SHARE

Thursday, June 21, 2012

25. " మంత్ర ద్రష్ట " ఇరవై ఐదవ తరంగము



ఇరవై ఐదవ తరంగము

     విశ్వామిత్రుడు అయోధ్యను వదలి , జమదగ్ని వెంట బయలుదేరి , అతని ఆశ్రమమునకు వెళ్ళెను . అయోధ్య నుండీ ఆశ్రమము వరకూ అందరూ , " మహర్షులు వచ్చారు . అసాధ్యమును సాధించిన వారు వచ్చారు " . అని సంభ్రమముతో స్వాగతము నిచ్చేవారే . అందరూ మధుపర్కమును ఇచ్చువారు . ( మధుపర్కము అనే పదానికి వివిధ అర్థాలున్ననూ , ఇక్కడ , ’ ఐతరేయ బ్రాహ్మణము ’ ప్రకారము , శ్రోత్రియులూ , బ్రహ్మ నిష్ఠులూ రాజ్యాభిషేకము పొందిన క్షత్రియులూ , ఇంటికి వచ్చినప్పుడు సలప వలసిన పూజకు ’ మధుపర్కము ’ అనిపేరు ) 

     గురుశాపము వలన భ్రష్ఠుడైన వాడిని కాపాడినవారు అని అధికముగా గౌరవించేవారు . ఆశ్రమ ఆశ్రమములలోనూ , వందలకొలదీ జనులు , విశ్వామిత్రుని అనుసరించి వచ్చారు . జమదగ్ని ఆశ్రమమునకు వచ్చు వేళకు ఒక జాతర లాగా అయిపోయింది . ఒకరా , ఇద్దరా , వేల మంది . 

     జమదగ్ని ఆశ్రమములో అందరికీ భోజన ఉపచారములు కావలెను . మహర్షి ఆలోచించాడు , " ఇందరు జనులకు కావలసిన సంభారములను ఎక్కడ నుండీ సమకూర్చవలెను ? ఒక ఘడియ ఆలోచించి , ’ దీనికి ఇంత యోచన ఎందుకు ?   ’ అగ్నిర్గృహపతిః ’   ఇంటికి యజమానుడు అగ్ని . ఇంటికి వచ్చి పోవునవన్నీ అతనివి . ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతుల పూజను జరుపుటకు , మాచేత అన్నీ తెప్పించి పూజను జరిపించు భారము అతనిది .  ’ అగ్నినా రయిమశ్నివత్ ’  దానయోగ్యమైన సత్ -ద్రవ్యమునంతటినీ ఇచ్చువాడు అగ్ని. అతిథి స్వరూపుడై వచ్చువాడు కూడ అగ్నియే ! కాబట్టి ఈ సందర్భములో అతనినే ఆశ్రయించవలెను ."  అని తెలుసుకొని ముందుకు సాగెను .

     జమదగ్ని అగ్నిని విధిపూర్వకముగా పూజించి , " దేవా , తెలిసినవారు నిన్ను జాతవేదుడు అని పొగుడుతారు . సద్ద్రవ్యముల నన్నిటిని సంపాదించు దారులన్నిటినీ  తెలిసిన వాడివై నువ్వు ఖ్యాతి పొందినావు . అతిథి స్వరూపుడవై నువ్వు వస్తావు . త్రేతాగ్నియై గృహము నందుండి , పంచాగ్నియైన అతిథియై వస్తావు . దాతవూ , భోక్తృవూ నువ్వే అయినప్పుడు , నీకు నేను చెప్పుకోవలసినది కూడా ఏముంది ? అయినా , ’ నేను ’ అన్న అభిమానమున్నందున నీదగ్గర చెప్పుకుంటాను , మన్నించు . అతిథి పూజకు అనుకూలము కలిగించు " అని ప్రార్థించాడు . 

     అగ్ని సౌమ్యుడై , శుద్ధ జ్వాలామాలా మనోహరుడై కనిపించి , " జమదగ్నీ , భృగువులు ఎప్పటికీ నా మిత్రులు . నువ్వైతే భృగు కుల శేఖరుడవు . నువ్వు సప్తర్షులలో ఒకడివి కాగలవు. నీ ప్రార్థన విఫలముకాదు. నీకు ఇప్పుడు కావలసినది కామధేనువు సంతతిలోని ఒక ధేనువు . నేను అప్పుడే ’ శబల ’ అను కామధేనువును నీకని సంకల్పించుకున్నాను . అయితే  , ఒక బ్రహ్మాండములో ఉన్న సమస్తానికీ అధిపతి ఇంద్రుడు . అతడు ఇవ్వనిదే , ఏ వస్తువూ ఎవ్వరికీ దొరకదు . కాబట్టి అతనిని గురించి హోమము చేసి అతని ప్రసాదము సంపాదించుకో. నీకు శబల దొరకును . ఈ దినము నుండీ నీ అతిథి పూజ సాంగమై , నిర్విఘ్నమై సాగుతుంది . " అన్నాడు.

     జమదగ్ని చేతులు జోడించి అడిగెను , " దేవా , నీకు తెలియనిదేమున్నది ? వెనుక , ఇంద్రుని పిలచి , అతడు రాకుండా ఉండుట వల్లనే కదా ఇంత అనర్థమైంది ? ఇప్పుడు పిలిస్తే వస్తాడా ? "

     అగ్ని నవ్వాడు , " ఇప్పుడు పిలుచువాడు జమదగ్ని . అప్పుడు పిలచినది త్రిశంకువు . అదీకాక , యజ్ఞములలో పిలిచేది వేరే , హోమములో పిలిచేది వేరే . నీవంటివారు అహర్నిశలూ చేసే సత్కార్యములవల్లనే కదా , జగము నిలిచి ఉన్నది ? కాబట్టి ఇంద్రుడు అవశ్యము వచ్చును . నీకింకా అనుమానముంటే , ఇంద్రాగ్ని హోమమును చేసి తరువాత  ’  ఐంద్ర  ’  హోమము చేయి . నేను అతనిని పిలుచుకువస్తాను " అన్నాడు ( ఐంద్ర అంటే , ఇంద్రునికి ఇచ్చే ఆహుతి ) 


     జమదగ్ని ఇంద్రాగ్న్యమైన హోమము చేసి , తరువాత ఐంద్రాహుతి నిచ్చాడు . దేవరాజు ప్రసన్నమై  , దేదీప్యమానముగా వెలుగుతూ ప్రత్యక్షమై , " జమదగ్నీ , నీ అపేక్ష నెరవేరును . నా దర్శనము విఫలము కాదు . దేవతలు నీకు శబలను అనుగ్రహిస్తారు . కామధేనువు కు ఆహుతి నిచ్చి , ఆమె అనుమతి పొంది శబల ను ధ్యానించు . ఆమె నీ ఆశ్రమమునకు వస్తుంది . నువ్వు భూలోకమున ఉన్నంతవరకూ ఆమె నీ అధీనములో ఉండును . " అని పలికెను .

     జమదగ్ని , ఇంద్రుని అనుజ్ఞ తో కామధేనువు కోసము హోమము చేసి , శబలను ధ్యానించాడు . ఆశ్రమపు వాకిట్లో ’ అంబా ’ అను ఆవు అరుపు వినిపించింది . జమదగ్ని , పత్ని తో పాటు గోపూజకు బయలుదేరుతూ , శబలను సత్కరించుటకు ఇంద్రుని అనుమతి కోరెను . ఇంద్రుడు నవ్వుతూ , " నాకు తెలుసు , నువ్వు వెళ్ళి రా. తరువాత మాట్లాడదాము " అన్నాడు . 

     జమదగ్ని సపత్నీకుడై శబల కు స్వాగతమిచ్చి సత్కరించాడు . దేవ ధేనువు ముక్కు పచ్చలారని పాప వలె మిక్కిలి సాధు స్వభావముతో , వారికి మాలిమి యై , తాను మచ్చిక యైనది ప్రకటముగా చూపించెను . ఆ దంపతులు , " తల్లీ , నువ్వు ఆశ్రమపు సౌభాగ్య లక్ష్మియై ఇక్కడ ఉన్నవారినీ , వచ్చువారినీ కాపాడుదానివి కా. నీ దయతో , దేవాతిథి పూజ నిర్విఘ్నముగా నెరవేరనీ " అని ప్రార్థించారు . శబల ఆ ప్రార్థనను అంగీకరించి , ఆశ్రమవాసిని యైనది . ఆమె కోసమని ఒక్క క్షణములో ఒక పర్ణకుటీరము ఏర్పడింది . జమదగ్ని ఆమె అనుమతి పొంది మరల అగ్ని గృహమునకు వచ్చాడు . ఇంద్రుడు మరలా దర్శనమిచ్చి , " అనుమతినివ్వండీ , మహర్షుల సందేహమును నివారించుటకు సిద్ధముగా ఉన్నాను. " అన్నాడు . జమదగ్ని నవ్వి , " దేవరాజా , అగ్నిదేవుని కృప వలన సందేహము తీరినది . కానీ నాదొక ప్రార్థన ఉన్నది . నువ్వు విశ్వామిత్రునికి కూడా దర్శనమివ్వాలి ." అని కోరెను . ఇంద్రుడు అలాగేనని ఒప్పుకున్నాడు . 

     విశ్వామిత్రుడు ఆశ్రమము దగ్గర ప్రవహిస్తున్న నదీ తీరములో ఒక చెట్టు మొదట్లో అధ్యయనము చేస్తూ కూర్చున్నాడు . ఎవరో మసలు తున్నట్టనిపించింది .  మనసు ఆవైపుకు వెళ్ళింది . ఎవరని చూస్తే , తేజో మూర్తి ఒకటి ఎదురుగా నిలచింది . ధరించిన పుష్పమాలికల సుగంధము ముక్కుకు ఘాటుగా తగిలిననూ , సౌమ్యంగా , మనోహరముగా ఉంది . ఆభరణాల జిలుగు రత్నాల కాంతి కన్ను చెదరునట్లు మిరుమిట్లు గొలుపు తున్ననూ , ప్రసన్నముగానే ఉంది . మూర్తి రూపము అతను ఎవరో చెప్పకనే చెప్పుతున్నట్లు స్పష్టంగా ఉంది . విశ్వామిత్రుని అంతర , బాహ్య ఇంద్రియాలను తనవైపుకు లాగుతున్నది . ఉత్తరీయపు చెరుగు గాలిలో ఎగురుతుండగా , " విశ్వామిత్రా , రా . నావైపు తిరుగు " అని పిలుస్తున్నది . ఆ మూర్తి ముఖములో మెరస్తున్న మందహాసము తనను మాట్లాడించునట్లున్నది . ఇంత జరుగుతున్నా  విశ్వామిత్రునికి అతడెవరో ఆనవాలు దొరకలేదు . 

     విశామిత్రునికి ఆలోచించుటకు అవకాశము లేదు . ఎలా ఎలా చూచిననూ , దేవత అనుటకు సందేహము లేదు . ఆ మూర్తి స్వరూపము అలాగ కనిపిస్తుండగనే విశ్వామిత్రుని దేహము తనంతట తానే లేచి నిలిచి , చేతులు జోడించి, పూజను సలిపింది . ( సృష్టి -- దేవ , మనుష్య , తిర్యక్ అని మూడు విధాలు గా ఉంటుంది . తిర్యక్ కన్నా మనుష్యులూ , మనుషులకన్నా దేవతలూ ఉత్తములు . ఉత్తములను చూస్తే , అధములు బెదరుట స్వాభావికమైనది . ఇది మనుష్యులలో కూడా , ఉత్తమాధముల మధ్య కనిపిస్తుంది )  విశ్వామిత్రుని మనో బుద్ధులూ , ఇంద్రియములూ సావధానముగా ఉన్నాయి . అతడు మానసికముగానే ఆసనమును కల్పించినాడు .ఆ తేజోమూర్తి ఈ మానస పూజను స్వీకరించి , ప్రసన్నమై , " మహర్షులకు తమరు పిలిచినపుడు రాలేదని కోపము వచ్చి ఉండును .. అవునా ? "  అన్నాడు .

     విశ్వామిత్రునికి అది ఎవరో తెలిసిపోయింది . కోపముండినదో ఏమోగానీ , ఆ మాట విన్న తర్వాత కోపము మిగిలినట్టు అనిపించలేదు . " రావడమూ , రాక పోవడమూ దేవరాజుల చిత్తము . పిలవడమయితే మా కర్తవ్యము . " అన్నాడు .

     " మహర్షికి చింత కలిగింది . మా వలె , భవిష్యత్తునూ , జరుగవలసిన దానినీ దృష్టిలో పెట్టుకుని నడుచుకో వలసి వచ్చినప్పుడు , ఆ కార్యాలు బాహ్య దృష్టితో చూచు వారికి అసమంజసముగా కనపడవచ్చు . అయితే , కర్తవ్య నిష్ఠులు బయటివారి సన్మాన , అవమానములను అంతగా పట్టించుకోరు , కాదా ? " 

     " బృహస్పతి అనుగ్రహము వల్ల భవితవ్యము ఏమో ఉంది అని సూచనగా తెలిసింది . కానీ , దాని స్వరూపమేమిటో తెలిసినది జమదగ్నికి మాత్రమే .. " 

     " నీకు కూడా తెలుసు . ఇప్పుడు కృత యుగపు ఒక పాదము గడచింది . ఇక ముందు రెండవ పాదము ఆరంభమగు సంధి కాలమిది . ఇప్పుడు లోకములో షోడశ కళాత్మకమైన ధర్మములో ఒక కళ తక్కువ అవుతుంది . అది తగ్గిందని లోకము వ్యథ చెందును . ఆ పంచ భూతాల వ్యథను ఎవరో ఒక మహానుభావుడైనా అనుభవించి ,  తీరుస్తాడు .  ఆ మహానుభావుడు వశిష్ఠుడు . అతడు వ్యథను అనుభవించుటకు  సిద్ధముగా ఉన్నాడు . అయితే , నిత్య తృప్తుడైన , బ్రహ్మజ్ఞుడైన అతనికి వ్యథ ఎక్కడనుంచి , ఎలా కలుగుతుంది ?  దానికొక కారణము ఉండవలెను కదా ! దానికోసమే , చండాల రాజు యజ్ఞము , దానికి అశ్వినీ దేవతల సహాయము , దానికి నేను రాకుండా ఉండుట , అదే కారణము వలన వశిష్ఠ పుత్రుల వినాశము , దానివలన అరుంధతీ శోకము , దానిని వశిష్ఠులు వహించి తీసుకోవడము.  ఇదంతా జరగవలసి యుండెను . నీకు ఈ రోజు ,  నాకూ , వశిష్ఠునికీ మధ్య విశేషమైన మైత్రి ఉండుటకు కారణము చెప్పెదను , విను ."

     "  నేను పూర్వము వృత్రాసుర వధ చేసినపుడు , వృత్రుడు మొదట తన  రూపమును మార్చుకొని , పంచ భూతములలో నొకటైన పృథ్వీ భూతమును ఆవహించినాడు . అప్పుడు పృథ్వీ భూతమున్నంత మేరా దుర్గంధము పట్టుకున్నది . నేను వజ్రాయుధముతో కొట్టగా , వాడు అక్కడినుండీ పారిపోయి , ఇంకా సూక్ష్మమైన ఆపో భూతమును పట్టుకున్నాడు . ఆ భూతము వ్యాపించినంతవరకూ  , రసము చెడిపోయింది . ( సృష్టికి ముందు అంతా రసమే , తర్వాత భూమి ఆ రసాతలమున తేలుచుండెడిది ) . మరలా అనుసంధానము చేసి కొట్టగా , వృత్రుడు అగ్ని భూతమును పట్టుకున్నాడు . ఆ భూతము వ్యాపించినంత వరకూ రూపము చెడిపోయింది . అక్కడా కొట్టగా వాడు ఆకాశములో చేరుకున్నాడు . బ్రహ్మాండములో ఆకాశపు మాత్ర అంతా చెడిపోయింది . మరలా అనుసంధానము చేసి , సమయము చూసి మహా ప్రయత్నము చేత నేను కొట్టగా , వాడు అహంకారమును ఆశ్రయించి , నన్నే పట్టుకున్నాడు . నాకు ఎక్కడా లేని వ్యథ పట్టుకొని , చింతాక్రాంతుడనై కూర్చోవలసి వచ్చెను . అప్పుడు , దేవ గురువైన బృహస్పతి , దీనికి కారణమేమి అని ఆలోచించి , తెలుసుకొని , దానికి  పరిహారమేమి అని చతుర్ముఖ బ్రహ్మను అడిగెను . ఆతడు , ’ అహంకారమును పట్టుకొన్న ఈ వ్యాధిని , అహంకారమును గెలిచినవాడు మాత్రమే పరిహరించగలడు . వశిష్ఠుడు లేశమైననూ అహంకారము లేనివాడు .   దీనికి పరిహారమును వశిష్ఠుడు ఒక్కడే ఎరుగును . కాబట్టి దేవతలంతా కలసి వెళ్ళి అతడిని ప్రార్థించండి ’ అన్నాడు . 

     అప్పుడు దేవతలంతా దేవగురువును తమ ముందు నిలుపుకొని , వశిష్ఠుని వద్దకు వెళ్ళి , కామధేనువునే కానుకగా ఇచ్చి , నా వ్యథను పరిహరించమని వేడుకున్నారు . వశిష్ఠులు నవ్వి ,  ’ ఇదేమంత పెద్ద పని ! ’ అని రథంతర సామమును పఠించి , తన కలశోదకమును నాపైన చల్లాడు . నేను వెంటనే నిరహంకారుడనై , కేవలము నిమిత్తమాత్రుడనై అహంకార ఆశ్రయమును పొందిన వృత్రుడిని సంహరించాను . అప్పుడు నేను వశిష్ఠుని కృతజ్ఞతతో , ’ ఏమి కావాలన్నా అడగండి , వరమునిస్తాను ’ అన్నాను . వశిష్ఠుడు నవ్వి , " నాకేమీ అవసరము లేదు . వద్దంటే నీకు చికాకు . కాబట్టి , నువ్వే ఏదో నాకు ఉపయోగపడే వరమునివ్వు ’ అన్నాడు . అప్పుడు నేను ’ ఇకముందర యాగములలో  నువ్వుకానీ , నీ గోత్రజులు కానీ పిలిచితే మాత్రమే వస్తాను ’ అని వరమును ఇచ్చాను " . 

     " విశ్వామిత్రా , ఏమి చెప్పాలి ? నేను అతనికి ఇచ్చిన కామధేనువును తనవద్ద ఉంచుకోలేదు . ’ ఇది దేవలోకములో ఉండవలసినది . ఇక్కడ ఉండకూడదు . నియతి కి భంగము రాకూడదు . కాబట్టి దీనిని పిలుచుకొని పోండి " అని వదిలేశాడు . అప్పుడు మేమంతా బలవంతము చేసి అతడు వద్దంటున్ననూ హోమధేనువుగా ఉండనీ అని నందిని ని అప్పజెప్పి వచ్చాము " 

     " ఇప్పుడు నా వ్యథ తెలిసిందా , విశ్వామిత్రా , నన్ను పట్టుకున్న వృత్రుడిని తెగటార్చుటకు సహాయము చేసిన మహానుభావుడికి ఇప్పుడు బలమైన పుత్రశోకము కలిగింది . అంతటి బ్రహ్మ జ్ఞాని ఇప్పుడు పుత్రశోకముతో హతుడై , ఒక సామాన్య పామరుడి వలె ఆత్మహత్య చేసుకొనుటకు ప్రయత్నించు చున్నాడు . అతడు పర్వతమునుండి దుమికాడు . ఏమీ కాలేదు . భూదేవి అతనిని పువ్వు వలే మృదువుగా తన ఒడిలో చేర్చుకుని  కిందికి దింపినది . పగ్గములతో తనను  తాను కట్టుకొని నదిలో పడ్డాడు . ఆపో దేవి అతని పగ్గాలను విడిపించి , గట్టుకు తెచ్చి వదిలారు . ఇప్పుడు అతనికి అహంకారము పట్టి , మమత వచ్చి , తనదేమో పోయిందను భ్రాంతి వచ్చి , ఆ భ్రాంతికి చిక్కి , శోక సముద్రుడై ఉన్నాడు . అది తీరువరకూ ఎవరికీ సుఖము ఉండదు . 

No comments:

Post a Comment