SHARE

Friday, August 17, 2012

65. " మంత్ర ద్రష్ట " అరవై ఐదవ తరంగం .



అరవై ఐదవ తరంగం .

     విశ్వామిత్రులు తపస్సు సాగిస్తున్నారు . ఉదయము బ్రాహ్మీ ముహూర్తానికి సరిగ్గా శ్వాస నిరోధము చేసి ప్రాణ దేవుని దర్శనము చేసి అతని అనుమతి పొంది ప్రాణాగ్ని హోత్రమును ప్రారంభించినారు . ప్రాణ పంచకములు కూడా అగ్నులై కూర్చొని మండుతున్నాయి . 

     క్రమముగా జ్వాలలు దేహము నుండీ బయటికి వెలువడుట మొదలైనది . శాంతమై , హితముగా నున్ననూ , ఇతరులకు సహించుటకు అసాధ్యమై ఆ జ్వాలా మండలము నదీతీరము నుండీ నదీ జలాలకూ వ్యాపించుతుండగా , భగవానులు , ప్రాణ దేవుడిని అనుసంధానము చేసుకొని అతనికి ఈ విషయమును నివేదించినారు , " దేవా , నా పేరు విశ్వామిత్రుడు . నీ దయ వలన నా పేరు సార్థకము కావలెను . ఇప్పుడు జరుగుతున్న అగ్నిహోత్రపు ఫలముగా , ఈ దేహము నుండీ జ్వాలలు ఎగసి పడుతున్నవి . ఈ జ్వాలలు నాకు హితమైనవి . నాకు శాంతములుగానే కనిపిస్తున్నవి . అయినా నీరు కాగుతున్నది . కాగిన నీటనున్న ఈ జల చరములకు అప్రియమైనటులే , ఇక ముందు ఖేచర , భూచరములకూ అప్రియము అవనున్నవి . విశ్వానికి బ్రాహ్మణ్యమును సంపాదించుటకు బయలుదేరిన నానుండీ మొదటగా కలుగ వలసిన ఉపకారము  ఇతరులకు అప్రియమా ?  అందు వలన దీనిని తప్పించవలెను . " 

     ప్రాణ దేవుడు నవ్వినాడు , " భగవాన్ విశ్వామిత్రులు ఒక దహించని అగ్నిని వెదకుతున్నారు . కానిమ్ము , దానికీ ఒక దారి ఉంది . ఇకపైన , ప్రాణాగ్ని పంచకమును పంచకముగా ధ్యానించక , ఏకాండముగా ,  సమిష్టిగా ధ్యానము చేయండి . అలాగ ఏకాండముగా చేసిన ధ్యానము సత్త్వముగా పరిణామము చెంది , సర్వ హితమవుతుంది . " అని అనుజ్ఞ యయినది . 

     భగవాన్ విశ్వామిత్రులు ఏకాండ ధ్యానమును ఆరంభించినారు . మొదట ప్రాణ దేవుడిని సాక్షాత్కరించుకొని , అతని అనుమతితో పంచకమును చూచి , వారిని యథావిధిగా అర్చించి , వారి అనుమతితో వారు ఐదుగురినీ సమిష్టిగా అర్చించినారు . ఐదు అగ్నులూ చేరి కూడి ఒకటే అగ్ని అయినది . అగ్ని ధ్యానములో విశ్వామిత్రులు బాహ్య ప్రపంచమును మరచి కూర్చున్నారు . 

     అలాగ ఎంతోసేపు ఏకాంతముగా కూర్చొని ఉండగా ,  హఠాత్తుగా వారిని ఎవరో కుదిపి లేపినట్లాయెను . కనులు తెరచి చూస్తే , ఒకరు , వృద్ధులు కాకున్ననూ వృద్ధుల తేజస్సు ఉన్నవారు ఎదుట నిలిచున్నారు . దేహమంతయూ పోతపోసిన వెండి ముద్దలాగా ఉంది . కళ్ళు రెండూ , రెండు తెల్లటి వజ్రఫలకములపై రెండు గోమేధికములను తాపినట్టున్నాయి . కొండ శిఖరమునందున్న సరోవరపు తేటదనమూ , నిర్మలత్వమూ , ప్రసన్నతా , గాంభీర్యమూ ఆ కళ్లలో గూడుకట్టుకొని ఉండి , చూచువారి నందరినీ యనుగ్రహించు అనుగ్రహ మూర్తి వలె నున్నారు . ఎక్కడో చూసినట్లే ఉన్నారు . అలా చూస్తుండగా , విశ్వామిత్రునికి అది ఒక దివ్య దేహమని అర్థమయింది . ఎవరు ? ఏమిటి అన్న ఆలోచన తరువాత చేయవచ్చు అనుకొని , తత్క్షణమే మానస పూజ ఒనర్చినారు . ఈ సారి విచిత్రమేమనిన , వీరు సంకల్పము చేసి నోటినుండీ మాట వచ్చునంత లోపలే , అక్కడ , ఆ కార్యానికి కావలసిన సాధనములన్నీ సమకూరి ఆయా కార్యములై , పూజ సమాప్తి యగుటను కళ్ళు చూస్తున్నవి .

     పూజను గైకొని , ఆ వచ్చినవారు , " భగవానులకు ఆయాసమై ఉండాలి . లోకానుగ్రహము చేయనున్నవారికి కూడా  ఆయాసము తప్పలేదు కదా " అని ఆరంభించినారు . 

     విశ్వామిత్రులకు , ఈతడే క్షేత్ర పతి యైన బృహస్పతి అయి ఉండవలెను అనిపించినది . అదీకాక , వెనుక ఒకసారి చూసిన జ్ఞాపకము , ’ తప్పక అతడే ’  అన్నది . పలకరించినారు , " దేవగురువులకు సుఖాగమనమైనదా ? "

     బృహస్పతి నవ్వుతూ అన్నారు , " భలే విశ్వామిత్రా , జాడను పట్టుకోగల ఘటికుడవైనావు . నువ్వేమో కనులు మూసి కూర్చున్నావనుకున్నావు . నీ ప్రతాపమును చూచినావా ? " 

     దేవగురువు చూపించిన చేతివెంటే తిరిగిన కనులు , తన వలెనే ఉన్న వందలాది ప్రతి కృతులు తనవలెనే తపోనిష్ఠులై కూర్చున్నది చూచాయి . ఒకటే గరిక గడ్డి సర్వతో ముఖమై , వ్యాపించిన అన్ని దిక్కులలోనూ వేర్లూని ఒక్కొక మూలమైనట్లే , కోవిల దుంపలూ , చిలగడ దుంపలూ వేరులు వ్యాపించి పోయి ,  కణుపు కొక గడ్డ అగునట్లు ,  చుట్టుపక్కల అంతా తన ప్రాణమే ప్రవహించి అక్కడొకటీ అక్కడొకటీ తన ప్రతి బింబమై కూర్చొని యుండుట చూసి విశ్వామిత్రులకు అంతులేని ఆశ్చర్యమైనది . 

     విస్మయావేష్టులై మౌనులైపోయిన భగవానులను దేవగురువులే మరలా మాట్లాడించినారు : " సుఖాగమనమా ? అని అడుగుతున్నావు . నేను ప్రతి శుద్ధ పంచమి దినమూ ఇక్కడికి వచ్చి వెళ్ళుట వాడుక యైనది . కడచిన సారియే నేను దీనిని గమనింపవలసినది . చూచెదము అనుకొని వెడలిపోతిని . ఇప్పుడు , ఇదేమిటి , ఈ క్షేత్రమంతయూ నీదే అయిపోయినదా ? ఇతరులు వచ్చుటకు కూడా అవకాశము లేకుండా నీ ప్రాణ శక్తివ్యూహము పరచుకొని కూచున్నావే ? మిగతా వారు ఈ పుణ్య నదీ స్నానానికి కూడా రాకూడదేమి ? " 

     విశ్వామిత్రులు దేవ గురువులు చూపిన దృశ్యము , ఆడిన మాట , రెంటికీ ముగ్ధులై " దేవా , ఎంతైనా మానవులు అల్ప బుద్ధులు . సంకల్పము లేకుండానే , తమకే తెలియకుండానే  అపరాధము చేయు జాతి ఇది . క్షమించవలెను . " అని చేతులు జోడించారు .

     " అటుల కాదు , అపరాధము చేయుటకు శక్తి ఉన్నందువల్లనే  మీవల్ల ఉపకారము కూడా కాగలదు . మనుష్యుడు స్వతంత్రుడనని అనుకొని స్వేఛ్చగా ఉద్యుక్తుడైతే అప్పుడది అపరాధము . వెనుక ముందులు చూచి కార్యపరుడైతే స్వసంకల్పుడి కన్నా హెచ్చుగా , ఆజ్ఞాతుడైనపుడు వాడి వలన లోకానికి ఉపకారము .  నీ సందేహము అర్థమైనది , ప్రేరకులు మేమే ! దేవతలు ప్రేరేపించనిదే యే కార్యమూ నడవదు . అయితే , మాది కనబడని చేయి . అదుండనీ , విశ్వామిత్రా , నువ్వు మొదట నన్ను ఈ నీ ప్రాణశక్తి వ్యూహము నుండీ దాటించు . ఇది నన్ను పట్టి నిశ్చేష్టుడిని చేసినది . నేను దీని వలననే నీకు అంతరాయము కలిగించినది . " 

" అది కూడా తమరే నేర్పించవలెను కదా ! " 

     " ఔను , ఇప్పుడు ప్రాణ ధ్యానము చేస్తున్నావు కదా , అది నీ హృదయము నందు జరుగుతున్నది . అది ముఖ్య ప్రాణ ధ్యానము . ఈ ముఖ్య ప్రాణుడి ధ్యానము వలననే నీకు ఇలాగు ప్రతిసృష్ఠి కర్త అగుటకు యోగ్యత వచ్చినది . అయితే , ఇది నువ్వు వెనుక అనుకొన్నట్లు సంకల్ప ప్రభావము కాదు . ప్రాణము బలీయమై బయట పడి , భూత పంచకముల తన్మాత్రలను అన్ని వైపులనుండీ పీల్చి వేసి వేరే మూర్తులైనది . ఈ ముఖ్య ప్రాణ ధ్యానము నుండీ ఇంకా ముందుకు వెళ్ళి మూల ప్రాణ ధ్యానమును చేయి . అప్పుడు ఈ ప్రాణ విజృంభణము ఉపశాంతమవుతుంది . నేను కూడా విడుదల అవుతాను . " 

     విశ్వామిత్రులు మరలా ధ్యానారూఢులయినారు . ప్రాణ దేవుని సాక్షాత్కరించుకొని , దేవగురువు యొక్క అనుజ్ఞను తెలియజేసినారు . ప్రాణదేవుడు నవ్వుచూ , అన్నాడు , " ఇటుల అగునని నాకు తెలిసి యుండినది . దేవగురువులే వచ్చి చెప్పినది కడు రమ్యముగా నున్నది . మన ముందరి కార్యమంతా సుముఖమైనది . ఇప్పుడు మూల ప్రాణుడిని ధ్యానించు . అయితే ఒక హెచ్చరిక . దేహాద్యంతమూ ధ్యానముండవలెను . ఇంతవరకూ హృదయపు చుట్టూ ఉన్న నూటొక్క నాడులలో మాత్రమే నన్ను ధ్యానించినావు . ఇప్పుడు దేహాద్యంతమూ ధ్యానము నడవవలెను . దానికి ముందు దేవ గురువుల యనుమతి కోరు . అతని వలన ఇంకొక రహస్యము నీకు తెలియవలెను . అది తెలియనిదే ఈ మూల ప్రాణ ధ్యానము అసాధ్యము . " 

     భగవానులు ప్రాణ దేవుల యనుజ్ఞను దేవ గురువులకు తెలిపినారు . వారు నవ్వుతూ , " మంచి పనే ! నేనుగా వచ్చి నీకు చిక్కుకు పోయి దేవ రహస్యములను నీకు తెలుపవలసినట్లాయె కదా ! " అన్నారు .

     " దేవా , నిజము . నువ్వుగా వచ్చి దొరికినావు కదా , కృపతో మీ రహస్యములనన్నిటినీ తెలియజేయక పోతే ఇంకెవరు తెలియజేస్తారు ? బ్రహ్మర్షి పరిషత్తు అనుమతి నిచ్చింది . అందుకే నేను వచ్చినది . పెద్ద మనసు చేయవలెను ." 

     " అది కాదయ్యా , నీ మాట నీదే గానీ , నేను చిక్కుకున్న విషయము నీకు పట్టినట్లు లేదు . ఇక్కడ చూడు , నీ ప్రాణ శక్తి ,  నీ తపోబలముతో బలపడి నాగ పాశములై నన్ను బంధించి వేసినది . దీని నుండీ నన్ను విడుదల చేయవయ్యా అంటే పరిషత్తు అనుమతి అంటున్నావే , నీకిది న్యాయమా ? " 

     " ప్రభూ , నీకు నువ్వే విడుదల కాగల ప్రభువూ నువ్వే అయి , నాతో ఆటాడుచున్నావా ? ఏమి చేయవలెనో అనుమతి నివ్వు . చేయుటకు సిద్ధముగా నున్నాను . "

     " అటులనే విశ్వామిత్రా , నువ్వు పేరుకే కాదు , మనోభావము వలననూ విశ్వానికి ఆమిత్రుడవై యున్నావని నీకు చెప్పుచున్నాను . ఇదిగో , ఆ దేవరహస్యము విశ్వానికి ఆర్యత్వమును కరుణించును . అయితే ఒక హెచ్చరిక . దీని శుద్ధ మనస్కుడూ , శుద్ధ బుద్ధి గలవాడూ మాత్రమే జీర్ణించుకోగలడు . ఇతరులకు ఇది కరగతమైననూ ఫలించదు . దీనికి నువ్వు అంగీకరిస్తావా ? " 

" దేవా , దేవతలు తమ రహస్యమును కాపాడుకొనుటకు సమర్థులై యుండగా , నా అంగీకారముతో కాగల పనియేమున్నది ? " 

     " అది కూడా ఒక రహస్యము . విశ్వామిత్రా , నువ్వు ఈ రహస్యమును భేదించు పరమర్షివి . నువ్వు ఇట్టి నా నిబంధనకు ఒప్పుకున్న , ముందు ముందు ఎవరైనా నీ మంత్రమును దురుపయోగము చేసిననూ , దానికి వారే బద్ధులవుతారు . అటులకాక , బంధ విమోచనము చేసి మంత్రమును నువ్వు పొందినా , దానిని ఎవరైనా దురుపయోగ పరచినపుడు , దానికి నువ్వే బాధ్యుడవు అవుతావు . అదీకాక , బంధవిమోచనమైన మంత్రమును మేము ఇవ్వము . అందువలనే, ఉపనిషత్తులో ఉన్న ధర్మాలలో తనదాక వచ్చు వరకూ ఉపనిషత్తు సిద్ధి కాకుండునది . " 

     " ప్రభూ , స్పష్టముగా చెప్పి అనుగ్రహించండి . ఇప్పుడు మీరు నాకు దయచేయు మంత్రమేది ? ఏ నిబంధనలతో దానిని అనుష్ఠానము చేయవలెను ? దాని సిద్ధి ఏమిటి ? " 

     " విశ్వామిత్రా , పరిషత్తు నీ ద్వారా అన్వేషించుచున్నది గాయత్రమను మంత్రము . దానిని అనుష్ఠానము చేయుటకు విశ్వామిత్రుడై  యుండవలెను . అది వాడిని బ్రాహ్మణుడిని చేయును . బ్రాహ్మణమన్న నేమి యని అంటావేమి ? అదికూడ చెప్పెదను విను . ఇప్పుడు మనుష్యులందరూ ఆగ్నేయులు . అనగా , ఎల్లప్పుడూ ఈ దేహమునకు అన్నపానాదులు కావలసియే యుండును . దానితో పాటు , గంధర్వులూ , సోముడూ మానుష దేహములో ఇల్లు కట్టు కొని యుండెదరు. గంధర్వుల వలన కామమూ , సోముడి వలన సంగ్రహమూ ( బాగుగా గ్రహించుట ) ప్రబలమై ఉంటాయి . గంధర్వులూ , సోముడూ , అగ్నియూ కట్టిన ఇల్లు ఈ మనుష్య దేహము . వీరు ముగ్గురి ప్రభావమునూ మీరి , అనగా , కామమునూ , సంగ్రహమునూ భోగమునూ దాటినవాడు బ్రాహ్మణుడు . దీని కోసము , ప్రాజాపత్య వ్రత రూపమైయున్న బ్రహ్మచర్యమే నిబంధనము . బ్రహ్మ చారిగా ఉండి ఈ మంత్రమును అనుష్ఠానము చేసిన వాడిని గంధర్వ , సోమ , అగ్నులు కట్లు విప్పి అనుగ్రహిస్తారు . ఇదే వృద్ధి . ఇంతటివాడే ఆత్మోద్ధారము చేసుకున్నవాడు . వీడివలన విశ్వపు ఉద్ధారము . సిద్ధముగానున్నావా ? " 

" ఉన్నాను " 

" సరే , నువ్వు విశ్వోద్ధారము చేయువాడివి కాబట్టే నీకు విశ్వామిత్రుడని మేము పేరు పెట్టినది . అది ఇప్పుడు సార్థకమయినది ... " 

" ఆ పేరు నేనే పెట్టుకున్నది కాదా ? " 

     " భగవాన్ , చూచితిరా దేవతల చేతివాటము ? వారు మీ మనసులో  వెనుక ఉండి , సూత్రధారులై సూత్రములను లాగుచుందురు . మీ మనుష్యులు ఆ ప్రేరణను తెలుసుకోక , మీరే సంకల్పము చేయగల వారికన్నా హెచ్చుగా మిడిసి పడుతారు . ఇప్పుడు చూడు , వశిష్ఠులే నేరుగా నిన్ను కావేరీ తీరములో తపస్సు చేయమని ఎందుకు చెప్పలేదు ? వారెందుకు భగవాన్ అగస్త్యులను చూడమన్నది ? వారెందుకు నన్ను పిలచి , ఇతడికి కావలసినది ఇవ్వండి అని అడుగలేదు ? నా క్షేత్రమునకు నిన్నెందుకు పంపించినారు ? నువ్వూ , లోపా ముద్రా , అగస్త్యులూ మాట్లాడుకున్న దినమే నీ విషయము అంతా నా మనసుకు తెలిసినది . నీ ప్రాణ శక్తి వ్యూహములో నేను చిక్కుకున్నాను కదా , ఇది కూడా మా ఆటే ! ఇదిగో చూడు , నేనే విడిపించుకోగలను . అయితే , నేను నీ వ్యూహమును ఛేదించితే మరలా నువ్వు వ్యూహమును కట్టలేవు . అందుకని నువ్వే విడిపించాలి అంటున్నాను . ఇది నీ చేత కాదన్నదీ నాకు తెలుసు . చూడు , ఇప్పుడు హృదయపు చుట్టూ ఉన్న నూటొక్క నాడుల ధ్యానము చేస్తున్నావు . దేహాద్యంతమూ ఆ ధ్యానము నడవనీ . పూషుడిని ధ్యానించు . పూషుడి అనుగ్రహము వలన దేహాద్యంతమూ ఉన్న నాడీ చక్రములన్నీ శుద్ధమై ప్రాణ శక్తిని ధరించుటకు సిద్ధమూ , శక్తమూ అవుతాయి . అటుల శుద్ధమైన నాడీ మండలము ,  నీ మహా ప్రాణ ధ్యానము వలన సృష్ఠియైన ప్రాణ శక్తిని ,  ధారణ చేయ గలదు . ప్రాణ శక్తిని సృష్ఠించునది , మహా ప్రాణ ధ్యానమే ! అటుల సృష్ఠియయిన శక్తిని బయటికి వదలక , దేహములోనే సంగ్రహించి ధారణ చేయునదే మూల ప్రాణ ధ్యానము . నువ్వు ఆ మూల ప్రాణమును పట్టుకోవలెనన్న , పూషుడి అనుగ్రహము కావలెను . ఇదిగో చూడు , పూషా దేవుడు వచ్చియున్నాడు . " 

     విశ్వామిత్రులు పూషుని దర్శనము చేసినారు . హిరణ్య వర్ణపు గుర్రములవలె ఉన్న మేకలను కట్టిన హిరణ్మయ రథములో కూర్చున్న కపర్దియైన ఆ మహా పురుషుని చూస్తుండగనే దేహాద్యంతమూ నాడీ చక్రములన్నీ దారి వదిలినాయి . ఇక , పూషా దేవుని పూజ ముగియుచున్నట్లే ప్రతి కృతులన్నీ నూనె నిండుకుని కొండెక్కిన దీపాలవలె అస్తమయమైనవి . విశ్వామిత్రుల దేహములో ప్రాణ శక్తియొక్క సంచయమగుట వారికే బాగుగా అర్థమయినది . బృహస్పతి చెఱ తొలగింది . 

     పూషుడు విశ్వామిత్రులను కృపా దృష్టితో చూసి " బ్రహ్మర్షులకు నావలన ఏమి కావలెను ? " అని అడిగినాడు . వారు వినయముతో బ్రహ్మర్షి పరిషత్తు కోరికను ఈడేరునట్లు చేయమని ప్రార్థించినారు . పూషుడు సుప్రసన్నుడై , మందహాస సుందర వదనముతో అన్నాడు , " దేవ గురువులు చెప్పినట్లు ఈ విషయములో నిబంధన రహితముగా మంత్రమును ఇచ్చుట లేదు . దీనికి ఒప్పుకుందురా ? " 

" అది ఇచ్చువారి ఇష్టము . మీరు ఇచ్చుదానిని మీకు తోచినట్లు ఇచ్చెదరే గానీ , మాకు తోచినట్లు ఇచ్చుట ఉందా ? " 

     " సరే , ఇక్కడ చూడు , ఇప్పుడు నీ దేహము ప్రాణ కోశమైనది . ఇలాగ ప్రాణ కోశమైతేనే నీకు మూలప్రాణుడి దర్శనమగునది . ఆ మూల ప్రాణుడు ప్రతి దేహము లోనూ ఉన్నాడు . అతడు వచ్చి కూర్చొను వరకూ గర్భములోని ప్రాణి దేహము పెరగదు . అతడు రావలెనని అనుకుంటున్నపుడే అగ్ని ష్టోమ శక్తులు భిన్నములై స్త్రీ గర్భమును చేరి అక్కడ తమ కార్యమును ఆరంభిస్తాయి . బాహ్యముగా సమిష్టి స్వరూపమై యున్న ఇతడే సవితృ నామధేయముతో సూర్యుడిలో నిలచి స్థావర జంగములకన్నిటికీ ఆత్మయై ఉంటాడు . అతడు తనలోపల నిలచి సర్వమునూ నడపుచుండుట చూచి అతని ఇఛ్చకు తనను అర్పించుకొన్న వాడు బ్రాహ్మణుడగును . ఉదయాస్తమయములలో , మిట్ట మధ్యాహ్నములో సూర్యుడిలో నున్న సావిత్రాంశము ప్రకటమవుతుంది . దానిని గ్రహించి తనలో నింపుకొను వాడు బ్రాహ్మణుడు . చూడు , జ్ఞాపకము ఉంచుకో , మూడు సంధ్యలలో గ్రహణము చేయక పోతే , మరలా మిగిలిన వేళలలో గ్రహణము చేయుట కష్ట మగును . దీనికంతటికీ సిద్ధముగా ఉన్నావా ? " 

" అటులనే " 

     " సరే , చూడు , సూర్య మండలపు మధ్యవర్తి యైన సవితృ దేవుని బాహ్య చక్షువులతో చూస్తూ , అక్కడినుండీ వెడలు ఆ హిరణ్మయ తేజస్సును నీ హృదయములో నింపుకొని , అది దేహాద్యంతమూ వ్యాపించునట్లు చేయి . దేహములోనున్న అంగాంగములు మాత్రమే కాదు , రోమకూపములన్నిటా ఈ తేజస్సు నిండనీ . అక్కడ నడచు కార్యములన్నీ ఈ తేజస్సు వల్లనే నడచునని తెలియునా ? ఇలాగు , పిండాండములో నడచినట్లే బ్రహ్మాండములో కూడా నడచును . ఇప్పుడు చెప్పు , నీకు కర్తృత్వము ఉంటుందా ? " 

" లేదు " 

" ఇప్పుడు నువ్వు ఏమి చూస్తున్నావు ? " 

" దేవా , దేహమంతా అనిర్వచనీయమయిన ప్రకాశముతో నిండినది . "  
" ఆ ప్రకాశపు మూలము ఎక్కడుందో వెదకి చూడు " 

" మూలము నాభిలో ఉంది . అది హృదయములో ప్రకటమగుచున్నది " 

     " సరే , అదే ! ఆపోజ్యోతి . చూడు . అది మండు చున్ననూ , దానిలో వెలుగుందే తప్ప వేడిమి లేదు . ఇది బ్రాహ్మణుని లక్ష్యము కావలెను . ఇంకా ఒక అడుగు ముందుకు వేయి . సవితృ మండలమును చూడు . అక్కడ ద్విదళ ధాన్యము లలో అణగియున్న అంకురము వలె , ఇటువైపు అగ్నిమండలపు ఎరుపు , అటు సోమ మండలపు నీలిమ - వీటి మధ్య సూక్ష్మముగా పీత వర్ణములో కనిపిస్తున్నదే , అదే సవితృ మండలము . చూడు , నువ్వు చూస్తుండగనే అది నీకు అభిముఖముగా కిరణమును ప్రసరించును . ఆ కిరణమే సావితృము . దానిని పట్టి నువ్వు మూల ప్రాణమునకు తెచ్చి , మూల ప్రాణము నుండీ మహా ప్రాణమునకు తెచ్చి , అక్కడినుండీ ప్రాణ మండలమునకు తెచ్చి , అక్కడినుండీ దానిని ఉదాన వాయువులో వహించు . ఆ ఉదానము ఆ తేజస్సును శబ్ద మాత్రముగా పరిణమింపజేసి , పలుకుతుంది . ఆ శబ్దమే వాక్కై , మంత్రమై , ఆ మంత్రము లోకోద్ధారము చేస్తుంది . జాగ్రత్త !  అయోగ్యుడికి ఇచ్చిన మంత్రము ఇచ్చిన వాడిని చంపుతుంది . పాత్రులకు దానిని ఇస్తే , అది రెండు కొనలనూ కాపాడును . " 

" దేవా , అపాత్రుడిని అనుగ్రహించు శక్తి ఆ మంత్రానికి ఇవ్వు " 

" భలే , విశ్వామిత్రా , భలే . జాగ్రత్తగా ఉన్నావే ! ..సరే , ఇప్పుడు చెప్పు , నీ నోట వచ్చిన ఈ మాట నీదేనా ? "

" కాదు , బృహస్పతి పలికించినది " 

     " భలే , భలే . ఇలాగే ఆరంభమునుండీ అంత్యము వరకూ సర్వ భావనలూ ప్రచోదితములే అనునది తెలిసి , దేహ , కాల , ఆహార , సంగ , ధర్మములతో ప్రచోదితమైన దానిని వదలి , ఆత్మ హితము కోసము , లోక హితము కోసము వచ్చు ప్రచోదనమును పట్టి కార్యము చేయువాడు బ్రాహ్మణుడు . ఇంతటి బ్రాహ్మణుడిని మా దేవతలము కూడా బలిదానముల చేత ఆరాధించెదము . అతడు కామ వశుడై స్వఛ్చంద వర్తనుడగు వరకూ విశ్వ దేవతలందరూ అతని దేహమునందుంటారు . మేము ఎప్పటికీ పరోక్ష ప్రియులము . మమ్ములను దర్శించవలెనంటే మాకు బలిదానము ఇవ్వ వలెను . మమ్ములను వరము కోరవలెను . దీనినంతటినీ నియమముగా ఆచరించి , నీ సావితృ మంత్రమును అనుష్ఠానము చేస్తే అది గాయత్రమవుతుంది . తృప్తి కలిగినదా ? " 

     " దేవా , అటులనే , నీ అనుగ్రహముతో బ్రహ్మర్షుల కార్యము నెరవేరినట్లే . అయితే , ఇదంతా కూడా పాత్రులైన వారికి మాత్రమే . అపాత్రులను అనుగ్రహించు విధానమును చెప్పు .  "

     పూషుడు దిక్కు దిక్కులన్నీ వెలిగిపోవునటువంటి నవ్వు నవ్వి , " బ్రహ్మర్షీ , చూచితివా ? నీ అంతస్తు వారు ఈ కృత యుగములో కూడా , ఎంత వెదకినా నూరు మంది దొరికితే ఎక్కువ . ఇటువంటి నీకు కూడా సంశయము ఉంది , చూచితివా ? ఎంతవరకూ అహంకారము ఉంటుందో , అంతవరకూ సంశయము వదలదు . ఇదే హృదయ గ్రంధి . సవితృడిని ఇంకొక సారి ధ్యానము చేసి ఈ హృదయ గ్రంధిని విసర్జించి , పాత్రులు ఎవరు ? అపాత్రులు ఎవరు ? అన్నది చూడు ." 

     " అవును దేవా , తప్పయినది . లోకములో అందరూ పాత్రులే ! కొందరు సిద్ధముగా ఉన్నారు . ఇంకొందరు సిద్ధమగుచున్నారు . ఇదిగో , ఇదెవరో అంటున్నారు , " జాత మాత్రస్య గాయత్రీ "  అని "

" అవును  , నిజము .  అది పలికిన వారిని దర్శనమివ్వమని అడుగు " 

4 comments:

  1. దేవదురువులే - kindly correct the typo. Regards.

    ReplyDelete
  2. జనార్ధన్ గారు

    నమస్తే. మీరు పైన పేర్కొన్న ఆ పూషా దేవుడు ఎవరు? ఆయన ప్రాణశక్తి కి ప్రతిరూపమా తెలుపగలరు.

    శ్రీవాసుకి

    ReplyDelete
  3. పూషా అనునతడు ( పూషుడు ) ద్వాదశాదిత్యులలో ఒకడు . సూర్యుడు ఒక్కో మాసములో ఒక్కో పేరు గలిగి ఉంటాడు . ఒక్కో మాసానికి సూర్యుడు ఒక్కో పేరుతొ ఆధిపత్యము వహిస్తాడు . పూషుడు మాఘ మాసానికి అధిపతి .
    ద్వాదశాదిత్యులు
    మిత్ర , రవి , సూర్య , భాను , ఖగ , పూషా , హిరణ్య గర్భ , మరిచ , ఆదిత్య, సవితృ , అర్క , భాస్కర
    వీరినే కొద్ది వ్యత్యాసములలో వేరే పేర్లతో కూడా పిలుస్తారు . అవి ,
    అర్యముడు , మిత్రుడు , అరుణుడు , అర్కుడు , భగుడు , ఇంద్రుడు , వివస్వంతుడు , పూషుడు , పర్జన్యుడు , త్వష్ట , విష్ణువు , ఆజఘన్యుడు

    మీ రెండో ప్రశ్న..
    గాయత్రి మంత్రాన్ని అధికారము లేనివాడు జపించ రాదు ' జాత మాత్రస్య గాయత్రి ' అని అక్కడే చెప్పారు కదా . . జాతుడు అంటే , ద్విజుడిగా జన్మ నెత్తిన వాడు , అంటే ఉపనయనము అయినవాడు . వాడికి మాత్రమే అర్హత ఉంది . అలాగే , గాయత్రి మంత్రాన్ని గట్టిగా ఇతరులకు వినిపించేలా పలుకరాదు. ఇప్పుడన్నీ మైకులలో పెడుతున్నారు , తగిన ఫలితాన్ని కూడా అనుభవిస్తున్నారు . గాయత్రీ మంత్రము ఏ దురుద్దేశముతో ఉపయోగించినా అది దురుపయోగమే .


    అర్హత ఉండి కూడా మంత్ర సాధన చేయక పోయినా దోష ఫలితము ఉంటుంది కాని అది దురుపయోగము కాదు .

    ReplyDelete
  4. adityah savita suryah khagah pusha gabhastiman |
    suvarnasadrisho bhanur-hiranyareta divakarah || 10

    He is the Son of Aditi (the mother of creation), the Sun God who transverse the heavens, he is of brilliant golden color, the possessor of a myriad rays, by illuminating all directions he is the maker of daylight. He is the all pervading, shining principle, the dispeller of darkness, exhibiting beautiful sight with golden hue. (From Aditya Hridayam - http://www.ashram.org/AboutAshram/Events/AdityaHrudaystotraPaath/AdityaHrudayShotraEnglish.aspx -)

    ReplyDelete