SHARE

Sunday, June 24, 2012

28. " మంత్ర ద్రష్ట " ఇరవై ఎనిమిదవ తరంగము



ఇరవై ఎనిమిదవ తరంగము

     సరస్వతీ తీరములో ఒక పర్ణశాలను కట్టుకుని , విశ్వామిత్రుడు అక్కడ వాసమేర్పరచుకున్నాడు . ఒక పున్నమ రోజు . నిండిన వెన్నెల అమృతపు సోన వలె దిక్కుదిక్కులా నిండి ఉంది . మునీంద్రుని మనసు ఏదో అనిర్వచనీయమైన ఆనందమును అనుభవిస్తూ , వెనుక ఒకసారి , తాను వామదేవునితో పాటు అలాంటిదే ఒక పౌర్ణమి నాడు నింపి పెట్టిన వెన్నెల రాశి వలె కనిపిస్తున్న మంచు దిబ్బలు నిండిన హిమాలయములో మాట్లాడుతూ కూర్చున్నది జ్ఞాపకము వస్తున్నది . ఎక్కడెక్కడ తిరిగిననూ , వామదేవుని జ్ఞాపకము . మనసు వామదేవుని మరువలేకున్నది . 

     సుమారు ఒకటిన్నర ఝాము అయి ఉంటుంది . విశ్వామిత్రుడు ఏదో యోచనాలోకములో ఎక్కడో మనసు ఉండి , సగము మెలకువ లో ఉన్నపుడు  , ఉన్నట్టుండి ఒక బలమైన గాలి ప్రవాహము దూకుతూ వచ్చినట్లై అతనికి మెలకువ వచ్చింది . తనను ఎత్తుకొని పోవునో అన్నంత గట్టిగా వీచిన ఆ గాలిలో దేహమంతా పులకరించినట్లై మెలకువైంది . హఠాత్తుగా ఏర్పడిన వాత సంఘాతముతో కలిగిన ఆశ్చర్యము కాస్త తగ్గి , కంటికెదురుగా ఉన్నదానిని ఒప్పుకుని ఇదేమిటీ గాలి అనుకొనునంతలో ఎవరో వచ్చి నిలచినట్లు మనసుకు అనిపించింది . కళ్ళు పూర్తిగా తెరిచి చూడగా , అక్కడ వామదేవుడు స్వయముగా వచ్చి ఉన్నాడు . వామదేవుడే , సందేహము లేదు . 

     విశ్వామిత్రుడు అదాటున పైకి లేచాడు . మిత్రుడు వామదేవుడని స్వాగతము చెప్పుటకు చేయి పట్టుకోవడానికి ముందుకు పోయిన చేయి , హఠాత్తుగా ఇంద్రుడు వర్ణించి చూపిన వామదేవుని జ్ఞాపకము వచ్చి , వెనక్కు తీసుకుంటూండగా , వామదేవుని ఇంకో చేతికి చిక్కి నిలచింది . ఏమి చెప్పాలి , ఏమి చెయ్యాలి ? అన్నది మనసు నిర్ధారించులోపలే అతని నోటి వెంట , "  దయ చేయాలి , దయ చేయాలి , వామదేవ మహర్షులు దయ చేయాలి . వశిష్ఠ మహర్షుల దుఃఖాన్ని పోగొట్టగల మహాత్ములు ఇక్కడ విజయము చేయవలెను " అని వచ్చెను . 

     వామదేవుడు ఎప్పటిలాగే నవ్వుల వెలుగులు చిమ్ముతూ , " అవును , అవును , దానికోసమే నేను వచ్చింది . వశిష్ఠ శోకమును నివారించుటకు నిన్ను వేడుకొనుటకే నేను వచ్చింది .  " అని , ఒక పక్క పెరిగిన గడ్డిని పిడికిళ్ళతో పీకి వేసుకుని  కూర్చొని , విశ్వామిత్రుని కూడా కూర్చోపెట్టాడు . 

     విశ్వామిత్రునికి వామదేవుని మాట అర్థమే కాలేదు . " ఇదేమి వామదేవా , నీవంటున్నది ? నేను వశిష్ఠ శోకానికి కారణమైతే అయ్యాను , కానీ దానిని నివారించు శక్తి నాకుందో లేదో ? అది  నాకు మాత్రమే తెలుసు . ఆ శక్తి ఉన్న నువ్వు ఊరికే ఉన్నావు . నన్ను హాస్యము చేస్తున్నావా " అని సంకోచముతో అడిగాడు . 

     వామదేవుడు నవ్వాడు . " అలాగే కానీ , నేను వినోదము కోసమే ఒక మాట అన్నాననుకుందాం , ’ అలాగే ’ అంటే , నాకేమి నష్టము ?  ఏమయినా ,  మనము ఇప్పుడు  తపోబలము వల్ల అంతటి శక్తినొకదానిని కల్పించి ఇవ్వాల్సి వస్తుంది . అట్టి సమయమే వస్తే , ఇంతవరకూ చేసిన తపస్సు వలననో , లేదా , ఇక ముందు చేయు తపస్సు వల్లనో అంతటి ఒక ప్రభావాన్ని కల్పిస్తే సరిపోతుంది . అదలా ఉండనీ , వశిష్ఠుల శోకమును పోగొట్టడానికి నువ్వు నిజంగా సిద్ధంగా ఉన్నావా ? " 

" అప్పుడే ఇంద్రునితో చెప్పాను కదా ? " 

     " అందుకే నేను వచ్చింది కూడా . ! నాకూ ఒక దర్వి కావాలి ( దర్వి అంటే , యజ్ఞములో ఆహుతి నిచ్చుటకు ఉపయోగించే చెక్క గరిట ) ఇప్పుడు వారు దుఃఖములో మునిగి కూర్చున్నారు . ఆ దుఃఖము ఘనమైపోతే , అదే ఒక మూర్తిగా మారి అన్ని లోకాలనూ దహిస్తుంది . అలాగ కాకుండా చూసుకోవాలి . దీనికి ఎవరు సమర్థులు అని చూస్తే , బ్రహ్మర్షి యైన సింధు ద్వీపుడి వల్ల ఇది కావలెను . లేదా , అతని అనుగ్రహమును పొందినవాని వల్ల కావలెను . అందుకే నీ దగ్గరికి వచ్చాను "

     " వామ దేవా , నాకు సరిగ్గా అర్థమగునట్లు చెప్పు . స్వయముగా ఇంద్రుడే వచ్చి , కొంతకాలము ఇలాగే మూర్ఛాక్రాంతుడై ఉండనీ అని చేసిన పని కదా అది ? "

     " నిజమే , దేవేంద్రునికి వశిష్ఠునిపై అపారమైన స్నేహము . ఆ స్నేహపు గాఢతలో తాను చేస్తున్నది ఏమిటి అన్నది ఆలోచించకుండానే , వశిష్ఠుల ఇంద్రియములలో ఉన్న సహిష్ణుతా శక్తిని సంకుచితము చేశాడు . ఇప్పుడు ఆ దుఃఖము మనసును దాటి ,  దేహపు లోపల దిగి కూర్చుంది . వశిష్ఠులవంటి బ్రహ్మచారి దేహము లోపల ప్రవేశించి , అది వీర్యమును తాకితే , ఆ వీర్యము దుష్టమై బయట పడును . ఆ మహాత్ముడి వీర్యము వ్యర్థము కాకూడదు కాబట్టి అది వెంటనే సద్యో గర్భముగా మూర్తియై నిలుస్తుంది . దుర్వీర్యమైనందు వల్ల అది దుష్టమై లోక కంటకమవుతుంది . ఇటువంటి ప్రమాదము జరుగకూడదని , సింధుద్వీపుడి అనుగ్రహానికి పాత్రుడైన నీ వద్దకు వచ్చాను . " 

" సింధూ ద్వీపుల వద్దకెందుకు వెళ్లలేదు ? " 

     " వారిప్పుడు ఒక దీర్ఘ వ్రతములో నిమగ్నమై ఉన్నారు . కాగా , నువ్వు నాకు కావలసిన వాడివి . నేను నిన్ను ఈ కార్యమునకు ఉపయోగించుట వలన నీకు కూడ ఒక ప్రయోజనము ఉంది. అందుకే ఇక్కడికి వచ్చాను . నీకు ఇష్టమేనా ? " 

" నీ మాటకు అడ్డే లేదు . మరి , నేనేమి చేయాలో నువ్వు చెప్పనేలేదే ? " 

     " నువ్వు చేయాల్సినదింతే ! ఈ సరస్వతిని ప్రార్థించి ఆమె ప్రవాహముగా మారి వచ్చి , వశిష్ఠ  మహర్షి ని తన నీటితో తడిపివేసి వెళ్ళ వలసినదిగా  ఆజ్ఞ ఇవ్వు . " 

     విశ్వామిత్రునికి ఎందుకో భయమైంది . ఆ రోజు ఆశ్రమమునే ఏకాపోశనగా స్వాహా చేస్తానని విల్లు పట్టిన వాడు ఈ రోజు  వశిష్ఠులను తడపమంటే బెదురుతున్నాడు . 

     వామదేవునికి అర్థమైంది . " విశ్వామిత్రా , నువ్వు క్షత్రియుడవు . నీ రజోగుణము వృద్ధి చెందనీ . నువ్వు నీ తపోబలముచేత సంపాదించిన ఆపోదేవి రహస్యమును ఇప్పుడు ప్రయోగించు . సరస్వతీ నది , సత్వ ప్రధానమైన నీరు గలది . ఈమె నీ స్తుతి వలన ప్రసన్నురాలై తన సాత్విక జలముతో వశిష్ఠులకు అభిషేకము చెయ్యనీ . కానీ కేవలము అభిషేకము వలన ఆ ఆటంకము పోదు కాబట్టి పన్నెండు యోజనముల దూరము ఆమె అతని శరీరమును ఈడ్చుకొని పోవాలి . అప్పుడు ఆ శరీరములో ని కణకణములకూ వ్యాపించిన దుఃఖము  అక్కడే జీర్ణమై అ సరస్వతీ ఉదకములో లీనమై ఆ మహాపురుషుడు శుద్ధుడగును . అంతే కాదు , దాని వలన నీకు కూడా ప్రయోజనమవుతుంది . నువ్వు వశిష్ఠులపై మత్సరమును పెంచుకున్నావు . ఇప్పుడు వద్దన్నను , అది నీ హృదయపు అంతరాంతరాళములలో వాసనా మయమై కూర్చుంది . అది ఇప్పుడు నశించి నీ మనసు నిర్మలమవ్వాలంటే  వశిష్ఠునికి ఇప్పుడు కలుగు ఓటమి వంటి ఈ పరిస్థితి తప్పదు . , అయితే , నువ్వు వశిష్ఠుల శోకములో సగమును అనుభవించుటకు ఒప్పుకున్నావు . ఇప్పుడున్నంత గాఢముగా ఆ శోకము అలాగే ఉంటే నువ్వు దాన్ని అనుభవించలేవు . కాబట్టి ఇప్పుడు సరస్వతీ నదిని ప్రార్థించు . ఈమె , మూర్ఛలోనున్న ఆ దేహాన్ని పన్నెండు యోజనములు కొట్టుకొని పోవునట్లు చేయనీ .. మొదట అది చేయి . అప్పుడే అర్ధరాత్రి కావస్తూంది . ఇంక దేవతల సంచార కాలము సమీపించు సమయము .  ఇప్పుడే ప్రవాహము రానీ . తామస వేళలో తామస కృత్యమొకటి నడిచి తమోగుణపు ఆ వేగము శాంతించి తగ్గనీ . "

     విశ్వామిత్రుడు మారుమాట్లాడక సమాధిలో నిలుచున్నాడు . ఆపోదేవి ని అనుసంధానము చేసుకున్నాడు . ఆమె ప్రసన్నురాలై వచ్చింది . అతడు ఆమెనుంచి వరమును యాచించాడు . ఆమె అనుగ్రహించింది . 

     సరస్వతి ఉధృతమైంది . అంత నీరు ఎక్కడినుంచీ వచ్చిందో ? మొత్తానికి రెప్పవేసి తీసేలోపల కొండలు , గుట్టలనూ కావాలంటే పడగొట్టుకొని పోగలంత నీరు ఆర్భాటముగా , కోలాహలముగా నీటిపైన నీరులాగా పరవళ్ళు తొక్కి వచ్చింది . మృదువుగా  నవ్వుతూ  మందహాస లహరి వలె పారుతున్న శుభ్రమైన వెండి ప్రవాహము వలె ప్రవహిస్తున్న సరస్వతి , రోషావేశ సంపన్నురాలై ప్రళయకాల ప్రవాహము వలె ఆర్భటిస్తూ బయలుదేరింది . సుందరమైన వేణుగానము పర్వతాలను పగలగొట్టు  పర్జన్యగర్జన అయినట్టు , చేతిలో పట్టుకున్న గడ్డిపరకలు పెద్ద గడ్డి మోపైనట్లు , రసాస్వాదముగా నున్న సభలో కూర్చొని మాట్లాడుతున్న కవి వచోవైఖరి పుంఖానుపుంఖాలుగా వచ్చునట్లు , సరస్వతి పొరలి పొరలి వస్తున్నది . అయితే , ఒక విశేషము . నీటిలో తెలుపు తప్ప ఇంకో వర్ణము లేదు . ప్రవాహపు ఉధృతి లో ఆనందముతో ఎగిరి గంతులు వేస్తున్న వెండి చేపల తెలుపు ప్రత్యేకముగా  కొట్టొచ్చినట్టు కనపడే శుద్ధమైన శుభ్ర వర్ణము . తీరములోని చెట్లు ఉప్పెన లాంటి  నీటి పొంగును తట్టుకోలేక విరిగి పడి కొట్టుకుపోతున్నాయి . వాటి పసరు , మన్ను ,  నీటిలో ప్రతిఫలించి కనపడునంత తేటగా ఉంది నీరు . చెట్లు విరిగినట్లే , అక్కడక్కడ గట్లు కూడా తెగి నానా వర్ణాల మన్నూ చేరి కొట్టుకుని పోతున్నది . అయినా , ఆ రకరకాల మన్ను  , తన అశుభ్ర వర్ణాలను సరస్వతికి ఇస్తే ఎక్కడ అపచారమవుతుందో అని బెదరి , తన వర్ణాలను తానే కూడదీసుకుని మునిగి , కిందకు దిగి  కూర్చుందో అన్నట్టు , వేరే వర్ణాలు కనిపించినా వెంటనే అవి కరగిపోయి అంతా తెలుపవుతున్నది . ఆహా ! ఆ ఆర్భాటము !!  ఆ మోత ! ఆ ఉధృతి  !!  ఆ పరవళ్ళు !! ఎక్కడినుంచీ వచ్చాయో !!! 

     వామదేవుడు అలాగే కళ్ళప్పగించి చూస్తూ , " అదిగో , అదిగో , విశ్వామిత్రా , చూడు. చూడు ...గురుదేవుల దేహము నల్లటి కంబళిలో కట్టిన మెరుపు మూట వలె కొట్టుకొని పోతున్నది" అన్నాడు . విశ్వామిత్రుడు చూశాడు . కానీ దానిని చూడలేకపోయాడు . చూచి సహించలేకపోయాడు . కళ్ళు మూసుకున్నాడు . కంట నీరు ఒక్కో బొట్టే రాలుతున్నది . ప్రవాహపు అలలు అతను కూచున్న బండను తాకి నీటి తుంపురులను తళుక్కుమని మెరిపిస్తున్నాయి . అతని శరీరమంతా అగ్ని శఖలతో కాగినట్లు కాంతి చిమ్ముతోంది . 

     వామదేవుడు , ’ ధన్యుడవు , ధన్యుడవు విశ్వామిత్రా , నువ్వు ధన్యుడవు . నువ్వు బ్రహ్మర్షి మాత్రమే కాదు , సప్త ఋషులలో ఒకడగుటకు యోగ్యమైనవాడివి  ’ అని భావావేశముతో పొగిడాడు . 

     విశ్వామిత్రునికి అదికూడా వినిపించలేదు . దేవతలు ’ ఔను , ఔను ’ అని సంతోషముతో అభినందించినది సంతోష పరవశుడైన వామదేవునికి కూడా వినిపించలేదు . దుఃఖ పరవశుడైన విశ్వామిత్రునికీ వినిపించలేదు .

No comments:

Post a Comment