SHARE

Saturday, February 16, 2013

34. " మహాదర్శనము " --ముప్పై నాలుగవ భాగము --బుడిలుల నిర్యాణము


34.  ముప్పై నాలుగవ భాగము--  బుడిలుల నిర్యాణము


         యాజ్ఞవల్క్యుడు వచ్చు వేళకు బుడిలులు స్నానము చేసి , శుద్ధాచమనము చేసి , పరిశుద్ధమైన మడిబట్టలను కట్టుకొని , మడిగా ఉన్న తెల్లటి బట్టను పరచిన దర్భాస్తరణములో పడుకుని ఉన్నారు . కాత్యాయనుడు పక్కనే కూర్చుని మంత్ర పారాయణము చేస్తున్నాడు . కాసేపటికి ఆచార్య దంపతులు కూడా వచ్చినారు . 

        బుడిలులు యాజ్ఞవల్క్యుని పక్కన కూర్చోబెట్టుకున్నారు . వాడి చేతిని తన చేతిలో పట్టుకొని యున్నారు . సంతోషముగా ఆచార్య దంపతులను పిలచి , మీ దర్శనము కావాలని వేచియున్నాను . ఇక పోవుటకు అనుజ్ఞయే కదా ? " అన్నారు . 

      భార్గవుడు పక్కన ఉన్నవాడు , " శుభ శంసనము చేస్తూ ఉండవలెనని మాకు చెప్పేవారు , మీరు మాత్రము అది చేయుట లేదు " అని ఆక్షేపణగా అన్నాడు . 

        అదివిని , బుడిలులు నవ్వినారు : " కాదయ్యా ఆచార్యా , నువ్వే చెప్పు . నాకూ అభిమానము వదలలేదు . మా కాత్యాయని కి నాలుగేళ్ళు . ఆమెకు పెండ్లియగు వరకూ ఉండవలెనని నాకు ఆశ. అంటే ఎన్ని సంవత్సరాలు ? ఇంకొక నాలుగైదు సంవత్సరాలు . అదయినాక  , ఇంకేదో ఒక ఆశ. బహుశః మనవడిని ఎత్తుకోవాలనో ఏమో ? అది కూడా అయితే ఇంకేదైనా ఒకటి . ఇలాగ పెరుగుచున్న ఆశ ముగిసే దెన్నటికి ? కాబట్టి , ఎక్కడికి తప్పితే అదేమేలు అనేది మంచిదా , లేక పెరుగుచున్న ఆశలకు చిక్కి ఆందోళన పడుట మంచిదా ? అయినా నాకు సహస్ర చంద్ర దర్శనమైనది . ఇక చాలు . మాకు ఆశ , అభిమానము తప్పియుండ లేదు , తప్పలేదు . అలాగని సద్గతిని మేము వదలిన వారము కాదు . మీరంతా ఆచార వృద్ధులు , తపో వృద్ధులు . మీ సన్నిధానములో దేహమును వదలి బ్రహ్మ లోకమునకు పోదామా అంటే , మా భార్గవ అడ్డు రావచ్చునా ? అదీకాక , ఇక్కడికన్నా అక్కడ ఆనందము హెచ్చు భార్గవా ! కాబట్టి ఆ యోచన వదిలేయి . "

        అప్పటికే బుడిలులకు ఆయాసమైంది . కొంచము నీరు త్రాగి , విశ్రమించి అన్నారు " ఈ నేను , నేను అనే మాట సరే , నేను మీ ముగ్గురినీ పిలిపించు కున్నందుకు కారణము చెపుతాను , వినండి . ఆచార్యా , మీ దంపతులు నాకొక మాట ఇవ్వవలెను . మా కాత్యాయనిని మీ యాజ్ఞవల్క్యునికి ఇవ్వవలెను . ఇలా జరగవలెననే , నేను యాజ్ఞవల్క్యుని శిష్యుడిగా అంగీకరించలేదు . ఏమి యాజ్ఞవల్క్యా ? దాని గురించి నీకు కోపమైతే వదిలేయి కానీ నాకు మాట ఇవ్వు . సుఖంగా ప్రాణము వదలుతాను . " 

ఆచార్య దంపతులు యాజ్ఞవల్క్యుని ముఖమును చూసినారు . వాడు నవ్వుతూ , " ఈ జన్మలో మీమాటే నాకు వేదవాక్యము " అన్నాడు . 

       ఆచార్యునికి చటుక్కున గుర్తొచ్చింది . కొడుకు బ్రహ్మవిద్యోపాసకుడై కర్మ సన్యాసమును చేస్తే గతి ఏమిటి యని తాను చింతించుచుండినది గుర్తొచ్చి , ఇది దానికి అడ్డమగుట అంటే తనకు అనుకూలమే కదా , సరే అనుకుని , ’ అట్లే కానివ్వండి ’ అన్నాడు . యాంత్రికమైననూ , సుప్రసన్నమైన మనోభావముతో మిగిలిన ఇద్దరూ అట్లే కానివ్వండి అన్నారు . 

       బుడిలులు , " ఒక భారము దిగిపోయింది . ఇంకొక మాట వినండి . మొన్నటి దినము ఉద్ధాలకులు వచ్చినారు . ఆచార్యా ! , మీ కొడుకును వారివద్ద కొన్ని సంవత్సరాలు వదలి ఉండు . వారు బ్రహ్మ నిష్ఠులు . అనేక రహస్యములను తెలిసినవారు . వారు మొదట మొదట్లో , ’ అన్య శిష్యుడు , నాకెందుకు ? " అన్నారు . నేను ఏమేమి చెప్పవలెనో  అదంతా చెప్పినాను . చివరికి వారు ఒప్పుకొను వరకూ వదలలేదు . వారిదగ్గర కుమారుడు సామవేదమునూ , బ్రహ్మవిద్యనూ ఎంతో కొంత అధ్యయనము చేయనీ . నా మాట విను . యాజ్ఞవల్క్యా , నాకూ తెలుసు , నువ్వు ఆశ్రమములంటే వేసారి పోయినావని . అయినా ఈ ముసలివాడి మాట గౌరవించి అక్కడ ఉండు . ముందు ముందు అన్నీ నీకు అనుకూలమే అవుతాయి. " అన్నారు . 

       ఆ వేళకు వారికి ఆయాసము ఎక్కువై , కష్టము మీద ఊపిరి పీల్చుట మొదలైనది . బహిర్ముఖమై ,  వారలు వీరలతో మాట్లాడుతున్నవారు చటుక్కున ఆకాశము వైపుకు తిరిగి , " ఇదిగో మా పితరులు " అని లేచి కూర్చొని చేతులు జోడించినారు . -" ఒరే !  ఎవరక్కడ ? అర్ఘ్య పాద్యాదులకు నీరు తీసుకు రండి . వారికి ఆసనమును ఇవ్వండి . అల్పాహారమును అందించండి " అని , యాజ్ఞవల్క్యుని వైపుకు తిరిగి , చూచితివేమయ్యా ? నువ్వు వచ్చినావని వారు వచ్చినారట ! ఏమి భాగ్యము ! " అని ఆగినారు . 

         ఆయాసము ఇంకా ఎక్కువైనది . బుడిలులు చివరి ఘట్టములో ఉన్నారని తెలిసి వైశంపాయనులూ , ఉద్ధాలకులూ వచ్చినారు . కాత్యాయనుడూ , భార్గవుడూ పరుగెత్తి వెళ్ళి వారిని పిలుచుకొని వచ్చినారు . యాజ్ఞవల్క్యుడు శయ్య పక్కన కూర్చున్నవాడు లేచి పక్కకు వెళ్ళి నిలుచున్నాడు . ఆచార్యులు , తదితరులు లేచి వారిని నిశ్శబ్దముగా ఆహ్వానించినారు . వచ్చిన వారి దృష్టి అంతా బుడిలులపైనే ఉంది . 

        బుడిలులు కష్టపడి చేతులెత్తి మొక్కి , మా పితరులు వచ్చి రమ్మంటున్నారు . వారు ఇప్పుడే అనుమతి నిచ్చినారు . ఇక నేను బయలుదేరెదను . నాకు బ్రహ్మ లోకములో స్థానమట . పోయిరానా ? అందరూ అనుమతించండి " అని మరొకసారి చేతులెత్తి మొక్కినారు . అటూ ఇటూ తిరిగి చూచి , ’ మా యాజ్ఞవల్క్యుడెక్కడ ? ’ అని అడిగి , సమీపమునకు వచ్చిన వాడిని చూసి , " పోయి వస్తానయ్యా , అనుమతించు " అని ఒరిగిపోయినారు .

       వైశంపాయనులు యాజ్ఞవల్క్యుని చూసి , ఆ స్థితిలో కూడా ఆదరముతో తమ పక్కకు చేయిపట్టి లాగుకున్నారు . వారు మాట్లాడకున్ననూ , వారి తడి కళ్ళు మాటలకన్నా ఎక్కువ పరిపూర్ణముగా వారి భావమును చెప్పుచున్నట్లుండెను . యాజ్ఞ వల్క్యుడు తల వంచినాడు . అతడి ముఖము కనపడకున్ననూ , వినయముతో వంగియున్న దేహ ముద్ర గురు భక్తిని నిస్సందేహముగా ప్రదర్శిస్తుండినది . 




No comments:

Post a Comment