SHARE

Monday, July 16, 2012

44. " మంత్ర ద్రష్ట " నలభై నాలుగవ తరంగం



నలభై నాలుగవ తరంగం

     విశ్వామిత్రుడు విస్తుపోయాడు . గుహలో వేరెవరూ లేరు . వినిపించిన గొంతు లావుగా లేదు . సన్నగా ఉంది . ఎవరో పలికి ఉండాలి ? ఎవరు పలికి ఉంటారు ? బయటి నుంచీ మాట్లాడారనడానికి సాధ్యమే లేదు . బయటి నుంచీ మాట్లాడితే పెద్దగా మాట్లాడాలి. ఆ స్వరము మృదువుగా , అతి దగ్గర నుంచీ మాట్లాడినట్టుంది . అయితే అది మగ గొంతో ఆడ గొంతో చెప్పడానికి కూడా సాధ్యము కాదు . 

     విన్నదయితే నిజము  ... అది పలికినదెవరో తెలీదు . అలాగే ఆశ్చర్యం లో కొంత సేపుండి  చివరికి , తెలుసుకోవలసినదే అనిపించినది . ఎలాగ తెలుసుకోవడము ? 

     ధ్యానములో కూర్చున్నాడు . మరలా ప్రాణాన్ని అనుసంధానము చేశాడు . ప్రాణ దర్శనమైంది . యథావిధిగా ఆరాధించి , " దేవా , అనుమతినివ్వాలి , ఇలాగ అజ్ఞాతంగా మాట్లాడినది ఎవరు ? " అని ప్రార్థించుకున్నాడు . ప్రాణుడు పకపకా నవ్వి అన్నాడు , " ఈ మాత్రము తెలీదా ? కలలో నా తండ్రిని చూశావు . నా తండ్రి యొక్క విరాట్ స్వరూపమే జగన్నాథుని తేరు . దాన్నీ చూశావు . అది నీకు అర్థం కాలేదు . ఇదేమిటీ అని అడిగావు . నేనే నీకు బదులిచ్చాను . అయితే , తెలిసినవారు నన్ను సమిష్టిగా,  వ్యష్టిగా ఆరాధిస్తారు . సమిష్టి అయినపుడు నేను ప్రాణము . వ్యష్టి అయినపుడు ఐదు రూపాలతో ప్రతి దేహాన్నీ పట్టి ఉంటాను . ఆదాన , విసర్జన , శబ్దన , ధారణ, పోషణ అనే పంచ క్రియలను అహర్నిశలూ చేస్తూ స్థితి కర్త అయి ఉన్నది నేను . నా రూపాన్ని సమిష్టి లో చూశావు . కావాలంటే అడుగు , వ్యష్టి అయి కనిపిస్తాను . " 

     " దేవా , నీ అనుగ్రహమైతే ఆ వ్యష్టి రూపాన్ని చూపించు . దానికన్నా ముందు , నాకు కాలపురుషుని దర్శనము ఎందుకయింది అన్నది చెప్పు . " 

     " నువ్వు ప్రాణుడనయిన నన్ను చూశావు . నీ వృత్తి నాకన్న కొంచము వెనక్కు వెళ్ళి నా తండ్రిని గురించి భావనము చేసింది . అది వెళ్ళి అతనిని సంధించింది . అతని దర్శనమైంది . వృత్తి ఎందుకు అటు తిరిగింది అంటావేమో ? అది ఇప్పుడే వద్దు . అది దేవ రహస్యము . ఇది మాత్రము  చెపుతాను , తెలుసుకొని ఉండు , " వృత్తియే జీవితము . మనో వృత్తుల సముదాయమే మనస్సు . మనసును ప్రేరేపించువాడను నేను . నన్ను ప్రేరేపించువాడు కాలము . ఈ మాత్రము తెలుసుకొని ఉండు . , కాబట్టి , నా ప్రేరణ చేతనే నీకు కాలవృత్తి పుట్టింది . కాల వృత్తి వలననే నీకు కాల పురుషుని దర్శమయింది . నా ప్రేరణ చేతనే , ఇప్పుడు పలికినదెవరూ అని తెలుసుకోవాలను ప్రవృత్తి పుట్టినది . నీలో శబ్దనము లేదేమి ? అహోరాత్రాలు నీ చెవిలో సడి వినిపిస్తుండలేదా ? అదేమిటని ఏనాడైనా అడిగావా ? ఇదే దేవరహస్య మనునది . నువ్వు నన్ను చూచుటకు ముందే నేను నీ దేహములో లేనా ? నువ్వు గర్భములోనికి రాకముందే నీకోసము వచ్చి ఇక్కడ దేహాన్ని ఏర్పరచి నిన్ను తీసుకొచ్చిన వాడిని నేను . ఇలాగ ఈ దేహాన్ని ఏర్పరచి , నువ్వు ఉండు వరకూ దేహాన్ని కాపాడుకొని ఉండి , ఇక్కడి నుండీ వెళ్ళే కాలము వచ్చినపుడు నిన్ను వెంట తీసుకొని వెళ్ళే వాడనూ నేనే ! . అయితే , నువ్వెలాగైతే నన్ను ఇంతవరకూ ఎరుగవో , అలాగే జీవితాంతమూ తెలియని వారు ఎంతో మంది ఉన్నారు . సరే , ఇప్పుడు నువ్వు చూడాలన్నది ఎవరిని ? చెప్పు , నీకు ఎవరిని చూడలని కోరిక ? మేము ఐదుగురు సోదరులము . ఐదుగురినీ చూడాలంటావా ? " 

" ఔను దేవా , నేను ఐదుగురినీ చూడాలి " 

" ఇదిగో చూడు "

     విశ్వామిత్రుని ఎదురుగా ఐదు జ్వాలలు నిలుచున్నాయి . చూడటానికి పాముల్లాగా కనిపిస్తున్నాయి . అయినా , ధగ ధగ మని వెలుగుతున్నాయి . సౌమ్యముగా నున్న ఆ జ్వాలల దర్శనము చేత విశ్వామిత్రుని అంతః కరణము పరమ శాంతమై , శీతలమై , కుండలో తోడు పెట్టిన పెరుగు వలె నిశ్చలంగా ఉంది . మునీంద్రుడు వారందరికి సమిష్టిగా పూజ చేసి ," దేవా అనుజ్ఞ ఇవ్వు , ప్రత్యేకంగా పూజలు చేయాలనుకున్నాను . జ్యేష్టానుక్రమమును తెలియజేయి " అని ప్రార్థించాడు .

     ప్రాణుడు అన్నాడు , " ఇదిగో , ఇతడు వ్యాన దేవుడు . దేహాద్యంతమూ ఉండి , దాన్ని ధరించి ఉండు త్రివిక్రమ స్వరూపుడు ఇతడు . ఇతడు ఉండుట వలననే దేహములో ఉష్ణము నిలిచి ఉండుట. ఇతడు ఏ భాగాన్ని విడచునో ఆ భాగము హిమశీతలమై వ్యాపార శూన్యమగును . ...ఈతడు అపాన దేవుడు . దేహములో ఉన్న విసర్జన క్రియలన్నీ ఇతనివి . ఇతను తన వ్యాపారాన్ని ఒక్క ఘడియ నిలిపివేస్తే , వెంటనే మృత్యుపాశము వచ్చి పట్టుకొనును. ఇక ప్రాణుడ నయిన నేను మధ్యముడను . ఆదానమంతా నాది . నువ్వు ఊపిరి పీల్చునపుడు నిఃశ్వాసము అపాన దేవుడిది , ఉఛ్చ్వాసము నాది . యోగము వలన నన్ను ఆరాధించి , చంచలుడైన నన్ను నిశ్చలముగా చేసుకుంటే  మనో బల , బుద్ధి బల , దేహ బలములు హెచ్చును . నేను కుపితుడనగుటయే రోగము . ...ఇదిగో , ఇతడు ఉదాన దేవుడు . నీ దేహములో నడచు శబ్ద క్రియలన్నీ ఇతనివి . ఇతడే నీకు ’ జగన్నాథుడి తేరు ’ అని చెప్పినది . మా అందరి సుఖ దుఃఖాలను బయటికి చెప్పువాడే ఈతడు . ఇతడు అప్రసన్నుడైతే చెవులకు చెవుడు వస్తుంది . ఇంద్రియాలు దుర్బలములవుతాయి . ... ఇక్కడ చూడు , అందరికన్నా చిన్నవాడైనా వామనుడి వలె తేజస్వియై ఉన్న ఈ మహానుభావుడే సమాన దేవుడు . బయటి నుంచీ వచ్చిన ఏదీ కూడా విషమము కాకుండా అంతటినీ జీర్ణించుకొని దాన్నంతా అన్న రసముగా చేసి దేహములో ఎవరెవరికి ఏమేమి కావాలో అది మాత్రమే ఇస్తూ , అందరినీ కాపాడుతూ స్థితి కర్తయై ఉంటాడితడు .  ఈ మా ఐదుగురినీ సాక్షాత్కరించుకొని ,  దేహములో ఎల్లప్పుడూ అవిశ్రాంతముగా నడుస్తున్న సృష్టి స్థితి లయ వ్యాపారాలన్నీ మావి అని తెలిసికొని , భావన చేస్తూ ఉండుటయే పంచాగ్ని హోత్రము . ఇంకేమి కావాలో అడుగు . " 

     " దేవా , పరమానుగ్రహమయినది . ఈ పంచాగ్ని హోత్రము నాలో ఎల్లపుడూ నడుస్తూ ఉండునట్లుగా నాకు అనుగ్రహించు . ఇక అనుమతి అయితే నేను తమరందరికీ క్రమముగా పూజ ఒనరుస్తాను . తమరు అనుగ్రహించి స్వీకరించండి . " అని మరలా నమస్కారము చేశాడు . ప్రాణ పంచకము అతని పూజను స్వీకరించి , అతనిని అనుగ్రహించి అంతర్ధానమును పొందెను . 

1 comment:

  1. Thank u. yesternight i suffered from stomach ache due to indigestion. i decided to do lankhana. While lying on bed i was telling "jeernam jeernam vaataapi jeernam" Then suddenly i remembered this episode. and started saying involuntarily " OM praanaya nama: Om apaanaaya namaha , Om vyanaya namaha, Om udaanaya namah, Om samaanaya namaha " after all i am born in kausika sa gotra.. and often pray to viswamitra too to find a son-in-law for me. The stomach ache gone ! I am back to office.:-) - dhanyawaad for teaching a new thing.

    ReplyDelete