SHARE

Saturday, January 26, 2013

20. " మహాదర్శనము --ఇరవయ్యవ భాగము-- విచిత్రానుభవములు


20.  ఇరవయ్యవ భాగము---విచిత్రానుభవములు 


           మరుసటిరోజు తెల్లవారింది . కొడుకుకు తల్లి స్నానము చేయించినది . ఎప్పటివలె వాడూ అగ్నిమందిరములో శాంతముగా కూర్చున్నాడు . అగ్ని పరిచర్యమంతా అయిపోయింది . కొడుకు శాంతముగా నున్నది చూసి , వీడు ఈ దినము ఆవుల వెంట వెళ్ళడేమో అనుకున్న తల్లి ఎప్పటిలా గోశాలకు బయలుదేరింది . 

కొడుకు , ’ అమ్మా , ఈపూట నేను వెళ్ళవలెను, హవిస్సు చేసినావా ? " అని అడిగినాడు . 

          బయలుదేరిన తల్లి నిలచి ,’ ఇదిగో చేస్తాను ’ అని ఇంత బియ్యము వేయించి పొయ్యిపైన ఉంచి వచ్చింది .( గంజిని వార్చకుండా , వేయించిన బియ్యముతో చేసిన అన్నమునకు హవిస్సు యని పేరు ) ఆవుపాలను పిండు వేళకు హవిస్సయింది . దానిని తిని యాజ్ఞవల్క్యుడు  గోపాలుర వెంటే ఆవుల వెనక బయలుదేరినాడు . 

         ఆలంబినికి ఆలోచన . మూడు సంవత్సరముల వాడిని ఆవులవెంట పంపించినానే , అని . అయితే , చూచుటకు ఐదు సంవత్సరముల వయస్సు వాడికన్నా పెద్దవాడిలా కనిపించు కొడుకు బయలుదేరుటకు సిద్ధమైనపుడు ఆ ఆలోచనే అడ్డురాలేదు . " దిగులెందుకు ? జట్టులో పెద్దలు ,  పిల్లలు అందరూ ఉన్నారు కదా ? " అని తనకు తానే చెప్పుకొని తన పనిలో నిమగ్నమైనది . 

         ఆవులు మందలో అంతసేపు ఉండి , ఎండ ఎక్కువ కాగానే ముందుకు సాగినాయి . అదే సమయమునకు గోపాలుర పెద్దలు కూడా తెల్లటి కండువాలతో తలపాగాలు చుట్టుకొని , భుజాన గొంగళి వేసుకొని , చేతిలో ముల్లుగర్రలూ పట్టుకొని , నోటిలో వక్కాకులు , పొగాకు వేసుకొని , ’ ఈబూతి ’ ధరించి వచ్చినారు . వారిలో పెద్దవాడొకడు ముందు నడుస్తున్నాడు . వాడి వెనక ఆవులు , వాటి వెనుక ఇతరులు . వారితో యాజ్ఞవల్క్యుడు . 

         వారిలో నడి వయస్సు వాడొకడు ఆ బాలుడిని చూసి , ’  ఏందయ్యా , నువ్వు వచ్చిండావు ? ఈ దావలో రాళ్ళు , ముండ్లే ఎక్కువ , దా , నా బుజము పైన కూకో ’ అని ఎత్తుకున్నాడు . 

          అతడికి రెండడుగులు వేసేలోపే  ఆశ్చర్యమైనది . కుమారుడు తన వయసు వారికన్నా బరువు ఎక్కువ అనునది వాడి ఆకారమే చెబుతుండినది . అదెలా ఉన్నా , వాడిని భుజముపైన కూర్చోబెట్టుకుంటే వాడినుండీ ఏదో సొన వలె తన దేహమునకు దిగుతున్నట్లు తోస్తున్నది . ఏదో కారణము చెప్పి , పిల్లవాడిని దింపి చూచినాడు , ఏమీ లేదు. మరలా ఎత్తుకున్నాడు . మరలా ఆ సొన ప్రవహిస్తున్నది . ఆ వాహిని తనకు వద్దనపించలేదు , ఏదో హితముగా ఉండినది , సుఖముగా ఉండినది , ప్రియముగా ఉండినది . 

          ఇంకొక పది అడుగులు వేయగానే అతడికే తెలియకుండా నిద్ర వచ్చేసింది . ఆ నిద్రలోనే సరిగా ఊపిరి వదలుతూ , అడుగులు కొంచము కూడా తప్పకుండా  సరిగ్గా వేస్తూ అందరికన్నా వెనుక దారి ఏమాత్రమూ తప్పకనే వెళ్ళినాడు . ఆవుల మంద గడ్డి మేయు పచ్చికబయలు ఊరినుండీ చాలా దూరమేమీ లేదు . కుమారుని ఎత్తుకున్న వాడు మైదానమునకు చేరు వరకూ ఒక్క అడుగు కూడా తప్పుగా వేయలేదు . మంద వెళ్ళి పచ్చిక మేయుటకు ఆరంభమగు వేళకు అతడు కూడా అక్కడికి చేరినాడు . అక్కడికి వెళ్ళగానే మెలకువ అయినది , కుమారుని దింపినాడు . 

          అతడికి , తాను నిద్రపోయినది నిజమేనా ? అని సందేహము . కానీ నిద్ర లేచినవాడికి ఉండే తాజాతనముంది . ఒంట్లో కొంచము కూడా ఆయాసము లేదు . దారిలో ఏమైనదన్నది ఒక్కటీ తెలీదు . కళ్ళు తెరచే ఉన్నానా , లేదా అన్నదీ తెలీదు . ఇలా ఉన్నపుడు నిద్ర రాలేదు అనుట ఎలా ? 

అయినా వాడు ఎవరితోనూ ఆ విషయము ప్రస్తావించలేదు . కానిమ్ము , వెళ్ళునపుడు చూద్దాము అని ఊరకున్నాడు . 

         కుమారుడు ఇతరులు ఆటకు పిలచినా పోలేదు . తనపాటికి తాను కూర్చున్నాడు . వాడికి , ఇంతవరకూ ఎవరో తన వెనుక వెనుకే ఉన్నట్లు అనిపించు చుండినది . ఇప్పుడు మనసుకు నమ్మకము వచ్చింది , ఎవరో అంగ రక్షకులవలె వెంట ఉన్నట్లు తెలిసింది . ఎవరు అని అడుగవలె ననిపించలేదు .

        మందలోని పశువులు అపరాహ్ణము దాటే వరకూ మేత మేసి , నీరు త్రాగి , నీడలో పడుకున్నాయి . కుమారుడు వెళ్ళి , తనతో మాటాడిన హోమధేనువు వద్ద కూర్చున్నాడు . 

" మొత్తానికి మాతో వచ్చినావే ? " 

" మీరు చెప్పిన తర్వాత ఇంకేమి , వచ్చేసినాను " 

" సరే , ఈ దినము ఏదైనా విశేషమును చూచినావా ? "

" ఏమీ చూడలేదు "

" నీతో పాటు నీ కాపలాకు ఒకరు వస్తున్నట్లు లేదూ ? "

" ఎవరో ఉన్నట్లు , చూచినట్లు అనిపించినది.  , అయితే అది నిజమేనా , ఒకరు ఉన్నారా ? "

" ఆతడే అగ్ని పురుషుడు . ఈ లోకములో మంటయై మండువాడు , దీపమై వెలుగువాడూ ఆతడే . చూడు , అతడు నీ పక్కనే ఉన్నాడు . జనాలతో పూజలు చేయించుకొని , కావలసినది ఇస్తాడు . " 

" పూజ చేయకుంటే ? "

" ఆతడు తన పాటికి తానుంటాడు . దేవతలను మనుషుల వైపుకు తిరుగునట్లు చేసేదే పూజ. "

ఆనాడు తల్లి అగ్ని మందిరము వైపుకు తిరిగి నమస్కరించినది గుర్తొచ్చింది . అడిగినాడు , ’ అట్లయితే నమస్కారము చేసేది కుడా పూజేనా ? ’ 

" సందేహమే లేదు . ధూప దీప నైవేద్యములను అర్పించు పూజ ఒకటైతే , ఊరికే నమస్కారము చేసేది కూడా ఇంకొక రకము పూజ. సరే , నీ వెనకా, పక్కనా వస్తున్న అగ్ని దేవుడిని చూచినావా ? "

" ’ నేనున్నానని తెలుసుకుంటే చాలు , చూడవద్దు , తర్వాత ఆవు చెప్పేది విను ’  అంటున్నాడు . అందుకే నమస్కారము చేసి పూజ చేసినాను "

" సరే , విను . ఈతడు భూలోకము నందున్నట్లే , ఆకాశము లోనూ , భూమ్యాకాశాల మధ్య అంతరిక్షములోనూ ఉన్నాడు . "

" అంటే ఈతడే పైనున్న ఆకాశములోనూ , మధ్యలోని అంతరిక్షము లోనూ ఉన్నాడా ? " 

" ఔను . ఆకాశములో ఆదిత్యుడైయున్నాడు . అంతరిక్షములో వాయువై యున్నాడు "

" అట్లయితే కాల్చే సూర్యుడూ , వీచే వాయువూ ఈతడేనా ? "

" కాదేమో అతడినే అడుగు .నువ్వు దీనిని జ్ఞాపకము ఉంచుకో . అగ్ని , ఆదిత్యుడు , వాయువు ముగ్గురూ ఒకరే ! " 

" ముగ్గురూ వేరే వేరే అనునదేమో తెలిసింది . కానీ ఒకటే అనేది ఎలాగ ? "

" పిచ్చీ , మొక్కలో వేరూ చిగురూ ఒకటే కాదా ? అయినా రెండూ ఒకటేనా ? అలాగే వీరు ముగ్గురూ ఒకటే అన్నదీ నిజము , వేరే వేరే అన్నదీ నిజము . ఆలోచించి చూడు నీకే తెలుస్తుంది "

          కుమారుడు ఆలోచించినాడు , " అమ్మ కూడా ఈ మాట ఎప్పుడో చెప్పింది . ఎప్పుడు ? ఆ ! తెలిసింది , భద్రం కర్ణేభిశ్శ్రుణుయామ  దేవాః అన్నపుడు:  దేవాః అన్నది , నేను అడిగినాను , అప్పుడు , ఔనయ్యా ! ప్రాణ మండలము నుండీ దేవతలు అందరూ వస్తారు . మంట మండునపుడు నిప్పు కణములు ఎగురుతాయి కదా అలాగే ! అన్నది . అట్లయితే ఈ ధేనువు చెప్పేది కూడా అదేనా ? అమ్మ ఇంకా చెప్పింది : పూర్ణమదః చెప్పునపుడు ఆ బ్రహ్మ పూర్ణుడు , ఎందుకంటే , ఈ దేవతలందరూ వారిలో ఉండేవారు . వీరు వేరే వేరే అయినపుడు జగత్తు వచ్చింది అని . అడిగితే మంచిది కదా , ’ ధేనువా , నువ్వు చెప్పేది ఇలా ఉండాలి , మొదట కలసి ఉన్నారు , తర్వాత వేరే వేరే అయినారు , అని ! " 

" ఔను , దానితో పాటు ఇంకోమాట చెప్పాలంటే , మరలా ఒకటవుతారు అని " 

" అట్లయితే ఎవరైనా కావాలీ అంటే మరలా ఒకటవుతారా ? "

        " అవుతారు . ఎవరి కోసము వారు ఒకటవుతారో  వారు , శ్రేయస్సు దారి యొక్క ఆ చివరను చూచువారు . అలా కాక , ఎవరి ఇఛ్చయూ లేక , వారే తాముగా ఒకటవుతే  అది ప్రళయము . " 

         కుమారుడు మరలా ఆలోచించినాడు , ఇది కూడా అమ్మ చెప్పింది ,’ శ్రేయస్సు దారిలో వెళ్ళువారు మొదట దేవతలు వేరే వేరే అనుకొని చివరికి అందరినీ ఒకటిగా చూస్తారు . అప్పుడు పూర్ణ దర్శనము , అదే మహా దర్శనము .’  తల్లి పక్కనే నిలబడి చెప్పినట్లాయెను . ఆ గొంతు విని అతనికి ఏదో విచిత్రమైన సంతోషమై తిరిగి చూచినాడు , తల్లి :  ఆమె ఎదలో తండ్రి : మాట తల్లిది: అర్థము తండ్రిది : ఏమో ఎందుకో ఇంకోవైపుకు తిరిగి చూచినాడు , అక్కడ మరలా తల్లిదండ్రులు. అయితే ఈ సారి వారిద్దరినీ ఆవరించిన అగ్ని . అగ్ని ప్రసన్నుడై ఉన్నాడు . వారిని ఆవరించిననూ వారిని కాల్చడు అని కొడుకుకు ఎటులో మనోగతమైనది . 

ఉన్నట్టుండి ఏదో మరచినానే అనిపించెను , అమ్మ , ’ పశువు మాట్లాడింది అంటే ఏమిటీ ? ’ అన్నది గుర్తొచ్చింది . ధేనువును అడిగినాడు :

" సరే , నువ్వు చెవికి వినిపించునట్లు మాట్లాడలేదు , అయితే , నేను నీ మాటను విన్నాను . ఇది అమ్మకు ఎలా చెప్పేది ? " 

          ధేనువు నవ్వింది " నీకెందుకు అంత తొందర ! నువ్వు పుట్టినదే జగత్తుకు చెప్పడానికి . దీనిని తల్లికి చెప్పకనే ఉందువా ? సరే , ఇది విను . ప్రతి దేహములోనూ ప్రాణమున్నది .  ఆ ప్రాణమే భూమినుండీ ఆకాశము వరకూ సర్వమునూ వ్యాపించియున్నది . ఆ ప్రాణము ప్రతి దేహములోనూ ప్రాణము , అపానము , వ్యానము , ఉదానము , సమానము అని ఐదు రూపములుగా ఉంది . వాటిలో మాట్లాడు పని అంతా ఉదానముది . నా దేహములో నున్న ఉదానము ఈ నా దేహయంత్రములో ప్రకటిత మైనపుడు మాత్రమే నీ చెవి దానిని వింటుంది . అటులకాక, అదే ఉదానము వాక్కుగా ప్రకటితము కాకుండా , వెనక్కు తిరిగి నా ప్రాణమునకు వచ్చినపుడు , మాటగా పలకవలసిన అర్థమంతా భావముగా మారి , నా ప్రాణము ఆ భావమును నీ ప్రాణమునకు ఇస్తుంది . అప్పుడు నువ్వు దానిని భావముగా మాత్రమే గ్రహిస్తావు . అయితే నీ ఉదానము దానిని పెంచినపుడు నీ మనసు దానినే మాటగా గ్రహిస్తుంది . ఇది దూర శ్రవణ విద్య . దీనిని ఎవరు కావాలన్నా చేయవచ్చు , చేయరంతే ! " 

ధేనువును మరలా అడిగినాడు , " అయితే అమ్మ కూడా చేయవచ్చునా ? " 

        " చేయలేదేమో అడుగు ! ఎన్నో రోజులు పొయ్యి ముందర కూర్చున్నపుడు ఆమె నిన్ను చూడవలె ననుకొంటుంది . ఎక్కడో ఉన్న నీకు అది తెలిసి పిలవకున్ననూ నువ్వు మీ అమ్మ దగ్గరికి పరుగెత్తి వస్తావు ఔనా , కాదా ? అది దూర శ్రవణ విద్య కాదా ? " 

" మరి , అందరూ దీనిని నమ్మరెందుకు ? "

         కాల దేశముల వలన కలుగు పరిమితులను ఒప్పుకున్న మనసు దీన్నెలాగ నమ్ముతుంది ? వారిని అడుగు , ’ మీరు కలలు కనరా ? అప్పుడు మాట్లాడుతున్నారు కదా ? నాలుక ఆడలేదు , పెదవి కదపలేదు , చెవులు వినలేదు , అయినా మీరు మాట్లాడినారు , విన్నారు , అది ఎలాగ ? అని అడుగు " 

         ఆ వేళకు ఎండ పడమరకు దిగింది . ఇంటికి వెళ్ళు పొద్దయిందని కాపరులు మందలోని పశువులను హెచ్చరిస్తూ వచ్చినారు . కుమారుడు వారి అర్థములేని శబ్దములను విన్నాడు . పశువులు అది విని అర్థము చేసుకున్నట్లే లేచినాయి . " ఔను , ధేనువు చెప్పినది సరియే , ప్రాణ ప్రాణమూ జగత్ప్రాణుని పిల్లలు . అవి భావమును ప్రాణము నుండీ సంగ్రహించును . " 

ఇంకొంచము సేపటిలోగా వచ్చినప్పటి లాగానే జాతర బయలుదేరింది . ముందర ఒకడు , వాని వెనుకే పశువులు , వాటివెనుక పిల్లలు , ఇతరులు . 

         వచ్చినపుడు తనను ఎత్తుకొని వచ్చినవాడు మరలా కుమారుని వద్దకు వచ్చి , " రావయ్యా , ఎత్తుకుంటాను " అన్నాడు . కుమారుని ఎత్తి భుజముపైన కూర్చోబెట్టుకున్నాడు . అతడికి పొద్దున కలిగిన అనుభవము అబద్ధము కాదు అని అర్థమైనది . అతడికి కుమారుని దేహము నుండీ ఏదో వాహిని వచ్చి తన దేహమునంతా వ్యాపించునది అనుభవమైనది . దాని వెనకే చిన్నగా సుఖ నిద్ర అల ఒకటి వచ్చింది . దానివలన మెలకువ అగు వేళకు పశువులన్నీ ఇంటి వాకిలి వద్దకు వచ్చియున్నాయి . 

1 comment:

  1. నా దేహములో నున్న ఉదానము ఈ నా దేహయంత్రములో ప్రకటిత మైనపుడు మాత్రమే నీ చెవి దానిని వింటుంది . అటులకాక, అదే ఉదానము వాక్కుగా ప్రకటితము కాకుండా , వెనక్కు తిరిగి నా ప్రాణమునకు వచ్చినపుడు , మాటగా పలకవలసిన అర్థమంతా భావముగా మారి , నా ప్రాణము ఆ భావమును నీ ప్రాణమునకు ఇస్తుంది . అప్పుడు నువ్వు దానిని భావముగా మాత్రమే గ్రహిస్తావు . అయితే నీ ఉదానము దానిని పెంచినపుడు నీ మనసు దానినే మాటగా గ్రహిస్తుంది . ఇది దూర శ్రవణ విద్య
    - అత్యద్భుతం ఈ వివరం

    ReplyDelete