SHARE

Thursday, July 12, 2012

42. " మంత్ర ద్రష్ట " నలభై రెండవ తరంగము



నలభై రెండవ తరంగము

     విశ్వామిత్రునికి ఆశ్చర్యమైంది . అతడు ఇంతవరకూ కనిపించని చేయి గురించి ఆలోచిస్తుండలేదు . మేనకను కావాలంటే ఇంద్రుని అభిమానము సంపాదించుకుని , తాను జీవనపర్యంతమూ ఉంచుకొని ఉండవచ్చు . లేదా , తపోధనాన్ని ఇచ్చి ఆమెను కొనుక్కొని ఉండవచ్చు . అయినా తాను తూష్ణీ భావముతో ఆమెను వదలివేశాడు . అదీ , పక్వమైన పండును వదలి తన పాటికి తాను నిమ్మకు నీరెత్తినట్టున్న చెట్టు వలె ! ఇదంతా ఆ కనిపించని చేయి ప్రభావమా ? అదే తనను నడిపిస్తున్నదా ? అలాగయితే ఎందుకు నాకు ఇదివరకే తోచలేదు ? ఇదేనేమో , మదనుడు చెప్పిన అహంకారపు పెరుగుదల ? " అని ఏవేవో ఆలోచనలు . 

     ఆ ఆలోచనలలో ఎంతో సేపు గడచిపోయింది . పొద్దు నెత్తికెక్కి పడమటి వైపుకు దిగింది . పడమటికి ఉన్న నీడలు దిగంతానికి సాగిపోయాయి. విశ్వామిత్రుడు సుఖాసనములో కూర్చున్నాడు . వద్దకు వచ్చి చేరిన జింక తనను నిమిరి వీపుగోకాలని సైగ చేసింది . కొమ్ముతో గోక్కుని చూపించింది . అతడు నిశ్చలుడై కూర్చుండటం చూసి వెళ్ళిపోయింది . పక్షి ఒకటి వచ్చి ఏడుపునో , నవ్వునో చెప్పుకోవాలనో ఏమో , తొడపై కూర్చుని ముఖాన్ని చూచి కిచ కిచ మంది . శిలా ప్రతిమలా ఉన్న అతని ముఖములో తనకు సరియైన సమాధానము దొరకదనో ఏమో , కాసేపు ఉండి , సరియైన ఉపచారము దొరకలేదని కోపము తెచ్చుకుని వెళ్ళిపోవు అతిథి వలె లేచి ఎగిరిపోయింది .  

     " ఔను , ఈ కనిపించని చేతిని చూడాలి . ఇక మీదట అదే తన తపస్సు యొక్క లక్ష్యము . దేవతలను చూడటమయింది , దేవతలు ఇచ్చు భాగ్యపు పరమావధి ఏమిటో అదీ చూచాడు . ఇంక కావలసినదేమి ?  కనపడని చేతిని చూచుటొకటే పని . దాని కోసమై మరలా హిమాలయ పర్వత సానువులలో నదీ  కొండా ఉన్న చోట ఏదైనా గుహలో ఉండిపోవాలి . " 

     అంతలోపల బహిర్ముఖుడయ్యాడు . మరలా శిశువు ఆలోచన వచ్చింది . ’ ఈ పాపకు అన్నపానాల యోచన లేకున్నా , ఉపచారాలు కావాలి . ఆ ఉపచారాలకు నేను నిలిస్తే నా తపస్సు సాగదు . ఏమి చేయుట ? మేనక నాకు అప్పజెప్పినట్లే , నేను కూడా ఇంకొకరికి అప్పజెప్పి ఎందుకు పోరాదు ? " 

     " ఔను , ఇదే మాలినీ తీరములో ఎన్నో ఆశ్రమాలున్నాయి . అక్కడ ఉన్న మహర్షులలో ఎవరైనా ఒకరికి ఒప్పజెప్పాలి . అయితే ఎవరికి ఒప్పజెప్పాలి ? కాశ్యపుల ఆశ్రమములో క్షత్రియ కుమారులు ఉంటారు . అది వద్దు . ఆత్రేయుల ఆశ్రమములో అవధూత సంప్రదాయము . వారు జాతిని గౌరవించరు . ఇక మారీచులు తపస్వులే అయినా కట్టుబాట్లు లేనివారు . జాబాలి వారు  నాస్తికులు . ఇక చివరిది ఆ కణ్వులది . వారు బ్రహ్మచారులు . అయినా వర్ణాశ్రమ ధర్మములో శ్రద్ధ ఉన్నవారు . వారు అధిభూతానికన్నా ఆధ్యాత్మాన్ని అవలంబించినవారు . అక్కడుండనీ . అదే సరియైన ప్రదేశము . అదీకాక, ఆ తపోవనము ,  నగరాల బాధలకు లోనుకానంత దూరంగా ఉంది . కణ్వ  మహర్షి కూడా నాకు కావలసినవాడు . త్రిశంకువు యాగానికి అందరికన్నా ముందుగా ఒప్పుకుని వచ్చినవాడు . 

     ఈ వేళకు సాయంకాలమైంది . మేనక ఉన్నపుడు పూట పూటకూ సరియైన అన్నపానాలను అడుగుతున్న దేహము ఇప్పుడు తనకు ఆకలయిందని , దాహమయిందని కూడా చెప్పదు . కారణమేమని ఆలోచిస్తే అర్థమైంది, అప్పుడు ఆ భోగిని సాన్నిధ్యము వలన దేహము కూడా భోగాన్ని కోరుతుండినది . అడిగితే తన ప్రార్థన వమ్ముకాదని తెలిసి అడుగుతుండినది . ఇప్పుడు ఆ భోగిని సన్నిధి తప్పింది . మహర్షి మనసు తపస్సుకు అభిముఖమైంది. ఇక నన్ను వినే వారెవరు ? తన ప్రార్థన వమ్ము కాక మరేమవుతుంది ? అని ఊరకుంది . అదీ కాక  , మునీంద్రుని ఇఛ్చా శక్తితో  పాప కోసము విజృంభించినదై అక్కడ సోమశక్తి యై ప్రవేశించి  , ఆ పాపకు ఆహారమైన ప్రాణము , తన ఆహారాన్ని తానే మోసుకుని పుట్టిన మొలక లాగా , తన ఆహారాన్ని అక్కడే చూసుకుంది . మునీంద్రుడు ఇప్పుడు ,  ఆకలి లేకున్నా  జ్వలిస్తున్న హవ్యవాహనుడి వలె వెలుగుతున్న   ప్రాణము ,  తనలోని ఒక భాగాన్నే తిని , సౌమ్యముగా వెలుగుతున్నది చూసి ఆశ్చర్యపడుతాడు . 

     ఆ ఆశ్చర్యములో ప్రాణార్చిని చూసి  అక్కడే ఒక చిన్న పూజ చేసి , " ఈ నీ రహస్యాన్ని నాకు చూపించు , ఉపకారము చేయి , కాపాడు " అని ప్రార్థిస్తాడు . 

     ప్రాణాగ్ని అభిముఖమైంది .: " మునీంద్రా , నేను పగలూ రేయీ నీలో ఉన్నాను . నువ్వు ఇంతవరకూ నన్ను చూడలేదు. నువ్వు భుజించిన  భోజనాన్ని భుజించి , నువ్వు త్రావిన పానీయాలనన్నిటినీ త్రావి , నువ్వు పొందిన భోగముల నన్నిటినీ పొంది నీ లోపల కూర్చున్న నన్ను నువ్వు ఈ రోజు చూచినది , నీకు దేవతల అనుగ్రహ ఫలము . మేనక నీదగ్గర ఉండిన దాని ఫలముగా , దేవత సంపర్కము వలన , నువ్వూ దేవతవైనావు . నీ దేహమిప్పుడు మానవ దేహమైననూ నువ్వు దేవతవై ఉన్నావు . అందువలననే నేను నీకు దర్శనమిచ్చాను . నేను నీకు ప్రసన్నమైనానని , నేను ఈ రోజు నీకు దర్శనమిస్తానని , తెలుసు కాబట్టి దేహము నీతో మాట్లాడింది . మేనకను విడిచి పెట్టావు కాబట్టే నేను నీకు దర్శనమిచ్చాను . అయితే నేనే అంతిమ లక్ష్యము అనుకోకు . అన్నమూ నేనే , అన్నాదుడనూ నేనే !  అయితే ఈ నా వెనక ఉన్నది ఎవరో , అది చూడు . నీ మీది అభిమానముతో చెప్పాను . నువ్వు భూసురుడవయ్యావు . ఇప్పుడు నేను చెప్పింది నీ మీది అభిమానముతో  అన్నది మరవకు .  ఆ నాడు వసంతుడి తో వచ్చి ,  పంచ బాణుడు  చెప్పింది అదే . "

విశ్వామిత్రుడు , " భూసురుడైతే బ్రాహ్మణుడయినట్టే కదా ! " అనుకున్నాడు . 

     " పిచ్చి వాడా ! బ్రాహ్మణ్యమంటే అంత సులభమా ?  భూసురుడగుటలో ఏముంది గొప్ప ? నన్ను చూసిన వారందరూ భూసురులు అవుతారు . నన్ను కావాలన్న వారెవరైనా చూడవచ్చు . నీ ప్రశ్నకు సమాధానము నన్ను అడగవద్దు . నువ్వే వెతుక్కో " . విశ్వామిత్రునికి కూడా ఇక ఏమీ మాట్లాడాలనిపించలేదు . 

     ఆ వేళకు సాయంత్రమవుతున్నది . విశ్వామిత్రుడు పాపను తీసుకుని వెళ్ళి కణ్వుని ఆశ్రమములో అప్పజెప్పాడు . వారు , " ఔనౌను , ఈ పాప మాకు కావలసి ఉంది . " అని విశ్వాసముతో విశ్వామిత్ర పుత్రికను తమ దత్త పుత్రికగా స్వీకరించారు . త్రికాలజ్ఞులైన వారు కూడా , విశ్వామిత్రుడు బ్రాహ్మణుడయ్యాడా అన్న ప్రశ్నకు ఉత్తరమివ్వలేదు . అతడు కూడా వారిని బలవంత పెట్టలేదు . 

No comments:

Post a Comment