SHARE

Tuesday, March 18, 2014

ఉగాది విధులు

ఉగాది విధులు 

ఉగాది నాడు చేయవలసిన విధులు అంటూ కొత్తగా ఇప్పుడు చెప్పడానికి ఏదీ లేదు.

అయినా , ఓ పద్దతి ప్రకారం వాటిని తెలుసుకుంటే ఉపయోగకరము అని రాస్తున్నాను. 


ఉగాది లేక యుగాది అంటే నూతన వర్షారంభం . ఇది , చాంద్రమాన ఉగాది , సౌరమాన ఉగాది అని రెండు విధములు.

         సృష్టికర్త అయిన చాతుర్ముఖ బ్రహ్మ , ఏ దినము ఉదయము సూర్యోదయ కాలములో ఈ అందమైన జగత్తును అద్భుతంగా సృష్టి చేసినాడో  , ఆ దినమే యుగాది. ఆ దినము నుండే కాల గణనము ఆరంభించు వ్యవస్థ ఏర్పాటు చేసినాడు. దీనికి సూర్య చంద్రుల గమనమే  ఆధారము. బ్రహ్మ ప్రారంభించిన ఆ సృష్ఠి కార్యము ఈనాటి వరకూ అవిచ్ఛిన్నముగా ఉత్తరోత్తరాభివృద్ధిగానూ  సాగుతున్నది కాబట్టి ఈ దినపు ప్రాముఖ్యత మాటలతో చెప్పలేము. ఈ కారణము చేతనే ఈ దినమునందు కొత్తగా లెక్కలు మొదలు పెట్టుటయు , కొత్త వ్యాపారములు మొదలు పెట్టుటయూ అనాదిగా ఆచారములో ఉంది. 

         ఆ రోజు , ప్రతి యింటి యందును మామిడాకుల తోరణములు , పుష్పములు , జెండాలు మొదలైన వాటితో అలంకరించ వలెను. ఇంటి ముందర , పూజా గృహములోనూ అందమైన ముగ్గులు వేయవలెను. తైలాభ్యంగన స్నానము తప్పక చేయవలెను అని వసిష్ఠుడు అంటాడు. తర్వాత సంధ్యావందనాదులు చేసి , పాత , కొత్త పంచాంగములను పూజాగృహములో పెట్టి , మొదట గణపతిని , తరువాత కులదేవతను షోడశోపచారములతో పూజించాలి. కొత్త పంచాంగానికి పసుపు కుంకుమలు రాసి , పంచాంగములను పూజించాలి. వేదవిదులైన బ్రాహ్మణులను , గురువులనూ పుజించాలి. స్త్రీలు , పిల్లలూ నూతన వస్త్రములను ధరించి కొత్త ఆభరణములను ధరించ వలెను.

తరువాత , వేప పచ్చడిని ఈ విధముగా తయారు చేయవలెను

         లేలేత వేపాకులు , వేప పువ్వు , తీసుకొని వచ్చి , మొదట నేతిలోగానీ , నీటిలోగానీ మిరియాల పొడిని పొంగించి , ఇంగువ , సైంధవ లవణము , వాము , జీలకర్ర పటిక బెల్లము సమభాగములు గా చేర్చి , కొద్దిగా కడిగిన చింతపండుతో కలిపి నూరవలెను. దీనిని ఇతర నైవేద్యముతో పాటు దేవుడికి నివేదించి , బంధు మిత్రులతో కలసి దేవుడికి  మంగళారతి ఇచ్చి , వేప పచ్చడిని సేవించవలెను. 

         ఈ ఔషధుల మిశ్రమమును కేవలము ఉగాది నాడు మాత్రమే కాక , తరువాత వచ్చు పౌర్ణమి వరకూ రోజూ ప్రాతఃకాలమున పరగడుపున తినుచుండవలెను. దీనివలన అనేక వ్యాధులు శాంతించును. వాతావరణములో కలుగు మార్పులవలన కలుగు వ్యాధులను అరికట్టును. రక్త విరేచనములు , జ్వరములు మొదలగునవి అస్సలు రావు. 

         ఉగాదినాడు ఉదయము పూజాదుల అనంతరము జ్యోతిష్కుని సత్కరించి , నూతన సంవత్సర పంచాంగ ఫలములను వినవలెను. పంచాంగము అంటే తిథి , వారము , నక్షత్రము , యోగము , కరణము అనునవి. పంచాంగ శ్రవణముచే , తిథి వలన సంపదలు , వారము వలన ఆయుష్యము , నక్షత్రము వలన పాప పరిహారము , యోగము వలన వ్యాధి నివృత్తి , కరణము వలన కార్యానుకూలతా కలుగును. 
సామాన్యముగా అందరికీ తిథి , వార , నక్షత్రములు అనునవి తెలిసిఉండును. ఇవి పంచాంగములో కూడా ఇచ్చి ఉంటారు. యోగము , కరణము అనగా చాలామందికి తెలీదు. ఇవి కూడా కాల వ్యవధులే. వీటిని కూడా పంచాంగములలో ఇచ్చి ఉంటారు.  యోగములు కూడా నక్షత్రముల వలెనే ఇరవై ఏడు. యోగమంటే ఏదైనా ఒక సమయము సూచించు అనుకూల / లేదా ప్రతికూల పరిస్థితి. సూర్య , చంద్రుల స్థానాన్ని బట్టి దీనిని తెలుసుకుంటారు.  ఇవి ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. వీటిని ఘడియలలో లెక్కిస్తారు. 

        అయితే అనేక పంచాంగములలో ప్రతిరోజూ అమృత , సిద్ధ , మరణ అను యోగములు ఇచ్చి ఉంటారు. ఇవి పై యోగములు కావు. ఇవి కేవలము వారము, నక్షత్రముల సంయోగము వలన కలుగు ఫలముల సారాంశము మాత్రమే. 

       కరణములు కూడా కాల వ్యవధులు. ఇవి ఏడు. కోష్ఠకములో ( టేబుల్ ) వీటిని వరుసగా ఇస్తారు. ఒకదాని తర్వాత ఒకటి వచ్చును. అయితే ఇవి ఒకే తిథిలో రెండు వచ్చును అందులో మొదటి దాని పేరు , అది ముగియు కాలము మాత్రమే ఇస్తారు. కాబట్టి , కోష్ఠకము తెలిసినచో , తరువాత ఏది వచ్చునో తెలియును. ఈ ఏడు కాక, కొన్ని విశేష దినములలో వచ్చు విశేష కరణములు ఇంకో నాలుగున్నాయి. అవి పంచాంగములో ఇచ్చియే ఉందురు. 

         కన్యాదానము , భూదానము , సువర్ణ దానము , గజదానము , గోదానము వంటి వాటికి కలుగు ఫలము కన్నా వేయింతలు , ఒక్క పంచాంగ శ్రవణము వలననే కలుగును అని శాస్త్రములు చెబుతున్నాయి. పంచాంగ శ్రవణమంటే కేవలము ఈ ఐదు అంగముల గురించి తెలుసుకొనుటే కాదు ,ఆ  సంవత్సరానికి అధిపతి, మంత్రి , ధాన్యాధిపతుల గురించీ , వారిచ్చు ఫలములు , ద్వాదశాది రాసుల వారికి కలగబోవు ఫలములు , రాజపూజ్య అవమానములు , ఆదాయము , ఖర్చులు , ఋణములు మొదలగునవి కూడా తెలుసుకొనుట. అంతే కాక, మన రాష్ట్రానికి , దేశానికీ , ప్రపంచానికీ కలగబోవు ఫలితాలు కూడా తెలియును. 

నిత్యమూ పంచాంగ శ్రవణము చెస్తే , ’ అగ్నిష్టోమ ఫలము " , ’ గంగా స్నాన ఫలము ’ దొరకును. ఇప్పటికీ పల్లెలలో బ్రాహ్మణులు ప్రతిరోజూ ఇంటింటికీ వెళ్ళి , పంచాంగము వినిపించుట మనము చూస్తుంటాము. 

రాబోవు జయ నామ సంవత్సరములో బ్రాహ్మణులు సత్కర్మాసక్తులు కావలెను

ప్రజాపాలకులు సత్యనిష్ఠాపరులు కావలెను

అన్ని కులాల వారు తమ తమ కుల ధర్మాసక్తులు కావలెను

వంచన , ద్వేషములను వదలి , సౌహార్దముతో నడచుకొనువారు కావలెను. 

సకాలములో సువృష్టి కావలెను

అందరికీ సన్మంగళములు కలగనీ !! 

|| లోకాః సమస్తాః సుఖినో భవంతు ||

No comments:

Post a Comment