SHARE

Wednesday, September 5, 2018

వైదిక ధనము

వైదిక ధనము
-------------------------

తపస్సుకు మెచ్చి, సరస్వతీ దేవి ప్రత్యక్షమై, ’ వత్సా , ఏమికావాలి, కోరుకో ..’ అంటే ,
" తల్లీ, నాకు అధికముగా ధనాన్ని ఇవ్వు. ప్రపంచములోని అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ చదివి జ్ఞానము సంపాదించుకుంటాను " అన్నట్టు
ఈ మధ్య ప్రతీదాన్నీ కేవలము ధనముతో మాత్రమే సంపాదించగలము--అనుకొనేవారి సంఖ్య రానురానూ ఎక్కువవుతోంది.
జ్ఞాన సరస్వతే ఎదురుగా ఉన్నపుడు, జ్ఞానాన్ని అడక్కుండా , అదేదో తాను ప్రత్యేకంగా సాధించాలి అన్నట్టు , దానికి డబ్బు అవసరమైనట్టు --ఇంతటి అజ్ఞానాన్ని చూసి సరస్వతీ దేవి ఇక అక్కడ క్షణం ఉంటుందా ?
అనేకులు , ఎంతగొప్ప చదువులు చదివినా, ఎంతగొప్ప ఉద్యోగాలు చేసినా , ప్రతీదాన్నీ డబ్బుతో ముడి పెడతారు.
ఎవరైనా ఏదైనా పని చేయబోతే " దానివల్ల ఎంతొస్తుంది ? ఏమొస్తుంది ? " అంటూ ప్రశ్నలు.
సనాతన ధర్మములో
|| ఇష్ట ప్రాప్తి-అనిష్ట పరిహారయోః అలౌకికమ్ ఉపాయమ్ యో గ్రంధో వేదయతి స వేదః ||
అని ప్రసిద్ధమైన ఋషివాణి ఉన్నది.
అనగా , " మనకు ఈ ప్రపంచములో అవసరమైన - లేక, ఇష్టమైన వాటిని పొందడానికి, మరియు హానికరమైన వాటిని తప్పించడానికి కావలసిన అలౌకిక ఉపాయాలను యే గ్రంధము ఇస్తుందో, అదే వేదము "
అంటే, దీన్ని బట్టి, వేదములో ప్రతిపాదించిన పద్దతుల వల్ల మనము సర్వమునూ సమకూర్చుకోవచ్చును. అంతే కానీ ధనము వల్ల కాదు.
ధనము వల్ల వచ్చేవాటినీ, ధనము వల్ల రాని వాటినీ కూడా వైదిక పద్దతుల ద్వారా [ యజ్ఞ యాగాదులు , హోమాలు వంటివి ] సులభముగా పొందవచ్చును.
కానీ దీన్ని మనము నమ్మితే కదా?
నమ్మిన వారికి ఫలముంది, నమ్మని వారికి ఏముంది--అన్నట్టు, అసలు ఇటువంటి ఆలోచనే ఎవరికీ రాదు.. ఎవరైనా చెప్పినా నమ్మరు. ప్రస్తుతము సమాజములోని పరిస్థితులు , పోకడలే దానికి కారణము.
వైదిక ధర్మాన్ని పాటిస్తున్నవారే , చాలామంది దీన్ని నమ్మరు. ఎందుకు నమ్మరు అంటే కారణాలు అనేకము. ముఖ్యమైనది, జీవితంలో వారు ప్రయాణించిన పద్దతి.

ఉదాహరణకు , కొందరు స్వఛ్ఛమైన దుస్తులు వేసుకొని కాలినడకన , మరికొందరు స్కూటర్ మీద, ఇంకొందరు ఆటోరిక్షా, అలాగ , బస్సు , కారు , రైలు , విమానాల్లో ప్రయాణించారు అనుకోండి. వారందరి ప్రయాణ కాలము ఒకటే అనుకోండి. ప్రయాణము తర్వాత ఎవరెవరి దుస్తులు ఎలా ఉన్నాయో చూద్దామా ?
వారందరి దుస్తులూ అంతో ఇంతో మాసి ఉంటాయి.
కాలినడకన వెళ్ళేవారికి, స్కూటర్, ఆటో, బస్సు, కారు, రైలు, విమానాల్లో వెళ్ళేవారికి ఒకే రకంగా దుస్తులు మాసి ఉండవు కదా?
విమానాల్లో వెళ్ళినవారికి తలపైన జుత్తు కూడా చెదరి ఉండకపోవచ్చు. ఏసీ కారు వారికీ అంతే. ఇక రైలు, బస్సు, ఆటో, స్కూటర్ వారికి వేర్వేరు రకాలుగా దుస్తులు మాసి ఉంటాయి. పైగా కొందరికి చెమటవల్లను , వాన, బురద వల్లనో దుస్తులు పాడై ఉంటాయి కూడా.
ఇందులో ఎవరి ప్రయాణము సుఖవంతము , ఫలవంతము అనడిగితే , విమానము , ఏసీ కారు , ఏసీ రైళ్ళలో వెళ్ళినవారిది అని ఠకీమని చెబుతారు.
అదే తర్కాన్ని అనుసరించి, పైన చెప్పిన " ధనముతో అన్నీ వస్తాయి , వైదిక పద్దతుల వల్ల కాదు" --అని అనుకోడానికి-- అనుకోకపోవడానికీ--వారు చేసిన ప్రయాణమే కారణము.
ఇక్కడ విమానము , ఏసీ కార్లు, రైళ్ళూ అంటే-- వైదీక జీవనములో ప్రయాణించినవారు అని అర్థము. అంటే పొట్టపోసుకోడానికి వైదీక జీవనములో ఉండడము కాదు. నిజంగా వేదాన్ని నమ్మి , దాన్ని ఆచరిస్తూ జీవనము గడిపేవారు అని అర్థము.
ఇక ఈనాటి అర్థం పర్థం లేని చదువులు చదివి అవి ఇచ్చే ధనము , వస్తువులు , సౌకర్యాలు పొందుతూ ’ తాము గొప్ప హోదాలో ఉన్నాము ’ అనుకొనేవారు స్కూటర్, ఆటో రిక్షాలలో వెళ్ళేవారికన్నా అధములు. అంటే వారి మనసులు ఎక్కువగా మలినము అయ్యాయి అని. వారికి ప్రతీదీ డబ్బుకు ముడివడి ఉంటుంది. ఇతరులలో డబ్బునే చూస్తారు. వారి గుణగణాలను , వ్యక్తిత్వాన్ని , జ్ఞానాన్ని వీరు చూడలేరు. అవన్నీ ఉన్నా కూడా డబ్బులేదు--అని వీరు గనక అనుకుంటే వారిని చులకనగా చూస్తారు.
మీరు అడగవచ్చు, ’ నేటి అర్థం పర్థం లేని చదువులవల్ల డబ్బు , వస్తువులు , సౌకర్యాలు వస్తున్నాయని అన్నారు కదా, మరి అలాంటప్పుడు వేదముతోను , వైదీక జీవితముతోను ఉపయోగమేమి ? " అని.
నిజము,నేటి చదువులు అవన్నీ ఇస్తున్నాయి . ఎవరు కాదనగలరు.. కానీ మనశ్శాంతి , ఆరోగ్యము , జన్మాంతరములో మనకు తిరిగి సంపదలు , మానసిక ఆరోగ్యము వంటివి ఈ చదువులు ఇస్తాయా ? ఇవన్నీ ఈ జన్మతో ముగిసిపోవలసినదే. ఎవరూ వీటిని -అనగా ఈ డబ్బు సౌకర్యాలు , వస్తువులను మూటగట్టుకొని పోరు. చచ్చినపుడు అన్నీ వదలి పోతారు. మనవెంట రావు. పైగా ఇవన్నీ అశాశ్వతాలు. ఎప్పుడైనా వీటిని పోగొట్టుకోవచ్చు.
అయితే , వైదిక జీవనము ఈ జన్మలో అన్నీ ఇచ్చుటే గాక , పైజన్మకు కూడా వాటిని పుణ్యరూపములో మూటగట్టి తెచ్చిస్తుంది.
’ పై జన్మ ఉందో లేదో, ఇప్పటికేది ప్రస్తుతమో అది చాలు ’ అనుకొనేవారికి, నా ప్రశ్న --" పైజన్మ ఉండకపోయేది మోక్షము ప్రాప్తములో ఉన్నవారికి మాత్రమే. ఆ మోక్షము కలగాలన్నా, ఈ లౌకిక విధానాలు సహాయం చెయ్యవు. దానికీ వైదిక విధానాలే శరణ్యము"
అంతా బాగానే ఉంది, మీరు చెప్పినవి పాటించి ఫలితాన్ని పొందిన వారు ఎవరైనా ఉన్నారా ? --అంటే , అనేకులు ఉన్నారు. నేను స్వయముగా చూసినవారే కాదు, మీరందరూ కూడా చూశారు , ఈనాడు ఆధ్యాత్మికముగా గొప్ప స్థితిలో ఉన్నవారందరూ అటువంటి వారే. వారికి ధనముతో అవసరము లేకుండానే అన్ని భాగ్యాలు , సౌకర్యాలు దొరుకుతున్నాయి.
మనము అనేక దేశాల్లో చూస్తున్నాము , తిండికీ బట్టకీ ఉండదు. మనుషులు అస్థిపంజరాల్లా ఉంటారు. అనేక రోగాలు, అశాంతులు , అలజడులు , ప్రకృతి ప్రకోపాలు--ఇలా ఎన్నెన్నో.. మనదేశములో అవన్నీ లేవు. ఎందుకో తెలుసా ? అది మన గొప్ప కాదు. ఈ తరము , పోయిన తరము వారి గొప్ప కాదు. మనకు మన పూర్వీకులు ఇచ్చిపోయిన ధనమే అది. వారు చేసిన పుణ్యఫలమే తరతరాలుగా మనలను రక్షిస్తున్నది.
" ఒక వ్యక్తి వేద విద్యా పారంగతుడైతే , అతడికి ముందు , వెనుక , ఎన్నోతరాల వారి శ్రమ ఫలించినట్టు. అతడి వల్ల అన్ని తరాలు ఉద్ధరింపబడతాయి. "
కొంతకాలము కింద ఇక్కడే నా మిత్రుడొకరు--చిన్నవయసు వారే --- అడిగారు" ఏమిటోనండీ జపాలు , పూజలు , అనుష్ఠానాలు చేస్తాను గానీ ఎందుకో ధనము ఇమ్మని ఆ దేవుణ్ణి అడగడానికి మనసు రాదు. అది తుఛ్చముగా అనిపిస్తుంది.. కానీ ధనము లేకపోతే నాకు కావలసినవి దొరకడము లేదు, పనులు జరగడము లేదు--" అని.
అతడు నిజముగా ఆధ్యాత్మిక మార్గములో ఉన్నాడు. అయితే కొన్ని అవరోధాలు వస్తున్నాయి. నేను చెప్పాను, " మీకు ధనముతో అవసరము ఏమిటి, మీకేమేమి వస్తువులు , పనులు కావాలో ఆ దేవుణ్ణి అడగండి. ధనము రాకపోయినా మీ పనులు జరిగితే చాలు కదా " అన్నాను. అతడు దానికి ఒప్పుకొని , మంచి సూచన అని అంగీకరించి ఆచరణలో పెట్టాడు. తర్వాత కొంతకాలానికి అతడే చెప్పాడు, ’ ఇప్పుడు నా అవసరాలన్నీ ధనముతో పని లేకుండానే తీరుతున్నాయి, లేదా, అవసరానికి ఏదోరకంగా ధనము అదే వస్తున్నది --" అని.
సరే మరి , అందరూ అనుష్ఠానాలు , యాగాలు హోమాలు చేయలేరు కదా, వారి మాటేమిటి ?
అవును, వేదము నేర్చిన వారిలో కూడా అందరూ యాగాలు , యజ్ఞాలు చేయలేరు. సనాతన ధర్మములో ప్రతిదానికీ ఒక ప్రత్యామ్నాయము ఉంది.
వేదము నేర్చినా, యజ్ఞయాగాదులు చేయలేనివారికి " బ్రహ్మయజ్ఞము " అనే మహోత్కృష్ట సాధనము ఉంది. ఇది అందరూ అనుకొనే అగ్నిని కుండములలో ప్రతిష్ఠించి చేసే యజ్ఞము కాదు. ఇందులో కేవలము స్వాధ్యాయము [ వేదపఠనము ] మరియూ దేవ ఋషి పితృ తర్పణాలు ఉంటాయి . బ్రహ్మ యజ్ఞపు గొప్పదనము , విలువ , ఫలితము అంతాఇంతా కాదు. యాగాలు చేయకపోయినా, ఒక పద్దతి ప్రకారము ఆయా మంత్రాలను పఠిస్తే అంతే ఫలితమని వేదమే చెబుతుంది.
శతపథ బ్రాహ్మణములో , అగ్నిని ప్రతిష్టించి చేసే యజ్ఞాలకూ , బ్రహ్మయజ్ఞానికీ గల సారూప్యత ఆసక్తికరంగా చెప్పబడింది.
బ్రహ్మయజ్ఞములో భాగమైన వేదాధ్యయనములో నిమగ్నమైన వారి శరీరపు వివిధ అంగాలు , ఆయా శరీరపు కలాపాలు , ఇతర యజ్ఞాలలో ఉపయోగించు యజ్ఞాయుధాల[ ఉపకరణాల] తో పోల్చబడినాయి. యజ్ఞములో ఉపయోగించు జుహు, ఉపభృత్ , ధృవా మొదలగు ఉపకరణాలు , సంకేత రూపములో వాక్కు, మనసు , కన్నులతో పోల్చబడినాయి. బ్రహ్మ యజ్ఞపు చివర చేయు వేదాధ్యయనమే అవభృత స్నానమట !
అలాగే వేదము అధ్యయనము చేసినా, అధ్యాపనము చేసినా అదే ఫలితము. అధ్యాపనము [ నేర్పించుట ] చేసేవారు అధ్యాపనమే ఫలితముగా భావించాలి. శిష్యుల వద్దనుండీ ఏమీ ఆశించరాదు. ఒకవేళ వారేమైనా ఇస్తే , అది తనకు అవసరమైతే , ఉపయోగపడితే , తీసుకోవచ్చును. ఉపయోగపడనిదాన్ని , ఎంతగొప్పదైనా, వారే ఇచ్చినా సరే, తీసుకోరాదు.
ఇది తెలియని అనేకులు" వేదము నేర్పిస్తారా ? దానితో కడుపు నిండునా కాలు నిండునా ? " అని ప్రశ్నించి తమ అజ్ఞానాన్ని ప్రదర్శించుకుంటారు. మరికొందరు, వీరు వేదము నేర్పిస్తున్నారు-అనగానే , " పాపం , ఎంత బీదరికంలో ఉన్నారో, " అని జాలి కాదు, తమతో పోల్చుకుని, మిథ్యా తృప్తి పొందుతారు. తామెంత హీనస్థితిలో ఉన్నారో వారు ఎరుగరు.. వారికి అజ్ఞానమే బ్రహ్మానందము.
వేదము నేర్వని వారు యే గాయత్రీ మంత్రమో , అదీ రాని వారు పురాణాలు , ధార్మిక గాథలు, ఇతిహాసాలను చదివితే అంతేఫలితమని వేదములోని యజురారణ్యకములో స్పష్టముగా చెప్పి ఉంది.
కాబట్టి ఎవరికి వచ్చినది వారు చేయవచ్చు.
ఇక తర్పణాలకు కూడా పెద్ద తంతు అవసరము లేదు. ఆయా దేవతల, ఋషుల , పితరుల పేర్లు చెప్పి ఆయా తీర్థాలతో తర్పణము ఇవ్వడమే. తీర్థము అంటే , కుడిచేతి చూపుడు, బొటనవేలిని మడిచి, గోకర్ణ ఆకృతిలో ఉన్న ఆచేతి వేళ్ళ నుండీ ముందుకు నీరు వదిలితే అది దేవతీర్థములో వదలినట్టు.
కుడి అరచేతిలోని నీటిని చిటికెన వేలు కిందిగా ఎడమవైపుకు వదలితే అది ఋషితీర్థము.
చూపుడు వేలు, బొటన వేలు మధ్యనుండీ నీటిని కుడివైపుకు వదిలితే అది పితృతీర్థము. అరచేతిలోని నీటిని వెనక్కు--అనగా మణికట్టు వైపుకు వదిలితే అది బ్రహ్మ తీర్థము.

|| శుభం భూయాత్ ||