SHARE

Wednesday, January 23, 2013

18. " మహాదర్శనము " -- పద్ధెనిమిదవ భాగము --వారే వీడు


18.  పద్ధెనిమిదవ భాగము -- వారే వీడు 

          కుమారునికి చౌలము , అక్షరాభ్యాసమూ విజయవంతముగా అయిన తరువాత, అనతి దినములలోనే  ఆచార్య దంపతులు బుడిలుల కుమారుడు కాత్యాయనుడి వివాహమునకు కొడుకుతోపాటు వెళ్ళినారు.  పెళ్ళినుండి వెనుతిరిగి వచ్చినారు కూడా . పెళ్ళింట్లో అందరూ కుమారుని కళ్ళార్పకుండా చూసేవారే ! వాడు కూడా అలాగే ఎవరు పిలిచినా వెళ్ళేవాడు . అలాగే ఎత్తుకొని ఏదో ఒకటి తినడానికి ఇచ్చేవారు . ముద్దులవాన కురిపించేవారు . ఆ నిండు పెళ్ళింట్లో ఒక విశేషము జరిగింది . కాత్యాయనుని భార్య ఔపస్వస్తికి కుమారుడు ఎన్నో దినముల నుండీ చూసినవాడి లాగా మాలిమి అయిపోయినాడు . ఇంకా పది పదకొండేళ్ళ వయసులో ఉన్న ఆ అమ్మాయిని అందరూ ’ అక్కా’ అని పిలువయ్యా అని ఎంత నేర్పించినా వినకుండా ’ అత్తా’ అని పిలుస్తాడు . ఈ సంగతి బుడిలుల చెవి వరకూ వచ్చింది . వారు నవ్వేసినారు , ’ ఇది కూడా ముందు జరగబోయే దానికి గుర్తో ఏమో ఎవరికి తెలుసు ? " అన్నారు . 

         ఇంకొక ఆశ్చర్యము ! ప్రతియొక్కరూ కుమారునికి ఐదు సంవత్సరాలైనా నిండియుండును అనువారే . తెలిసిన వారు మూడు సంవత్సరాలే అంటే , వెంటనే మూతీ ముఖమూ ముడుచుకొని , ’ చాలు ఊరికే ఉండండి , ఐదు సంవత్సరాలైనా లేకపోతే అలాగ గడగడా మాట్లాడుటకు అవుతుందా ? " అని ఆ చెప్పినవారు చిన్నబోయేలా చేస్తారు . అయినా అందరికీ దిగులు , బాలుడికి కను దృష్టి తగులుతుంది యని . అయితే , ఏ దేవుడి దయయో , ఏమీ కాలేదు . 

         ఫాల్గుణ మాసము వచ్చింది . ఎండ ఎక్కువౌతూ వచ్చింది . ఇంతవరకూ నీడను వదలి ఎండలోకి వచ్చువారు , ఇప్పుడు ఎండను వదలి నీడను వెతుకునట్లయింది . చెట్లూ చేమలు అన్నీ కొత్త చిగురులతో శోభించినాయి . ప్రతి చెట్టూ , కాంతివిహీనముగా నున్న , వాలిపోయి ఉన్న, ముదురుటాకులను వదలి , దుమ్ముపడి మాసిపోయి ఉన్న చీరను వదలి కొత్త పట్టుచీరను కట్టుకున్న కాంతలవలె అందముగా నున్నవి . తలపైన కావలసినన్ని చిగురుటాకులు నిండియున్ననూ , నేలపైన ఇంకా గడ్డి మొలవలేదు . బ్రాహ్మణ బంధువుల బ్రాహ్మణ్యము వలె తెల్లవారు జాము లోని చలి నిర్నామమగుచున్నది.  

         ఇప్పుడు కుమారుడు తల్లికన్నా ఎక్కువగా తండ్రిని పట్టుకున్నాడు . అయితే , తల్లి పిలిస్తే వెళ్ళకుండా అవమానము చేయడు . అగ్నిహోత్రపు సమయములో తప్ప ఇతరవేళలలో తల్లి కొడుకును చూడవలెనంటే పిలుస్తుంది , లేకున్నలేదు . తండ్రి ,  శిష్యులకు శాస్త్ర పాఠము చెప్పునపుడైతే కొడుకు అక్కడ తప్పనిసరిగా సిద్ధమై ఉంటాడు . తండ్రి , ఎత్తైన ఒక పీటను చేయించి , ఇసుక నింపి , దానిపై అక్షరములను రాసి ఇచ్చి , దీనిని దిద్దుతూ ఉండు అన్నాడు . యాజ్ఞవల్క్యుడికి అక్షరములను నేర్చుట కష్టము కాలేదు . ఎనిమిది దినములలోనే క గుణింతముతో పాటూ అన్నిటినీ నేర్చేసుకున్నాడు . పదునైదు దినములలోనే స్ఫుటముగా రాసిన దేనినైనా చదవగలడు . ఎవరైనా ఏదైనా చెప్పితే దాన్ని రాయగలడు , అంతవరకూ వచ్చింది . 

         ఒకదినము ఆచార్యుడు ఏదో ఆలోచనలో కూర్చొని ఉన్నాడు . యాజ్ఞవల్క్యుడు వచ్చి తొడపైన కూర్చున్నాడు . ఆచార్యుడు హఠాత్తుగా కళ్ళు తెరచిచూసి , తొడపై కూర్చున్న కొడుకును ఒక చేతితో అలాగే హత్తుకొని , ఇంకొక చేతితో వాడి తల, ముఖములను నిమురుతూ , " రాయుట అంతా అయినదేమయ్యా ? " అన్నాడు . 

         కొడుకు , ’ ఓ , మీరు ఇచ్చినదంతా రాసేసినాను , ఎట్లా రాసినానో తెలుసా ? అమ్మ ఇచ్చిన చక్కిలమును కరం కురం అని తిన్నట్లే గబగబా రాసినాను . నేను ఇప్పుడు ఎందుకు వచ్చినానో తెలుసా ? " 

తండ్రి ఆ ఉపమానమును విని నవ్వుతూ , " నువ్వే చెప్పు , నాకేమైనా పరకాయ విద్య వస్తుందా ? " అన్నాడు . 

        కొడుకు తండ్రి ముఖము చూస్తూ అన్నాడు , " మీకు వచ్చినవారి ముఖము చూడగానే తెలుస్తుంది కదా !  శిష్యుడు వస్తే , ఏమయ్యా , సందేహము వచ్చిందా ? ఇదేకదా ? అని చెప్పేస్తారు కదా ? " 

      తండ్రి అది విని తనను అనుకరిస్తున్న కొడుకును చూసి  సంతోషపడుతూ అన్నాడు , " అది శిష్యుల మాట . కానీ నువ్వు నా కొడుకువు కదా ! కాబట్టి నువ్వే చెప్పు  " .

         " ఊ , సరే , మీరు పెద్దవారు , మీమాట వింటే తప్పులేదు , ఆ దినము చూచితిరా , నాయనా! చౌలమగువరకూ తాళు , ఆ తరువాత ఏదైనా అడగవచ్చు అన్నారు, కదా ? " 

" ఔను " 

" ఇప్పుడు దానినే అడుగుటకు వచ్చినాను . అడగనా ? " 

         తండ్రికి కొడుకు ఏమి అడుగునో అని దిగులైంది . సందేహమయినది . అయినా , కొడుకు చిన్నవాడు , వీడేమి అడుగగలడు ? అని మాయా మోహములు ఆవరించి " అడుగు " అన్నాడు . 

         కొడుకు అడిగినాడు , " మొదట ఆ కడిగే సంగతి చెప్పండి . బయట కడగక ఉంటే మసి , లోపల కడగక ఉంటే మడ్డి అని అమ్మ చెప్పింది . నేను ఆలోచించినాను . బయట కడుగుట ఎలాగ అని తెలిసింది . అయితే ఈ మన లోపల కడుగుట ఎట్లా ? అది ఎంత ఆలోచించినా తెలియలేదు . అందుకే మిమ్మల్ని అడిగినాను . " 

         తండ్రి , కొడుకు ముఖమును చూచినాడు . ఎక్కడో చూచినట్లు గుర్తుకొచ్చింది . స్మృతి వెదకి , ఆనాటి కలను గుర్తు చేసింది . ఔను , కలలో చూచినవాడే వీడు . సందేహములేదు , ఆ నాడు పెద్ద దేహములో నాకు సమాన వయసులో దూరము కూర్చున్నాడు . ఈనాడు చిన్న దేహములో వచ్చి తొడపైన కూర్చున్నాడు . అంతే వ్యత్యాసము ! 

        ఆచార్యుడు సమాహితుడైనాడు . వాడు ఏమి అడిగినమూ మాయా మర్మములు లేకుండా చెప్పు అని చెప్పిన బుడిలుల మాట కూడా జ్ఞాపకము వచ్చింది . సరే , యనుకొని చెప్పసాగినాడు ;

         " విను నాయనా , నువ్వు అడిగిన ప్రశ్న చాలా ముఖ్యమైనది . ఈ లోకములో ఎవరూ సామాన్యముగా ఈ లోపల కడిగే సంగతి ఆలోచించరు , గమనించరు కూడా ! కానీ లోపల కడుగుకొని పరిశుద్ధుడగు వరకూ శ్రేయో మార్గమే కనిపించదు . కాబట్టి లోపల కడిగేది ముఖ్యమైన పని . ఏమో అడగాలని ఉన్నావే , అడుగు . " 

" అప్పుడు , అమ్మ చెప్పిన శ్రేయస్సు , ప్రేయస్సు కదా , మీరు కూడా చెపుతున్నది ? " 

         " ఔను : రెండిటినీ యమధర్మరాజు నచికేతునికి చెప్పినాడు . లోపల కడగవలెను అని ఆలోచించువాడు , లోపల ఏముంది ? కడుగుటకు సాధ్యమా ? అనుదానిని కూడా ఆలోచించవలెను కదా ? చూడు , ఈ దేహమును ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా చూస్తారు . వైద్యులు దీనిని ప్రాణమున్న ఇల్లుగానూ , వాత , పిత్త , కఫములు అను తాప త్రయములు ఇందులోని యజమానులు గానూ చెపుతారు . యోగులు , ఇది నరమండలము , చక్రముల స్థానము , ప్రాణాది పంచవాయువుల క్షేత్రము అంటారు . మంత్ర వేత్తలు దీనిని నానా దేవతల ఆవాస స్థానము , దేవతలందరూ ఈ దేహములో బీజరూపముగా , కార్యమునకు ఎంత కావలెనో , అంత స్థాయిలో మాత్రము తమ తేజస్సును ఇక్కడ ఉంచినారు . కాబట్టి ఇది దేవాలయము అన్నారు ." 

         జ్ఞానులు , ఈ దేహము పంచ కోశములనుండీ ఏర్పడిన పెద్ద గూడు , ఇది క్షేత్రము , ఇందులో ఒక క్షేత్రజ్ఞుడు ఉన్నాడు , కాబట్టి ఇది వాని ( జీవుని ) ఇల్లు అంటారు . లౌకికులు , ఈ దేహమనగా తానే , దీని హాని , వృద్ధులే తన హాని వృద్ధులు . కాబట్టి ఈ దేహమును ఆరోగ్యముగా  , సుఖముగా ఉంచుకొన వలెను అంటారు . వీరిలో లౌకికులు మాత్రము , లోపల కడుగుట యంటే ఈ దేహమును ఆరోగ్యముగా ఉంచుకొనవలెను అంటారు . లోపలెక్కడైనా కశ్మలము చేరి నిలిస్తే అది రోగకారణము అగును . కాబట్టి శుచిగా ఉండవలెను అనునది వీరి మతము . " 

" ఇప్పుడు నాకు అమ్మ అపుడపుడు నూనె పట్టిస్తుంది , ఎందుకమ్మా అంటే , నీ ఒళ్ళు బాగుండాలి అంటుంది . అదేనా ఇది ? " 

         " ఔను , అది మొదటి ఘట్టము . అది వైద్యులు చేయు పని . వైద్యులు , యోగులు, మంత్రవేత్తలు , జ్ఞానులు అందరూ చూచే ఈ దేహములో కనిపించని ఏదేదో ఉంది అని ఒప్పుకుంటారు . అలాగే , ఈ దేహము ఒక సాధనము అనునది కూడా ఒప్పుతారు . వారందరూ దీనిని కడుగవలెను అని అంగీకరించిననూ , ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా కడుగవలెను అంటారు . వైద్యులు విరేచనాది పంచ కర్మలతో శుద్ధి అంటారు . యోగులు ప్రాణాయామముతో శుద్ధి అంటారు . మంత్రవేత్తలు మంత్ర జపము వలన , ఆచారము వలన శుద్ధి యంటారు . జ్ఞానులు ఇంద్రియ మనో వ్యాపారములను పట్టులో ఉంచి విచారముల చేత పవిత్రము చేయవలెను అంటారు . " 

         " దేహము శుద్ధమైతే ఏమవుతుంది అనుదానిలో కూడ వీరివి వేరే వేరే లక్ష్యములు . వైద్యుడు , శుద్ధదేహము పటుత్వముతో ఉండును , ఆరోగ్యము లభించును: అప్పుడు ధర్మ , అర్థ , కామ , మోక్షములేవి కావాలన్ననూ సాధించవచ్చు అంటాడు . యోగి , శుద్ధ దేహము సాధించలేనిది ఏమి ? ఆకాశములో ఎగురవచ్చు , లోకాంతరములకు వెళ్ళి రావచ్చు , ఇంకొకరి దేహమును ప్రవేశించవచ్చు , కొండంత , లేదా , అణు మాత్రముగా మారిపోవచ్చు , సమాధిలో ఉండవచ్చు అని నానా సిద్ధులను ఒక్కాణిస్తారు . మంత్రవేత్తలు , ఉపాసన వలన , దైవ తేజస్సును పెంచుకొంటే ఇక్కడ ఉండియే ఏది కావాలన్నా పొందవచ్చును , పరములో పుణ్యలోకములను కూడా పొందవచ్చును , చివరికి దేవాప్యయము అంటే , ఉపాసకుడు ఉపాస్యమాన దేవతలో చేరిపోవచ్చును అంటారు . జ్ఞానులు , " ఈ సిద్ధులన్నీ క్షుద్రములు , మహత్తరమైన సిద్ధియంటే ఆనందలాభము. దానిని పొందుటకు ఈ శుద్ధ దేహమును ఉపయోగించవలెను" అంటారు.  వీరిలో ఏ ఒక్కరినో అని కాదు , మంత్రవేత్త , జ్ఞాని, మొదలు ఈ నాలుగు పద్దతులనూ అనుసరించవలెను . "

        కొడుకు ఏకాగ్ర మనసుతో విన్నాడు . అలాగే ఒక ఘడియ , తిన్నదానిని పైకి తెచ్చుకొను ఆవు వలె నెమరు వేస్తూ ఆచార్యుడు చెప్పినదంతయూ మనసులో పర్యాలోచించినాడు . చివరికి తండ్రిని అడిగినాడు , 

" తండ్రీ , మీరు చెప్పిన నాలుగు పద్దతులను ఉపయోగించు కున్నాము అనుకోండి , దానివలన హాని లేదు కదా ? " 

         " హాని ఎక్కడిది ? ఒకదానినుండీ ఇంకొకదానికి ఉపకారమై శుద్ధియగును . అందరికీ సమ్మతమగునట్లు ఒక ఉపాయమును చెపుతాను విను . ఈ మనుష్యుని దేహమునకూ , ఇతర మృగాదుల దేహములకూ ఒక వ్యత్యాసమున్నది . మృగాదుల దేహములలోనే వ్యత్యాసము ఉంది . మనుష్యుల వ్యత్యాసమున్నది మనుషుల మనసు లోనే ! కాబట్టి , తెలిసిన వారు దేహ దేహమునకూ వేరే వేరే శుద్ధి క్రమములను చెపుతారు . ఆ క్రమములన్నీ , వారి వారి మనసును అవలంబించుకొని ఉంటాయి . మనుష్యుడు , మృగములకు తెలీని " నాకు నమ్మకము లేదు " అను మంత్రమును చెప్పేస్తాడు . అది అన్నిటికీ ప్రయోగము అవగల ఏకబాణము . కాబట్టి మనుషుడు మొదట ఈ నిషేధరూపమైన మంత్రమును వదలి , ’ తాను నమ్మునదేమి ? ’ అనుదానిని విధిరూపముగా నిర్ణయించుకొన వలెను . దానికి తగ్గ సాధనమును ఉపయోగించుకో వలెను . "

" దీనికి ఏదైనా పేరుందా ? "

" ఉంది , దీనినే , తెలిసినవారు ’ శ్రద్ధ ’ అంటారు . శ్రద్ధయే , దేహము పెరిగిన దానికి గుర్తు . శుద్ధియగుటకూ గుర్తు . " 

" దేహము పెరుగుట అంటే ఏమిటి తండ్రీ ? చిన్నదిగా ఉన్నది పెద్దదియగుట అనా ? "

         " కాదు , దేహము బయట పెరుగుట వేరే , లోపల పెరుగుట వేరే . నువ్వు చెప్పింది బయట పెరుగునది . బయట పెరిగిన దేహములో కావలసినంత కశ్మలము చేరి , దానిలో శ్రద్ధ కనిపించకుండా పోవచ్చును . కాబట్టి నేను చెప్పిన పెరుగుట లోపల సంబంధమైనది . ఆ దేహము లింగ , వయసు , రూపములతో ఎలాగున్నా , దానిలో ధైర్యము , సౌజన్యాదులతో కూడిన శ్రద్ధ ఉంటే అది పెరిగిన దేహము . " 

" శ్రద్ధ అంటే ఏమి ? ఇంకా కొంచము విస్తారముగా చెప్పండి " 

         " ఇప్పుడు చూడు , నేనో , మీ అమ్మో ఏదైనా చెబితే నువ్వది నమ్ముతావు . ఈ పని చేయవద్దు అంటే చేయవు . ఇది చేయి అంటే నీకు అక్కర లేకున్నా చేస్తావు . ఇది శ్రద్ధ . ప్రయత్న పూర్వకముగా తన ఆలోచనాశక్తిని నిలిపి , తనకన్నా పైవారి మాటను సత్యమని అంగీకరించునది శ్రద్ధ . పైవారు ఉన్నారు , వారికి నా కన్నా ఎక్కువ తెలుసు అను నమ్మకమే శ్రద్ధ . ఒక్కొక్కసారి పై వారు కారణాంతరముల వలన తప్పు చేసినారనుకో , అప్పుడు శాస్త్రముల వలన ఈ శ్రద్ధను రూఢి చేసుకోవలెను . చూడు , నచికేతుని తండ్రి దానయోగ్యములు కాని ముసలివైన ఆవులను దానముగా ఇచ్చినాడు . అప్పుడు నచికేతుని శ్రద్ధ వాడికి శాస్త్రమును చూపించినది . ఎలాగ ?  ఆ శాస్త్ర వాక్కు , అదేయములను దానముగా ఇస్తే అసురలోకములు వచ్చును అన్నది . అప్పుడు అతనిలో జిజ్ఞాస పెరిగినది . జిజ్ఞాస అడిగింది , ’  సర్వస్వ దానము అంటే ఇదియేనా ? అలాగయిన , వారి వాడనయిన నన్ను కూడా దానము నిచ్చునా ? "  ఆ జిజ్ఞాస ఫలము ఏమిటో నీకూ తెలుసు . కాబట్టి , విను . అందరికీ సమ్మతమైనది , లోపల కడుగుటకు ఏదో ఒక విధముగా నైననూ ప్రయత్నించునది శ్రద్ధ . శ్రద్ధ ఒకటుంటే , అది వైద్యుడు , యోగి , మంత్రవేత్త , జ్ఞాని--వీరి పద్దతులలో ఏ ఒక్క దానినైనా , లేదా ఈ పద్దతులన్నిటినీ కొంత కొంత కలిపి , ఒక కొత్త పద్దతిని చేసి ఇచ్చియే తీరును . " 

" ఒకవేళ ఆ శ్రద్ధ తప్పుదారి పట్టితే ? " . 

         " దానికోసము అంతగా వ్యథ అవసరము లేదు . బండల ఇరుకులో పెరుగు మొక్క , ఆకాశము వైపుకు తిరిగి , చివరికి సూర్యుని చూచుటకు పెనుగులాడి సూర్యునికి అభిముఖముగా వచ్చునట్టి శ్రద్ధ , తప్పుదారి పట్టిననూ , దానిని తన స్వభావమే సరియైన దారికి తెచ్చి వదలును . నాయనా , ఇంత మాత్రమే అనుకోవద్దు , నేను చెప్పినది , భరద్వాజుడికి బ్రహ్మ దేవుడు  వేదమును ఇచ్చినట్లే , ఒక పిడికెడు మాత్రమే " 

" అయితే , భరద్వాజుడి కథ చెప్పండి " 

        " భరద్వాజుడు తపస్సు చేసి బ్రహ్మ వద్దకు వెళ్ళినాడు . బ్రహ్మ , ’ ఏమి కావలెను ? ’ అని అడిగినాడు . భరద్వాజుడు, ’ నాకు వేదము కావలెను ’ అన్నాడు . బ్రహ్మ అతడిని పిలుచుకొని పోయి , మండుచున్న అగ్నిపర్వతము నొకదానిని చూపి , ’ ఇగో , ఇదే వేదము ’ అని , ఆ తేజోరాశినుండీ ఒక పిడికెడు తీసి ఇచ్చినాడు .  నువ్వు అడిగిన ప్రశ్నకు నా ఉత్తరము కూడా దానివంటిదే ! "

" సరే , మరి నాకు విస్తారముగా ఎప్పుడు చెప్పెదరు ? " 

         " చూడయ్యా యాజ్ఞవల్క్యా , మొదట శాస్త్రమును నేర్చుకోవలెను . అప్పుడు మనసు , ఇది నిజమా కాదా , ఇది సరియా కాదా అని పారాడుతుంటుంది . అప్పుడు మనసును తనకు నచ్చిన విధముగా వదలక , దానిని పట్టులో ఉంచుకొని , శాస్త్రమును సరిగ్గా , క్రమముగా  అభ్యాసము చేస్తూ రావలెను. అప్పుడు అభ్యాస బలము చేత మనసు వంగి , శాస్త్రమును సరిగా తెలుసుకొనును . అది ఒక నిష్ఠ. అప్పుడు నిష్ఠతో తాను తెలుసుకొనిన , ’సరి ’యన్నదానిని ధృవపరచుకొనుటకూ , తనకూ ఇతరులకూ శాస్త్రము సరిగ్గా అర్థమగుటకూ , లౌకికమైన యుక్తులను చెప్పెదను .   అలాగ యుక్తి , అనుభవముల చేత శాస్త్రమును తనదిగా చేసుకొనిన , అప్పుడు శ్రద్ధ !  కాబట్టి నువ్వు శాస్త్రమును చదువు . అది అర్థము కానీ ! అప్పుడు , విస్తారముగా , పరమాణువు వలెనున్న దానిని పర్వతమంతగా చేసి చెపుతాను . " 

       " సరియే , అయితే మొదట శాస్త్రాభ్యాసము . తరువాత దాని అనుభవము , శాస్త్ర అనుభవములకు రెంటికీ సరిపోవు యుక్తి ! సరే , అటులనే  " 

        " చివరిమాట గుర్తుంచుకో , దేహము లోపల కశ్మలమును నింపునది , దురాహారము , దురాచారము , దుర్విచారములు . కాబట్టి వాటిని వదలవలెను . " 

" అలాగన్న నేమిటి ? " 

         "  చూడు , మొదటగా వచ్చేది ప్రేయస్సు , శ్రేయస్సు . తనకు తోచినట్లు నడచుట ప్రేయోమార్గము . ఆ ప్రేయో మార్గమును పట్టిందల్లా దుష్టము . ఇప్పుడు వేళ మించినది , ఇక్కడికి నిలుపుదాము , ఇంకొక దినము విస్తారముగా చెపుతాను . " 

No comments:

Post a Comment