SHARE

Thursday, August 16, 2012

" మంత్ర ద్రష్ట " సంధ్యావందనము


                 శ్రీ దేవుడు నరసింహ శాస్త్రి గారు ఈ పుస్తకము చివరలో ’ సంధ్యావందనము ’  అను అద్భుతమైన అనుబంధము నిచ్చినారు . అందులో సంధ్యావందనపు ప్రాశస్త్యము మిగుల సరళముగా , ఉత్తేజితము చేయునట్లు రాసి యున్నది . దీనిని పుస్తకపు కొనయందు ఇచ్చినచో కొందరికి కనుమరగు యగునన్న భీతితో ఇప్పుడే ఇవ్వడమైనది . దీనితర్వాత , విశ్వామిత్రుడు గాయత్రీ మంత్రమును దర్శించిన అద్భుత ఘట్టము తదుపరి తరంగములలో  రానున్నది . ఆస్వాదించగలరు------

సంధ్యావందనము 

     లోకములో నున్న ప్రాణులన్నీ సూర్యోపాసన చేయునవే . కొందరికి ఇది తెలుసు . అనేకులు దీనిని చూచినారు . తాము చేస్తున్న కార్యమును అర్థము చేసుకొని , దానిని క్రమబద్ధీకరించి , సంకల్ప పూర్వకముగా సాంగముగా చేయునదే యోగము . ఆ యోగము వలన యోగపు వైపుకు చిత్తమును మరలించుటయే ప్రగతి . 

     సూర్యుడిని వేదములు ’ సూర్య ఆత్మా జగతః తస్థుషశ్చ ’ - స్థావరముగా నిలుచున్న , జంగమమై చరిస్తున్న ప్రాణులన్నిటికీ సూర్యుడే ఆత్మ అని పరి పరి విధముల పొగడినవి. సూర్యుడినుండే బ్రహ్మాండము మొదలైనది యని ఆతనిని ’ ఆదిత్యుడు ’ అందురు . ఈ విశ్వములో నున్న తేజస్సు అంతా అతనిదే అని అతనిని భాస్కరుడు అందురు . ( వెలుగు నింపువాడు )  గ్రహ మండల నాయకుడైన ఇతడి వల్లనే ఆరోగ్యాది భాగ్యములన్నీ లభించునది , అన్నది అనుభవైకవేద్యమే . 

     ఈ సూర్యుని వల్లనే మనుష్య లోకములోని చరాచరములన్నీ వికాసమును పొందునది . అందువలననే  ప్రాణులు మాతృ గర్భము నుండీ బయటకు రావలెనంటే అతడి అనుమతి కావలెను అని అతడిని ’ సవితృడు ’ అని ఆర్యులు పూజించినారు .

     ఒకానొక కాలములో ఈ సవితృదేవుడి పూజ ప్రపంచములోని నలు మూలలా జరుగుచుండినది . ధర్మము క్షీణమైన కొద్దీ ఈ సవితృ పూజకూడా హ్రస్వమై వచ్చినది . ఇప్పుడు ఎక్కడో కొన్ని చోట్ల మాత్రము జరుగుతున్నది . 

     అలాగని , సవితృ దేవుని పూజను ఎవరూ వదలలేదు , వదులుటకు లేదు . దేహములో ప్రతి క్షణమూ జరుగుచున్న శ్వాస క్రియకు ఆధారము ప్రాణము . ఈ ప్రాణములో చర , స్థిర అంశములున్నవి . ఈ ప్రాణము ఊర్ధ్వ గతి , అధోగతులలో ప్రవహిస్తూ బయటి వాయువు వలన దేహములో నున్న వాయువును పోషిస్తూ , దేహపు అస్తిత్వమునకు కారణమైయున్నది . ఈ ప్రాణమును ఊర్ధ్వగతిలో నున్నపుడు సూర్యుడనీ , అధో గతిలో నున్నపుడు చంద్రుడనీ పిలుస్తారు . స్థిరముగానున్న అంశమే సూర్యుడు . చలించుచూ , చలన క్రమము వలన క్షీణ , వృద్ధులను పొందు చరమైన అంశమే చంద్రుడు . ఈ సూర్య చంద్రులలో సూర్యుడు బీజ రూపమైన అగ్నినీ , చంద్రుడు ఆహార రూపమైన సోమమునూ ఇచ్చెదరు . ఈ అగ్నీషోమ మండలముల అనుగ్రహము వల్లనే  ప్రాణులన్నీ బ్రతికియున్నది అనునది యోగము వలన తెలియ వలసిన అంశము . 

     ప్రాణులన్నిటా అగ్నీషోమ మండలమున్నట్లే , లోకాలన్నిటికీ , బ్రహ్మాండానికీ కూడా ఉంది . ఈ తత్త్వమును స్తుతిస్తూ వేదము , ’ అగ్నీషోమాత్మకమిదం జగత్ ’ అని కీర్తించినది . ఈ అగ్నియే పురుషుడు , సోమమే ప్రకృతి . ప్రకృతీ పురుషుల లీలయే , ఈ సృష్ఠి , స్థితి , సంహారములు . 

     ఇలాగ ప్రకృతీ పురుషుల మూలస్థానమైన అగ్నీషోమ మండలపు యజమానుడు , సవితృ దేవుడు . సవితృడనగా , ఏది పుట్టవలెనన్నా , పుట్టిననూ , మాతృ గర్భమునుండీ బయటికి రావాలన్నా అతని అనుమతి కావలెను . ఇది ప్రకృతి నియమము . ఈ నియమమును తెలిసినవారంతా సవితృదేవుడిని ఆరాధించవలెను . ఆరాధించవలెను అనుటకన్నా , ఆరాధించుచున్నారు యనుట సరియైనది . ప్రతియొక్క దేహములోనూ , ఈ ఆరాధన ప్రతిశ్వాసలోనూ జరుగుతూనే యున్నది . సరిగ్గా జరుగుతున్నపుడే ఆ దేహము ఆరోగ్యముగా ఉండునది . ఆ ఆరాధన కొంచము వక్రమైననూ ఆ దేహానికి రోగము వచ్చును . ఈ తత్త్వమును తెలిసిన ఆయుర్వేదము , రోగమును తప్పించి ఆరోగ్యమును కలిగించు చికిత్సకుడిని ’ ప్రాణాచార్యుడు ’ అని పిలచి , ఈ ఆరాధన యొక్క మూల స్వరూపమును గుర్తించినది . 

     ఈ సవితృదేవుడే ఆదిత్యుడు . ఇతడు నానారూపములలో జగత్తును పాలించుచున్నాడు . ఈ తేజోరాశి యొక్క కిరణములు ఒక్కొక్కదానినీ , ప్రత్యేకముగా చూచునదే , వేదపు విస్తృత స్వరూపము . ఏకముగా చూచుట వేదపు సమిష్టి స్వరూపము . వేదపు సమిష్టి స్వరూపుడైన ఈ సవితృదేవుని తేజస్సు ప్రతియొక్క ప్రాణిలోనూ ఉండి , మనస్సునూ , బుద్ధినీ కార్యోన్ముఖమగునట్లు ప్రచోదనము చేయును ( ప్రేరేపించును ) . అలాగ , తనలోనే ఉండి , తనను ప్రచోదించుచున్న తేజోరాశిని ఆరాధించుటను లోకానికి నేర్పి విశ్వామిత్రుడు లోకోద్ధారకుడైనాడు . ఆ మహాపురుషుడు చూచిన తత్త్వము అతడు మనకిచ్చిన గాయత్రీ మంత్రములో ఉంది . 

     సమిష్టి బ్రహ్మాండములో అగ్నీషోమ మండలపు స్వామియై యున్న సవితృదేవుడే ప్రతి మనిషిలోనూ , ప్రతి వ్యక్తిలోనూ కూర్చొని ఉండుటను తెలియక , ప్రతి వ్యక్తీ తన మనోబుద్ధుల వలన ప్రేరితుడై , ఇంద్రియముల చేత వ్యాపారము చేస్తున్న ,  తనకు ప్రేరకములైన ఆ మనోబుద్ధులు స్వతంత్రములేనా ? అవి ఎందుకు ఆ విధముగా ప్రేరేపించినవి ? మరొక విధముగా ఎందుకు ప్రేరేపించలేదు ? అనుదానిని విచారింపకయే , ’ ప్రేరకుడను తానే ’ అను మోహము తో ప్రవర్తించుచున్నాడు . కానీ విచారము చేసి చూచినవాడు , ’ సర్వ వ్యాపారములనూ చేయు ఇంద్రియాలను మనోబుద్ధులు ప్రేరేపించును , ఆ మనోబుద్ధుల ప్రేరకుడు ఇంకొకడు ఉండవలెను ’ అనుదానిని సులభముగా గుర్తించగలడు .  ఈ మనోబుద్ధుల ప్రేరకుడే సవితృ దేవుడు . ఇంద్రియ వ్యాపారముల కన్నిటికీ మూలమైన మనసు యొక్క వ్యాపారమునకు కూడా కారణమగు బుద్ధిని ప్రేరేపించువాడే ఆ సవితృడు .

      ఈ సవితృ దేవుడు తన దివా కిరణము వలన సూర్యుడై , నిశా కిరణము వలన చంద్రుడై , స్థిరా కిరణము వలన భూమియై , రస కిరణము వలన జలమై , తేజః కిరణము వలన అగ్నియై , ప్రాణ కిరణము వలన వాయువై , శూన్య కిరణము వలన ఆకాశమై ఈ బ్రహ్మాండమునంతటినీ వ్యాపించియున్నాడు .  అందువలననే , ఎరిగినవారు , ’ భిన్నాప్రకృతి రష్టధా ’ అంటూ , ఏకమై యుండి కూడా లోక స్థితి కోసము భిన్నమైన సవితృ దేవుడిని గుర్తిస్తారు . కొన్ని చోట్ల నిష్క్రియ గానూ , మరి కొన్ని చోట్ల సక్రియగానూ కనిపించు ప్రకృతిని లోకములో జడ చేతనములు అని వ్యవహరించుచున్ననూ , జడ చేతనములు రెండూ , ఒకే ప్రకృతి యొక్క రెండు రూపాలు . ప్రకృతి పురుషుల వ్యాపార క్షేత్రమే ఈ జగత్ . జగత్ అంటే , నిలవకుండా నడచునది అని అర్థము . అంటే , జగత్తు స్థిరమైనది కాదు . పరుగెడుతున్నది . అలాగ పరుగెడుతున్న అంశమే ప్రకృతి . ఆ ప్రకృతి , కళ్ళు లేని గుడ్డిదాని వంటిది . ఆ ప్రకృతి భుజాలపై కూర్చొని ఆమెను పరుగెత్తిస్తున్న స్థిరాంశమే పురుషుడు . వీరిద్దరూ కాళిదాసు చెప్పినట్లు , ’ స్త్రీ పుంసావాత్మభాగౌ తే | భిన్న మూర్తేస్సిసృక్షయా ’ --సృష్టి చేయవలెనని సంకల్పించిన పరబ్రహ్మ యొక్క స్త్రీ పురుష రూపాలు . 

      ఈ సవితృ దేవుడి రూపమే అయిన సూర్యుని నుండీ అహః కిరణము వెడలును . అది భూమిని స్పర్శించినపుడు ప్రాతఃసంధ్య యని , చంద్రును నుండీ వెడలిన నిశా కిరణము వచ్చి భూమిని స్పర్శించినపుడు సాయం సంధ్య యనీ అంటారు . ఇది బ్రహ్మాండములో నడుస్తున్నట్లు గానే , పిండాండములో కూడా నడుస్తున్నది . అయితే పిండాండములో సంధ్యలను చూచుటకు అంతర్ముఖి కావలెను . జ్ఞాని కావలెను . యోగి కావలెను . బయటి సంధ్యలు చూడవలెనన్న , కన్నులు మాత్రము ఉన్న చాలు . 

     ఈ సంధ్యలు ఈ జగపు గడియారాలు . సృష్టి మొత్తం ఈ గడియారాలను ఆధారము చేసుకొని తన వ్యాపారాలను జరుపుకొనును . అహః కిరణము వ్యాప్తి యైనపుడు అది అహస్సు . అప్పుడు ఇంద్రియ మనో బుద్ధులు బహిర్ముఖములై ప్రవర్తించును . నిశాకిరణము వ్యాప్తి యైనపుడు ఇంద్రియ మనో బుద్ధులు అంతర్ముఖములై అణగి యుండును . సంకోచ వ్యాకోచములకు కారణములైన కాల శక్తి రూపాలని , ఈ సంధ్యలకు ఆర్యులు అంతటి ప్రాశస్త్యము నిచ్చినారు . 

     ఈ సంధ్యల ఈ స్వరూపమును గుర్తించి , ఆ కాలములోతన దేహమును శుచిగావించుకొని  , తన జగత్తును శుద్ధి గావించుకొని , జగమునకంతటికీ ఆత్మ రూపుడైన సూర్యుని నుండీ ఆ గాయత్రిని ఆకర్షించుకొని  , దానిని తన హృదయములో ధారణము చేసి , సవితృదేవుని తేజోరాశిని ఆరాధనము చేసి , ఆ తేజస్సుయొక్క వికీర్ణ స్వరూపులైన దేవతలకు కూడా  నమస్కారము చేసి తన శ్రేయస్సును సాధించుకొనునదే సంధ్యా వందనము . 

      ఈ రహస్యమును ఆర్యులు ఎరుగుదురు . ఈ రహస్యమును ఎరిగినవారే ఆర్యులు . ఈ రహస్యమును తెలిసిన వారందరూ ఆర్యులే అవుతారు . ప్రకృతి యొక్క రహస్యములను తెలిసికొని , యోగ్యులకు దానిని బోధించుట ఆర్యుల కర్తవ్యము . అలాగు చేయుటయే , అధ్యయన - అధ్యాపన రూపమైన బ్రహ్మ యజ్ఞము . బ్రహ్మ యజ్ఞము  చేయని వాడికి ఋషి , దేవ  ఋణములు తీరవు . ఈ ఋణములు ప్రతిఒక్కరికీ పుట్టుకతోనే వస్తాయి . వాటిని తీర్చుట అనగా , తనను కట్టివేసిన పాశములను తెంపి స్వతంత్రుడగుట . ఇలాగ అపూర్ణత్వము నుండి పూర్ణత్వము నకు తీసుకొని పోవు దారులే సంస్కారములు .  ఆ సంస్కారములలో పునర్జన్మ అనిపించుకున్న ఉపనయనమైనపుడు వటువుకు లభించు యోగమే సంధ్యా వందనము లేదా , సంధ్యోపాసన . ఇదే ప్రాజాపత్య వ్రతము . 

     దీనిని అందరూ ఆచరించవలెను . స్థావర జంగమములన్నీ నిర్వహిస్తూనే యున్న ఈ క్రియను , సంకల్ప పూర్వకముగా , సమంత్రకముగా చేయుటే సంధ్యోపాసన . అప్పుడు అది చేతన వ్యాపారమగును . అలాగు కాక , దానిని గుర్తించకయే , తనంతట తానే జరిగిన , అది జడ వ్యాపారమగును . చేతన వ్యాపారము చేయువాడు , తాను ఉద్ధారమై , ఇతరులనూ ఉద్ధరించగల వాడై, నియోజకుడగును .  జడ వ్యాపారి జడ వస్తువు వలె నియోజ్యుడగును .  నియోజకుడు స్వతంత్రుడు .  నియోజ్యుడు పరతంత్రుడు . పారతంత్ర్యమును తప్పించుకొని , స్వతంత్రులైనవారే ఆర్యులు . వారు ఈ విశ్వమునే ఆర్యమయము చేయగలరు . అంతటివారి సన్నిధిలో అనార్యమైన విశ్వమంతా ఆర్యమగును . ఇటువంటి ఆర్య ఋషుల ఆశ్రమములలో ఉగ్ర జంతువులు కూడా తమ సహజమైన హింసా గుణమును వదలి సాత్త్వికములగుచున్నవి . 

     " జగత్తంతా ఒకే ఒక్కడైన సవితృ దేవుడి తేజః ప్రసారణము అంటే , ఇప్పుడు కనిపిస్తున్న వైవిధ్యములు , నానాత్వములు , అనేకత్వములు ఎక్కడినుండీ వచ్చినవి ? జగములోనున్న ఉఛ్చ నీచాది భావములు ఎక్కడివి ? " అన్న ప్రశ్న విచారపు ఆరంభములోనే వచ్చును . లేదా  , జగపు నానారూప దర్శనము వలన మనసులో కలుగు మంథనమే విచారపు మూలము అనిననూ తప్పుకాదు . ఈ ప్రశ్నకు సాంగముగా సమాధానము ఇవ్వ వలసిన అవసరము ఉంది . 

     వెనుక చెప్పిన ప్రకృతీ పురుషుల రూపమైన అగ్నీషోమ మండలము , నిర్గుణము సగుణమైన ఘట్టము . ఈ మండలములో చర, స్థిర అను రెండు అంశముల సంపర్కము వలననే భిన్నమగుట యన్నది ఆరంభమై , గీత లో భగవానుడు చెప్పినట్టు , ప్రకృతి భిన్న భిన్నములై ఎనిమిది భాగములైనది . అయితే , ప్రకృతి గుణమయి . ప్రకృతీ పరుషుల సంగమము నందు ఈ గుణములు ప్రకటమగును . సవితృదేవుని ఎనిమిది కిరణములు ఎనిమిది రూపములైనట్లే , ఆ ఎనిమిది రూపములూ ఈ మూడు గుణములకు వశమై , ఒకదానితో ఒకటి కలుస్తాయి . అగ్నీషోమ మండలమునందే ఈ గుణములున్నవి . ఈ ఒకటి రెండైనపుడు వచ్చు అల్పత్వము , లేదా అపూర్ణత్వము , మరియూ  ఆ అపూర్ణత్వమునకు గుణ సంబంధము వలన కలిగెడు వికారము--ఇవి రెండూ ఈ జగత్తు యొక్క నానాత్వ , అనేకత్వ  వైవిధ్యములకు కారణము . 

     ప్రకృతిలో జడమై , పంచభూతాత్మకమైన అంశమొకటి , చేతనమై జీవమైయున్న అంశమొకటి--ఇలాగ ఇవి రెండు . ఈ పంచభూతములు , గుణముల వశమై సాత్త్వికము , రాజసము , తామసము  అను మూడు విధములై , ఈ మూడూ కలసి చేరి దేహమును నిర్మించినాయి . గీత మాటలలో చెప్పవలెనన్న , ఇదే , క్షేత్రము .  ఈ క్షేత్రములో అల్పత్వము , అపూర్ణత్వము , గుణాధీనత్వము అని  వికారములతో కూడిన జీవుడున్నాడు . వాడే క్షేత్రజ్ఞుడు . ఈ వికారములు ఒకటి కూడా లేకుండా , వీటన్నిటికీ అతీతుడై ఉండి కూడా ప్రకృతి సంబంధము నుంచుకున్న వాడే పురుషోత్తముడు . ఇవన్నీ చేరితే జగత్తు . దీనికవతలది నిర్గుణము . బుద్ధితో విచారము చేయువాడు పురుషోత్తముడి వరకూ సాధించి వెళ్ల వచ్చు . 

     ఇలాగే , పురుషోత్తముడు , క్షేత్రజ్ఞుడైన అక్షర పురుషుడు , క్షేత్రమైన క్షర పురుషుడు -ఈ మువ్వురి సంగాతమే ఈ జగత్తు . ఇటువంటి జగత్తులో ఉఛ్చ నీచములు , వాటిని కల్పించు కర్మలు సహజముగనే తలయెత్తును . 

     బీజము-వృక్షము అను న్యాయమును చూస్తే , బీజము నుండీ అంకురము బయటికొచ్చునపుడే ఆకులు , దండములుగా  బయలు వెడలును . ఆకులు చరాంశమై రాలిపోవును . స్థిరాంశమైన దండములు పెరిగి కాండమగును . ముందు ముందు వృక్షమై నిలచినపుడు , ఈ దండమే స్థిరమైన మూలమై , శాఖ ప్రశాఖలకు ఆధారమై , చిగురు , ఆకులు , కాయ, పండు అన్నిటికీ ప్రకట స్థానమగును . ఈ వైవిధ్యమంతా బీజము నుండే , బీజమొకదాని నుండే కదా వచ్చినది ? ఒకే చెట్టులో అవస్థా భేదము వలన వచ్చు రస వైవిధ్యము , గుణ వైవిధ్యములనూ  , అలాగే  బీజము-క్షేత్రబలము వలన , రసము , పాకము  మొదలగువాటిలో భిన్నముగా నుండుటనూ గమనించండి . 

     అలాగే , మనుష్య గర్భమును గురించి విచారిస్తే , సూక్ష్మముగా సూది మొన పై నిలచు ఒక తైల బిందువులో నూరోవంతు ఉండు రేతో బీజము , గర్భములో పెరిగి పెరిగి , శిశువై బయటికి వచ్చునపుడు అస్థి , మాంసము , రక్తము , మజ్జా , మేధస్సు , త్వక్కు ( చర్మము ) ,  లోమము ( వెంట్రుకలు ) అను సప్త భిన్నరూపములైన ధాతువులతో కూడిన పిండమై వచ్చును . ఏకోదరులలోనే ఎంతో భిన్నత్వము ఉండును . ఈ పిండము ఇంతటి వైవిధ్యమును సంపాదించినట్లే , ఏకైకమైన బ్రహ్మము బ్రహ్మాండములో అనేకమై ఇంత వైవిధ్యమును చూపుచున్నది . 

     ఇలాగ జీవులన్నీ నానావిధములుగా ఉండుట వల్లనే , వారి గుణము , కర్మము , శ్రద్ధా అన్నీ వేరు వేరుగా ఉండును . కర్మములలో క్రింది స్థాయిలో ,  దైనందిన ఐహిక జీవనమునకు చేయవలసిన  , అన్నవస్త్రాదుల వంటి భోగ సాధనములను సంపాదించు కర్మమే బలమైయుండును. పైపై స్థాయిలలో కర్మము తోపాటు విచారము , విచారము వలన జ్ఞానము , జ్ఞానము వలన విజ్ఞానము - ఇవి కనిపిస్తాయి . ఇలాగ విచారపరులై , జ్ఞాన విజ్ఞానములను సాధించవలెను అనువారందరూ ఈ సంధ్యోపాసనను చేయవలెను . 

     ఇదివరకే చెప్పినట్లు , జీవులందరూ సమంత్రకముగా సంధ్యను ఆరాధించునపుడు , ఆ సంధ్యలలో ఒక ఘడియయైననూ మనః ప్రసాదము తనకు తానే వచ్చును .  ఆ మనః ప్రసాదము వచ్చునది , దేహములోనున్న సూర్య చంద్రులూ  మరియూ బ్రహ్మాండములో నున్న సూర్య చంద్రులూ తమ తమ గతులను ఒకదానికొకటి తగినట్లు సరిచేసుకొనుట వలన. అలాగ సూర్య చంద్రులు పిండాండ బ్రహ్మాండములలో సంధ్యా సమయములలో ఋజు గతికి వచ్చియే తీరుట సృష్టి నియమము . రోగముతో నున్న దేహములోకూడా ఈ క్రియలు నడచును . ఈ క్రియ వలన దేహము శాంతమై , శ్వాస ఋజుగతికి మారి , మనః ప్రసాదమగును . ఈ మనః ప్రసాదము ఎల్లప్పుడూ ఉండునట్లు చేయు కర్మయే , క్షణికమైన మనః ప్రసాదము స్థిరమై శాంతి , జ్ఞానము , ఆనందములు వికసించునట్లు చేయు సాధనమే , ఈ సమంత్రకమైన సంధ్యోపాసన . 

     కాబట్టి సర్వులూ ఈ సంధ్యోపాసన చేసి ఉత్తమ ఫలమును పొందవచ్చు . చేసినయెడల అపారమైన లాభముంటుందని అందరికీ అనుభవమైన నాడు , సంధ్యా వందనము వద్దని ఎవరైనా అనగలరా ? 

     మరి , స్త్రీ , శూద్రులు దీనిని చేయవచ్చునా అంటే , ఔను . నిస్సందేహముగా ఔను . కృషి చేయు వారు ఎలాగైతే , బీజ వృక్షములు రెంటికీ, సంస్కారమును కోరుతారో , అలాగే మాతా పితృలగు స్త్రీ పురుషులిద్దరికీ సంస్కారము కానే కావలెను అన్నదే సరియైనది . 

     ఉపనయనమైతే స్త్రీకి గోత్రము వస్తుంది , వ్యక్తిత్వము వస్తుంది, కాబట్టి భర్త చేయు వ్రతాదులకు లోపము వస్తుంది అన్న ధర్మ విచారము అప్రస్తుతము . ఒకవేళ అట్లయినచో ఏమి చేయవలెనన్నది ధర్మాచార్యులకు తెలిసే ఉండును . 

     ఇక శూద్రుల విషయము . అందరూ ఆచారము వలన శూద్రులే అయినందువలన ఈ మాట ప్రస్తావించునదే సరి కాదు . అరణ్య పర్వము 180  వ అధ్యాయములో ధర్మరాజు చెప్పినది సమంజసమే అనిన తప్పు లేదు . అదీ కాక , జాబాలి చెప్పినట్లు ఎవరికి ఏది కావలెనో వాడికి అది ఇవ్వడము న్యాయము . 

ఏదేమైనా , ముందు చెప్పినట్లు అన్ని దేహములలోనూ స్వతహాగా జరుగు కర్మమును చేయుటకు ఎవరు అడ్డు పడగలరు ? 

3 comments:

  1. సూర్యోపాసన(సంధ్య) ఎవరైనా చేయవచ్చు అని బాగా చెప్పారు.
    ప్రాణులు ఉపనయనం అయిన స్త్రీలు పురాణాల్లో ఎవరైనా వుంటే తెలుపగలరు.

    ReplyDelete
  2. ఆచారము వలన శూద్రు

    ReplyDelete
  3. సంధ్యోపాసనలో మన వెనుక చంద్రుడు ఉండకూడదు అని శాస్త్రాలు చెపుతాయి . కొద్దిగా పక్కకు తిరిగి సంధ్యావందనము చేయాలి . ఆ మాటకు బలమిస్తూ , సూర్య చంద్రుల ఋజు రేఖకు మధ్యలో మనము ఉండరాదు అన్నది ఇక్కడ కూడా స్పష్టమైనది , గమనింపగలరు .

    ReplyDelete