SHARE

Sunday, February 17, 2013

35. " మహాదర్శనము " --ముప్పై ఐదవ భాగము --కొత్తదనము


35.ముప్పై ఐదవ భాగము --  కొత్తదనము


యాజ్ఞవల్క్యుడు ఇప్పుడు ఉద్ధాలకుల దగ్గర ఉంటున్నాడు . 

         ఉద్ధాలకులు , " ఎంతైనా నువ్వు అన్య శిష్యుడవు . కాబట్టి నేను నీకు బోధించుట విహితము కాదు . దానికోసము ఒక పని చేయి . నువ్వు , నీకు అర్థము కాని ఏ విషయము నైననూ తీసుకొని రా. దానిని మనము మన బుద్ధికి అనుసారముగా , శాస్త్రానుసారముగా విచారము చేయుదము . " అన్నారు .

        యాజ్ఞవల్క్యుడు అన్నాడు , " మీరు చెప్పినది శాస్త్ర సమ్మతమైనది . దానిలో సందేహమేమీ లేదు , అయితే , తమరు చెప్పినట్లు చేస్తే , సమానులైన అంతేవాసులలో ( సహ పాఠులైన శిష్యులలో ) దొరకునంత విద్య దొరకుతుందే తప్ప , గురువుల నుండీ దొరకు సంప్రదాయ శుద్ధమైన బీజవిద్య దొరకదు కదా , దానికేమి చేయుట ? " 

         ఉద్ధాలకులు తలయూపినారు : " నిజము , దానికి ఇలాగ చేయి , సంప్రదాయమును గురుముఖముగా అర్థము చేసుకొనుట ఒక విధము . అలా కాక , సమానులనుండీ , తనకన్న గొప్పవారినుండీ నేర్చుకున్న దానిని దేవతలకు అర్పించి ,  వారినుండీ ఆమోద ముద్ర ఒత్తించుకొనుట ఇంకొక విధము . ఇప్పుడు నా శంక మొదటిది సాధ్యము కాదని. అది పోనీలే , రెండవ దానిని చేయి . నాదగ్గర విచార వినిమయము వలన పొందిన దానినంతా దేవతా ముద్ర ఒత్తించుకొని సంప్రదాయ శుద్ధముగా చేసుకో . ఇలాగే , వెనుక ఒక మన్వంతరములో వేదములన్నీ ఖిలములై పోయినాయి . వాటిని సప్తఋషులు తపస్సు చేత మరలా సంపాదించినారు . నువ్వు కూడా అలాగే చేయి . నువ్వు అప్పుడే ప్రాణ దేవుడినీ , అగ్ని దేవుడినీ ఒద్దిక చేసుకొని మెప్పించినావు . ఇక మిగిలినది ఆదిత్యుడొక్కడే .! వాడిని అనుసంధానము చేయి . అతడు ప్రత్యక్ష దేవుడు . చాలా త్వరగా మచ్చిక అగును . అతనిని మెప్పించుకో . వాడి ముద్ర పడితే , అచేతనము కూడా చేతనమగును . "

" ఔను "

" అలాగంటే , నీకు అనుభవసిద్ధమైనదా , ఈ మాట ? "

" ఔను " 

" ఎలాగ ? " 

         " నేను ఈ ఆశ్రమమునకు వచ్చుటకు రెండు దినముల ముందర మా పెరటి తోటలో ఒక ఉసిరి చెట్టు ఉన్నట్టుండి ఎండిపోయినది . మా అమ్మ , చెట్టు బుడములో చెదలు పట్టినాయేమోనని మనుషులను పెట్టి తవ్వించి చూచినది . చెదలు కనిపించలేదు . మా తండ్రి గారు అటు వచ్చి , ’ ఈ చెట్టు ఎండిపోయినది ఎందుకో తెలియదు , ఎవరైనా మంత్ర సిద్ధులుంటే దీనిని పునరుజ్జీవనము చేయవచ్చు . " అన్నారు . మా అమ్మ ,  ’ అదెలా ? ’ అన్నారు . వారు , " అభ్యూహన మంత్రములు అని ఉన్నాయి . ఆ మంత్రములు తెలిసినవారు పఠించి , నీటిని అభిమంత్రించి ప్రోక్షిస్తే ఇది మరలా చిగురించును " అన్నారు . పక్కనే ఉన్న నేను అది విన్నాను . ఆ రాత్రి యజ్ఞేశ్వరుని అనుసంధానము చేసి , తండ్రిగారి మాటలను చెప్పినాను . ఆతడు నవ్వి , ’ ఏమిటి , మహర్షులకు అచేతనమును చైతన్య పరచు పిచ్చి పట్టుకుందా ? అని , ’ అది కూడా న్యాయమే , ఇవన్నీ క్షుద్ర సిద్ధులు . అయినా వీటిని పొందితేనే కదా , మనసుకు తాను వెళుతున్న దారి సరైనదా కాదా అని సమాధానము దొరికేది ? కానిమ్ము , నేను చెప్పితినని ప్రాణదేవుడిని ప్రార్థించు . అతడు తరువాత విషయము తెలుపును . ’ అని అనుజ్ఞ ఇచ్చి అంతర్ధానమాయెను . "

         ఉద్ధాలకులు , అగ్ని దేవుడు యాజ్ఞవల్క్యుడిని ’ మహర్షి ’ యని సంబోధించినాడు అని విన్నవెంటనే జాగృతులైనారు . కానీ మధ్యలో మాట్లాడుట సరికాదని ఊరకే ఉన్నారు . ఇప్పుడు మాట ఒక ఘట్టమునకు వచ్చినట్లై , దానిని అడుగవలెనని అనిపించినది . అయినా , అది అంత ప్రధానమైన మాట కాదు అని , దానిని వదలి , ఆడుతున్న మాటనే కొనసాగించినారు , " ఆ పిమ్మట? "

         అయితే మాటలో మొదటికన్నా గౌరవము ఎక్కువ కనపడుతున్నది . అప్పుడు , నోటిమాటగా ’ సమానులు ’ అన్నవారు , ఇప్పుడు కార్యతః దానిని ఒప్పుకున్నవారి వలె మాట్లాడినారు . 

          యాజ్ఞవల్క్యుడు అన్నాడు , " అనంతరము యజ్ఞేశ్వరుడి ఆజ్ఞ ప్రకారము ప్రాణదేవుడిని అనుసంధానము చేసినాను . ప్రాణదేవుడు దర్శనమిచ్చి , " నువ్వు యజ్ఞేశ్వరుని దయ వలన మహర్షియైనావు . నువ్వు అడిగినది ఇచ్చుటకు దేవతలు సిద్ధముగా ఉన్నారు . అలాగని చెప్పి , తోచిన ప్రతియొకటీ కోరవద్దు . ఇప్పటి మాట గురించి చెబుతాను , విను . నేను దేహగతుడనై ప్రాణము అనిపించుకున్నట్లు గానే , ఈ భువనమునంతటినీ ఆవరించి యున్నాను . కాబట్టి , తెలిసినవారు నన్ను ’ ముఖ్య ప్రాణుడు ’ అంటారు . ప్రాణము వలన ముఖ్య ప్రాణమును గుర్తించునదే ప్రాణోపాసన. నువ్వు నన్ను ముఖ్య ప్రాణుడిగా అర్చించి , అభ్యూహన మంత్రము చేత ఆ వృక్షమును అభిమంత్రించు . ఏమేమవుతుందో అదంతా గమనించు " అని , అభ్యూహన మంత్రమును ఉపదేశించినాడు . 

         ఉద్ధాలకులు తలాడించినారు . వారికి ఉపనయన సంస్కారము గుర్తుకొచ్చినది . " అప్పుడు ప్రాణము కోసము బ్రహ్మచర్యమును ఉపదేశించేవారు . ఈతడు దానిని సాధించి , ప్రాణ దేవుడిని ప్రసన్నము చేసుకున్నాడు . ఇంతటి వాడిని వదలిపెట్టుటకు వైశంపాయనులు కన్నీరు పెట్టుకోవడములో అతిశయమేముంది ? హూ ... నాకు కూడా కొంత అదృష్టము ఉండబట్టే ఈతడు నా వద్దకు వచ్చినాడు . మాకు తెలిసినదంతా ఈతనికి నేర్పి , ఈతనిని బ్రహ్మవిద్వరిష్ఠునిగా చేయవలెను " అనిపించినది .

" ఆ మీద ? "

         తెల్లవారినాక సూర్యుడు బారెడు పొద్దు ఎక్కినాక , అమ్మను పిలుచుకొని వచ్చి , ’ అమ్మా , నీ అనుమతి అయితే ఈ మాను మరలా చిగురిస్తుంది ’ అన్నాను . ఆమె నా మాటను నమ్మలేకపోయింది . ’ కానీవయ్యా, నీ నోటి చలవ వలన నాకు అంతటి శక్తి వస్తే ఎందుకు వద్దనాలి ? ఈ మాను చిగురించనీ ’ అన్నది . నేను వెంటనే కమండలము లోని నీరు తీసుకొని , అభ్యూహన మంత్రముతో అభిమంత్రించి ఆ చెట్టుపై చల్లి , మిగిలిన నీటిని చెట్టుమొదట్లో పోశాను . ఉత్తర క్షణమే మనసుకు ఏదో అనిపించి తలయెత్తి చూసినాను . అక్కడక్కడా చిగిరించడము కనిపించింది . అమ్మకు చూపినాను . ఆమె దానిని నమ్మలేక , ఒక సారి కన్నులు నులుముకొని , మరలా చూచినది . అంతలో చిగురు బాగా పెరిగి ఎర్రటి కెంపు వర్ణమునకు వచ్చినది . పరుగెత్తి వెళ్ళి తండ్రిగారిని పిలుచుకొని వచ్చినది . వారు అది చూసి , ’ ఇది ఎవరి పనితనము ? ’ అన్నారు . అమ్మ నన్ను చూపించింది .

         వారు విస్మితులై , ’ ఎలాగ చేశావు ? మంత్ర సిద్ధియా ? ’ అన్నారు . వారికి జరిగినదంతా చెప్పి , " మీరు నిన్న అభ్యూహన మంత్రము అని చెప్పితిరి . దాని వలననే ఇదంతా అయినది ’ అన్నాను . వారు తలఊపుతూ , ’ ఆలంబీ , వీర పుత్రుడిని పొంది వంశమును ఉద్ధారము చేసినావు ’ అని ఆమెను అభినందించి , ’ అయ్యా, నువ్వు మహర్షి తుల్యుడవైనావు . ఇక మేము ఏమైనా నీకు స్మారకులమే ( సాక్షులము ) గానీ శిక్షకులమగుటకు లేదు . ఇక  ఏమి చేయవలెనన్నది ఇంక మీదట దేవతల వలన తెలుసుకొని కృతకృత్యుడవు కమ్ము . అయితే , ఇదిగో , నాకు ఒక వరమునివ్వు . మనది కర్మఠుల వంశము . సత్కర్మ అనేది ఈ వంశపు సొత్తు . దానిని వదలవద్దు . దానిని దాటి ముందుకు పోతే మేము తట్టుకోలేము . కానీ , మేము వద్దనము , ముందుకు వెళ్ళు , కానీ వీలైనంత వరకూ కర్మమును వదలవద్దు . అదే నాకివ్వగలిగిన వరము . అవుతుందా ? " అన్నారు . వారి వాణిని విని నాకు కళ్ళనిండా నీరు వచ్చినది . వారికి నమస్కారము చేసి , ’ కర్మములన్నీ సాంగములగు వరకూ నేను బ్రహ్మ విద్యకు వెళ్ళను . ఈ మాటను దేవతలే నిలబెట్టనీ ’ " అని చేతులు జోడించినాను . 

        ఉద్ధాలకులు ఆశ్చర్యపోయినారు . వెనకటి కాలపు మహర్షి ఎవరో ఒకరు వచ్చి తమ సముఖములో కూర్చొని మాట్లాడుచున్నట్టు అనుభూతి కలిగినది . అయిననూ , ఎదురుగా కూర్చున్నవాడు వయో మానములో చిన్నవాడని , దానిని చూపించకయే అన్నారు , " అలాగైన , తండ్రి గారికి మాట ఇచ్చినావు ? " 

         " ఔను , కానీ దానికి ఏమి చేయవలెనో తెలియదు . ఇప్పుడు ప్రచారములో నున్న యజుర్వేదమును వినియోగించను యని ఆ దినము ప్రతిజ్ఞ చేసినాను . సంహితయే లేనప్పుడు , ఇక బ్రాహ్మణము ఎక్కడిది ? ఇదే చింతయయినది . " 

           " యోచించవద్దు , ఆ సంహితా బ్రాహ్మణములను వదలు . నీకు ప్రసన్నులైయున్న యజ్ఞేశ్వరుడు , ప్రాణ దేవుల దయ వలన ఇంకొక జోడి సంహితా బ్రాహ్మణములను పొందు. ఉపనిషత్తులు ఎవరి సొంతమూ కాదు , వాటిని ఎవరి వద్దనుండీ అయినా పరిగ్రహించ వచ్చును . "  

" అలాగయిన , సంహితయొక్క మంత్రములు , దాని అర్థమును వివరించు బ్రాహ్మణము-ఈ రెంటినీ కొత్తగా పొందవలెను అనే కదా తమరు చెప్పేది ? " 

        " ఔను , అప్పుడే అన్నాను కదా ? నువ్వు దేవతలనుండీ పొందుటకు ప్రయత్నించు . అప్పుడది కొత్తదవుతుంది . సరే , ఇప్పటికే ఈ దినము ఆలస్యమైనది . మరలా దీని గురించి మాట్లాడదాము " 

         యాజ్ఞవల్క్యుడు అనుజ్ఞ అని లేచినాడు . నమస్కారము చేసి వెళ్ళిపోయినాడు . ఉద్ధాలకులు బాహ్యంగా ఆతని నమస్కారమును గ్రహించి , అంతరంగములో ఆతడికి వారే నమస్కారము చేసినారు . 

No comments:

Post a Comment