SHARE

Thursday, August 2, 2012

54. " మంత్ర ద్రష్ట " యాభై నాలుగవ తరంగం .



యాభై నాలుగవ తరంగం .

     ఘృతాచీ నిరాటంకముగా నడచింది . శునకము ఒకటి వచ్చి ఆమెను పిలుచుకొని వెళ్ళింది . ఆ ప్రాణి , తనను బయటి దాననని మొరగ కుండా , ఆత్మీయురాలి వలె చూచి , ఆశ్రమ వాసులతో ప్రవర్తించునట్లే , విశ్వాసముతో తోక ఆడిస్తూ అతిథిని ఆహ్వానించినట్లు ఆహ్వానించి , ముందుకు పిలుచుకొని వెళ్ళినది చూచి ఆమెకు సంతోషమైనది . " ఇది ధర్మారణ్యము . ఇక్కడ ధర్మ విరుద్ధమైన కార్యమేదీ జరగరాదు " అని ఒళ్ళంతా కళ్ళై , అక్కడున్న ఫల పుష్పాలూ , సౌమ్యముగా , శాంతముగా ఉండుట చూసి , మెలకువగా తనవలన ఎవరికీ , దేనికీ ఉపద్రవము కాకూడదని , మొలకెత్తిన గడ్డి పరకనైనా  తుంచకుండా , కాలిబాటలోనే నడచి వెళ్ళింది . ఆమె కాలి  అందెలు కూడా , నియమబద్ధములైనట్లు , మృదువుగా మంజుల నాదములతో మనసును మురిపిస్తున్నాయి . ఆమె తెల్ల చీర కట్టుకున్నది . ఆభరణాలు , అలంకారాలు ఏమీ లేవు . కంఠములో ఒక లావు ముత్యాల హారము మాత్రము ఉన్నతమైన స్తన మండలమును అలంకరించినది . పారదర్శకమై తేటగా ఉన్న ఉత్తరీయపు వెనుక , కదలుతున్న దేహలత తో పాటు కదలుచున్ననూ , స్వస్థానాన్ని వదలి కదలని ఆ ముత్యాలు ఆమె అంతరంగపు విక్షోభాన్ని సూక్ష్మముగా చిత్రిస్తున్నవి . దాని వెనుక  ఆమె తొడిగిన రత్న ఖచితమైన నీలి కుప్పసము నక్షత్ర రంజితమైన నీలాకాశము వలె శోభిస్తున్నది . పొడుగాటి శంఖము వలె నున్న మెడ , ముద్దైన ముఖ కమలమును ధరించి  , నా సొగసు చూచితివా ? అని అడుగునట్లున్నది . గాలికి చెదరుతున్న ఆ పట్టు కురులను ఆమె నిరోధిస్తున్నది . లోపల కాలుస్తున్న కళవళాన్ని కూడా ఇలాగే నిరోధిస్తున్నదా అన్నట్లుంది . నీలముగా వీపుపై కదలుతున్న ఆ వాలుజడ , ఆమె కామ వాసన కూడా అలాగే దీర్ఘముగా ఘనముగా ఉన్ననూ , నియమబద్ధముగా ఉన్నదానిని ఘోషిస్తున్నదో అన్నట్లుంది . 

     భగవానులు అప్పుడే అగ్ని హోత్రాన్ని ముగించుకొని వచ్చి , దిగంతములో పైకి ఎక్కి వస్తున్న సూర్యుని తేజస్సును పట్టి , దానిని సౌమ్యముగా చేసి అచ్చుపోసినారా అన్నట్లున్న మూర్తిలాగా కూర్చున్నారు . వారి మనసు ఎప్పటికన్నా అధికముగా పరిగ్రహణము అపేక్షించి , " ఒక హోమమునైనా చేయవచ్చును కదా ? " అని అడుగు వరకూ వచ్చింది . అయినా , మనసు గృహ కృత్యముల భారమును గృహిణికి ఒప్పించి , నిరాటంకమైన సద్గృహస్థుడి వలె , " దేవతలకు ఒప్పజెప్పినాముకదా , ఆ అవధి ముగియు వరకూ ఎందుకు ఆత్రము ? " అంటున్నది . అంతిమంగా , కొండల మధ్య ఉన్న సరోవరపు నీరు పూల గాలి తగిలి కొంచము చంచలమైనట్లు , తానూ చంచలమైననూ మనసు  చివరికి స్థిరమైనది . 
ప్రాతః కర్మల వలన దేహము ఆయాస పడగా ,  చేతిలో పట్టి ఉన్న జపమాల కూడా భారమా అనిపించినట్లై పర్ణశాల వాకిట అరుగుపై ఒక కృష్ణాజినమును పరచుకొని ఏకాకిగా కూర్చున్నారు . 

     ఘృతాచీ వచ్చి నమస్కారము చేసినది . తెచ్చిన ఫల పుష్పాలను సమర్పించింది . ఆ దివ్య ఫల పుష్పాలు , వచ్చినది దివ్యాంగన అనుదానిని చెప్పుచున్ననూ , భగవానులు అడిగినారు , " నడచి వచ్చినారే ? ఇవి ఎక్కడివి ? " 

     " నందనము నుండీ నేనే తెచ్చినాను . నేను ఇంద్ర దూతిని . మేనక సఖిని . నన్ను ఘృతాచీ అంటారు . ధర్మారణ్యములో మా ప్రభావాన్ని ప్రకటించకూడదు అని నడచి వచ్చినాను . నా సఖి వలెనే నేను కూడా సన్నిధానము లో కొంతకాలమైనా ఉండి జీవన సార్థకతను సంపాదించుకోవలెను అని వచ్చినాను . ప్రసాదాన్ని కరుణించవలెను . " 

     జోడించిన చేతులు , ఆడిన మాట దిట్టమైనదని , నమ్మవలెనని ప్రార్థించునట్లు ఉన్నాయి : వినయము , నువ్వు ఒప్పుకోకున్న ఈ జన్మము సార్థకత లేకుండా పోవునన్నది చూచినారా అని అడుగుతున్నట్టుంది . సౌమ్యమైన ఆ దృష్టి ఆత్మార్పణమును చెవి దగ్గరకు వచ్చి మెత్తగా చెప్పుచున్నట్లు ఉంది . సిగ్గుతో కొంచము వంగి , కొంచము వక్రముగా అయినా ముద్దుగా కనిపిస్తూ , ఆశ్రమపు వాకిలి వద్ద వున్న రాట నొకదాన్ని ఆనుకొని కొద్దిగా ఒరిగి , చీర చెరగు కొనను బొటనవేలికి చుడుతూ ఉండుటను చూస్తే , " నేను నీకు వశమైనాను , అలాగే ,  నువ్వు నన్ను కావలసినట్లు ఉపయోగించుకోవచ్చు " అని స్ఫుటముగా చెప్పుచున్నట్లుంది .

     భగవానులు అదంతా చూచారు . ఆమె అసత్య వాది కాదు అన్నది మన్సుకు వెంటనే అర్థమైంది . కాబట్టి  కూర్చోమని చెప్పి ఆసనమును ఇచ్చి , " మేము కూడా పరిగ్రహణమునకై కుతూహలముగా ఉన్నాము . అయితే , పరిగ్రహించుటకు ఉన్న అవరోధాలను చెప్పవచ్చునా ?  అవరోధాలు అనుట కన్నా , నియమాలు , లేదా ఒప్పందము అనవచ్చు " 

" అటులనే . మీరు చెప్పినట్లే నడచుకొనుటకు సిద్ధమై ఉన్నాను ." 

     " సిద్ధమై ఉన్నాక చెప్పవలసినదేమిటి ? అయినా , కల్మషము , సందేహము ఉండకూడదని చెబుతాను . మనకు ఒక పుత్ర శోకము ప్రాప్తమగునట్లున్నది . దానిని సహించెదరా ? " 

     " నేను సహిస్తాను . ఎప్పుడైతే నాకు సహించు శక్తి లేకపోవునో , అప్పుడు దానిని తమరే నివారణ చేయండి , అంతే ! " 

" ఆ నమ్మకము మీకు ఉందా ? " 

     " భగవానులు ప్రతిసృష్ఠి చేయగలవారు అన్నది దేవలోకము నందు కూడా ప్రసిద్ధమైనది " 

     భగవానులు ఆ స్తుతి ని విని మూగబోయారు . సహజమైన ఆమాట , దాని సరళత , దానిలో కొట్టొచ్చినట్లున్న ఆ నిశ్చలత , అన్నిటినీ అతని మనసు గమనించినది . చివరిమాటగా అన్నారు , " ఇంద్ర దేవుని అనుజ్ఞ అయినదా ? " 

" అయినది " 

     వారికి సంతోషమయింది . " సంతోషము , చాలా సంతోషము . దేవేంద్రునికి నేను ఋణగ్రస్తుడను . మాకు కావలసినది ఇచ్చువారు దేవతలే కదా ! కానిమ్ము , నువ్వు నా గృహిణివై ఉండు . మన ఒప్పందము ఇలా ఉండనీ , ఈ దాంపత్యపు ఫలముగా యాభై మంది ఋషికల్పులూ , యాభై మంది ఋషులూ కావలెను . ఆ ఋషుల తల్లివై నువ్వు లోక విఖ్యాతవు అవుతావు . ఆ ఋషి కల్పులను మేము కాలము వచ్చినపుడు మరొక దేవదత్తుని కోసమై వదలి ఇవ్వవలసి యుండును . అప్పుడు , నేను అట్లు చేయుటకు నువ్వు ఆటంకము కారాదు . అట్లు చేసితిమని శోకించ రాదు . అనుతాపము చెందరాదు :  సమ్మతమేనా ? " 

     " అటులనే , నాది కూడా ఒక నియమాన్ని భగవానులు అంగీకరించవలెను . దేవ యోనులమైన మేము మానవ స్త్రీలలాగా గర్భ భారమును సహించలేము . కాబట్టి నూరుగురు పిల్లలను ఒకేసారి పొందుటకు అనుమతి కావలెను . మరియు , యాభై మంది సంతానాన్ని భగవానులు తమకు తోచినట్లు వినియోగించిననూ , నాకు దాని వలన సంతాపమూ , అనుతాపమూ కలగకుండునట్లు వరమును ఇవ్వవలెను . ధర్మారణ్యమని , ఇక్కడ నా ప్రభావమును పక్కకు పెట్టినాను . కాబట్టి తమ ఆ వినియోగము ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా జరగ వలెను . అప్పుడు , నా ప్రభావము నన్ను ఆ దుఃఖము అంటకుండా కాపాడునట్లు తమరి అనుజ్ఞ కావలెను . " 

     భగవానులకు ఆ మాటలు విని బహు ఆనందమైనది . " దేవతలు తమ కార్యమును చాలా చక్కగా నిర్వహించినారు . దుఃఖము అంటని దేవ స్త్రీ అయితే పుత్ర శోకము సహ్యమగునని దేవేంద్రుడు ఈమెను నాకు కరుణించి మిత్ర కృత్యమును చేసినాడు " అని వారి సంతోషానికి అవధియే లేదు . 

      వారు అటులనే యని , ఆ నియమమునకు ఒప్పి , ఆమె వెంట నదికి వెళ్ళి వచ్చినారు . అగ్ని ని స్థాపించి , హోమము చేసి ఆమెను సహ ధర్మ చారిణి యని అంగీకరించారు . తమ కృతజ్ఞతను చూపించుటకు ఇంద్రునికీ , విశ్వే దేవతలకూ  ఆహుతులను సమర్పించినారు . దంపతుల ప్రేమ దృఢము గా ఉండవలెనని స్థాలీ పాకమును చేసినారు . ఇంద్రుని అనుమతి ఉన్నంత వరకూ తాను పత్నియై తోడు నీడగా ఉండెదనని ఆమె కూడా ప్రతిజ్ఞ చేసినది . 

No comments:

Post a Comment