SHARE

Friday, March 21, 2014

తులాపురుష మహాదానము (తులాభారము)-ఒకటవ భాగము


తులాపురుష మహాదానము (తులాభారము)-ఒకటవ భాగము









          ఈ లోకములో చాలా మంది కష్టించి అతి పేద జీవితము నుండీ గొప్ప స్థితికి వచ్చిన వారిని చూస్తాము. వీరి విషయములో ఆశ్చర్యపోవలసినదీ , వింతయైనదీ ఏమీ ఉండదు. ఇక , మరి  కొందరికి ఏ ప్రయత్నము లేకుండానే / లేదా స్వల్ప ప్రయత్నము చేతనే అష్టైశ్వర్యాలు , సకల సంపదలు , సర్వ భోగములూ లభించుట సామాన్యముగా చూచుచున్నాము. ( వాటి వలన వారికి సుఖమూ శాంతీ ఉన్నవా యనునది వేరే సంగతి ) . అయితే అధిక సంఖ్యాకులు అవి లేక చాలా కష్ట నష్టములను అనుభవించుచున్నారు. మొదటి రకమువారికి అట్టి శుభములు ఎందుకు కలుగును ? మిగిలిన వారికి ఎందుకు కలగవు ?  ఈ ప్రశ్న చాలా చిన్నదే అయినా , సమాధానము అంత తేలిక కాదు. ఏ ఒక్క కారణమునో చెప్పి దీనిని వివరించలేము. అయితే అనేక కారణాలలో కొన్ని ఏవంటే , 

వారు పూర్వ జన్మలో గొప్ప తపస్సులు , ఆరాధనలు , పూజలు చేసియుండుట

పూర్వజన్మలో పెద్దలనూ , పితరులనూ సేవించుట 

పూర్వజన్మలో అహింస , ధర్మము వంటివి పాటించుట.

వీరిని భోగములు వెదకికొని వచ్చును. అట్టి సత్కర్మలు చేయని వారికి ఇటువంటి శుభములు కలగవు. పైగా కష్టములు కలుగుచుండును. 

          పూర్వ జన్మలో ఏమిచేసినామో , ఏమి చేయలేదో మనకు తెలియదు. ఈ కాలము జ్యోతిష్యము సరిగ్గా చెప్పువారు దొరకుట దుర్లభము. 
అయిననూ , కష్టములలో నున్నవారు తాము అట్లే కష్టాలు పడుతూ కూర్చోక , వాటిని నివారించుకొనుటకు ప్రయత్నించవలెను. అందుకు ఎన్నో పద్దతులు ఉన్నాయి. వాటిలో తులా పురుష దానము ఒకటి. భవిష్యత్ పురాణములోనూ , అథర్వణ వేదములోనూ తులాపురుషదాన మహిమను గూర్చి యనేక వివరములున్నవి. ఈ తులా పురుషదానము చేయుట వలన , ఇంచుమించు మానవునికి కలుగు అన్ని కష్టములనూ నివారించ వచ్చును. అన్ని శుభములనూ పొందవచ్చును. 

          తులాపురుష దానమనగా , ఒక త్రాసులో దానము చేయవలసిన వ్యక్తి ఒకవైపు కూర్చొని , ఇంకొకవైపు తనకు కావలసిన శుభమునకు యే పదార్థము నిర్ణయింపబడినదో , ఆ పదార్థమును బుట్టలలో గానీ , డబ్బాలలో గానీ , గోతాములలో గానీ ఉంచి , రెండు బరువులనూ సమముగా ఉండునట్లు తూచి , తరువాత ఆ పదార్థమును వెంటనే ఇతరులకు పంచిపెట్టుట. దీని వలన సమస్త పాపములు , సమస్త దోషములూ పరిహారమై శుభములు కలుగును. సర్వ కార్య జయము కలుగును. దాత యొక్క యేలిన నాటి శని ప్రభావము గానీ , అష్టమ సని ప్రభావము గాని , నవగ్రహాలు దుష్ట స్థానములలో ఉండుట వలన కలుగు దోషములూ , భూత ప్రేత పిశాచాదులు ఆవహించుట వలన కలుగు దోషములూ , కుష్ఠు , క్షయాది ఘోర రోగములు , సర్వారిష్టములూ తొలగిపోయి , ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి , కుటుంబమునకు క్షేమము , అపమృత్యువులు దరికి రాకుండుట మొదలగు ఫలములు కలుగును. ఇది హోమములతో సమానమైనది.  తులా పురుష దానము చేసిన వారికి పునర్జన్మ లేదని శాస్త్ర నిశ్చయము.  


తులాపురుష దానములో ఏయే పదార్థములను / వస్తువులను దానము చేయవచ్చును ? 

           తులాపురుష దానము చేయ దలచినవారు , తన బరువుతో సమానమైన బంగారపు పాత్రలు, వస్తువులు గానీ , వెండి పాత్రలను గానీ , రాగి , ఇత్తడి , కంచు , సీసము , తగరము , ఇనుము , ఉక్కు పాత్రలు అన్నీ కలగలపి  గానీ , లేదా ఎదో ఒకటే రకమైన పాత్రలను గానీ తులాభారము వేయవచ్చును. వాటిలోకి యథాశక్తి , యే కొంచమైననూ , బంగారము లేదా వెండి రేకులను కలిపి తూచవచ్చును. 

          పైవి కాక, బియ్యమును కానీ , వస్త్రములు కానీ , పప్పులు , బెల్లము , పటిక బెల్లము , కూరగాయలు , పాలు, పెరుగు , నెయ్యి , నూనె , కట్టెలు , రూపాయ నాణెములు , వండిన అన్నము , పప్పు , కూరలు గానీ, నవ ధాన్యములను వేరువేరుగా బుట్టలలో పోసి గానీ , ఏవైనా సరే , తనకు తోచినవి గానీ , గ్రహదోషములకు , రోగనివారణకు చెప్పబడినవి గానీ ఇయ్యవచ్చును. ఏవైనా సరే , దానయోగ్యములు గా ఉండవలెను. అనగా మంచి నాణ్యత కలిగి ఉండవలెను. కొన్ని ధార్మిక ప్రదేశముల వారు తులాభారము చేసెదమని చెప్పి , దానయోగ్యము కాని , తిన యోగ్యములు కాని పదార్థములను వారే తెచ్చి , దాతలతో వాటికి తగిన డబ్బు తీసుకొని చేయించుచున్నారు. దాతలు ఆ యా పదార్థముల నాణ్యతను తప్పక పరిశీలించి దీనికి ఒప్పుకొనవలెను.  ముఖ్యముగా గమనించవలసినది యేమిటనగా , అలా తూచిన పదార్థములను / వస్తువులను వెనువెంటనే తాను యేమీ ఉంచుకొనక , సభాసదులకు గానీ , చుట్టుప్రక్కల వారికి గానీ , ఇతర భక్తులకు గానీ పంచివేయ వలెను. వాటిని తన గృహమునకు తెచ్చుకొనుట , ఉంచుకొనుట చేయరాదు. తులాపురుష దానమును ఇంటిలో కూడా చేయవచ్చును. అప్పుడు కూడా వాటిని ఇంటిలో ఉంచుకోరాదు. వెంటనే పంచివేయవలెను. 

తులాపురుష దానమును ఎవరెవరు చేయవచ్చును ?  

స్త్రీలు , పురుషులు , బాల బాలికలు అందరూ చేయవచ్చును. 

ఎప్పుడెప్పుడు చేయవచ్చును ? 

          ఈ తులాపురుష దానమును , పండుగలు , పర్వములు , వ్రతముల యందు గానీ , సంక్రమణము , వ్యతీపాతము , గ్రహణము , మొదలగు పుణ్యకాలములందు గాని , అమావాస్య , పౌర్ణమి యందుగాని , తన జన్మ దినమందుగానీ , చివరికి తనకు అనుకూలమైన ఏ దినమందైననూ చేయవచ్చును. ఎప్పుడు ఇచ్ఛ కలిగిన అప్పుడు చేయవచ్చును. దీనికి శుభ ముహూర్తములు , తిథులు యని లేవు. తీర్థయాత్రలలోను , యేదైనా తీర్థములో అవకాశము ,సౌకర్యము ఉండిన చేయవచ్చును.  

దీర్ఘ కాలముగా పీడించు వ్యాధులు కూడా తులాపురుష దానము వలన పూర్తిగా శమించును.

యే యే వ్యాధులు శమించుటకు యేయే పదార్థములను తులాపురుష దానము చేయవలెను ? 

క్షయ వ్యాధి నిర్మూలము కావలెనన్న , కంచుపాత్రలను , 

మూలవ్యాధికి  తగరపు పాత్రలను , 

మూర్ఛ వ్యాధికి సీసపు పాత్రలనూ , 

కుష్ఠు వ్యాధికి రాగి పాత్రలను , 

రక్త పిత్త దోషమునకు ఇత్తడి పాత్రలనూ , 

స్త్రీల కుసుమ వ్యాధులు , పురుషుల శుక్ర నష్టమునకు వెండి పాత్రలనూ , 

సర్వవ్యాధులకు ఇనప పాత్రలు గానీ , అన్నమునుగానీ దానము చేయవలెను.

ఇవికాక , 

జిగట రక్త విరేచనములకు పండ్లను , 

అతిగా ఆకలి వేసే భస్మీక రోగమునకు బెల్లమును , 

గండమాలా వ్యాధి ( కంఠము దగ్గర వాచి , బిళ్ళలు కట్టుట --టాన్సిల్స్ ) కు పోక చెక్కలను , 

ఆకలి లేకుండుట , అజీర్ణమునకు కట్టెలను , కట్టెపుల్లలనూ , 

దగ్గు , ఉబ్బసము , జలోదర వ్యాధులకు తేనెనూ , 

వాంతులు హరించుటకు నెయ్యినీ , 

పైత్య వ్యాధులు నశించుటకు పాలను , 

భగంధర వ్యాధికి పెరుగునూ , 

శరీరములోని అవయవములు వణకు రోగమునకు ఉప్పును ,

దద్దర్లు హరించుటకు బియ్యపు పిండినీ , 

ఇతర సర్వ రోగములకు ధాన్యములనూ , 

సంతాన లేమితో బాధ పడువారు నూనెనూ , 

శతృ బాధ తొలగుటకు పంచదారను , 

సౌందర్యము అభివృద్ధియగుటకు మంచి గంధము చెక్కలనూ , 

దివ్య వస్త్రములు లభించుటకు , తనకువీలైన నూతన  వస్త్రములనూ దానము చేయవలెను. 

అపమృత్యువును జయించు విధము

          తులాభారమునకు ముందుగా , " ఓం జుం నః "  అను మంత్రమును ఒక లక్ష సార్లు శుచీభూతుడై జపించవలెను. తరువాత , తన బరువుతో సమానమగు ఇనప పాత్రలను తూచి , పై మంత్రము చేత నూట ఎనిమిది సార్లు అభిమంత్రించి , వెంటనే బ్రాహ్మణులకు గాని , ఇతరులు ఎవరికైననూ దానము చేయవచ్చును. తరువాత , వీలు ఉండి , చేయ గల శక్తి ఉంటే , పేదలకు , సాధువులకు , బంధువులకు భోజన దక్షిణాదులు యథాశక్తి పెట్టవలెను. ఈ విధముగా చేసిన , గొప్ప శాంతి కలిగి , అపమృత్యువు తొలగిపోవును. 

          సూర్య గ్రహణము నాడు బంగారముతోను , చంద్రగ్రహణమునందు వెండితో తులాపురుష దానము చేసిననూ అపమృత్యువు తొలగును. దానికి శక్తి లేనివారు , రాగి లేక తగరములు తూచి , అందులో యథాశక్తి వెండి లేక బంగారమును కలిపి దానము చేసినచో , బంగారముతో దానము చేసిన ఫలమే వచ్చునని విశ్వామిత్రుడు చెప్పియున్నాడు. 

          బంగారముతో తులాపురుషదానము చేయువారు , దశదిక్పాలకులకు తప్పనిసరిగా పూజ , హోమములను ఆచరించవలెను. ఇతర వస్తువులతో చేయునపుడు హోమము నాచరించ పనిలేదని శాస్త్రములు చెప్పుచున్నవి. 

          నవగ్రహదోషములున్న వారు నవ ధాన్యములను గానీ , లేక , ఏ గ్రహ దోషమైతే ఉందో ఆ యా గ్రహాలకు చెప్పబడిన ధాన్యములను తులాపురుష దానము చేయించి , వెంటనే బ్రాహ్మణులకూ , ఇతరులకూ పంచిపెట్ట వలెను. సర్వ శుభములూ కలుగును. 

     దానముల విషయము వచ్చునపుడు , కొందరు , ’ ద్విజులకే ఎందుకు దానమీయవలెను ? మిగిలిన వారు అర్హులు కారా ? " యని అడుగుతున్నారు. దానమునకు అందరూ అర్హులే , అయితే ద్విజులకు దానము చేసినచో , ఆ దానము తీసుకొనుట వలన కలుగు పాపము పూర్తిగా నశింపజేసుకొన గలరు. దానము నిచ్చుట అనగా , ఆ తీసుకున్న వారికి దానముతో పాటూ తన పాపమును కూడా ఇచ్చుట. క్రమము తప్పక సంధ్యావందనాది అనుష్ఠానములు చేయు ద్విజుడైతే ఆ దానమును పట్టి , దానితో సంక్రమించిన పాపమును తన అనుష్ఠానములచేత నశింపజేయును. అనుష్ఠానములు చేయనివాడికిస్తే , ఆ పాపము నశింపక , ఒకరినుండీ మరియొకరికి వచ్చుచునే ఉండును. 

తరువాత  తులాపురుష దాన విధానము ను చూస్తాము

No comments:

Post a Comment