SHARE

Wednesday, August 8, 2012

57. " మంత్ర ద్రష్ట "యాభై ఏడవ తరంగం .



యాభై ఏడవ తరంగం .


     మరుదినము ఆశ్రమము అంతా గుప్పుమంది  . అంతా కోలాహలముగా మాట్లాడుకుంటున్నారు . " హరిశ్చంద్ర మహారాజు నర మేధమును చేయాలనుకొంటున్నాడట . భగవానులను హౌత్రానికి ఆహ్వానించుటకు వచ్చినారట. దశ సహస్ర గో ధనమునూ , దశ భార సువర్ణమునూ దక్షిణగా ఇచ్చెదరట . భగవాన్ వశిష్ఠులు కూడా సమ్మతించినారట . వీరు ఒప్పుకోలేదట .." అని అందరూ ఒక్కొక్క విధముగా మాట్లాడుకుంటున్నారు . 

     కొందరు సాంప్రదాయకులు , ఆశ్రమవాసు లందరికన్నా  వృద్ధులూ , తెలిసిన వారు అనిపించుకున్న వారి వద్దకు వెళ్ళి అడిగారు , " తాతా , నరమేధము  శాస్త్ర సమ్మతమేనా ? " . వారు నవ్వినారు . " అదేమిటయ్యా , ఇవన్నీ కామ్య కర్మలు . ఇష్టార్థ సిద్ధి కోసము దేన్నో ఒకదానిని పట్టి బలి ఇచ్చునదే యాగము . కాబట్టి నీ ప్రశ్నయే సరిగా లేదు . నువ్వు , ’ నర పశువు శాస్త్ర విహితమేనా ? ’ అని అడుగవలెను . శాస్త్రము పశువును నిత్య నైమిత్తిక కర్మలలో మాత్రమే విధించినదే తప్ప , కామ్య కర్మలలో విధించలేదు . ఇక అది జరగ వచ్చునా అంటే , మన పెద్దలు చెప్పియున్నారు , " ఆత్మార్థే పృథివీం త్యజేత్ " అని . అదీకాక ఆ కర్మలో పాపము ఉంటుంది . బహుశః దానికోసమై ఇంకొన్ని హోమ దానములను చేసి ప్రాయశ్చిత్తమును చేసుకొని ఆ పాపాన్ని పోగొట్టుకోవచ్చు . ఏదేమైనా కామ్య కర్మ ఒక రగడ వంటిదే . అదలా ఉంచు , ఇకపైన ఇంతటి అవివేక ప్రశ్నలను అడగవద్దు . వేదము సర్వమునకూ  సామాన్యమై ఉన్నదని ఒప్పుకున్నపుడు  సర్వ కామములనూ సాధించు సాధనల నన్నిటినీ చెప్పియే ఉండవలెను కదా ! ఒక వేళ అటువంటి కల్పము లేని యెడల ఒక యాగమును స్వతంత్రముగా కల్పించుకొనుటకు అవకాశముంది . ఇంత తెలుసుకున్న చాలు , ఇక ఊరికే ఉండు " అని వారిని వెనుకకు పంపేశారు . 

     ఇక్కడ భగవానులు అగ్ని గృహములో అగ్నిహోత్రమును ముగించుకొని కూర్చున్నారు . ప్రాణ దేవుడు ’ హౌత్రమును ఒప్పుకోవచ్చు ’ అని అనుమతి నిచ్చినాడు . దానితో పాటు , ’ అక్కడొక విచిత్రము జరుగుతుంది . ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఉండి , శ్రేయస్సును సంపాదించుకొని రా . భవిష్యత్తును చూచుటకు ప్రయత్నించవద్దు  ’ అని కరాఖండిగా ఆజ్ఞ ఇచ్చినాడు . వారికి ఆశ్చర్యము . ’ భవిష్యత్తును చూడవద్దు అనుటకు కారణమేమి ? ఏమి విచిత్రము జరుగనుంది ? ! సరియే , నా పరీక్షలో నేను వినయముగా , జాగరూకతతో ఉండి , గెలిచి రావలెను . ఇదే సరియైనది ’ అని నిశ్చయించుకొని , ఇంకేమి ,  మహారాజుకు వర్తమానము పంపించవలెను ; తాను కూడా అతిథి గృహమునకే వెళ్ళాలి కదా అని బయలు దేరినారు . జ్యేష్ఠ పుత్రుడు ఆంధ్రుడు వచ్చినాడు . అతని ముఖమే  విరసముగా , ఏదో అనిష్ట సమాచారాన్ని తెచ్చినవాడిలాగా అనిపించినది . 

తండ్రి అన్నాడు , " ఏమిటయ్యా ? " 

     పుత్రుడు కూడా వినయముతోనే , " హరిశ్చంద్ర మహారాజు నిన్నటి నుండీ ఆశ్రమ వాసులకందరికీ కావలసినట్లు ప్రదానము చేస్తూ ప్రలోభము పుట్టునట్లు చేస్తున్నాడు " 

     అడుగు ముందుకు వేయబోతూ , ఆగి అడిగినారు , " ఆశ్రమవాసులు లోభముతో అతనిని ఆశ్రయించలేదు కదా ? అది చాలు . అతడు తనకు తానుగా ఇచ్చు దానిని వద్దనుట ఎలాగ ? ’ కావలెను ’  అన్న లోభమున్నపుడు , దానిపై కమ్ముకున్న విరోధపు సౌమ్య రూపమే ’ వద్దు ’  అన్నది . ఆశ్రమవాసులందరికీ చెప్పు , ఎవరూ లోభ పడకూడదు , అని . తర్వాత ? " 

     " అతడు ఇలాగు చేయుటకు కారణమున్నది . అతడు నరమేధము నకు తమను ఆహ్వానించుటకు వచ్చినాడట . తమరు ఒప్పుకుంటారా ? " 

" ఏదైనా అవరోధమున్నదా ? " 

" మాకెవరికీ సమ్మతము కాదు " 

" అందరూ బయలు దేరి వెళ్ళ వలెను . వచ్చే శుద్ధ దశమీ దినమే దీక్ష. " 

     ఆంధ్రుడు ఏదో గొణుక్కుంటూ వెడలిపోయినాడు . భగవానులు ఆ వెళ్ళుతున్న వాణ్ణి చిరునవ్వుతో చూస్తూ , ’ అవును , ప్రాణ దేవుడు చెప్పినది సరియైనది. భవిష్యత్తును గురించి ఆలోచించకూడదు, నిజము ’ అని తల ఊపుకుంటూ అతిథి గృహము చేరినాడు . 

     మహారాజు అప్పటికే వచ్చి కాచియున్నాడు . భగవానులు ఏ విధమైన వికారమూ లేక , సంశయమూ చూపక , " మీకు మంగళము . మేము హౌత్రమును అంగీకరిస్తున్నాము . ముందరి సన్నాహముల నన్నిటినీ చేసుకో వచ్చును . ఈ మాటను భగవానులకు మా నమస్కారములతో తెలియ పరచండి " అని అన్నారు . హరిశ్చంద్రుని ఆనందానికి హద్దే లేదు . మరలా మరలా నమస్కారము చేసి తన కృతార్థతను చెప్పుకుంటూ మరలా ఒక వేయి గోవులను సమర్పించి వీడ్కొని వెళ్ళినాడు . 

No comments:

Post a Comment