SHARE

Friday, June 22, 2012

27. " మంత్ర ద్రష్ట " ఇరవై ఏడవ తరంగము



ఇరవై ఏడవ తరంగము

     విశ్వామిత్రుడు  ఆ చెట్టు వద్దనే ఇంకాసేపు కూర్చున్నాడు . ఇంద్రుడు చెప్పిన  , " స్వర్గానికి రమ్మంటే , రానన్నావు , స్వర్గమే నీ దగ్గరకొస్తే ఏం చేస్తావో చూద్దాము "  అన్న మాటే ఇంకా చెవుల్లో గింగురుమంటోంది . " ఔను , అందులో గొప్పేముంది ? నేను త్రిశంకువును స్వర్గానికి పంపగల వాడనైనప్పుడు , స్వర్గమే నా వద్దకు ఏల రాకూడదు ? మహా వస్తే మాత్రమేమి ? రానీ ! చూద్దాము ..వచ్చాకనే దాని ఆలోచన " అనుకుని అక్కడినుండీ బయలుదేరాడు . 

     ఇక్కడ ఆశ్రమములో సమారాధనపు సంభ్రమము . జమదగ్ని పత్ని యైన రేణుకా దేవి , శిష్యులూ , ఆశ్రమ వాసులూ ఒకటే అటు ఇటు  తిరుగుతున్నారు . వారి , వీరి మాటలవలన కౌశికునికి , ’ ఏదో కామధేనువు వచ్చింది ’ అన్నది సగము సగము తెలిసి , " ఇదేమిటి ? మరలా కామధేనువు ప్రసంగము ? " అనిపించెను . చివరికి తన పర్ణశాలకు వచ్చే లోపల , అంతా , కొంత కొంత తెలిసింది . దేవతలు జమదగ్నికి కామధేనువు యొక్క సంతానమును హోమ ధేనువుగా కరుణించినారు . ఆమె వచ్చింది . ఈ దినపు అతిథి పూజ ఆమె వల్లనే . 

     విశ్వామిత్రునికి ఉన్నట్లుండి వామదేవుడు చెప్పింది గుర్తొచ్చి , ఇలా అనుకున్నాడు  , "  మరలా ఇదే ధేనువు కారణముగా బ్రాహ్మణ  క్షత్రియ యుద్ధమగునా ? మరలా రాజో , రాజన్యుడో బ్రాహ్మణ ధేనువును కోరి శాంతముగా నున్న ఆశ్రమ పదాలన్నిటినీ రౌద్ర కర్మలతో క్షోభింప చేస్తాడా ? కళకళలాడుతున్న ఈ ఆశ్రమ భూమి , రక్త గంధమును అలదుకొని , రణ రంగమై వికారమగునా ? బ్రహ్మ చింతన చేయు తపస్వుల ఆశ్రమమైన ఈ భూమిలో , ఆయుధాల ఝణ ఝణత్కారములు వినిపించి తలలు తెగునా ? వామదేవుని మాట అబద్ధమనుటకు కారణములేదు . అతని మాట నిజమైతే , క్షత్రియ కులాంతకుడైన భార్గవుడొకడు రావాలి . వచ్చాడా ? " 

     విశ్వామిత్రునికి ఇంకా రకరకాల ఆలోచనలు . " అలాగయితే , ఈ దేవతలు ఇంతటి తుంటరులా ? వీరు అనుగ్రహమని ఇచ్చునదంతా , తన వెంటే ఒక దుఃఖపు మూటను తెస్తుందా ? ఇప్పుడిచ్చిన ఈ శబల కూడా నందిని వలెనే కారణ జన్మురాలా ? అలాగయితే , మేము దేవతలనెందుకు పూజించాలి ? వారి వరాలు , మా వినాశపు మూలాలగునట్లయితే , మేము ఆ వరాలను అసలు ఎందుకు అడగాలి ? ఎందుకు సంపాదించాలి ? " అని ఏవేవో ఆలోచనలు . 

     ఏ ఆలోచనలు వచ్చినా , ’ స్వర్గము నావద్దకు వస్తే ఏమి చేయాలి ? అది ఏ రూపములో వస్తుంది ? అది దుఃఖముగా పరిణమించకుండా ఏమి చేయాలి ? " అని మధ్య మధ్య ఆలోచనలు ... ఛీ , ఆ మునీంద్రునికి , దేవతలు , వరాలు , స్వర్గము , సుఖదుఃఖాలు...వంటి ఆలోచనలు తప్ప ఇక వేరే ఆలోచనలు రావా ? 

     ఇలాగే అతనక్కడ విచిత్ర భావనా తరంగాలలో తేలిపోవుతున్నపుడు జమదగ్ని నుంచి పిలుపు వచ్చింది . విశ్వామిత్రుడు వెళ్ళాడు . దారి పొడుగునా వడ్డించిన అరటి ఆకులు భోజనానికి రారమ్మంటున్నాయి . భక్ష్య భోజ్యాలు , రుచిరుచిగా నున్న పానకాలు , పాయసాలు , పక్వాన్నాలు , మొదలైనవి కావలసినన్ని వడ్డించినారు . ఆ భోజన పదార్థాల ఘుమ ఘుమలు నాసికా రంధ్రాలను పెద్దవిగా చేస్తున్నాయి . ఎక్కడ చూచిననూ , ఆకు ఆకు ల నిండా సమృద్ధి నిండినట్లు వడ్డించారు . భోజ్య వస్తువుల సువాసన , ఆశ్రమ వాసుల మామూలు ఆకలిని మరపించి , లేని గొప్ప ఆకలిని పుట్టిస్తున్నాయి . ఈ కొన నుండీ ఆ కొన వరకూ జనాలు . భోజనానికి సిద్ధంగా కూర్చున్నారు . ఆపోశన కై వేచిఉన్నారు . ఆపోశన ఇచ్చుటకు కూడా జనులు సిద్ధముగా ఉన్నారు . విశ్వామిత్రులు రావలెను . వారికోసమై జమదగ్ని కాచుకున్నారు . జమదగ్ని సూచనకై ఇతరులు కాచుకున్నారు . 

     విశ్వామిత్రుడు తొందర తొందరగా జమదగ్ని వద్దకు వెళ్ళాడు . జమదగ్ని అతనికి సలుపవలసిన సత్కారములను సలిపి , అతిథి పూజను చేసెను . ఆశ్రమములో అతిథి పూజ సాంగముగా నెరవేరింది . భోజనాలు , ఫల దక్షిణ తాంబూలాలతో అతిథులంతా తృప్తులయ్యారు .  విశ్వామిత్రునికి శబల పరిచయమైనది . దేవధేనువు జమదగ్ని హోమధేనువైనదని సంతోషించినా , అతనికి ’ శబల ఎక్కడ ఇంకొక నందిని అవుతుందో , ఎక్కడ ఇంకొక కౌశికుడు పుట్టి హత్యలు చేస్తాడో ’ అనేదే దిగులు . 

     విశ్వామిత్రుడు తన పర్ణశాలకు వచ్చాడు . అతనికి దేవేంద్రుని మాట అర్థమైనట్లనిపించెను  :
" సరే , ఇంద్రుడు తనకూ ఒక హోమధేనువు నిస్తాడు . వశిష్ఠునికి నందిని , జమదగ్నికి శబల , తనకు ఇంకొక అబల !! అతడు చెప్పిన స్వర్గము ఇదే ! కాని తాను మాత్రము ఆ ధేనువును స్వీకరించడు . ఒకవేళ  దేవతల వరమని స్వీకరించినా , దానిని ఆశ్రమములో ఉంచుకోరాదు . అది దేవతల వద్దనే ఉండనీ . కావలసినపుడు ప్రార్థన చేసి పిలిపించుకోవచ్చు . దానివల్ల కావలసిన కార్యము నెరవేరగనే , దానిని తిరిగి పంపించవచ్చు . వశిష్ఠులు అట్లు చేసి ఉంటే అతని ఆశ్రమములో రక్తపాతమే అయ్యేది కాదు . " అని ఆలోచిస్తున్నాడు . 

     అలాగే , ఇంకొకసారి ఆలోచనా ప్రవాహము పారి ,  మరలా ఇంకొక ఆలోచనా తరంగము వచ్చింది . " సరే , మా ఆశ్రమములో కూడా రక్తపాతము అయిందనుకుందాము . దానికి నేనెందుకు బెదరాలి ? ఒక కౌశికుడు వచ్చి , ఇంకొక విశ్వామిత్రుడు పుడతాడు . అణగిన తేజస్సు బయటికి వచ్చు కారణమవుతుంది . తిరస్కారమును సహించని తేజోవంతుడొకడు అవతరించి , భూమిలో తేజస్వుల సంఖ్య పెరుగుతుంది . కానిమ్ము , దానివలన , బెదరి దేవతల వరమును నిరాకరించుటకన్నా , కావలసినది కానీ . దానిని అంగీకరించవలెను . జీర్ణించుకోవాలి . అదే మంచిది " అనే సిద్ధాంతానికి వచ్చాడు . 

     ఆ వేళకు సూర్యుడు వాలుతున్నాడు . జమదగ్ని మరలా మేనమామను చూచుటకు వచ్చాడు . ఇద్దరూ కొంతసేపు మాటల్లో పడ్డారు . విశ్వామిత్రుడు , ఇంద్ర దర్శనము అయిన విషయమూ , అతడు చెప్పినదీ  అంతా చెప్పాడు . జమదగ్ని , తాను చేస్తున్నది చెప్పాడు . అంతా అయినాక విశ్వామిత్రుడు , వెనుక తనకు వామదేవుడు చెప్పినది చెప్పగా , జమదగ్ని ,  " ఔను మామా , అలా జరుగుటకు అవకాశముంది . అంతటి క్రూరకర్మ చేయువాడొకడు నాకే జన్మిస్తాడట . ఆమాట మా అమ్మ నాకు పదే పదే చెపుతూనే ఉన్నారు . అంతేకాక , మాకూ , హైహయులకూ కావలసినంత విరోధము నడుస్తూనే ఉంది . క్షత్రియులకు రావలసినదంతా భార్గవులు కైవశము చేసుకున్నారని వారికి కోపము . ఒకరిది మేము తీసుకోలేదు . మాదగ్గరున్నదంతా మేము మా స్వయంకృషి తో , శ్రమ పడి సంపాదించినది అని మా వాదము . వారొకసారి మా కులమునే నిర్మూలము చేయవలెనని ప్రయత్నించారు .  కానీ , అగ్నిదేవుని ప్రభావము వలన అది సాధ్యము కాలేదు . హైహయులు ఇంకొకసారి విజృంభించవచ్చు . అప్పుడు వారిని నియంత్రించుటకు మాలో ఇంకొక వీరుడి జననము కావచ్చు . సరే , పద . నువ్వు క్షత్రియ బ్రాహ్మణుడవు కావాలని బయలుదేరావు . నువ్వు ఒక మెట్టు పైకెక్కితే , నా పుత్రుడు ఒక మెట్టు దిగి క్షత్రియుడు కావచ్చు . అంతే కదా ?  వాడు క్షత్రియుడైనా బ్రాహ్మణ క్షత్రియుడు . గెంతులు వేసి ఎన్ని కుప్పి గంతులు వేసినా , చివరికి తప్పకుండా తపస్సుకు పోతాడు .. అంతే చాలు . మనమెంత చెప్పినా కానున్నది కాకమానదు . దానికంత విచారమెందుకు ? అన్నాడు . 

     విశ్వామిత్రునికి ఆమాట రుచించలేదు . అయినా ఎదురు మాటలాడలేదు . తరువాత , మళ్ళీ ఆశ్రమము కట్టుకొను మాట వచ్చింది . " ఈ సారి మరలా హిమాచల ప్రాంతానికి వెళ్ళవలెనని మనసవుతున్నది . ఈ సారి హిమాచల సానువులలో ఉండుటకు ఇష్టము లేకున్ననూ , హిమాలయపు హిమకిరీట సుందర శృంగములను చూస్తూ ఉండాలని ఎందుకో కోరిక బలవత్తరమగుచున్నది . అందువలన ఉత్తరము లోనే ఆశ్రమము కట్టుకోవలెను . " అన్నాడు . 

     జమదగ్ని నవ్వి , " అలాగే కానీ , లోకోత్తరమైన సిద్ధిని పొందవలెనని తహతహ లాడుచున్న మనసు , లోకోత్తర సౌందర్యాతిశయ సంపన్నమైన హిమవత్పర్వత శిఖర దర్శనము సదా కలుగుతుండవలెను అనుకొంటే తప్పేమి ? నువ్వు కూడా  దానివలెనే ఉన్నతుడవు కావలెనని చూడగోరుట సహజము . అలాగే కానీ ....., కానీ , ఇప్పుడే కదా యజ్ఞ యాగాలు ముగిసినవి ! అలసట కొంత తీర్చుకుని వెళ్ళుదువు గాని . ఈ అమావాస్య వరకూ ఇక్కడుండి , పాడ్యమికి  స్థాలీ పాకము అయిన తరువాత ముందరి ప్రయాణపు మాట . " అన్నాడు . 

     చివరికి అదీ ఇదీ మాట్లాడి , పాడ్యమి రోజే బయలు దేరేది అనుకున్నారు . ఇద్దరూ సాయమాహ్నికాలకు  ( సాయంకాలపు  ఔపోసన ) లేచారు . 

     విశ్వామిత్రుడు ప్రయాణ సన్నద్ధుడయ్యాడు . అందరూ అతనికి గొప్పవాడు కావలెనని శుభాకాంక్షలు తెలిపారు . తాముకూడా అతనితో పాటే వృద్ధికి రావలెనని కొందరు అతనిని అనుసరించారు .  విశ్వామిత్రుడు నవ్వి , ’ నేను దాటి , ఇతరులను దాటించాలి . నేనే దాటలేదు . నేను కృతార్థుడనై ఒక ఆశ్రమమును కట్టుకొని స్థిరపడిన తరువాత తమరందరూ దయచేయవలెను . " అని సమాధానము చెప్పి , వారందరినీ పంపివేసి , తాను ముందుకు సాగెను . 

     హిమాలయమునకు వెళ్ళి , వామదేవుని ఆశ్రమములో రెండురోజులుండి ముందుకు వెళ్ళాలని కోరిక. ఇవతలే  సరస్వతీ తీరములో ఉందామా , హిమాలయానికి తర్వాత వెళ్ళవచ్చును ....అని మరియొక ఆలోచన . ’ ఎక్కడున్నా సరే , ఈ సారి ఏకాంతముగా ఉండాలి . ఎవరికీ కూడా నేనున్నదే తెలియకూడదు . ఈ సారి సిద్ధుడనగు వరకూ సాధ్యమైనంత మౌనముగానే ఉండవలెను ’ అని కొన్ని ఆలోచనలు . 

     సరే , మరి ఈ సారి ఏ సిద్ధి కావాలి ?  రుద్రుడి అనుగ్రహమైంది , అస్త్రసిద్ధి అయింది . ఆపోదేవి అనుగ్రహము అయింది , సృష్ఠి రహస్యము అంతంతగా తెలిసింది . అశ్వినీ దేవతల అనుగ్రహమై , దేహమును శుద్ధి చేయుట ఎలా అన్నది  తెలిసింది . ఇంద్రుని అనుగ్రహమైంది. కావాలన్న స్వర్గానికి వెళ్ళి రావచ్చునన్నదీ అయినది . లేదా , స్వర్గమే నావద్దకు వచ్చునట్లాయెను . అయినా , నాకు కావలసినది ఇంకా రాలేదు . వచ్చినవారందరూ , " వస్తుంది , నీ ఆశ తీరుతుంది ’ అని నమ్మకము నిస్తున్నారు . కాని తీరలేదుకదా ! బృహస్పతి మాత్రము , ’ కామ క్రోధములను వదలితే నువ్వు బ్రాహ్మణుడవు కాగలవు ’ అన్నాడు . అంటే , బ్రాహ్మణ్యము అనేది ’ త్యజించుట ’ లో ఉందా ? లేదు , త్యజించుట అంటే నిగ్రహించడము  : దానికి వశుడు కాక ఉండుట . కాబట్టి , కామ క్రోధాలను మింగవలెను . మింగి జీర్ణించుకోవలెను . వాటికి వశుడు కాకుండాలి . ఇగో , ఈ ఎదురుగా ఉన్న చెట్టు , మొలకై , మొక్కై , మానై , ఇప్పుడు దేనికీ తలవంచని మహా వృక్షమైందే , నేను కూడా కామ క్రోధాలకు తల వంచరాదు . అబ్బా, అదంత సామాన్యమైనదా ? చెప్పినంత సులువా ? ఒకవేళ అయిందనుకుందాము , కామానికి వశము కాకుండ , క్రోధానికి బలి కాకుండా  ఉంటాను అనుకుందాం . అప్పుడు మనసు యొక్క వ్యాపారానికి కారణమింకేమి ఉంటుంది ? దేన్ని గురించి అపేక్ష పడాలి ? దేని ప్రేరణ చేత మనసు వ్యాపారము చేస్తుంది ? " 

     " అదెందుకలా అనుకోవాలి ? అప్పుడు మనసు రాజపురుషుని వలె అగును . రాజపురుషుడంటే , కార్య దక్షుడై , కార్యానికి సిద్ధమై కూర్చొనువాడు . రాజాజ్ఞ వాడిని ప్రేరేపించి కార్యరంగానికి దింపుతుంది . అలాగే , కామక్రోధములను తిరస్కరించిన వారిని , జగత్కారణమైన నియంత యొక్క ఇఛ్చ  , వ్యాపారములో నియోగించ వచ్చు . బృహస్పతి చెప్పలేదా ? అంతటి నియంత ఒకడున్నాడని ? అతని సంకల్పము చేతనే వశిష్ఠ పుత్రుల మరణమయిందని ? త్రిశంకువు కార్యానికి విఘ్నము వచ్చింది కూడా అతని వల్లనే అని కదా ? ఇలా అయితే , అతడు మనసును వ్యాపారము చేయించకుండా ఉంటాడా ? " 

     " ఔనౌను , ఆ నియంతను పట్టుకోవాలి . కానీ , నా మనసింకా అటువైపు తిరగలేదు . నామనసుకు , కామక్రోధాలు అవసరమైనంతగా , వాటిని నిగ్రహించు అవసరము లేదు . నందిని కావలెను అనిపించెను , అది దొరకలేదు . కోపము వచ్చింది . కోపము క్రోధమైంది . వశిష్ఠునిపైన నా ఆటలు సాగవని అర్థమైన తర్వాత , ఇప్పుడు విశ్వామిత్రుడని పేరు పెట్టుకొని బయలుదేరాను . నేనిప్పుడు చేస్తున్న ప్రయత్నము ఏమిటి ? క్రోధము తన బాహ్య రూపమును వదలి , మరల బీజ రూపమైనది . చెట్టును కొట్టేశాను , కానీ ఆ చెట్టు బీజరూపము ఎక్కడికి పోయింది ? రావి చెట్టును కొట్టేసి , దాని వేరులన్నీ శోధించినా , చేతికి చిక్కని ఏదో వేరు అక్కడే చిగురించి పెద్ద వృక్షమైనట్టు నా కామము ఇప్పుడు ఇటు తిరిగింది . బ్రాహ్మణుడను కావలెనన్న తన కోరికే కదా , ఈ కామమంటే ? దేవుని సృష్టిలో ప్రతి దానికీ ఒక్కొక్క స్థానమున్నదని మరచి , సర్వ రక్షకుడైన క్షత్రియుడనై ఉండుటే ఒక అదృష్టము అని తెలుసుకోక , కామ క్రోధ వశుడనై ఉండి కూడా సర్వ సమర్థుడైన  బ్రాహ్మణుడను కావలెనని వచ్చాను . నేను ఎవరి వలె కావాలని ప్రయత్నిస్తున్నానో , వాడు అదెంత పై స్థాయివాడు ? అబ్బ  ! ఆ స్థాయికి చేరుట సాధ్యమా ? పంచ భూతముల శోకమును వహించుట అంటే సాధ్యమా ? ఇంద్రుని పట్టిన భూతమును విడిపించుట సులభమా ? " 

     " సర్వ సమర్థుడ నగుట అంత కష్టము కాకపోవచ్చు . నా తండ్రియైన కుశికుడు చ్యవన మహర్షి వలన కలిగిన  దుఃఖము నంతా సహించాడు అని వినలేదా ? నా తండ్రికి సాధ్యమైనది నాకు కూడా సాధ్యము అయితీరవలెను . కానీ అహంకారమును త్యజించుటెలా ? వృత్రుని బాధను వశిష్ఠుడు పోగొట్టినది , అహంకారమును గెలుచుట వలన అని ఇంద్రుడే స్వయముగా చెప్పాడు . అబ్బా ! దేనిని వదిలితే , నేనన్నదే లేకుండా పోతుందో , దాన్ని వదలుటా ? అప్పటికిక ఏమి మిగిలినట్టు ? వ్యక్తిత్వము లేని జీవితమొకటి . బహుశః అప్పుడు కామ క్రోధములు ఉండక పోవచ్చును . వాచస్పతి చెప్పినది దీన్నేనా ? కామ క్రోధములు లేనివాడు అంటే , అహంకారమును జయించిన వాడు అని అర్థమా ? " 

     " ఊహూ ...ఇప్పట్లో సాధ్యము కాదు . నా మనసు ఇప్పుడు అంతటినీ వదలుటకు సిద్ధముగా లేదు . మొదట సృష్టి రహస్యమును ఛేదిస్తాను . ఇంద్రుని తల్లడిల్ల చేయాలని బయలుదేరిన మనసు , కనీసము లోకపు ఒక మూలనైనా పీకి పారేయాలి కదా ? బ్రాహ్మణుడను కావాలి , కానీ కామాదులనన్నిటినీ పీకి పారేయుటకు నా మనసు సిద్ధముగా లేదు .... ఏమి చేయుట ? " 

     " సరే , వశిష్ఠులు అహంకారమును జయించిన వారు . వామదేవుడో ? , అతడూ అహంకారమును జయించి ఉండాలి . అతను , ఎప్పుడూ దేనినీ కావాలనలేదు . వద్దు అనలేదు . అతడిని నేనెరుగుదును . కానీ నిజంగా ఎరుగుదునా ? ఎలా చూచిననూ , అతడు కామక్రోధముల వలన , కామ క్రోధముల వశుడై ఏ పనీ చేసినట్టు లేదు . నేను ఒకరిని ’ ఎరుగుదును ’ అంటే ఏమి ? వాని కామాదులు , కావాలన్నవి , వద్దన్నవి ... ఇంతే మనకు తెలిసేది . దానికవతల మనకు తెలిసిందేమిటి ?  అంటే , కావాలి , వద్దు అన్నవి తప్ప వ్యక్తిలో ఇంకేమీ మిగిలి ఉండదా ? ఇవి రెండూ తప్ప వ్యక్తిలో ఇంకేమీ లేనేలేవా ?  " 

     " ఔను , ఇంక మిగిలినట్టు లేదు . నీటి యొక్క రుచి , రంగు , చలువ , వేడిమి  ఏదీ నీటిది  కాదు . నీటికి ఇవేవీ లేవు .  మరి ఇవేవీ లేని నీటిని చూచిన వారెవరైనా ఉన్నారా ? అలాగే కామము లేని మనిషిని చూచిన వాడు ఉన్నాడా ?  కాబట్టి కామముండవలెను . కామమును సంపూర్ణముగా వదలి బతుకుటెలాగ ? కాబట్టి , కామక్రోధములను వదలుట అంటే , ఇంకేదో రహస్యముండాలి . ఆ రహస్యమును తెలుసుకోవాలి . సృష్ఠియొక్క మూలమే కామము అన్నపుడు , దానిని నిగ్రహించుట అంటే , దానికి మనకు తెలియని అర్థమేదో ఉండాలి . "

     ఇలాగే ఇంకా ఏమేమో ఆలోచనలతో విశ్వామిత్రుడు ముందుకు సాగెను . మొత్తానికి ఏ ఆశ్రమములోనూ నిలవలేదు . ఎవరి కంటికీ కనపడలేదు . అడవిని కురిసిన వర్షపు నీరు ఎవరి కంటికీ  కనపడకుండా ఎక్కడెక్కడో తప్పించుకుని  పారినట్లు అతడూ , జన సందోహాలను తప్పించి , గంగా యమునా నదులను దాటి , సరస్వతీ నదీ తీరానికి వచ్చాడు . 


No comments:

Post a Comment