SHARE

Tuesday, November 13, 2012

కార్తీకమాస ఆదిత్య ఉపాసన





                              ||  విష్ణురశ్వతరో రంభా  సూర్యవర్చాశ్చ సత్యజిత్ |
                                 విశ్వామిత్రో మఖాపేత ఊర్జమాసం నయంత్యమీ ||

                                 భానుమండల మధ్యస్థం వేదత్రయ నిషేవితం |
                                  గాయత్రీ ప్రతిపాద్యం తం విష్ణుం భక్త్యా నమామ్యహం ||

                ధ్యేయస్సదా సవితృ మండల మధ్యవర్తి నారాయణస్సరసిజాసన సన్నివిష్టః |
                కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ హరీ హిరణ్మయ వపుః ధృతశంఖ చక్రః ||

          కార్తీకమాసమందు ’ విష్ణువు ’ అను పేరుతో సూర్యుడు తన రథముపై సంచరించుచుండును . ’ విశ్వామిత్ర ’ మహర్షి , ’ రంభ ’ అను అప్సరస , ’ సూర్యవర్చసుడు ’ అను గంధర్వుడు , ’ సత్యజిత్తు అను యక్షుడు , ’ అశ్వతరము ’ అను సర్పము , ’ మఖాపేత ’ అను రాక్షసుడు ఆయన వెంట ఉందురు .

          ఆయన సూర్యమండలమునకు మధ్య స్థితుడైయుండును . మూడు వేదములు ఆయనను స్తుతించును . గాయత్రీ మంత్రము ద్వారా ప్రతిపాద్యుడైన ఆవిష్ణువునకు నేను భక్తితో నమస్కరించుచున్నాను . విష్ణ్వాదిత్యుడు ఆరు వేల కిరణములతో శోభిల్లుచుండును . అతడు అరుణ వర్ణమును కలిగియుండును .

యమాదిత్యుని మాహాత్మ్యము 


      ఒకసారి యమధర్మరాజు తన లోకమున ఆశీనుడై ,  పాశములను , దండములను ధరించిన తన దూతలను ఇట్లు ఆదేశించెను .

       " విష్ణు స్వరూపుడైన సూర్య భగవానుని యొక్క భక్తుల సమీపమునకు మీరు వెళ్లవలదు , ఏలనన, వారిని ఈ లోకమునకు తీసుకొని వచ్చుట తగదు .  నిరంతరమూ తమ హృదయములను సూర్యుని యందే లగ్నమొనర్చిన ఆయన భక్తులకును , సూర్యభగవానుని పూజించెడి వారికినీ మీరు దూరమునుండియే ప్రణమిల్లి రాగలరు . సర్వకాల సర్వావస్థల యందును సూర్యుని నామములను కీర్తించెడివారు యమలోకమునకు రానక్కరలేదు . భాస్కరుని కొరకు నిత్య నైమిత్తికము లైన యజ్ఞములను ఆచరించు వారి వైపు మీరు కన్నెత్తి యైనను చూడరాదు . మీరు సూర్య భక్తులను తాకిననూ , లేక వారిని యమలోకమునకు తీసుకొని వచ్చుటకు ప్రయత్నించినను మీకు పుట్టగతులుండవు . పుష్పములతో , ధూపదీపములతో , అందమైన వస్త్రములతో సూర్యుని సేవించువారిని మీరు బంధింపరాదు . ఎందుకనగా వారు మా తండ్రికి మిత్రులు . ఆశ్రితులకు ఆశ్రయమైనవారు .  సూర్యమందిరమును శుభ్రపరచెడు వారు , లేదా సూర్యమందిరమును నిర్మించువారు అయిన వారియొక్క మూడు తరములవారిని మీరు బంధింపరాదు . తండ్రియైన సూర్యభగవానుని అర్చించు భక్తుల వంశములవారికి కూడా మీరు సర్వదా దూరముగా ఉండవలెను :"

      మహాత్ముడైన యమధర్మరాజు ఇట్లు ఆదేశించినను ఒకసారి యమభటులు ప్రమత్తులై , ఆ ఆదేశమును జవదాటి , సూర్యభక్తుడైన సత్రాజిత్తు కడకు వెళ్ళిరి . కానీ సత్రాజిత్తు తేజస్సునకు ఆ యమభటులు మూర్ఛితులై భూమిపై పడిపోయిరి . వారి యపరాధమును మన్నింపజేయుటకు యముడు కాశీ యందు యమాదిత్యుని ప్రతిష్టించి , తీవ్రముగా తపస్సు చేసెను . తత్ఫలితముగా సూర్య భగవానుడు ప్రత్యక్షమై ఆయనకు పెక్కు వరములిచ్చెను .

       ఈ యమాదిత్యుడు కాశీ యందు , యమేశ్వరునకు పశ్చిమ దిశయందును , ఆత్మవీరేశ్వరునకు తూర్పు దిశయందునూ , సంకట ఘట్టమున ప్రతిష్ఠితుడై యున్నాడు . యమాదిత్యుని దర్శించేవారికి యమలోకము దర్శించు సందర్భము రాదు . మంగళవారముతో కూడిన చతుర్దశియందు స్నానము చేసి యమేశ్వరుని , యమాదిత్యుని దర్శించెడివారు సకల పాపములనుండీ ముక్తులగుదురు . యమధర్మరాజు ప్రతిష్ఠించిన యమేశ్వరునకూ , యమాదిత్యునకూ ప్రణతులను అర్పించెడివారు యమలోక యాతనలను అనుభవింపవలసిన పనిలేదు సరికదా , వారికి యమలోకమును చూడవలసినపని కూడా లేదు . అంతేగాక , యమ తీర్థమున శ్రాద్ధమొనర్చి , యమాదిత్యుని పూజించువారు పితృ ఋణమునుండీ ముక్తులయ్యెదరు .

      కాశీ యందు పండ్రెండు మంది ఆదిత్యులు ప్రతిష్టితులై యున్నారు . ఈ ద్వాదశాదిత్యుల ఆవిర్భావ కథలను వినినవారికీ , వినిపించినవారికీ, దుర్గతులు దూరమై సద్గతులు లభించును .

( పద్మ పురాణము )

లోకాస్సమస్తాస్సుఖినస్సంతు

Monday, November 12, 2012

వివాహము లో అరుంధతీ నక్షత్ర దర్శనము


వివాహము లో అరుంధతీ నక్షత్ర దర్శనము

          వివాహములోని అనేకమైన తంతులలో , అనగా , అంకురార్పణము అయిన తర్వాత , పెళ్ళికుమారుని , పెళ్ళికూతురును చేయుట ,గౌరీ పూజ , వరపూజ , అటుతర్వాత మధుపర్కము , జీలకర్రా బెల్లము , తలంబ్రాలు  మొదలు ఆచరించు అనేక కార్యముల తో పాటు విశిష్టమైనది అరుంధతీ నక్షత్ర దర్శనము. వివాహ సమయములో వరుడు తన క్షేమాభివృద్ధుల కోసము అనేక మంది దేవతలను ప్రార్థించును . దానికొరకు పెళ్ళికుమారుని చేత పురోహితుడు అనేక మంత్రములను చెప్పించును . 

          మొదట పెళ్ళికుమారుడు వధువుతో , " ఓ కన్యా , నా గృహమునకు వచ్చి నాతో కాపురము చేయుచూ సంతాన సమృద్ధిగలదానివి కమ్ము , నా గృహమునకు వచ్చి , గృహస్థుని ధర్మములగు అతిథి అభ్యాగతులను పూజించుట , ఆదరించుట చేయుటలో నాకు సహకరించుము , పుత్రులు , మనవలు కలిగినాక వారికి కూడా ఇవియన్నియూ బోధించుము " అని చెప్పును (  ఇహ ప్రియం ప్రజయా తే సమృధ్యతా ......వివిధ మావదాసి ||  అనే మంత్రము )

          ఆ తరువాత , || సుమంగలీరియమ్ వధూరిమాగ్ం .........విపరేతన   || అనే మంత్రము చెప్పును . దాని అర్థము  , వివాహమునకు వచ్చిన వారితో , " బహుకాలము వరకూ సువాసినీత్వము కలిగియుండెడి  ఈ వధువు చూచి , ఆమెకు ఆయుర్భాగ్యములనొసగి , ఆశీర్వదించి తరువాత మీ ఇండ్లకు స్వేఛ్చగా వెళ్ళుడు " అని ప్రార్థిస్తాడు .

     తరువాత ధృవ నక్షత్రమును గూర్చి , ’ తనకు జీవితమున శత్రు బాధలు లేకుండా కాపాడుమని ’ ప్రార్థించును . 

         అటుతరువాత , భార్యతో సహా  ఆకాశములోని సప్తర్షి మండలములో నున్న అరుంధతీ నక్షత్రమును దర్శించి , ఈ విధముగా ప్రార్థించును "  కశ్యపుడు మొదలగు ఏడుగురు ఋషులు తమ తమ భార్యలు ఏడుగురిలోను , వశిష్ఠుని భార్య యైన అరుంధతీ దేవి అగ్రగణ్యురాలనీ , అతి పవిత్రమైన పతివ్రత యని , మనస్సునందైననూ , ఒక్క క్షణమైననూ పతిని మరువక సదా తలచుచుండుననీ , అతి నిశ్చలమైనదనీ తలచి ఒప్పుకొనిరి . అందువలన , అరుంధతిగాక మిగిలిన ఆరుగురు స్త్రీలు అరుంధతిని తమలో అగ్రగణ్యురాలు అను భావమును వహించిరి .  అట్టి పరమ సాధ్వియైన అరుంధతీ దర్శనముచేత పవిత్ర భావములు పెంపొంది , నా భార్యను మీ ఏడుగురితో పాటు ఎనిమిదవ దానినిగా ను , పవిత్రమైనదానిగాను తలచి ఆశీర్వదించండి . " . అనగా తాను ఎనిమిదవ ఋషిని యని భావించునట్లు అర్థము . ( || సప్త ఋషయః ప్రథమం కృత్తికానామరుంధతీం ......అస్మాకమేధత్వష్టమీ ||  అనే మంత్రము ) 

తర్వాత అగ్నిహోత్రుని , గంధర్వులను , సూర్యుడిని , ఇతర దేవతలనూ ప్రార్థించును . 

         ఒక సంసారము బాగుగా నడవవలెనంటే దానిలో ఆ ఇంటి గృహిణి యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది . అందుకే ఇంటిని చూచి ఇల్లాలిని చూడు అన్నారు . ఒక ఇల్లు నిలవాలన్నా , కూలిపోవాలన్నా అది ఆ ఇంటి ఇల్లాలి వల్లనే అవుతుంది . కాబట్టి తన ఇల్లాలికి అరుంధతిని చూపించి సద్బుద్ధి కలిగించునట్లు చేయమని ప్రార్థించుట. 

        సముద్రము పక్కన కూర్చొనగానే , మనము వద్దనుకొన్ననూ చల్లగాలి వచ్చి ఎటుల తాకునో , అట్లు , అరుంధతిని చూడగనే ఆమె ప్రభావము వలన మనసు పవిత్రమగును అని ప్రతీతి . 

Monday, November 5, 2012

4. " జీవిత చుక్కాని " నాలుగవ అంకం సంబరం


నాలుగవ అంకం  సంబరం



         ఈ అంకం లో మా చిన్నప్పటి పండుగల ఆనందము , ఆకాలపు అలవాట్లు ,  పిల్లలు ఎంతో మురిసేలా అమ్మ చేసే పిండి వంటలు , మా మనోల్లాసము వంటివి మధుర జ్ఞాపకాలు మెదలుతున్నాయి. 


                        అనంతపురం సాయినగరు లో మా పాత ఇంటి పండగ వాతావరణం. 


                           ఇక పండుగలు వస్తే, నిజంగా మాకు పండుగే ! అలాగని, మేమేదో ధూం ధాం గా చేసుకొనే వాళ్ళమని కాదు. ఆడంబరాలు లేకున్నా, పండుగలలోని నిజమైన ఆనందాన్ని , ఆ స్పూర్తినీ, ఎంతో హృద్యమైన అనుభూతులను పొందేవాళ్ళం.  బడాయిలు లేని ఆనాటి సంబరాలు ఎంత మనసుకు హత్తుకునేలా ఉండేవో ! 

                సంక్రాంతికి ఇంటిముందర ౪౦-౫౦ గజాల స్థలంలో  అమ్మ పూర్తిగా ఆవు పేడ తో కళ్ళాపి చల్లించేది. పెద్ద పెద్ద ముగ్గులు వేసేది. మా అక్కయ్యలు కూడా పోటీలు పడి ముగ్గులు వేసేవాళ్ళు. మేము వెళ్ళి గుమ్మడి పూలు, సుంకేసుల పూలు తెచ్చేవాళ్ళం. పేడతో గొబ్బెమ్మలు  చేసి ముగ్గుల మధ్యలో వుంచి, పూలతో అలంకరించి, పసుపు కుంకుమా పెట్టి  హారతి ఇచ్చేది. ఉదయాన్నే ఇంటిముందుకి హరిదాసు వచ్చేవాడు. తలపైన బొట్లు పెట్టిన గిన్నెలో  బియ్యం పోయించుకునేవాడు. గంగిరెద్దులు అలంకరణతో కొమ్ములు  ఊపుతుంటే, వాటిని తోలుకొని వచ్చిన వాళ్ళు ఎద్దుకీ, తమకీ కూడా పళ్ళు, డబ్బులు , ధాన్యము తీసుకొని వెళ్ళే వాళ్ళు. కోస్తా ఆంధ్రా లో ఉన్నంత కాక పోయినా, కోడి పందేలు జరిగేవి.  ఒక అతను హార్మోనియమ్ తెచ్చి, వాయిస్తూ, " పరమాత్మూనీ భజనా,,  పలీకీనంతటానా " అంటూ భిక్షానికొచ్చేవాడు. మిగతా రోజుల్లో కూడా వచ్చేవాడు కాబట్టి, ఆ పాట వినీ వినీ నేర్చేసుకున్నాము.  ఇంకొకాయనైతే, గోచీ పెట్టి పంచె కట్టి, ప్రతి ఇంటిముందుకూ వచ్చి, తలకిందుగా నిలుచొని, " హరి, హరి, హరి, " అంటూ ఉండేవాడు. అలా తలకిందులుగా ఉన్నప్పుడు,  ఆయన పక్కన పెట్టుకున్న బుట్ట లోని బియ్యాన్ని కోళ్ళు వచ్చి తింటుండేవి. ఒకో ఇంటి ముందూ సుమారు అరగంట అలా తలకిందుగా ఉండేవాడు. ఆయనకి వచ్చిన భిక్షమంతా కోళ్ళ పాలయ్యేది. 

           అమ్మ సంక్రాంతి రోజు భోజనంలోకి సద్ద రొట్టెలు, గుమ్మడికాయ కూరా తప్పనిసరిగా చేసేది. మేమంతా ఉదయాన్నే తలంటు స్నానం చేసి మా అమ్మతో పాటు దేవుడికి పూజ చేసి రొట్టెలకోసం కాచుకుని వుండేవాళ్లం. ఒకే పంక్తి లో కూచొని మా నాన్నతో కలిసి మేమంతా భోంచేస్తే, తాను మాత్రం మా భోజనాలు అయ్యాక చివర్న తినేది.

              సాయంత్రం కాగానే, కొత్త బట్టలు తొడుక్కుని, భోగి పళ్ళు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేవాళ్ళం. ఒక జంఖానా పొడుగ్గా పరచి, వరుసగా మమ్మల్ని కూచోపెట్టేది. అందరికీ హారతి ఇచ్చి, ఒక గిన్నెలో లేదా బుట్టలో రేగు పళ్ళు, చెరకు ముక్కలు, బెల్లం ముక్కలు,చిల్లర నాణేలు కలిపి, మా అందరికీ తలలపైన పోసేది. మేమైతే డబ్బులకోసం పోటీపడేవాళ్లం .అలా పిల్లలకు భోగి పళ్ళు పోస్తే వాళ్ళు ఏ దిష్టీ తగులకుండా ఆరోగ్యంగా ఉంటారని  అమ్మ నమ్మకం.

                        ఇక ఉగాది వస్తే, తెల్లవారే  లేచి తలంటి పోసుకుని, ఇంటి చెట్లోంచీ వేప పూత, చిగురుటాకులు తెచ్చి ఉగాది పచ్చడికి సిద్ధం చేసేవాళ్ళం.  ఆరోజు పంచాంగం చదివి, పూజయాక, హోళిగలతో ( బొబ్బట్లు ) కడుపునిండా భోజనం చేసి ఆటలకు వెళ్ళేవాళ్ళం. మా అమ్మ ఏ మధ్యాన్నమో భోంచేసి, కాస్త నడుం వాల్చగానే పని మనుషులు, చాకలి వాళ్ళూ వచ్చేవాళ్ళు. వాళ్ళకి భోజనాలు పెట్టి, ఇండ్లకు ప్రత్యేకంగా అన్ని పదార్థాలు వేసి ఇచ్చేది. ఎంత వంట చేసేదో కానీ, వాళ్ళు తెచ్చుకున్న గిన్నెలనీ నిండేవి.

                          బొజ్జ గణపయ్య వినాయక చవితి కైతే సందడే సందడి. మేము పొద్దున్నే లేచి ఒక మైలు దూరంలో వున్న  " ఆయిల్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ " కు వెళ్లి దొంగదారిన కాంపౌండు గోడ దూకి అక్కడున్న పెద్ద తోటలోకి వెళ్ళే వాళ్ళం. అక్కడ లేని పూల చెట్లు గాని పండ్ల చెట్టు గాని, ఇతర వృక్షాలు గాని లేవు. . పూజకు కావాల్సిన పత్రి, మర్రి ఆకులు, మామిడాకులు, మేడి, రావి ,  జువ్వి లాంటి ఆకులు, పూలూ కోసుకొని వచ్చే వాళ్ళం. మా లాగే మరి కొందరు వచ్చే వాళ్లు.

           ముందురోజే వినాయకుడి బొమ్మ తెచ్చే వాళ్ళం కాబట్టి, పొద్దున్నే పత్రి తెచ్చాక, స్నానం చేసి, వ్రతం పుస్తకం తీసుకొని వచ్చీరాని మంత్రాలు చదివి పూజ పూర్తి చేసే వాళ్ళం. అప్పటికి మేము ఏ మంత్రాలూ నేర్చుకోలేదు, నాకైతే ఒడుగు కూడా కాలేదు . అలా చేసే ఆ పూజకే తన్మయత్వం చెందే వాళ్ళం. తప్పనిసరిగా మా అమ్మ కుడుములు చేసేది. సాయంత్రం చంద్రుడు ఎక్కడ కనపడతాడో అని తల వంచుకుని  బెదురుతో నడిచే వాళ్ళం. కథ విని, మళ్ళీ పూజ చేసి ఆరుబయట కూర్చొని, పాటలూ, పొడుపుకథలూ చెప్పుకుంటూ గడిపే వాళ్ళం. అప్పుడు మాకు ఆరు నుంచి పన్నెండేళ్లుండేవి.

                   దసరా అయితే, ఎలాగూ పదిహేను రోజులు శెలవులుండేవి. సరస్వతీ పూజ రోజున శ్రద్ధగా పుస్తకాలను పూజించేవాళ్ళం.ఆయుధ పూజకు ఇంట్లో వున్న పనిముట్లూ, కుట్టూ   మిషనూ , సైకిళ్ళకు , పూజ చేసేవాళ్ళం. అంతకు మించి మా ఇంట్లో ఇంకేమీ ఉండేవి కాదు. మా అమ్మ కొన్నేళ్ళు  బొమ్మలకొలువు పెట్టేది. దశమి రోజు తప్పనిసరిగా గుడికి వెళ్ళేవాళ్ళం. శమీ చెట్టుకు పూజ చేసి, ప్రదక్షిణ చేసి, పెద్దలకు పత్రి ఇచ్చి, కాళ్ళకు నమస్కారం చేసేవాళ్ళం. అదేదో భక్తితో అనుకునేరు, ఆరోజు నమస్కరిస్తే, తప్పకుండా డబ్బులిచ్చేవాళ్ళు, అందుకని. మా పాఠ్య పుస్తకాల్లో దసరా గురించిన పాఠంలో, ’ అయ్యవారికి చాలు ఐదు వరహాలు, పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు ’ అని ఉండేది. స్కూల్లో టీచర్లు, అదేదో రూల్ ఐనట్టు, ప్రతి సారి పప్పు బెల్లాలు పంచేవారు. మేము ఏనాడూ అయిదు రూపాయలిచ్చిన పాపాన పోలేదు . 

         
                  మధ్యాహ్నమంతా పుల్లన్న బస్సుల్లో విహారం చేసేవాళ్ళం. ఆ రోజుల్లో బస్సుల పుల్లన్న అని ఒకాయన " శ్రీ వెంకటేశ్వరా ట్రాన్స్ పోర్ట్ సర్వీస్ "  నడిపేవాడు. ఆయుధపూజ రోజంతా పూలు, మామిడాకులు, గంధం బొట్లతో అలంకరించిన తమ బస్సుల్లో పిల్లలందరికీ  free ride ఏర్పాటు చేసేవాడు. ఒకోసారి అదే రోజు పీర్ల పండగ వచ్చేది. ముస్లిం సోదరులు పీర్లు పట్టుకొని ఊరేగింపుగా వెళ్ళేవారు. బస్సు కిటికీలోంచి అదంతా ఆసక్తిగా చూసేవాళ్ళం. 

          దీపావళి కి కూడా కొత్తబట్టలు తప్పనిసరిగా వుండేవి. నరక చతుర్దశి రోజు ఉదయాన్నే తలంటిపోసుకుని, టపాకాయలు కాల్చే వాళ్ళం. ఇంటిబయట అంతా దీపాలు పెట్టి చిచ్చుబుడ్లు, విమానాలు, ఇలా రకరకాలుగా కాల్చే వాళ్ళం. ఒకసారి దీపావళికి మా నాన్న దగ్గర డబ్బులు లేవు, అప్పుడు మేము కేవలము పాత న్యూస్ పేపర్లు రంగు కాయితాలు మొ.. నవి కాల్చాము, నాకు బాగా గుర్తు. రంగు కాగితాలు కాల్చినా రంగు మంటలు వచ్చేవి కావు . 

                                    వైకుంఠ ఏకాదశికి మా అమ్మ తప్పనిసరిగా గుడికి వెళ్ళేది. శివరాత్రికి కూడా గుడికి వెళ్ళి వచ్చేది. ఆ రోజు మేము, రెండవ ఆట, నాల్గవ ఆట సినిమాలు చూసే వాళ్ళం. ఇలా రాస్తూ వెళితే ఇదేదో పండగలపై వ్యాసంలా కనిపించినా, ఆశ్చర్యం లేదు. 

                      పండగ అని కాకపోయినా, ఎపుడైనా స్వీట్లు , కోడు వడలు (చేగోడీలు) , చక్కిలాలు ( జంతికలు ) , అత్తి రసాలు  చేసేది. మేము ఒకే రోజులో ఖాళీ చేస్తామేమో అని ఒక డబ్బాలో పోసి, మాకు అందకుండా పైన అటక మీద పెట్టేది. అది గమనించి, మేము చల్లగా ఆ డబ్బా దింపి, నేల మీద ఒక మూల పెట్టుకొనే వాళ్ళం. అటక పైన ఏదైనా అలాంటిదే ఒక ఖాళీ డబ్బా పెట్టి ఏమీ తెలియనట్లు ఉండే వాళ్ళం. మా అమ్మ చూపులెప్పుడూ పైని డబ్బా మీదనే ఉండేవి. మేము అటు పోతూ, ఇటు వస్తూ ఆ మూల డబ్బా లోంచి స్వీట్లు లాగించే వాళ్ళం. సాయంత్రంగా అది తెలిసికొని బుగ్గలు సొట్టలు పడేలాగా స్వచ్ఛంగా నవ్వేది కానీ తిట్టేది కాదు. ఆ రవ లడ్లు , అత్తిరసాలు ( అరిసెలు ), ఇతర చిరు తిళ్ళు  చేయాలంటే రెండు రోజుల ముందే విసురు రాయి ( తిరగలి) లో పిండి, చక్కెరా లాంటివి విసిరివుంచుకునేది పాపం. ఐతే విసరడంలో ఎపుడైనా సాయం  చేసేవాళ్ళం. అపుడే తెలుసు ఏదో చిరుతిండి చేయబోతున్నదని !

           ఒకసారి మా పెద్దన్న కడుపు లో ఉన్నపుడు ఎప్పుడూ పాములు కలలోకి వచ్చేవట. ఒక రాత్రి ఏదో పని మీద దొడ్లో తలుపు తీస్తే ఎదురుగా నిలువెత్తు నాగు పాము పడగ ఎత్తి నిలుచుందట. అమ్మని చూసి, పడగ దింపి వెళ్ళిపోయిందట. అలా కడుపుతో ఉన్నవాళ్ళకి పాము కనబడితే, ఆ పుట్ట బోయే వారివల్ల కష్టాలు తప్పవంటారు. అది ఒక మూఢ నమ్మకమే ఐనా, మా అమ్మ విషయంలో నిజమే అయింది. 

           మరో సారి ఎదురింటి మేడ మీద చిన్ని కృష్ణుడు పాకుతూ, ఆడుతూ కనిపించాడట.  వాళ్ళ చిన్నప్పుడు పొలాల్లో కొరివి దయ్యాలు గున గునా నడుస్తూ పోవడం చూసిందట. ఈ విషయాలు ఎన్నో సార్లు చెప్పింది కానీ వాటి అర్థం ఇప్పటికీ విశ్లేషణ కు అందడం లేదు. ఇలాంటి విషయాలు అమ్మ చెబితే మాకు అవన్నీ మామూలు విషయాలుగా అనిపించేవి , ఏమీ ఆశ్చర్యం వేసేది కాదు . ఇప్పుడు తలచుకుంటే రోమా లు నిక్కబొడుచుకుంటాయి 


          పై వన్నీ చదివాక, చెప్పండి, అన్నీ మామూలు విషయాలే కాదంటారా ? . ఐతే, ఆర్భాటాలు, బడాయిలూ లేని అవన్నీ మధుర స్మృతులు. ఎందుకంటే, ఆ రోజులు, ఆ పరిస్థితులు మళ్ళీ రావు. అవన్నీ మా అమ్మలోని ఒక కోణాన్ని ఎంతో అందంగా  చూపుతాయి. ఆ అనుభవాలు మనిషి మానసిక ఆరోగ్యానికి కావలసిన  ముఖ్యమైన వాటిలో భాగాలు. . ఈనాడు పల్లెలలో కూడా అటువంటి సంబరాలు అంతరించి పోతున్నాయి.

Sunday, November 4, 2012

సర్వేంద్రియాణాం నయనం ప్రధానమ్


     
ఇది చదివి కంటి  చూపు వేగముగా మెరుగు పరచుకొని , పూర్తి ఆరోగ్యము పొందండి






     ఆరోగ్యం భాస్కరాదిఛ్చేత్ ..అంటారు .. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. అంతే కాదు , మంచి కంటి చూపు కూడా ఇస్తాడు . జాతకంలో  సూర్యుడి స్థితిని బట్టి జాతకుని కంటి చూపెలా ఉంటుందో చెబుతారు 

     ఇవన్నీ వినడానికి బాగున్నాయి . అసలెవరైనా దీని మీద ఒక పరిశోధన గానీ ప్రయోగము కానీ చేసి ఫలితాలు చూశారా ? అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది . "  సూర్య థెరపీ " అని ఏదైనా ఉందా ?  నాకు వీటి గురించి మొదట్లో తెలిసేది కాదు . 1993  నుంచీ కంప్యూటర్ పై చాలా పని చేసేవాడిని . రోజుకు 18 గంటలు . ఇంకేముంది ? రెండేళ్ళకే అద్దాలు వచ్చాయి , సరే వయసు కూడా వచ్చింది కదా , ఇది వయసు ప్రభావము అనుకున్నా. 

     2006  లో ,  మా నాన్నగారు ఎప్పుడో 1937  లో రాసిన ఒక రాత పుస్తకము  నా కంట బడింది . అందులో సూర్యుడికి అర్ఘ్యము ఇచ్చే పద్దతి , దాని ఫలితాలు విపులముగా  ఆయన దస్తూరితో రాసి ఉంది . ఆ పుస్తకము అన్నేళ్ళూ నేను చూడక పోవడమే ఆశ్చర్యం . ఆయన 1995  లోనే స్వర్గస్తులైనారు . ఆ తరువాత , అందులోని విషయమే ఇంకో పుస్తకము లో కూడా చదివాను . అప్పటికి నా కళ్ళ పరిస్థితి ఘోరముగా ఉండింది . రోజూ తలనొప్పి , తల తిరగడము , ఒకరకమైన వికారము ఉండేవి .  రెండు మూడు నెలలకు ఒకసారి కళ్ళజోడు మార్చాల్సి వచ్చేది .

      ఒకసారి మహా ఇబ్బంది పడి , 2008 లో , మా నాన్న గారి పుస్తకములోని ప్రకారము సూర్యుడికి అర్ఘ్యము రోజూ ఇచ్చుట  మొదలు పెట్టాను . ఒక పదిరోజులకే కళ్ళ మంటలు పూర్తిగా తగ్గిపోయాయి . తలనొప్పి , వికారము పూర్తిగా తగ్గాయి . నెలరోజులకే నా కళ్ళు చల్లగా , అంతకు ముందు కుంచించుకుని సగం మూసినట్టు ఉండేవి పూర్తిగా , సహజంగానే విప్పారినాయి . ఆరునెల్లయింది , అంతా బాగా ఉంది . 

     ఒకసారి డాక్టరు దగ్గరకు వెళ్ళాను , ఊరికేనే  ( మాకు అక్కడ సంవత్సరానికి రెండు సార్లు ఉచితముగా చూస్తారు . ) వారు చూసి , కళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి , అదే కళ్ళజోడు వాడండి , ఇంకేమీ అవసరము లేదు అన్నారు . అంతకు ముందు ప్రతిసారీ కళ్ళ సైటు మారింది అని వేరే రాసిచ్చేవారు . నేనేమీ మాట్లాడకుండా వచ్చాను . తర్వాత ఆరునెల్లకు మళ్ళీ ’ ఊరికే ’ వెళ్ళాను . మళ్ళీ అదే మాట, కళ్ళకి ఏ ఇబ్బందీ లేదు , అదే కళ్ళజోడు అని . అప్పుడు అడిగాను , ’ మరి అంతకు ముందు ప్రతి మూడు నెలలకీ జోడు మార్చవలసి వచ్చేది కదా , నా కంప్యూటర్ పని ఏమీ తగ్గలేదు , మరి ఎందుకు నాకు ఇబ్బంది కలగ లేదు ? ’  అని . ఆ డాక్టరు గారికి విదేశాలలో కూడా మంచి పేరుంది . కానీ ఆయన జవాబు చెప్పలేదు , ’ అరుదుగా  కొంతమందికి అనుకోకుండా కళ్ళు బాగవుతాయి , దానికి కారణాలు చెప్పలేము ’ అన్నారు . 

     అప్పటినుండీ నేను సూర్యుడికి రోజూ అర్ఘ్యము ఇవ్వడము మానలేదు . ఈ విషయము ఒకసారి ఆర్కుట్ లో రాశాను . అది చదివి అర్ఘ్యము ఇచ్చే పద్దతి చెప్పండీ అని చాలా మంది అడిగితే , వారికి రాసిచ్చాను . మధ్యలో వారము పదిరోజులు ఎపుడైనా అర్ఘ్యము ఇవ్వడానికి వీలయ్యేది కాదు . కానీ నాకు ఎటువంటి ఇబ్బందీ కలగలేదు . నేను ఆర్కుట్ లో రాసినది పాటించినవారిలో ఒకరిద్దరు, తమకు కూడా మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు . 


     మొన్న అధిక మాసము , తర్వాత పితృపక్షాలు రావడముతో , నాకు వేరే జపాలు ఉపాసనలు ఎక్కువ కావడముతో , రెండు నెలలు అర్ఘ్యము వదలలేదు . రెండు రోజుల కిందట నాకు మళ్ళీ తలనొప్పి వచ్చింది . అప్పుడు అర్ఘ్యము మానేసినది గుర్తొచ్చి , మళ్ళీ నిన్నటినుండీ  మొదలుపెట్టాను . ఈ రోజునుండీ నాకు మళ్ళీ కళ్ళు ఎంతో బాగున్నాయి , తలనొప్పి కూడా అదే పోయింది . డాక్టరు దగ్గరకు వెళితే , మళ్ళీ అదే పాట , మీ కళ్ళకు వచ్చిన ఇబ్బందేమీ లేదు , అదే జోడు అని . 

అందుకని వెంటనే ఇది అందరితో మళ్ళీ పంచుకుందామని రాస్తున్నాను . 


శ్రీ సూర్య నమస్కారం , అర్ఘ్యం చ...లఘునా

 దీనికి కావలసినవి , 1 . ఒక రాగి గిన్నె కానీ చెంబు కానీ . 2  .ఎర్ర చందనము . ఇది చెక్కలుగా దొరుకుతుంది , కొన్ని చోట్ల పొడిగా కూడా దొరుకుతుంది . చెక్క తీసుకుంటే , రోజూ గంధము తీయాలి , పొడి అయితే దాన్ని రుద్ది గంధము చేయుట సులభము . ఓ నూరు రూపాయల చెక్క గానీ , పొడిగానీ కొనుక్కుంటే సంవత్సరము పైన వస్తుంది .   ఇదికాక, రోజూ కొన్ని ఏవైనా ఎరుపు రంగు పూలు కావాలి . ఒక కుండీలో కనకాంబరాలు కానీ , ఇంకేవైనా ఎర్ర పూలిచ్చే గులాబీ , మందారము వంటి చెట్టుకానీ పెట్టుకోండి . 

విధానము 

స్నానము, సంధ్యావందనము ముగించి , 
మొదట ఎర్ర చందనము గంధము తీసి ( ఒక బటాణీ గింజంత అయినా చాలు ) రాగి చెంబులోని నీటిలో కలపండి . బాగా ఉద్ధరిణతో కలియబెట్టి , అందులోకి చిన్న చిన్న పూలు గానీ , పెద్ద పూలైతే వాటి రేకులు గానీ కలపండి . 

తర్వాత  సూర్యునికెదురుగా నిలిచి  ఈ కింది మంత్రము చెప్పి నమస్కరించండి 

సూర్య మంత్రం 

||  ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతి కరాయ ధీమహి 

తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ||

     తర్వాత కింది మంత్రము చెప్పుచూ ఇరవైనాలుగు సార్లు ఆత్మ ప్రదక్షిణము చేస్తూ , ప్రతి ప్రదక్షిణము తర్వాత , పూర్తి సూర్య నమస్కారము గానీ ( యోగా పద్దతిలో ) , లేదా , ఊరికే సాష్టాంగ నమస్కారముగానీ , అదీ వీలు కాకున్న , వంగి నేలను ముట్టి నమస్కారము గానీ చేయండి . ఇరవై నాలుగు సార్లు వీలుకాకున్న , పన్నెండు సార్లో , అదీ వీలుకాకున్న ఆరు సార్లో  చేయండి . అయితే శ్రద్ధ ముఖ్యము. వీలైనన్ని ఎక్కువ సార్లు చేయుటకే ప్రయత్నించండి .మొదట ఒక వారము రోజులు  అలవాటు అయ్యేవరకూ కాస్త కష్టమనిపించవచ్చు . ఆ తర్వాత అలవాటుగా , గబగబా చేసేస్తారు . మంత్రము కూడా అప్పటికి నోటికి వచ్చేస్తుంది . 

 సూర్య నమస్కారం 

||  వినతా తనయో దేవః కర్మ సాక్షీ సురేశ్వరః 
సప్తాశ్వ సప్త రజ్జుశ్చ అరుణో మే ప్రసీదతు ||


|| మిత్ర , రవి , సూర్య, భాను , ఖగ , పూష , హిరణ్య గర్భ, మరీచ , ఆదిత్య , సవిత్ర , అర్క , భాస్కరేభ్యో నమః ||

ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి.

( పై మంత్రము 24  పర్యాయములు చెప్పి  ప్రతిసారి  ప్రదక్షిణ సాష్టాంగ నమస్కారములు చెయ్య వలెను )


ఆ తర్వాత ,. సూర్య అర్ఘ్యం  

ఈ కింది మంత్రము చెప్పి రాగి చెంబులోని  గంధము  , పూలు కలిపిన నీటితో మూడు సార్లు కానీ , పన్నెండు సార్లు కానీ అర్ఘ్యము వదలండి. అర్ఘ్యము వదలునపుడు లేచి నిలుచొని, దోసిటి నిండా చెంబులోని నీళ్ళు తీసుకుని , మంత్రము చెప్పి , అంజలితో కిందికి వదలండి , లేదా , ఏ చెట్టు మొదట్లోకో , కుండీ లోకో వదలండి . 

||  నమస్సవిత్రే జగదేక చక్షసే  | జగత్ ప్రసూతి స్థితి నాశ హేతవే |

త్రయీ మయాయ త్రిగుణాత్మ ధారిణే | విరించి నారాయణ శంకరాత్మనే ||

శ్రీ ఉషా సంజ్ఞా ఛాయా సమేత సూర్య నారాయణ పర బ్రహ్మణే నమః 
ఇదమర్ఘ్యం సమర్పయామి  (ఎర్ర చందనము , ఎర్ర పూలు కలిపిన నీళ్ళతో  మూడు పర్యాయములు )

౩. తర్వాత సూర్య ధ్యానం 

ఈ శ్లోకము చెప్పి మనసులో సూర్యునికి నమస్కరించండి .

||  ధ్యేయస్సదా సవితృ మండల మధ్య వర్తి | నారాయణ సరసిజాసన సన్నివిష్టః |
కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ | హరీ హిరణ్మయ వపుర్ధృత శంఖ చక్రః |

ఉదయం బ్రహ్మ స్వరూపం మధ్యాహ్నం తు మహేశ్వరః | అస్తమానే స్వయం విష్ణుః త్రిమూర్తిశ్చ దివాకరః || 


సమాప్తం



రోజూ సంధ్య వేళలలో ఈ స్తోత్రము చదువుకోండి సర్వ శుభములూ పొందండి . 
ఏక వింశతి సూర్య నామాని 
( హోమాదులలో ఉపయోగించవచ్చును.  సంధ్యా కాలం లో పఠించిన , సర్వ పాప ముక్తులు అగుదురు )

|| వికర్తనో వివస్వాం చ మార్తాండో భాస్కరో రవిః | లోక ప్రకాశకః శ్రీమాన్ లోక చక్షుర్గ్రహేశ్వరః | 
లోక సాక్షీ త్రిలోకేశః కర్తా హర్తా తిమిస్రహా | తపనస్తాపనశ్చైవ శుచిస్సప్తాశ్వ వాహనః |
గభస్తి హస్తో బ్రహ్మా చ సర్వ దేవ నమస్కృతః | ఏక వింశతిరిత్యేష స్తవ ఇష్టస్సదా మమ | 
శరీరారోగ్యదశ్చైవ ధన వృద్ధి యశస్కరః | స్తవ రాజ ఇతి ఖ్యాతస్త్రిషు లోకేషు విశ్రుతః || 

సూర్యస్తవము 
( బ్రహ్మ ఉపదేశించినది-- భవిష్య పురాణము  ) 

* నమస్సూర్యాయ నిత్యాయ రవయే కార్య భానవే | భాస్కరాయ మతంగాయ మార్తాండాయ వివస్వతే |
ఆదిత్యాయాది దేవాయ నమస్తే రశ్మి మాలినే | దివాకరాయ దీప్తాయ అగ్నయే మిహిరాయ చ | 
* ప్రభాకరాయ మిత్రాయ నమస్తేఽదితి సంభవ | నమో గోపతయే నిత్యం దిశాం చ పతయే నమః | 
నమో ధాత్రే విధాత్రే చ అర్యమ్ణే వరుణాయ చ | పూష్ణే ఖగాయ మిత్రాయ పర్జన్యాయాంశవే నమః | 
* నమో హితకృతే నిత్యం ధర్మాయ తపనాయ చ | హరయే హరితాశ్వాయ విశ్వస్య పతయే నమః | 
విష్ణవే బ్రహ్మణే నిత్యం త్ర్యంబకాయ తథాత్మనే | నమస్తే సప్త లోకేశ నమస్తే సప్త సప్తయే | 
*ఏకస్మైహి నమస్తుభ్యమేక చక్ర రథాయ చ | జ్యోతిషాం పతయే నిత్యం సర్వ ప్రాణ భృతే నమః | 
హితాయ సర్వ భూతానాం శివాయార్తి హరాయ చ | నమః పద్మ ప్రబోధాయ నమో వేదాది మూర్తయే | 
* కాదిజాయ నమస్తుభ్యం నమస్తారా సుతాయ చ | భీమజాయ నమస్తుభ్యం పావకాయ చ వై నమః |
ధిషణాయ నమో నిత్యం నమః కృష్ణాయ నిత్య దా | నమోఽస్త్వధితి పుత్రాయ నమో లక్ష్యాయ నిత్యశః|
( సర్వాభీష్ట సిధ్ధి కి ప్రాతః సాయంకాలాలు పఠించ వలెను ) 
----------

తరువాత కానీ , అర్ఘ్యమునకు ముందేకానీ తల్లిదండ్రులకు నమస్కరించండి .

మాతా పితర వందనము

మాతృ నమస్కారం

|| యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః | నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణీం |
కృఛ్చ్రేణ మహతా దేవ్యా ధారితోహం యథోధరే | త్వత్ప్రసాదాజ్జగదృష్టం మాతర్నిత్యం నమోస్తుతే |
పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః | వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే ||

పితృ నమస్కారం

|| స్వర్గాపవర్గ ప్రదమేక మాంద్యం బ్రహ్మ స్వరూపం పితరం నమామి
యతో జగత్పశ్యతి చారు రూపం తం తర్పయామస్సలిలైస్తిలైర్యుతైః || 
పితరో జనయంతీహ పితరో పాలయంతి చ |
పితరో బ్రహ్మ రూపాహి తేభ్యో నిత్యం నమో నమః |
యస్మాద్విజయతే లోకస్తస్మాద్ధర్మః ప్రవర్తతః |
నమస్తుభ్యం పితస్సాక్షాత్ బ్రహ్మ రూప నమోస్తుతే || 

సమస్త సన్మంగళాని భవంతు