SHARE

Tuesday, August 28, 2012

" ప్రదోష పూజ "



                                             ప్రదోష పూజ








ప్రదోషము

              ప్రదోషమంటే అది ఒక కాల విశేషము . ప్రదోషమంటే పాప నిర్మూలన అని అర్థము .  ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయములో చంద్రుడి కదలికల వలన ఏర్పడునది ప్రదోషము . అనగా , చంద్రుడి గతి వలన , ఏర్పడే తిథుల సంధులలో సూర్యాస్తమయము అయితే , అప్పుడు ప్రదోషము అంటారు . కాబట్టి ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయమునకు తిథి మారితే , అప్పుడు ప్రదోషము కలిగే అవకాశము ఉంది . అయితే అన్నిరోజులలో కలిగే ప్రదోషాలపైకి , మూడు ప్రదోషాలకే ప్రాముఖ్యత ఉంది . అవి , చతుర్థి , సప్తమి , త్రయోదశి లలో కలిగే ప్రదోషాలు . వీటిలో కూడా త్రయోదశినాడు కలిగే ప్రదోషాన్ని ’ మహా ప్రదోషం ’ అంటారు .  

ఈ ప్రదోష కాల గణనము ఇలా ఉండును .

          ఏ దినమందు సూర్యాస్తమయమైన తర్వాత తొమ్మిది ఘడియల లోపల చతుర్థి తిథి వచ్చునో , ఆ దినము ప్రదోషము కలుగును . అటులే , ఏ దినమైనా  సూర్యాస్తమయము తర్వాత  చతుర్థి రెండు ఘడియలైనా ఉంటే ఆ దినము ప్రదోషము . 

          ఏ దినమందు సూర్యాస్తమయమైన తర్వాత పదహైదు ఘడియల లోపల సప్తమి తిథి వచ్చునో , ఆ దినము ప్రదోషము కలుగును . అటులే , ఏ దినమైనా  సూర్యాస్తమయము తర్వాత  సప్తమి ఒక్క ఘడియైనా ఉంటే ఆ దినము ప్రదోషము . 

          ఏ దినమందు సూర్యోదయము  తర్వాత అరవై  ఘడియల లోపల త్రయోదశి తిథి వచ్చునో , ఆ దినము ప్రదోషము కలుగును . అటులే , ఏ దినమైనా  సూర్యాస్తమయము తర్వాత  త్రయోదశి అర్ధ ఘడియైనా ఉంటే ఆ దినము ప్రదోషము . 

         ఈ త్రయోదశీ ప్రదోషము అవధిని ఇలాగ లెక్క కట్టెదరు . సాయంత్రం నాలుగున్నర గంటలనుండీ ఇంచుమించు అర్ధరాత్రి వరకూ ప్రదోషమే . కొందరు సూర్యాస్తమయమునకు ముందర రెండున్నర ఘడియలూ , తర్వాత రెండున్నర ఘడియలూ అంటారు . ( ఒక ఘడియ = 24 నిమిషాలు ) 

         ఈ ప్రదోష దినము అనధ్యయనము . సర్వ విద్యలకూ గర్హితమైనది . సూర్యాస్తమయ కాలము మనకు తమోగుణ ప్రధానమైనది . ఆ సమయములో ప్రదోషమైనచో , కొన్ని అనుష్ఠానములు చేయ వలెను . మామూలుగా చతుర్థి , సప్తములలో ధ్యానము , గాయత్రీ జపము చేయవచ్చును. ప్రదోష సమయముపై శివుడికొక్కడికే అధికారము గలదు , కాబట్టి శివ పూజ మాత్రమే చేయవలెను అనునది కొందరి మతము . మామూలుగా ప్రతి పక్షములోనూ ప్రదోషము వచ్చును . కానీ కృష్ణ పక్షములో చతుర్దశి రోజు మాస శివరాత్రి వచ్చును . దాని వెనుకటి రోజు  త్రయోదశి లో  మహా ప్రదోష కాల శివపూజ విధించబడినది . శుక్ల పక్షములో కూడా త్రయోదశికి ప్రత్యేకత గలదు . ఆరోజు కూడా శివ పూజనే చేయవలెను . 

          ప్రదోషమంటే పాప నిర్మూలన అని తెలుసుకున్నాం . మనము రోజూ ఎన్నో పాప కర్మలు చేస్తుంటాము . వాటి ఫలము వలన మనకు మనమే కొన్ని ప్రతిబంధకాలను తెచ్చుకుని , మన పురోభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిమితం చేసుకుంటున్నాము . మన పాప కర్మ ఫలమును నిర్జీవం చేయాలంటే , దానికి తగ్గ పుణ్య కర్మలు చేయవలెను . ఈ త్రయోదశీ ప్రదోషము మనకు దేవుడిచ్చిన వరము . పరమ శివుడు తన ప్రమథ గణాలతో కొలువై మన పూజలు అందుకొనుటకు సిద్ధంగా ఉండు సమయమది . మన పాప కర్మల ఫలాన్ని పటాపంచలు చేసి  గరళము వలె మింగి ,  మనకు సాత్త్విక గుణమును కలిగించి మన కష్టములను తగ్గించును .

              ఈ త్రయోదశి శనివారమొస్తే దాన్ని శని త్రయోదశి యనీ , సోమవారమొస్తే దాన్ని సోమప్రదోషమనీ పిలుస్తారు . ఇవి కాక , గురువారము నాడు వచ్చే ప్రదోషము కూడా అత్యంత ప్రాముఖ్యము గలది . అన్ని త్రయోదశులలోనూ శివపూజ తప్పనిసరి అయినా , ఈ మూడు రోజులూ మాత్రము మరింత విశేషమైనవి .

             శని త్రయోదశి నాడు చేసిన శివపూజ వలన జాతకము లోని  శని ప్రభావము కూడా తొలగింపబడును . శని మహాత్ముడు కర్మలకు ప్రతినిధి అని పిలవబడుతాడు . మన కర్మల ఫలితాన్ని నిర్దేశించి మనకు పాఠాలు నేర్పువాడితడు . అట్టి శని ప్రభావమును కూడా ఈ ప్రదోషపూజతో పోగొట్టుకొనవచ్చును . 

            సోమ ప్రదోషము నాడు చేసిన పూజ వలన మనసు శుద్ధమై త్రికరణ శుద్ధి కలుగును . సోమవారము శివుడికి ప్రీతి పాత్రమైనది . ఆరోజు చేసిన శివపూజ సర్వ పాప హరము , సర్వ పుణ్యదము . 

           ఇక గురువారము త్రయోదశీ ప్రదోషము వస్తే , ఆనాడు చేసిన పూజ వలన గురు అనుగ్రహము కలిగి , విద్యాబుద్ధులు , సంపదలు కలుగుతాయి . గురువు వాక్పతి , బుద్ధిని ప్రేరేపించువాడు , మరియు ధన కారకుడు . జాతకములో గురు దోషములకు రుద్రారాధన విరుగుడుగా చెప్పడము మనకు తెలిసినదే . 

          ఈ త్రయోదశీ ప్రదోషమునాడు ఎవరికి వీలైనంతగా  వారు , మహాన్యాస పూర్వక ఏకాదశవార రుద్రాభిషేకమో , ఏకవార రుద్రాభిషేకమో , లఘున్యాస  నమక చమక పఠనమో  , ఉత్త పాలతో అభిషేకమో , మారేడు దళములతో అర్చననో , ఏదో ఒకటి చేసి అనంత ఫలము పొందండి . భక్తితో ఉద్ధరిణెడు నీళ్ళు పోస్తే  చాలు ,  పొంగిపోతాడు , భోళా శంకరుడు . 

                                     జనాస్సర్వే సుఖినస్సంతు

Monday, August 27, 2012

" బ్రహ్మ యజ్ఞము " రెండవ భాగము




  బ్రహ్మ యజ్ఞము విధానము 

( కారణాంతరముల వలన మంత్రములకు ఇక్కడ స్వరమునివ్వడము లేదు . )

     తూర్పుకు  తిరిగి దర్భాసనముపై కూర్చొని , రెండు సార్లు ఆచమనము చేయవలెను . ఉంగరపువేలికి పవిత్రమును ( దర్భ ముడి ఉంగరం )  ధరించి , ప్రాణాయామము చేయవలెను . (  ఆచమనము చేయునప్పుడు ఎప్పుడు కూడా ఉంగరపు వేలికి పవిత్రం ఉండకూడదు ) దేశకాలములను కీర్తించి , ఈ విధముగా సంకల్పము చెప్పవలెను .


మమ ఉపాత్త దురితక్షయ ద్వారా పరమేశ్వర ప్రీత్యర్థం బ్రహ్మ యజ్ఞేన యక్షే  | 

ఈ మంత్రములను చెప్పవలెను 

|| విద్యుదసి విద్యమే పాప్మానమ్ | ఋతాత్ సత్యమ్ ఉపైమి | ఋచో అక్షరే పరమే వ్యోమన్ | యస్మిన్ దేవా అధి విశ్వే నిషేదుః | యస్తన్న వేద | కిమ్ ఋచా కరిష్యతి | య ఇత్తద్విదుః | త ఇమే సమాసతే || 

     మణికట్టుల  వరకూ చేతులను కడుగుకొని , మూడు సార్లు మౌనంగా అంతశ్శుద్ధి కోసము ఆచమనములో వలె నీటిని తాగవలెను . పెదవులను రెండు సార్లు నీటితో తుడుచుకొనవలెను . తర్వాత మరల శుద్ధి కోసము హస్తములను కడుగుకొనవలెను . తరువాత కుడి చేతి వేళ్లతో ఒక్కొక్క సారి నీటిని తీసుకొని , శిరస్సును , కన్నులను , ముక్కును , చెవులను , హృదయమును ఒక్కొక్కసారి స్పృశించవలెను . ఇది , శుద్ధికీ , అదృష్టమునకూ. అటులనే ఎడమ హస్తమును , ఎడమ పాదమును కూడా నీటితో ప్రోక్షించవలెను . 

     తరువాత ,  కుడి పాదమును ఎడమ మోకాలిపై స్పృశించునట్లు పెట్టి , ( సుఖాసనములో వలె ,) ఎడమ అరచేతిని కుడి మోకాలిపై పైకి తెరచిపెట్టి , ఆఎడమ అరచేతిలో కుడి అరచేతిని మూయవలెను . రెండు బొటనవేళ్ళు ఒకదానికొకటి సమాంతరముగా కాక , ఒకదానికొకటి అడ్డముగా ఉండవలెను . అన్ని వేళ్ళూ మడచి ఉండవలెను . ( మామూలుగా పూజా సంకల్పములలో ఇలాగ ఉంచుట తెలిసినదే ) 

తర్వాత ఈ కింది విధముగా స్వాధ్యాయమును చేయవలెను 

ఓం భూః తత్సవితుర్వరేణ్యం |
ఓం భువః  భర్గో దేవస్య ధీమహి |
ఓగ్ం సువః ధియో యోనః ప్రచోదయాత్ |

ఓం భూః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి |
ఓం భువః ధియో యోనః ప్రచోదయాత్ |
ఓగ్ం సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ |

ఓం భూర్భువస్సువః | సత్యం తపః శ్రద్ధాయాం జుహోమి | 

తరువాత , వేదములోని కింది అనువాకాలను పఠించవలెను . ఎవరి స్వశాఖను వారు మొదట పఠించి , తరువాత ఇతర శాఖ ను పఠించవలెను . ఇక్కడ మొదట యజుర్వేదపు మంత్రములు ఇవ్వడమైనది 

యజుర్వేదం 

శ్రీ గురుభ్యో నమః హరిః ఓం 

|| ఇషేత్వోర్జేత్వా వాయవస్థో పాయవస్థ ...........యజమానస్య పశూన్పాహి ||  ( ..అను అనువాకము )

|| యజ్ఞస్య ఘోషదసి .....ఋతుభిః కల్పయాతి ||  ( మొదటి కాండ లోని మొదటి ప్రశ్న మొత్తం ) 

లేదా  మొదటి ప్రశ్న లోని మొదటి మూడు అనువాకాలు 

|| ఇషేత్వోర్జేత్వా వాయవస్థో పాయవస్థ ...........యజమానస్య పశూన్పాహి || 

|| యజ్ఞస్య ఘోషదసి.....దేవంగమమసి || 

|| శున్ధధ్వం దైవ్యాయ కర్మణే .......హవ్యగ్ం రక్షస్వ ||  

 ( దీని తర్వాత , బ్రాహ్మణములోని " బ్రహ్మ సంధత్తం ....అనే వాక్యాలను పఠించవచ్చు .)

ఋగ్వేదం 


|| అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవ మృత్విజం  | హోతారం రత్న ధాతమం || 

సామ వేదం 

|| అగ్న ఆయాహి వీతయే గృణానో హవ్యదాతయే | నిహోతా సత్సి బర్హిషి || 

అథర్వణ వేదం 

|| శం నో దేవీరభిష్టయ ఆపో భవంతి పీతయే | శం యో రభిస్రవంతునః || 

హరిః ఓం 


     వేదపాఠము కాని వారు , ప్రణవము , వ్యాహృతులతో పాటు గాయత్రీ మంత్రాన్ని యథా శక్తి జపించవలెను . దాని తర్వాత గాథలు , పురాణాలు పఠించవలెను .

తరువాత , ఈ కింది మంత్రాన్ని మూడు సార్లు జపించవలెను 

నమో బ్రహ్మణే నమో అస్త్వగ్నయే నమః పృథివ్యై నమ ఓషధీభ్యః | నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహతే కరోమి ||  ( మూడు సార్లు ) 

రోగాదుల వలన అశక్తులైన వారు ఉన్నచోటే కూర్చుని మనసులోనే చేయవచ్చును . 

తరువాత , కింది మంత్రాన్ని చెప్పవలెను 

|| వృష్ఠిరసి వృశ్చమే పాప్మానమ్ | ఋతాత్ సత్యముపాగామ్ || 

మరలా చేతి వేళ్లతో ఒక్కొక్క సారి నీటిని తీసుకొని , శిరస్సును , కన్నులను , ముక్కును , చెవులను , హృదయమును ఒక్కొక్కసారి స్పృశించవలెను . 

తర్పణము 

     ఇప్పుడు దేవతలకు , కాండ ఋషులకు ,  పితృ దేవతలకు తర్పణమునియ్యవలెను . దేవతలకు ఒక్కొక్కసారి , కాండ ఋషులకు రెండు రెండు సార్లు , పితృ దేవతలకు మూడు మూడు సార్లు ఇవ్వవలెను .  

ఆచమనము , ప్రాణాయామము చేసి , ---పరమేశ్వర ప్రీత్యర్థం దేవర్షి పితృ తర్పణం చ కరిష్యే అని చెప్పి , 


దేవతలకు  , తూర్పుకు తిరిగి యుండి , దైవ తీర్థం లో , ఉపవీతులై ( యజ్ఞోపవీతం సవ్యముగా వేసుకొని , ) ఒక్కొక్క సారి ఇవ్వ వలెను. 

ఓమితి సర్వత్ర బ్రహ్మాదయో యే దేవాః 

తాం దేవాం స్తర్పయామి 
సర్వాం దేవాం స్తర్పయామి 
సర్వాం దేవ గణాం స్తర్పయామి 
సర్వా దేవ పత్నీ స్తర్పయామి 
సర్వా దేవ గణ పత్నీ స్తర్పయామి 
సర్వాం దేవ పుత్రాం స్తర్పయామి 
సర్వాం దేవ పౌత్రాం స్తర్పయామి 
భూర్దేవాం స్తర్పయామి 
భువో దేవాం స్తర్పయామి 
సువర్దేవాం స్తర్పయామి 
భూర్భువస్సువర్దేవాం స్తర్పయామి 

కాండ ఋషులకు తర్పణము 

యజ్ఞోపవీతాన్ని మాలగా వేసుకొని ( నివీతి ) , ఉత్తరమునకు తిరిగి ,  ఋషితీర్థములో రెండు రెండు సార్లు తర్పణము నివ్వవలెను . 

 శ్రీ  కృష్ణద్వైపాయనాదయో యే ఋషయః 

తాన్ ఋషీగ్ స్తర్పయామి తర్పయామి | 
సర్వాన్ ఋషీగ్ స్తర్పయామి తర్పయామి | 
సర్వానృషి గణాగ్ స్తర్పయామి తర్పయామి | 
సర్వా ఋషి పత్నీ స్తర్పయామి తర్పయామి | 
సర్వా ఋషి గణ పత్నీ స్తర్పయామి తర్పయామి | 
సర్వానృషి పుత్రాం స్తర్పయామి తర్పయామి | 
సర్వానృషి పౌత్రాం స్తర్పయామి తర్పయామి | 
ప్రజాపతిం కాండర్షిం తర్పయామి తర్పయామి | 
సోమం కాండర్షిం తర్పయామి తర్పయామి | 
అగ్నిం కాండర్షిం తర్పయామి తర్పయామి | 
విశ్వాన్ దేవాన్ కాండర్షీగ్ స్తర్పయామి తర్పయామి | 
యాజ్ఞికీ ర్దేవతా ఉపనిషద స్తర్పయామి తర్పయామి | 
వారుణీ ర్దేవతా ఉపనిషద స్తర్పయామి తర్పయామి | 
హవ్యవాహం తర్పయామి తర్పయామి | 
విశ్వాన్ దేవాన్ కాండర్షీగ్ స్తర్పయామి తర్పయామి | 

బ్రహ్మాణం స్వయంభువం తర్పయామి తర్పయామి ( ఇది మాత్రం బ్రహ్మ తీర్థములో ఇవ్వాలి . బొటన వేలి అడుగు నుండీ వదల వలెను ) 

విశ్వాన్ దేవాన్ కాండర్షీగ్ స్తర్పయామి తర్పయామి | 
అరుణాన్ కాండర్షీగ్ స్తర్పయామి తర్పయామి | 
సదసస్పతిం తర్పయామి తర్పయామి | 
ఋగ్వేదం తర్పయామి తర్పయామి | 
యజుర్వేదం తర్పయామి తర్పయామి | 
సామ వేదం తర్పయామి తర్పయామి | 
అథర్వాంగిరసం తర్పయామి తర్పయామి | 
ఇతిహాస పురాణం తర్పయామి తర్పయామి | 
కల్పం తర్పయామి తర్పయామి | 

పితృ తర్పణము 

యజ్ఞోపవీతమును అపసవ్యముగా వేసుకొని , దక్షిణమునకు తిరిగి , పితృ తీర్థములో మూడు మూడు సార్లు తర్పణము ఇవ్వ వలెను . 

సోమః పితృమాన్ యమోంగిరస్వాన్ అగ్ని కవ్యవాహనాదయో యే పితరః 

తాన్ పితౄగ్ స్తర్పయామి తర్పయామి తర్పయామి 
సర్వాన్ పిత్రూగ్ స్తర్పయామి తర్పయామి తర్పయామి 
సర్వ పితృ గణాగ్ స్తర్పయామి తర్పయామి తర్పయామి 
సర్వ పితృ పత్నీ స్తర్పయామి తర్పయామి తర్పయామి 
సర్వ పితృ గణ పత్నీ స్తర్పయామి తర్పయామి తర్పయామి 
సర్వాన్ పితృ పుత్రాం స్తర్పయామి తర్పయామి తర్పయామి 
సర్వాన్ పితృ పౌత్రాం స్తర్పయామి తర్పయామి తర్పయామి 

పైవన్నీ, పితృ లోకములో స్థిరముగా నున్న పితృ దేవతలకు .  తరువాత ,  "  పితృ తర్పణము    http://vibhaataveechikalu.blogspot.in/2012/07/blog-post_25.html  "  అన్న ఇంకొక పుస్తకము చూసి , మన వెనుకటి మూడు తరాలలో మరణించిన వారికి తర్పణము ఇవ్వవలెను . 


|| అనేన మయా కృత  బ్రహ్మ యజ్ఞాంగ నిత్య తర్పణ కర్మణా శ్రీ పరమేశ్వరః ప్రియంతాం || 

ఆచమనము చేయవలెను. 




Sunday, August 26, 2012

" బ్రహ్మ యజ్ఞము " మొదటి భాగము


         ప్రకృతి యొక్క రహస్యములను తెలిసికొని , యోగ్యులకు దానిని బోధించుట ఆర్యుల కర్తవ్యము . అలాగు చేయుటయే , అధ్యయన - అధ్యాపన రూపమైన బ్రహ్మ యజ్ఞము . బ్రహ్మ యజ్ఞము  చేయని వాడికి ఋషి , దేవ  ఋణములు తీరవు . ఈ ఋణములు ప్రతిఒక్కరికీ పుట్టుకతోనే వస్తాయి . వాటిని తీర్చుట అనగా , తనను కట్టివేసిన పాశములను తెంపి స్వతంత్రుడగుట . ఇలాగ అపూర్ణత్వము నుండి పూర్ణత్వము నకు తీసుకొని పోవు దారులే సంస్కారములు .  ----దేవుడు నరసింహ శాస్త్రి గారు


బ్రహ్మ యజ్ఞోపాఖ్యానము



 | అగ్నిం వై జాతం పాప్మా జగ్రాహ ......అభాగో వాచీ భవతి | 



బ్రహ్మ యజ్ఞపు ( వేదాధ్యయన ) ప్రశంసలో ఒక ఉపాఖ్యానము తైత్తిరీయ ఆరణ్యకములో రెండవ ప్రశ్నలో కనిపిస్తుంది .

       " అగ్ని పుట్టెను . ఆ అగ్నిని పాపము ఆవరించినది . దేవతలు ఆహుతులద్వారా ఆ పాపాన్ని పోగొట్టినారు . ఆహుతుల వలన ఆ పాపము యజ్ఞమునకు వచ్చెను . యజ్ఞము నుండీ దక్షిణలకు , దక్షిణల నుండీ , ఆ దక్షిణలను స్వీకరించిన బ్రాహ్మణులకు వచ్చెను . బ్రాహ్మణుల నుండీ మంత్రాలకూ , మంత్రాల నుండీ స్వాధ్యాయమునకు ( బ్రహ్మ యజ్ఞమునకు ) వచ్చింది . అయితే , ఆ పాపము దేవతలను కూడా పవిత్రులను చేయగల బ్రహ్మ యజ్ఞము వలన నశించిపోయింది . " 

       అగ్ని , హవిస్సులు , యజ్ఞాలు , దేవతలు , మంత్రాలు ....ఇవన్నిటి వలన కాని పని  బ్రాహ్మణులు చేయు బ్రహ్మ యజ్ఞము వలన కాగలదని వేదములోనే చెప్పబడింది కదా ! ఇటువంటి బ్రహ్మ యజ్ఞమును ( అధ్యయనమును ) వదలువాడు ఎంతటి దురదృష్టవంతుడు  అన్నది చెప్పనవసరము లేదు . 

       ఇంకా ముందుకు పోయి , శృతి ఇలాగ అంటుంది , "  వేదమును వదలిన వాడు మంచి స్నేహితుని పోగొట్టుకొన్న వాడివలె కష్టాలకు గురియవుతాడు . వాడికి పుణ్య మార్గము తెలిసే అవకాశము లేదు . వాడికి స్వర్గము దొరకునది కూడా లేదు . " 

       కాబట్టి ప్రయోజనము ఉన్న అర్థ జ్ఞానము కోసము వేదాధ్యయనమును చేయ వలెను . వేదములోని యేయే యాగముల ప్రకరణములను అధ్యయనము చేస్తాడో ఆయా యాగముల పూర్ణ ఫలమును పొందుతాడు . అగ్ని , వాయు , మరియు ఆదిత్యుల సాయుజ్యమును పొందుతాడు . ఆధునికులైన వేద విదులనూ , ప్రాచీనులైన వేద విదులనూ నిందించ కూడదు . అటుల నిందించువారు సూర్యాది దేవతలను నిందించినట్టే అవుతుంది . దీనికి ప్రమాణముగా , వేదములో , 


"  |  యావతీర్వై  దేవతాస్తాస్సర్వా  వేదవిది  బ్రాహ్మణేవసంతి  తస్మాద్బ్రాహ్మణేభ్యో  వేదవిద్భ్యో దివే దివే నమస్కుర్యాన్నాశ్లీలం కీర్తయేదేతా  ఏవ  దేవతాః  ప్రీణాతి  |  "



     అందరు దేవతలూ వేదవిదుడైన బ్రాహ్మణునిలో నివశిస్తారు . కాబట్టి వారికి ప్రతిదినమూ నమస్కరించవలెను . దోషారోపణలు చేయరాదు . దీని వలన అందరు దేవతలనూ సంప్రీతులను చేసినట్టే అవుతుంది . 

బ్రహ్మ యజ్ఞము అంటే ఏమిటి ? 

     బ్రహ్మ యజ్ఞము రెండు విధములు . నిత్య యజ్ఞము , కామ్య యజ్ఞము అని . నిత్య యజ్ఞములు కూడా రెండు విధములు. అధీత వేదపు , అనధీత వేదపు బ్రహ్మ యజ్ఞములు అని . ఇక , కామ్య యజ్ఞములు బహు విధములు . 

     మనము ఇక్కడ మాట్లాడుకునేది , నిత్య యజ్ఞము గురించి . అంటే , నిత్య కర్మ గురించి . ఉపనయనమైన వాడు స్వాధ్యాయాదులతో చేసేది అధీత బ్రహ్మ యజ్ఞము . ఉపనయనము కానివాడు చేసేది , అనధీత బ్రహ్మ యజ్ఞము . పురాణాలు , గాథలు  ( యజ్ఞ గాథలు , ఇంద్ర గాథలు మొ || ) 

వేదవిదుడు ( ఉపనయనము ) ఐన వాడు చేయు అధీత బ్రహ్మ యజ్ఞము

     వేదవిదుడు స్వాధ్యాయమును తప్పక చేయవలెను . బ్రహ్మ యజ్ఞములో భాగముగా దేవ , ఋషి , పితృ తర్పణములను ఇవ్వవలెను . వేదాధ్యయనము ఆరంభించనివాడు బ్రహ్మయజ్ఞమును తర్పణ రూపములో తప్పక ఆచరించవలెను . దీనికి ప్రమాణము , సారస్వత పాఠ క్రమములో చెప్పబడినది . ( సారస్వత పాఠమనగా , సరస్వతీ దేవి , తన కొడుకైన సారస్వతునికి బోధించిన వేదాధ్యయన క్రమము . దీని ప్రకారము , మంత్రములన్నీ ఒక చోట , బ్రాహ్మణ పాఠము ఒకచోట ఆరణ్యకములు ఇంకొక చోట , విడి విడిగా ప్రత్యేకముగా లభించును . ఆయా మంత్రముల ఛందస్సు , దేవతలు ఋషులూ మొదలగువాటిని తెలుసుకొనియే అధ్యయనము చేసి , యాగములనూ , అధ్యాపనమునూ చేయ వలెను . దీనితో పోలిస్తే , యజుస్సంహితలోని అనేక మంత్రాలు బ్రాహ్మణములోనూ , ఆరణ్యకము లోనూ , అటులనే బ్రాహ్మణములోని బ్రాహ్మణ మంత్రాలు సంహిత లోనూ , ఆరణ్యకము లోనూ --ఇలాగ కలగలిసి , మిశ్రితమై ఉంటాయి . దేనికదే విడిగా ఉండవు . చాలా మంత్రాలకు ఋషులు , దేవత , ఛందస్సు వంటివి అక్కడే లభించవు . ఇలాగ వీటిని తెలియకుండా అధ్యాపనము , యాగములు చేస్తే , ఆ కార్యములు సారములు లేక , నిష్ఫలములై  " యాతయామములు ’ అవుతాయి . కానీ , అనూచానముగా మంత్ర - బ్రాహ్మణముల మిశ్రణము ఉన్న సారస్వత పాఠమే పరంపరగా వస్తున్నది . అంతే కాక , బోధాయనులూ , ఆపస్తంబులూ వంటి సూత్రకారులు అంగీకరించినవి కాబట్టి , ఈ మిశ్రమ పాఠమును ఉల్లంఘించుటకు లేదు . దీనిలో ’ యాతయామమును ’ తప్పించుటకు బోధాయనులూ , ఆపస్తంబులూ కాండ విభాగమును చేసినారు . కాండ విభాగము తెలిసిన చాలు , యాతయామము లేనట్టే .   దీనిని కాండ పాఠము అంటారు.. పరంపరగా సారస్వత క్రమములో అధ్యయనము చేసినవారు కూడా , కాండ విభాగమును తెలుసుకొనుట తప్పనిసరి .  కాండ విభాగము తెలుసుకున్ననూ , ప్రచలితమై ఉన్న  పాఠము సారస్వత పాఠమే . దీని ప్రకారము, సంహితలో నలభై నాలుగు ప్రశ్నలూ , బ్రాహ్మణములో ఇరవై ఎనిమిది ప్రశ్నలు , ఆరణ్యకోపనిషత్తులో పది ప్రశ్నలూ--ఇలాగ మొత్తం ఎనభైరెండు ప్రశ్నలను ( ప్రపాఠకములను ) అధ్యయనము చేస్తారు  ) 

     మరి , బ్రహ్మ యజ్ఞములో చేయవలసినది అధ్యయనమైతే , తర్పణము ఎందుకు విధించ బడినది ?  అధ్యయనమునకూ , తర్పణమునకూ సంబంధమేమిటి ? 

     వేదమును ఆరంభించని వాడు , వేద స్థానములో ’ సావిత్రి  ’ ని గ్రహిస్తాడు . అంటే , సంధ్యావందనము చేసి సవితృ కిరణములను తనలో నింపుకొంటాడు . వేదారంభము చేసినవాడు స్వాధ్యాయము , తర్పణమూ  ఎలాగూ చేస్తాడు , కానీ వేదారంభము చేయని వాడు , స్వాధ్యాయముతో సమానమైన తర్పణమును చేయవలెను . తర్పణమే ఎందుకు ? యనిన , ఆ తర్పణములో దేవతలకూ , కాండ ఋషులకు , పితృ దేవతలకు తృప్తిని , ప్రీతిని కలిగించే ’ స్వధా ’ అన్న ద్రవ్యము వారికి అందును . కాండఋషులు ఈ తర్పణమును గ్రహించి , సంప్రీతులై , వేదాధ్యయనము చేసిన ఫలమునే ఇస్తారు . కాండ ఋషులనిన వేరెవరో కాదు , వేదము లోని కాండములను , వాటిలోని మంత్రాలను కనుగొని , మంత్రద్రష్ట లై మానవులకు అందించినవారు . 

కాండ విభాగము 

తైత్తిరీయ ( కృష్ణ యజుర్వేద ) శాఖలో తొమ్మిది కాండములున్నాయి . అవి , 

     ౧. ప్రాజాపత్య కాండ , ౨ . సౌమ్య కాండ , ౩ . ఆగ్నేయ కాండ , ౪. వైశ్వ దేవ కాండ , ౫ . స్వాయంభువ కాండ , ౬. అరుణ కాండ , ౭. సాంహిత్య దేవతా ఉపనిషత్ కాండ , ౮. వారుణ్య దేవతా ఉపనిషత్ కాండ , ౯ . యాజ్ఞిక్య దేవతా ఉపనిషత్ కాండ . 

      ’ హిరణ్య కేశీయ ’ సూత్రానుసారముగా , వేదము ఈ రీతిలో తొమ్మిది కాండములుగా విభజించబడినది . ప్రజాపతి మొదలగు ఋషుల వలన దర్శించబడిన మంత్రములతో కూడుకొన్నవి కావున , ఆయా ఋషుల పేర్లే ఆయా కాండములకు వచ్చినవి . కాండమనగా ’ విభాగము ’ అని అర్థము . అయితే , బోధాయనులు , ఆప స్తంబులూ మరియూ ఇతరుల అనుసారముగా , ఈ కాండములను ఒకదానిలో ఒకదానిని కలిపి , నాలుగు , ఐదు , ఆరు కాండములుగా కూడా విభజింపబడినవి . ఏదేమైనా , కాండ ఋషులు తొమ్మిది మంది . కాండానుక్రమణముగా , కాండ ఋషుల గురించి ఇలాగ తెలుపబడినది 

అథ కాండ ఋషీన్ ఏతాన్ ఉదకాంజలిభిః శుచిః |
అవ్యగ్రస్తర్పయేన్నిత్యం అన్నైః పర్వాష్టమీషు చ || 

కాండోపాకరణేష్వేతాన్ పురస్తాత్ సదసస్పతేః |
జుహుయాత్ కాండ సమాప్తౌ చ శృతిరేషా సనాతనీ || 

     " ఈ కాండ ఋషులకు నిత్యమూ జలతర్పణమును ఇవ్వవలెను . పర్వకాలమునందూ , అష్టమియందూ  ఈ ఋషుల కోసము బ్రాహ్మణ భోజనము చేయించవలెను . కాండోపాకరణలో ( ఉపాకర్మ ) సదసస్పతి హోమమునకు ముందు ఈ ఋషులనుద్దేశించి హోమమును చేయవలెను . కాండ సమాప్తిలో కూడా అటులే హోమమును చేయ వలెను . ఇది సనాతన శృతి . 


బ్రహ్మ యజ్ఞమును చేయువాడికి నియమములు :

     బ్రహ్మ యజ్ఞమునకు ముందు ఔపాసన , బ్రహ్మ యజ్ఞానికి తరువాత వైశ్వదేవమూ ( అతిథి పూజ ) విధించబడినవి . బ్రహ్మ యజ్ఞము ప్రాతః కాలములో గాని , మధ్యాహ్నమున కానీ చేయవచ్చు . ప్రాతఃకాలములో అయితే , ప్రాతరౌపాసన ముగించుకొని చేయాలి .  మధ్యాహ్నమైతే , వైశ్వదేవము , సావిత్రీ జపములు  అయ్యాక , చేయాలి. ఆచమనము చేసి ,  ( సంకల్పము చేసి యే కర్మ చేసినా , ( శుభాశుభ కర్మలేవైనా )  ఆచమనము రెండు సార్లు తప్పక చేసియే తీరవలెను . " ద్విరాచమ్య ’ అనునది శాస్త్రము . ఒకసారి మాత్రమే ఆచమనము చేయునది , భోజనానికి ముందూ ,  మూత్ర విసర్జనాదుల తర్వాత మాత్రమే . )   స్వాధ్యాయము చేసి , నాలుగు వేదములలోని ఒకొక్క ప్రశ్నను గానీ , ఒక్కొక్క అనువాకమును గానీ , ఒక్కొక్క పనసను గానీ , చివరకు ఒక్కొక్క మంత్రమును గానీ యథా శక్తి అధ్యయనము చేయవలెను . ఇవేవి వీలు కాని వారు ప్రణవము , వ్యాహృతులతో పాటు గాయత్రీ మంత్రాన్ని యథా శక్తి జపించవలెను . 

     తరువాత , దేవ , ఋషి , పితృ తర్పణములు చేయాలి . 

     దేవ తర్పణమును తూర్పుకు అభిముఖముగా కూర్చొని , ఉపవీతుడై ( యజ్ఞోపవీతాన్ని  సవ్యముగా వేసుకొని  )  దేవ తీర్థములో తర్పణము ఇవ్వాలి . దేవ ( దైవ ) తీర్థమనగా , అరచేతిలో నీళ్ళు పోసుకొని , ఆ నీటిని వేళ్ళ చివరి భాగములనుండీ కిందికి వదలుట . 

     ఋషి తర్పణమును ఉత్తర దిశకు అభిముఖముగా కూర్చొని , నివీతుడై ( యజ్ఞోపవీతమును మాలగా వేసుకొని , యజ్ఞోపవీతాన్ని కుడి చేతి బొటన వేలికి తగిలించుకొని )  ఋషితీర్థములో ఇవ్వవలెను ( అర చేతిలోని నీటిని చిటికెన వేలు మొదటి భాగమునుండీ వదలుట ) .

     పితృదేవతలకు , దక్షిణమునకు అభిముఖుడై కూర్చొని , ప్రాచీనావీతుడై ( యజ్ఞోపవీతాన్ని అపసవ్యముగా వేసుకొని ) పితృ తీర్థములో ( అరచేతిలోని నీటిని , బొటన వేలు , చూపుడు వేళ్ళ మధ్యలోనుండీ ) వదలవలెను . 

తండ్రి జీవించి ఉన్నవాడు పితృ తర్పణమును చేయరాదు . 

     అభోజ్యములు తినరాదు . అభోజ్యములనగా , ఉల్లిపాయలు , వెల్లుల్లి పాయలు , ముల్లంగి , సొరకాయ , గోంగూర మొదలగు జాతి దుష్టములు , ( వీటిని క్రమము తప్పక తినువారికి సాత్త్విక గుణము పోయి ,  తమోగుణము పెరుగును . అప్పుడు ఈ కర్మములవలన ప్రయోజనము ఉండదు . వాటిని ముట్టుకున్నంత మాత్రముననో , ఏదో ఒకటి రెండు సార్లు తిన్నంత మాత్రముననో పాపము రాదు . కానీ , ఏది ఎలా తినవలెనన్న విషయము , ఏది ఎంత తింటే ఎంత హాని కలుగును అన్నదానికి మన దగ్గర కొలమానములు లేవు. మన ప్రాచీన ఋషులు తమ తపో బలముచేత వీటిని గ్రహించి చెప్పియున్నారు కాబట్టి వాటిని అనుసరించుటయే ఉత్తమము ) 

     తరువాత , ఋతుస్నానము నాడు స్త్రీ తాకిన  భోజనము , పంచ సంస్కారములు లేనివాడు వండినది , ఇతరులు నోటితో ఊదినది , ఇతరులు చేతితో కలియబెట్టినది , వడగట్టని నీళ్ళు , పునః పాకమైన అన్నము ( రెండవసారి వేడి చేసిన అన్నము ) విక్రయించిన అన్నము , మజ్జిగ తప్ప మిగతా సారము తీసిన పదార్థము ( మీగడ తీసిన పాలు మొ|| నవి ) భోజన మధ్యమందు వడ్డించిన నెయ్యి , మొదలైనవి క్రియా దుష్టములు . ఇటులే , కాల దుష్టములైనవి---ఇవన్నియూ అభోజ్యములే .

 ( బ్రహ్మ యజ్ఞపు విధానము తరువాతి భాగములో )


Saturday, August 25, 2012

" మంత్ర ద్రష్ట " ఉప సంహారము




" సూర్య ఆత్మా జగతస్తస్థుషశ్చ "   ...


" ఆరోగ్యం భాస్కరాదిఛ్చేత్ "  అన్నారు .

       సూర్యుడు సమస్తకోటి చరాచర జీవుల , విశ్వపు అంతరాత్మ. అతని వలననే అన్ని లోకములూ బ్రతుకుతున్నాయి . అంధకారమును , రాక్షసులనూ , దుఃఖమును , అలసత్వమునూ , రోగములనూ నశింపజేయువాడు సూర్యుడు . మన ఆయుష్షును పెంచువాడు సూర్యుడు .  వేదాలన్నీ సూర్యుడి గొప్పదనాన్ని ఘోషిస్తున్నాయి . సూర్యుడు మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం . 

అటువంటి సూర్యుడిని ఆరాధించి ,ప్రయోజనము పొందుట మనకు శ్రేయోదాయకము . 

యేన సూర్య జ్యోతిషా బాధసే తమో
జగచ్చ విశ్వముదియర్షి భానునా
తేనాస్మద్విశామని రామనాహుతిం
ఆపామీవామప దుష్ష్వప్న్యంసువ 

        ఓ సూర్యుడా ! యే తేజస్సుతో నువ్వు జగత్తును మేలుకొలుపుతూ , అంధకారమును నివారిస్తున్నావో , ఆ తేజస్సు చేతనే , అన్నాభావమును , కర్మ వైముఖ్యమును, రోగజాతులను , చెడ్డకలల వల్ల అగు అనిష్టములను దూరము చేయి 

       పుట్టిన ప్రతివాడూ ఏదో ఒక విధముగా సూర్యుడిని ఆరాధించవలెను . ఉపనయనమైనవాడు దీనిని మంత్ర పూర్వకముగా చేసిన , ఎక్కువ ప్రయోజనము . నానాటికీ దూరమవుతున్న మన సంస్కృతీ సాంప్రదాయాలతో పాటూ మన శ్రేయస్సును కూడా దూరము చేసుకుంటున్నాము . మానవునికి కావలసినవన్నీ ఆ భగవంతుడు ప్రకృతిలోనూ , మన దేహములోకూడా , విరివిగా ఇచ్చాడు . అది తెలుసుకొని , ఈ సూర్యారాధనను చేసిననాడు మానవునికి సౌభాగ్యము తప్పక కలుగుననుటలో యే సందేహమూ లేదు . సంధ్యావందనము కొందరు చేస్తున్నా , అనేకులు మానేస్తున్నారు . మరికొందరికి ఇది తెలియనే తెలియదు . ఈ పుస్తకాన్ని చదివి యేకొందరైనా లాభము పొందితే నా ప్రయత్నము సార్థకమైనట్లే ! సూర్యారాధన చేయువారికీ  , చేయని వారికీ బుద్ధి కుశలతలో ఉన్న తేడాలు మనకందరికీ స్పష్టముగా కనిపిస్తున్నాయి . భారతీయులలో చాలామంది ప్రపంచమంతటా రాణించుటకు ఇది కూడా ఒక కారణము . ముఖ్యముగా విదేశాలలో నున్నవారు ఈ తరమువారు మన సంప్రదాయాలను పాటిస్తూ ప్రయోజనము పొందుతున్నా , ఇదే ప్రయోజనము భావి తరాల వారు కూడా పొందవలెనంటే ఈ సూర్యోపాసన ఒకరి నుంచీ ఒకరికి రావలెను . 

       మన పురాణాలలోను , ఇతర శాస్త్రాలలోనూ ఈ విషయపు గొప్పదనాన్ని అందరికీ అర్థము కావలెనన్న ఉద్దేశముతో కొన్ని కథలుగా చెప్పడము మనము చదువుకున్నాము . ఈ నాటి విజ్ఞానమునకు అవి అందకపోవడముతో వాటిని కట్టుకథలుగానో , మూఢనమ్మకాలుగానో భావించి నిరాదరణ చేస్తున్నాము . మన పురాణాలలోని ప్రతి వాక్యము వెనుకా నిగూఢమైన ఇంకొక అర్థము ఉండుట చాలామందికి తెలిసినా , అది తెలియని వారి సంఖ్య కూడా ఎక్కువే . శ్రీ దేవుడు నరసింహశాస్త్రి గారు అటువంటి అపోహలను పోగొట్టడానికి తమ ధ్యాన , అతీత , జప తపో శక్తులను ఉపయోగించి కనుక్కున్న విషయాలను ఎంతో సరళముగా వివరించారు . 

ఈ పుస్తకమును అందరూ వీలైనంత మందికి అందుబాటులోకి తేవలెనని నా హృదయపూర్వక ప్రార్థన. 

Monday, August 20, 2012

70. " మంత్ర ద్రష్ట " డెబ్భైయవ ( చివరి ) తరంగం .



డెబ్భైయవ ( చివరి )  తరంగం .

     భగవాన్ యాజ్ఞవల్క్యుల ఆహ్వానము మేరకు మందాకినీ అలకనందా నదుల సంగమములో భగవాన్ నచికేతుల ఆశ్రమములో బ్రహ్మర్షి పరిషత్తు భగవాన్ పిప్పలాదుల  అధ్యక్షతలో సమావేశమైనది . భగవతీ గార్గి, అతిథి పూజకు నియుక్తులైనారు . ఒక విశేషమేమనిన , " సరస్వతీ నదీ తీరములో యాగము చేస్తున్న ఋషి గణమొకటి అనార్య ఋషి గణమునొక దానిని చూచినది . ఈ అనార్య గణములో పన్నెండుగురున్నారు . వారికి క్రమాధ్యయనము కాలేదు . అయినా వారంతా బ్రహ్మజ్ఞులు . వారు పిలచిన చోటికి దేవతలు వస్తారు . వారు దేవ భాషలోనైనా,   ప్రాకృత భాషలోనైనా మంత్రములను రచించగల మంత్రకృత్తులు . వారి విషయములో ఆర్యర్షులు ఎలాగు వ్యవహరించవలెను అన్నది పరిషత్తు ధృవీకరించి చూపవలెను " అని ఒక మనవి వచ్చినది . ఆ అనార్య గణము కూడా వచ్చింది . వారితో పాటు చంద్ర వంశజుడైన యయాతి , సూర్యవంశపు జనకుడు వీరిద్దరూ సభకు విశేషాహ్వానము పై వచ్చినారు .

      మొదటి రోజు హోమ , హవనములను చేసి , దేవర్షి పితృ గణములను అర్చించి , సభా కార్యములను ఆరంభించినారు . భగవాన్ పిప్పలాదుల సమక్షములో భగవాన్ వశిష్ఠులు వారి కుడివైపు ఆసనములో విరాజమానులైనారు . ఎడమ వైపు భగవాన్ విశ్వామిత్రులు. సభా కార్యకలాపములు ఆరంభమయినవి . 

     భగవాన్ యాజ్ఞవల్క్యులు లేచి అన్నారు , " ఈ దినము పరిషత్తు చేరిన కారణము , భగవాన్ విశ్వామిత్రుల అభినందనకు . వెనుక , పరిషత్తు చేరినపుడు , భగవతీ గార్గి , ’ ఆర్యీకరణమునకు ఒక సులభ సాధనమును కల్పించవలెనని భగవాన్ విశ్వామిత్రులను ప్రార్థించినారు . ఈ దినపు అధ్యక్షులతో పాటు అనేకమంది ఆ ప్రార్థనలో భాగము వహించినారు . వీరే తపస్సా , తపస్సే వీరా అన్నట్లు తపస్సును చేసిన ఈ పుణ్యపురుషుడు దానిని సాధించినాడు . నిదర్శనము లేనిదే మేము అంగీకరించుట లేదు . కాబట్టి నిదర్శనము కూడా అయినది . సరస్వతీ తీరపు ఋషులు ఇక్కడికి పంపించి యున్న ఈ ఋషిగణము , వెనుకటి కాలములో అనార్యులు . వారు విశ్వామిత్రుల అనుగ్రహము పొంది మంత్ర కృత్తులగు మంత్ర పతులైనారు . వారిని పిలుచుకొని వచ్చిన ప్రతినిధులు ఈ సభ ముందుకు వచ్చి , అక్కడ జరిగినది చెప్పెదరు . దానికి అనుమతి కావలెను " 

     సభ అనుమతి పొంది పిప్పలాదులు ప్రతినిధిని పిలచినారు .  అతడు వచ్చి , సభకు నమస్కారము చేసి , " గొప్ప వారికి నమస్కారము . అర్భకులకు నమస్కారము . తరుణులకు నమస్కారము , వృద్ధులకు నమస్కారము , బ్రహ్మకు నమస్కారము , బ్రహ్మజ్ఞులకు నమస్కారము , నేను సత్యమునే చెప్పెదను . నేను చెప్పు సత్యము నన్ను కాపాడనీ . నేను చెప్పు సత్యము దానిని విన్నవారినందరినీ కాపాడనీ . నేను ఋతమును చెప్పెదను . ఆ ఋతము , చెప్పిన నన్నూ , విన్న ఇతరులనూ కాపాడనీ . నానోటిలో అసత్యము , అనృతము వచ్చినచో నా తల పగిలి నూరు ముక్కలవనీ " యని ప్రతిజ్ఞ చేసి , సభ అనుమతి పొంది పలికినాడు , 

     " మేము అనగా , సరస్వతీ తీరములోనున్న ఋషులందరూ చేరి విశ్వ శాంతికై ఒక యజ్ఞమును చేయుచుంటిమి . మూడవ దినము మధ్యాహ్నము హోమము జరుగవలసినపుడు , ఒక గుంపు అక్కడికి వచ్చి , ’ మేము కూడా యజ్ఞములో భాగము వహించెదము. అనుమతి కావలెను ’ యని ప్రార్థించినారు . ఆ గణపు ముఖ్యుడుగా నున్నవాడు కవష ఐలూషుడను మహనీయుడు . వారిని గురించి విచారించగా , వారిలో అనేకులు శూద్రీ పుత్రులు : అద్విజులు , అనార్యులు , క్రమాధ్యయనము చేయని వారు అని తెలిసి వచ్చి , వారిని యజ్ఞ భాగాధికారులుగా మేము అంగీకరించలేదు . వారంతా తమకు నిరాశ కలిగిననూ మారు మాట్లాడక వెళ్ళి పోయినారు . వారి వినయమునూ , సౌజన్యమునూ చూచిన ఋషులు , ’ యేమి చేయుట ? విధాయకముగా అవకాశము లేదు ’ అని ఎంతో బాధ పడినారు " 

     " మాధ్యందిన హోమము ఆరంభమయినది . ఎంత పిలచిననూ ఏ దేవతలూ రాలేదు . ఇదేమిటీ ఆశ్చర్యము అని దేవపతి యైన ఇంద్రుని పిలచితిమి . అతడు అర్ధార్ధముగా ప్రకటమై , ’ మీరు పంపించి వేసిన ఋషులు పొందిన నిరాశ తీరువరకూ దేవతలు ఇక్కడికి రారు . మేమంతా వారివైపున యున్నాము ’ అని , మేము ఇచ్చిన హవిస్సును కూడా స్వీకరించక అంతర్ధానమైనాడు . "

     " ఆ పిమ్మట మా ఋషులంతా వెళ్ళి , కవష ఐలూష గణమును ప్రార్థించి , తాము ప్రారంభించిన యజ్ఞమును వారి యనుమతితో యథావిధిగా ముగించి , వారిని ఇక్కడికి నావెంట పంపించినారు . ఇక ముందు యేమి కావలెనన్నది పరిషత్తు నిర్ణయించవలెను . "

     భగవానులొకరు లేచి , ’ సభాపతులకు విజ్ఞాపన . అనార్య ఋషిగణపు విషయము సభ ముందరికి ఇప్పుడే వచ్చినది , వారి విషయమున యేమి చేయవలెనని ఇంకా నిర్ధారింపబడలేదు , కానీ అప్పుడే , అతిథి సత్కారమునకై నియుక్తులైన వారు ,  వారికి మధుపర్కమును ఇచ్చివేసినారు . ఇది క్రియా లోపమా కాదా యని విమర్శ చేయవలసినది . " అన్నారు. 

     సభాపతులు , అతిథి సత్కారమునకు నియమింపబడిన భగవతీ గార్గి ముఖమును చూచినారు . ఆమె లేచి , సభాపతులకూ , సభకూ వందనము చేసి , ప్రసన్న ముఖముతో , మందహాసమును చిందిస్తూ , వినయముగా అన్నారు , " భగవానులొకరు క్రియాలోపమును ప్రస్తావించినారు . అతిథులు వచ్చినపుడు వారి వారి యోగ్యతకు అనుగుణముగా సత్కారము చేయుట నా కార్యము . నాకు ఇచ్చిన కార్యములో , నా సామర్థ్యమునకు అనుగుణముగా , ప్రతియొక్కదానినీ గమనించి కార్యము చేసినదానను . ఆ మహర్షులు వస్తున్నపుడే వారితో పాటు వస్తున్న పంచాగ్నులనూ చూచినాను . వారిని ఆర్యులని పరిషత్తు అంగీకరించలేదు , నిజము. అయితే , పంచాగ్ని సమేతులుగా వచ్చినవారికి మధుపర్కమును ఇవ్వకున్న , యజ్ఞేశ్వరునికి ద్రోహము జరిగి , సభకూ , సభాపతులకూ ప్రత్యవాయము ఉండునని బెదరి , ఆ అగ్నివంతులకు నేను మధుపర్కమును ఇచ్చినాను . ఇది అపరాధము కాదనునది తామెల్లరకూ తెలుసు . అయినా, సభా మర్యాదయని ఇదిగో , చేతులు జోడిస్తున్నాను , అపరాధమైనచో క్షమించవలెను . మనము బ్రహ్మవాదులము . కర్మలో ప్రమాద వశమున న్యూనాతిరిక్తములు వచ్చిననూ , దానిని సహించుకొనువారము . అటులనే , ఈ పరిషత్తు కూడా కర్మ దోషముండినచో సహించుకొనవలెనని ప్రార్థన " 

     ధర్మజ్ఞులందరూ ఆమె చేసినది సరియైనదే యన్నారు . " పరిషత్తులలో అన్ని కార్యములకన్నా ప్రధానమైనది అతిథి సత్కారము . దానిలో ఎక్కువ తక్కువలయినచో పరిషత్తు బాధ్యత వహించి అశ్రేయస్సును పొందవలెను . కాబట్టి , అగ్నివంతులకు మధుపర్కము , వారు ఎవరైననూ సరే , సమర్పించవలసినదే అయినందువలన , ఆమె చేసినది సరియైనదే " యన్నారు . 

     ఇంకొకరు లేచి నవ్వుతూ సభాపతికి తెలిపినారు  , " భగవతి గార్గి చేసినది సరియని అంగీకరించిన సభ , వారిని ఆర్యులు , బ్రాహ్మణులు అని కూడా ఒప్పుకున్నట్లే అయినది . దానితో పాటూ భగవాన్ విశ్వామిత్రులు కల్పించి ఇచ్చి మహదనుగ్రహము చేసిన ప్రాజాపత్య వ్రతము యొక్క మహిమను తెలుసుకోవడమూ అయినది . ఇక , సభ ముందున్న కార్యము , భగవాన్ విశ్వామిత్రులు మనుష్య కులమునకు చేసిన పరమోపకారమునకు వారిని అర్చించుట . ఆ అర్చన యే రూపముగా జరగవలెను అనునది నిర్ణయించవలెను , అంతే ! " అన్నారు . 

     అందరూ ’ ఔను , ఔను ’ అని ఆనందముతో కరతాళ ధ్వనులు చేసినారు . భగవతీ గార్గి లేచి నిలచి , " ఒక పుష్పమంటపమును కట్టి, దానిలో భగవాన్ విశ్వామిత్రులను కూర్చోబెట్టి , మనమందరమూ ఆ రథమును లాగుకొని వెళ్ళవలెను . ఇది మనము వారికి చేయవలసిన అర్చన కావాలి . " అన్నారు . 

     మహారాజైన యయాతి , మహారాజు జనకుడి అనుమతి పొంది , లేచి నిలచి , " సూర్య వంశ భూషణుడైన జనక మహారాజు ఈ పరిషత్తుకు విజ్ఞాపించమని నాకు అనుజ్ఞ నిచ్చినారు . ఈ బ్రహ్మ పూజకు క్షత్ర సమాయోగము విహితమైనందు వలన , పుష్ప రథమును కట్టుట తమ కార్యమవనీ , దానిని లాగుకొని పోవుట మా భాగమవనీ. దీనికి పరిషత్తు ఒప్పుకొని అనుమతి నివ్వవలెను . " 

     భగవాన్ పిప్పలాదులు లేచి , ఆ సూచనను అంగీకరించ వలెనని పరిషత్తును ప్రార్థిస్తూ , " ఈ సభాపరముగా ఆ కార్యములో భాగము వహించుటకు సభాపతులకు కూడా అవకాశము ఉండవలెను " అన్నారు . 

     భగవతీ గార్గి లేచి నిలుచుకొని , ముసి ముసిగా నవ్వుతూ , " సభాపతులు  దాక్షిణ్యమును చూపి మావైపు తిరగవలెను . ఈ సూచనను తెచ్చినవారు కార్యములో భాగస్వాములు కాకపోతే అది పూర్ణమెలాగవుతుంది ? "  అన్నారు . 

     అందరూ సరేనని సమ్మతించినారు . రథమును లాగువారు నలుగురు యని నిర్ణయించినారు . సభాపతులు లేచి , " భగవాన్ విశ్వామిత్రులు దీనిని అంగీకరించవలెను " అని చేతులు జోడించినారు . భగవానులు లేచి నిలచినారు . భవ్యమైన ఆ పురుషాకృతిని చూచినవారందరూ , " ఇది లోకానుగ్రహార్థము మూర్తిగా మారిన వేదములే అయిఉండాలి " అని మనసా అభివాదనము చేసినారు . వారన్నారు , " ఈ దినపు యశస్సంతయూ భగవాన్ వశిష్ఠులది . ద్వేషముఖముగా వారిని ఆరాధించుటకు వెళ్ళిన నేను ఇప్పుడు రాగపూర్వకముగా  పరమ ప్రీతితో ఈ మాట చెప్పుచున్నాను . ఈ పరిషత్తు పరముగా భగవతీ గార్గి మొదలైన వారు సర్వులూ నాకు ఇచ్చిన పనిని నిర్వహించుటకు కూడా వీరే కారణము . అగస్త్యాశ్రమమునకు వెళ్ళమని వీరు సలహా ఇచ్చి మార్గ దర్శకులైనారు . అదేవిధముగా , అన్నిటికన్నా ముందు భగవాన్ వామదేవుల ద్వారా అనుగ్రహించినవారు కూడా వీరే ! కాబట్టి వీరికి ఈ పూజ సమగ్రముగా జరగవలెను " అన్నారు . 

చివరికి భగవంతులిద్దరూ పుష్పరథములో కూర్చోవలెనని నిర్ణయమైనది . 

     మారుదినము పుష్ప రథము సిద్ధమైనది . రథపు అలంకారమునకు పూలుతెచ్చుటకు వెళ్ళినవారు వచ్చి , తమ ఆశ్చర్యమును చెప్పలేకపోతున్నారు . ఆశ్రమపు చుట్టుపక్కల ఉన్న వృక్ష లతలన్నీ కేవలము పూలగుత్తులై ఉన్నాయి . కాలము , అకాలము యను నియమమే లేకుండాపోయి , అన్ని ఋతువుల , అన్ని పుష్పములూ పూసినాయి . ఇప్పుడు అలంకారమునకు పూలు వచ్చినవి బుట్టలలో కాదు , బళ్ళలో ! అందరూ వెళ్ళి ఆ వనలక్ష్మి పుష్పాలంకారమును చూచి వచ్చినారు . ఎక్కడ చూసినా పూలే పూలు . చెట్లలో , మొక్కలలో , పొదలలో , తీగలలో ఎక్కడ చూసినా ఒక్క ఆకు కూడా కనపడదు . ఆ పూల సాగరములో ఆకులన్నీ ఏదో ప్రభావమునకు లోనై పూలైపోయినట్లుంది . 

     పుష్పరథమును తపస్వులు ’ బ్రహ్మ రథము ’ అని పిలచినారు . వశిష్ఠ విశ్వామిత్రులను కూర్చోబెట్టుకొని ఆ రథము వస్తున్నది చూచినవారు " రెండు పక్షులు ఒకే చెట్టుపై కూర్చున్నట్లున్నవి " అన్న శృతిని స్మరించినారు . 

     యయాతి ధర్మిష్ఠుడు , జనకుడు బ్రహ్మిష్ఠుడు . వీరిద్దరూ రథమును లాగుతున్నది చూడగా , బ్రహ్మాండపు క్షేమము ధర్మ బ్రహ్మ సమాయోగమునందున్నది " అను వేద పురుషుని సందేశమును పాడుతున్నట్లుంది . 

ఆ ఊరేగింపును చూచి , మానవులే కాదు , విశ్వానికి విశ్వమే సంతోష పడినది . 

     వశిష్ఠులు సమాధిలోనున్న విశ్వామిత్రులను హెచ్చరించి , ’ అక్కడ చూడండి ’ అన్నారు . దేవ గణ సహితుడైన దేవేంద్రుడు పరమ సంతోషముతో , పరమ భక్తితో చేతులు జోడించి నిలుచుండుట కనిపించినది . 

వశిష్ఠులు నవ్వినారు : విశ్వామిత్రులూ నవ్వినారు. 

                                                                                                      *************************************************************************************************************************************************

     ఇంతవరకూ ఈ మంత్ర ద్రష్ట కాదంబరిని ప్రోత్సహిస్తూ ఆద్యంతమూ విడువకుండా చదివిన మిత్రులకు , పాఠకులకూ సహృదయులకూ అనేకానేక ధన్యవాదాలు . మీరిచ్చిన ప్రోత్సాహము వెలలేనిది . విశ్వామిత్రుని ఆధ్యాత్మిక ప్రయాణము , గాయత్రీ మంత్రావిర్భావము పై మీరందరూ చూపిన ఆసక్తి , నాకెంతో ఉత్తేజాన్నిచ్చింది . ఇందులో నాపాత్ర చాలా పరిమితమైనది . ఏదో నాకు తోచిన విధముగా , నాకు వచ్చిన భాషలో రాశాను . శ్రీ దేవుడు నరసింహ శాస్త్రి గారిని మీ అందరికీ పరిచయము చేయడము నేను చేసుకున్న భాగ్యము . నాకు దానికి మించిన లబ్ధి ఇంకేమీ లేదు . 

                                                  ||  శుభం భూయాత్  |   
                                          |  సమస్త సన్మంగళాని భవంతు|| 



69. " మంత్ర ద్రష్ట " అరవై తొమ్మిదవ తరంగం .



అరవై తొమ్మిదవ తరంగం .

     భగవాన్ వశిష్ఠులు సుదీర్ఘ కాలమయిన తరువాత సమాధి నుండీ లేచినారు . ఏదో ఒక ఘడియ సేపు ప్రబలమైన యోచనలో ఉన్నవారు , దావిని వదలి , లేచి బట్టలను విదిలించుకొని పైకి లేచువారి వలె , నవ్వు ముఖముతో సమాధిని వదలి లేచి, విశ్వామిత్రుల ఆశ్రమమునకు వచ్చినారు . 
     అక్కడ విశ్వామిత్రులు కూర్చున్న స్థితిని చూసి వారికి బహు సంతోషమయినది . " బ్రహ్మర్షి యంటే ఇతడే కదా ! ఇంతటి భాగ్యము ఎవరికి కలుగును ! ఇతడు ఇటుల బ్రహ్మర్షి యగుటను చూచు భాగ్యము నా పాలికి వచ్చింది కదా ! భలే , భలే " అని ఆనందాతిశయమును అనుభవిస్తూ వామదేవుని జ్ఞాపకము చేసుకున్నారు.

     వామదేవుడు వచ్చుట కొంచము ఆలస్యమైనది . వామదేవులను నిరీక్షిస్తూ వశిష్ఠులు వేదాధ్యయనము చేస్తూ కూర్చున్నారు . వారు వేద మంత్రములను పలుకుతుంటే ఆయా అక్షరాలు ఒక్కొక్కటిగా బయటికొస్తుండగనే నీటిలో విసరిన రాళ్ళ వలె శబ్ద తరంగాలను మేల్కొలిపి ఆ తరంగాలను పట్టి తెచ్చి వాటినన్నిటినీ కలగలిపివేసి మూర్తిని అచ్చుపోసినట్లే అయి ,    దేవతలంతా అక్కడ ప్రసన్నులై కనిపిస్తున్నారు . ఆశ్రమ భూమియంతా దేవభూమి యైపోయినది . 

     దేవతలు వచ్చినారు . దేవగురువు కూడా వచ్చినాడు . బృహస్పతియైన అతని కోరిక మేరకు సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మ  కూడా వచ్చినాడు . వశిష్ఠులు వారికందరికీ యథోచితముగా అర్చనలను చేసినారు . ఆ వేళకు వామదేవులు కూడా వచ్చినారు . 

     గురువుగారు శిష్యుని పిలచి , " వామదేవా , ఈ భాగ్యమును చూడు " అని విశ్వామిత్రులను చూపినారు . ద్యావా పృథ్వులూ , రుద్రుడూ కాపలాఉండగా , విశ్వామిత్రుల రూపములో సోమమండలమే కూర్చున్నది . అగ్నివలె ఉజ్జ్వలముగా  ప్రజ్వలిస్తున్ననూ , హిమము కన్నా శీతలమై యున్న ఆ సోమరాశిని చూసి వామదేవునికి ఆనందాశ్రువులు వచ్చినాయి . భగవాన్ వశిష్ఠులు , " వామదేవా , ఈ తపోరాశిని చూచితివా , అన్నము , తనలోనున్న అగ్నికి ఆహారమై జీర్ణమై పర్యూషితము అగును . దానిని నిరోధించ గలవాడు, అన్నములో నున్న అగ్నిని కూడా శమింపజేయ గలడు . సర్వ లోకములనూ , సమస్త బ్రహ్మాండములనూ ఒక్క ఘడియ లోపలే సృష్టించి , సంహారము చేసి , మరలా సృష్టించగలడు . ఇటువంటివానికి పంచభూతములన్నీ వశవర్తులై యుంటాయి . ఇంతటివానిని దేవతలు కూడా పూజిస్తారు . ఇతడు బ్రహ్మర్షి . ఇదిగో , దేవతలందరూ అనుగ్రహించి వచ్చినారు . చతుర్ముఖుడితో పాటు మేమంతా నీకోసమే వేచియున్నాము . రుద్రుడిని ఆరాధించి , ప్రసన్నుడిని చేసుకొని , విశ్వామిత్రుని సమాధిని ముక్తాయింపజేసి , అతనిని బహిర్ముఖుడిని చేయి . నువ్వు అతనికి మిత్రుడవు . రుద్రుడి పరమభక్తుడైన నువ్వే ఆ పని చేయవలెను . " అని ఆజ్ఞాపించినారు . వామదేవులు అటులే చేసినారు . 

     భగవానులు బహిర్ముఖులై కనులు తెరుస్తున్నట్టే దేవతలందరూ వారి కనులకెదురుగా ఒక చిన్న తుషార మేఘమును కల్పించి పెట్టినారు . అది ఆ కన్నుల చూపుల యొక్క తీవ్రతకు కరగి చిన్న వర్షమై వారిపైన కురిసింది . దేవతలు పూల వర్షము కురిపించినారు . ఆ చిన్న వర్షము , ఈ పూల వర్షముల వలన భగవానులు ప్రకృతస్థులు కాగానే చతుర్ముఖుడు దర్శనమిచ్చి , " విశ్వామిత్రా , నువ్వు బ్రహ్మర్షివని నీ దర్శనము కోసము మేమందరమూ వచ్చియున్నాము . బ్రహ్మర్షులైన వశిష్ఠ వామదేవులను పిలచుకొని వచ్చినాము . మా కానుకలను స్వీకరించి మమ్ములను అనుగ్రహించు " అన్నాడు . 

     భగవానులు అందరినీ దర్శించి అందరికీ నమస్కారములతో అర్చన సమర్పించాడు . వశిష్ఠులు ముందుకు వచ్చి దేవతలను సంబోధించినారు . " జగద్రక్షణకు నియామకులైన ఓ దేవాధిదేవతలారా , తామందరూ నాకిచ్చిన అధికారము తో తమందరి యెదురుగా ఈ దినము ప్రకటిస్తున్నాను . ఈ దినము నుండీ విశ్వామిత్రులు బ్రహ్మర్షులు . బ్రహ్మర్షి పరిషత్తు నచికేతాశ్రమములో చేరినపుడు , ’ ఇతడు బ్రహ్మర్షియైనాడు , అయినా వశిష్ఠ ముఖముగా పరీక్షయైన తర్వాత దీనినందరూ ఒప్పుకొనవలెను ’ అని నిర్ణయించినారు . బ్రహ్మర్షికి ఉండవలసిన గుణములన్నిటిలోనూ మొదటిది , అగ్నీషోమ మండలము వరకూ అధికారము .  అగ్నిని సోమముగనూ , సోమమును యగ్నిగనూ చేయగల మహనీయుడే బ్రహ్మర్షి . దేవతలైన తాము వచ్చి , తమకు కావలసినదానిని తమకు కావలసినపుడు అడిగిన ఇవ్వగలవాడు బ్రహ్మర్షి . ఋషులూ , పితృదేవతలూ వచ్చి అడిగినదానిని ఇవ్వగలవాడు బ్రహ్మర్షి . రాక్షసుల బలము ఒకవేళ మితి మీరి దేవతలను విరచిన , అప్పుడు దేవపక్షములో నిలచి రాక్షసులను తిరస్కరించ గలవాడు బ్రహర్షి . జగత్తుయొక్క స్థితిని కాపాడుటకు పర్వతములు ఎలాగ ముఖ్యమైనవో , అలాగునే సత్య ధర్మ జ్ఞాన వైరాగ్యములను కాపాడుటకు అవశ్యముగా కావలసిన రక్షణ పోషణాధికారి బ్రహ్మర్షి . హరిశ్చంద్రుని యజ్ఞములోనే అతడు బ్రహ్మర్షియని నేను ప్రకటించవలసినది . అయినా , పరిషత్తు ఆజ్ఞాపించినఒక మహత్కార్యమును , ఇతరులవల్ల కాని దానిని , సాధించనీ , తొందర యేమున్నది యని మిన్నకుంటిని . మనము జన్మతః బ్రహ్మర్షులై వచ్చి లోక రక్షణా కార్యమునందు నియుక్తులైన వారము . మనము సంప్రదాయ బద్ధులమై మెలగ వలెను . మనకు పాలు పాలే , నీళ్ళు నీళ్ళే  ! మనము జాతి ధర్మమునకు బద్ధులము . అయితే , లోకములో అప్పుడప్పుడు ప్రతివాదములు వచ్చుచుండును . ఇప్పుడు అటువంటి కాలము వచ్చినది . జాతివలన వచ్చు గుణమును దీక్ష వలన కూడా పొందవచ్చును అనుదానిని నిదర్శనముతో చూపవలసిన కాలము వచ్చినది . అందువలన , బ్రహ్మర్షి పరిషత్తు , సులభముగా బ్రాహ్మణ్యమును సాధించగల దీక్షావిధి నొక దానిని కనిపెట్ట వలసిన బాధ్యతను విశ్వామిత్రులకు ఇచ్చినది . భగవాన్ విశ్వామిత్రులు ,  చతుర్ముఖ బ్రహ్మ సృష్ఠిలో జాతి వలన మాత్రమే వ్యక్తమగు గుణము యేదున్నదో , దానిని సిద్ధింపజేయగల మంత్రయోగ మొకదానిని , బ్రహ్మణస్పతి , పూషా , గాయత్రీ దేవుల అనుగ్రహము వలన పొందినారు . మేము దానిని ఒప్పుకొనుటకు తగినట్లు ప్రయోగము చేసి చూపినారు . జాతి వలన బ్రాహ్మణులు కాని పన్నెండు మంది శిష్యులకు ఆ మంత్రమును ఉపదేశించి , వారిని బ్రాహ్మణులను చేసినారు . వారికి జాతి బ్రాహ్మణుల యోగ్యత సంపూర్ణమైనది . దానిని చూసి మేము సంపూర్ణముగా సంతోషించినాము . ఈ సందర్భములో  విశ్వామిత్రులు నిర్వహించిన ఈ కార్యము అద్భుతమైనది . అభూతపూర్వమైనది . తామందరూ దానిని సమిష్టిగా అంగీకరించవలెను . అనగా , ఈ విశ్వామిత్రులు హవ్య కవ్యములను ఇచ్చిన , తమరు వాటిని అంగీకరించవలెను . అప్పుడు ఆ బ్రాహ్మణ్యము సాంగముగా పూర్తియైనట్లు దీనిని అనుగ్రహించవలెను . మొత్తానికి ఈ దినము విశ్వామిత్రులకు బ్రహ్మర్షి పట్టాభిషేకము  జరగవలసినది యొకటి , అతని అనుగ్రహము వలన బ్రాహ్మణులగు వారికి కూడా హవ్య కవ్య ప్రధానాధికారములను ఇవ్వవలెనని మరియొకటి ---ఈ రెండు కార్యములనూ జరిపించవలెను ’ అని వశిష్ఠుడనైన నేను తమరిని , యనగా , చతుర్ముఖ బ్రహ్మ పురస్సరమైన ఈ దేవ సభను ప్రార్థిస్తున్నాను . " 

     చతుర్ముఖ బ్రహ్మ అన్నాడు , " భగవాన్ వశిష్ఠులు చెప్పిన తరువాత దేవర్షి పితృ గణాలలో దానిని మారు మాట్లాడక మౌనంగా అంగీకరించకపోతే ఔచిత్యానికి కోపము రాగలదు . అహంకారమును గెలిచిన మహానుభావుని మాట అనగా , చతుర్ముఖ బ్రహ్మయే కాదు , పరబ్రహ్మమే అంగీకరించును అని అన్న తర్వాత , ఆమాట వేద కల్పము అన్న తర్వాత , మేము చెప్పునదీ చెప్పవలసినదీ ఏమీ లేదు . కాబట్టి భగవాన్ వశిష్ఠులు సూచించిన రెండు కార్యములనూ చేయుటకు  సమ్మతిని ఇచ్చియే తీరవలసిన ఈ సందర్భములో , సృష్ఠి కర్త యొక్క అధికారముతో రెండు మాటలు ఆడుతాను . నేను సృష్ఠి చేసినాను అనగా , వృక్షము పల్లవించి పెరుగుట . నేను చెట్టును పెంచినాను అనునది  ఎంత నిజమో , అంత అబద్ధము కూడా ! అఖండముగా నున్న బ్రహ్మము ఖండమై , ఏకము అనేకమైనపుడు , అటులెందుకయినది ? ఎప్పుడయినది ? అన్నది ఎవరూ చూడరు . శక్తి ప్రసారమయినపుడు , అటుల ప్రసారమయిన  యే బ్రహ్మశక్తి ఉందో , అది శక్తియేనా లేక అశక్తియా అన్నది నేను చూచినాను . అది సృష్ఠి స్థితి లయమను మూడు కార్యములను చేయుటకు బ్రహ్మ విష్ణు రుద్రాత్మకముగా ఒక వ్యవస్థను ఏర్పరచినది . ఇలాగ త్రిమూర్తులకు కారణమయిన ఆ శక్తి యొక్క వ్యవస్థాపకత , జడచేతనములన్నిటా ఉండును . హిమము నందూ , అగ్నియందూ ఉష్ణము ఉండనే ఉన్ననూ , ఒకచోట అభావరూపముగా , ఇంకొక చోట భావరూపముగా ఉండి , రెండు విధములైన కార్యములను చేస్తుండలేదా ? శీతలము-ఉష్ణము అను రెండు పేర్లతో రెండు రూపములుగా వెలుగొందుచుండలేదా ? ఇలాగ నామ రూపములలో భిన్నముగా నున్ననూ , నిజానికి ఒకటే యై ఉన్న , విరోధాభాసములు రెండూ ఏకమగు ఆ సర్వోదయ మూలము అంతటాయున్నది . అది అందరిలోనూ ఉండి , అందరి కర్తృత్వమునకూ , భోక్తృత్వమునకూ కారణమై , అందరి మనసులనూ కర్తృత్వ , భోక్తృత్వములకు ప్రచోదనము చేయుచున్నది . ప్రచోదకమూ , ప్రచోదనమూ తానే యైయున్న ఆ పరబ్రహ్మము ఈ భౌతిక జగత్తు నందు సవితృడై యున్నది . ఈ సవితృడు ప్రతియొక్క ప్రాణినందూ గుహాశయుడై ఉన్నాడు . ఈ తత్త్వమును ఎరిగినవాడు బ్రాహ్మణుడు . జాతి వలన బ్రాహ్మణుడైన వాడు అధ్యయన ఇత్యాదులవలన దీనిని సాధిస్తే , ఇతరులు దీనిని దీక్షా మార్గము వలన , గురుముఖముగా సాధించెదరు గాక . ఇప్పటి నుండీ , జాతి బ్రాహ్మణుడు ఉపనయనము చేసుకొని ఈ ప్రజాపత్యమును సాధించనీ . ఇక ముందు ఎవరైనా సరే , ఈ ప్రాజాపత్యమును సాధించి సిద్ధులైతేనే వారికి బ్రాహ్మణ్యము . లేదంటే లేదు . ఈ మాహానుభావులిద్దరి, అనగా , భగవాన్ వశిష్ఠుల , భగవాన్ విశ్వామిత్రుల అనుగ్రహమును సంపాదించినవారికి మాత్రమే ఈ వ్రతము సిద్ధి యగును గాక . ఇది తామందరికీ సమ్మతమేనా ? " (   " విశ్వామిత్రుల గాయత్రికి వశిష్ఠుల శాపము ఉన్నది , అందువలన దానినుండీ విడుదలయగు వరకూ  గాయత్రి సిద్ధించదు " అని పెద్దల మాట   ) 

     దేవ సభ ఈ మాటను అంగీకరించినది . సవితృ దేవుని పరముగా ఆదిత్యుడు ఆమాటకు ఒప్పుదల నిచ్చినాడు . దేవతలు పరమ సంతోషముతో వశిష్ఠ చతుర్ముఖుల సన్నిధిలో , సప్తఋషులను పిలిపించి , విశ్వామిత్రులకు బ్రహ్మర్షి పట్టాభిషేకమును చేసినారు . 

     ఒకపక్క పట్టాభిషేకము నడుస్తుండగా , వశిష్ఠులు వామదేవులను పిలచి , " ఇదంతా నీ ప్రభావము . దీనికోసమే నిన్ను నియోగించినది . దీనినంతటినీ కూడా ఆ దినము  మా ఆశ్రమములో యజ్ఞేశ్వరుడు కాలపు తెరలను తొలగించి చూపించినాడు . అదలా ఉండనీ , ఇక్కడ చూడు " అన్నారు .  

     దేవసభలో నాట్యము చేస్తున్న అప్సరసల కన్నా ఎక్కువగా , అక్కడ గానము చేస్తున్న గంధర్వులకన్నా ఎక్కువగా , జగత్తంతా , బ్రహ్మాండమంతా ఆనందముతో , గాన నర్తనములతో నిండిపోయినది వామదేవులు చూచినారు . విశ్వానికి విశ్వమే తన ఆనందము , కాగుతున్న పాల వలె పొంగుచుండుటను చూచినట్లు అతనికి అనిపించినది . 





Sunday, August 19, 2012

68. " మంత్ర ద్రష్ట " అరవై ఎనిమిదవ తరంగం .



అరవై ఎనిమిదవ తరంగం .

     విశ్వామిత్రులు ఆ రోజు నిద్రలేస్తుండగనే , ఈ రోజు వశిష్ఠులు దయచేస్తున్నారు అన్నది బోధపడినట్లాయెను . సరే , వారు వచ్చు ఉద్దేశము కూడా తెలుసు , సిద్ధముగా ఉన్నారు .

     సుమారు ఒకటిన్నర ఝాము అయి యుండవచ్చును . విశ్వామిత్రులు ఎందుకో తలయెత్తి పైకి చూచినారు . దూరంగా ఆకాశంలో ఒక తేజోమండలము ఆశ్రమపు వైపుకే వస్తున్నది . లేచి నిలబడి , దానికి స్వాగతము పలుకుతున్నంత లోనే ఆ జ్యోతిర్మండలము వీరున్న చోటికి వచ్చి దిగింది . ఆ తేజోరాశిని ఛేదించుకొని భగవాన్ వశిష్ఠులు బయటికి వచ్చినారు . 

     విశ్వామిత్రులు వారికి మధుపర్కమును అర్పించినారు . అతిథి సత్కారము చేసినారు . పరస్పర కుశల ప్రశ్నల తరువాత , వశిష్ఠుల పరమ సంతోషము హృదయము నుండీ పొంగి , ముఖములో దేదీప్యమానముగా వెలుగుచుండగా , " సాధించినారు , భగవాన్ ,  విశ్వామిత్రా , లోకమును ఉద్ధరించినారు " అన్నారు . వశిష్ఠుల స్తోత్రాన్ని సులభముగా ఒప్పుకొనక , విశ్వామిత్రులు , " ఆ గౌరవమంతా పరిషత్తుకు చెందును . నాదేమున్ననూ ఆజ్ఞా పాలకుడనై చేసిన కార్యము . పరిషత్తు కావాలన్నది , ఎక్కడకు వెళ్ళిన కార్యమగునో యనుదానిని తమరు సూచించినారు . ఏమి చేయవలెననునది లోపాముద్రాగస్త్యులు నేర్పించినారు . మిగిలినదంతా దేవగురువుల కృప వలన అయినది . కాబట్టి దేనికోసమై ఈ పొగడ్త నాకు చెందును ? "  అని నవ్వినారు . 

     వశిష్ఠులు , " యుద్ధమంతా సైనికులది . నిజమే , గెలుచునదీ , ఓడునదీ వారే ! కానీ కీర్తియంతా సేనానిది కదా ! అటులనే , పరిషత్తు కావాలన్నదీ , అది ఇదీ , అన్నీ నిజమే . మేమందరమూ , ఇది తమ వల్లనే కావలెను , వేరెవరివల్లా ఇది సాధ్యముకాదు , అన్నది తెలుసుకొని ఈ పని తమకు అప్పగించినాము . దానిని మరవకండి , సరే , తమ శిష్యులు ఎక్కడ ? " 

     విశ్వామిత్రులు తమ శిష్యులను పిలచి చూపించినారు . వశిష్ఠులు వారందరినీ చూచి , చాలా ఆనందించి , " అందరూ ఋషి కల్పులైయున్నారు . వీరికి కావలసినది వేదాధ్యయనము . అది కూడా అయితే , వీరందరూ బ్రాహ్మణులే ! సందేహము లేదు . వీరికి అగ్ని విద్యనివ్వండి . మిగిలిన దానినంతా ఆ యజ్ఞేశ్వరుడే చూచుకొనును. " అని అందరినీ ఆశీర్వదించి , వారిని పంపించినారు . ఆశ్రమములో వశిష్ఠ , విశ్వామిత్రులిద్దరే నిలచినారు . 

     వశిష్ఠులన్నారు , " ఈ దినము వైశ్వానరుడెందుకో చెలరేగి కనిపిస్తున్నాడు , ఆత్మారాముడు ఘోష పెడుతున్నాడు . నేను నర్మదలోకి వెళ్ళి స్నానము చేసి వచ్చేస్తాను . అంతలోపల ఏదైనా పాకము సిద్ధము కాగలదా ? " 

" ఏమి ఆజ్ఞ ఇచ్చిన అది సిద్ధమగును " 

" మానస సృష్టి వద్దు , మానవ సృష్టి గావించండి . పరమాన్నమయితే సులభము . త్వరగా చేయవచ్చును , కదా ? " 

" అవును " 

     " అయితే , ఒకమాట. నేనేమో ఆకలికి తాళలేక త్వరగానే రావలెనని యున్నాను . ఎంతైనా నేను వేదాభ్యాస జడుడను కదా , నర్మదా నదేమో శివమయమైనది .  ఆ శివసన్నిధిలో వేగిరమే సమాధి స్థితి కలుగుతుది . ఒకవేళ అటులయిన , నిదానమగును కాబట్టి , ఆ పరమాన్నమును వేడిగానే యుంచండి . సౌకర్యమే కదా ? " 

" సౌకర్యమే " 

     " సరే , నేనిక వెళ్ళి వస్తాను . అయినంత వేగముగా వస్తాను . బ్రాహ్మణ దేహము  కాకపోతే ఏదైనా శాంతి చేసుకొనే వెళ్ళియుండవచ్చును అన్నట్లుంది , వైశ్వానరుడి కోపము " అని నవ్వుచూ కమండలము తీసుకొని నదివైపుకు అడుగులు వేశారు . వారికి దారి చూపుటకు ఒక శిష్యుడిని వెంట పంపారు . 

     విశ్వామిత్రులు తాము కూడా నదికి వెళ్ళి యథావిధిగా స్నానమును త్వర త్వరగా ముగించుకొని వచ్చి పొయ్యి వెలిగించినారు . ఒక ఘడియలోపలే పాయసము సిద్ధమైనది . పాకము చేసినవారి శ్రద్ధాభక్తుల ప్రకట రూపమో అన్నట్లు , ఆ పాయసపు సువాసన చుట్టుపక్కలంతా వ్యాపించి , ఆకలి లేనివారికి కూడా తీవ్రాకలి పుట్టించునట్లుంది . దాని సుగంధముతో ఆశ్రమమంతా నిండిపోయినది . 

     చాలా సేపే అయినది . వశిష్ఠులు రాలేదు . మరికొంత సేపయినది . వారింకా రాలేదు . శిష్యుడొకనిని పంపించారు . వారు భస్మోద్ధూళిత గాత్రులై పద్మాసనము నందు కూర్చున్నారని వాడు వచ్చి చెప్పినాడు . ఇంకొంచము సమయమైనది . విశ్వామిత్రులు తామే వెళ్ళి చూచినారు , వారికి సమాధి కలిగినది . అది కూడా శిథిల సమాధి కాదు , దృఢ సమాధి . ఎప్పుడు బహిర్ముఖులవుతారో ? చేసినది పాయసము . దానిని పొయ్యిపై నుంచితే పొంగిపోతుంది . తీసి పక్కన పెట్టితే ఆరిపోతుంది . ఆరిపోతే, చల్లబడి , గ్రహించుటకు అయోగ్యమవుతుంది . 

     " చేసిన వంట వేడిగా నున్నంత వరకే దానిలో ప్రాణ శక్తి యుండునది . దాని తరువాత అది చల్లబడిన కొలదీ దానిలో అపాన శక్తి వచ్చి చేరుతుంది . దానిలోయున్న ఆహారపు గుణము , యోగ్యత నష్టమవుతుంది . పాయసము ఇంకా సులభముగా ఆరిపోతుంది , పెళుసవుతుంది . భగవానులెందుకు , ఈ విధముగా చేసినారు ? కావాలనే చేసియుండ వచ్చునా ? అదే నిజము , అవును . ఆ దినము పరిషత్తులో మా పరీక్ష వశిష్ఠ ముఖముగా జరగవలెనన్నది తీర్మానించబడినది , ఇప్పుడు వారు దయచేసినది అందుకే !" 

     " అటులనే యగుగాక , కానీ , పాయసపు పరీక్ష ఎందుకు ? ఓహో , దేశకాల స్వరూపుడై సర్వమునూ పాకము చేయు వైశ్వానరుని నిరోధించి , ఏక స్థితిని కాపాడగలడో లేడో యన్నదే ఈ దినపు పరీక్ష కావచ్చును . లోక రక్షణ కోసము శక్తి సామర్థ్యములను సంపాదించినవారు, ఆ శక్తి సామర్థ్యములు పాకాభిముఖముగా ముందుకు దూకుటను కూడా నిరోధించగల వారైయుండవలెను , నిజమే . భగవానులు చేసినది సరియైనదే ! నేనీ పరీక్షలో గెలిచియే తీరవలెను . కానిమ్ము , దేవతలున్నారు , గెలిపిస్తారు, నాకెందుకు ?" 

     విశ్వామిత్రులు శిష్యుడిని పిలచినారు . " అప్పుడే మిట్ట మధ్యాహ్నమయినది , ఇంకా ఒక ఝాము చూడండి , భగవానులు వచ్చిన, సరి. లేదంటే మీరు వంట చేసుకొని భోజనము చేయండి . నేను సమాధిలో కూర్చుంటాను . భగవానులు వచ్చువరకూ నేను సమాధిలో ఉంటాను . రెండు దినములు మా కోసము చూసి , మూడవ దినము మీరంతా యథేఛ్ఛగా వెళ్ళిరండి . ముందు కాలములో హిమాలయములో బ్రహ్మర్షి పరిషత్తు చేరుతుంది . అప్పుడు మనము మళ్ళీ కలుసుకుందాము " అని వారికి చెప్పవలసినదంతా చెప్పి , తాము పర్ణశాలలో ఒక మూలలో పాయస పాత్రను నెత్తిపై పెట్టుకొని సమాధిలో కూర్చున్నారు . దేహములోనున్న వైశ్వానరుణ్ణి ప్రజ్వలించి , ఆ పరమాన్నములోనున్న అన్నశక్తి జర్జరితము కాకుండా  ( తెట్టు కట్టుకొని శిథిలము కాకుండా ) దానిని కాపాడమని అతనిని ప్రార్థించి , ప్రాణాపానములను ఒకదానిలో ఒకదానిని కలిపినారు . ఉదానమును ప్రణవ నాదము చేస్తుండ వలెనని ఒప్పించినారు . వ్యానము జాగృతమై దేహమును కాపాడుతుండవలెనని వేడుకున్నారు . సమానము శాంతమై కూర్చోవలెనని ప్రార్థించినారు . తాము పరమాన్నమై , పరమాన్నమే తామై సమాధిలో కూర్చున్నారు . 

     ఇలాగ విశ్వామిత్రులు అజర , అమర భావములో కూర్చొనుటతో , ఆ పర్ణశాల జగద్ధర్మాన్ని అతిక్రమించినది . జడ చేతనములను భేదము చూపక , సర్వమునూ పాకాభిముఖముగా చేసి పరిణామమును కలిగించుతున్న దిక్కాలములు ఆ మహా మునీంద్రుడు నిశ్చలముగా , అజర , అమర దివ్య అన్న స్వరూపమై కూర్చున్న దేహమును అనుగ్రహించి , తమ ప్రభావము అక్కడ ప్రసరించకుండా అతడి చుట్టూ ఒక కోటను గట్టి , దానికి తామే కాపలా కాస్తూ కూర్చున్నాయి . 







67. " మంత్ర ద్రష్ట " అరవై ఏడవ తరంగం .



అరవై ఏడవ తరంగం .


     విశ్వామిత్రుడు తన దేహ ప్రమాణమును పెంచుకొని రాను రాను భూమండలము నంతటినీ తనలో ఇముడ్చుకొని విశ్వాన్ని ఆవరించి కూర్చున్నాడు . భూలోకపు మేరు పర్వతము తన దేహములోని  మూలాధార చక్రముతో ఏకమైనది .

     మేరు పర్వతపు ఎత్తైన మధ్య శిఖరము లో సరస్వతీ , గాయత్రీ , సావిత్రీ రూపములు ఏకమై  ,శేష శక్తి గా పిలవబడే శక్తి పైకి లేచి ఊర్ధ్వ ముఖముగా ప్రయాణము చేస్తున్నది . భూలోకము ,  భువర్లోకము , సువర్లోకము , మహర్లోక  , జనోలోక .  తపోలోకములను పావనముచేస్తూ  క్రమముగా ఆలోకములను లయము చేస్తూ , తానొక్కడే మిగిలిన  పరమాత్మ స్వరూపములో ఆ శక్తి వెలుగుచున్నది . విశ్వామిత్రుడు , ఆ శక్తి తన సహస్రార చక్రములో చేరి ఓంకార స్థానములో కూర్చుండుటను చూస్తున్నాడు . అక్కడ విరాజమైన ఆ శక్తి కిరణరూపములో ప్రసరించి విశ్వామిత్రుని మూలప్రాణమును చేరుతున్నది . విశ్వామిత్రుడు ప్రాణ దేవుని ప్రార్థించి ప్రసన్నము చేసుకొని మూల ప్రాణమున నున్న ఆ కిరణ శక్తిని మహా ప్రాణముతో అనుసంధానము చేసుకున్నాడు . ఏదో తెలియని ప్రకంపనలు దేహమంతా వ్యాపిస్తున్నాయి . ఆ ప్రకంపనలు వెలుగు కిరణాలుగా మారి దేహము బయటికి ప్రసరిస్తున్నాయి . లోపలి కిరణాలన్నీ ఒకే మూలబిందువు నుండీ బయలు వెడలి ప్రసరించునట్లు బయటికి వచ్చి విశ్వామిత్రునిచుట్టూ ఒక రక్షణ కవచమునేర్పరచినాయి . మరలా ఆ వెలుగు కిరణాలు అంతర్ముఖముగా ప్రవహించి దేహములోపల చేరిప్రాణ మండలమును ఆవరిస్తున్నాయి . అక్కడ నుండీ దేహములోని డెబ్భై రెండు వేల నాడులలోనూ ప్రవహించి , చివరికి ఇడా పింగళ నాడుల మధ్య సుషుమ్నా నాడి సంగమములో నిలచాయి . ’ త్రికూట నామ్నీ స్థిమితేఽంతరంగే ’ అను వచన ప్రకారము , అక్కడ స్థిరమై కూర్చున్నది మరలా  సుషుమ్నా నాడి ద్వారా ప్రవహించి మూలాధార చక్రము చేరింది . విశ్వామిత్రుని దేహములో ప్రకంపనలు మరలా మొదలైనాయి. ఆ ప్రకంపనలు దేహములో  మూలాధార , అనాహత , సహస్రార చక్రములలో కేంద్రీకృతమై , మరలా ఆ ఒక్కొక్క చక్రమునుండీ  ఎనిమిదెనిమిది గా బయటికి వచ్చి ఇరవైనాలుగు స్థానములలో కేంద్రీకృతమై , వివిధ చక్రములవలె తిరుగుతున్నవి . ఆయా చక్రములనుండీ ఒక్కొక్క కిరణము బయలుదేరి ఉదాన వాయువుతో చేరుతున్నాయి . రాజాజ్ఞకై వేచియున్న వాయిద్యకారులు , సైగ దొరికిన వెంటనే డప్పులను మ్రోగించుట మొదలిడినట్లు , ఉదానమును చేరిన వెంటనే ఒక్కొక్క కిరణమూ  ఒక్కొక్కటిగా , నియమబద్ధమైన క్రమములో ఒక్కొక్క అక్షరమై శబ్దరూపములో బయటికొస్తున్నది . మొదట అనాహత చక్రపు ఎనిమిది కిరణాలు , తరువాత మూలాధార చక్రపు ఎనిమిది కిరణాలు  , చివరగా సహస్రార చక్రపు ఎనిమిది కిరణాలు   ఇరవైనాలుగు అక్షరములూ ఒకదాని తరువాత ఒకటి పలుకుతూ మొదట సౌమ్యముగా నుండి రాను రాను భేరీ నాదములవలె మారి అతని శరీరములోనే కాక , బయట కూడా సర్వమూ ప్రకంపించునట్లు భూ నభోంతరాళాలు దద్దరిల్లునట్లు మారుమ్రోగుతూ వెలువడుతున్నవి . క్రమబద్ధముగా ఆ అక్షరాలు వినబడుతూ , మంత్రరూపమై , మరలా మరలా అవే అక్షరాలు ఆవృతి అగుచున్నవి . అలాగు ఎంతసేపు ఆ మంత్రము ఉచ్చరిస్తున్నాడో , 

     ’ వత్సా , ఇక నీ రక్షణా కవచమును సడలించి నాకు అవకాశమునివ్వు. నాకు బ్రహ్మలోకము నకు వెళ్ళు వేళ అయినది " అని ఎవరో అంటున్నది విని విశ్వామిత్రుడు కళ్ళు తెరిచాడు . తాను ఆశ్రమములోనే ఉన్నాడు . తాను మంత్రమును ఉచ్చరిస్తూనే ఉన్నాడు , ’ బ్రహ్మాండములో జరుగునదే పిండాండములోనూ జరుగుతున్నది ,  మేరు పర్వతపు శిఖరము తనలోని మూలాధార చక్రమే ’  నని అర్థమయ్యే లోపు గాయత్రీ మాత మనసుకు గోచరించింది .

 భక్తి ప్రపత్తులతో , స్తోత్రము చేసి ,’ దేవీ , అనుజ్ఞ ఇవ్వు , ఏమి చేయవలెను ’ అన్నాడు . 

దేవి చంద్రకాంతులీనునట్లు మందహాసము చేసి ,  " వత్సా , నువ్వు ఇప్పుడు సిద్ధుడవు . సంకల్ప బలము చేతనే సర్వమునూ చేయగలవు " అన్నది . 

     విశ్వామిత్రుడు ,  ’ ఉత్తమే శిఖరే జాతే భూమ్యాం పర్వత మూర్ధనీ | బ్రాహ్మణేభ్యోభ్యనుజ్ఞాతా గఛ్చ దేవి యథా సుఖం | ’ ఓ దేవీ ! సమస్త ప్రాణులలోనూ అంతర్యామివై ప్రేరేపించు వేదజననివైన , మరియూ పరబ్రహ్మ  , సూర్యమండలములు రెండింటిలోనూ ఉద్భవించి , ఉపాసకులకు ఇష్టార్థములను ప్రసాదించు ఓ మాతా ! నిన్ను ధ్యానించు వారి ప్రార్థనను ఒప్పుకొని వారిని అనుగ్రహించి , ఆయుస్సూ , ద్రవిణమూ , బ్రహ్మవర్చస్సూ ప్రసాదించు ఓ జననీ !  నీ యథాస్థానమైన , ఉత్కృష్టమగు పరబ్రహ్మ స్థానమునకు వెళ్ళి విలసిల్లు " అని దేవిని ప్రార్థించాడు . 

దేవి ఆ పూజలు గైకొనినదానికి సూచనగా , అతని శరీరము ఎప్పటివలె శాంతమై ప్రకంపనలు నిలచిపోయాయి .

                                 *********** 

     గాయత్రీ మాత ఆదేశించి ఉపదేశించిన అనుష్ఠానమును యథావిధిగా ఆచరించి కృతకృత్యులైన విశ్వామిత్రులు , లోపాముద్రాగస్త్యులు అర్పించిన పూజలను ఒప్పుకుని , నర్మదా తీరమునకు వెళ్ళినారు . దారిపొడవునా , ప్రతి ఆశ్రమమునందూ , ప్రతి అడుగునందూ , అందరూ వారికి సత్కారము చేస్తున్నారు . తెలిసిన వారు , తెలియని వారు కూడా ,  ఆ తేజస్సును చూసి సంతోషభరితులై ప్రణామములు చేస్తున్నారు . భగవానులు కన్నులు తెరచి , రూప దర్శనము చేసుకున్ననూ , ఆ కన్నులు మాత్రం కనిపిస్తున్న ఆ రూపపు వెనుక దాగి కూచున్న ఏదో ఆ రూపాన్ని చూడాలని తహతహలాడుచున్నట్లుంది . వారి చెవులు వింటున్నాయి , కానీ ఆ సవ్వడి వెనుక ఈ చివర , ఆ చివరలను వెదకుటలో కుతూహలమే ఎక్కువ . శ్వాస ఆడుతున్నది , కానీ శ్వాస మొదలు , చివరల వెనుక ఉన్న ఇంకేదో ఒక దానిని ధ్యానగోచరము చేసుకొనే ప్రయత్నము బలమైంది . 

     ఇలాగే ప్రపంచ చిత్రమును పరిభావిస్తూ నర్మదా తీరానికి వచ్చినారు . అక్కడ ఉత్తర , దక్షిణ దేశములకు మధ్య దేవతలు నిర్మించిన గోడ వలె ఉన్నట్లున్న , విశాలమైన , ఎత్తైన ఆ వింధ్య పర్వతము యొక్క సారము కిందకు దిగి వస్తున్నదా అన్నట్లున్న ఆ నర్మదా తీరములో ఒక ఆశ్రమమును రచించి వాసమేర్పరచుకున్నారు . వశిష్ఠులు అక్కడికి వచ్చి వెళ్ళు వరకూ వారికి శిష్యులను పరిగ్రహము చేయుట ఇష్టము లేదు . అయినా , గాయత్రీ దేవి అనుగ్రహము వలన లభించిన మంత్ర రాజమును ప్రయోగించి చూడవలెనను ఒక పని మిగిలియుంది . అందువలన మితముగా శిష్య పరిగ్రహము చేసి , వారిని ప్రయోగ సిద్ధులను చేయవలెనని ఒక చిన్న సంకల్పము . 

     ఇతరులైతే ,  సంకల్పమును చేసి సాధనలను అనుష్ఠానము చేసి కార్యములను సాధించవలెను . కానీ మహనీయులకు ,  కావలసిన కార్యముల బీజములై సంకల్పములు వచ్చి , వాటికి కావలసిన సాధనములన్నీ తమకు తామే సమకూరి అల్ప ప్రయత్నము చేతనే మహత్తరమైన ఫలమగును . భగవానుల సంకల్పము కూడా అటులనే అయినది . వర్ణ చతుష్టయము వారంతా వచ్చి శిష్యులు గా చేరినారు . అందరికీ మంత్రోపదేశమయినది . విశ్వామిత్రుల నోటినుండీ మంత్రము వెడలుతుండగనే అది శిష్యుని కర్ణ కుహరము చేరుతుండగనే , ఏదో ఒక తేజోరాశి ముందుకు దూకి ,  రాజు వెడలుటకు ముందే బయలు వెడలు రాజ పరివారము ,  ముందరి శిబిరము వరకూ దారినంతటినీ సరిచేసి రాజ మార్గమును నిర్మించునట్లు ,  దేహములోని నాడినాడులలో నున్న మలమును నిర్మూలము చేసి , తానే ఆ నాడులలో సమూలముగా నిండుతున్నది . మంత్రోపదేశమవుతుండగనే ఆపోజ్యోతి దర్శనమై , దేహాద్యంతమూ ప్రాణ వ్యూహమవుతుంది . మనసు ఏకాగ్రమవుతుంది . ఇంద్రియముల స్వాతంత్ర్యము తప్పి , వాటిలోనున్న చాంచల్యము , పిల్లలు తిన్న మామిడి పండు వలె నిశ్శేషమవుతుంది . చంచలమైన ఇంద్రియముల పోటు చెఱగిపోయి మనసు నిర్మలమవుతుంది . మనస్సు యొక్క కోటి అలలు తప్పి బుద్ధి స్థిరమై , నిశ్చలమవుతున్నది . నిర్మలమైన బుద్ధి , జ్యోతిని సమగ్రముగా చూచినట్లు సమాధికి చేరుతుంది . 

     భగవానులు ప్రస్తుతానికి పన్నెండుగురు శిష్యులను మాత్రము స్వీకరించినారు . వారందరూ ప్రాజాపత్య వ్రతము చేస్తున్నారు . ఆహార నియమము వలన స్థూల దేహము శుద్ధమై , ఆచార నియమము వలన సూక్ష్మ దేహము శుద్ధమగుతున్నది . జ్యోతి సమగ్రముగా కనపడుచున్నది . అయినా అక్కడ , ఏదో ఇంకొక చీకటికూడా ఉంది . అదంతా వారు గమనించి తగిన జాగ్రత్త తీసుకుంటారు . 

     అలాగ ఒక ఆయనము గడచింది . ఇప్పుడు ఈ శిష్యులకు అప్పుడపుడు దేవతా దర్శనమవుతుంది . అయితే , అదింకా పూర్ణముగా , సాంగముగా అగుట లేదు . ఇంకా ఒక ఆయనమైనది . శిష్యులంతా తేజస్వులు అయినారు . ఇప్పుడు వారికి దేవతా దర్శనము అవుతున్నది . 

     ఒక రోజు ఆచార్యులు ఒక చెట్టు మొదట్లో  చేరగిలబడి , ఏదో ధ్యానములో యున్నారు . ’ ఇదిగో నికిదే నిదర్శనము ’ అని ఎవరో అన్నట్లాయెను . శిష్యుడొకడు వచ్చి నమస్కారము చేసి కొంచము దూరములో నిలిచి ,మాట్లాడుటకు నిరీక్షిస్తున్నాడు . భగవానులు ’ ఏమిటయ్యా ? ’ అన్నారు . ఏమో చెప్పవలెను అని ఉన్నాడు . సిగ్గు . భగవానులు దగ్గరకు పిలచి కూర్చోబెట్టుకుని , ’ ఏమిటి ? చెప్పు ’ అన్నారు . వాడు వచ్చినది ఎందుకన్నది వారికి తెలుసు . వాడి నోటనే వినవలెనని , ’ ఏమిటి ? చెప్పు ’ అన్నారు . శిష్యుడు చెప్పినాడు , " ఈ పొద్దు సూర్యోదయపు వేళకు సరిగ్గా దేవీ దర్శనమైనది . ప్రాతఃసూర్యుని తేజస్సునంతా పట్టీ దానితో చేసినట్టున్న మూర్తియొకటి . ఎర్రటి కమలము పైన , పద్మాసనములో కూర్చున్నది . ఒక కాలు కిందికి వాల్చి , సన్నగా కదలుతున్న నీటిని తాకవలెనని ఉంచినట్లుంది . ఆ మాత నన్ను  చూచి , నవ్వినది . అప్పుడు ఆమె నవ్వు నుండో  , లేక నా హృదయమునుండో ఒక జ్యోతి వచ్చి వెలిగింది . ఆ జ్యోతి కి ఇటు వైపు ఒక కొనలో ముద్దుగానున్న బంగారపు ఈకల రెక్కలున్న హంస యొకటి ఆటాడుచుండినది . ఇంకొక క్షణములోపల ఆ హంస ఆటను ఆపి తిరిగి చూచినది . ఆ జ్యోతికి ఆ కొనలో ఒక పెద్ద హంస. అది రానురాను పెరుగుతూ వచ్చింది . పెరిగి పెరిగి భూమ్యాకాశములన్నీ నిండిపోయినాయి . ఆ చిన్న హంస ఆ పెద్ద హంసలో చేరి చిత్రములోని హంస వలె నిశ్చలమైనది . " 

     భగవానులు మధ్య మధ్యలో ’ ఊ ’  ’ఊ ’ అంటూ వింటున్నవారు , లేచి కూర్చున్నారు . శిష్యుని ముఖమును ఆనందముతో చూచి , వాడు చెప్పినదంతా నిజము అన్నది గమనించి , ఇంకా సంతోషించారు . ఒక ఘడియ అలాగే చూస్తూ , " ఇప్పుడేమి కనిపిస్తున్నది ? " అన్నారు . 

     ఇప్పుడేమి చూచినా , ఆ పెద్ద హంసలో అణగి కూర్చున్న చిన్న హంస గుర్తుకు వస్తున్నది . చూచినది ఒక ఘడియ పాటు కనబడకుండా పోయి , మరలా కనిపిస్తున్నది . " 

     " చూడు , బయటిది దృశ్యము . దానిని చూచు నువ్వు దృక్ . మీరిద్దరూ ఒకరినొకరు సంధించినపుడు జరుగు కార్యము దర్శనము . దీనిని మనసులోఉంచుకొని, కనిపించినది కనబడకుండా పోయి , మరలా కనిపించు దాని అర్థమేమిటో చూడు . " 

     " భగవాన్ , దృక్కు ,  దృశ్యమును చూచినపుడు అంతా దర్శనముతో నిండి , ఈ కొన దృక్కూ , ఆ కొన దృశ్యమూ లేకుండా పోతాయి . మరలా దర్శనము మాయమై , దృక్-దృశ్యాలు కనబడతాయి . " 

     భగవానులకు పరమానందమయినది . " వత్సా , కృతార్థుడవయ్యావు . వేదమునకు అధికారివైనావు . సర్వ దేవతలూ వచ్చి నీ దేహము నందు నిలుచుటకు యోగ్యుడవైనావు . నేను మరలా చెప్పు వరకూ ఈ విషయమును రహస్యముగా ఉంచు . " అని ఆశీర్వాదము చేసి పంపించారు . 

     వారి ఆనందానికి మేర లేదు . " బ్రహ్మర్షుల ఆజ్ఞ నెరవేరినది . విశ్వాన్నే ఆర్యము చేయు సాధనము సిద్ధమైనది . బ్రహ్మర్షి మండలానికి దానిని సమర్పిస్తే , తాను కృతార్థుడనయినట్లగును . " అని ఆనందములో పరవశిస్తూ ,   మెల్లగా సంధ్య చీకట్లు కమ్ముకొనుటను చూస్తున్నారు . 



Saturday, August 18, 2012

66. " మంత్ర ద్రష్ట " అరవై ఆరవ తరంగం .



అరవై ఆరవ తరంగం .

      విశ్వామిత్రుడు ప్రార్థించినాడు . ఆ కొత్తవారి దర్శనమైనది . సావిత్ర కిరణము మూర్తిమంతమై ఎదురుగా నిలచింది . అయిదు ముఖములు . అద్భుతముగా , కేవలము కమల పత్రముల తోనే నిర్మించినట్లున్న ఆ రాగివర్ణపు దివ్య దేహము ,  అరుణ కాంతిని సంగ్రహించి అచ్చు పోసినట్లు కనిపించు పవిత్ర మూర్తి . ప్రతి ముఖము లోనూ మూడు మూడు కన్నులు . వెండిరేఖ వలెనున్న బాల చంద్రుడు శిరోభాగము నందు శోభిస్తున్నాడు . అనేక బాహువులు . అనేకాయుధములు . సజ్జనుల మనస్సువలె , చంచలమైననూ నిశ్చలమనదగిన జలరాశి పైన , మొదటి జాములో వెండి వెలుగు వచ్చినపుడు పరచుకొనెడు మంద్ర కాంతిని ప్రసరిస్తూ , ఆ దేవి కమలాసనములో కూర్చున్నది . 

      భగవానులు అర్పించిన పూజను గైకొని దేవి ప్రసన్న వదనముతో , ప్రసాదమును అనుగ్రహించుటకు సిద్ధముగా నున్నది . పూషుడు , " విశ్వామిత్రా , లోకమున అందరికీ మంత్రపు అనుష్ఠానము వలన  సాక్షాత్కారమై దివ్య దర్శనమగును . నీకు దివ్య దర్శనమయి మంత్రము లభించును . ఇంతవరకూ నువ్వు మంత్ర పతివి అయినావు : మంత్ర కృతుడివి అయినావు . ఇప్పుడు మంత్రద్రష్టవు కమ్ము . ఆదేవి స్వరూపమునూ , మహిమనూ ఆ దేవినే అడుగు. వేద పురుషుని స్త్రీ రూపమిది . ఈమెయే వేదమాత . ఈమె అనుగ్రహము లేనిదే వేద పురుషుని అనుగ్రహము లభించదు. మనమందరమూ ఈమెను చూడ గలిగినాము కానీ ఈమె ప్రభావమును పూర్ణముగా తెలియము . కాబట్టి దేవినే అడుగు . " అని విశ్వామిత్రుని స్పర్శించినాడు . 

      పూషుని ఆ దివ్య స్పర్శతో విశ్వామిత్రుని దేహము పులకితమైనది . అగ్ని సంస్పర్శతో కాగిన లోహము ఎర్రబడి తేజోమండలమై ఉద్దీప్తమగునట్లే , భగవానులు కూడా తేజోమండలమైనారు . ఒక్కొక్క రోమ కూపమూ ఒక్కొక్క నాలుకగా ఆ దేవిని స్తుతించుటకు సిద్ధమయినట్లు కాగా , వారి నోటి నుండీ స్తోత్ర రూపముగా  వాక్కు ,  ధారగా బయలువెడలింది . ఆ మహాదేవి అభయ , వరద ముద్ర లను చూపినది . తెరచిన పుస్తకమునుండీ చదువునట్లు , ఆనందముతో బాష్పిస్తున్న అశ్రువులు బాహ్య దృష్టిని కప్పివేస్తున్ననూ , అంతఃకరణము సూర్య కిరణములతో వికసిస్తున్న తామర వలె వికసించగా , భగవానులు ఆ వేదమాతను  స్తోత్రముతో కీర్తించినారు. 

      " దేవీ , నీకు నమస్కారము . సృష్టి కర్తయొక్క పరాశక్తివై లోకలోకముల నన్నిటినీ ఆవరించి కూర్చున్న ప్రాణ శక్తివైన నీకు నమస్కారము . వికసించిన తామరను ఆశ్రయించియున్న దళముల వలె , కర్మకాండకు ఆధారమైన విద్యలన్నీ నిన్ను ఆశ్రయించి యున్నందువలన , నిన్ను విద్వాంసులు ధర్మ స్వరూపిణి , ధర్మ సంవర్ధిని అని ఆరాధిస్తారు . వికసించిన పద్మము పరిమళమును వ్యాపింపజేయునట్లు , శుద్ధ బ్రహ్మ విద్యను అనుగ్రహించు నిన్ను తెలిసినవారు బ్రహ్మమయి అంటారు . విరిసిన తామర సుగంధములను కురిపించునట్లే , నీ అనుగ్రహముతో  సిద్ధుల వర్షము కురిపించు దానవు నిన్ను సిద్ధి ప్రదాయిని యనెదరు . సర్వ హృదయములందూ కూర్చొని సర్వమునూ ప్రేరేపించు సావిత్రీ దేవికి నమస్కారము . అందరి మనో బుద్ధులలో కూర్చొని  వృత్తులను పెంపొందించు సరస్వతీ దేవికి నమస్కారము . సర్వమునూ వ్యాపించి , మేము చేయు కార్యములను సఫలమగునట్లు చేయు గాయత్రీ దేవికి నమస్కారము . దేవీ , జగద్ధాత్రీ , నీ గొప్పదైన మనసుతో కృప గలిగి , దయచూపుము . లోకమునంతటినీ ఆర్యమయము చేయు మంత్ర రాజమును దర్శించి పలికెడు భాగ్యమును నాకివ్వు . బ్రహ్మర్షుల ఇష్టార్థము నెరవేరనీ . విశ్వమంతయూ ఉద్ధరింపబడు దారి నాకు కనబడనీ . " 

      భగవతీ గాయత్రీ దేవి , విశ్వామిత్రులు కీర్తించినట్లు , తన సావిత్రీ , సరస్వతీ , గాయత్రీ రూపములను చూపించినది . ఒకే ప్రణవము రెండుగా భిన్నమై పదహారై , ఇరవై రెండై , ఇరవై నాలుగై బ్రహ్మాండముల నన్నిటినీ ఆవరించియున్న రహస్యమును చూపించి , భూమ్యంతరిక్ష , ఆకాశములన్నిటా నిండిపోయిన తన నాద స్వరూపమును చూపించి , " వత్సా ! దీనిని అనుసంధానము చేసి నీదిగా చేసుకో . నువ్వు కృతార్థుడవైన గుర్తుగా , నీ నోటి నుండీ ఇరవై నాలుగక్షరాల , మూడు పాదముల  మంత్రము ప్రకటము కాగలదు . దానిని అనుసంధానము చేసి , దానిని కూడా నీదిగా చేసుకో . ఈ మంత్రానికి దేవత సావితృమే అయినా , పూషా దేవుని యనుగ్రహము వలన , నీకు మొదట నా దర్శనమైనందు వలన , నీ నోటి నుండీ వెలువడు మంత్రము ’ గాయత్రీ ’ అనే ప్రసిద్ధమగును . అంతేకాదు , గాయత్రి యనగా , విశ్వామిత్ర గాయత్రి అనే ప్రసిద్ధి అవుతుంది  . నువ్వు ఎవరికైననూ నన్ను దానము చేయి : నేను వాడిని కాపాడెదను . వాడిని ఆర్యుడను చేసెదను . మూడు వేదములకు అధికారిని చేసెదను . అయితే , ఇదిగో , ఇదే మాట . నన్ను దురుపయోగపరచిన వాడి వంశము ఎండిన వృక్షము వలె ఎండి పోవును " అని పలికి , బ్రహ్మణస్పతి  , పూషుల అనుమతిని కోరి  , విశ్వామిత్రునికీ చెప్పి , అతని పూజను పొంది అంతర్ధానమైనది . వారు కూడా పరమానంద భరితులై కృతకృత్యుడైన విశ్వామిత్రుని ఆనందాశ్రు పూర్వకముగా పొగడి , అతని పూజను పొంది మాయమైనారు . 

      విశ్వామిత్రులు జరిగినదానినంతటినీ , ఆవృత్తి చేస్తున్న విద్యార్థి వలె , మరలా మరలా జ్ఞాపకము చేసుకొంటూ , ముందరి కార్యమును గురించి ఆలోచిస్తూ , ఆనంద పరవశుడై అలాగే మైమరచి అక్కడే కూర్చున్నారు . 

Friday, August 17, 2012

అధిక మాసము , క్షయ మాసము ( మల మాసము )


అధిక మాసము , క్షయ మాసము ( మల మాసము ) 

      ఈ సారి భాద్రపద మాసమునకు అధిక మాసము వచ్చింది . ఇది రేపటి నుండీ ఆరంభమవుతుంది . అధికమాసమనగా యేమి , అధిక మాసములో యేమి చేయవచ్చును , యేమి చేయరాదు మొదలగునవి ఇక్కడ వివరించడమయినది 

అధిక మాసమును అర్థంచేసుకొనుటకు ముందు సౌర మాసము , చాంద్రమాన మాసము లను గురించి తెలుసుకోవలెను . 

     సౌర మాసము :  రెండు పక్క పక్క సంక్రమణములు మధ్య కాలమునే ఒక సౌర మాసము అంటారు . సంక్రమణమనగా , సూర్యుడు ఒక రాశిని వదలి , తరువాతి రాశిని ప్రవేశించు సమయము . కాబట్టి , సూర్యుడు ఒక రాశిలో ఎంత కాలముంటాడో ఆ అవధి ఒక సౌర మాసము . సౌరమాసపు పేరు , సూర్యుడున్న రాశిపేరుతోనే పిలుస్తారు . ఉదాహరణకు , మేష మాసము , వృషభ మాసము ..ఇలాగ. 

     సూర్యుడి చలనపు వేగము దినదినమూ మారుచుండుట వలన అన్ని సౌర మాసములందూ కాలావధి ఒకటేగా ఉండదు . హెచ్చుతగ్గులు ఉండును . సంవత్సరానికి పన్నెండు సౌర మాసాలుండును . 

     చాంద్రమాన మాసము : రెండు అమావాశ్యల , లేదా రెండు పౌర్ణముల మధ్య కాలమును చాంద్రమాన మాసము అంటారు . అమావాశ్య , / పౌర్ణమి ముగిసినపుడు మాసము కూడా ముగుస్తుంది . అమావాశ్యను గణనకు తీసుకుంటే దానిని  ’ అమాంత మాసము ’ అనీ , పౌర్ణమిని గణనకు తీసుకుంటే దానిని ’ పౌర్ణిమాంత మాసము ’ అంటారు . 

     గుజరాత్ , మహారాష్ట్ర , కర్నాటక , కేరళ , తమిళనాడు , ఆంధ్ర ప్రదేశ్  మరియు బెంగాల్ లలో అమాంతమూ , మిగిలిన రాష్ట్రాలలో పౌర్ణిమాంతమూ వాడుక లో ఉంది .

     అధిక మాసము :  సామాన్యముగా ప్రతియొక్క చాంద్రమాన మాసపు కాలావధిలోనూ ఒక సంక్రమణము ఉంటుంది . అయినా కూడా , సగటు మీద ప్రతి రెండున్నర సంవత్సరాల కొకసారి ఏదో ఒక చాంద్రమాన మాస కాలావధిలో సంక్రమణమే ఉండదు . ఆ చాంద్రమాన మాసమును ’ అధిక మాసము  అంటారు . దాని తరువాతి మాసానికి ’ నిజ మాసము ’ అంటారు . ఈ అధిక-నిజ మాసాలు రెంటికీ ఒకే పేరు . అంటే , ఉదాహరణకు  ఈసారి భాద్రపదము అధిక భాద్రపదము , నిజ భాద్రపదము అని రెండు సార్లు వస్తుంది . 

     ఇలాగ అధిక మాసము వచ్చినపుడు ఆ చాంద్రమాన సంవత్సరములో పదమూడు మాసాలుంటాయి . సరళము గా చెప్పాలంటే , చాంద్రమాన సంవత్సరము , సౌరమాన సంవత్సరము కన్నా పదకొండు రోజుల తక్కువ కాలావధిని కలిగియుంటుంది . దీనిని సరిచేయుటకే రెండున్నర సంవత్సరాలకు ఒకసారి అధిక మాసమును చేరుస్తారు . అలా చేర్చుటకు , ఎప్పుడంటే అప్పుడు కాక , సంక్రమణము లేని మాసము అన్న నియమము ఉంది . 

     క్షయ మాసము : ఒకోసారి , ఒకే చాంద్ర మాన మాసములో రెండు సంక్రమణములు వస్తాయి . ఆ చాంద్రమాన మాసమును క్షయ మాసము అంటారు. క్షయ మాసము కార్తీక , పుష్య మరియు మాఘ మాసములలో మాత్రమే సాధ్యము . క్షయ మాసము వచ్చినపుడు , ఆ మాసమూ , దాని తర్వాతి మాసమూ కూడా కలసి పోయినట్లు పరిగణించి ఆచరిస్తారు . దీనికోసము , తిథిలో నున్న రెండు కరణములలో మొదటిది క్షయ మాసానికీ , రెండోదానిని తర్వాతి మాసానికీ చేరినట్లు భావించి ఆచరిస్తారు . క్షయ మాసమున్న సంవత్సరములో పదకొండు మాసాలే ఉండాలి . కానీ , ఆ సంవత్సరములన్నిటిలోనూ తప్పకుండా ఒక అధిక మాసము వస్తుంది కాబట్టి , మొత్తం మీద పన్నెండు మాసాలుంటాయి . క్షయ మాసము 141 సంవత్సరాలకొకసారి సంభవిస్తుంది . అరుదుగా , 19  సంవత్సరాల కొకసారి వస్తుంది . 

     ఇక , ఇంకో సిద్ధాంతము ప్రకారము , సావన వ్యవస్థ అని ఉన్నది . దీనిని ’ బ్రహ్మ సిద్ధాంతము ’ అంటారు . దీని ప్రకారము , బ్రాహ్మణునికి అమావాశ్యతో ముగియునది మాసము . వైశ్యునికి పౌర్ణమితో ముగియునది , రాజులకు సంక్రమణముతో ముగియునది మాసము . 

అధిక మాసము , క్షయ మాసము ఏది వచ్చినా దానిని సామాన్యముగా ’ మల మాసము ’ అంటారు . 

     మలమాసములో నిత్య నైమిత్తిక కర్మలు ( సంధ్యావందనము , ఉపాకర్మ ,  ఔపాసన , బ్రహ్మ యజ్ఞము , తర్పణము ,శ్రాద్ధము వంటివి ) తప్పక చేయాలి . హోమాగ్ని నాశనమైనచో దానిని తిరిగి కూర్చుట , దేవతా ప్రతిమకు అర్చనా సంస్కారాలు లోపించిన తిరిగి ప్రతిష్ఠాపన చేయుట , నైమిత్తికములని చెప్పబడినవి . పాత గృహముల పునరుద్ధరణ ( రిపేరీలు ) చేయవచ్చును . 

సీమంతము , అన్న ప్రాశన వీటిని వదలరాదు . అంటే చేయవచ్చును . 

     తిథి వార నక్షత్రములతో చెప్పబడిన కామ్య కర్మలు , శుభ కార్యములు చేయరాదు . ఈ నిషేధము ఎలాగంటే , ఆ నెలలో మొదలుపెట్టి , అదే నెలలోనే పూర్తి చేయుట కూడదు . అధిక మాసములలో యజ్ఞములు ఆరంభించి ముగించుట కూడదు . ఎందుకంటే అక్కడ సంక్రమణములేక సూర్య మండలము తపిస్తున్నది యని . 

పైవి జాబాలి చెప్పినవి .

ఇక శ్రాద్ధముల విషయము   ----కాలాదర్శమందు ఇలా ఉంది 

     సపిండీకరణము తో ముగిసే పన్నెండవరోజు కర్మ , గ్రహణ కర్మ , జన్మ కర్మ , సీమంత పుంసవనముల యందలి శ్రాద్ధము , సీమంతము , పుంసవనము , జాత కర్మ , రోగ శాంతి , అవకాశము లభించని శ్రాద్ధము , వ్రతములు , నిమిత్తం వల్ల ఏర్పడ్డ ప్రాయశ్చిత్త కర్మ---వీటిని పూర్వపు మల మాసములోనూ , తర్వాత శుద్ధమాసములోనూ చేయాలి . ఆబ్ధికమందలి ఉదకుంభ దానము , మన్వాది, మహాలయము నందూ , యుగాదులయంద్ అమావాశ్యలయందు చేయాల్సిన నిత్య శ్రాద్ధ కర్మ , ఊనాది మాసిక శ్రాద్ధములు , మలమాసం లో చేయాలి . అధికేతర మాసాల్లో మరణించిన వారి ఆబ్ధిక శ్రాద్ధాలు చేయునపుడు , ఇదివరకే చూచిన తీర్థములందు చేయాలి . మన్వదుల యందలి దానము , నిత్య దానము ( తిల , గో , హిరణ్య దానములు ) , సంధ్య , ఉపసన కర్మ , సర్వ హోమము , అగ్రయణము , పర్వమందు సగ్నిక ఇష్టి , నిత్యాగ్ని హోత్ర హోమము , దేవత , అతిథుల పూజలు , స్నానవిధిగా స్నానము , చేయాలి . నైమిత్తిక తర్పణము నిత్యమైనది కాబట్టి వదలకుండా చేయాలి . 

     నిర్ణయామృతము ప్రకారము , మల మాసములో శ్రాద్ధ దినము వ్యర్థము గాకుండా ఉండేందుకు , పితరులనుద్దేశించి , బ్రాహ్మణులకు భోజనము పెట్టి , తర్వాత శుద్ధ మాసము వచ్చినపుడు సపిండ శ్రాద్ధము చేయాలి . సంక్రమణము లేకున్న పిండ రహిత శ్రాద్ధం , సంక్రమణమున్న , పిండ సహిత శ్రాద్ధం. ఈ రకంగా  రెండునెలల్లోనూ చేయాలి .

మలమాసములో విడువ తగినవి ( చేయకూడనివి ) 

     నిత్యం కాని కర్మ , నైమిత్తం లేని కర్మ , మహా దానము , అగ్న్యాధానము , యజ్ఞము , పూర్వము చేయని ( కొత్త )--- తీర్థ యాత్ర , దైవ దర్శనము , దేవత , తోట , చెరువు --మొదలగు వాని ప్రతిష్ఠ , ఉపనయనము , సన్యాసాది ఆశ్రమ స్వీకారము , కామ్య వృషోత్సర్గము , రాజ్యాభిషేకము , మొదటి పుట్టు వెంట్రుకలు , వ్రతాలు , గృహారంభము , గృహ ప్రవేశము , వివాహ నామకరణాలు , దేవోత్సవము , వ్రత ఆరంభ-సమాప్తులు , సర్పములకు బలి , అష్టకా శ్రాద్ధము , ఈశాన బలి , విష్ణు శయనము , దుర్గ ఇంద్ర స్థాపనలు , ఉత్థాపనలు , సమస్త కామ్య కర్మములు , ప్రాయశ్చిత్తాలు , అభోజ్య భక్షణము , అపేయములు --ఇవన్నీ మలమాసం లో చేయరాదు . 

మలమాసములో వర్తించునవి , శుక్ర , గురు మౌఢ్యములలో కూడా వర్తిస్తాయి . 

65. " మంత్ర ద్రష్ట " అరవై ఐదవ తరంగం .



అరవై ఐదవ తరంగం .

     విశ్వామిత్రులు తపస్సు సాగిస్తున్నారు . ఉదయము బ్రాహ్మీ ముహూర్తానికి సరిగ్గా శ్వాస నిరోధము చేసి ప్రాణ దేవుని దర్శనము చేసి అతని అనుమతి పొంది ప్రాణాగ్ని హోత్రమును ప్రారంభించినారు . ప్రాణ పంచకములు కూడా అగ్నులై కూర్చొని మండుతున్నాయి . 

     క్రమముగా జ్వాలలు దేహము నుండీ బయటికి వెలువడుట మొదలైనది . శాంతమై , హితముగా నున్ననూ , ఇతరులకు సహించుటకు అసాధ్యమై ఆ జ్వాలా మండలము నదీతీరము నుండీ నదీ జలాలకూ వ్యాపించుతుండగా , భగవానులు , ప్రాణ దేవుడిని అనుసంధానము చేసుకొని అతనికి ఈ విషయమును నివేదించినారు , " దేవా , నా పేరు విశ్వామిత్రుడు . నీ దయ వలన నా పేరు సార్థకము కావలెను . ఇప్పుడు జరుగుతున్న అగ్నిహోత్రపు ఫలముగా , ఈ దేహము నుండీ జ్వాలలు ఎగసి పడుతున్నవి . ఈ జ్వాలలు నాకు హితమైనవి . నాకు శాంతములుగానే కనిపిస్తున్నవి . అయినా నీరు కాగుతున్నది . కాగిన నీటనున్న ఈ జల చరములకు అప్రియమైనటులే , ఇక ముందు ఖేచర , భూచరములకూ అప్రియము అవనున్నవి . విశ్వానికి బ్రాహ్మణ్యమును సంపాదించుటకు బయలుదేరిన నానుండీ మొదటగా కలుగ వలసిన ఉపకారము  ఇతరులకు అప్రియమా ?  అందు వలన దీనిని తప్పించవలెను . " 

     ప్రాణ దేవుడు నవ్వినాడు , " భగవాన్ విశ్వామిత్రులు ఒక దహించని అగ్నిని వెదకుతున్నారు . కానిమ్ము , దానికీ ఒక దారి ఉంది . ఇకపైన , ప్రాణాగ్ని పంచకమును పంచకముగా ధ్యానించక , ఏకాండముగా ,  సమిష్టిగా ధ్యానము చేయండి . అలాగ ఏకాండముగా చేసిన ధ్యానము సత్త్వముగా పరిణామము చెంది , సర్వ హితమవుతుంది . " అని అనుజ్ఞ యయినది . 

     భగవాన్ విశ్వామిత్రులు ఏకాండ ధ్యానమును ఆరంభించినారు . మొదట ప్రాణ దేవుడిని సాక్షాత్కరించుకొని , అతని అనుమతితో పంచకమును చూచి , వారిని యథావిధిగా అర్చించి , వారి అనుమతితో వారు ఐదుగురినీ సమిష్టిగా అర్చించినారు . ఐదు అగ్నులూ చేరి కూడి ఒకటే అగ్ని అయినది . అగ్ని ధ్యానములో విశ్వామిత్రులు బాహ్య ప్రపంచమును మరచి కూర్చున్నారు . 

     అలాగ ఎంతోసేపు ఏకాంతముగా కూర్చొని ఉండగా ,  హఠాత్తుగా వారిని ఎవరో కుదిపి లేపినట్లాయెను . కనులు తెరచి చూస్తే , ఒకరు , వృద్ధులు కాకున్ననూ వృద్ధుల తేజస్సు ఉన్నవారు ఎదుట నిలిచున్నారు . దేహమంతయూ పోతపోసిన వెండి ముద్దలాగా ఉంది . కళ్ళు రెండూ , రెండు తెల్లటి వజ్రఫలకములపై రెండు గోమేధికములను తాపినట్టున్నాయి . కొండ శిఖరమునందున్న సరోవరపు తేటదనమూ , నిర్మలత్వమూ , ప్రసన్నతా , గాంభీర్యమూ ఆ కళ్లలో గూడుకట్టుకొని ఉండి , చూచువారి నందరినీ యనుగ్రహించు అనుగ్రహ మూర్తి వలె నున్నారు . ఎక్కడో చూసినట్లే ఉన్నారు . అలా చూస్తుండగా , విశ్వామిత్రునికి అది ఒక దివ్య దేహమని అర్థమయింది . ఎవరు ? ఏమిటి అన్న ఆలోచన తరువాత చేయవచ్చు అనుకొని , తత్క్షణమే మానస పూజ ఒనర్చినారు . ఈ సారి విచిత్రమేమనిన , వీరు సంకల్పము చేసి నోటినుండీ మాట వచ్చునంత లోపలే , అక్కడ , ఆ కార్యానికి కావలసిన సాధనములన్నీ సమకూరి ఆయా కార్యములై , పూజ సమాప్తి యగుటను కళ్ళు చూస్తున్నవి .

     పూజను గైకొని , ఆ వచ్చినవారు , " భగవానులకు ఆయాసమై ఉండాలి . లోకానుగ్రహము చేయనున్నవారికి కూడా  ఆయాసము తప్పలేదు కదా " అని ఆరంభించినారు . 

     విశ్వామిత్రులకు , ఈతడే క్షేత్ర పతి యైన బృహస్పతి అయి ఉండవలెను అనిపించినది . అదీకాక , వెనుక ఒకసారి చూసిన జ్ఞాపకము , ’ తప్పక అతడే ’  అన్నది . పలకరించినారు , " దేవగురువులకు సుఖాగమనమైనదా ? "

     బృహస్పతి నవ్వుతూ అన్నారు , " భలే విశ్వామిత్రా , జాడను పట్టుకోగల ఘటికుడవైనావు . నువ్వేమో కనులు మూసి కూర్చున్నావనుకున్నావు . నీ ప్రతాపమును చూచినావా ? " 

     దేవగురువు చూపించిన చేతివెంటే తిరిగిన కనులు , తన వలెనే ఉన్న వందలాది ప్రతి కృతులు తనవలెనే తపోనిష్ఠులై కూర్చున్నది చూచాయి . ఒకటే గరిక గడ్డి సర్వతో ముఖమై , వ్యాపించిన అన్ని దిక్కులలోనూ వేర్లూని ఒక్కొక మూలమైనట్లే , కోవిల దుంపలూ , చిలగడ దుంపలూ వేరులు వ్యాపించి పోయి ,  కణుపు కొక గడ్డ అగునట్లు ,  చుట్టుపక్కల అంతా తన ప్రాణమే ప్రవహించి అక్కడొకటీ అక్కడొకటీ తన ప్రతి బింబమై కూర్చొని యుండుట చూసి విశ్వామిత్రులకు అంతులేని ఆశ్చర్యమైనది . 

     విస్మయావేష్టులై మౌనులైపోయిన భగవానులను దేవగురువులే మరలా మాట్లాడించినారు : " సుఖాగమనమా ? అని అడుగుతున్నావు . నేను ప్రతి శుద్ధ పంచమి దినమూ ఇక్కడికి వచ్చి వెళ్ళుట వాడుక యైనది . కడచిన సారియే నేను దీనిని గమనింపవలసినది . చూచెదము అనుకొని వెడలిపోతిని . ఇప్పుడు , ఇదేమిటి , ఈ క్షేత్రమంతయూ నీదే అయిపోయినదా ? ఇతరులు వచ్చుటకు కూడా అవకాశము లేకుండా నీ ప్రాణ శక్తివ్యూహము పరచుకొని కూచున్నావే ? మిగతా వారు ఈ పుణ్య నదీ స్నానానికి కూడా రాకూడదేమి ? " 

     విశ్వామిత్రులు దేవ గురువులు చూపిన దృశ్యము , ఆడిన మాట , రెంటికీ ముగ్ధులై " దేవా , ఎంతైనా మానవులు అల్ప బుద్ధులు . సంకల్పము లేకుండానే , తమకే తెలియకుండానే  అపరాధము చేయు జాతి ఇది . క్షమించవలెను . " అని చేతులు జోడించారు .

     " అటుల కాదు , అపరాధము చేయుటకు శక్తి ఉన్నందువల్లనే  మీవల్ల ఉపకారము కూడా కాగలదు . మనుష్యుడు స్వతంత్రుడనని అనుకొని స్వేఛ్చగా ఉద్యుక్తుడైతే అప్పుడది అపరాధము . వెనుక ముందులు చూచి కార్యపరుడైతే స్వసంకల్పుడి కన్నా హెచ్చుగా , ఆజ్ఞాతుడైనపుడు వాడి వలన లోకానికి ఉపకారము .  నీ సందేహము అర్థమైనది , ప్రేరకులు మేమే ! దేవతలు ప్రేరేపించనిదే యే కార్యమూ నడవదు . అయితే , మాది కనబడని చేయి . అదుండనీ , విశ్వామిత్రా , నువ్వు మొదట నన్ను ఈ నీ ప్రాణశక్తి వ్యూహము నుండీ దాటించు . ఇది నన్ను పట్టి నిశ్చేష్టుడిని చేసినది . నేను దీని వలననే నీకు అంతరాయము కలిగించినది . " 

" అది కూడా తమరే నేర్పించవలెను కదా ! " 

     " ఔను , ఇప్పుడు ప్రాణ ధ్యానము చేస్తున్నావు కదా , అది నీ హృదయము నందు జరుగుతున్నది . అది ముఖ్య ప్రాణ ధ్యానము . ఈ ముఖ్య ప్రాణుడి ధ్యానము వలననే నీకు ఇలాగు ప్రతిసృష్ఠి కర్త అగుటకు యోగ్యత వచ్చినది . అయితే , ఇది నువ్వు వెనుక అనుకొన్నట్లు సంకల్ప ప్రభావము కాదు . ప్రాణము బలీయమై బయట పడి , భూత పంచకముల తన్మాత్రలను అన్ని వైపులనుండీ పీల్చి వేసి వేరే మూర్తులైనది . ఈ ముఖ్య ప్రాణ ధ్యానము నుండీ ఇంకా ముందుకు వెళ్ళి మూల ప్రాణ ధ్యానమును చేయి . అప్పుడు ఈ ప్రాణ విజృంభణము ఉపశాంతమవుతుంది . నేను కూడా విడుదల అవుతాను . " 

     విశ్వామిత్రులు మరలా ధ్యానారూఢులయినారు . ప్రాణ దేవుని సాక్షాత్కరించుకొని , దేవగురువు యొక్క అనుజ్ఞను తెలియజేసినారు . ప్రాణదేవుడు నవ్వుచూ , అన్నాడు , " ఇటుల అగునని నాకు తెలిసి యుండినది . దేవగురువులే వచ్చి చెప్పినది కడు రమ్యముగా నున్నది . మన ముందరి కార్యమంతా సుముఖమైనది . ఇప్పుడు మూల ప్రాణుడిని ధ్యానించు . అయితే ఒక హెచ్చరిక . దేహాద్యంతమూ ధ్యానముండవలెను . ఇంతవరకూ హృదయపు చుట్టూ ఉన్న నూటొక్క నాడులలో మాత్రమే నన్ను ధ్యానించినావు . ఇప్పుడు దేహాద్యంతమూ ధ్యానము నడవవలెను . దానికి ముందు దేవ గురువుల యనుమతి కోరు . అతని వలన ఇంకొక రహస్యము నీకు తెలియవలెను . అది తెలియనిదే ఈ మూల ప్రాణ ధ్యానము అసాధ్యము . " 

     భగవానులు ప్రాణ దేవుల యనుజ్ఞను దేవ గురువులకు తెలిపినారు . వారు నవ్వుతూ , " మంచి పనే ! నేనుగా వచ్చి నీకు చిక్కుకు పోయి దేవ రహస్యములను నీకు తెలుపవలసినట్లాయె కదా ! " అన్నారు .

     " దేవా , నిజము . నువ్వుగా వచ్చి దొరికినావు కదా , కృపతో మీ రహస్యములనన్నిటినీ తెలియజేయక పోతే ఇంకెవరు తెలియజేస్తారు ? బ్రహ్మర్షి పరిషత్తు అనుమతి నిచ్చింది . అందుకే నేను వచ్చినది . పెద్ద మనసు చేయవలెను ." 

     " అది కాదయ్యా , నీ మాట నీదే గానీ , నేను చిక్కుకున్న విషయము నీకు పట్టినట్లు లేదు . ఇక్కడ చూడు , నీ ప్రాణ శక్తి ,  నీ తపోబలముతో బలపడి నాగ పాశములై నన్ను బంధించి వేసినది . దీని నుండీ నన్ను విడుదల చేయవయ్యా అంటే పరిషత్తు అనుమతి అంటున్నావే , నీకిది న్యాయమా ? " 

     " ప్రభూ , నీకు నువ్వే విడుదల కాగల ప్రభువూ నువ్వే అయి , నాతో ఆటాడుచున్నావా ? ఏమి చేయవలెనో అనుమతి నివ్వు . చేయుటకు సిద్ధముగా నున్నాను . "

     " అటులనే విశ్వామిత్రా , నువ్వు పేరుకే కాదు , మనోభావము వలననూ విశ్వానికి ఆమిత్రుడవై యున్నావని నీకు చెప్పుచున్నాను . ఇదిగో , ఆ దేవరహస్యము విశ్వానికి ఆర్యత్వమును కరుణించును . అయితే ఒక హెచ్చరిక . దీని శుద్ధ మనస్కుడూ , శుద్ధ బుద్ధి గలవాడూ మాత్రమే జీర్ణించుకోగలడు . ఇతరులకు ఇది కరగతమైననూ ఫలించదు . దీనికి నువ్వు అంగీకరిస్తావా ? " 

" దేవా , దేవతలు తమ రహస్యమును కాపాడుకొనుటకు సమర్థులై యుండగా , నా అంగీకారముతో కాగల పనియేమున్నది ? " 

     " అది కూడా ఒక రహస్యము . విశ్వామిత్రా , నువ్వు ఈ రహస్యమును భేదించు పరమర్షివి . నువ్వు ఇట్టి నా నిబంధనకు ఒప్పుకున్న , ముందు ముందు ఎవరైనా నీ మంత్రమును దురుపయోగము చేసిననూ , దానికి వారే బద్ధులవుతారు . అటులకాక , బంధ విమోచనము చేసి మంత్రమును నువ్వు పొందినా , దానిని ఎవరైనా దురుపయోగ పరచినపుడు , దానికి నువ్వే బాధ్యుడవు అవుతావు . అదీకాక , బంధవిమోచనమైన మంత్రమును మేము ఇవ్వము . అందువలనే, ఉపనిషత్తులో ఉన్న ధర్మాలలో తనదాక వచ్చు వరకూ ఉపనిషత్తు సిద్ధి కాకుండునది . " 

     " ప్రభూ , స్పష్టముగా చెప్పి అనుగ్రహించండి . ఇప్పుడు మీరు నాకు దయచేయు మంత్రమేది ? ఏ నిబంధనలతో దానిని అనుష్ఠానము చేయవలెను ? దాని సిద్ధి ఏమిటి ? " 

     " విశ్వామిత్రా , పరిషత్తు నీ ద్వారా అన్వేషించుచున్నది గాయత్రమను మంత్రము . దానిని అనుష్ఠానము చేయుటకు విశ్వామిత్రుడై  యుండవలెను . అది వాడిని బ్రాహ్మణుడిని చేయును . బ్రాహ్మణమన్న నేమి యని అంటావేమి ? అదికూడ చెప్పెదను విను . ఇప్పుడు మనుష్యులందరూ ఆగ్నేయులు . అనగా , ఎల్లప్పుడూ ఈ దేహమునకు అన్నపానాదులు కావలసియే యుండును . దానితో పాటు , గంధర్వులూ , సోముడూ మానుష దేహములో ఇల్లు కట్టు కొని యుండెదరు. గంధర్వుల వలన కామమూ , సోముడి వలన సంగ్రహమూ ( బాగుగా గ్రహించుట ) ప్రబలమై ఉంటాయి . గంధర్వులూ , సోముడూ , అగ్నియూ కట్టిన ఇల్లు ఈ మనుష్య దేహము . వీరు ముగ్గురి ప్రభావమునూ మీరి , అనగా , కామమునూ , సంగ్రహమునూ భోగమునూ దాటినవాడు బ్రాహ్మణుడు . దీని కోసము , ప్రాజాపత్య వ్రత రూపమైయున్న బ్రహ్మచర్యమే నిబంధనము . బ్రహ్మ చారిగా ఉండి ఈ మంత్రమును అనుష్ఠానము చేసిన వాడిని గంధర్వ , సోమ , అగ్నులు కట్లు విప్పి అనుగ్రహిస్తారు . ఇదే వృద్ధి . ఇంతటివాడే ఆత్మోద్ధారము చేసుకున్నవాడు . వీడివలన విశ్వపు ఉద్ధారము . సిద్ధముగానున్నావా ? " 

" ఉన్నాను " 

" సరే , నువ్వు విశ్వోద్ధారము చేయువాడివి కాబట్టే నీకు విశ్వామిత్రుడని మేము పేరు పెట్టినది . అది ఇప్పుడు సార్థకమయినది ... " 

" ఆ పేరు నేనే పెట్టుకున్నది కాదా ? " 

     " భగవాన్ , చూచితిరా దేవతల చేతివాటము ? వారు మీ మనసులో  వెనుక ఉండి , సూత్రధారులై సూత్రములను లాగుచుందురు . మీ మనుష్యులు ఆ ప్రేరణను తెలుసుకోక , మీరే సంకల్పము చేయగల వారికన్నా హెచ్చుగా మిడిసి పడుతారు . ఇప్పుడు చూడు , వశిష్ఠులే నేరుగా నిన్ను కావేరీ తీరములో తపస్సు చేయమని ఎందుకు చెప్పలేదు ? వారెందుకు భగవాన్ అగస్త్యులను చూడమన్నది ? వారెందుకు నన్ను పిలచి , ఇతడికి కావలసినది ఇవ్వండి అని అడుగలేదు ? నా క్షేత్రమునకు నిన్నెందుకు పంపించినారు ? నువ్వూ , లోపా ముద్రా , అగస్త్యులూ మాట్లాడుకున్న దినమే నీ విషయము అంతా నా మనసుకు తెలిసినది . నీ ప్రాణ శక్తి వ్యూహములో నేను చిక్కుకున్నాను కదా , ఇది కూడా మా ఆటే ! ఇదిగో చూడు , నేనే విడిపించుకోగలను . అయితే , నేను నీ వ్యూహమును ఛేదించితే మరలా నువ్వు వ్యూహమును కట్టలేవు . అందుకని నువ్వే విడిపించాలి అంటున్నాను . ఇది నీ చేత కాదన్నదీ నాకు తెలుసు . చూడు , ఇప్పుడు హృదయపు చుట్టూ ఉన్న నూటొక్క నాడుల ధ్యానము చేస్తున్నావు . దేహాద్యంతమూ ఆ ధ్యానము నడవనీ . పూషుడిని ధ్యానించు . పూషుడి అనుగ్రహము వలన దేహాద్యంతమూ ఉన్న నాడీ చక్రములన్నీ శుద్ధమై ప్రాణ శక్తిని ధరించుటకు సిద్ధమూ , శక్తమూ అవుతాయి . అటుల శుద్ధమైన నాడీ మండలము ,  నీ మహా ప్రాణ ధ్యానము వలన సృష్ఠియైన ప్రాణ శక్తిని ,  ధారణ చేయ గలదు . ప్రాణ శక్తిని సృష్ఠించునది , మహా ప్రాణ ధ్యానమే ! అటుల సృష్ఠియయిన శక్తిని బయటికి వదలక , దేహములోనే సంగ్రహించి ధారణ చేయునదే మూల ప్రాణ ధ్యానము . నువ్వు ఆ మూల ప్రాణమును పట్టుకోవలెనన్న , పూషుడి అనుగ్రహము కావలెను . ఇదిగో చూడు , పూషా దేవుడు వచ్చియున్నాడు . " 

     విశ్వామిత్రులు పూషుని దర్శనము చేసినారు . హిరణ్య వర్ణపు గుర్రములవలె ఉన్న మేకలను కట్టిన హిరణ్మయ రథములో కూర్చున్న కపర్దియైన ఆ మహా పురుషుని చూస్తుండగనే దేహాద్యంతమూ నాడీ చక్రములన్నీ దారి వదిలినాయి . ఇక , పూషా దేవుని పూజ ముగియుచున్నట్లే ప్రతి కృతులన్నీ నూనె నిండుకుని కొండెక్కిన దీపాలవలె అస్తమయమైనవి . విశ్వామిత్రుల దేహములో ప్రాణ శక్తియొక్క సంచయమగుట వారికే బాగుగా అర్థమయినది . బృహస్పతి చెఱ తొలగింది . 

     పూషుడు విశ్వామిత్రులను కృపా దృష్టితో చూసి " బ్రహ్మర్షులకు నావలన ఏమి కావలెను ? " అని అడిగినాడు . వారు వినయముతో బ్రహ్మర్షి పరిషత్తు కోరికను ఈడేరునట్లు చేయమని ప్రార్థించినారు . పూషుడు సుప్రసన్నుడై , మందహాస సుందర వదనముతో అన్నాడు , " దేవ గురువులు చెప్పినట్లు ఈ విషయములో నిబంధన రహితముగా మంత్రమును ఇచ్చుట లేదు . దీనికి ఒప్పుకుందురా ? " 

" అది ఇచ్చువారి ఇష్టము . మీరు ఇచ్చుదానిని మీకు తోచినట్లు ఇచ్చెదరే గానీ , మాకు తోచినట్లు ఇచ్చుట ఉందా ? " 

     " సరే , ఇక్కడ చూడు , ఇప్పుడు నీ దేహము ప్రాణ కోశమైనది . ఇలాగ ప్రాణ కోశమైతేనే నీకు మూలప్రాణుడి దర్శనమగునది . ఆ మూల ప్రాణుడు ప్రతి దేహము లోనూ ఉన్నాడు . అతడు వచ్చి కూర్చొను వరకూ గర్భములోని ప్రాణి దేహము పెరగదు . అతడు రావలెనని అనుకుంటున్నపుడే అగ్ని ష్టోమ శక్తులు భిన్నములై స్త్రీ గర్భమును చేరి అక్కడ తమ కార్యమును ఆరంభిస్తాయి . బాహ్యముగా సమిష్టి స్వరూపమై యున్న ఇతడే సవితృ నామధేయముతో సూర్యుడిలో నిలచి స్థావర జంగములకన్నిటికీ ఆత్మయై ఉంటాడు . అతడు తనలోపల నిలచి సర్వమునూ నడపుచుండుట చూచి అతని ఇఛ్చకు తనను అర్పించుకొన్న వాడు బ్రాహ్మణుడగును . ఉదయాస్తమయములలో , మిట్ట మధ్యాహ్నములో సూర్యుడిలో నున్న సావిత్రాంశము ప్రకటమవుతుంది . దానిని గ్రహించి తనలో నింపుకొను వాడు బ్రాహ్మణుడు . చూడు , జ్ఞాపకము ఉంచుకో , మూడు సంధ్యలలో గ్రహణము చేయక పోతే , మరలా మిగిలిన వేళలలో గ్రహణము చేయుట కష్ట మగును . దీనికంతటికీ సిద్ధముగా ఉన్నావా ? " 

" అటులనే " 

     " సరే , చూడు , సూర్య మండలపు మధ్యవర్తి యైన సవితృ దేవుని బాహ్య చక్షువులతో చూస్తూ , అక్కడినుండీ వెడలు ఆ హిరణ్మయ తేజస్సును నీ హృదయములో నింపుకొని , అది దేహాద్యంతమూ వ్యాపించునట్లు చేయి . దేహములోనున్న అంగాంగములు మాత్రమే కాదు , రోమకూపములన్నిటా ఈ తేజస్సు నిండనీ . అక్కడ నడచు కార్యములన్నీ ఈ తేజస్సు వల్లనే నడచునని తెలియునా ? ఇలాగు , పిండాండములో నడచినట్లే బ్రహ్మాండములో కూడా నడచును . ఇప్పుడు చెప్పు , నీకు కర్తృత్వము ఉంటుందా ? " 

" లేదు " 

" ఇప్పుడు నువ్వు ఏమి చూస్తున్నావు ? " 

" దేవా , దేహమంతా అనిర్వచనీయమయిన ప్రకాశముతో నిండినది . "  
" ఆ ప్రకాశపు మూలము ఎక్కడుందో వెదకి చూడు " 

" మూలము నాభిలో ఉంది . అది హృదయములో ప్రకటమగుచున్నది " 

     " సరే , అదే ! ఆపోజ్యోతి . చూడు . అది మండు చున్ననూ , దానిలో వెలుగుందే తప్ప వేడిమి లేదు . ఇది బ్రాహ్మణుని లక్ష్యము కావలెను . ఇంకా ఒక అడుగు ముందుకు వేయి . సవితృ మండలమును చూడు . అక్కడ ద్విదళ ధాన్యము లలో అణగియున్న అంకురము వలె , ఇటువైపు అగ్నిమండలపు ఎరుపు , అటు సోమ మండలపు నీలిమ - వీటి మధ్య సూక్ష్మముగా పీత వర్ణములో కనిపిస్తున్నదే , అదే సవితృ మండలము . చూడు , నువ్వు చూస్తుండగనే అది నీకు అభిముఖముగా కిరణమును ప్రసరించును . ఆ కిరణమే సావితృము . దానిని పట్టి నువ్వు మూల ప్రాణమునకు తెచ్చి , మూల ప్రాణము నుండీ మహా ప్రాణమునకు తెచ్చి , అక్కడినుండీ ప్రాణ మండలమునకు తెచ్చి , అక్కడినుండీ దానిని ఉదాన వాయువులో వహించు . ఆ ఉదానము ఆ తేజస్సును శబ్ద మాత్రముగా పరిణమింపజేసి , పలుకుతుంది . ఆ శబ్దమే వాక్కై , మంత్రమై , ఆ మంత్రము లోకోద్ధారము చేస్తుంది . జాగ్రత్త !  అయోగ్యుడికి ఇచ్చిన మంత్రము ఇచ్చిన వాడిని చంపుతుంది . పాత్రులకు దానిని ఇస్తే , అది రెండు కొనలనూ కాపాడును . " 

" దేవా , అపాత్రుడిని అనుగ్రహించు శక్తి ఆ మంత్రానికి ఇవ్వు " 

" భలే , విశ్వామిత్రా , భలే . జాగ్రత్తగా ఉన్నావే ! ..సరే , ఇప్పుడు చెప్పు , నీ నోట వచ్చిన ఈ మాట నీదేనా ? "

" కాదు , బృహస్పతి పలికించినది " 

     " భలే , భలే . ఇలాగే ఆరంభమునుండీ అంత్యము వరకూ సర్వ భావనలూ ప్రచోదితములే అనునది తెలిసి , దేహ , కాల , ఆహార , సంగ , ధర్మములతో ప్రచోదితమైన దానిని వదలి , ఆత్మ హితము కోసము , లోక హితము కోసము వచ్చు ప్రచోదనమును పట్టి కార్యము చేయువాడు బ్రాహ్మణుడు . ఇంతటి బ్రాహ్మణుడిని మా దేవతలము కూడా బలిదానముల చేత ఆరాధించెదము . అతడు కామ వశుడై స్వఛ్చంద వర్తనుడగు వరకూ విశ్వ దేవతలందరూ అతని దేహమునందుంటారు . మేము ఎప్పటికీ పరోక్ష ప్రియులము . మమ్ములను దర్శించవలెనంటే మాకు బలిదానము ఇవ్వ వలెను . మమ్ములను వరము కోరవలెను . దీనినంతటినీ నియమముగా ఆచరించి , నీ సావితృ మంత్రమును అనుష్ఠానము చేస్తే అది గాయత్రమవుతుంది . తృప్తి కలిగినదా ? " 

     " దేవా , అటులనే , నీ అనుగ్రహముతో బ్రహ్మర్షుల కార్యము నెరవేరినట్లే . అయితే , ఇదంతా కూడా పాత్రులైన వారికి మాత్రమే . అపాత్రులను అనుగ్రహించు విధానమును చెప్పు .  "

     పూషుడు దిక్కు దిక్కులన్నీ వెలిగిపోవునటువంటి నవ్వు నవ్వి , " బ్రహ్మర్షీ , చూచితివా ? నీ అంతస్తు వారు ఈ కృత యుగములో కూడా , ఎంత వెదకినా నూరు మంది దొరికితే ఎక్కువ . ఇటువంటి నీకు కూడా సంశయము ఉంది , చూచితివా ? ఎంతవరకూ అహంకారము ఉంటుందో , అంతవరకూ సంశయము వదలదు . ఇదే హృదయ గ్రంధి . సవితృడిని ఇంకొక సారి ధ్యానము చేసి ఈ హృదయ గ్రంధిని విసర్జించి , పాత్రులు ఎవరు ? అపాత్రులు ఎవరు ? అన్నది చూడు ." 

     " అవును దేవా , తప్పయినది . లోకములో అందరూ పాత్రులే ! కొందరు సిద్ధముగా ఉన్నారు . ఇంకొందరు సిద్ధమగుచున్నారు . ఇదిగో , ఇదెవరో అంటున్నారు , " జాత మాత్రస్య గాయత్రీ "  అని "

" అవును  , నిజము .  అది పలికిన వారిని దర్శనమివ్వమని అడుగు "