మనకు అనుకూలమగునట్లు చేసుకుంటే సరి . రానీ ! ఏ అడ్డంకి వస్తుందో , రానీ ! నేను విశ్వానికే మిత్రుడనయినప్పుడు , నాకు జడ-చేతనములన్నిటా ఒకే మైత్రీ భావముమున్నపుడు ఏ అడ్డంకి వస్తే ఏమి ? అది కూడా నాకు అనుకూలమే అవుతుంది . ’ అనే నమ్మకముతో దాన్ని నివారిస్తాడు . 

     చివరికి సంధ్యాకార్యము పూర్తి చేసుకొని తన గుడిసెలో కూర్చున్నాడు . భూమ్యాకాశాలు కలిసే దిగంత రేఖ కు పైన,  మేఘాల గదినుంచీ బయట పడి కొంచము పైకొచ్చిన చంద్రుడు ఉదయకాలపు ఎరుపు రంగు కొంచము కూడా మిగలకుండా , కడిగిన ముత్యంలా , వెండి తెలుపు తో లోకాన్నంతా మెరుగు పెడుతున్నట్టు వెలుగుతున్నాడు . ధ్యానాసక్తి బలమైంది . అలాగే కాసేపు కూర్చొని చంద్రుణ్ణే ధ్యానిస్తూ " నేను కోరుతున్న సిద్ధి ఇదే . సృష్టికాలములో ఎట్టి ఉద్రేకావేశాలూ లేక , శాంతమైన మనస్సుతో , శాంతమైన సృష్టి చేయాలి . అది లోక కల్యాణమునకై జరగాలి " అని గట్టిగా అన్నాడు . అతడు గట్టిగా మాట్లాడి ఎన్నో రోజులైంది . తన కంఠమే , అయినా దానిలో ఏదో విలక్షణముగా ఉన్నట్టనిపించి ఇంకోసారి అదే మాట పలికాడు . ఇంకా చోద్యమై , మరలా ఒకసారి పలికాడు . ఒకసారి కన్నా ఇంకోసారి ఇంకా గట్టిగా వినిపించి , శబ్ద తరంగాలు గుడిసెను నింపి , బయట పడి , చుట్టుపక్కల అంతా పరచుకోకుండా , గుడిసెలోనే నిలచినట్టు భావన అయింది .

     ఇంకా ఆ శబ్ద తరంగాలు గాలిలో జీర్ణమైపోతున్నంతలో , దానికన్నా ముందే , వీణానాదముగా మారి , ఇంకొక రూపము చెంది వెనక్కు తిరిగి వచ్చినట్టు , విశ్వామిత్రునికి ఇంకొక మానవ స్వరము వినిపించింది  : " అది దేవలోకములో మాత్రమే సాధ్యము " 

     ధ్వని స్పష్టముగా ఉంది . ఇతరులెవరూ లేని ఏకాంతమని నమ్మిన మనసు చకితమై అటు తిరిగింది .

ఒక అతివ గుడిసె వాకిట్లో నిలుచుంది . 

No comments:

Post a Comment