SHARE

Wednesday, August 15, 2012

64. " మంత్ర ద్రష్ట "అరవై నాలుగవ తరంగం .



అరవై నాలుగవ తరంగం .

     భగవతి లోపాముద్రా దేవి సహేతుకంగా , సప్రమాణముగా చెప్పిన మాట వారిద్దరికీ సమ్మతమైనది . విశ్వామిత్రులు అన్నారు , " ఇక్కడికి వస్తూ , దారిలో యాజ్ఞవల్క్య , గార్గి , భారధ్వాజ , వామదేవ , నచికేత , అత్రి, అనసూయా దేవి మొదలగు భగవంతుల నందరినీ దర్శించి వచ్చినాను . అందరూ ఒకటే మాట అంటారు , " భూతపంచకపు మలము వలన తమోమయమైన అంతఃకరణమును కడిగి అక్కడ వెలుగు నింపవలెను . వట్టి మాటలతో సర్వ వ్యాపి అని చెప్పుచున్నది కాక, ’ అంతర్బహిశ్చ తత్ సర్వం వ్యాప్య నారాయణస్థితః ’ అనే వాక్యపు అర్థము కన్నులకు కట్టినట్టు కావలెను . తాను వేరే అనునది కాక, ఈ అనంత విశ్వములో తానూ ఒకడు అన్న భావన బలపడవలెను . అన్నిటికీ మించి , దేవతలకూ మానవులకూ సంబంధము నేర్పరచు కొలికి యై ఉండవలెను . ఈ అఖండ విశ్వపు అధిపత్యమంతా దేని చేతిలో ఉందో దానిని పదే పదే చూచు కన్నులు గలవాడు కావలెను . దీనినంతటినీ సాధించు మంత్రమొకటి కావలెను . అందరూ ఆశీర్వాదము చేసినారు . కావలెనన్న , తమ తపస్సునంతా ఇచ్చుటకు సంసిద్ధులుగా నున్నారు . " 

     " మా దంపతులము ఇప్పుడే మా తపస్సునంతా ఇచ్చేస్తాము . తపస్సు సాధించలేని కార్యము ఈ విశ్వములో ఉందా ? తమరు తమ కార్యమును మొదలు పెట్టండి . మనకు తెలియక పోతే ఇక్కడ బ్రహ్మణస్పతి , అక్కడ అంగీరసుడు ఉన్నారు . అయితే , ఇది యజ్ఞ యాగాదుల వలన కాగలిగినది కాదు కాబట్టి అంగీరసుడి వలన ఫలము లేదు . ఇక మిగిలినది బ్రహ్మణస్పతి. తమరు వారి దర్శనము చేసుకున్నారు కదా ? " 

     విశ్వామిత్రులు తాము త్రిశంకువు యాగము నందు ఇంకొక స్వర్గమును రచింపవలెనని ప్రయత్నము చేసినపుడు స్వయం బృహస్పతియే వచ్చినది , తమను ఆపినదీ చెప్పినారు . 

     " సరే , మీరు మరలా ఆరంభించండి . ఇక స్థలము . దానిని ఈమె నిర్ణయించినారు . ఈమె ఇక్కడ కావేరీ నదిగా ప్రవహిస్తూ లోకోపకారము చేస్తున్నది తమకు తెలిసినదే కదా ! పరమపావనమైన ఈ నదీ తీరములో ఒక రహస్య క్షేత్రముంది . అక్కడికి బ్రహ్మణస్పతి ప్రతి శుక్ల పక్షమునందు రహస్యముగా వచ్చి ఒక పగలుండి వెళ్ళును . అక్కడ తమరు ఆశ్రమమును చేసుకొని తపస్సుకు నిలవండి . ఆ క్షేత్ర రహస్యమును తెలిసినది ఈమె . అడగండి . " 

     లోపాముద్రా దేవి చెప్పినది , " ఈ నదీ తీరములో అప్పుడప్పుడు దేవతలు వచ్చి వెళ్ళు గుర్తులు కనపడుతూనే ఉంటాయి . అయితే , జడ స్వభావమును వహించి జలమై ప్రవహించునపుడు జడ ధర్మమే ఉండవలెను కాబట్టి నేను దానిని గమనించుటకు లేదు . అయినా ,  ’ నేను ’ అన్న అభిమానము ఎలాగ తప్పుతుంది ? అందువలన నేను అప్పుడపుడు వచ్చి ఈ నదీ తీరములో ఉండి వెళ్ళుట కద్దు . ఒకసారి ఇటులనే యాత్రకని వచ్చినపుడు ఒక క్షేత్రములో ఒకటి రెండు సంవత్సరములు ఉండాలనిపించినది . అలాగ ఉన్నపుడు నదిలో ఉన్న ఒక బండ పైన మాసమునకొక పరి మంచు కట్టుకొని యుండుట కనిపించేది . అదికూడా సరిగ్గా పంచమి దినము . ఇంకొక సారి పరీక్ష చేసి చూడగా , మంచు కట్టుతుండగనే , వెండి బొమ్మవలె నున్న ఒకరు వచ్చి , నదిలో స్నానము చేసి వెళ్ళి , సరిగ్గా ఆ బండపైన కూర్చొని ఆహ్నికముల నన్నిటినీ  ముగించుకున్నారు . ఆ వేళకు సాయం సంధ్యయైనది . సంధ్యా కాలములో శివ పూజ చేసి ,  వచ్చిన వారికందరికీ ప్రసాదమును ఇచ్చి వెళ్ళినారు . ఇది దేవ రహస్యము . దీనిని ఛేదించవచ్చునో కూడదో అని నేను ఆలోచిస్తూ వచ్చి వీరికి చెప్పినాను . వీరు కూడా ఒకసారి పరీక్ష చేసి , ఇంకొకసారి వారు ఆహ్నికములో నుండగా , సరిగ్గా మధ్యాహ్నపు వేళ నదిలో స్నానానికి దిగి , అఘమర్షణ సూక్తములను బిగ్గరగా పారాయణ చేయుట ఆరంభించినారు . అప్పుడు నేను కూడా ఒక పూపొద మాటున దాగి , ఏమగునో అని కాతరముతో కూర్చున్నాను . వారు కన్నులు తెరచి చూచి , వీరికి కనపడి , స్థూల రూపములోనే ఆశ్రమమునకు వచ్చి ఆతిథ్యమును స్వీకరించి వెళ్ళినారు . " 

     " ఇలాగు వారి సన్నిధానము వలన పవిత్రమైన ఆ క్షేత్రములో తమరు ఉంటే , మహా తపస్వులైన తమకు వారి దర్శనమగుటలో ఎట్టి సందేహమూ లేదు . దేవగురువులైన వారికి , మనందరికీ ఈ ఆలోచన ఎందుకు వచ్చినది అనుదాని కారణము తెలిసియే ఉండును . వారి సలహా ప్రకారమే ముందరి కార్యమును చేయగలరు . " 

     విశ్వామిత్రులు ఒప్పుకున్నారు . అగస్త్య దంపతులు వచ్చి ఆ క్షేత్రమును చూపించినారు . అక్కడ ఒక చిన్న పర్ణశాలను రచించుకున్నారు . విశ్వామిత్రులు ఆ క్షేత్రమును అర్చించి , ఒక హోమము చేసి క్షేత్రపతిని ప్రసన్నము చేసుకొని , ఆశ్రమపు రక్షణ భారమును భైరవునికి అప్పజెప్పి, తాము తపస్సుకు కూర్చున్నారు . 

     ఈ వేళకు సరిగ్గా , దేవలోకములో దేవగురువులు ధ్యానములోనున్నారు . వారికి హఠాత్తుగా ధ్యానము విక్షిప్తమై ఒక స్వప్నము కనిపించెను . తాము ఒక సొగసైన బంగారపు వస్త్రము పైన కూర్చున్నారు . ఎవడో ఒక పిల్లవాడు ఆ వస్త్రమును పట్టి లాగుతున్నాడు . వీరు , " ఒరే , నీకు కావాలంటే వేరొకటి ఇస్తానులే , ఇది ఇంద్రుడిది " అంటారు . వాడు , ’ నాకు ఇదే కావలెను , తీసుకురమ్మని వారు చెప్పినారు . తీసుకొని పోకపోతే వారు వదలరు ’ అంటాడు . వారు , ’ మంచి మొండి ఘటమే దొరికినాడు కదా అనుకొని , ’ రా నాయనా , ఇంద్రుడికి చెప్పి ఇప్పిస్తాను ’ అని ఇంద్రునివద్దకు పిలుచుకొని వెళతారు . ఇంద్రుడు , ’ ఇటువంటి బట్ట మా వూరిలోనే ఎక్కడా లేదు . ఉంటే ఇది పూషా దేవుడిదే అయ్యుండవలెను ’ అంటాడు . ఇద్దరూ పూషా దేవుడి దగ్గరికి వెళతారు . అక్కడికే కల కరగిపోయింది . 

     వారు ఆ కల అర్థమేమిటో చూడవలెను అనిపించిననూ , ఎందుకో మనసుకు వద్దనిపించి , ’ ఇంకొక దినము చూద్దాములే , ఏమంత తొందర ? " అనుకున్నారు . 

No comments:

Post a Comment