SHARE

Saturday, February 16, 2013

33. " మహా దర్శనము " --ముప్పై మూడవ భాగము--అగ్ని దేవుని కృప


33. ముప్పై మూడవ భాగము-- అగ్ని దేవుని కృప

         
         దేవరాతుడు కొడుకుకు ఇప్పుడు తానే యజుర్వేదమును మరలా నేర్పిస్తున్నాడు . అలాగే బ్రాహ్మణోపనిషత్తులు కూడా అయినవి . కుమారుడు ఋగ్వేదము కోసము బుడిలులను ఆశ్రయించినాడు . సామవేదము కోసము ఉద్ధాలకుని వద్దకు పంపవలెను అని ఆచార్యుని అభిమతము . అయితే కొడుకు అగ్నిదేవుని అనుమతి లేనిదే దేనినీ చేయడు .  

         ఇలాగ ఒక సంవత్సరమైనది . తండ్రి ఎక్కడైననూ యాగము నడచి తనను అధ్వర్యుడిగా పిలిస్తే , తన వెంట కొడుకును కూడ పిలుచుకొని వెళ్ళును . అక్కడ యాజ్ఞవల్క్యుడు తండ్రికి తన వయసు మీరి సహాయము చేయును . అయినా ఎవరి దగ్గరా వినయమును వదలి మాట్లాడలేదు .  ఆ భీమ కాయుడు అలాగు వినయముగా ఉండుట చూసి , " ఇదేమిటిది , మహా సర్పము పుష్పహారమైనట్లు ఉన్నాడే  ! ఆచార్యుని అదృష్టము ఎంత గొప్పది ! ఇక ఇతడు అధ్వర్యుడై నిలబడు కాలము ఇంకెంతో దూరం లేదు ! " అంటారు . కొందరు తెలియని వారు కుతూహలము చేత , " నీకు శిక్షణ అయినది ఎక్కడయ్యా  ? "  అంటారు . యాజ్ఞవల్క్యుడు ముసి ముసి నవ్వులు నవ్వుతూ తండ్రిని చూపించును . ఇంకా కొందరు పెద్దవారు , " ఎక్కడైనా గానీ , నువ్వు దీర్ఘ కాలము సుఖముగా ఉండవయ్యా ! " అంటారు . యాజ్ఞవల్క్యుడు ఆ ఆశీర్వాదమును నమస్కార పూర్వకముగా గ్రహణము చేయును . 

          ఇప్పుడు ఇంటి వెనుక తోటలో యాజ్ఞవల్క్యుని కోసము ఒక గుడిసె ఏర్పడింది . అక్కడ కుమారుడు పయోవ్రతములో ఉన్నాడు . హవిస్సును పాలతో పాటు ఒకసారి భుజించి , మరొక పూట పాలు మాత్రము సేవిస్తాడు . మొదటి జాములో చెరువు నీటి స్నానము , సూర్యోదయము వరకూ జపము . సూర్యోదయము అగుచుండగనే అర్ఘ్య ప్రదానము . మరలా జపము . సూర్యోపస్థానము , దాని తరువాత అగ్ని కార్యము . అనంతరము వచ్చి తలిదండ్రులకు , యజ్ఞేశ్వరునికీ నమస్కారము చేసి మరలా వెనుకకు గుడిసెకు వెళ్ళును . తల్లి భోజనమును తెచ్చి ఇచ్చును . కుమారుడి వీణ మాత్రము అక్కడే ఉంటుంది . అతడు మంత్ర పునశ్చరణ లో లేనపుడు వీణను వాయించును . ఇప్పుడు బుడిలుల ఇంటికి కూడా వెళ్ళుట లేదు . ఒక దినము రాత్రి ఆలంబిని అకస్మాత్తుగా  పెరటి తలుపు తీసి బయటికి వచ్చింది . యాజ్ఞవల్క్యుని గుడిసెలో ప్రదీపమును వెలిగించినట్టు దేదీప్యమానముగా వెలుగు నిండిఉంది . అక్కడక్కడా గుడిసె కంతల నుండీ మిణుగురు పురుగులు ఎగురునట్లు కాంతి వెదజల్లుతోంది . యాజ్ఞవల్క్యుని గుడిసె కడకు వెళ్ళినది .  ఆలంబిని గాభరాపడు జాతి కాదు , అయినా, " కొడుకేమైనాడో , గుడిసెకు నిప్పు అంటుకున్నదా ? " అని గాభరా పడింది . అయితే పొగ లాంటిదేమీలేదు . మంట కనిపించుట లేదు . కాబట్టి ఏదో విలక్షణముగా ఉండవలెననుకొని శబ్దము చేయకుండా వెళ్ళి గుడిసెలోకి వంగి చూచినది . యాజ్ఞ వల్క్యుడు పద్మాసనములో ధ్యాన ముద్రలో  కూర్చున్నాడు . అతడి శరీరము నుండీ ఏదో మంట వలె  లేస్తున్నది . అయినా ముఖములో ఏ మార్పూ లేదు . కొంచము దూరములో ఆరేసిన బట్టలు దండెము మీద తమ పాటికి తామున్నాయి . ఆశ్చర్యమేమంటే , తాను వాకిలి వద్దకు వచ్చినా ఆ మంటల శాఖము లేదు . మంట , కట్టెలు వేసినపుడు కనిపించు మంట వలె నాలుకలు చాచుట లేదు . నేతి దీపపు మంటవలె ఘనముగా , చాంచల్యము లేకుండా మండుచున్నది . 

        ఆలంబిని ఒక్క ఘడియ లాగే నిలచి చూచినది . ఔను , మంట చంచలముగా లేదు . నేరుగా రత్న ప్రభ వలె కనబడుతున్నది . ఆమెకు అర్థము కాలేదు . ఏమైనా కానీ యని , యజ్ఞేశ్వరుని స్మరించి చేతులు జోడించి " నేను వెళ్ళి వారిని పిలుచుకొని వస్తాను . వారికి కూడా ఈ దర్శనము కానీ ! "  యని ప్రార్థించి , అక్కడినుండీ వెడలినది . 

         దేవరాతుడు మంచి నిద్రలో ఉన్నాడు . నిద్రలో ఉన్నపుడు లేపుట ఎలా అని ఆమె కొంత సేపు వేచింది  . చివరికి సన్నగా చేతులతో చప్పట్లు కొట్టింది . దేవరాతునికి మెలకువయై ’ ఎవరది ’ అన్నాడు . ఆలంబిని చిన్నగొంతుతో , ’ నేను , మెలకువ అయిందా ? ’ అని అడిగింది . 

దేవరాతుడు ’ ఏమిటి విశేషము ? ’ అని ఆమె వైపుకు తిరిగినాడు.

          ఆలంబిని తాను తోటలో చూచినది చెప్పింది . దేవరాతునికి ఆశ్చర్యమైనది . అందులోనూ , యాజ్ఞవల్క్యుడు ఆసన ముద్రా ధారణ చేసి కూర్చున్నాడని విని ఇంకా ఆశ్చర్యమై , ’ పదవే , వెళ్ళి చూసి వద్దాము ’ అని దారిలో బచ్చలి ఇంటికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని శుద్ధాచమనము చేసి గుడిసెకు వెళ్ళినాడు . 

         ఔను , యాజ్ఞవల్క్యుడు ధ్యాన ముద్రలో పద్మాసనములో కూర్చున్నాడు . అతడి చుట్టూ లేత నీలి వర్ణములో , ప్రకాశమానముగా నున్ననూ , కళ్ళకు మిరుమిట్లు గొలపక , కంటికి ప్రియమూ , హితమూ అయినట్టి జ్యోతి యొకటి అతడిని ఆవరించి యుంది . అతడే ఒక దీపమై ఉంటే ఎలాగ నిరాటంకముగా వెలిగెడివాడో అలాగ వెలుగుచున్నది . దేవరాతుడు చేతులు జోడించి నిలుచున్నచోటే ప్రదక్షిణ నమస్కారములను ,  మనసులోనే పంచోపచారమును చేసి , యజ్ఞేశ్వరుని పూజించి , దీని రహస్యమేమో అనుజ్ఞ కావలెనని ప్రార్థించినాడు . చటుక్కున మనసులో మెరసింది , " || ఆర్ద్రం హి జ్యోతిర్జ్వలతి || " తడిసిన వెలుగు జ్వలించుచున్నది . " 

         దేవరాతుడు మరలా నమస్కారము చేసి , మనః పూజను అర్పించినాడు. అతని విచికిత్సా బుద్ధి విచారము చేయసాగినది , " ఆర్ద్ర జ్యోతి యంటే ఆపోజ్యోతి . అది ఏమైననూ ధ్యానములో ఉన్న వాడికి మాత్రమే కనిపిస్తుంది . ఇలాగ దేహము నుండీ బయటికి వెడలి కూడా కనిపించునా ? ఔను , వెనకెప్పుడో వినియున్నాడు , ధ్యానపు ఒక అవస్థలో ఇలాగ జ్యోతి కనిపిస్తుందని . అంటే , యాజ్ఞవల్క్యుడు జ్యోతిరూపమగు అవస్థకు వచ్చినాడా ? ఉండనీ , తెల్లవారు వరకూ ఏమీ చేయుట వద్దు " అని సిద్ధాంతానికి వచ్చి నాడు . అయినా , తాను జనకుడిని యను మోహము వదలక , ఆ మంట వలన కొడుకుకు ఏ ఇబ్బందీ రాకూడదని నిర్ధారణ చేసుకొనుటకు మరలా వంగి చూస్తూ , మరలా దానివలన ఏమీ ఇబ్బంది లేదని మనసుకు నిర్ధారించుకొని, అక్కడినుండీ భార్యతో పాటు వెనుతిరిగినాడు . 

         దారిలో భార్యకు అంతా చెప్పినాడు , " ఉపనయన కాలములో గాయత్రీ మంత్రమును ఉపదేశించినపుడు ఆచార్యుడు శిష్యునికి ఈ జ్యోతిని చూపించును . దానిని కుమారుడు తన స్వంత ప్రయత్నము చేత పెంచుకొని ఎల్లపుడూ చూచుచుండవలెను. ధ్యానము పెరిగి జ్యోతిరూపమగు స్థితి వచ్చినపుడు ఇలాగే జ్వాలలు వెడలును అని విన్నాను . నేనెక్కడా చూడలేదు . చూద్దాము , రేపు కుమారుడినే అడిగితే సరిపోతుంది . "

ఆలంబిని ఆగి ఆగి అన్నది , " ఇటువంటి సందర్భములలో మీరు బుడిలులను అడుగుచుంటిరి కదా ? "

" ఇప్పుడు బుడిలులు ఉన్న స్థితిలో వారిని అడుగునట్లు లేదు "

" అదీ నిజమే , అయితే....."

        " తెల్లవారే వరకూ ఆగు . ఇంతవరకూ మనము స్వతంత్రులై యున్నాము , దానివలన మనకు తోచినట్టు చేయుచుండినాము . ఇప్పుడు కుమారుడు స్వతంత్రుడు . మనము చూసినది అతని ఒక పరిస్థితి. అందుకే , వాడినే అడిగితే సరి అన్నాను . " 

ఆలంబినికి అర్థమైనది . ఎప్పుడు తెల్లవారుతుందా అని కుతూహలముతో కాచుకుని ఉంది. 

         సూర్యోదయమైనది . తెల్లవారు జాములోనే లేచిన ఆలంబిని ప్రాతః కర్మలన్నిటినీ ముగించుకొని , అగ్ని పరిచర్య కూడా కానిచ్చి , పెరుగు చిలుకుతున్నది . అప్పుడు కొడుకు వచ్చి , " అమ్మా , నమస్కారము చేస్తాను " అన్నాడు . ఆలంబిని వెనుతిరిగి , " వారిని చూచి వచ్చినావు కదా ??  " అన్నది .

         కొడుకు నవ్వుతూ అన్నాడు , " చూచినాను , నమస్కారము చేసిన తర్వాత దగ్గర కూర్చోబెట్టుకొని అడిగినారు . నిన్నటి అనుభవము ఇది రెండో సారి అయినది . అలాగ అగునపుడు నాకు సగము సగము బాహ్య జ్ఞానము ఉంటుంది . అయితే , బయట జరిగేది తెలిసిననూ , ఆ క్రియకు ప్రతిక్రియ ఏమీ చేయలేను . నువ్వు వచ్చినది తెలుసు . తండ్రిగారు వచ్చినది తెలుసు . మీరిద్దరూ చిన్నగా మాట్లాడుకుంటున్నది కూడా విన్నాను . కానీ మీమాటకు సమాధానముగా ఏమీ చెప్పలేకనే కూర్చున్నాను . "

" అంటే  , నేను వచ్చినపుడూ , తర్వాత వారిని పిలుచుకొని వచ్చినపుడు నీకు ఒంటిపై జ్ఞానముండినదా ? కళ్ళు తెరచే ఉండినావా ? మేము పక్కనే ఉన్నదంతా నీకెలా తెలుసు ? " 

        " నువ్వు వచ్చినపుడు మెలకువ అయినది . తరువాత తండ్రిగారిని పిలుచుకొని వచ్చినావే , అప్పుడు కూడా మెలకువ అయింది . అప్పుడే చెప్పినాను కదా ? కళ్ళు తెరచే ఉన్నావా అన్నావు. నేను కళ్ళు తెరచుకోలేదు , నిజమే . ఈ కన్నులు , అంటే , ముక్కుపైన , కనుబొమల కింద ఉన్న కన్నులు రెప్పలు మూసుకొనే ఉండినవి . కానీ అప్పుడు నాకు ఒళ్ళంతా కన్నులై ఉండెను . ఈ చుట్టుపక్కల ఉన్నదంతా , నా వీపు వెనకాల ఉన్నదంతా కూడా కనిపించుతుండినది . ఇంకొక విశేషమేమంటే , నా కళ్ళకి , అంటే చూపుకు  గోడ కూడా అడ్డము కాలేదు . నువ్వు వాకిలి తెరచుకొని తోటలోపలికి వచ్చినది మొదలు అంతా కనిపించుతుండినది . సరేనా ? " 

" అదేమిటా మంటలు లేస్తున్నట్లుండినవి ? ఆ నీలిమంట నిన్ను కాల్చలేదా ? "

        " అది కాల్చే మంట కాదు . అది కాల్చి ఉంటే , మీ కొడుకునై ఈ దినము వచ్చి చూచేవాడినా ? చూడు , వేదములో , ’ చూపు పెద్దదగుటకు కన్నులు ఆకాశమంత కావలెను ’ అని చెప్పియున్నది . అట్లే అయినది , అంతే . ఆ దినము , ఉపనయనము రోజు , సూర్య మండలమునుండీ సావిత్ర కిరణమును పట్టి హృదయము లోపల నింపుకొనుటను నేర్పించినారు . అక్కడ ఆశ్రమములో ఉన్నపుడు దానిని చేస్తూ ఉండిననూ అది కన్నులను ఆకాశమంత చేసియుండలేదు . ఇప్పుడో వారము కింద అది జరిగినది . నిన్న రాత్రి అయినది రెండోసారి . అంతే ! అది సరే , నేనొక మాట చెప్పనా ? "

" చెప్పు " తల్లి పెరుగు కుండను మరచిపోయి , కవ్వమును గోడకు ఆనించి , తానూ గోడకు ఆనుకొని నిలుచుంది . 

         " నిన్న యజ్ఞేశ్వరుని దర్శనము పూర్తిగా చేసుకున్నాను . ఇంతవరకూ ఐతే ఎదురుగా ఉన్న అగ్ని కుండములో పైకి వచ్చే జ్వాలల మధ్యలో మాత్రమే చూచేవాడిని . నిన్న రాత్రి అదేమీ లేకుండా జ్వాలా మాలా విభూషితుడైన యజ్ఞేశ్వరుడి దర్శనమైనది . నేను పూజ చేసి , ఇదేమిటిలాగ దర్శనమిచ్చినావు అని అడిగినాను . యజ్ఞేశ్వరుడు నవ్వి , " నేను ఎల్లపుడూ మీ ఎదురుగ్గానే ఏదో ఒక రూపములో ఉండనే ఉంటాను . మీరు చూడకపోతే నాదేమి తప్పు ? పగటి పూట ఆదిత్యుడనై వెలుగువాడిని నేనే ! పగలూ రాత్రీ యనక నిలిచినచోట నిలువకుండా వీస్తున్న గాలిని కూడా నేనే ! ఇప్పుడు నీ ఎదురుగా నిలచినట్లు ఈ రూపములో  ఎల్లపుడూ నేను లేకుంటే , నేననే వాడిని లేనే లేనట్లా ? " అని అడిగినాడు . 

         " నేను మరలా అడిగినాను , " మీరు , దేవతలు , మాకన్నా గొప్పవారు . మీ రహస్యములను మీరే చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది ? " . దానికి యజ్ఞేశ్వరుడు పకాలుమని నవ్వుతూ అన్నాడు  , " అది కూడా నిజమే , సరే , ఇప్పుడు చూడు , నేను ప్రసన్నుడనైన దానికి గుర్తుగా , నీ దృష్టి పెద్దదగును . నీదృష్టికి ఏ అడ్డూ ఉండదు . నువ్వు మధ్యాహ్నములలో సూర్య దర్శనము చేస్తావు కదా , దానివలన నాడులలో నిండియున్న కశ్మలము నాశనమగును . నాడి శుద్ధి అయితే , మొదటగా కలిగేది నా దర్శనము . నా దర్శనపు గుర్తుగా నా సాత్త్విక తేజము నీ నాడినాడులలోనూ ప్రసరించును . నీకు ఇంతవరకూ గోచరము కాకుండానే ప్రసారమగుచున్న ప్రాణ శక్తి , ఇప్పుడు ఇంద్రియ గోచరమగు నీలజ్యోతియై దేహమునుండి బయటికి వ్యాపించును. ఇప్పుడు ధ్యానములో కూర్చుంటే మాత్రమే కనిపించు ఆ జ్యోతి , నీకు జ్యోతి స్థితి సహజమైనపుడు  ఆదిత్య దర్శనమగును .  నువ్వు మధ్యాహ్నము పూట ఆదిత్యుని ఉపస్థానము చేయుచున్నట్లే ,  ఇక పైన విరామము దొరికినపుడల్లా ఆ ఆదిత్య మంత్రమును జపము చేస్తూ రా. ఇక కొన్ని రోజుల కోసము నువ్వు ఇల్లు వదలి వెళ్ళు ’ అన్నాడు. ఎక్కడికి పోవాలన్నది చెప్పలేదు "

" ఇదంతా వారికి చెప్పినావా ? "

" చెప్పినాను " 

" ఏమన్నారు ? "

        " సరే , నేను పరిగణించినట్లే అయినది . అయితే , నేను సావిత్ర మంత్రము అయితే చాలు అనుకున్నాను . యజ్ఞేశ్వరుని అనుజ్ఞయే అయిన తర్వాత , ఇక చెప్పేదేముంది ? కానీ , ఆదిత్య మంత్రమును జపిస్తూ ఉండు , తర్వాత ఇల్లు వదలి , ఉద్ధాలకుల ఆశ్రమమునకు వెళ్ళిరా ’ అన్నారు . "

" ఇంక చెప్పడానికేముందీ ? ఉద్ధాలకుల ఆశ్రమమునకు వెళితే అక్కడ నువ్వు చదివేది యేముంది ? వారు సామవేదులు కదా ? "

         " చూడమ్మా , సామములో హింకార సామము , హుంకార సామము అని రెండు ఉన్నాయి . వాటిలోని మంత్రాలను విస్తారము చేసి వ్యూహమును కట్టుటను సామము తోనే నేర్వవలెను . అదీకాక, ఉద్ధాలకులు బ్రహ్మిష్ఠులు . వారికి ఉపనిషత్తులపైన శ్రద్ధ ఎక్కువ. కాబట్టి , వారి ఉపనిషత్తైన ఛాందోగ్యోపనిషత్తునూ , మన ఉపనిషత్తులైన తైత్తిరీయ , కఠోపనిషత్తులనూ నేర్చుకుంటే సరిపోవును . అంతే కాక, ఇంకొక రహస్యము . తైత్తిరీయము మహా సంహితలనూ , పంచాత్మ సంక్రమణ విద్యను వివరిస్తుంది . కఠోపనిషత్తు శ్రేయోరూపమైన ఆత్మ విద్యను వివరిస్తుంది . ఛాందోగ్యము అవస్థాత్రయ పరీక్షణమును ముఖ్యముగా వివరిస్తుంది . ఈ మూడు విద్యలూ నేర్చులోపల నేను ముసలి వాడనైపోతాను . "

" అప్పటికి నేనేమౌతానో ఎవరెరుగుదురు ? ....."

      సరిగ్గా అప్పుడే బుడిలుల ఇంటినుండీ వార్త వచ్చింది , " బుడిలులకు ఆఖరి క్షణాలు వచ్చినాయి . ఆచార్య దంపతులతో పాటూ యాజ్ఞవల్క్యుడు కూడా రావలెనంట . " 

        ఆచార్యుడు గబగబా వచ్చి , భార్యా కొడుకులను చూసి , " నువ్వూ ఇక్కడే ఉన్నావా ? మంచిదైంది , పదండి , మనము ముగ్గురూ రావలెనని చెప్పి పంపినారు . యాజ్ఞవల్క్యా, నువ్వు ముందర నడు. నీ వెనకే మేమిద్దరమూ వస్తాము . బుడిలులకి నువ్వంటే చాలా ప్రేమాభిమానాలు . " అన్నాడు . 

యాజ్ఞవల్క్యుడు సరేనని ఉన్నవాడున్నట్లే బయలుదేరినాడు . 




No comments:

Post a Comment