SHARE

Friday, August 3, 2012

55. " మంత్ర ద్రష్ట " యాభై ఐదవ తరంగం .



యాభై ఐదవ తరంగం .

     భగవానుల అతిథి గృహములో ఈ దినము అతి సంభ్రమము గా ఉంది .  త్రిశంకు కుమారుడూ , ఇక్ష్వాకు కుల భూషణుడూ , అయోధ్యాధిపతియునూ అయిన హరిశ్చంద్ర మహారాజు భగవానుల దర్శనము కోసము వస్తున్నాడు . భగవతీ కౌశికి తామే ముందర  నిలచి కావలసిన వన్నీ సిద్ధపరుస్తున్నారు . 

     సకాలములో మహారాజు వచ్చినాడు . మూర్ధాభిషేకము పొందిన క్షత్రియునికి సలప వలసిన మధు పర్కాదుల నన్నిటినీ సమర్పించి భగవానుల సంతానము ఆంధ్రక , పులింద , మధుఛ్చంద్ర , అష్టక ప్రభృతులు అతడిని అతిథి గృహానికి పిలుచుకొని వచ్చినారు . హరిశ్చంద్రులు వచ్చినపుడు భగవానులు ఆశ్రమములో లేరు . సంధ్యాకాలములో వచ్చినారు . వచ్చు వేళకే ఆశ్రమమంతా అతిథులతో పావనమైనది తెలిసి సంతోష పడి , నేరుగా అక్కడికే వచ్చినారు . పరస్పర కుశల ప్రశ్నలన్నీ అయినవి . భగవానులు సంధ్యా కార్యక్రమములన్నీ ముగిసిన తరువాత మరల భేటీ యగునట్లు తెలిపి స్నాన గృహమునకు వెళ్ళినారు . 

     ఇప్పుడు ధర్మారణ్యము గీర్వాణ విద్యా పీఠము అయినది . చతుర్వేద పారంగతులైన మహాత్ములు వచ్చి విద్యా పీఠములో కొంత కాలముండి , తమ సందేహముల నన్నిటినీ నివారించుకొని భగవానుల వలన కృతార్థులమయినామని కృతజ్ఞత తో మరలి వెళ్ళెదరు . ఇప్పుడు ధర్మారణ్యము విద్వాంసుల , తపస్వుల , ధర్మజ్ఞుల , బ్రహ్మ వేత్తల యాత్రా స్థలమైనది . బ్రహ్మలోకము వలె నున్నదని కొందరి అభిప్రాయము . భగవాన్ వశిష్ఠుల ’  తపో భూమి ’ ఆశ్రమములో తప్ప వేరే ఇంకెక్కడా ఈ కర్మ బ్రహ్మ సమృద్ధిని చూడలేము అంటారు మరి కొందరు . మరి కొందరు , ఇక్కడ సిద్ధి కాకపోతే వాడి నుదుట సిద్ధియే రాసి లేదు అని . ఏమైననూ , లోకపు దిగంతాలన్నిటా ధర్మారణ్యము ప్రఖ్యాతమైనది . మహర్షులు మాత్రము , " యాజ్ఞవల్క్యుల ఆశ్రమము , విశ్వామిత్రుల ఆశ్రమము లలో ఏది ఎక్కువ అని చెప్పుటకు సాధ్యము కాదు  " అంటారు . కొందరు తుంటరులు మాత్రము , " కొలబద్ధ ఉన్ననూ కొలవక పోతే అది ఎవరి తప్పు ? యాజ్ఞ వల్క్యులకు ఇద్దరు భార్యలు . ఎనిమిది మంది పిల్లలు . విశ్వామిత్రులకు ఒకతే భార్య . నూరు మంది పిల్లలు. ఎవరు ఎక్కువ , చెప్పండి " అని వక్రముగా మాట్లాడి నవ్విస్తారు . 

     ఘృతాచీ ఇప్పుడు భగవతీ కౌశికి అయినది . ఆశ్చర్యమేమనిన , ఆమె , తాను దేవతా స్త్రీ యన్నదే మరచిపోయినది . ఆ దైవత్వాని వదిలితే తన నిత్య యౌవనము పోవునని ఆమె దానిని వదల లేదు . అదీకాక , భగవానుల వచనము ప్రకారము ఎప్పుడో అప్పుడు ఆ పుత్ర శోకము రానున్నది . దానిని సహించుటకు ఉండనీ అని దైవత్వాన్ని వదలకుండా ఉంచుకున్నారు . మిగతా విషయములలో ఆమె గృహిణి మాత్రమే . గృహ ధర్మమును పాలించు గృహ మేధి అయిన ఆర్యుడి పత్ని . ఆమె నిర్ణయించుకున్నది : " మరలా దేవలోకము నుండీ పిలుపు వచ్చు వరకూ ఇక్కడే ఉంటాను , ఆ పిలుపు వచ్చినాక దైవత్వాన్ని వదలి వేస్తాను " అని . 

     ఆశ్రమములో కూడా అంతే ! అంతా సుఖమయము గా ఉంది . మొదటి యాభై మంది పుత్రులూ ప్రతిభావంతులు . వేద వేదాంగ పారంగతులు . అయినా , కర్మలో ఉన్నంత శ్రద్ధ బ్రహ్మలో లేదు . సాంప్రదాయకముగా గురు దేవ భక్తి సంపన్నులైనారు . ఏ విధముగా వెదకిననూ వారిలో దోషము  చూచుటకు కనబడదు . అయినా ఏదో తుళువ తనము , ఏదో వక్రతనము . ఏదో దుడుకు తనము . అపరిపక్వత. ఒక్కొక్కసారి నిష్ఠురములు మాట్లాడి ఒక గుండిగ పాలకు ఒక చుక్క పులుపు పిండినట్లు చేస్తారు . నీటిలో రాయి విసరినట్లు అయి , సంసారము ఒక ఘడియ క్షుబ్ధమవుతుంది .  మరలా అంతా సరిపోతుంది . భగవతీ కౌశికి , " భగవానులు వారిని అన్నిటా సమర్థిస్తూ గోము చేస్తున్నందువలన అగు అనర్థమిది . తండ్రియై , ఇంటి యజమానులైన వారు ,  ఇలా తప్పు దారిన నడచినపుడు వీరిని ఒకసారైనా గద్దించవలెను కదా ? అది కూడా లేకపోతే ఎలాగు ? " అనుకుంటారు . అంతలోనే , " బహుశః  ఈ యాభై మందేనా బలి కావలసినవారు ? అందుకేనేమో భగవానులు వీరి విషయములో అంత  దయ చూపడము ? వారికి తెలియనిది నాకు తెలుస్తుందా ? " అని ఆత్మార్పణ చేసిన సతి తనలో తానే మాట్లాడుకొని మౌనము వహిస్తారు .  . 

     మధుఛ్చంద్రాది పంచాశులు సర్వ విధములా సద్గుణ సంపన్నులు . నైపుణ్యము గల చేయి మీటిన వీణానాదము వలె మధురమైనవారు . ఇంకొక విశేష గుణమేమనిన , మధుఛ్చంద్రుడు అంతర్ముఖి . మౌని కాకపోయినా , అతడు ఏకధాటిగా నాలుగు మాటలు ఆడినది ఎవరూ చూడలేదు . నియమము కాకపోయినా , పద్దతి మీరని స్వభావము కలవాడు . మిగిలిన వారంతా అతనినే అనుసరించువారు . అదేమిటో గానీ , పిల్లలందరి మధ్యా పరస్పర వైషమ్యములు లేకపోయినా , ఎంతో అన్యోన్యముగా ఉన్నా , నదీ సంగమము లో నదులు వేరుగా కనుపించునట్లు , వారు వారే , వీరు వీరే అన్నది బాగా ఎత్తి కనిపిస్తుంది . అదెలాగ అంటే చెప్పుటకు కష్టమైననూ , ఇదీ అని చెప్పుటకు వీలుకానంత స్పష్టముగా భేదము ఉంది . 

     హరిశ్చంద్రుడు భగవానుల ఆతిథ్యము వలన సుప్రీతుడైనాడు . మిత పరివారముతో వచ్చిన అతిథికి దివ్యమైన ఉపచారములన్నీ నడచినవి . పరివారము వారికి కూడా యథేఛ్చగా , యథా యోగ్యంగా సత్కారము లభించి , సర్వులూ సంతుష్టులైనారు . క్షత్రియులలో అనేకులు దుష్టులైననూ , ఇంతటి క్షత్రియులు కూడా ఉన్నారు కదా అని ఆశ్రమ వాసులకు బహు తృప్తి . 

     హరిశ్చంద్ర మహారాజు కూడా యథాయోగ్యముగా , భగవానులను మొదలుకొని , అందరికీ యథేఛ్చగా పూజాదులను సమర్పించినాడు . కుండెడు పాలనిచ్చు ఉత్తమమైన ఒక వేయి పాడిగోవుల కొమ్ములకూ , మూపురాలకూ బంగారు కలశ రేఖులను కట్టి , గిట్టలకు మంజులముగా మ్రోగు నూపురములను కట్టి , భగవానులకు సమర్పించినాడు . ఉత్తమాశ్వములతో మనోహరమై , సువర్ణ రత్న ఖచితమైన రథమునూ , దివ్య వస్త్రాభరణములనూ , భగవతీ కౌశికి పాదముల వద్ద కానుక గా అర్పించినాడు . బండి బండి నిండా ఉత్తమములైన కృష్ణాజినములు , ఉత్తరీయములు , స్వర్ణ రజత పాత్రాదులూ  , ఆశ్రమమునకై నింపి ఇచ్చినాడు . ఆశ్రమవాసులందరికీ , ప్రతి ఒక్కరికీ , వారి వారి ఇష్టాను సారముగా , చాలినన్ని సంభావనలు దొరికినాయి . అతిథి పరివారము వారు కూడా ఆశ్రమ వాసుల సత్కారములచేత తృప్తులైనారు . మహారాజు చేసిన ప్రదానముల చేత ఆశ్రమవాసులు కూడా తృప్తులైనారు . 

     అందరూ తృప్తి పడిననూ , ఆంధ్రకాదులైన మొదటి యాభై మంది పుత్రులకు లోపల లోపలే ఏదో శంక. " ఈ మహారాజు ఎందుకిలా ఈ ఆశ్రమములో ఇంతటి ఐశ్వర్యాన్ని వితరణ చేయుచున్నాడు ? ఏదో ఉంది . అతిథులు కాని మాకు ఇంతటి అర్థాన్ని ఇచ్చుట ఏదో అనర్థ హేతువని మా భావన . ఏదేమైననూ , జాగరూకతతో మెలగ వలసిన విషయము . " అనిపించింది . అయితే , దాన్ని ఎవరితో చెప్పవలెను ? 

     చూస్తుండగానే సాయంకాలమైనది . మహారాజు సంధ్యా విధులనన్నిటినీ ముగించుకుని , భగవానుల ఆజ్ఞను ప్రతీక్షిస్తూ కూర్చున్నాడు . వారు కూడా అన్నిటినీ ముగించుకుని , విశ్రాంతి గృహమునకు వచ్చి కూర్చుని  , మహారాజు కొరకై వర్తమానము పంపినారు . 

No comments:

Post a Comment