SHARE

Monday, July 2, 2012

33. " మంత్ర ద్రష్ట " ముప్పై మూడవ తరంగము



ముప్పై  మూడవ తరంగము

     సంసార చక్రమొకటి ఆరంభమైంది . దేవలోకపు ఆడది , మానవలోకపు మగవాడితో సంసారము చేయుట ఆరంభించింది . 

     ఆ విచిత్ర జీవనము వికసించిన పూవు వలె లోక విలక్షణమైన కామ ప్రపంచమైనది . మానవ స్త్రీలలాగా ఎందులోనూ మితము గా ఉండక , ఒక్కొక్కదానిలోనూ తాను అనంత సామర్థ్య సంపన్నురాలనని చాటుకుంటున్న స్త్రీ అన్ని విధాలా భర్త మనసును రంజింపజేయాలని ప్రయత్నిస్తున్నది . తన దారిలోనున్న బండను సర్వ ప్రకారములా ఆరాధించి తనదిగా చేసుకొనుటకు సర్వ ప్రయత్నామూ చేస్తున్న నది వలె , మేనక  విశ్వామిత్రుడిని తనవాడిని చేసుకొనుటకు ప్రయత్నాలు చేస్తున్నది . విశ్వామిత్రుడు ఆ స్త్రీసంగమము లో సర్వేంద్రియ సంతర్పణమున్నదని తెలిసినవాడైనా , ఆమెను చూసినపుడు ఎందుకో , ఏమో బెదురుతాడు . 

     ఆశ్రమములో రానురానూ కొంచకొంచంగా ఏదేదో మార్పు అవుతున్నది . చెట్లూ తీగలూ , పుట్టలు పొదలు కొత్తరూపాన్ని సంతరించుకున్నట్టున్నాయి . బొమ్మలతోనూ , రాళ్ళతోనూ మట్టితోనూ  ఆటలాడుతూ సంతోషము మూర్తీభవించిన ఆడపిల్లవలె ఉన్న ఆశ్రమపు స్థిరమైన భావము మారి , దేన్నో దాచిపెట్టుకొని , తన రహస్యమును ఇతరులెక్కడ తెలుసుకుంటారో అని తనలో తాను బెదురుతూ , తనకు కావలసిన ఇష్ట వస్తువు ఏదో తెలియకున్నా , ఇష్టవస్తువొకటి కావాలని ఆత్రంగా కాచుకున్న భావమొకటి వచ్చింది . 

     చెట్టును చూస్తే , తనలోనే గూడు కట్టుకున్న పక్షి తాను కాసిన పండునో పువ్వునో వెదకుతుంటే , ఇదెందుకు , నా రహస్యమును తెలుసుకొంటున్నది అంటున్నట్లుంది . ఆ చెట్టునాశ్రయించిన లతలు , గాలులు తనను పట్టుకొని కులుకులు చూపిస్తే , ఎవరైనా చూస్తారేమోనని బెదురుతో , ఇష్టమైనా కూడా , ఎందుకు భయపెడతావు ? అని ప్రియుడిని ఉరిమి చూసే కామిని వలె కనిపిస్తుంది . పక్షి జంట పండు కొరికి తింటూ , ఆడ , మగ పక్షులు కలసి మెలసి కులుకుతున్నా కూడా , ఏదో చెప్పలేని , చెప్పరానిది కావాలని ఒకదానినొకటి అడుగుతున్నట్టున్నాయి . ఇదివరకూ విరోధభావము కనపడకుండా సజీవమైన మట్టిబొమ్మలా అన్నట్టు సాధుస్వభావముతో ప్రవర్తిస్తున్న మృగాలు ఇప్పుడు , ఆడ మగ కలసి జంటలుగా తమకు ఒక ఏకాంత ప్రదేశము వెదుకుతూ , తమను ఎవరూ మాట్లాడించ కూడదని ముఖాలు గంటు పెట్టుకొని , విడిగా వెళ్ళు మనోభావాలను ప్రకటముగా చూపుతున్నాయి . ...అంతెందుకు , ? ఆశ్రమపు పక్కన ప్రవహిస్తున్న నది కూడా , వెనక్కుతిరిగి చూస్తూ హడావుడిగా వెళుతున్న స్త్రీ వలె కనిపిస్తున్నది . 

     విశ్వామిత్రునికి ఇప్పుడు ధ్యానము కుదురుట లేదు . ఈతరాని వాడు నీటిలో పడితే  , గాభరాతో నీరు మింగి , కన్ను మూసినా తెరచినా చుట్టుపక్కల నీరే చూస్తూ , తాను బయట పడగలనా అని కాళ్ళూ చేతులూ కదలిస్తున్నట్టు , కళ్ళుమూసి ధ్యానానికి కూర్చున్నా , కళ్ళు తెరచి బయటికి చూసినా ప్రతిచోటా ముద్దులు మూటకట్టినట్టున్న  లలన హొయలు చూపిస్తూ ఒక్కసారిగా చూపుల తుంపురులతో ముఖాన్ని కొట్టి వెళుతున్నట్టు భావన . మనసును ఏకాగ్రతతో ధ్యానములో లీనము చేద్దామంటే , చేజారి కిందపడ్డ పాదరసము పటాపంచలై అన్నివైపులకూ జారునట్లు , చేసిన ప్రయత్నము విఫలమై మనో గమనము నానాముఖములై ఎక్కడెక్కడ చూసినా దేవాంగనలనే చూస్తోంది . మనసును నిరోధించి , మరలా పట్టులోకి తెచ్చుకోవాలని ఎంత కుదురుగా కూర్చున్నా , ఆ మనసు అంతే సులభముగా తప్పించుకుని వెళ్ళి వెళ్ళి మేనక ఒడిలోకి చేరుతున్నది . ఇంత కష్టపడి చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయినా విశ్వామిత్రుని కెందుకో కోపము రాదు . దీక్షగా ధ్యానానికి కూర్చోవాలన్న పట్టుదల పుట్టనే పుట్టదు . కానీ , ఒక ఆలోచన మాత్రము అప్పుడప్పుడు వస్తుంది . " ఈ దేవతలు మన కన్నా సమర్థులు . సృష్టిలో మనకన్నా ఒక మెట్టు పైనున్నవారు . మనకు తెలీని ఎన్నో విషయాలు వారికి సహజముగానే తెలిసుంటాయి . అవన్నీ తెలుసుకోవాలి ." అని ఒక చిన్న ఆలోచన మేఘ గర్భములో అవ్యక్తముగా తిరుగు మెరుపు వలె , ఒక్కొక్కసారి మెరసి మాయమగుతున్నది .

     మేనక ఇప్పుడు ఆశ్రమపు రాణి . ఆమె అమృతపానము చేసినట్టిది . ఆమెకు భోజన పానీయాలు అవసరము లేవు . ప్రాణారాధన తత్పరుడైన మునికి భోజనము కావాలంటే కావాలి , వద్దంటే వద్దు ..అయినా , మేనక మానవ స్త్రీ లాగా వ్యవహరిస్తున్నది . సంకల్ప మాత్రముననే భోజనమును సృష్టించ గలదైననూ , ప్రయత్న పూర్వకముగా వంట చేస్తుంది . విశ్వామిత్రునికి అది ఒక చోద్యము . స్వర్గలోకములో దేవేంద్రుడు మెచ్చిన వార వధువుగా  ఉన్నది , ఇప్పుడు తానుగా వంట చేయుటకు పొయ్యి ఊది , కళ్ళు ఎర్రబడగా , పెదాలు తడారిపోయి , బడలిపోయి , అలాగే  ఇంటిపనికి అలవాటు అయినది చూసి , " ఈమెకీ వనవాసమేమిటి ? " అనిపిస్తుంది . ఎన్నోసార్లు అడ్డు నిలచి , " వద్దు , ఈ పని చాలించు " అంటే ,  సన్నగా తెరచుకున్న పెదాలతో , తెల్లటి పలువరస మెరుస్తుండగా ఒకసారి నవ్వి , " ఒంటికి కష్టమైనా మనసుకు హాయినిచ్చే పని ఇది  " అంటుంది . ప్రతిసారీ ఆమెకే గెలుపు . ఇతనికే ఓటమి . 

     చివరికి ఇద్దరూ కలసి ఒక ఒప్పందానికి వచ్చారు . హోమకాలములో యజ్ఞేశ్వరుని ప్రార్థించి ఒక ఉపాయాన్ని కల్పించుకోవాలని కూడబలుక్కున్నారు  . అప్పుడే యజ్ఞేశ్వరుడు మేనకకు దర్శనమిచ్చి , " మేనకా , భలే జరిగింది . మానవుని చేయి పట్టి నువ్వు కూడ మానవ కాంతవయ్యావు . జంతువులూ , ప్రాణులూ అన్నీ పుట్టినప్పుడే తమ భోగ సాధనముల నన్నిటినీ వెంట తెచ్చుకుంటాయి అన్న తత్వమును మరచి , మానవులవలె అన్నము కోసము శ్రమిస్తున్నావు కదా !  కల్ప వృక్షమును ప్రార్థించు . నువ్వున్న ఈచోట ఒక వృక్షములో తన అంశని నిలిపి , నీకు కావలసినదంతా ఇస్తుంది " అన్నాడు . 

     మేనక , " దేవా , మన్నించు . చెరువులో నీరు నిండుగా ఉన్నా , ఎప్పుడైతే అది భావిలోకి వస్తుందో , అప్పుడు తన స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకున్నట్టు , నేను దేవలోక వాసాన్ని వదలి ఇక్కడికొచ్చాక , ఈ క్షేత్రానికి తగినట్టు మారితే విచిత్రమేముంది ? " అంది . 

     అగ్ని మరల దరహాసము చేసి , " వద్దు , నువ్వు దైవత్వాన్ని వదలి మనిషిగా మారవద్దు . దైవ కార్యము కోసము దైవత్వాన్ని నిలుపుకొని ఉండు . అలాగని , మానవాతీతమై పతి నాశకివి కావద్దు . మానవ స్త్రీవై అల్ప బుద్ధివి అయితే దేవకార్యము చెడును . అలాగని , నీ అతి ప్రజ్ఞ చేత దేశ , కాల ధర్మాలను అతిక్రమించినా దేవకార్యము జరగదు . కాబట్టి , ఫలభారముతో వంగిన తీగలాగా , నువ్వు వివేకముతో వ్యవహరించి , కాయ పండగునట్లు ప్రవర్తించు " అని పలికి అంతర్ధానమయ్యాడు . 

     మేనక లేచి , భర్తకు నమస్కారము చేసి , " దేవా , నాకు జన్మతః ప్రాప్తమైన కొన్ని ప్రభావాలున్నాయి . అనుమతి అయితే , వాటిలో ఒకదానిని ప్రయోగించి , ఈ చెట్లలో ఒకదానిలో కల్పవృక్షపు అంశాన్ని ఆరోపిస్తాను . సంకల్పము చేతనే సర్వమునూ ఇచ్చు స్వర్గ మహీరుహము వలెనే , ఇది కూడా మనకు కావలసినదంతా ఇస్తుంది . " అని విజ్ఞాపన చేసింది . 

     విశ్వామిత్రుడు అది విని నవ్వాడు , " దేవీ , నిజమే . నువ్వు జన్మ వలన నాకన్నా ఉత్తమురాలవు . నేను మానవుడిని . నువ్వు దేవి . అయినా నువ్వు నా ఇంతివి . ఎంతైనా , నువ్వు నా పోష్య వర్గానికి చేరినదానివి . నేను చక్రవర్తిగా ఉండినవాడను . ఇప్పుడు బ్రాహ్మణుడవ్వాలని ఉన్నవాడను . స్త్రీ విత్తమువల్ల జీవనము చేయుట పాప వృత్తి . ధర్మము కాదు . నేను దాన్ని ఎలా ఒప్పుకోగలను ? " అన్నాడు . 

     మేనక ఒక ఘడియ అవాక్కైంది . తాను దేవతయైననూ , తన ప్రభావముతో అతని మనస్సును దారంలా మార్చి , తన సంకల్పానికి అనుగుణముగా నడచుకొనునట్లు చేయగలిగినదైననూ , ధర్మ , అధర్మాల సంగతి యని బెదరి , వెనక్కు తగ్గింది . ఏం చేయాలి ? అనుకున్నది . తన ప్రజ్ఞా బలముతో చూచి , అంది , " దేవా , ఎదురు మాట్లాడి ఆయాసపడేలా చేస్తానేమో అని బెదురుగా ఉంది . తమ అనుమతి అయితే ధర్మాన్ని గురించి రెండు మాటలు చెప్పనా ? " అంది . 

     విశ్వామిత్రునికి ఆశ్చర్యమైంది . అయినా , అప్సరసలకు విచిత్రమైన ఒక మేధా శక్తి ఉంటుందని తెలిసిన అతని మనసు , " అలాగే , ఆమె ఏమి చెబుతుందో చూద్దాము " అని ఆమె మాట వినుటకు సిద్ధమై , " కానివ్వు "  అన్నాడు . 

     మేనక చెప్పింది , " దేవా , ఆడది మానవుని పోష్య వర్గానికి చెందినదన్నది నిజమే అయినా , ఆమె అతని ఆస్తి అన్నది మరువరాదు . గర్భవతి యైనదానిని పెళ్ళిచేసుకొనువాడు , గర్భములో ఉన్న బిడ్డను తన బిడ్డ అని ఒప్పుకొని ,  వాడిని సహూఢపుత్రుడుగా ( భార్యతో పాటూ కొడుకును కూడా  పొంది )  పరిగ్రహించునట్లే , ప్రభావ సంపన్నురాలైన దాన్ని పెళ్ళి చేసుకున్నవాడు ,  ఆమెకు పతి యైనట్లే , ఆమె ప్రభావాలకు కూడా పతి అవుతాడు కదా ? గోవును కొన్నవాడు పగ్గాన్ని తిరిగి ఇచ్చేసినట్టు , నువ్వు నన్ను వివాహమాడి నాదగ్గర ఉన్న ప్రభావాల నన్నిటిని వెనక్కు తిరిగి ఇవ్వలేదు . అంతేకాక , నేను నిన్ను వరించినది ఇంద్రుని అనుమతి తోనే . నేనేమీ శాపగ్రస్తురాలనై మానవలోకానికి రాలేదు కాబట్టి నా ప్రభావాలను వదలిరాకుండా నాతోనే తెచ్చుకున్నాను . ఇన్ని రోజులూ నాయంతట నేను వాటిని ఉపయోగించకూడదని ఊరికే ఉన్నాను . ఈ దినము నువ్వే యజ్ఞేశ్వరుని ప్రార్థించి సాధనము నొకదానిని పొందాలని అనుకున్నావు . యజ్ఞేశ్వరుడే ,  దేవతయైన నన్ను నీదానినిగా చేసినపుడు , నా ప్రభావాలన్నీ నీవి కాలేదా ? రుద్ర ప్రసాదాన్ని స్వీకరించినట్లే , ఆపోదేవి అనుగ్రహాన్ని అంగీకరించినట్లే , నా ప్రభావాలను కూడా ఇప్పించుకో ." 

     విశ్వామిత్రుని మనసుకు  ఆమె ఆలోచనా సరళి శుద్ధముగా ఉన్నదని అర్థమైంది . అన్నాడు , " మేనకా , నువ్వు చెప్పినది ధర్మ సమ్మతముగానే ఉంది . ధర్మమును తెలుసుకొనుట కష్టము . బుద్ధికి ఎన్నడూ అది గోచరమైనది లేదు . కాబట్టి మనకు తెలిసినంతవరకూ సకారణముగా విచారము చేసి ఒక సిద్ధాంతానికి రావాలన్న సాధు సంప్రదాయానికి అనుగుణముగానే నువ్వు కూడా సకారణముగా నీ సిద్ధాంతాన్ని ప్రస్తావించావు . దానిని ఒప్పుకోరాదనుటకు నాకు ఏ కారణమూ కనిపించుట లేదు . కాబట్టి దానిని ఖండించుటకు నాదగ్గర మాటలు లేవు . అయినా , మన పెద్దలు ఎవరూ ఈ విధముగా చేసి ఉండలేదన్నది ఒకటి .: ఈ సిద్ధాంతాన్ని అంగీకరిస్తే ఫలము  నాకు వస్తుంది కాబట్టి , దీనిని ధర్మమని అంగీకరించుటలో , నాకు తెలీకుండానే మానవ సహజమైన ప్రలోభము ప్రవర్తిస్తుందేమో అన్న భీతి ఇంకొకటి : దీనిని అంగీకరించుటలో నాకు ఆత్మ తృప్తి లేదనునది మరొకటి : ఇలాగ మూడు కారణాల చేత ప్రస్తుతానికి నీ సిద్ధాంతాన్ని అంగీకరించకపోతే కోప పడవద్దు . నీ ప్రభావముతో నా మనసును జడముగా చేసి , నీమాటను ఒప్పుకొనునట్లు చేయవద్దు . ఇంద్రుడు కూడా , " స్వర్గానికి వచ్చుట లేదన్న , స్వర్గాన్నే నీ వద్దకు వచ్చునట్లు చేస్తే ఏమి చేస్తావో చూద్దాము " అన్నది జ్ఞాపకము ఉంది . స్వర్గవాసిని ఒకతె వస్తే స్వర్గమే వచ్చినట్టా ? అలాగే నువ్వొస్తే నీ ప్రభావాలు వచ్చినట్టు కాదు . కానీ ఆగు . అలాగే కావాలంటే , త్రిశంకువును స్వర్గానికి పంపించిన ప్రభావము నాలో ఇంకా కొంతైనా ఉండాలి కదా . దానిని ఉపయోగించుకుందాము . చివరికి పరిస్థితి అలా గనక వస్తే అప్పుడు నీ ప్రభావాన్ని తీసుకుంటానులే " అన్నాడు . 

     మాట మృదువుగా , హృదయానికి హత్తుకొనేలా , ఆత్మ విశ్వాసముతో , పక్షిని పట్టుకొన్న వాడు దానికి నొప్పికాకుండా పట్టుకున్ననూ , పట్టు మాత్రము బిగువుగా ఉన్నట్టు, వినుటకు ప్రియంగానే ఉన్నా , కపి ముష్ఠిలాగా దృఢంగా ఉంది. 

     మేనక ఆమాటలు వింటూనే కొంతసేపు నిశ్చేష్టురాలైంది.  సన్నగా ఏడుపు మొదలై , చివరికి వల వలా ఏడ్చింది . దేవతయై , సంతోష సాగరములో ఈదుతున్నామె , ఏడుపును చూసి కూడా ఉండలేదు, వినికూడా ఉండలేదు . మనస్తాపము అన్నదానినే ఎరుగనిది . తన జీవితములో తాను చేయవలసిన పని కాకపోవుట అంతవరకూ చూడలేదు . తన మొదటి ఆశా భంగములో చిన్నపిల్లలా ఏడిస్తే అందులో విశేషమేముంది ? మానవ లోకానికి వచ్చాక మానవుని సహజ గుణమైన ఏడుపును ఎలా తప్పించుకోగలదు ? ఏడ్చుటకు రాకున్నా , ఆమె స్త్రీ స్వభావమే ఆమెను ఏడ్పించింది .  

No comments:

Post a Comment