SHARE

Friday, July 13, 2012

43. " మంత్ర ద్రష్ట " నలభై మూడవ తరంగము



నలభై మూడవ తరంగము

     విశ్వామిత్రుడు మరలా హిమాలయానికి వెళ్ళాడు . భగీరథుని తపస్సు లోక సంరక్షణార్థమై కిందికి దిగుతున్నదా అన్నట్టు కిందికి దిగుతున్న భాగీరథి యొక్క తుంపురులతో పవిత్రమై , దేవదారు చెట్ల సువాసనతో మనోహరమై , నిర్జనమై , ఏకాంతంగా ఉన్న ఒక గుహలో తపస్సుకు కూర్చున్నాడు . తపస్సు ఆరంభించుటకు ముందే ఒకసారి వెళ్ళి వామదేవుని చూసి రావాలను కోరిక . అందునా  , ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి రావడానికైనా ఆటంకము లేదు. ఆకాశగమనమును మేనక నేర్పించింది . అనుకుంటే వెళ్ళి రావచ్చు . కానీ ఇంకా వెళ్ళాలని అనిపించ లేదు . 

     మనసు అప్పుడప్పుడు మేనకను తలుస్తుంది . జరిగిపోయిన దేనికీ పశ్చాత్తాప పడునట్లు లేదు  . పడనవసరము లేదు . అయితే , ’ ఆమె ఉండి ఉంటే ప్రాణాగ్ని దేవుడి సందర్శనము అయ్యేది కాదు . కాబట్టి ఆమె వెళ్ళిపోయినదే మంచిదైంది . కానీ ఆమె ఉన్నపుడు ఇంద్రుని అప్పు తీర్చే ఆలోచన చేసిఉంటే బాగుండేది . అది కాలేదు ’ 

     ఇప్పటికైనా ఏదో ఒకటి చేసి ఆ అప్పు తీర్చి ఆ తరువాత నిశ్చింతగా ఏల తపస్సు చేసుకోరాదు ? అంటే , ఇంకొక కన్యను వెదకి , పెళ్ళాడి , ఆమెతో యాభై మంది పిల్లల్ని కని వారిని బలి ఇవ్వాలి . అది సామాన్యమైన పని కాదు . పిల్లలంటే తల్లి , తండ్రి ఇద్దరికీ చెందినవారు . తల్లి అనుమతి లేనిదే ఆమె కన్న పిల్లల్ని బలి ఇచ్చేదెలా ? 

     అదే ఆలోచన బలమైంది . ఆలోచన అపారంగా శిరోభారము తెచ్చేలా బలమైనపుడు , ’ ఛీ , నేను చింతించి ప్రయోజనము లేదు , కనిపించని చేయి ఉంది కదా ! దానికి కావలసినప్పుడే తానే అన్నీ చేస్తుంది  ’ అని ఆ ఆలోచనని మరలుస్తాడు . చెరువునీటి పైన పాచిని చేత్తో తొలగిస్తే వెనక్కు పోయినా మరలా తిరిగివచ్చి అలముకున్నట్లే , అతడు బహిర్ముఖుడైతే చాలని ఆ ఆలోచన కాచుకుని ఉండి , మామిడి పళ్ళ కాలంలో చీకటీగ లాగా వచ్చి  ముసురుకుంటుంది . 

     ఇప్పుడు అతని తపస్సూ గంభీరమైంది . వెనకటిలాగా ఇప్పుడతడు పొట్టనింపుటకు దుంపలకోసము వెదకుతూ వెళ్ళడు . ఆకలైతే , దాహమైతే , ప్రాణ ధ్యానము చేసి  అనుసంధానము చేసి ఆ క్షుత్పిపాసలను కట్టివేస్తాడు . మరలా గంగా తీరానికి వెళ్ళినపుడు నీరు తీసుకుని అభిమంత్రించి తాగితే అది ప్రాణానికి అన్నమై , పానమై తర్పణము చేస్తుంది . 

     అతడి తపస్సు ఇప్పుడు ధ్యాన యోగము . వెనకటిలా మంత్ర యోగము కాదు . అప్పటిలాగా దేవ సాక్షాత్కారము కావాలను కోరిక లేదు . నిత్య కర్మయైన బ్రహ్మ యజ్ఞాన్ని చేస్తాడు . సూర్య దర్శనమైన రోజు వెళ్ళి స్నానము చేసి వస్తాడు . మిగిలిన సమయములో , దేహములో పని చేస్తున్నదేది ? ఎందుకు చేస్తున్నది ? అని ధ్యానము చేసి చూస్తాడు . మనస్సు ఏదైనా ఒకదానిని కోరుకుంటే , వద్దు , కూడదు అనకుండా , ’ నీవెందుకు ఇలా కోరుతున్నావు ? ’ అని దాని వెనక తొంగి చూచుటకు ప్రయత్నిస్తాడు . మనసు అతనితో దాగుడు మూతలాడు దానివలె , కాసేపు మూగదై , ఇంకొక ఘడియలోనే ప్రకటమై అడవిలోని సెలయేరు వలె అక్కడ కొంచము , ఇక్కడ కొంచము కనిపిస్తుంది . మనో వృత్తి గోచరమైందా ? చేతికి చిక్కిందా ? అదెందుకలా ప్రవర్తిస్తుంది ? అని దాన్ని పట్టి , దాని పుట్టు పూర్వోత్తరాలు విచారించు పనిలో మునుగుతాడు . 

     అప్పు తీర్చు ఆలోచనకు తోడు బ్రాహ్మణ్యపు ఆలోచన . " స్వర్గ సౌఖ్యాలు అనుభవించాను , ప్రాణ దర్శనము చేసి భూసురుడనయ్యాను . కానీ బ్రాహ్మణుడనయ్యానో లేదో ఇంకా తెలీదు కదా ! అదెలా తెలుసుకోవడము ? ఒకవేళ తెలియకపోతే కలుగు నష్టమేమి ? ఎప్పుడు కావాలో అప్పుడే అవుతాను . ఇకపై నేను దానికోసము ఆరాట పడను . ప్రాణ దర్శనము లాగే ఏదో ఒక దినము ఆ బ్రాహ్మణ్యము కూడా ఎదురుగా వచ్చి నిలుస్తుంది . ఇప్పుడు తపస్సు గురించి తప్ప ఇంకోటి ఆలోచించరాదు . ఈ మనసు ,  చేస్తున్న పనిని చేయనీకుండా ఉండేందుకు ఒక నెపమును వెతుకుతుంది . భూతకాలానికో  , భవిష్యత్ కాలానికో వెళ్ళి , వర్తమానాన్ని మరపిస్తుంది . దీన్ని ఇలాగే వదలరాదు . ముందున్న దానిపై లగ్నము కాకుండా , భూత భవిష్యత్తులను విభాగిస్తూ  , వర్తమానాన్ని వదలే ఈ మనసును కట్టి ఉంచాలి . ఇప్పుడు కూర్చున్నది తపస్సుకు కాబట్టి దానిలో నిమగ్నము కావాలి . కానీ ఏదో ఒక కనిపించని ప్రవాహము , ఈడ్చుకొని , లాగుకొని వెళ్ళుతున్నది . నేను వద్దన్నా నన్ను సాన ఱాతికి తగిలిస్తున్నది . సాన ఱాయి కూడా నా కష్ట నష్టాలను గమనించకుండా రుద్దుతున్నది . రుద్దనీ ! నేను ఒక క్రియ అయ్యాక తెలుసుకోగలనే కానీ దానికి ముందే తెలుసుకోలేను కదా ! ’

     ’ ఛా .. ఛా  ఆపాలి . ఇప్పుడే కదా భవిష్యపు చింతన వద్దన్నాను , మరలా దానికే వెళుతున్నాను . వర్తమానములో ఉండుటకు సాధ్యము కాదా ? ఎలా సాధ్యము ? వర్తమాన క్షణమే లేదు . రాబోవు దాన్ని గడచిపోయినది మింగివేస్తున్నది . పైనుంచి ప్రవహించి వచ్చిన నీరు కిందికి ఉరుకుతున్నది . ఆ ఉరుకుటకు సుడులు తిరుగుతూ సిద్ధమయ్యేది ఒక వైపు , ఉరికి దుమికేది ఇంకో వైపు . ఈ పక్క నుంచీ చూస్తే ఉరుకుతున్న నీరు . ఆ పక్కనుండీ చూస్తే దుమికి ఉన్న నీరు . ఈ మధ్యలో దుముకుతున్న నీరు ఏది అంటే ఎలా చెప్పేది ? ’ 

     అలాగయితే జీవితములో వర్తమాన క్షణమే లేదా ? భూతకాలపు చివరి కొనయే  , భవిష్యపు ప్రారంభము , ఇవి రెండూ చేరి అయ్యే రెప్పపాటు కాలమే వర్తమానము .  అకటా ! ఈ వర్తమానములో బ్రతుకుట ఎలా ? భూతకాలములో చేరుతున్న క్షణాన్ని భవిష్యత్తు నుండీ లాక్కొని , దానికి వర్తమానమని పేరు పెట్టి కలలు కంటున్నాము, కాదా ? ఇది నిజం కాదా ? " 

     విశ్వామిత్రునికి ఇటువంటి ఆలోచనలు కొత్త కాదు . ఎన్నో సార్లు రోజంతా ఇలాగే ఆలోచనలు చేస్తూ కూర్చున్న దినాలున్నాయి . అయితే ఇప్పుడు వర్తమాన క్షణము లేదు అని అర్థమై భయంకరంగా అనిపిస్తున్నది . ఏదో తన సర్వస్వమూ పోయినట్టైంది . భయంకరమైన ప్రవాహములో తాను నిలుచుటకు  చాలా కష్టపడి పట్టుకున్న ఒక బండ చేజారి , ముందుకు కొట్టుకొని పోవుటకు  సిద్ధమై సర్వ నాశనమైనట్లు గాబరా పడు వాడివలె , అన్యమనస్కంగా నడుస్తూ తెలీకుండానే జారి పడిపోయిన వాడిలాగా అనిపించి ఆయాస పడుతున్నాడు . కళ్ళు తెరచి ఉంచుటకు కూడా చేత గానట్టు , కాలూ చేయీ ఆడక , అలాగే గుహ గోడకు ఒరిగిపోయాడు . ఓడిపోయిన ఇంద్రియాలు విశ్రాంతిని కోరి , జీవుడికి ఒక కలను కల్పించి ఇచ్చి , ఆటాడడానికి ఏదైనా ఇచ్చి బిడ్డను వదలి  పరుగెత్తు తల్లి వలె ఎక్కడికో పారిపోయి దాక్కున్నాయి . విశ్వామిత్రుని జాగృతావస్థ సడలి , మగత లోకి వెళ్ళి  , కలలోకి జారింది . 

     కలలో మహా భయంకర రూపుడైన ఒక పురుషుడు కనిపించాడు . ఆకాశానికీ భూమికీ తగులుతున్నట్టు నిలబడ్డ ఆ మహా పురుషుడి ఆకారము భయంకరంగా ఉన్నా , అతడు మాత్రము సౌమ్యంగానే , ప్రఫుల్ల వదనుడై , స్మిత సుందరుడై , ప్రసన్నుడై ఉన్నాడు . విశ్వామిత్రుడు అపూర్వంగా కనిపించు ఆ మహా పురుషుని సమీపించి , యథోచితముగా సత్కారము చేసి , ’ నువ్వు ఎవరు ? ’ అని అడుగుతాడు . అతడు నవ్వి , ’ నన్ను చూశావా ? అసలు ఎవరికైనా నేను తెలిసి ఉంటే కదా నువ్వు నన్ను చూచి ఉండుటకు ? కాబట్టి నేనే నా పరిచయాన్ని చేస్తాను , విను . నువ్వు ఇంతసేపూ ఎవరిని గురించి ఆలోచిస్తున్నావో , ఆ కాలమే నేను . చూడు , ఇక్కడ పైరును పెంచుతాను , అక్కడ పెరిగిన పైరును భక్షిస్తాను . ఇలాగే రేపటి అన్నాన్ని పెంచుతూ , పెరిగిన అన్నాన్ని భక్షిస్తూ ఉండుటే నా పని . ’ అంటాడు. 

      విశ్వామిత్రుడు పర్వతము ముందర ఒక చిన్న చెకుముకి రాయి నిలబడి మాట్లాడినట్టు అతడిని మాట్లాడించాడు , " అన్నమూ , అన్నాదుడూ తానే అని ప్రాణుడు చెప్పినాడు కదా  " అంటాడు . కాల పురుషుడు దిక్కులు పిక్కటిల్లేలా  , పర్వతాలు పగులునట్లు నవ్వుతూ , "  ’ ఆత్మా వై పుత్ర నామాసి ’--- ప్రాణుడు నా కొడుకే . వాడు ముందుగా పుట్టిన అన్నము . వాడినే నేను చివరగా తినబోయేది " అంటాడు .

     విశ్వామిత్రునికి ఎందుకో భయమనిపిస్తుంది . నా గతి ఏమిటి అని అడగాలి . అంతలోపలే మాట అక్కడికే నిలిచిపోతుంది . కాల పురుషుడు ఎర్రబడినా కూడా సుందరమైన తన కన్నులతో చంద్రికలాగా మనోహరమైన వీక్షణాలను ప్రసరిస్తూ  ," విశ్వామిత్రా , ఉన్నదంతా ఒకటే ఒకటి . అది అప్పుడు , ఇప్పుడు అనునది లేనేలేదు . ఇప్పుడు అంటే దానికి రెండు కొనలు , ముందర , వెనుక. కాదా , చూడు " అంటాడు . 

     అపారమైన జన సమూహపు ఒక దృశ్యము . పర్వతము వంటి ఒక తేరు . జనాలు దానిని లాగుతున్నారు . వారి సంభ్రమము , సంతోషమూ అంతా , ఇంతా అని చెప్పుటకు సాధ్యము కాదు . వారు భూభారమంతటి  ఆ రథాన్ని లాగుతున్నారు . అది ముందు ముందుకు వస్తున్నట్టల్లా , దానిని లాగే వారే దాని కిందపడి చచ్చిపోతున్నారు . చచ్చినవారిని పట్టించుకోకుండానే జనాలు ముందుకు లాగుతూనే ఉన్నారు . 

     విశ్వామిత్రుడు ఆ మరణాలను చూడలేక కళ్ళు మూసుకోవాలనుకుంటాడు . కళ్ళు ఇంకా విశాలంగా తెరుచుకుంటాయి . రథము నేరుగా కంటిలోపలికే వస్తుంది . హా..హా.. అనుకొనే లోపలే కళ్ళ నుండీ దిగి ఎద లోపలికి వస్తుంది . ఆ భారాన్ని తట్టుకోలేక గాబరా పడి  , విశ్వామిత్రుడు పెద్దగా అరుస్తూ మేలుకుంటాడు . అతని అరుపు ఆ గవి అంతా నిండి దాని  ప్రతిధ్వని తనను ముంచెత్తేలోపల తానూ కళ్ళు తెరిచాడు . అతనికి ఇంకా తేరు కళ్ళలో  కూర్చున్నట్టే ఉంది . ఎదలో ఏదో భారంగా ఉంది . ఇంకా గాబరా అలాగే ఉన్నట్టుంది . 

     పూర్తిగా మెలకువ అయినా కూడా ఇంకా స్వప్నపు భావము అలాగే ఉంది . తేరు , జనాలు , మరణాలు , మరచిపోయేలా లేవు . ఇది ఏమిటి అని ఆలోచిస్తుండగా, ఎవరో ఉత్తరమిచ్చినట్టైంది , " ఇదే జగన్నాథుడి తేరు " 

No comments:

Post a Comment