SHARE

Friday, February 28, 2014

2. ఔపాసన-- రెండవ భాగము - త్రేతాగ్నులు



2. ఔపాసన రెండవ భాగము - త్రేతాగ్నులు



ఔపాసన రెండవ భాగము - త్రేతాగ్నులు

మొదటి భాగములో, మానవుడు తన శ్రేయస్సుకై ఉపాసన చేయవలసినది అగ్నినేయని తెలుసుకున్నాము.

          ఈ అగ్న్యుపాసనను యజ్ఞము , హోమము వంటి అనేక విధములుగా పలికినా అక్కడ చేయునది , హవిస్సును అగ్నికి అర్పణ చేయుటయే ! అట్టి యజ్ఞము చేసి , యజ్ఞశేషమును భుజించువాడిని అమృతాశి అంటారు. వాడే పుణ్యాత్ముడు.

|| యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వ కిల్బిషైః |
భుంజతే త్వేత్వఘం  పాపా యే పచంత్యాత్మ కారణాత్ ||

         అటువంటి యజ్ఞము చేయుటవలన తన పాపములన్నిటినీ పోగొట్టుకుంటాడు మానవుడు. దేవతలకు హవిస్సునీయక , తనకోసమే అన్నమును వండుకొని తినువాడు పాపియే అవుతాడు. వాడు పాపమునే భుజించినట్టు ! --గీత

         ఇలాగ , యజ్ఞముల  మహత్వమును భగవంతుడు తెలిపి , మనుష్యులు మరియూ దేవతల నడుమ యజ్ఞముల ద్వారా చక్రమునొకదానిని ఏర్పరచినానని తెలిపినాడు. మనుషులిచ్చిన హవిఃప్రదానమును స్వీకరించి , దేవతలు వర్షమును , సస్యములనూ కావలసినంతగా ప్రసాదిస్తారు. దానివలన మనుషులు తృప్తులై మరలా దేవతలను తృప్తి పరుస్తారు. ఈ చక్రమును ఎవరు అనుసరించరో వారి బ్రతుకు వ్యర్థమే నని భగవంతుడే అంటాడు.

          నిజానికి మానవుడు హోమములంటూ ఏదో కొత్తగా తాను మొదలు పెట్టునది ఏదీలేదు. వాడి పుట్టుకనుండే  , కాదు , పుట్టుటకు ముందే వాడికోసము యజ్ఞము ఆరంభమై ఉంటుంది. షోడశ సంస్కారములలో మొదటిదైన గర్భాధాన సంస్కారము , దాని అంగముగా నడచు హోమము మొదలగునవి , జనించబోవు జీవికోసమే జరపబడతాయి. అలాగ పుట్టుకతోనే అగ్న్యారాధనకు లోబడి పుట్టిన శిశువు ఉపనయనమైన తర్వాత వటువై గాయత్రీ మంత్రోపదేశము పొంది , గాయత్రీ ఉపాసన చేస్తాడు. గాయత్రి ఉపాసన అనగా కాంతి యొక్క ఉపాసనే . అగ్ని యొక్క ఇంకొక రూపమే కాంతి. అంతేకాక , వటువు రెండు పూటలా అనుష్ఠించవలసిన అగ్నికార్యము / సమిదాధానము కూడా అగ్నియొక్క ఆరాధనయే ! బ్రహ్మచర్యాశ్రమమును దాటిన తరువాత గృహస్థుడైన తరుణుడు  ’ ఔపాసనము ’ అను పేరుతో మరలా అగ్ని ఆరాధననే ప్రారంభిస్తాడు. ఔపాసనను అనుష్ఠానము చేస్తాడు. ఔపాసనాగ్నిని ’ గృహ్యాగ్ని ’ లేక ’ స్మార్తాగ్ని ’ అంటారు. దాని తర్వాత చేయు విశేష అగ్ని ఆరాధనను శ్రౌతాగ్ని ఉపాసన అంటారు.

దీన్ని ఎప్పుడు మొదలుపెట్ట వలెను ?

|| జాతపుత్రః కృష్ణ కేశః అగ్నినాదధీత |
జాయామవాప్య దశమేఽహన్యగ్నినాదధీత |

-----బోధాయన గృహ్య సూత్రము.

          అనగా , పుత్రప్రాప్తి తరువాత నల్ల వెంట్రుకలు ఉన్నపుడే అగ్నులను ఆధానము చేయవలెను. ఇది అగ్న్యాధానము చేయుటకు మనకున్న గరిష్ట పరిమితి. కానీ సంప్రదాయ నియమముల ప్రకారము వివాహమైన పదవ రోజునుండీ అగ్నులను ఆధానము చేయవలెను . దీనికి , గృహస్థు యొక్క పత్ని ఆమోదము , సహకారము కావలెను. అట్లే ఆగ్నిని తన జీవన పర్యంతమూ కాపాడుకుంటూ వస్తాడు. జన్మతోపాటు దొరికిన అగ్నిని విస్తృత పరచుకొంటూ వస్తాడు కాబట్టి దీనిని శ్రౌతాగ్ని లేదా వైతానిక అగ్ని అంటారు. ఈ శ్రౌతాగ్నినే ’ త్రేతాగ్ని ’ అని కూడా అంటారు. అనగా మూడు అగ్నులు. వీటిని ’ గార్హపత్యాగ్ని ’ , ’ దక్షిణాగ్ని ’, ’ ఆహవనీయాగ్ని ’ అనే పేర్లతో పిలుస్తారు.

వివాహమైన తర్వాత మొదటిసారి అగ్న్యాధానము చేయుట ఒక ఉత్సవము.

          తైత్తిరీయ బ్రాహ్మణ వాక్యము ప్రకారము , సాధారణముగా బ్రాహ్మణుడు వసంతకాలము లోను , క్షత్రియుడు గ్రీష్మము లోను , వైశ్యుడు శరదృతువులోనూ అగ్న్యాధానము చేయవలెను. ఈ అగ్నిని , కృత్తిక , రోహిణి , పునర్వసు , పూర్వ ఫల్గుని , ఉత్తర ఫల్గుని , చిత్రా నక్షత్రములలో ఆధానము చేయవచ్చును. అంతేకాక , వైశాఖ అమావాస్య యందు , రోహిణీ నక్షత్రము తో కూడినది--చాలా ముఖ్యమైనది. అయిననూ ,

యదైవైనమ్ యజ్ఞ ఉపనమేత్ | అథాదధీత |

         అను వాక్యము ననుసరించి , ఎప్పుడు సోమయాగమును చేయ వలెనని ఇచ్ఛ కలుగునో , లేక వ్యాధి ముదిరి మరణము సన్నిహితమగునో , పుణ్యప్రాప్తికై అప్పుడే అగ్న్యాధానము చేయవచ్చును.


పైవాటిని పరిశీలిస్తే , పుట్టుక నుండే మనిషికి యజ్ఞపు అనుష్ఠానము సహజముగానే జరుగుతున్నది అనవచ్చును.

         ఈ కాలపు అనేకులకు ఇవేవీ తెలియక పోవచ్చు. దానికి కారణము మన సంస్కృతి అనేక బాహ్య కారణాలవల్ల మంటగలసి పోవుటయే ! కిందపడినవాడు మరలా పైకి లేచి దుమ్ము దులుపుకొని ఎలాగైతే మరలా పరుగెత్తుతాడో , అలాగే , లుప్తమైన మన సంస్కృతిలోని శిష్టాచారములను తిరిగి మనము మన జీవితములోనికి తెచ్చుకొనుట ఎంతైనా అవసరము.

         ఔపాసనా హోమము అనునది , మిగిలిన యజ్ఞములతో పోలిస్తే సాంకేతికంగా చాలా సరళమూ , సులభమూ తేలికా యైనది. ఇక్కడ హోమము , యజ్ఞము , యాగము అను పదాల సాంకేతిక అర్థము , వాటి తేడాలను తెలుసుకుందాము.

          దైనందిన జీవితములో అనునిత్యమూ మనము గణహోమము , రుద్ర హోమము , దుర్గా హోమము , చండీ హోమము మొదలగు పేర్లు వింటుంటాము. అట్లే , రాజసూయ యాగము , అశ్వమేధ యాగము వంటి  పేర్లను కూడా విని యుంటాము. యజ్ఞము , మరియూ యాగము అనునవి ఒకదానికొకటి పర్యాయ పదాలుగా భావించ వచ్చును. వాటికి ముఖ్యమైన భేదములు ఏవీ లేవు. అయితే , హోమములు మరియు యజ్ఞములు పర్యాయ పదములు కావు. వాటికి వ్యత్యాసములున్నవి.

           ఒకే అగ్నిలో మంత్రముల చివర ’ స్వాహా ’ అను పదమును చేర్చి , ఒక దినము లోపల , లేదా అతితక్కువ దినముల పాటు నడచు అగ్ని ఉపాసనను ’ హోమము ’ లేదా ’ హవనము ’ అంటారు. ఈ హోమముల గురించి వేదములోని వాక్యములలో ’ జుహుయాత్ ’ అను పదము ఉండును. అనగా , వేదములో విధించ బడిన కర్మల వివరణలో ఎక్కడెక్కడ ’ జుహుయాత్ ’ అన్న పదము వచ్చునో , అవన్నీ హోమములని అర్థము. వాటన్నిటిలోనూ మంత్రపు చివర ’ స్వాహా ’ అను పదము వచ్చును. ఈ హోమములను ’ దర్వీ హోమములు ’ లేక ’ గృహ్య హోమము ’ అని కూడా అంటారు. హోమములలో సాధారణముగా నెయ్యి , పాలు , చరువు ( వడ్లు దంచి , ఆ బియ్యముతో చేసిన అన్నము ) , సమిధలు వంటి పదార్థములు వాడతారు.

          అలాకాక, మూడు అగ్నులలో , రెండు లేక మూడు వేదములతో ఆశ్రావణ , ప్రత్యాశ్రావణాదులతో అనుష్టించు అగ్ని ఉపాసనలను ’ యజ్ఞము ’ లేక ’ యాగము ’ అంటారు. ఈ యజ్ఞములలోని మంత్రాల చివర ’ వషట్ ’  అను పదము  వచ్చును. ఆశ్రావణ , ప్రత్యాశ్రావణములంటే , యజ్ఞము చేయునపుడు , అధ్వర్యువు  మొదలగు ఋత్త్విజుల మధ్య దేవతల ఆవాహన , స్తోత్రములకు , ఓశ్రావయ , ’ అస్తు వౌషట్ ’ , ’ యజ ,  ’ యే యజామహే ’ , మరియూ ’ వౌషట్ ’ అను పదాల వాడకము. యాగములలో సాధారణముగా సోమరసము వాడతారు. యాగములు అనేక దినములలో జరుగును. ఒక వారము , పది రోజులు , పక్షము , నెల .. ఇలాగ.  ఈ యజ్ఞ యాగాదులు అనేక రకములు. అందులో ప్రధానముగా ఇరవై ఒక విధములూ , మరలా వాటిలో అనేక విధములూ ఉన్నాయి. యజ్ఞ యాగాల గురించి ఇక్కడికి ఆపి , హోమము ,ఔపాసన గురించి చూద్దాం .

          ఔపాసన కొరకు అగ్న్యాధానము ఎప్పుడు మొదలుపెట్టవలసినదీ చూచినాము. అగ్న్యాధానమంటే హోమము కాదు. ఆ కర్మ వలన త్రేతాగ్నులైన గార్హపత్య , దక్షిణాగ్ని మరియూ ఆహవనీయములు సిద్ధిస్తాయి. అరణులను మథించి అగ్నిని పుట్టించుట అగ్న్యాధానము లోని ప్రధాన కర్మ. అగ్న్యాధానమును అనుష్ఠించు దంపతులు దానికి ఒక వారము ముందే గణహోమమును చేయవలెను. జప , హోమాల వలన శరీరమును శుద్ధి చేసుకొనవలెను. దానిలో భాగముగా కూష్మాండ హోమమును చేయవలెను. కృచ్ఛ్రములు మొదలగు వ్రతములు ఆచరించవలెను. లోకవ్యవహారములనుండీ కూడా శుద్ధుడై ఉండవలెను. దీనినే బోధాయనుడు ఇలాగంటాడు,

అగ్నిన్ ఆధాస్యమానః ,,,!
యేనాస్యా కుశలగ్ం స్యాత్తేన కుశలం కుర్వీత |
యాన్యృణాని ఉత్థిత కాలాని స్యుస్తాని వ్యవహరేత్ |
అనుజ్ఞాపయీతవా |

         -అగ్నిని ఆధానము చేయువాడు ఎవరితోనైనా వైషమ్యముతో కలహము కలిగి ఉంటే అతడిని సమీపించి మాటలాడి సముదాయించవలెను. ఎవరితోనైనా అప్పుతీసుకొని ఉంటే , అప్పు తీర్చు అవధి ముగిసి ఉంటే ఆధానమునకు ముందే అప్పుతీర్చివేయవలెను. అది వీలుకాకపోతే , అప్పు ఇచ్చినవాడితో అగ్న్యాధానము చేయుటకు అనుమతినైనా పొందవలెను.

        అగ్న్యాధానమునకు ముందు దంపతులు దానికి ఏమేమి నియమములను పాటించవలెనో ఋత్త్విక్కుల నుండీ తెలుసుకొని అవన్నీ నెరవేర్చవలెను.  అరణులను అశ్వత్థ వృక్షపు కొమ్మలతో చేయుదురు. అరణులతో అగ్ని మంథనమును గురించిన అనేక వివరములను ఇక్కడ వ్రాయుట లేదు. వాటిని కావలసినవారు అప్పుడే తెలుసుకొనవచ్చును. లేదా ఆ వివరములను వేరొక వ్యాసములో ఇచ్చెదను.

          అరణులను మథించగా పుట్టిన అగ్నిని పూర్తిగా గార్హపత్య కుండములో వేయవలెను. దీనిని గార్హపత్యాధానము అంటారు. తరువాత ఈ అగ్ని నుండి ఒక అంశమును తీసుకొని దక్షిణాగ్ని కుండములో స్థాపించవలెను. దీనికి దక్షిణాగ్న్యాధానము అని పేరు. సూర్యుడు సగము ఉదయించినపుడు గార్హపత్య కుండము నుండీ అగ్నిని తీసుకొని ఆహవనీయ కుండములో వేయుటను ఆహవనీయాధానము అంటారు. ఈ విధముగా అగ్న్యాధానము నుండీ త్రేతాగ్నులు సిద్ధిస్తాయి.

          పిమ్మట త్రేతాగ్నులలో ధాన్యములతో వ్యాహృతి మంత్రములు చెప్పి హోమము చేయవలెను. మూడు అగ్నులలోను మంత్రపూర్వకముగా సమిధలను వేయవలెను. తరువాత అగ్ని ఉపస్థానము ( తన క్షేమము కొరకు , కోరికలు తీరుట కొరకు అగ్నిని వేడుట ) చేయవలెను. ఆ తరువాత గార్హపత్యములో ఆజ్య సంస్కారమును చేసుకొని ఆహవనీయములో పూర్ణాహుతినీ , కూష్మాండ హోమమునూ చేయవలెను. ఆపైన మథించిన అగ్నుల సంస్కారము కొరకు నేతితో అగ్నిహోత్ర హోమమును చేయవలెను. సాయంకాలము మరియూ ప్రాతః కాలము చేయవలసిన అగ్నిహోత్రమును కలిపి ఒకేసారి చేయవలెను.

          మొదటి అగ్నిహోత్రమును సాయంకాలమే చేయవలసి ఉన్ననూ , ఆధానము చేసిన అగ్నుల సంస్కారము కొరకు ప్రాతఃకాలమే రెంటినీ కలిపి ఒకేసారి  అనుష్ఠిస్తారు. ఈ మొదటి హోమములో మంత్రోచ్చారణ ఉండక , మౌనముగా చేయుట వలన దీనిని తూష్ణీమగ్నిహోత్రం అంటారు. తర్వాత కొన్ని మంత్రములతో పవమానేష్టి చేయవలెను. ఆధానము చేసిన సాయంకాలమే అగ్నిహోత్రము ప్రారంభమగును.

          ఈ అగ్నులను పన్నెండు రాత్రుల కాలము జాగ్రత్తగా అగ్ని నష్టము కాకుండా రక్షించుకొని ఉండవలెను. తరువాత వచ్చు మొదటి పౌర్ణమి నాడు లేదా , అనుకూలమైన ఒక పౌర్ణమి నాడు ’ అన్వారంభణీయేష్టి ’ చేసి , మరుసటి దినము , అనగా కృష్ణపక్ష ప్రతిపత్ నాడు ’ పూర్ణమాసేష్టి ’ ని చేయవలెను.

          ( ఔపాసన క్రమము ఎవరికి వారు చేసుకొను పద్దతి చివరగా ఇవ్వబడును. ఇప్పుడు చర్చించునవన్నీ ఋత్త్విజుల సహాయముతో చేయవలెను. ఇవి ఔపాసన మొదలు పెట్టుటకు ముందర చేయవలసిన కార్యములు కాబట్టి కర్తవ్యమును మాత్రము వివరించడమైనది. ఇవన్నీ ముఖ్యముగా యజ్ఞములను చేయగోరువారు చేయవలసినవి. కేవలము ఔపాసన చేయగోరువారికి ఇంత క్రమము లేదు. అది తరువాతి భాగములలో వచ్చును. )

ఇలాగ సిద్ధించిన అగ్నులను కాపాడుకుంటూ ప్రతి పౌర్ణమి , అమావాస్యలలో ఇష్టులను ఆచరించవలెను.

పునరాధానము

          అగ్నులను రక్షించుకుంటూ వస్తుండగా ఎపుడైనా అనివార్య కారణముల వలన అగ్ని నష్టమైతే తిరిగి అగ్న్యాధానము చేయవలసి ఉంటుంది. దీనినే శ్రౌత ప్రక్రియలో ’ పునరాధానము ’ అంటారు. పునరాధానము చేయుటకు ఆషాఢ పౌర్ణమి తర్వాత వచ్చు అమావాస్య , పాడ్యమి , లేదా విదియ ఈ మూడురోజులలో ఎప్పుడైనా పునర్వసూ నక్షత్రము వస్తే ఆనాడు మాత్రమే చేయవలెను. ఇది కుదరకపోతే , ఉత్తరాయణము లోని ఏదైనా శుక్ల పక్షములో పునర్వసు నక్షత్రము వచ్చినపుడు చేయవచ్చును. పునరాధానములోని ఒక విశేషమేమంటే , దర్భలతో నిర్మించిన పగ్గముతో ఆధానము చేయవలెను. ( అరణి మథనముతో కాదు )

అగ్నిహోత్రము పద్దతి

         ఈ కింద రాయబోవునది వేదకాలములోని ప్రక్రియ, మరియూ క్లుప్తముగా వివరణ మాత్రమే. ఈ కాలము ఆచరించు పద్దతి ఇదే వ్యాసములో తరువాత చూచెదరు. ) ఈ వ్యాసపు మొదటి భాగములో చెప్పినట్టు అగ్నిహోత్రమును సాయంకాలమే మొదలుపెట్టవలెను. ఆదినము ఉదయమే వపనము , మంత్రాచమనము , మంత్రప్రోక్షణలతో శుద్ధుడై ’ అగ్నిసూర్య ప్రజాపతయః ప్రీయంతామ్ " అని పుణ్యాహమును చేయవలెను. గార్హపత్యాగ్నికి పశ్చిమమున దంపతులు కూర్చొని ,ఆచమనము , ప్రాణాయామములు చేసి

సత్యధికారే యావజ్జీవమ్ అగ్నిహోత్రం హోష్యామి |

          అని సంకల్పము చెప్పుకొనవలెను. తర్వాత గార్హపత్యాగ్నిలో గృహ్య సూత్రము లో చెప్పినట్టుఆజ్య సంస్కారము చేయవలెను. తర్వాత స్రుక్ మరియూ సృవములను సంమార్జన చేసి ఆహవనీయాగ్నిలో దశహోత్ర హోమమునూ , తర్వాత స్రువముతో కూష్మాండ హోమమునూ చేయవలెను. ఇవి అగ్నిహోత్రమును మొట్ట  మొదట ఆరంభించునపుడు చేయవలసిన విధులు. ( స్రుక్కు స్రువములనగా , నేతిని , పాలను మొదలగువాటిని గిన్నెనుండీ తీసుకొని అగ్నిలో వేయుటకు ఉపయోగించే చెక్క గరిటలు. వీటినే దర్వి అని అంటారు )

          కిందచెప్పబోవు విధానమును బాగుగా పరిశీలించండి. తర్వాత చెప్పబోవు ఈనాటి పద్దతితో పోల్చి చూడండి. అనేక పోలికలున్ననూ , మార్పులు జరిగినది తెలుస్తుంది. వాటికి కారణములు ఏమిటీ యని ఒక్కరైనా ఆలోచించి ఒక తీర్మానము నకు వస్తే చాలా మంచిదని నా విన్నపము. ఈ వివరణ అంతా కేవలము అర్థము చేసుకొనుటకే తప్ప ఈనాటి పరిస్థితులకు అన్వయము చేసుకొనుటకు కాదు. ఈ నాడు ఆచరించు క్రమము ఈ వ్యాసపు అంతమున ప్రత్యేకముగా ఇవ్వబడును.

తరువాత , ’ ఉపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సాయమగ్ని హోత్రం పయసా హోష్యామి ’ అని సాయంకాలమూ ,

’ ప్రాతరగ్నిహోత్రం పయసా హోష్యామి " అని ప్రాతఃకాలమూ సంకల్పము చెప్పి ప్రధానమైనాగ్నిహోత్ర హోమమును చేయవలెను.

          అగ్నిహోత్ర హోమమునకు అవసరమైన అగ్నిహోత్రస్థాలి ( కుండము ) , స్రువము , స్రుక్కు , దర్భలు , సమిధలు --ఈ హోమ సాధనములను గార్హపత్యమునకు పశ్చిమమున ఒక చెక్క పలక పైన ఉంచుకొనవలెను. తర్వాత అగ్నిహోత్రము కొరకు ఆవుపాలను పిండి తేవలెను. ఆ ఆవును అగ్నిహోత్రశాలకు దక్షిణములో , ఉత్తరాభిముఖముగా కట్టివేయవలెను. ఆ పాలను బ్రాహ్మణుడే పిండవలెను.

         తర్వాత మూడు అగ్నులకూ క్రమముగా పరిషేచనము చేయవలెను. మొదట గార్హపత్యమునకు పశ్చిమమున కూర్చొని , కుండములోని నిప్పులను కొన్నిటిని అక్కడే కుండపు బయట ఉత్తరానికి వేసి , ఆ నిప్పులపై పాలను కాచవలెను. దర్భలతో అభిద్యూతన మరియూ పర్యగ్నికరణములను చేయవలెను. తర్వాత , కాచిన పాలను ఉత్తరానికి తీసిపెట్టి , నిప్పులను మరలా కుండములోనికే వేయవలెను. కుడిచేతిలో స్రువము మరియు సమిధలను , ఎడమ చేతిలో అగ్నిహోత్ర హవణినీ ( పాలు , పెరుగు వంటి వాటిని వంచుటకు , వంపు ఉన్న ఒకానొక గరిట )  తీసుకొని గార్హపత్యాగ్నిలో కాచవలెను. అగ్నిహోత్ర హవణిని దర్భ కూర్చపైన పెట్టి పాలను స్రువముతో నాలుగుసార్లు అగ్నిహోత్ర హవణిలోకి నింపుకొనవలెను. ఒకవేళ ఋత్విజుడు అగ్నిహోత్రమును చేస్తుంటే , ఇదంతా చేయుటకు యజమానుని అనుమతి తీసుకోవలెను. ఋత్త్విజుడితో చేయించవచ్చుకానీ అమావాస్య పౌర్ణములలో , అనగా పర్వకాలములో అగ్న్యాధానము చేసినవాడే హోమమును చేయవలెను.

          పాలను నింపిన తర్వాత ఒక సమిధను అగ్నిహోత్రహవణి యొక్క దండముపై పెట్టి ,ఆ హవణిని ఆహవనీయాగ్ని కుండము పశ్చిమమున ఒక వేదికపై కూర్చ పైన పెట్టవలెను. ఆహవనీయాగ్నిలో ఆ సమిదాధానము చేసి హవణిలోని పాలతో హోమము చేయవలెను. ఇదే ప్రధానమైన అగ్నిహోత్ర హోమము. అనంతరము హోమశేషాన్ని ప్రాశనము ( తాగుట ) చేయవలెను. ఇదే విధముగా మూడు అగ్నులలోనూ సమిదాధానము చేసి ఉత్తర పరిషేచనము చేయవలెను. సాయంకాలము హోమము తర్వాత అగ్న్యుపస్థానము చేయవలెను. ఔపాసనా హోమము రోజుకు విధిగా రెండు సార్లు చేయవలెను. మొదటిసారి చేస్తున్నపుడు సాయంకాలమే మొదలు పెట్ట వలెను. సాయంకాలము చేసినవాడే ప్రాతః కాలములో కూడా చేయవలెను. సాయంకాలము పాలతో చేస్తే , ప్రాతః కాలము కూడా పాలతోనే చేయవలెను. ( నెయ్యి , పెరుగులతో చేసినా అదేవిధముగా అదే పదార్థముతో సాయంత్రమూ పొద్దున్నా చేయవలెను. ) దీనికి కారణమేమంటే ,  సాయంకాలము మరియూ తరువాతి ప్రాతః కాలమూ అనుష్ఠానము చేసిన హోమములు రెండుగా కనిపించినా అది ఒక్క హోమమేయనబడును.

నిత్యమూ అగ్నిహోత్రమును అనుష్టించుటకు త్రేతాగ్నులను తప్పనిసరిగా రక్షించుకొని ఉండవలెను. ఈ సంరక్షణ అనునది రెండు విధములు.

          ఒకటి అజస్ర పక్షము. అనగా , మూడు అగ్నులనూ సర్వవేళలా కాపాడుకుంటూ ఉండవలెను. రెండవది , ఉద్ధరణ పక్షము. అనగా ఒక్క గార్హపత్యాగ్నిని మాత్రము సదా కాలమూ రక్షించుకొని , అగ్నిహోత్రము మొదలు అనేక కార్యములు చేయునపుడు ఆ గార్హపత్యాగినే దక్షిణాగ్ని మరియూ ఆహవనీయాగ్ని కుండములలో ప్రతిష్ఠించి  అనుష్ఠానమును చేయవలెను.

          పైవన్నీ ముందే చెప్పినట్టు వేదకాలములో చేసెడి పద్దతులు. ఈ కాలమునకు అనేక మార్పులు వచ్చినవి. మూల స్పూర్తి మారకున్ననూ , ఒక్కో యుగ ధర్మమును బట్టి క్రమము కొంత మారుతుండును.

ఇక ఇప్పటికి చాలు, మిగిలిన విషయములను తర్వాతి భాగములలో చూద్దామా. 

Wednesday, February 26, 2014

1. ఔపాసన --మొదటి భాగము -ఉపోద్ఘాతము



ఔపాసన --మొదటి భాగము

          సనాతన ధర్మములో మూడు వర్ణముల వారికీ ఉపనయనము ఎంత ముఖ్యమైనదో ద్విజుడి జీవితములో ఔపాసన హోమము కూడా అంతే ముఖ్యమైనది. ద్విజులలో బ్రాహ్మణులకు మరీ ముఖ్యమైనది. ఔపాసనాహోమాన్ని అనేక పేళ్ళతో పిలుస్తారు. అగ్ని పరిచర్య అనీ , తండుల హోమమనీ , ఔపసదము , ఆవసత్యము, వైవాహికము , స్మార్తము , శ్రౌతము , గృహ్యము , శాలాగ్ని వంటి అనేక పేర్లున్నాయి.

         ఈ హోమానికి ఉన్న నేపథ్యము ఏమిటని చూస్తే , దీనికి మూలము యజ్ఞము. యజ్ఞమునకు , యాగమునకు , హోమమునకూ అనేక భేదములున్ననూ , ఇక్కడ యజ్ఞము అను పదమునకు సాంకేతిక అర్థము తీసుకోలేదు. ’ యజ్ ’ అన్న ధాతువుకు ’ దేవపూజ ’ అను అర్థము ఉన్నది. యజ్ + నఙ్ = యజ్ఞః ( పాణినీయ సూత్రము ) అనగా , ఏ విధముగనైననూ దేవతలను సంతోషపరచుదానిని ’ యజ్ఞము ’ అనవచ్చు.

|| దేవతోద్దేశపూర్వక ద్రవ్య త్యాగో-యాగః ||

         అను వివరణ ఉన్నట్లు , దేవతలను ఉద్దేశించి నిర్దిష్టమైన ద్రవ్యమును ( పదార్థమును ) అర్పించునదే యాగము లేక యజ్ఞము. ఏ దేవతకు దేనిని ఆశించి యే ద్రవ్యమును అర్పించవలెను అనుదానికి ప్రమాణము శృతి లోనే కలదు. అదెట్లున్ననూ , అగ్నిదేవుడికి దేవతలను ఉద్దేశించి హవిస్సును అర్పించు కార్యకలాపమునే ’ యజ్ఞము ’ అనవచ్చునని తెలియుచున్ననూ ’ యజ్ఞము అను పదమునకు ఇంకా విస్తారమైన అర్థములు వాడుకలో ఉన్నవి. భగవద్గీతలో భగవంతుడు అర్జునునికి ద్రవ్య యజ్ఞము , జ్ఞాన యజ్ఞము , తపో యజ్ఞము మొదలైనవి తెలిపి , చివరికి ’ ఆత్మ సాక్షాత్కారము ’ చేసుకొనుట కూడా యజ్ఞమే పొమ్మన్నాడు.

ఇలాగ దేవతలను సంతోష పరచుటకే అయిననూ , యజ్ఞము వలన అనేక లౌకిక ప్రయోజనములున్నాయి. మనుస్మృతిలో ఇలాగుంది:

|| అగ్నౌ ప్రాస్తాహుతిః సమ్యగాదిత్యముపతిష్ఠతే |
ఆదిత్యాజ్జాయతే వృష్ఠిః వృష్టేరన్నం తతః ప్రజాః ||

          విధిపూర్వకముగా అగ్నిలో వదలిన హవిస్సు యొక్క రసమునంతటినీ ఆదిత్యుడు పీల్చుకొనువాడు. కాబట్టి ఆ రసము ఆదిత్యుని చేరి వృష్ఠిగా పరిణమిస్తుంది. ఆ వర్షము వలన ఆహారము దొరకును. ఆహారము వలన జీవులు పుడతారు.

గీతలో కూడా ,

|| అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః |
యజ్ఞాద్భవతి పర్జన్యః యజ్ఞః కర్మ సముద్భవః || ( ౩-౧౪ )

         సర్వప్రాణుల పుట్టుట, పెరుగుటకు అన్నమే కారణము. అన్నము ( సస్యము ) వాన నుండీ కలుగును. ఆ వాన యజ్ఞముల వలన కలుగును. ఆ యజ్ఞములు వేదోక్తమైన కర్మల వలన సంభవించును.

యజ్ఞముల ఆవశ్యకత

          మానవుడు రకరకాల కర్మలను చేస్తూనే ఉంటాడు. మళ్ళీ గీతలోనే చెప్పినట్లు , | న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్ | --ఎవరూ ఒక్క క్షణముకూడా కర్మ రహితులై ఉండలేరు. అయితే ఆ కర్మ ఏది చేయవలెను అన్నది ఎంచుకొను స్వాతంత్ర్యము మానవునికి ఉన్నది.
అయితే శృతి ఇలాగంటుంది ,

|| యజ్ఞోపి శ్రేష్ఠతమమ్ కర్మ ||

యజ్ఞమే అన్ని కర్మముల కన్నా శ్రేష్టమైనది.

కాబట్టి మన శ్రేయస్సుకు వేదమే తెలిపిన యజ్ఞమనే కర్మను ఎంచుకొనుట ఉచితము కాదా !!

         సరే , యజ్ఞమే గొప్ప కర్మ అని వేదమెందుకు అన్నది ?  వేదము ఉన్నది మానవాళి కోసమే. దేవతల కోసము కాదు. వేద విహిత కర్మలను చేయగలుగువాడు మానవుడే కానీ దేవతలు కాదు. వారు చేయాలనుకున్నా , మానవుడిగా పుట్టి చేయవలసినదే. కాబట్టి మానవుడికి యజ్ఞమే గొప్ప కర్మ యని వేదము తెలుపుటకు కారణమేమి ? అందులోని లౌకికార్థము లేదా , లౌకిక ప్రయోజనము ఏమిటి ?

          లోకములో చైతన్యము ఉండవలెనన్న , ఉష్ణము మరియూ కాంతి తప్పనిసరిగా అవసరము. అవి లేనినాడు చైతన్యము లేదు , జీవులు లేరు. చీకట్లో విత్తనము నాటబడినా , అది వెలుగు వైపుకే తీగగా పెరుగుతుంది. కాంతి లేని , మేఘావృతమైన దినమును సంస్కృతములో ’ దుర్దినము ’ అంటారు. ( మేఘచ్ఛన్నేఽహ్ని దుర్దినమ్ --- అమర కోశం ). కాబట్టి , చైతన్యము , ఉత్సాహము వంటివి కలగాలంటే అది ఎండ , వెలుగుల వలననే సాధ్యము. ఉష్ణము దేహములో ఉన్నంత వరకే దేహపు అస్తిత్వము. ఈ ఉష్ణము , వెలుగు లకు మూలము , సూర్యుడు మరియు అగ్ని. సూర్యుడు మనకు అన్నివేళలా అందుబాటులో ఉండడు. వాడినుండి మనకు అన్నివేళలా , అన్ని ప్రాంతాలలో ఉష్ణము దొరకదు. ఇక మిగిలినది అగ్ని.

         సూర్యోపాసన , సూర్య పూజ ల ఫలితములు వేరు , అగ్న్యుపాసన యొక్క ఫలితములు వేరు. సూర్యుడు ఒకదానికి అవసరమైతే , అగ్ని ఇంకొకదానికి అవసరమగును. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడిమి , వెలుగు కావాలంటే అగ్నియే శరణము. ( ఈ కాలము సౌర శక్తిని ఉపయోగించి ఎప్పుడు కావాలంటే అప్పుడు కాంతి , ఉష్ణములను పొందే ప్రయత్నము మానవుడు చేయుచున్నా , దానికి అనేక పరిమితులు గలవు )  కాబట్టి అగ్ని సంరక్షణ , ఉపాసనలు అవసరము. ఈ దృక్పథముతోనే మానవ జీవితములో అగ్ని ఆరాధన అనేది ఒక భాగమైపోయింది.

యజ్ఞములు ఆరంభమైనది ఎప్పుడు ?

|| సహ యజ్ఞాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః |
అనేన ప్రసవిష్యధ్వమేష వోఽస్త్విష్ట కామధుక్ ||

      అని గీతలో చెప్పినట్లు , ప్రజాపతి ప్రజలను సృష్ఠించునపుడే వారితో పాటే యజ్ఞములను సృష్ఠించినాడు. ( ప్రజలనుద్దేశించి , ) ఈ యజ్ఞముల వలన మీరు వృద్ధి పొందండి, యజ్ఞములు మీరు కోరినవి ఇచ్చును గాక ||

|| దేవాన్భావయతానేన తే దేవా భావయంతు వః |
పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ ||

         ఈ యజ్ఞముల వలన మీరు దేవతలను తృప్తి పరచండి , దేవతలు మిమ్మల్ని అనుగ్రహించి మిమ్మల్ని తృప్తి పరుస్తారు. ఇలాగ పరస్పర సహకారముతో వృద్ధి పొంది పరమ శ్రేయస్సు అగు మోక్షమును పొందండి.

కాబట్టి ఇచ్చిపుచ్చుకొనుటయే యజ్ఞము.

యజ్ఞములు అవసరము లేని వారు , చేయనవసరము లేని వారు ఎవరు ?

|| ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః |
తైర్దత్తానప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః ||

         మీకు ఇష్టమైన భోగములను యజ్ఞపూజితులైన దేవతలు ఇస్తారు. దేవతలు ఇచ్చు కొన్నిటిని ( నీరు , వెలుగు , ఉష్ణము , సస్యములు మొ|| ) ఉపయోగించుకొని , తిరిగి దేవతలకు ఏమీ ఇవ్వకుండా తాను మాత్రము అనుభవించువాడు చోరుడే అవుతాడు.

కాబట్టి ,ప్రతియొక్కరూ , ఎప్పుడో ఒకప్పుడు దేవతలకు హవ్యమును ఇచ్చి తీరవలసిందే. ఎవరికీ మినహాయింపు లేదు.


        సరే , బాగానే ఉంది , అయితే అగ్నికి బదులు సూర్యుడిని ఎందుకు ఉపాసించరాదు ? సూర్యుడు ఎక్కడో ఉన్నంత మాత్రాన మనకు మానసికముగా అందుబాటులో లేనట్టా ? అనే ప్రశ్న కలగవచ్చు. దీనికి సమాధానము కూడా వేదమే చెబుతుంది, తైత్తిరీయ బ్రాహ్మణములో ఇలాగుంది,

|| అగ్నిం వావాదిత్యః సాయం ప్రవిశతి ||మరియూ ,
|| సౌరం తేజః సాయమగ్నిం సంక్రమతే |

అనగా , సూర్యుని తేజస్సు సాయంకాలములో అగ్నిని ప్రవేశిస్తుంది. అలాగే ,

ఉద్యంతం వావాదిత్యమగ్నిరను సమారోహతి |

         అనగా , అగ్ని యొక్క తేజస్సు ప్రాతః కాలములో సూర్యుని చేరును. అంతేకాక, ఇంకొన్ని నియమముల ప్రకారము , ఔపాసనా హోమము రోజుకు విధిగా రెండు సార్లు చేయవలెను. మొదటిసారి చేస్తున్నపుడు సాయంకాలమే మొదలు పెట్ట వలెను. సాయంకాలము చేసినవాడే ప్రాతః కాలములో కూడా చేయవలెను. సాయంకాలము పాలతో చేస్తే , ప్రాతః కాలము కూడా పాలతోనే చేయవలెను. ( నెయ్యి , పెరుగులతో చేసినా అదేవిధముగా అదే పదార్థముతో సాయంత్రమూ పొద్దున్నా చేయవలెను. ) దీనికి కారణమేమంటే ,  సాయంకాలము మరియూ తరువాతి ప్రాతః కాలమూ అనుష్ఠానము చేసిన హోమములు రెండుగా కనిపించినా అవి రెండూ కలిపి ఒక్క హోమమేయనబడును. కాబట్టి , మొదట సాయంత్రమే మొదలుపెట్టి చేయవలెను గనక , తిరిగి ప్రాతఃకాలములో చేయునది దానికి కొనసాగింపే గనక , రెండు పూటలా అగ్నినే  ఉపాసించి , అగ్నికే ఆహుతినీయవలెను.

        అంతే కాక , ఔపాసనలో పలికే మంత్రములను చూస్తే , వాటికి , అగ్నీ , జ్యోతీ ఒక్కటే , సూర్యుడూ , జ్యోతీ ఒక్కటే అన్న అర్థము వస్తుంది.

|| అగ్నిర్జోతిర్జ్యోతిరగ్నిః స్వాహా ||
|| సూర్యో జ్యోతిర్జ్యోతిః సూర్యః స్వాహా ||

అనికానీ , లేదా

|| అగ్నిర్జోతిర్జ్యోతిస్సూర్యః స్వాహా ||
|| సూర్యో జ్యోతిర్జ్యోతిరగ్నిః స్వాహా ||

         అని పలుకుతాము. మొదటిది అసంసృష్ఠ హోమమనీ , రెండోది సంసృష్ఠ హోమమనీ అంటారు. ఏ విధముగానైనా చేయవచ్చు. కాబట్టి ఏ విధముగా హోమము చేసిననూ హవిస్సును అగ్నికే ఇచ్చుటకు ఇదే కారణము. అందుకే దీనిని ’ అగ్నిహోత్రము ’ అంటారు.


( మిగిలిన వివరములూ , విధానములు తరువాతి భాగములలో చూడుడు )

Tuesday, February 25, 2014

అగ్నికార్యము ---విధానము



అగ్నికార్యము

పరాశరులు  ద్విజుల కర్తవ్యములను గురించి ఇలాగంటారు

|| అగ్నికార్య పరిభ్రష్ఠా స్సంద్యౌపాసన వర్జితాః | వేదం చ యేనధీయానాస్తే సర్వే వృషలాస్మృతాః || 

అగ్నికార్యము   సంధ్యావందనము , బ్రహ్మ యజ్ఞము , వైశ్వదేవము ,  ఔపాసనము , వేదాధ్యయనము --వీటిని వదలిన ద్విజులు ’ వృషలులు ’ అనబడతారు.  వృషలుడనగా పతితుడు. అట్టివానికి సమాజమున గౌరవముగానీ ఇతర శుభ కర్మలు చేయు అధికారము గానీ ఉండదు.ఇవి చేయుట వలన గౌరవము , అధికారమే కాకుండా అనేక ఇతర  విశేషమైన మహోపయోగములు కూడా కలవు. 

మొదటిదైన ’ అగ్ని కార్యమును ’  గురించి తెలుసుకుందాము. దీనినే ’ సమిదాధానము ’ అనికూడా అంటారు. బ్రహ్మచారులు చేయునది సమిదాధానము. గృహస్థులు చేయునది ’ ఔపోసనము ’ 

అగ్నికార్యమనగా అగ్నిని వెలిగించి చేయు ఏదో ఒక కార్యము కాదు. బ్రహ్మచారి అగ్ని ( యజ్ఞేశ్వరుని యొక్క )  పరిచర్యను చేయుటనే అగ్నికార్యము అందురు. పూర్వము మృత్యుదేవత బ్రహ్మచారులను పట్టి పీడించేది. ఆ మృత్యువు బారి నుండీ బ్రహ్మచారులు పడకుండా అగ్నిదేవుడు వారిని వరమిచ్చి కాపాడినాడు. కాబట్టి మృత్యు దేవతనుండీ బ్రహ్మచారులను కాపాడి ఉద్ధరించిన అట్టి అగ్నిదేవుని పరిచర్య చేయుట బ్రహ్మచారుల విధి. అగ్నికార్యము వదలిన బ్రహ్మచారులను సమిధలుగా మృత్యువు తీసుకొనును. ( అగ్నికార్యమును వదలిపెట్టిన బ్రహ్మచారులకు ప్రాయశ్చిత్తంగా ’ మితాక్షరి ’ , చంద్రిక ’ , ’ ఋగ్విధానము ’ యను గ్రంధములలో తీవ్ర విధానములు విధింపబడినవి. ఒకసారి మానేస్తే శివాలయం లో ’ మానస్తోకే ’ మంత్రాన్ని నూరు సార్లు జపించవలెను. సంధ్య , అగ్నికార్యములను వదలిన వాడు ఎనిమిది వేల గాయత్రీ జపాన్ని చేయవలెను. )

జపము , తపము , స్తోత్రము , అర్చన , పూజ వీటన్నిటికన్నా హోమము చేయుట వలన అతి శీఘ్రముగా ఫలితములు కలుగును. దీనికి కారణమేమనగా , పైవాటిని అనుష్ఠించునపుడు మన మనస్సును నిశ్చలముగా భగవంతుని పైనే కేంద్రీకరించుట అతి కష్టము. అనేక విధములైన ఆలోచనలతో చేయు ఆ పూజలు భగవంతునికి చేరుటకు కఠోర దీక్ష అవసరము. అయితే , హోమములోని విశేషమేమనగా , మనము హవ్యములను ఆహుతి ఇచ్చిన మరుక్షణమే అవి యజ్ఞేశ్వరునికి అందును. ఆ ఆహుతులను యజ్ఞేశ్వరుడు హవ్య కవ్యములుగా మార్చి మనము ఉద్దేశించిన దేవతలకు అందించును.  అందువలన హోమము అతి ఉపయుక్తమైన అనుష్ఠానము. 

హోమమనిన మరియేమో కాదు , మానవులు , దేవతల మధ్య ఒక ఒడంబడిక. మనకు కావలసిన అనేక శుభములను దేవతలు లిప్తకాలములో ఇవ్వగల సమర్థులు. వారు చేయునదెల్లా మన మనసులను ప్రేరేపించుటయే. మనకు ఏ కార్యము కావలెనన్ననూ , ఇంకొకరి అవసరము తప్పదు కదా, అలాగ అందరి మనసులను మనకు అనుకూలముగా మార్చగల శక్తి కలవారు. అయితే దేవతలకు కావలసిన హవ్య కవ్యములు వారికి అతి దుర్లభములు. మన వలె వారు భోజనము చేయలేరు. నీటిని త్రాగలేరు. కేవలము వారికని సంకల్పించి ఎవరైనా సమర్పిస్తే , వాటిని చూచి గానీ , ఆఘ్రాణించి గానీ తృప్తి పడతారు. వాటిని సంపాదించుటకు వారికి దేహము లేదు, అనగా మానవుడికి వలె పాంచభౌతికమైన దేహము లేదు. కనుక అవి మానవులు మాత్రమే వారికి ఇచ్చుటకు సమర్థులు. ఈ రహస్యమును తెలుసుకొని , అందరూ దేవతలను ఆరాధించునది అందుకే. 


 అగ్ని కార్యము చేయుట వలన , అతి గొప్పవైన  బ్రహ్మ వర్చస్సు, మేధ , బుద్ధి , తేజస్సు, పరివారము , ఇంద్రియ పుష్టి , బలము , సంపదలు మొదలగునవి కలుగుతాయి. అగ్నికార్యము చేయువానిని చెడుశక్తులు తేరిపారి కూడా చూడలేవు. ఇతరుల పాపపు దృష్టి వారిపై పడదు. 

క్రమము తప్పక అగ్నికార్యమును చేయు బ్రహ్మచారి మేధస్సును , తేజస్సును , వర్చస్సును చూచినచో అతనికి సర్వులూ వశము కావలసినదే. అనగా , అతడిని అందరూ అభిమానముతో ఆరాధించెదరు. 
అగ్నికార్యము చేయుట నేర్చుకొన్న తర్వాత , రోజూ చేస్తూ ఉంటే , అలవాటు అయిపోయి అయిదు నిముషములకన్నా ఎక్కువ తీసుకోదు. మొదట్లో ఎక్కువ సమయము పట్టవచ్చును. కాబట్టి శ్రద్ధ ఉన్నవారు తీరిక సమయములో మొదట నేర్చుకొని తరువాత అనుష్ఠించవచ్చును. ( వీలైతే ఇందులోని మంత్రములను పలికి ఆడియో ఫైల్ గా ఇవ్వగలను  )

అగ్నికార్యము నిత్య నైమిత్తిక కార్యముకోవకు వస్తుంది. అనగా ,ఏ కర్మను తప్పనిసరిగా ప్రతిదినమూ చేయవలెనో , ఏ కర్మను చేయకపోతే దానికి ప్రత్యవాయము కలదో అది నిత్య కర్మ. నైమిత్తికమనగా విశేష దినములలో చేయవలసిన కార్యములు. ఉపాకర్మ , శ్రాద్ధములు , అమావాస్య , గ్రహణ ఇత్యాది తర్పణములు మొదలైనవి. 


అగ్ని కార్యములో ఉపయోగించవలసిన సమిధలు : అగ్నికార్యము చేసిన ప్రతిసారీ పద్ధెనిమిది సమిధలు అవసరమగును.  శమీ ( జమ్మి ) , పలాశ ( మోదుగ ) , వైకంకత ( వెలగ ) , అశ్వత్థ ( రావి ) , ఔదుంబర ( మేడి , అత్తి ) , బిల్వ ( మారేడు ) , చందన ( గంధపు చెక్క ) , శాల (  సాల ) , దేవదారు , ఖాదిర ( చండ్ర ) ఈ చెట్ల లో ఏదో ఒక చెట్టు సమిధనైనా , లేదా అనేక చెట్ల సమిధలనైనా వాడ వచ్చు.  ఈ సమిధలు  బొటన వేలికన్నా లావు ఉండరాదు , పైన బెరడు తీసి ఉండరాదు, పురుగులు , చెదలు పట్టి ఉండరాదు , జుత్తెడు ( జానెడు కన్న కొంచము ఎక్కువైన , అనగా ఆరు అంగుళాలైనా ఉన్నది )  పొడవు ఉండవలెను. చీలి కాని , రెండు కొమ్మలుగా గానీ ఉండరాదు. ఆకులతో చేరి ఉండరాదు. పూర్తిగా ఎండిపోయి కృశించి ఉండరాదు. వంకర తిరిగి ఉండరాదు. కణుపులు ఉండరాదు. అటువంటి సమిధలనే వాడవలెను. 

ఇవేవీ దొరకని పక్షములో చివరికి దర్భలను కూడా వాడ వచ్చును కానీ అగ్నికార్యమును చేయుట మానరాదు అని కొందరి మతము. 

విశేష నియమములు : అగ్ని కార్యము చేయుటకు ఒక స్థండిలము కావలెను. అనగా హోమ కుండము. దీనిని ఇటుకలతో చేసుకొన వచ్చును. లేదా ఈ మధ్య వాడుటకు సిద్ధముగా ఉన్న అనేక లోహపు స్థండిలములు దొరకుచున్నవి. దానిలోపల ఇసుక వేసి , పైన కొద్దిగా బియ్యము కానీ బియ్యపు పిండిగానీ పరచవలెను. ఉపనయనము అయిన నాటి నుడీ ఆ ఉపనయనాగ్నిలోనే సాయంత్రము మొదలుపెట్టి , ఉదయమూ , సాయంత్రమూ అగ్నికార్యము చేయవలెను. అది కుదరని యెడల , లౌకికాగ్ని లోనే చేయవలెను. హోమములు , యజ్ఞములు చేయునపుడు , అగ్నిని ప్రార్థించి , హోమానికి రక్షగా మంత్రములతో అభిమంత్రించిన నీటిని , బ్రహ్మను నియమించి , యజ్ఞాయుధములను ( అనగా షట్పాత్రలు లేదా చతుష్పాత్రలు ) మరియు ఆజ్యమును , చరువును సంస్కరించి , అగ్నికి పరిస్తరణములు , పరి సమూహనము , అలంకారము , పూజ మొదలగునవి  చేయు కర్మను " అగ్ని ముఖము " అందురు. అందులో నెయ్యి అవసరమగును. 

 అగ్ని కార్యము చేయుటకు షట్పాత్ర , చతుష్పాత్ర ప్రయోగము లేదు. పూర్తి స్థాయిలో అగ్నిముఖము చేయకపోయినా , కొన్ని క్రమములను పాటించవలెను. విధానములో వాటిని చూడ వచ్చును. 

స్నానముతో శుచుడై , మడి బట్టలు కట్టుకొని , సంధ్యావందనము చేసి , ఆ తరువాత తూర్పుకు తిరిగి హోమకుండము ముందర ఆసనముపై కూర్చొనవలెను. స్నాన సంధ్యలు చేయకుండా ఎన్నటికినీ అగ్నికార్యము చేయరాదు. చేసిననూ నిష్ఫలమగును. యే అనుష్ఠానము చేసిననూ , మొదట విధిగా రెండు సార్లు ఆచమనము చేయవలెను. ఒక్క సారి మాత్రమే చేయరాదు.  ఆచమనము , ప్రాణాయామము చేసి  ఈ విధముగా సంకల్పము చెప్పవలెను ,

విధానము : 
మమోఽపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య , శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం , ప్రాతరగ్ని ( సాయంకాలమైతే  సాయమగ్ని అని ) హోమ కార్యం కరిష్యే | ( లేదా సమిధమాధాస్యే )  ( కుడి చేతితో నీళ్ళు ముట్టుకొన వలెను ) 

కుండములో కట్టెలు , ఎండిన పిడకలు మొదలైనవి వేసి అగ్నిని ప్రజ్వలింపజేయవలెను. ప్రజ్వలింపజేయునపుడు ఈ మంత్రమును చెప్పవలెను

|| ఉపావరోహ జాతవేదః పునస్త్వమ్ | దేవేభ్యో హవ్యం వహనః ప్రజానన్ |
ఆయుః ప్రజాగ్ం రయిమస్మాసు ధేహి | అజస్రో  దీదిహినో దురోణే ||

భూర్భువస్సువరోం | అగ్నిమ్ ప్రతిష్టాపయామి. 

ఇప్పుడు  ఒక  సమిధను తీసుకొని, జ్వలిస్తున్న యజ్ఞేశ్వరుడికి ఆహుతి వేసి ఈ కింది మంత్రమును చెప్పవలెను.

|| ఓం స్వాహా జుషస్వనః సమిధమగ్నే అద్యశోచా బృహద్యజతం ధూమమృణ్వన్ |
ఉపస్పృశ దివ్యగ్ం సానస్తూపైః సగ్ం రశ్మిభిస్తతనః సూర్యస్య ||

అగ్నిని ప్రజ్వలించిన తరువాత ఈ మంత్రాన్ని చెప్పవలెను

|| పరిత్వాగ్నే పరిమృజామ్యాయుషా చ ధనేన చ | సుప్రజాః ప్రజయా భూయాసగ్ం సువీరో వీరైస్సువర్చా వర్చసా సుపోషః పోషైః స్సుగృహో గృహైస్సుపతిః పత్యా సుమేధా మేధయా సుబ్రహ్మా బ్రహ్మ చారిభిః ||

ఇప్పుడు  అక్షతలు , పూలు తీసుకొని కుండమునకు ఎనిమిది మూలలందూ కొద్దిగా ఉంచుతూ అగ్నిదేవుడికి అలంకారము ,చేయవలెను. తూర్పు నుండీ మొదలు పెట్టి , ఆగ్నేయమూల మీదుగా ప్రదక్షిణముగా వదలుతూ ఈశాన్యము వరకూ ఎనిమిది దిక్కులలోనూ అక్షతలు వదలునపుడు వరుసగా ఈ ఎనిమిది మంత్రములను చెప్పవలెను

|| అగ్నయే నమః | హుతవహాయ నమః | హుతాశినే నమః | కృష్ణ వర్త్మనే నమః | దేవముఖాయ నమః | సప్తజిహ్వాయ నమః | వైశ్వానరాయ  నమః | జాతవేదసే నమః || 

అటులే అగ్ని మధ్యలో కూడా వేసి ఈ మంత్రమును చెప్పవలెను

|| మధ్యే శ్రీ యజ్ఞపురుషాయ నమః || 

ఇప్పుడు కింది విధముగా అగ్ని పరిషేచనం చేయవలెను.

కుడిచేతితో కొద్దిగా నీరు తీసుకొని , హోమకుండమునకు బయట కుడి ప్రక్క , అనగా దక్షిణము న పడమటి నుండి తూర్పుకు  ధారగా ఈ మంత్రముతో నేలపై నీరు వదలవలెను. 

అదితేను మన్యస్వ | 

తర్వాత మళ్ళీ నీరు తీసుకొని , కుండమునకు పశ్చిమమున , దక్షిణము నుండీ ఉత్తరమునకు ( దక్షిణపు నీటిని కలుపుకొని ) ధారగా ఈ మంత్రముతో నేలపై నీరు వదలవలెను.

అనుమతేను మన్యస్వ |

తర్వాత మళ్ళీ కుండమునకు ఎడమవైపున /ఉత్తరము వైపు , పడమటి నుండి తూర్పుకు ( పశ్చిమపు నీటిని కలుపుకొని) ధారగా ఈ మంత్రముతో నీరు వదలవలెను. 

 సరస్వతేను మన్యస్వ |  

చివరిగా కుండమునకు తూర్పున , ఈశాన్యమునుండీ మొదలుపెట్టి కుండము చుట్టూ ప్రదక్షిణముగా మరలా ఈశాన్యమునే కలుపుతూ ధారగా ఈ మంత్రముతో నీరు వదలవలెను. 

దేవసవితః ప్రసువ |

ఇప్పుడు మిగిలిన పదిహేడు సమిధలను తీసుకొని , ఒక్కొక్క దానినీ కింది పదిహేడు మంత్రములతో 
( ఒక మంత్రమునకు ఒక సమిధ ) స్వాహాకారము చెప్పి క్రమముగా సమిదాధానము ( ఆహుతి ) చేయవలెను. 

౧. || అగ్నయే సమిధమాహార్షం బృహతే జాతవేదసే యథా త్వమగ్నే సమిధా సమిధ్య స ఏవం మామాయుషా వర్చసా సన్యా మేధయా ప్రజయా పశుభిర్బ్రహ్మ వర్చసేనాన్నాద్యేన సమేధయ స్వాహా ||

౨. ఏధోఽస్యేధిషీమహి స్వాహా ||

౩. సమిదసి సమేధిషీమహి స్వాహా ||

౪. తేజోఽసి తేజో మయి ధేహి స్వాహా ||

౫. అపో అద్యాన్వచారిషగ్ం రసేన సమసృక్ష్మహి పయస్వాగ్ం అగ్న ఆగమం తం మా సగ్ంసృజ వర్చసా స్వాహా ||

౬. సం మాగ్నే వర్చసా సృజ ప్రజయా చ ధనేన చ స్వాహా ||

౭. విద్యున్మే అస్య దేవా ఇంద్రో విద్యాథ్సహ ఋషిభిస్వాహా ||

౮. అగ్నయే బృహతే నాకాయ స్వాహా ||

౯. ద్యావాపృథివీభ్యాగ్ స్వాహా ||

౧౦. ఏషా తే అగ్నే సమిత్తయా వర్ధస్వ చాప్యాయస్వ చ తయాహం వర్ధమానో భూయాసమాప్యాయమానశ్చ స్వాహా ||

౧౧. యో మాగ్నే భాగినగ్ం సంతమథాభాగం చికీర్షత్య భాగమగ్నే తం కురు మామగ్నే భాగినం కురు స్వాహా ||

౧౨. సమిధ మాధాయాగ్నే సర్వవ్రతో భూయాసగ్గ్ స్వాహా ||

౧౩. భూః స్వాహా ||  అగ్నయ ఇదమ్ నమమ

౧౪. భువః స్వాహా || వాయవ ఇదం నమమ

౧౫. సువః స్వాహా || సూర్యాయేదం నమమ

౧౬. భూర్భువస్సువస్స్వాహా || ప్రజాపతయ ఇదం నమమ 

౧౭. స్వాహా జుషస్వనః | 

సమిధలు సరిపడా లేని పక్షములో కనీసము చివరి అయిదు ఆహుతులనైనా వేయవలెను. ( భూః స్వాహా నుండీ స్వాహా జుషస్వనః   వరకూ ) 

ఇప్పుడు మరలా వెనుకటి వలెనే , ఈ కింది మంత్రములతో అగ్ని పరిషేచనము చేయవలెను. 

కుడిచేతితో కొద్దిగా నీరు తీసుకొని , హోమకుండమునకు బయట కుడి ప్రక్క , అనగా దక్షిణము న పడమటి నుండి తూర్పుకు  ధారగా ఈ మంత్రముతో నేలపై నీరు వదలవలెను. 

అదితేఽన్వ మగ్గ్‌స్థాః  | 

తర్వాత మళ్ళీ నీరు తీసుకొని , కుండమునకు పశ్చిమమున , దక్షిణము నుండీ ఉత్తరమునకు ( దక్షిణపు నీటిని కలుపుకొని ) ధారగా ఈ మంత్రముతో నేలపై నీరు వదలవలెను.

అనుమతేఽన్వ మగ్గ్‌స్థాః  | 

తర్వాత మళ్ళీ కుండమునకు ఎడమవైపున /ఉత్తరము వైపు , పడమటి నుండి తూర్పుకు ( పశ్చిమపు నీటిని కలుపుకొని) ధారగా ఈ మంత్రముతో నీరు వదలవలెను. 

 సరస్వతేఽన్వ మగ్గ్‌స్థాః  | 

చివరిగా కుండమునకు తూర్పున , ఈశాన్యమునుండీ మొదలుపెట్టి కుండము చుట్టూ ప్రదక్షిణముగా మరలా ఈశాన్యమునే కలుపుతూ ధారగా ఈ మంత్రముతో నీరు వదలవలెను. 

దేవసవితః ప్రాసావీః |

తరువాత కింది మంత్రములు చెప్పుచూ అగ్న్యుపస్థానము చేయవలెను. అగ్ని ఉపస్థానము అనగా యజ్ఞేశ్వరుని ప్రార్థిస్తూ , బ్రహ్మచారి , తనను సర్వదా కాపాడమని , తనకు తేజస్సు , వర్చస్సు , మేధ , బుద్ధి , సంపదలు , బలము మొదలగునవి ఇవ్వమని వేడుకొనుట. 

|| యత్తే అగ్నే తేజస్తేనాహం తేజస్వీ భూయాసమ్ | యత్తే అగ్నే వర్చస్తేనాహం వర్చస్వీ భూయాసమ్ | యత్తే అగ్నే హరస్తేనాహం హరస్వీ భూయాసమ్ || 

|| మయి మేధాం మయి ప్రజాం మయ్యగ్నిస్తేజో దధాతు | మయి మేధాం మయి ప్రజాం మయీంద్ర ఇంద్రియం దధాతు | మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యో భ్రాజో దధాతు || 


ఈ కింది మంత్రమును చెప్పుచూ హోమ కుండపు తూర్పు వైపు నుండీ గానీ ఉత్తరము నుండీ గానీ ఒక సమిధతో భస్మమును సంగ్రహించవలెను. 

|| మానస్తోకే తనయే మాన ఆయుషి మా నో గోషు మా నో అశ్వేషు రీరిషః | వీరాన్మానో రుద్రభామితో వధీర్‌హవిష్మంతో నమసా విధేమ తే || 

తరువాత , ఆ భస్మమును ఈ మంత్రములు చెప్పుచూ శరీరములోని ఆయా భాగములలో ఉంచుకొనవలెను. 

మేధావీ భూయాసమ్ | (  లలాటమున భస్మమును పూసుకొన వలెను )

తేజస్వీ భూయాసమ్ | ( హృదయమున )

వర్చస్వీ భూయాసమ్ | ( కుడి భుజము )

బ్రహ్మ వర్చస్వీ భూయాసమ్ | ( ఎడమ భుజము )

ఆయుష్మాన్ భూయాసమ్ | ( కంఠము ) 

అన్నదో భూయాసమ్ | ( జఠరము  అనగా నాభి పైభాగము ) 

యశస్వీ భూయాసమ్ | ( శిరస్సు )

సర్వ సమృద్ధో భూయాసమ్ | ( శిరస్సు )

తర్వాత ఈ మంత్రములను చెప్పవలెను

|| పునస్త్వాదిత్యా రుద్రా వసవస్సమింధతాం పునర్బ్రహ్మాణో వసునీథయజ్ఞైః | ఘృతేనత్వం తనువో వర్ధయస్వ సత్యాస్సంతు యజమానస్య కామా స్వాహా || 

యజ్ఞేశ్వరుడికి ప్రదక్షిణము చేసి మరలా తన స్థానములో నిలుచుకొని నమస్కరిస్తూ ఇది చెప్పవలెను.

||మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశన | యద్ధుతంతు మయా దేవ పరిపూర్ణం తదస్తు మే || 

|| స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం | ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే హవ్యవాహన | శ్రియం దేహి మే హవ్యవాహన | ఓమ్ నమః || 

అభివాదనమ్ 

( ఇక్కడ ప్రవర చెప్పుకోవలెను )

|| చతుస్సాగర పర్యంతం .........అహంభో అభివాదయే || 

|| హోమాంతే శ్రీ యజ్ఞపురుషాయ నమః || ధ్యానాది షోడశోపచారాన్ సమర్పయామి ||

అనేన ప్రాతః ( సాయం )  సమిదాధాన హోమేన భగవాన్ శ్రీ యజ్ఞేశ్వరః ప్రీయతామ్ || 

భగవదర్పణమ్

|| కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేస్స్వభావాత్ | 
కరోమి యద్యద్సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి ||


|| శుభం భూయాత్ ||


Tuesday, February 4, 2014

మాఘ మాసము----రథ సప్తమి

మాఘ మాసము
( ధర్మ సింధువు ప్రకారము )


మాఘ మాసమందు ప్రాతఃస్నానము చేయాలి. హవిష్యము ( హోమము ) , బ్రహ్మ చర్యము , మాఘస్నానము  - గొప్ప ఫలాన్ని ఇస్తాయి.  మాఘ మాసము వస్తే సూర్యోదయము కాగానే జలములన్నీ శబ్దిస్తాయి .. త్రివిధములైన సర్వ పాపములనూ పోగొట్టి పవిత్రులను చేస్తాయి. ఉషః కాలములో సూర్యకిరణములతో వేడెక్కిన అందమైన నదీ ప్రవాహమునందు స్నానమాచరించిన వారు పితృ , మాతృ వంశములకు చెందిన తన సప్త ఋషులను ఉద్ధరించి , పిదప అమర దేహుడై స్వర్గమునకు వెళతాడు. అరుణోదయము కాగానే విచక్షణుడు మాధవుని పాద ద్వంద్వమును స్మరిస్తూ స్నానం చేస్తే సురపూజితుడవుతాడు.

నక్షత్రములుండగా చేసిన స్నానము ఉత్తమము. చుక్కలుపోయాక చేసినది మధ్యమము. సూర్యుడుదయించాక చేసినది అంతకన్నా హీనము.ఈ స్నానము ప్రయాగ నందు చాలా ప్రశస్తమైనది. గంగయందు , సంగమమందు చేసినది కాశీ యందలి స్నానము కన్నా నూరు రెట్లు పుణ్యప్రదము. పశ్చిమ వాహిని స్నానము దానికన్నా వేయిరెట్లు అధిక ఫలము . అట్లాగే సముద్రమందు కూడా ఈ స్నానము మిక్కిలి ప్రశస్తమైనది.

మాఘ శుక్ల  త్రయోదశి నుంచీ మూడు రోజులు ' మాఘీ ' అంటారు.. కనీసము ఆ మూడురోజులయినా నదీ / సముద్ర స్నానము చేయాలి.

మాఘ స్నానమున నియమములు  ; 

స్నానం చేయకుండా అగ్ని దగ్గర కూర్చోరాదు. స్నానం చేయకుండా అగ్ని సేవనము తగదు. హోమము కొరకు వహ్నిని సేవించాలేకానీ శీతము కొరకు వద్దు. ప్రతి రోజు చక్కెర తో కూడిన నువ్వులను దానము చేయాలి. మూడు భాగములు నువ్వులు , ఒక భాగము చక్కెర ఉండాలి.

వ్రతమందున్నవాడు నెలమొత్తము అభ్యంగనస్నానము లేకుండా గడపాలి. వహ్నిహోమము చేసి ఏకాశనుడు కావాలి. భూశయ్య , బ్రహ్మచర్యము వీని యందు శక్తుడైనవాడు స్నానం చేయాలి. అశక్తుడు అంతట స్వేచ్చగా ఉండొచ్చు.   అట్లాగే తిలల స్నానము.  తిలలు ( నువ్వులు ) వంటికి రాచుకోవడము , తిల హోమము , తిలతర్పణము , తిలభోజనము , తిలదానము.--ఈ ఆరు రకముల తిలలు పాప నాశకములు.

స్నానము తర్వాత కట్టెవలె మౌనము గానుండి నమస్కరించి పురుషోత్తముని పూజించాలి.

దానములు ;

నూనె , ఉసిరికాయలు వీటిని ప్రతిరోజు తీర్థమందు ఇవ్వాలి. బ్రాహ్మణుల సేవనము కొరకు అగ్నిని ప్రజ్వలింపజేయాలి. భోజనాలు తృప్తి వరకూ ఏర్పాటు చేయాలి. వస్త్ర భూషణములతో అలంకరించి ద్విజ దంపతులను భుజింపజేయాలి. కంబలము , జింక చర్మము , రత్నములు, వివిధ వస్త్రములు , రవికలు , కప్పుకొనుటకు వస్త్రాలు ఇవ్వాలి. చెప్పులు గుల్మ మోచకములు మరియు పాపమోచకములు కాబట్టి వానిని ఇవ్వాలి.

శక్తి కొద్దీ అన్నదానము చేయాలి. వేదవిద్వాంసునకు గుంజెత్తు అయినా బంగారమివ్వాలి. మాఘమాసాంతమందు షడ్రస భోజనమాచరించాలి.


నిజానికి ప్రాతఃస్నానము పుష్య మాస శుక్ల పక్ష ఏకాదశిన మొదలు పెట్టి మాఘ శుక్ల ద్వాదశిన గానీ , పౌర్ణమి యందు గానీ సమాప్తి చేయాలి. రోజు భూమిపై పరుండాలి ( మంచము వదలి ) నెలరోజులు మితాహారుడై , లేదా నిరాహారుడై త్రికాలములయందు స్నానము చేసి , భోగములను వదలి , జితేంద్రియుడై త్రికాలాలలోను విష్ణువును అర్చించాలి.

భవిష్యపురాణము ప్రకారము , బ్రహ్మచారి , గృహస్థు, వానప్రస్థుడు , భిక్షకుడు , బాలురు , వృద్ధులు, యువకులు , స్త్రీలు , నపుంసకులు  అందరూకూడా మాఘమాసమందు శుభమైన తీర్థమందు స్నానం చేసి, కోరిన ఫలమును పొందుతారు. అవయవములు దృఢం గా ఉన్నవారు చన్నీటి తోను , లేనివారు వేడి నీటి తోను స్నానం చెయ్యవచ్చు. పుష్య పౌర్ణమి గడిచాక మాఘ పౌర్ణమి వచ్చే వరకు విష్ణుపూజ విధిగా చేయాలి. పితరులకు , దేవతలకు ముల్లంగి ఇవ్వరాదు. బ్రాహ్మణుడు ముల్లంగి తింటే చాంద్రాయణ వ్రతాన్ని ఆచరించాలి. అలాగే  క్షత్రియ , వైశ్య , శూద్రులు కూడ..ప్రతిరోజు స్నానము చేయునపుడు , ఈ మంత్రాన్ని ఉచ్చరించి , మౌనముగా స్నానమాచరించాలి

దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణోః తోషణాయ చ
ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘే పాప వినాశనం ॥

మకరస్థే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ
స్నానేనానేన మే దేవ యథోక్త ఫలదో భవ ॥
ప్రతి రోజు సూర్యార్ఘ్యమివ్వాలి.

రథ సప్తమి


దీన్నే , అచలాసప్తమి , మాఘ శుక్ల సప్తమి , మకర సప్తమి  అని అంటారు

ఇది కోటి సూర్యుల సమానము. అందు స్నాన , అర్ఘ్య దానములు చేయాలి. అందువల్ల ఆయుస్సు , ఆరోగ్య సంపదలు లభిస్తాయి. నదిలో స్నానము చేస్తే , షష్టి యందే ఏకభుక్తం ( ఒంటి పూట భోజనము ) ఆచరించి , సప్తమియందు అరుణోదయ స్నానము చేయాలి.  నిశ్చల జలము యొక్క పైభాగాన దీపముంచాలి. ఈ దీపాన్ని బంగారు , లేదా వెండి లేదా ఆనపకాయ పాత్రలో చేసి  భక్తితో నూనె , వత్తి వేయాలి. పసుపు రంగు , కేసరి రంగుతో అలంకరించాలి. మొదట మనసును పదిలపరచుకొని శిరస్సు యందు దీపముంచుకొని సూర్యుని హృదయము నందు ధ్యానించి ఈ మంత్రాన్ని పలకాలి

॥ నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః
వరుణాయ నమస్తే`స్తు హరివాస నమో`స్తుతే..॥

సూర్యుణ్ణి   ధ్యానించి దీపాన్ని నీట వదలాలి. నీటిలో , చందనం తో , ఎనిమిది ఆకులు గల పద్మమును వ్రాసి , కర్ణికను కూడా రాయాలి . మధ్యలో పత్నితో కూడిన శివుని ప్రణవముతో కూడా రాయాలి. తూర్పు దళముతో మొదలుపెట్టి , రవి , భాను , వివస్వత్ , భాస్కర , సవితృ , అర్క , సహస్ర కిరణ , సర్వాత్మకులను ధ్యానించి పూజించి ఇంటికి వెళ్ళాలి.

ఇంటి యందు స్నానం చేస్తే ( పాదోదక స్నానం )  చెరుకు గడ తో నీటిని కదిలించి ,  ఏడు జిల్లేడాకులు , రేగు ఆకులు తలపైన , భుజాలపైన ఉంచుకొని , ఈ మూడు మంత్రాలు చెప్పాలి

॥ యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు
రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమీ ॥

॥ ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం
మనో వాక్కాయజం ఉచ్చ జ్నాతాౕజ్నాతేచ యే పునః ॥

॥ ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్తసప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి ॥

స్నానం చేసి , నువ్వుల పిండితో చేసిన అపూపములతో బంగారు సూర్యుణ్ణి పూజించి బ్రాహ్మణుడికి దానమివ్వాలి. కింది మం త్రముతో సూర్యుడికి  అర్ఘ్యము ఇవ్వాలి


॥ సప్తసప్తి వహప్రీత సమలోక ప్రదీపన
సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర ॥


॥ శుభం భూయాత్ ॥