SHARE

Sunday, January 27, 2013

21. " మహాదర్శనము "--ఇరవై ఒకటవ భాగము -- వికిరణమవుతున్నది


21.  ఇరవై ఒకటవ భాగము -- వికిరణమవుతున్నది


         ఆలంబిని హోమధేనువును పిలుచుకొని లోపలికి  వెళ్ళునపుడు , కుమారుని ఎత్తుకొని వచ్చినవాడు గోశాల వాకిట నిలచి , ’ అమ్మా , ఈపొద్దు ఒక ఇసిత్రమైంది ’ అన్నాడు .

         ఆమెకు కుతూహలము అలలా లేచింది . పశువుల కాపరి ఏమి విచిత్రము చూచినాడు ? పక్కనే అడవిలో పులులు ఉన్నాయని ఆమె వినియున్నది . ఈ దినము ఏదైనా పులి వచ్చిందా ? ఏదైనా మేకనో ఆవునో పట్టినదా ? అని గాబరా పడింది . అయితే ఆ గాబరా , ఎదురుగా ఉన్న వాడి చిరునవ్వు వలన శాంతమై , ’ ఏమది ? ’ అన్నది .

         " ఈ పొద్దు చిన్న సాములోరిని అంపించినారు గదా , నేను ఆరి దారిలో రాళ్ళు ముండ్లు కాలిగ్గుచ్చుకుంటాయని బుజాల మీది కెత్తుకుంటిని . పోతావుంటే , దారిలో ఏమైందనుకొంటిరి ? ఆరి మై నుండీ ఏందో కారి వచ్చినట్లాయ . అదేమో ఎరిక పడలా , నేను యా పొద్దైనా చూసి ఉంటే గదా , ఇట్లా అయ్యిందని సెప్పేందుకు ? నేనెప్పుడూ దాన్ని సూసుండ లేదు , అది వచ్చి నా మై అంతా నింపి , నాకు అది సాలదన్నట్ల నిద్దరొకటా ? ఇంకో ఇసేసము ఏందంటే ఆ నిద్దట్లోనే ఒక్కడుగు కూడా ఎక్కుతక్కువ కాకుండా సలీసుగా మైదానానికి పోయినాను . వొచ్చేతప్పుడు కూడా చూసినా . అప్పుడూ అట్లే ఆయ. " 

         ఆలంబినికి ఒక దేహము నుండీ ఇంకొక దేహమునకు ఏమి వస్తుందో అర్థము కాలేదు , అయినా యజమానురాలనన్న బింకముతో , ’ అట్లేమి ? నేను విచారించి , ఏమిటన్నది రేపు చెబుతాను " అని వెళ్ళి పోయింది . 

          తలిదండ్రులతో పాటు పిల్లవాడు సాయం స్నానం చేయుట వాడుక అయిపోయింది . కొడుకు , అగ్నిమందిరము లోపలికి స్నానము చేయకుండా పోవుటకు లేదు అని తెలుసుకున్నాడు . తండ్రి , మడి కట్టుకున్న తర్వాత , ఒక మడి చౌకమును కొడుకు కోసము తెచ్చి పెట్టును . కొడుకు అది కట్టుకొని వెళ్ళి,  తల్లి మడి కట్టుకొని వచ్చు వరకూ అగ్ని మందిరములో కూర్చొనును. ఇది వాడి దిన చర్య అయి ఉండినది . 

         తల్లి కొడుకుకు మడి కట్టినది . గోపాలకుడు చెప్పినది ఆమె మరచిపోలేదు . " అదే మనస్సులో ఉన్నందుకేనా , వాడి ఒళ్ళు ముట్టుకోగానే నాకు ఒళ్ళు ఝుమ్మనింది ? మరి వాడిని ఎత్తుకున్నపుడు ముందెప్పుడూ ఇలాగ కాలేదే ? దీనిలో విశేషమేమిటి ? " అని ఆమె విహ్వల యై దాని అర్థము తెలియకనే పోయింది . " సరే , ఈ దినము వారికి చెప్పెదను " అనుకున్నది .

         ఇక్కడ , మడికట్టుకొని వెళ్ళిన కొడుకు , ధేనువు చెప్పినది తల్లికి ఎప్పుడెపుడు చెబుదామా అని కాచుకున్నాడు . అయితే , తండ్రి ఎదురుగా గంభీరుడై కూర్చున్నాడు . తండ్రికి ఈ పూట ఏమైనదో  ఏమో , జపము చేస్తుండగా కొడుకు వచ్చి తొడపైన కూర్చున్నట్టూ , వాడి నుండీ ఏదో శక్తి ప్రవాహము వాహినిగా వచ్చినట్టూ , వాడేదో అడగవలెనని ప్రయత్నిస్తున్నట్టు , ఏమేమో కనిపిస్తున్నది . ఎప్పుడూ ఇలాగ కాలేదు . చివరి కొకసారి కొడుకు వచ్చి తొడపైన కూర్చున్నట్టు అనిపించి కళ్ళు తెరచి చూసినాడు . కొడుకు గోడ పక్క పద్మాసనము వేసుకొని , ధ్యానాసక్తుడైనట్టు కళ్ళు మూసుకొని కూర్చున్నాడు . తమకేల ఇట్లాయెనని అలాగే చంచల మనస్సుతోనే జపము ముగించినారు . 

         అప్పటికి ఆలంబిని వచ్చింది . ఎప్పటివలె కాకుండా మంత్రములను ఆవృత్తి చేయుచున్నట్లు గట్టిగా చెప్పుతూ కర్మను ముగించినారు . జరిగినదంతా భార్యకు చెప్పవలెనని భర్తకు చపలము . అయితే , కొడుకున్నపుడు చెప్పేదెలా అని తాళుకున్నారు . భార్యకు గోపాలకుని నివేదిక , తన అనుభవము-వీటిని గురించి భర్తకు చెప్పవలెనని ఆత్రము . అయితే దేనికీ  వ్యవధి లేదు . కొడుకుకు ధేనువు ప్రసంగము తల్లికి చెప్పవలెనని ఉబలాటము . అయితే , ఆమె చేతినిండా పనియని , తానే కల్పించుకున్న విలంబము. ఈ చపలము , ఆత్రము , ఉబలాటములలోనే తండ్రీ కొడుకులకిద్దరికీ భోజనమయ్యింది . భోజనమవగానే కొడుకుకు నిద్ర వచ్చింది . దాన్ని నిలుపుకోలేక అక్కడే పడుకున్నాడు . తల్లి , అక్కడున్న ఒక కృష్ణాజినమును పరచి , కొడుకును పరుండబెట్టి , ఒక తుండు కప్పి , నిద్రపుచ్చింది .

          ఆలంబిని పనులన్నీ ముగించుకొని పడుకొనుటకు వెళ్ళునపుడు ఒక చేతిలో కొడుకును , ఇంకో చేతిలో తాంబూలపు పళ్ళెమును తీసుకొని వెళ్ళినది . కొడుకు ఒంటినుండీ మనసుకు తెలియునట్లు సుఖ స్పర్శ ఉన్న వాహిని యొకటి వస్తున్నది అర్థమగు చున్నది . తాంబూలపు పళ్ళెమును పట్టుకున్నందు వలన , దానినుండీ ఏమీ రాకుండా జడముగా ఉన్నందువలన , కొడుకు నుండే ఏదో వికిరణము అవుతున్నదనుటలో ఏ సందేహమూ లేదు .  

          కొడుకును పడుకో బెట్టునపుడు ఆలంబిని భర్తతో , ’కొడుకు నొకసారి ముట్టి చూడండి’ అన్నది . అతడికి గాబరా. ’ ఈ దినమంతా కొడుకు చాలా ఎండలో ఆటాడి వచ్చినాడు , జ్వరము గిరమేదైనా వచ్చిందో ఏమో ? ’ అనుకొని " ఏమిటి ? ఏమైంది ? " అని ముట్టినాడు . అతని చిత్తవృత్తికి నెమ్మది అయినది . ముఖముపై కౌతుక భావము వచ్చింది ." ఇదేమిటీ విచిత్రము ? " అని మరియొకసారి ముట్టుకొని ఒక ఘడియ అలాగే ఉన్నాడు . 

భార్య అడిగింది , "  మంట వద్ద కూర్చుంటే వేడి వచ్చినట్లే , దీపము నుండీ చిమ్ము వెలుగు కిరణాల వలె ఏదో వస్తున్నది కదా ? "

         " ఔను , ఏమిటన్నది నాకు అర్థము కాలేదు . అందుకే చూస్తున్నా. వీడేమో సుఖంగా నిద్రపోతున్నాడు . శాంతముగా ఊపిరి తీసి వదలుతున్నాడు . కాబట్టి , ఇది రోగము కాదు . నాకు  కూడా అప్పుడప్పుడు ఇలా అవుతుంది , కానీ అదేమిటో తెలియదు . బుడిలులను అడగవలెను " 

         ఆలంబిని , తనకు గోపాలకుడు చెప్పిన వృత్తాంతము , స్నానము చేయిస్తున్నపుడు అనుభవము , ఇవన్నీ చెప్పినది . భర్త , జపము చేస్తున్నపుడు జరిగినది చెప్పినాడు . ఇద్దరూ కలసి ఒక సిద్ధాంతమునకు వచ్చినారు . " ఇప్పుడు యాజ్ఞవల్క్యునిలో ఏదో మార్పు వచ్చింది . బాల్య చాపల్యమైతే ఎప్పుడూ లేదు కానీ , ఇప్పుడు గాంభీర్యము ఇంకా ఎక్కువైనట్టుంది . వాడి మాటలు కూడా వాడి వయస్సుకు మించినవి . కానీ , వాడి నోట విన్నపుడు అలాగనిపించదు . " 

         " రేపటి దినము అగ్నిహోత్రమైన వెంటనే బుడిలుల ఇంటికి వెళ్ళి ఈ సంగతేమిటో అడగిరావలెను " అని భర్త , తన నిర్ణయాన్ని భార్యకు చెప్పినాడు . మరలా ఒకసారి నిద్రపోతున్న కొడుకును ముట్టినాడు . వికిరణము కొంచము తక్కువయింది . 

         మరుసటిరోజు అగ్నిహోత్రాదులు అయిన తరువాత , ఆచార్యుడు బుడిలులను చూచుకొని వచ్చుటకు సిద్ధమైనాడు . అతడు సిద్ధమగుతుండగా ఆలంబిని కొడుకును పిలుచుకొని వచ్చినది . అతడికి కూడా , బయలుదేరుటకు ముందొకసారి కొడుకును పిలచి తొడపై కూర్చోబెట్టుకొని ఏమవుతుందో అని చూడవలెననిపించినది . 

         ఆలంబిని అన్నది , " మీ కొడుకు అగ్ని , ఆదిత్య , వాయువుల గురించి మాట్లాడుతున్నాడు . దేహములోని ప్రాణము , ఈ జగత్తునంతటినీ ఆవరించిన ప్రాణము, వీటి గురించి చెపుతాడు , వినండి " 

         దేవరాతుడు ఆశ్చర్యపడుతూ అడిగినాడు , " ఏమిటయ్యా , నాకు కూడా చెప్పూ , ". కొడుకు ఏ సంకోచమూ లేకుండా  స్థిరముగా , ధేనువు చెప్పినదంతా చెప్పినాడు . తాను అగ్ని పురుషుని చూచినది , ఆ అగ్ని పురుషుని జ్వాలామండలములో తల్లిదండ్రులు ఇద్దరూ సుఖముగా నున్నది కూడా చెప్పినాడు . అదంతా విని ఆచార్యునికి భయము పట్టుకున్నట్లాయెను . అయితే , కొడుకు ముందర తాను తన భయాన్ని చూపించుకోకూడదని , " సాధు , సాధు . మేము చేసిన పుణ్యాల ఫలము నువ్వు . ఇకముందు ఇలాగేమయినా జరిగిన , నాకు వచ్చి చెప్పు , ఇప్పుడు నేను బుడిలుల ఇంటికి వెళ్ళి వస్తాను , సరేనా ? " అని అనుమతి నడిగే వాడి వలె అడిగి బయలుదేరాడు . వెళ్ళునపుడు మరచిపోకుండా కొడుకును ఎత్తుకొని , ఒక ఘడియ తొడపై కూర్చోబెట్టుకొని , కొడుకు దేహము తేజస్సును కక్కుతున్నట్టూ , అది హితముగా ఉండుటనూ అనుభవించి , " ఇదేమిటై యుండును ? " అని మనసులోనే ప్రశ్నించుకుంటూ వెళ్ళినాడు .

No comments:

Post a Comment