SHARE

Tuesday, July 10, 2012

40. " మంత్ర ద్రష్ట " నలభైయవ తరంగము



నలభైయవ తరంగము

      శిశు పోషణకై ఇక్కడే ఉండాలా ? లేక మరలా తపస్సుకు పోవాలా ? అన్న ఆలోచన విశ్వామిత్రుడికి. " తపస్సు చేసి ఫలమేమి ? దేహము శుద్ధమైంది . పంచభూత శుద్ధి కూడా అయింది . ప్రాణ సాక్షాత్కారమైంది . ఇన్నైనాక దొరకని ఆ బ్రాహ్మణ్యము ఇక దొరికినా ఏమి ? ఇలాగే ఒక లక్ష్యము , గురి తెలీకుండా పోనీ . తపస్సు చేద్దామా అంటే ఈ దేవతల పీడ ఒకటి . మనకు తెలీకుండానే మన దేహములోనికి ప్రవేశించి , వ్యాపారము చేయునట్లైతే  మేము ,  తెలీకుండానే   నీరు నిండు  కుండ , బానల కన్న హీనమైనట్టే కదా ! తేనెటీగలు కూడబెట్టిన తేనెను ఎవరో ఎత్తుకొని పోయినట్లే , నేను చేసి ఉంచుకున్న తపస్సునంతా స్వర్గాన్నిచ్చే నెపముతో ఈ దేవతలు కాజేసుకొని పోతే నేను తపస్సు చేసి ఫలమేమి ? " అని అతడు దీర్ఘముగా ఆలోచిస్తాడు . 

     " ఒకవేళ తపస్సు వద్దనుకుందాం , ఇక ఏమి చేయాలి ? మరలా రాజ్యము కట్టుకోవాలా ? లేదా ఆశ్రమమును కట్టుకొని , పాఠ ప్రవచనాలు చెప్పుకుంటూ ఏదో ఒకలా పడిఉండాలా ? ఊహూ .. కూడదు . అది లక్ష్యము లేని జీవనము . ఆ గుడ్డి బ్రతుకు కన్నా ఈ దేహాన్ని ఇక్కడే వదలి లోకాంతరాలకు ఎందుకు పోరాదు ? అంతటి ఆశ ఉంటే ఇంద్రుని పిలిపించుకుని , ఇంకొక స్వర్గాన్ని పంపించమంటే సరి . కానీ కేవలము తింటూ కూర్చుని , భోగాలలో తేలితే సుఖమేముంది ? బ్రతుకంటే అదే అంటే , నా ఆశ్రమములోని మృగాలకూ నాకూ ఏమి వ్యత్యాసము ? " అని ఆలోచనా తరంగాలు అతన్ని చుట్టుముట్టి ఆక్రమించాయి .

     అతడు ఇలాగ ఆలోచనామగ్నుడై ఉండగా శిశువు మరలా ఏడ్చి తానున్నానని గుర్తు చేసింది . అతడు ధ్యానము చేసి  ప్రాణమయుడై తన బొటన వేలిని ఆ శిశువు నోటిలో ఉంచాడు . శిశువు చొర చొరామని పీల్చుకుని తృప్తి పడి అలాగే నిద్రపోయింది .***  1

     రెండు నెమళ్ళు వచ్చి తమ రెక్కలను విప్పి శిశువుకు వింజామరలు వీచినట్లు వీస్తున్నాయి . ఇంకొక మగ నెమలి తన పింఛము విప్పి  కప్పింది . 

     అతనికి అది చూచి ఆశ్చర్యమైంది . ’ బిడ్డని తల్లి వదలి వెళ్ళింది , తండ్రినైన నేను ఏమి చేయాలో ఇంకా తెలుసుకోలేదు . ఇటువంటప్పుడు ఈ పక్షులు శిశువుకు ఉపచారము చేస్తున్నాయి . వీటికి చెయ్యమని చెప్పిందెవరు ? ఔను , నేను మొన్నటి రోజు స్నానానికి వెళుతూ ఈ నెమలికి చెప్పి వెళ్ళాను . అందుకని ఇవి నా పని చేస్తున్నాయా ? నాకూ వీటికీ సంబంధమేమి ? వచ్చినపుడు వీటికి ఆదరముతో ఉపచారము చేయుటేగా ? దానికి ఇవి ఇంతటి ప్రత్యుపకారము చేస్తున్నాయా ? అలాగైతే దేవతలు అంతటి కృతఘ్నులా ?  వారికి మేము పగలూ రేయీ అనక హవిస్సులను ఇస్తున్ననూ వారెందుకు మాకు ఉపకారము చేయుట లేదు ? మా తపస్సుకు ఏల అపకారము చేస్తారు ? "

     ఇలాగ ఆ ఆలోచనలో ఉండగా వాకిట్లో " మామా ! " అన్న పిలుపు వినిపించింది . గొంతు ఘనంగా , గోడలను చీల్చుకు వచ్చునట్లు కఠినముగా ఉంది . జమదగ్ని కంఠము ఉన్నట్టే ఉన్నా , అది కాదు . వెంటనే గుర్తుకు రాకున్నా , విశ్వామిత్రుడు ఆదరముతో , ’ లోపలకు రావయ్యా ! ’ అన్నాడు .  ఆ వచ్చింది పరశురాముడు  . ఉక్కు తో చేసిన బొమ్మ నడచివస్తున్నదా అన్నట్లు వచ్చాడు . దేహము లోని అంగాంగమూ ఒక పర్వతమైతే ఆ మూర్తి ఎలా గంభీరంగా నడవాలో అలా నడచి వచ్చాడు . చేతిలో పట్టుకున్న గండ్ర గొడ్డలి మెరుపు చెట్టులాగా మెరుస్తున్నది . మూటగట్టిన నల్ల మేఘమా అన్నట్లు వచ్చి నమస్కారము చేశాడు . అక్కడనే కొన్ని దర్భలు వేసి , దానిపై కూర్చోబెట్టి మునీంద్రుడు కుశల ప్రశ్నలు వేశాడు . రాముడు , " మామా , అంతా సర్వ నాశనమై పోయింది " అని ప్రారంభించి , తనను పొడుచుకొస్తున్న దుఃఖాన్ని పక్కకు తోస్తూ , నిట్టూర్పుల జాప్యాన్ని దాటుతూ , తమ ఆశ్రమపు దయనీయమైన కథను చెప్పాడు . హైహయుల కార్తవీర్యుడు శబలను కోరినది , శబల వెళ్లకుండా మొరాయించినదీ , దానికి అతడు చెలరేగి , జమదగ్నిని చంపి ఆశ్రమమునంతా ధ్వంసము చేసినదీ , ఇంతైనా కూడా శబల దొరక్కుండా తప్పించుకుని స్వర్గానికి  వెళ్ళిపోయినదీ ,... అంతా ఆగి ఆగి చెప్పాడు . 

     అది విని విశ్వామిత్రుడు స్థాణువయ్యాడు. జమదగ్నిని తలచి దుఃఖమైంది . " ఎంత పని చేశారు ? నాకెందుకు తెలియ పరచలేదు ? జమదగ్ని దేహపు ముక్కలను అతికించి అగ్నిని ధ్యానము చేసి ఉంటే  అతడు ఆ ముక్కలను జోడించి ఇచ్చేవాడు . నేను కూడా ఇక్కడ ఏదో పని ఉండి సంవత్సరము నుండీ ఆవైపుకే రాలేకపోయాను . ఇంకా దేహముందా ? లేక సంస్కారము అయిపోయిందా ? " అని అడిగాడు . 

     " సంస్కారము అయిపోయింది . అయితే చితికి అగ్ని అంటించి , అది కాలుతుండగా ఒక తేజో మండలము పైకిలేచి , ఇంకో రెండు చిన్న తేజో మండలములు చూపించిన మార్గములో అన్నీ ఆకాశానికి వెళ్ళాయి . నేను వాటి వెన్నంటి పోతానన్నాను . మిగిలినవారు వదలలేదు   . అపర కర్మలన్నీ ముగిసి మూడు రోజులైంది . " 

" హు...."

     " ఇప్పుడు నిన్ను అడగాలని వచ్చాను . నాకు తండ్రిగారి పైన ఎంతటి అమోఘమైన ప్రేమ ఉండిందో నీకు తెలుసు . అంతటి తండ్రిని పోగొట్టుకొని ఊరక ఉండుటకు సాధ్యము కాదు . తండ్రిని చంపిన పాతకుని వదలుట కూడా సాధ్యము కాదు . అందుకే , వాడిపై యుద్ధము చేశాను . హైహయ కులమునే నిర్మూలించాను . అంతే కాదు , దుష్ట క్షత్రియులు ఎవరైనా కానీ , ఎక్కడైనా ఉండనీ వారిని ధ్వంసము చేస్తాను . ఇరవై ఒక్కసార్లు .  మామా ,  నా తండ్రి అర్చించుచున్న అగ్ని సప్తార్చి , త్రిరూపుడునూ  యై ఉన్నాడు కాబట్టి ఏడు మూళ్ళు ఇరవై ఒక్కసార్లు ఈ భూమండలమునంతా చుట్టి వస్తాను . కిరీట పతులైన వారి తలలు కోసి , మరుగుతున్న వేడి రక్తముతో పితృ తర్పణము చేస్తాను . బహుకాలముగా మాకూ హైహయులకూ ఉన్న ద్వేషము నాతలకు బాగా ఎక్కనీ . భూమి లో క్షత్రియ శేషము లేకుండా చేస్తాను . " 

     పరశురాముడి ఆవేశపు వేడికి ఆశ్రమము కాగి పోవునో అనిపించెను . నెమళ్ళు బెదిరాయి . పాప లేవకున్నా , అటూ ఇటూ పొర్లింది . విశ్వామిత్రుడు ఆ తేజో మూర్తి విజృంభణను మెచ్చుకొని , అలాగే లేచి , నాతో రా అని అగ్ని గృహపు వైపుకు నడిచాడు . పరశురాముడు వాకిటి వరకూ వచ్చి , " లేదు , మామా , ఇరవై ఒక్కసార్లు భూ ప్రదక్షిణ చేస్తాను . మకుట ధారుల కంఠ  రక్తముతో  ఎప్పుడు దొరికితే అప్పుడు పితృ తర్పణము చేస్తాను . ఒక్కొక్కసారి భూప్రదక్షిణమయ్యాక కురుక్షేత్రానికి వచ్చి తర్పణమిస్తాను . అలాగ ఇరవై ఒక్కసార్లు అగువరకూ నాకు పితృ సూతకము పోదు . అంతవరకూ నేను అగ్ని గృహాన్ని తాకను " అని బయటే నిలిచాడు . 
*** 1 --(  ఒకానొక కాలంలో మైసూరు ఈద్గా దగ్గర ’ దూధ్ పీర్ మకాన్ ’ అనే ఒక కట్టడము ఉండేది . అక్కడ ఒక పీర్ సమాధి ఉంది . ఆ పీర్ మహాశయుడు ముమ్మడి కృష్ణరాజ ఒడెయార్ కాలపు వాడు . తల్లి లేని పిల్లలను అతని దగ్గరకు తీసుకొని వెళితే అతడు తన బొటనవేలిని పిల్లల నోటిలో ఉంచేవాడు . బిడ్డ దానిని చీకి పొట్ట నిండి నిద్రపోయేది ) ... 

2 comments:

  1. నేను చేసి ఉంచుకున్న తపస్సునంతా స్వర్గాన్నిచ్చే నెపముతో ఈ దేవతలు కాజేసుకొని పోతే నేను తపస్సు చేసి ఫలమేమి ? " అని అతడు దీర్ఘముగా ఆలోచిస్తాడు .
    మనం జీవితమంతా సంపాదించిన డబ్బును , పాస్ పోర్ట్ , వీసా, యూనివెర్సిటీ ఫీజు అని పిల్లల అమెరికా చదువుల కొరకు వేచ్చిన్చేల అమెరికన్లు చేస్తున్నారు కదా !
    ks

    ReplyDelete
  2. హహ మనకు కావాలంటే ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి కదా . :)

    ReplyDelete