SHARE

Monday, July 9, 2012

39. " మంత్ర ద్రష్ట " ముప్పై తొమ్మిదవ తరంగము



ముప్పై  తొమ్మిదవ తరంగము


     పగలు గడచి  రాత్రి యై , రేయి పగలు రెండూ గడచి వారమై , వారాలు గడచి పక్షమై , శుక్ల , కృష్ణ పక్షాలు ఒకదాని వెనుక ఒకటి పరుగెత్తి మాసాలై , ఋతువులై , ఆయనాలై  వర్షము పూర్తి కావస్తూ వచ్చింది . లేదా , పూర్తయ్యింది . ఇంకొక్క రోజైతే వర్షము ముగుస్తుంది . దేవతలు ఇచ్చిన గడువు ముగుస్తుంది . 


     ఈ రోజు పున్నమి . సంధ్య సమీపిస్తున్నదని పొడవగుతున్న నీడలు చెబుతున్నాయి . చెడ్డవాళ్ళు మంచి వాళ్ళైనపుడు జనులకు ప్రియులైనట్లే , వడ దెబ్బ కొట్టు నట్లు తీక్ష్ణమైన సూర్య కిరణాలు తమ తీవ్రతను వదలి , జనప్రియమై , లోపల ఉన్నవారిని బయటికి పిలుస్తున్నాయి . ఆశ్రమములో మృగ , పక్ష్యాదులు మధ్యాహ్నపు ఆయాసమును మరచినాయా అన్నట్లు లేచి తిరుగుతున్నాయి . విశ్వామిత్రుడు పారిజాతపు మొదట్లో బండ పైన కూర్చొని ఆలోచిస్తున్నాడు . 


     ఎందుకో తెలీకున్నా , అతని మనసు ఆ రోజు మేనక పెళ్ళిరోజు మదనుడు ఆడిన మాటలు గుర్తొస్తున్నాయి , " అహంకారము పెరగాలని విచిత్ర భోగాలనూ , విచిత్రానుభవాలనూ దేవతలు సమకూరుస్తారు " ....  ’ అహంకారమును పెంచుటే నా కార్యము ’ ......’ అహంకారమును కొలుచుటకొక సాధనముంది ’ ...... 


     అతనికి అనిపించింది , " అట్లయితే నా అహంకారము పెరిగిందా ? మేనక దొరికిందని నా మనసుకు మోదమైనది నిజము . ఆమెను పగలూ రాత్రీ అని లేకుండ కోరుతున్నదీ నిజము. ఆమె లేకపోతే ఒక ఘడియ కూడా బతకలేననిపించినదీ నిజమే . ఆమె చెంతన ఉంటే మిగిలినవన్నీ మరచునదీ నిజమే . అయితే ఇదేనా అహంకారము ? భోగవస్తువును కోరి దానికై ఆరాట పడుటేనా అహంకారమంటే ? లేక , దానికన్నా భిన్నమైనది ఇంకేమైనా ఉంటుందా ? 


     ’ మేనా వచ్చుటకు ముందు అలంకారము చేసుకోవాలనే కోరిక లేదు . ఇప్పుడది తీవ్రముగా ఉంది . దానికి ముందు ఇంకొకరిని మెప్పించాలన్నది కనిపించేది కాదు . ఇప్పుడు అదీ ఎక్కువైంది . ఇలాగ బాహ్య వృత్తి అయినదే అహంకారమా ? ’ విశ్వామిత్రుడు ఇలాగ ఏకాంతములో కూర్చొని ఆలోచన చేసి చాలా రోజులైంది . సాయంకాలపు నీరెండలో ఏదో ఒక విచిత్రమైన శక్తి ఉన్నట్టూ , అది తన లోపలికి ప్రవేశించినట్టూ తెలుస్తున్నది .  తనను ఆవరించినట్టున్న  ఏవో కట్లు సడలిపోతున్నట్టు కనపడుతున్నది . ఉన్నదేదో జారి జారి పడిపోతున్నట్టుంది . మనసు, పోయేదానిని ఆపలేదు , వస్తున్నదానిని నిరాకరించలేదు . అసమర్థుడైన యజమానుడు ఇంటిలోని వారి చెలగాటాలను చూచినా నిరోధించలేక, ఊరికే ఉన్నట్టు మనసు ఊరికే ఉంది . 


     మేనక , ఎప్పటి లాగైనట్టయితే కౌశికుడి చెంత కూర్చొని గారాలు పోతుండాలి . రెండు మూడు దినముల నుండీ ఆమె వేరే అయింది . ఆ వ్యత్యాసము కూడా బాగా కనపడుతోంది . . నది సముద్రాన్ని చేరునపుడు తన నీటి పీడనమే ఎక్కువై ముందుకు ప్రవహించలేక నిలబడి పోయినట్లు మేనక ఇప్పుడు సగము ముభావముగా ఉంది . చెరువుకు గండి పడినపుడు నీరు కారి పారినట్లు ఆమె మోహము క్షీణిస్తున్నది . అగ్నిగర్భ ఐన శమీ చెట్టువలె తేజోధారిణియై తనలో తేజస్సునుంచిన వాని వైపుకు మనసు పరుగెడుతున్నా , దేహము మాత్రము ఆయాసపడి దూరంగా ఉండాలనుకుంటున్నది . ఆమె తన దేవతత్వాన్ని వహించి ఎందుకిలా అవుతున్నది అని చూడగలదు . కానీ దానికి కూడా ఆమెకు ఎందుకో విసుగు . బహుశః పక్వమైన పళ్ళున్న చెట్టు ఇలాగే ఆయాసపడుతుందేమో ? 


     మానవ ధర్మానుసారము గర్భధారణ చేసిన మేనకకు విశ్వామిత్రుడు ఉపచారము చేస్తాడు . అతని తపోబలము చేత సంపాదించిన ద్రవ్యములతో ఆమెకు ఉపచారములు జరుగుతున్నాయి . ఆశ్రమ వృక్షము క్షీరాన్ని స్రవిస్తుంది . ఇంకొకటి తేనెను ఇస్తుంది . మరొకటి అమృతము వలె రుచిగానున్న పళ్ళనిస్తుంది . దిన దినమూ పళ్ళు , పాలు ,తేనె. కావాలన్నపుడు కొన్ని చిలగడ దుంపలు . మొత్తానికి భోజన ఉపచారాలకు లోటేమీ లేదు . 


     రాత్రి అయింది . సుమారు ఒక ఝాము గడచింది . మేనకకు ప్రసవ వేదన ప్రారంభమయ్యింది . ఎంతైనా దేవత కదా ? ఆమె సఖులు వచ్చారు . యథా కాలములో సుఖ ప్రసవమయ్యింది . ఆ ఆయాసములో కన్ను మూసుకున్న దానిని సఖులు కావాలని ఏవో సవములు నాకించి , ఇంకొంత సేపు నిద్రపుచ్చారు . మేనకకు బిడ్డని తనకు చూపకుండా దాచిపెట్టమని చెప్పాలనిపించింది. ఇంకో రెండు రోజులు పతితో పాటు సుఖంగా ఉండి అనంతరము స్వర్గానికి వెళ్ళునపుడు బిడ్డను ఇచ్చి వదలి వెళ్ళాలని కోరిక. కానీ ఎందుకో ఆమాట ఆమె చెప్పలేదు, సఖులు స్వతంత్రించలేదు . 


     పాప ఏడ్చింది . మేనక నిద్రపోతే , మాతృభావము నిద్రపోతుందా ? ఆమెకు మెలకువ వచ్చింది . అపరంజి బొమ్మలా ఉన్న పాపను ఒడికి తీసుకుని యథోచితముగా ఉపచారము చేసింది . ఇంకొకసారి పతి ప్రణయ బింబమా అన్నట్లు ఒడిలో పాలు తాగుతూ పడుకున్న పాపను చూసింది . ఆమె మనసు మారిపోయింది . 


     మేనకకు తెలియకుండానే మానవధర్మము వదలిపోయింది . ఆ మానవ శిశువు తన శరీరాన్ని తాకుటను సహించలేక  ఆ శిశువును వెనక్కు పెట్టేసింది . ప్రసవపు ఆయాసము మాయమైంది . దేహములో ఎప్పటిలాగానే శక్తి వచ్చింది . ఆమెను అడక్కుండానే దేహము భూమిని వదలి పైకి లేచింది . కంఠాన్ని దివ్య కుసుమ మాల అలంకరించింది . వస్త్ర భూషణాలు అన్నీ మారిపోయాయి . 


     మేనకకు చుట్టుపట్ల ఉన్న పదార్థాలు , వస్తువులు , బిడ్డ   అన్నీ చూసి మరలా గత వైభవము అంతా జ్ఞాపకము వచ్చింది . అదంతా తలచి , సుఖ స్వప్నాన్ని స్మరించుకున్నదాని వలె తనలోనే చిన్నగా నవ్వుతూ లేచి నేలను ముట్టకుండా గాలిలో తేలుతూ వచ్చి విశ్వామిత్రుని ముందు నిలచింది . అప్పు తీర్చి కృతార్థురాలై చేతులు జోడించి వీడ్కొలుపు భావముతో , " మునీంద్రా , నేను స్వర్గానికి బయలుదేరవచ్చు కదా ? " అంది . 


     గొంతులో మునుపటి మోహావేశము లేదు . నిశ్చలమైన స్థైర్యముంది . అది ఎక్కడికో పోయిన మునీంద్రుని మనసును మంత్రము వలె ఆకర్షించింది . అతడు ఎప్పటిలా ఉన్ననూ , ఎందుకో ఆమెను ముందువలె భావించలేక , దూరపు బంధువును చూసినట్టు , కలలో ఉన్నవాడు కళ్ళు తెరచినట్టు , ’ ఆ ’ అన్నాడు . 


     మేనకకు దానిని చూచి మనసు మరగి పోయింది . దేవతలు తమ ఆటను బాగానే ఆడారు అన్నది చూచి , నవ్వుకుని ,  వెనకటి ప్రణయాన్ని కావాలని తెచ్చుకొని , ప్రయత్నపూర్వకంగా వద్ద చేరి , " దేవా , మేలుకో . నీ బిడ్డను తీసుకో . సమయము దగ్గర పడింది . నన్ను వీడ్కొలుపు. నీ అనుమతి లేక నేను పోలేను . " అని ఎలాగైతే ఉచితమో , అలాగ ఉపచారము చేసింది . 


     మునీంద్రునికి మెలకువ వచ్చింది . ఇంద్రియాలు తమ ప్రాణానికే ప్రాణమైనట్టిది వెళ్ళిపోవునని గాబరా పడి దుఃఖ మూర్తులై కరగలేక రోదించునట్లు గోల పెట్టాయి . అతడు దేహేంద్రియ మనో వృత్తులను అతి కష్టము మీద సంబాళించుకొని "  అలాగైతే వెళ్ళిపోవలసిందేనా ? "  అన్నాడు . ’ మేనా ’ అనుటకు పోయిన నోరు పలుకకుండానే నియమానికి కట్టుబడిన గోడ వలె నిలుచున్నది .  ఆమెకూ తెలిసింది . ఆమె , " దేవా! మన్నించు . మేము స్వతంత్రులము కాదు . నీకు అంతా తెలుసు . నేను వచ్చినపుడు నన్ను వద్దన్న ఆ గట్టితనముతోనే నన్నిపుడు సాగనంపు . నువ్వు నాకు ఇచ్చిన ప్రేమ తీపి గుర్తు నా హృదయములో ఎప్పుడూ ఉంటుంది . లే , ఇదిగో , ఆ బిడ్డ సంరక్షణ భారము వహించు . స్వర్గపు ఒక భోగము సాని వచ్చి నాదగ్గర స్వర్గాన్నే మరచి సుఖంగా ఉండినది అని గర్వ పడవలసిన వాడివి కదా ,  నువ్వు ? " అని తెలియజెప్పింది . మునీంద్రుని మనసు సమ్మతమై , తొలకరి వాన నీటి బొట్ల వలె రెండు పెద్ద కన్నీటి బొట్లు రాలినా , వివేకము అతనిలో సహజమైన స్థైర్యాన్ని మెరపింప జేసింది  . సంయమనముతో స్థిరంగా తలఊపి , ఆమె ఔపచారిక కానుకను నవ్వుతూ స్వీకరించి , " వెళ్ళునపుడు చెబుతానన్నావు కదా ? "  అన్నాడు . 


     మేనక నవ్వుతూ , " ప్రభూ , ఇప్పుడయినది ఆడ పిల్ల. అది పెరిగి యౌవనవతి అగువరకూ ఆగు . ఆమె ఎవరిని వరిస్తుంది అన్నది నీ ప్రశ్నకు సమాధానము . ఆమె క్షత్రియుడిని వరిస్తుందో , బ్రాహ్మణుడిని వరిస్తుందో  చూసుకో . నీ అల్లుడు క్షత్రియుడైతే నువ్వూ క్షత్రియుడవే . బ్రాహ్మణుడైతే నువ్వూ బ్రాహ్మణుడవే . " అంది .


     విశ్వామిత్రుడు ఇంకా ఏమో అడగాలని అనిపించుచున్ననూ , దాన్నంతా అలాగే సమ్మాళించుకుని , కేవలము సమతౌల్యము గల మునీంద్రులకు మాత్రమే సాధ్యమయిన మనోస్తిమితముతో మేనకను వీడ్కొలిపాడు . మేఘాలు లేని ఆకాశము వైపుకు నేలనుండీ ఒక మెరుపుతీగ ప్రసరించి ఆకాశపు నీలిమను చేరి మాయమైంది . అతడు తిరిగి చూచేటప్పటికి మాయమైన మెరుపు దిగంతాన్ని వ్యాపించినట్లు అరుణోదయపు బంగారు వర్ణము కనిపించింది . ఆశ్రమ వాసిని ఎక్కడా అని పక్షులన్నీ అడుగుతున్నట్టు కలకలా రావాలు చేశాయి . 


     విశ్వామిత్రుడు కావలసినది అయింది అన్న నిశ్చయముతో ఉన్నా , దేహపు ఏదో ఒక ప్రాణమే బయటికి పోయినట్టైంది . ఆ వేళలో తాను నిద్రలేచి స్నానాదులను ముగించి కర్తవ్య కర్మలను చేసి చాలా రోజులయిందని గుర్తొచ్చి నవ్వొచ్చింది . ఈరోజు ఇక ఏ అడ్డము లేదు, సూర్యోదయానికైనా స్నానము కానీ అని లేచాడు . పాప ఏడుపు వినిపించింది. నవ్వి , ఆ వేళకే లేచి తిరుగుతున్న నెమలి నొకదాన్ని పిలచి , " పాపను చూసుకో " అని చెప్పి నదికి వెళ్ళాడు .

No comments:

Post a Comment