SHARE

Thursday, February 21, 2013

41. " మహాదర్శనము " --నలభై ఒకటవ భాగము--ఇంద్ర దంపతులు


41. నలభై ఒకటవ భాగము-- ఇంద్ర దంపతులు


          ఆచార్యులు అన్నారు : " యాజ్ఞవల్క్యా , ఆదిత్య తేజస్సైన ఉషాదేవి , నిన్ను జాగృత్తు నుండీ స్వప్నమునకు జారకుండా పట్టి నిలిపినది చూచినావు కదా ? అది ఎలా చూచినావు ? కర్మేంద్రియముచేతనా ? జ్ఞానేంద్రియము చేతనా ? "

          యాజ్ఞవల్క్యుడు కనులు మూసుకొని , అప్పటి అవస్థను స్మరించి , దానిని మరలా అనుసంధానము చేసి చూస్తూ అన్నాడు : " ఇది కర్మేంద్రియముల వ్యాపారము కాదు . జీవుడు భ్రుకుటి స్థానములో నున్నపుడు కర్మేంద్రియ వ్యాపారమే గానీ , ఆ స్థానమును వదలి వెళ్ళినపుడు కర్మేంద్రియ వ్యాపారమెక్కడిది ? అలాగే , స్వప్నమునకు జీవుడింకా జారిపోలేదు కాబట్టి జ్ఞానేంద్రియ వ్యాపార ప్రసక్తి కూడా లేదు . అయిననూ దర్శనము జరుగుతున్నది . దీని నేమనవలెనో తెలియదు . " 

          ఆచార్యులన్నారు , " ఇదే దివ్య దర్శనము . ఈ దివ్య దర్శనము కావలెనంటే కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు రెండూ వ్యాపార ముఖమై వాటి స్థానములో దేవతా భావము రావలెను . ఈ భావము ఇంద్రియ గోళముల వరకూ వ్యాపిస్తే అప్పుడక్కడ ప్రతి గోళములోనూ దివ్యభావము వచ్చును . అప్పుడు విశ్వరూప దర్శనము . జాగ్రత్త ! నువ్వు విశ్వ రూప దర్శనమునకు ఉబలాట పడవద్దు . వేచియుండు , అది తానుగా వస్తుంది . ఇప్పుడు కన్నులు మూసి చూస్తున్న ఈ దివ్య దర్శనము ,  దేవతానుగ్రహము వలన ఇంద్రియ గోళములవరకూ తానుగా వచ్చువరకూ నిదానించు . " 

యాజ్ఞవల్క్యుడు అనుజ్ఞ యని కళ్ళుతెరిచినాడు . 

          ఆచార్యులు మరలా చెప్పినారు : " ఇప్పుడు మరలా అనుసంధానము చేసి ఆదిత్య దేవుడిని చూసి పంచాత్మ సంక్రమణ విద్యకు కాలము వచ్చినదేమో అడుగు . నువ్వు నేను చెప్పినానని , నన్ను ఆచార్యుడిగా చేసుకోవద్దు . చెప్పువాడు ఆదిత్యుడే అనుకో . అప్పుడు చెప్పువాడినీ , వినువాడినీ ఇద్దరినీ ఆదిత్యుడు సంరక్షించును . " 

         యాజ్ఞవల్క్యుడు అనుజ్ఞయని ఆదిత్యుడిని అనుసంధానము చేసుకున్నాడు . కుడి కంటిలో చలనమైనది . ఆదిత్యుడు దర్శనమిచ్చి , పూజాదులను స్వీకరించి , అన్నాడు , " విద్యా గ్రహణమునకు సకాలమైనది . అయితే , దానికన్నా ముందు కలుగు ఇంకొక పరిణామమును గమనించు . ఇప్పుడు చూడు , నీకు ఎవరు దర్శనమిస్తున్నారో ? "

          ఎదురుగా ఇద్దరు వచ్చినారు . భోగముల వలన క్రొవ్వుపట్టిన శూరుడి శరీరాకృతి , తలపైన రత్నకిరీటమూ , కప్పుకున్న ఉత్తరీయమూ , ’ ఈతడు సామాన్యుడు కాదు ’ యనుదానిని ప్రకటముగా చెప్పుతున్నవి . ఆతడు ధరించిన గంధమాల్యములు కూడా అటువంటివే . అనన్య సాధారణమైనవి అని తెలిసిపోతున్నాయి . ప్రసన్నమైన ఆ ముఖపు వెడల్పువరకూ ఉన్న కన్నులు వాతాహతి వలన కొంచము కూడా క్షుబ్ధము కానట్టి సరోవరముల వలె శాంతములూ , రమణీయములూనై , తేజోపుంజములై వెలుగుచున్నవి . ఆతని ముఖములో ఏదో విలక్షణమైన తేజస్సు . దానిని చూచిన వారంతా చేతులెత్తి జోడించి ఏమి ఆజ్ఞ యని అడుగవలెను . అలాగు బలాత్కారము చేయుచున్నట్లు తోచుచున్న ఆ తేజస్సు, కావలసినది ఇచ్చెదనని ప్రసన్నముగా వచ్చినట్లుంది . 

          అతని పక్కనే ఒక స్త్రీ . స్ఫురద్రూపమునకు ఆమె అంటే చాలా అభిమానమై యుండవలెను . లేకున్న, అంతటి సౌందర్యము ఆమెకెలా లభించును ? ఆమె , ఆతడి ఎడమ భాగములో కూర్చున్నది . ఆతని ప్రసన్నత అంతా ఆమె వలన ప్రచోదితమైనట్లు కనబడుతున్నది . వీర పుంగవుని శౌర్యము నంతటినీ పిడికిట పట్టి ఆడించు నటువంటి ఆమె కరుణ , ఔదార్యములు అనన్య సాధారణములుగా కనిపించుచున్నవి . 

          చూడగా , ఇద్దరూ దంపతుల వలె కనిపించు చున్నారు . సౌభాగ్యమంతయూ ఆ దంపతుల వశములో నున్నట్లు యాజ్ఞవల్క్యునికి బోధ యగుచున్నది . భర్త , పాల మీగడవంటి మనోహరమైన బుట్టా వస్త్రోత్తరీయములను ధరించితే , భార్య , నానావర్ణ విరాజితమైన తేటయైన చీరను కట్టి ఎర్రటి రవికను ధరించి మనోహరముగా ఉంది . నుదుటి కుంకము జ్యోతిఃపుంజము వలె ప్రకాశమానముగా ఉంటే , చెక్కిళ్ళమీదా , మెడమీదా ధరించిన కస్తూరి పసుపు ముఖానికి వెన్నెల చౌకట్టును కట్టినట్టుంది . చెదరినట్లున్న కురులకు కట్టిన చిన్న చిన్న ఆణిముత్యములైతే శ్రమచేసినపుడు కనిపించు చిన్న చిన్న స్వేద బిందువులవలె ముద్దుగా ఉన్నాయి . ఆ తలపాపట దువ్వుకున్న విధము సౌభాగ్య రేఖను దిద్దినట్లుంది .  ఆ నాసాదండము సుందరమైన భ్రూయుగ్మము యథాస్థానములో ఉండుటకు కట్టిన ఆధార స్థంభము వలెనున్నది 

           ఆమె యొక్క ఆభరణములు కూడా అంతే నయన మనోహరములుగా ఉన్నవి . పచ్చలు , కెంపులు , వజ్రములతో చేసిన సరము కంఠములో శోభిస్తున్నది . నవరత్న ఖచితములైన వంకీలూ , సింహ లలాటపు కడియములూ చేతులనూ ముంజేతులనూ అలంకరించుచున్నవి . సుందరమైన వడ్డాణము నడుమున మెరుస్తున్నది . అన్నిటికన్నా హెచ్చుగా ఆణిముత్యపు హారము మధ్య మధ్య ఉన్న కుందనపు , నవరత్న గుళ్ళతో ఉజ్జ్వల కాంతియుక్తమై మెరుస్తూ , ఎదపై పాముపిల్ల వలె వెలుగుతూ పడుకుని ఉంది . దివ్య గంధమాల్యము లైతే భర్త కన్నా భార్యకే ఎక్కువగానున్నవి . 

         యాజ్ఞవల్క్యుడు ఆ దంపతుల దర్శన భాగ్యము వలన ఒక ఘడియ తృప్తుడై మూగబోయినాడు . ఎవరి ప్రచోదనము చేతనో లేచి నిలబడి వారికి మానసపూజను అర్పించినాడు . విశేషమేమనిన, 

          ’ లం పృథివ్యాత్మనే గంధాన్ ధారయామి ’ అన్నపుడు , మనోహరముగా , వేసర కలిగింపక, సూక్ష్మమైన గంధపు సరిసోన వ్యాపించి , చుట్టుపక్కల వాతావరణము నంతటినీ ప్రసన్నము చేయుచున్నది . ఆ గంధపు ఆఘ్రాణము వలన ఊపిరి ప్రసన్నమై , శాంతమై దీర్ఘమవుతున్నది . 

          ’ హం ఆకాశాత్మనే పుష్పం సమర్పయామి ’ అన్నపుడు వారిద్దరికీ , అప్పుడే ఎక్కడి నుంచో వచ్చి వికసిస్తున్న అనేక జాతుల మల్లెల పూదండలు వారి మెడను అలంకరిస్తున్నవి . వారు ధరించిన పుష్పమాలల సువాసన తో ఇప్పుడు వచ్చిన మాలల సువాసన చేరి ఒక కొత్త పండుగ చేసినట్టై , ప్రధానముగా నయనములకు గౌణమై మిగిలిన ఇంద్రియములకు సంతర్పణమగుచున్నది .

          ’ యం వాయ్వాత్మనే ధూపం దర్శయామి ’ అన్నపుడు ఒక కొత్తధూపపు ఘుమ ఘుమ , అజ్ఞాతమైననూ దివ్యమైనది యని బోధయగుచున్న అలౌకికమైన పరిమళము అంతటా నిండి దేహాద్యంతమూ ఆయాసమన్న దానిని లేకుండా పోగొట్టి ఏదో తెలియని హాయినిస్తున్నది . 

           ’ రం జ్ఞానాత్మనే దీపం దర్శయామి ’ అన్నపుడు  మనోహరముగా రత్నకాంతి రంజితమైన మంగళారతి యొకటి తానే వెలిగి , కుమారుని దేహము నంతా చిన్న చిన్న ముత్యములవంటి దీపములతో సుందరము గావించుచున్నది . 

          ’ వం అమృతాత్మనే అమృత ఖండ నివేదనమ్ సమర్పయామి ’ అన్నపుడు నాసికకు బహు తృప్తిని గొలుపు సువాసనతో ఆప్యాయన కరమైన బాదామి పాలు రెండు గిన్నెలలో వచ్చి నిలుస్తున్నది . దాని సువాసనవల్లనే ఉన్న ఆకలియంతా తీరినట్టై సర్వేంద్రియములకూ ఉత్తేజనము దొరకుతున్నది . 

         యాజ్ఞవల్క్యునికి ఈ దినము జరిగినది ఆశ్చర్యమును గొలుపునదే . అంతవరకూ అతడు దేవతలను కొన్నిసార్లు సాక్షాత్కరించుకొని యున్నాడు . అప్పుడు మానసపూజలను చేసినదీ ఉన్నది . అయితే ఏ దినము కూడా ఇలాగ , అతని నోటి వెంట వచ్చిన మాటలు ఘనీభూతమై వస్తు గుణములుగా పరిణమించలేదు . 

          ఆ ఆశ్చర్యములో , వచ్చినవారు ఎవరు అన్నది తెలుసుకొనుటకు అవకాశము దొరకలేదు . వెనుకనుండీ ఎవరో ప్రేరేపించినట్లు , వారికి నమస్కారము చేసి వారు ఎవరో తెలుసుకో అని చెప్పినట్లాయెను . యాజ్ఞవల్క్యుడు పర ప్రేషితుడి వలె యాంత్రికముగా ఆ ప్రశ్నను అడగబోతుండగా ఆ వచ్చినవారే మాట్లాడినారు . 

          " మేము ఇంద్ర దంపతులము . నీ కుడి కంటిలో నేనెల్లపుడూ ఉంటాను . ఈమె ఎడమ కంటిలో ఉంటుంది . ఇప్పుడు నీకు వరమునిచ్చుటకు వచ్చినాము . నువ్వు ఏ ఆదిత్యుని పగలురాత్రి యనక ఉపాసన చేయుచున్నావో , ఆ ఆదిత్యుని నేనే ! నువ్వు బ్రహ్మ విద్యా సంపన్నుడగు వరకూ ఆదిత్యుని వరము బీజరూపముగానే ఉండును . ఆ బ్రహ్మ విద్యను పొందుటకు ముందే నీ ఇంద్రియములూ , అంగాంగములూ దానిని ధారణ చేయగల సామర్థ్యమును పొందియుండవలెను . నీకు లభించు బ్రహ్మవిద్య నీలో నిలిచి ఫలకారి యవనీ యని ఆశీర్వదించి , ఆ సామర్థ్యమును నీకు కరుణించ వలెననియే మేమిద్దరమూ వచ్చినది . "

" పరమానుగ్రహమయినది " 

          " ఇంకొక రహస్యమును తెలుసుకో . బ్రహ్మవిద్యకు విఘ్నమును తెచ్చి అడ్డుకునేవారమూ మేమే ! వేలెడంత దొరికితే మనసు దానిని పర్వతమంత చేసి, ’ ఇంకెవరికి తెలుసు ఈ విద్య ’ యని విర్ర వీగునట్లు అహంకారమును హెచ్చించు వారమూ మేమే ! ఎందుకో తెలుసా ? అనామకులు , సామాన్యులు వెళ్ళు దారికాదు అది . యాజ్ఞవల్క్యా , నీవంటి , లోకోద్ధారమునకు పుట్టినవాడు తన కార్యమును నిర్వహించుటకు కావలసిన ఆత్మోద్ధారమునకై బ్రహ్మవిద్యను అనుగ్రహించే వారమూ మేమే ! "

యాజ్ఞవల్క్యుడు అడిగినాడు , " తమరికి లోకోద్ధారము పైన అంతటి మమతనా ? "

         ఇంద్రుడు నవ్వినాడు , " ఈ ప్రశ్న ఎక్కడినుండీ వచ్చినదో నాకు తెలుసు . అది ప్రాణ దేవుడిది . ఆతను తానై చెప్పవలసినదానిని  నా ద్వారా చెప్పించవలెనని ఈ ప్రశ్నను నీతో అడిగించినాడు . " 

          " కానిమ్ము , దీనిని లోకము తెలుసుకోనీ ! విను , నేను త్రిలోకాధిపతి యైన దేవరాజును . ఈ త్రిలోకములూ సుఖముగా ఉండవలె ననియే నేను పాలించుచున్నది . ఆ సుఖము మనసుది . మనసు , కాల దేశ వర్తమానములకు తగినట్టు తాను యే దేహములో ఉండునో , ఆ దేహపు గుణ కర్మలకు అనుగుణముగా తన తన సుఖమును కల్పించుకొనును. ఇంకా ఒక్కడుగు ముందుకు పోయి చూస్తే , ఆ మనసు , దేహములోనున్న నాడీ వ్యాపారముల చేత  ఇటు వైపుకు ,  దేహములోనున్న ప్రాణ సంక్రమణాదుల చేత అటు వైపుకూ , వెనుకటి కర్మ వలన ప్రచోదితమై ఉన్న బుద్ధివలన  ఇంకోవైపుకూ , తూగుడు బల్లకు చిక్కినట్టు ,  ఆటాడుటకు దొరికిన చెండు వలె ,  పైకీ కిందికీ , అటునిటూ నలిగిపోవుచుండును . కాబట్టి సుఖమునకు ఒక నియమితమైన స్వరూపము లేదు . దీనినే మేము మనస్సు యొక్క ఇఛ్చా ద్వేషములకు అనుగుణముగా సుఖమనీ దుఃఖమనీ అంటాము తెలిసిందా ? " 

" తెలిసినది , ముందరి విషయము అనుజ్ఞనివ్వవలెను . " 

          " దేహములో నున్న నాడులు శుద్ధమై కల్మష రహితములై ఉంటే అది ఒక శుద్ధి . దురాహారములు లేక ప్రాణాదులు శుద్ధముగా ఉంటే దానివలన లభించునది ఇంకొక శుద్ధి . వెనుకటి కర్మలు పుణ్యములై ఉంటే దానివలన లభించునది మరియొక శుద్ధి . ఇలాగ శుద్ధి త్రయము వలన శుద్ధమైయున్న మనస్సు బ్రహ్మవిద్య వైపే మొగ్గుతుంది . అటుల చేసిన ప్రయత్నము విఫలము కాకుండా మా అనుగ్రహము లభించితే , అప్పుడు ఆ ప్రయత్నము పూర్ణమై , ఆ వ్యక్తి బ్రహ్మవిద్యా సంపన్నుడగును . నీ తరువాతి ప్రశ్న నాకు తెలుసు , వ్యక్తి అలాగయితే లోకమునకేమి ప్రయోజనము ? అని కదా ?, విను . "

యాజ్ఞవల్క్యుడు చేతులతో మొక్కి అడిగినాడు  ,  " తమరి అనుజ్ఞ , సావధానముగా వింటున్నాను " 

          ఇంద్రుడు మరలా నవ్వి అన్నాడు , " చూచితివా ? నీ మనసును ప్రచోదించు ప్రాణాగ్నులు ప్రసన్నమగుటను నువ్వు ’ సావధానముగా ఉన్నాను ’ అన్నట్లే , లోకము కూడా , ఈ కొన నుండీ ఆ కొనవరకూ పర ప్రేషితము . దైనందిన వ్యవహారముల చేతను , లోకమును నియమమున పెట్టు కాల దేశముల చేతను , క్షణ క్షణమూ ప్రతి దేహము నందునూ కల్మషము నింపబడు చుండును . ఆ నిండిన కల్మషమును మనసు ప్రతిబింబించు చుండును . అలాగ నిండుచున్న కల్మషమును కడుగునది బ్రహ్మవిద్య. పాత్రలు ఎవరి ప్రయత్నమూ లేకనే మసిబారును. అయితే , ఎవరైనా వాటిని బలముగా పులుసు వేసి రుద్దితే మొదటివలె మెరయును . అదే విధముగా ఎవరైనా ఒకడు బ్రహ్మవిద్యా సంపన్నుడు పుట్టితే అతడి దర్శన , స్పర్శన, సల్లాపములచేత లోకము తన కల్మషమును కడుక్కొని మరలా పూర్వము వలెయగును . ఇది లోకపు కాంతిమయ స్థితి . ఇది ధర్మము . ఇది సహజమైన  స్థితి . అప్పుడు దేహములన్నీ శుచిగా ఉండుట వలన అందరూ ఎక్కడ చూచినా సత్య ధర్మ పరాయణులగుదురు . ఇలాగ లోకము చక్కబడుటే లోకోద్ధారము . ఇలాగ లోకోద్ధారమగునది , ఆత్మోద్ధారము చేసుకొన్న బ్రహ్మజ్ఞుడి వలన. ఇప్పుడర్థమైనదా ? "

" దేవా , మీ అందరి కృప వలన అర్థమయినది " 

         " సరే , యాజ్ఞవల్క్యా , మంచిది . ’ నీ ’  అనుటకు బదులు ’ మీ ’  అన్నావు కదా , అది బాగుంది . ఔను , నువ్వు పుట్టినది మా అందరి ప్రయత్నము వలన. మా అందరి వల్ల మాత్రమే కాదు , ఈ త్రిలోకపు ఉపకారము కోసము కూడా .  అందువలననే నువ్వు నా ఉపాసనను ప్రత్యక్షముగా చేయకున్ననూ , నేను నీకు దర్శనమిచ్చినది . నేను ఇచ్చిన సౌభాగ్యమును క్షేమముగా ఉండునట్లు చూచునది ఈమె . అందుచేత ఈమెను పిలుచుకొని వచ్చితిని . ఇక పై నీకోసము నువ్వు ఏమీ కోరవద్దు . నేను లోకోద్ధారమునకై , ఆత్మోద్ధారమును చేసుకొనవలెను అన్న అహంకారమును పెంచుకోవద్దు . దానికి మేమున్నాము . ఎవరెవరి వలన ఏయే పనులు ఎప్పుడెప్పుడు కావలెను అనునవి మేము చూచుకొనెదము . ఇక మీదట నీకున్నది ఒకే ఒక పని . భక్తి , జ్ఞానము , వైరాగ్యములను పెంచుకొనుట , అంతే నీ పని . అలాగన్ననేమి యని అడగబోవుచున్నావు . అది నీకు అర్థమగునట్లు అనుగ్రహమగును . దిగులు పడవద్దు , నీ పని ఇంతకు  మించి లేదు . ఇది బాగా గుర్తు పెట్టుకో . నీకు అహంకారమను తుప్పు పట్టకుండునట్లు , నీ ఆచార , విచారములలో మెలకువగా ఉండు . బాహ్యాంతః శుద్ధిని కాపాడుకో . "

          ఇంద్రుడు విరమించినాడు . యాజ్ఞవల్క్యుడు , ముక్కుకు కట్టిన ముగుతాడును లాగగనే హెచ్చరిక గొన్న ఎద్దువలె , ఎవరివల్లనో ప్రేరేపింప బడిన వాడివలె అడిగినాడు , " దేవా , మీరు దేవతలు , సాక్షాత్తుగా సూక్ష్మముగా మాలో ఉండి మాకు తెలియకుండానే మాతో వ్యాపారము చేయించెదరు . కాబట్టి అడుగుతున్నాను . ఆచార , విచార , వ్యవహారములచేత నాకు కల్మషము తాకకుండా , నా బాహ్యాభ్యంతర శుద్ధి చెడిపోకుండా మీరు కాపాడకపోతే , నేను దానినెలా సాధించగలను ? "

          " అందు కోసమే మేము నీకు సామర్థ్యమును కరుణించుటకు వచ్చినది . అంగాంగమూ ప్రసన్నమగునట్లు మేమిచ్చిన వరమును తీసుకో . బ్రహ్మధారణము నీకు సులభమగునట్లు మేము చేయుచున్న ఈ అనుగ్రహమును స్వీకరించు . ఎంతవరకూ నువ్వు ప్రత్యక్ష దేవతలైన ఆదిత్య , వాయు , అగ్నులను జడము లనకుండా , చేతనములని గౌరవించెదవో , అంతవరకూ నీకు యే కల్మషమూ తగలదు . నువ్వు వేదము తెలిసినవాడివి . మేము నీ దేహములో ఎప్పుడు , ఎలాగ , ఎందుకు వ్యాపారము చేసెదమో అది గమనిస్తూ ఉండు . నీకు బాహ్యాభ్యంతర శుద్ధి ఉంటుంది . అది సరే , నీకు ఉద్ధాలకుల ద్వారా , అవస్థా త్రయ నిరూపణకు ముందే సాక్షీయానుభవమును చెప్పితిమి కదా ? ఎందుకో అర్థమైనదా ? "

" చెప్పితే తెలుసుకుంటాను , దేవా ! " 

          " ఈ విషయమును చివరి వరకూ వదలకుండా ఉండవలెను . విను . మనుష్యుడు జాగృత్తిలో ఇంద్రియములు మేలుకొనియున్నపుడు తెలిసినదే సత్యము అనుకొనుచున్నాడు . అలాగ కాదు : కర్మ జ్ఞానేంద్రియములు రెండింటినీ తిరస్కరించి తెలుసుకొనుటకు ఇంకొక దారి ఉంది . అది జాగృత్ జ్ఞానమున కన్నా విపరీతము కాదు , దానికన్నా నిశ్చయమైనది యనునది నీకు తెలియవలెను . అది ఇంద్రియములకు గోచరమగునట్లు ప్రత్యక్షము కాకున్ననూ , అది అసత్యము కాదు . ’ సత్యస్య సత్యం ’ అనుదానిని నమ్ము . ఆ అనుభవము నీకు శీఘ్రముగా లభించి నీకు నువ్వుగా నామాటను ఒప్పుకొను కాలమూ వస్తుంది . ఇక మేము వెళ్ళి  వస్తాము " 

యాజ్ఞవల్క్యునికి కనిపిస్తున్న దంపతులు తిరోహితులైనారు . అయిననూ యాజ్ఞవల్క్యుడు ఆ శూన్యాకాశామునకు పూజాదులను సలిపి కనులు తెరచాడు . 

No comments:

Post a Comment