SHARE

Friday, March 28, 2014

తులాపురుష మహా దానము పద్దతి ( తులాభారము )--రెండవ / చివరి భాగము

తులాపురుష మహా దానము పద్దతి

          పండుగలు , వ్రతములు , వివాహములు మొదలగు దినములలో గానీ , వ్యతీపాతము , గ్రహణము , మొదలగు పుణ్యకాలమున గానీ , చివరికి తమకు అవకాశము , ఆసక్తి , అనుకూలములున్నపుడు గానీ ఈ కింది విధముగా తులాపురుష మహా దానము నాచరించవచ్చు. 

          ఇల్లు ఆవుపేడతో అలికి , ముగ్గులు , తోరణములు పూలతో అలంకరించి , ధర్మ కాటా ( కూర్చొను త్రాసు ) కు పసుపు రాసి , కుంకుమ బొట్లు పెట్టి , మామిడి మండలు కట్టి ,పూలతో అలంకరించి వస్తువులన్నీ సిద్ధము చేసుకొనవలెను. 

          పెళ్ళయినవారైతే , భార్యా భర్తలిద్దరూ నువ్వులు , ఉసరిక వరుగులూ మెత్తగా నూరిన దానిని తలకు పట్టించుకొని అభ్యంగ స్నానము చేయవలెను. పిల్లల కోసమైతే , ఆ పిల్లలతో పాటూ వారి తల్లిదండ్రులు ఇదే విధముగా చేయవలెను.  భార్య లేకున్నచో , బంగారము , లేదా వెండి , లేదా దర్భలు లేదా రాగి పిండితో భార్యా ప్రతిమను చేసి పక్కన పెట్టుకొనవలెను. పీటలపైన కూర్చొని , గణేశుని పూజించి , కుల దేవతను , ఇష్ట దేవతలను పూజించి , త్రాసులో కూర్చొను వారు మెడలో పూలమాల వేసుకొని , మొదట ఆచమనము చేసి , ఉంగరపు వేలికి పవిత్రమును ధరించి ప్రాణాయామము చేసి , కింది విధముగా సంకల్పము చెప్పవలెను. 

         మమోపాత్త , సమస్త దురితక్షయ ద్వారా , ఏవంగుణ విశేషణ విశిష్టాయాం , అస్యాం పుణ్య తిథౌ , మమ సమస్త పాప పరిహారార్థం , గ్రహారిష్ట , గృహారిష్ట , సర్వారిష్ట దోష పరిహారార్థం , ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం , శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం తులాపురుష మహా దానమహం కరిష్యే ||

నీళ్ళు , నువ్వులు నేలపై వదలవలెను. 

          తరువాత , తులా పురుష దానము చేయు వ్యక్తి ఇష్ట దైవమును  మనసులో ధ్యానించి , నమస్కరించి , తులను పుష్పములతో పూజించి , మంగళ వాద్యములు మ్రోగుతుండగా తులకు , సభకు నమస్కరించి , త్రాసు యొక్క ఎడమవైపు బల్ల యందు తాను ఎక్కి కూర్చొనవలెను. త్రాసు యొక్క కుడి వైపు బల్ల యందు , తాను దానము చేయదలచిన వస్తువులను వేయించవలెను. తరువాత త్రాసు నందు కూర్చున్న వ్యక్తి , దండము మధ్య నుండు ముల్లు సరిగా మధ్యకు నిలువుగా నిలబడినదీ లేనిదీ చూచి ( తన బరువూ , వస్తువుల బరువూ సమముగా ఉన్నదీ లేనిదీ సరి చూచి ) మనసులో లక్ష్మీ దేవినీ శ్రీ హరినీ ధ్యానించుచూ , ఆవు పాలు పిండునంత కాలము త్రాసులో కూర్చొని ఉండవలెను. తరువాత కిందకు దిగి , సభాసదులకు నమస్కరించి ఆ తూచబడిన వస్తువులను వారి ఇష్టానుసారముగా , ’ కృష్ణార్పణము ’ / ’ బ్రహ్మార్పణము ’ / ’ శివార్పణము ’ --ఇలా పలుకుచూ వెంటనే అందరికీ పంచి పెట్టవలెను. 

దీనిని ఎవరంతట వారే కూడా చేసుకొనవచ్చును. 

          స్త్రీలు కూర్చున్నట్టయితే , ఏ నెలలోనైనా శుక్లపక్ష తదియ నాడు ఒక అరటి ఆకులో అయిదు హారతి కర్పూరపు నుండలనుంచి , వాటిలో లక్ష్మీ సరస్వతీ పార్వతులను కుంకుమతో పూజించి త్రాసులో కూర్చుండి , తనతో సమానమైన కుంకుమను తూచి తులా పురుష మహాదానముగా వెంటనే ముత్తయిదువలకు పంచిపెట్టిన , సౌభాగ్యము వృద్ధియై , దీర్ఘసుమంగళియై , పుత్రీ పుత్ర సంతానము , ఆయుర్దాయము , అభివృద్ధి , ఆరోగ్యము , ఐశ్వర్యము కలిగి ఆనందముగా నుండెదరు. వివాహ సమయములో ఇది చేసిన సర్వ దోషములూ తొలగి సుఖముల పొందెదరు. 

          ఇదే విధముగా కాటాలో ఉప్పు , బెల్లము మొదలగు ఏదైనా వస్తువును వేసి స్త్రీలు తమ బరువుతో సమానముగ తూచుకొని పంచిపెట్టిన అనేక శుభములు కలుగును. గుర్తుంచుకొండి , తూచిన వస్తువును తూచినట్లే పంచిపెట్ట వలెను. 

గమనిక : ఈ తులా పురుషమహాదానము చేయుట , ఆడంబరమునకు , చూపించుకొనుటకు కాదు.  చేయువారు , ఫోటోలు , వీడియోలు వగైరాలు తీయించుకోవద్దు. అట్లు తీయించుకొనిన , అవి మనకు అహంకారమును , ఆడంబరమును పెంచి , దాన మహిమ తగ్గును.

|| లోకాస్సమస్తాస్సుఖినో భవంతు ||

No comments:

Post a Comment