SHARE

Friday, August 10, 2012

60. " మంత్ర ద్రష్ట " అరవై యవ తరంగం .



అరవై యవ తరంగం .

     భగవానుల తొడపై శునశ్యేఫుడు వచ్చి కూర్చున్నది , వారు అతడిని దేవరాతుడు అని సంబోధించినది మిగిలినవారికందరికీ హితమైననూ , ఆంధ్రాది పంచాశులకు సరిపోలేదు . నూరు పశువులకు విక్రీతుడైన వాడొకడు సులభముగా బ్రహ్మర్షుల తొడపైన కూర్చొనునది మర్యాదకు నిషిద్ధమైనది అని వారి సిద్ధాంతము . అక్కడ ఏ అడ్డూ అవాంతరమూ రాని యెడల అక్కడే వాడికి బుద్ధి చెప్పి ఉండేవారు . కాని , ’ ఇది సభ , భగవానులకు చెప్పకుండా ఏ పనీ చేయరాదు ’ అని మిన్నకున్నారు . భూమిని పడి , బీజమై జనించినది మొలవక పోవచ్చు . పీకబడ వచ్చు , విఫలము కావచ్చు . కానీ మనస్సులో పుట్టిన భావము మాత్రము ఫలించకుండా పోవుట ఉందా ? ఆంధ్రాదులకు యజ్ఞ మంటపములో పుట్టిన ఈ విరోధ భావము ఎరువుగోతిలో పడిన గుమ్మడిగింజ వలె బాగా పెరుగుతూ పోయింది . ధర్మారణ్యమునకు వచ్చు వేళకు దేవరాతుని విషయమై వారి భావము  సంపూర్ణముగా ధర్మ విరుద్ధమై పోయింది . 

     దేవరాతుని విషయములో మధుఛ్చంద్రాదుల ప్రవర్తన ఆంధ్రాదుల పిచ్చి కి ధూపము వేసినట్టాయెను . వారేమో , ’ అతడు భగవానుల విశేష కృపకు పాత్రుడైనవాడు ’ అని భావించి  అతడిని విశేషముగా అభిమానించి గౌరవించినారు . అతడు వయో జ్యేష్ఠుడు కాకున్ననూ , విద్యా జ్యేష్ఠుడని అతడిపై వారికందరికీ గౌరవము . అది ఆంధ్రాదుల దృష్టిలో ఇంకొక సంప్రదాయ భంగము .  ’ పెద్దవారు పెద్దవారే  , ఈ దినము నాటిన మొక్క శతమానపు వృక్షమును మించుట ఉంటుందా ? మేము ఏదైనా సహిస్తాము , కానీ క్రమ భంగమును సహింపము ’ అని స్పష్టముగా చెపుతారు . 

     దీనిని భగవతీ కౌశికి భగవానులకు తెలియజేశారు . వారు , " ఇది నాకు దారిలోనే తెలిసింది . అయినా , ఎవరైనా నాకు వచ్చి చెప్పనీ , అని వేచియున్నాను . మంచిది , విష వృక్షపు ఫలాన్ని సంగ్రహించు కాలము వచ్చింది . నువ్వు ఇంద్ర హోమము చేసి దైవత్వాన్ని స్వీకరించు " అన్నారు . 

     ఆమెకు అర్థము కాక, ’ అటులనిన నేమి ? " అన్నారు . " అటులనిన ? వారికి తాము చేస్తున్న అధర్మపు విషఫలమును సంగ్రహించు కాలము వచ్చినది . మనకు పుత్ర శోకమును అనుభవించు కాలము వచ్చింది . నువ్వు అకారణముగా పుత్ర శోకాన్ని ఎందుకు అనుభవించవలెను ? కాబట్టి  , ఇది జరుగు లోపల దైవత్వాన్ని వహించి , దుఃఖానికి దూరంగా ఉండు . " 

     " నేను తమ సహధర్మచారిణిని . తమరు అనుభవించేదాన్ని నేను కూడా అనుభవించియే తీరవలెను . కదా ? " 

     " అవును . నువ్వు సహధర్మచారిణివి . అంటే , ధర్మములో సహచారిణివి . నేను కూడా వెనుక విశ్వామిత్రుడనని పేరు పెట్టుకున్ననూ , భగవాన్ వశిష్ఠుల పుత్ర వినాశనమునకు కారణమైనాను . దాని ఫలముగా జన్మాంతరములో అనుభవించవలసిన పాప ఫలము ఇప్పుడే పక్వమై చేతికి వచ్చి చేరినది . ఈ పాప ఫలాన్ని నువ్వు అనుభవించ వలసిన పని లేదు . అదీ కాక , నువ్వు ఇంతవరకూ నాతో వర్తించిన అన్యాదృశ ధర్మాచరణ వలన నేను ప్రసన్నుడనైనాను . నువ్వు కావలసిన వరమును కోరుకో . నువ్వు దేవతవు . హవిర్భాగములతో ఆరాధించి మెప్పించ వలసిన దానవు . నువ్వు మానవులకు వరముల నిచ్చుదానవు . ఇటువంటి నీవు  నన్ను వలచి పెద్ద మనసుతో స్వర్గమే ఇక్కడికి వచ్చినట్లు చేసి , నాకు ప్రియము , హితము చేకూర్చినావు . నువ్వు ఏమికావాలన్నా చేయుటకు సిద్ధముగా ఉన్నాను . స్త్రీ బుద్ధిని ఆశ్రయించి , హఠము పట్టి దుఃఖభాగినివి కావద్దు . ఈ దుఃఖము అరుంధతీ దేవిని తినివేయునట్లుండినది . వశిష్ఠులంతటి వారికే దుస్సహమైనది . ఆ వశిష్ఠ శోకము నందు సగమును నేను తీసుకొని ఉన్నవాడను . దానికోసమై ఈ దేహాన్ని ఇచ్చినా నాకు దుఃఖము లేదు . కాబట్టి ఇటువంటి దుస్సహమైన , దుర్దాంతమైన దుఃఖాన్ని అబల , కోమల , ధర్మశీలవైన నువ్వెందుకు వహించవలెను ? అందుకే చెప్పుచున్నాను " 

     " దేవా , క్షమింపవలెను . తమకు ప్రతి యాడుటలేదు . నేనిప్పుడు తమరు చెప్పినట్లు చేస్తే , లోకం లో , " ఎంతైనా అది సాని , సాని బుద్ధి పోతుందా ? చెడ్డకాలము వచ్చిందని తెలుసుకొని చేయి విడచినది " అని నాకు అపఖ్యాతి వస్తుంది . కాబట్టి తమ ఆజ్ఞను మీరక ఇంద్ర హోమమునైతే చేసెదను . కానీ దైవత్వాన్ని స్వీకరించను . ఇంద్రుడు దేవతలకు రాజు . దేవతలందరూ అతని సొత్తు . అతడు సర్వాంతర్యామి . నేను మీతో పాటే ఉండిపోతాను . ఆ దుఃఖము అంత తీవ్రముగా వస్తే , దానికి తమరు బలియయితే , నేను కూడా బలి యవుతాను . అప్పుడు నేను ఓడినట్లు కాదు . అప్పుడు నన్ను మించిపోయి వచ్చి , నన్ను ముంచివేయు దుఃఖాన్ని చూచి , కావలెనన్న , దేవేంద్రుడు నాకు దైవత్వాన్ని ఇవ్వనీ . అటుల కాక ,  నేననుకున్నట్లుగా , తపోధనులూ జ్ఞాన ధనులూ అయిన తమకు ఈ దుఃఖము తగలదు అన్నదే నిజమయితే , నేను దైవత్వాన్ని వహించ నవసరము లేదు . " 

" నువ్వు దైవత్వాన్ని వహించుటకు ఎందుకు వెనుకాడుతున్నావు ? " 

     " ప్రభూ ! దైవత్వంలో ఉండేది రజోగుణమైన ఆవేశము . ఎప్పుడూ భోగ లాలసత. మనస్సు నిశ్చలముగా , నిరాటంకముగా ఉండదు . ఇప్పుడు నేను సాత్త్వికముగా , శుద్ధముగా సుఖముగా ఉన్నాను . తమరు నాకు ప్రసన్నులై వరమును కోరుకొమ్మన్నారు . కాబట్టి నాకు ఇప్పుడు అనుమతినివ్వండి , ఆ వరమును ఆవిధముగా ఇచ్చి అనుగ్రహించండి . దుఃఖమైనా , సుఖమైనా నేను తమ పత్నిగానే ఉండిపోతాను . " 

     " సతీ ! , నిజంగా అటులనే కానీ . ఇంద్రుడు వచ్చి నిన్ను తిరిగి రమ్మని పిలుచు వరకూ నువ్వు నా పత్నివై ఉండు . ఏదేమైనా  మహేంద్రుని ఆజ్ఞను మనమిద్దరమూ మీరుటకు లేదు , కదా ! " 

     ఇద్దరూ ఒప్పుకున్నారు . వెంటనే , హాఠాత్తుగా ఆమెకు రంభ జ్ఞాపకము వచ్చింది . " దేవా , ఇంకొక ప్రార్థన ఉన్నది . నాకు తోడుగా రంభ కూడా వచ్చినది . దానిని నేను మరచేపోయినాను . ఆమె ఏమైనది ? దేవలోకానికి తిరిగి వెళ్ళినదా ? ప్రభావముచేత చూడవలెను . " 

     భగవానులు నవ్వారు . " ఆమె ఏమయిన దనునది నాకు తెలుసు . అయితే నువ్వు నొచ్చుకొనెదవని నీకు చెప్పలేదు . ఆమె కూడా నీ వలె సాత్త్వికురాలై వచ్చియుండిన బాగుండెడిది . అయితే , నీకు సాపత్న్య యోగము లేదు గనక , ఆమె రజో మూర్తియై వచ్చింది . క్షేత్ర పాలకుడైన భైరవుడు చెప్పిననూ వినక , దుడుకు తనము చూపి , ఇక్కడ మహా శిలయై పడియున్నది . నువ్వు దేవలోకమునకు వెళ్ళునపుడు ఆమెను పిలుచుకొని పోదువు గాని  . అంతవరకూ ఆ సంగతి ఆలోచించవద్దు . " 

     భగవతీ కౌశికి అది విని వ్యథ చెందినది . " దేవేంద్రునికి ఆమె బాగా కావలసినది అని ప్రతీతి . ఆమె ఇలాగు మహా శిలయై ఉన్ననూ అతడెందుకు మిన్నకున్నాడు ? లేదా  , పాప ఫలాన్ని అనుభవించనీ అని ఊరకున్నాడా ? కానిమ్ము , నేను దుఃఖ పడునపుడు నన్నూ ఇలాగే వదలివేస్తే ? లేదు , అటువంటి భయము లేదు . అగ్నికి కూడా హిమపు బాధ ఉండునా ? అలాగే , భగవానులకూ బాధ ఉంటుందా ? అన్నిటికీ మించి , నేను ఇక్కడ ఉన్నంతవరకూ సతిని . దైవత్వాన్ని వహిస్తే సానిని . దేవతనై సానిగా ఉండుటకన్నా , మానవి నై సతిగా ఉండుటయే నాకు హితము . " 

     ఆమె ఆలోచనలన్నిటికీ సమాధానముగా పలికినట్లు , " నీకు ఇష్టము వచ్చినట్లు చేయి . అయితే , రేపటి మాపటి లోపల సర్వమూ జరిగిపోతుంది " అని పలికి భగవానులు ముక్తాయించారు . 

2 comments:

  1. Wonderful. Really enjoying. This story reminded me of a story in Sri Guru Charitra where a courtesan takes a pledge to be the 'wife' of a Vaisya in return for a beautiful gem encrusted Siva Linga that he was having (the courtesan also is a Siva devotee). The Siva Linga gets destroyed in a fire and the Vaisya dies due to the shock. The courtesan gets ready to do Sahagamanam with the body of the Vaisya keeping in view her pledge to be his wife...Siva is pleased and gives her moksha (it was Siva who came in the disguise as that Vaisya to test her devotion and her truthfullness). Thanks to you, I could remember again that story and Lord Siva and Lord Dattatreya (Sri Guru).

    ReplyDelete
    Replies
    1. Really pleasing anecdote. Thanks for sharing and thanks for the response.

      Delete