SHARE

Friday, January 24, 2025

సనాతన ధర్మ సంహిత


 సనాతన బంధువులకు శుభ వార్త !!!!!!!!!



మన వ్యభిచార మీడియా , హిందువుల గురించిన అన్ని ముఖ్యమైన సమాచారాలనూ దాచేసి ఏమీ తెలియనట్టు మూతి తుడుచుకొని కూర్చుంటున్నాయి. అక్కడక్కడా ఒకటో రెండో వేరు కారణాల చేత వాటిని ప్రచురిస్తున్నాయి.

ఇది ఒక అత్యంత సంచలన విషయము. ఎంత ప్రచారం ఉండాలి? కానీ ఎందరికి తెలుసు? 


హిందువులు  తమ ఆచార సాంప్రదాయాలను మరచిపోయారనీ, వారికి దిశా నిర్దేశము చేసేవారు లేరని, ఎవరికి తోచినట్టు వారు చేస్తున్నారనీ, ప్రస్తుత కాలానికి తగ్గట్టి ఒక స్మృతి , లేదా సంహిత [ కోడ్ ఆఫ్ కండక్ట్ ] ఉండాలని ఎప్పుడూ వినబడే మాట.  మన పీఠాధిపతులు, జగద్గురువులూ ఎందుకు చొరవతో ఈ విషయం పై మార్గ దర్శనాలను ప్రకటించకూడదు? అని అనేకుల సందేహాలు.  పీఠాధిపతులూ, జగద్గురువులూ, ప్రవచనకారులూ ఎప్పటికప్పుడు తమ సందేశాలను ఇస్తూనే ఉన్నారు. అయితే హిందువులకు ఆదేశాలు ఇచ్చే స్థితిలో ఎవరూ లేకపోవడము, ఒక సమగ్ర వ్యవస్థను అందరూ పాటించాలనే నిబంధనలను ప్రకటించే స్థితిలో లేకపోవడమూ, ఇంకా అలాంటి కారణాల వల్ల అటువంటి చర్యలు ఎవరూ తీసుకోలేదు.... అని ఇంతకాలమూ అనుకుంటున్నాము.  కానీ ఇది చూడండి


మోదీజీ ప్రధాని కాక పూర్వమే, అంటే ఒక పదిహేను సంవత్సరాల వెనుకే, ఈ దిశలో ఎందరో కలసి పని చేశారు.  సాధువులు, సన్యాసులు, పీథాధిపతులు, జగద్గురువులు, హిందూ సంఘాలు, ముఖ్యమైన హిందూ నేతలు,  మేధావులు, విద్వాంసులు, చరిత్రకారులు, శంకరాచార్యులు,  ఒకరేమిటి, అన్ని రంగాల వారూ కలసి ఒక వేదికగా ఏర్పడ్డారు, ఎప్పుడూ? రెండు దశాబ్దాల కిందటే,  దానికి కేంద్రము వారణాసి. ఆ వేదిక పేరు " కాశీ విద్వత్ పరిషత్. " ఈ పరిషత్తు, వేద విజ్ఞానాన్ని పరిరక్షించి, ప్రచురించి, ప్రచారము చేసే  పనిలో చాలా అభివృద్ధి సాధించింది. 


వీరందరూ కలసి సమిష్టిగా ఇన్నేళ్ళూ పరిశోధించి, పరిశ్రమించి " హిందూ సంహిత " నొకదానిని తయారు చేసి, అందరి ఆమోదాన్నీ పొందారు. వేదాలలోని విషయాలు, మన సాంప్రదాయాలు, హిందువులు చేయవలసిన విధులు, చేయకూడనివి, ఆచార వ్యవహారాలు, పండుగలు, కర్తవ్యాలు, ఉత్సవాలు, క్రతువులు, తంతులు, యజ్ఞ యాగాదులు, వంటి ఎన్నెన్నో విషయాలను కూలంకషంగా చర్చించి, ఇప్పటికి ఒక పుస్తకంగా సిద్ధమైంది.


 దీన్ని ఈ కుంభమేళాలో విడుదల చేయనున్నారు.


ఇంతకాలమూ దీనిగురించిన అన్ని విశేషాలనూ గోప్యంగా ఉంచారు. విశ్వ హిందూ పరిషత్, అఖిల భారత సాధు సమితి, ఇంకా ఇతర అఖాడాలు, సంఘాలు అన్నీ కలసి ఈ నెల ఇరవై ఏడున దీన్ని విడుదల చేయబోతున్నారు. వేలాది ప్రతులను కుంభమేళాలో అందరికీ పంచుతారు.  దేవకీనందన్ ఠాకుర్ [ ఆధ్యాత్మిక గురువు ], జీతేంద్రానంద సరస్వతి [ అఖిల భారత సాధు సమితి జనరల్ సెక్రెటరీ ] వంటి అనేకులు ఈ విషయం పై నిన్న కొంత సమాచారాన్ని పంచుకున్నారు. 


ఇంతకీ ఈ సంహితలోని విషయాలు ఏవి? అన్నదానిమీద ఇంక అ గోప్యత వీడలేదు కానీ, మచ్చుకి కొన్ని ఇదిగో


** రాత్రి పూట పెళ్ళిళ్ళను నిషేధించబోతున్నారు. వారి పరిశోధన ప్రకారము, పగటి పూట సూరుడి సాక్షిగా మాత్రమే పెళ్ళిళ్ళు జరగాలి


** భ్రూణ హత్యలు మహా పాపము


** వరకట్న నిషేధము


** స్త్రీలు పురుషులకు అన్నిటా సమానము. వారు యజ్ఞయాగాదులు కూడా చేయవచ్చు. 


** అస్పృశ్యత అనేది మన ధర్మంలో ఎప్పుడూ లేదు,  బానిసత్వం పేరుతో దాన్ని ఒక కాలంలో  మొదలుపెట్టారు. అన్ని దేవాలయాల్లో ఎస్ సి ఎస్ టి వారికి ప్రవేశం ఉంటుంది. 


** పుట్టుకతో అందరూ  హిందువులే కాబట్టి, ఎవరైనా హిందువుగా తిరిగి మారాలనుకుంటే అది మత మార్పిడి కాదు, కేవలం ’ ఘర్ వాపసీ ’ మాత్రమే. 


** దేవాలయాలు ప్రభుత్వపు నియంత్రణ నుండీ బయట ఉండాలి


** " సనాతన బోర్డు " నొకదానిని స్థాపించి వీటిని పర్యవేక్షించాలి. 


ఈ నెల ఇరవై యేడవ తారీకును " ధర్మ స్వతంత్రతా దివస్ " గా ప్రకటించబోతున్నారు. [ ఫ్రీడమ్ ఆఫ్ ధర్మ్ డే ]


జై హింద్

జై సనాతన ధర్మ

 భారత్ మాతా కి జై

Thursday, January 23, 2025

కుంభమేళా వెనుక కుట్ర జరుగుతోందా?


కుంభమేళా వెనుక కుట్ర జరుగుతోందా? సనాతన ధర్మము పునరుజ్జీవితము కావడం సహించలేని వారు నీచమైన పనులకు ఒడిగట్టడం నిజంగా గర్హనీయం. వారి వ్యూహాలను కపటాలను తెలుసుకోకపోవడం హిందువుల మూర్ఖత్వానికి పరాకాష్ఠ లాంటిది
మహా కుంభమేళా అంటే ఎంతటి మహోన్నత, మహత్తర ఘట్టము? నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే సువర్ణావకాశము. పవిత్రమైన త్రివేణీ సంగమంలో కుంభమేళాలో స్నానమాచరిస్తే అంతకన్న గొప్ప పుణ్యం ఇంకోటి ఉండదు. స్నానం అనేది కేవలం ఒక చిన్న ఉపలబ్ధి మాత్రమే. పైగా రానున్నది మాఘ మాసము. మాఘ మాసం లో కుంభమేళా యొక్క ప్రాశస్త్యము చూడండి.
****************************
కుంభమేళాలో మాఘ మాసము
( ధర్మ సింధువు ప్రకారము )
మాఘ మాసమందు ప్రాతఃస్నానము చేయాలి. హవిష్యము ( హోమము ) , బ్రహ్మ చర్యము , మాఘస్నానము - గొప్ప ఫలాన్ని ఇస్తాయి. మాఘ మాసము వస్తే సూర్యోదయము కాగానే జలములన్నీ శబ్దిస్తాయి .. త్రివిధములైన సర్వ పాపములనూ పోగొట్టి పవిత్రులను చేస్తాయి. ఉషః కాలములో సూర్యకిరణములతో వేడెక్కిన అందమైన నదీ ప్రవాహమునందు స్నానమాచరించిన వారు పితృ , మాతృ వంశములకు చెందిన తన సప్త ఋషులను ఉద్ధరించి , పిదప అమర దేహుడై స్వర్గమునకు వెళతాడు. అరుణోదయము కాగానే విచక్షణుడు మాధవుని పాద ద్వంద్వమును స్మరిస్తూ స్నానం చేస్తే సురపూజితుడవుతాడు.
నక్షత్రములుండగా చేసిన స్నానము ఉత్తమము. చుక్కలుపోయాక చేసినది మధ్యమము. సూర్యుడుదయించాక చేసినది అంతకన్నా హీనము.ఈ స్నానము ప్రయాగ నందు చాలా ప్రశస్తమైనది. గంగయందు , సంగమమందు చేసినది కాశీ యందలి స్నానము కన్నా నూరు రెట్లు పుణ్యప్రదము. పశ్చిమ వాహిని స్నానము దానికన్నా వేయిరెట్లు అధిక ఫలము . అట్లాగే సముద్రమందు కూడా ఈ స్నానము మిక్కిలి ప్రశస్తమైనది.
మాఘ శుక్ల త్రయోదశి నుంచీ మూడు రోజులు ' మాఘీ ' అంటారు.. కనీసము ఆ మూడురోజులయినా నదీ / సముద్ర స్నానము చేయాలి.
మాఘ స్నానమున నియమములు ;
స్నానం చేయకుండా అగ్ని దగ్గర కూర్చోరాదు. స్నానం చేయకుండా అగ్ని సేవనము తగదు. హోమము కొరకు వహ్నిని సేవించాలేకానీ శీతము కొరకు వద్దు. ప్రతి రోజు చక్కెర తో కూడిన నువ్వులను దానము చేయాలి. మూడు భాగములు నువ్వులు , ఒక భాగము చక్కెర ఉండాలి.
వ్రతమందున్నవాడు నెలమొత్తము అభ్యంగనస్నానము లేకుండా గడపాలి. వహ్నిహోమము చేసి ఏకాశనుడు కావాలి. భూశయ్య , బ్రహ్మచర్యము వీని యందు శక్తుడైనవాడు స్నానం చేయాలి. అశక్తుడు అంతట స్వేచ్చగా ఉండొచ్చు. అట్లాగే తిలల స్నానము. తిలలు ( నువ్వులు ) వంటికి రాచుకోవడము , తిల హోమము , తిలతర్పణము , తిలభోజనము , తిలదానము.--ఈ ఆరు రకముల తిలలు పాప నాశకములు.
స్నానము తర్వాత కట్టెవలె మౌనము గానుండి నమస్కరించి పురుషోత్తముని పూజించాలి.
దానములు ;
నూనె , ఉసిరికాయలు వీటిని ప్రతిరోజు తీర్థమందు ఇవ్వాలి. బ్రాహ్మణుల సేవనము కొరకు అగ్నిని ప్రజ్వలింపజేయాలి. భోజనాలు తృప్తి వరకూ ఏర్పాటు చేయాలి. వస్త్ర భూషణములతో అలంకరించి ద్విజ దంపతులను భుజింపజేయాలి. కంబలము , జింక చర్మము , రత్నములు, వివిధ వస్త్రములు , రవికలు , కప్పుకొనుటకు వస్త్రాలు ఇవ్వాలి. చెప్పులు గుల్మ మోచకములు మరియు పాపమోచకములు కాబట్టి వానిని ఇవ్వాలి.
శక్తి కొద్దీ అన్నదానము చేయాలి. వేదవిద్వాంసునకు గుంజెత్తు అయినా బంగారమివ్వాలి. మాఘమాసాంతమందు షడ్రస భోజనమాచరించాలి.
నిజానికి ప్రాతఃస్నానము పుష్య మాస శుక్ల పక్ష ఏకాదశిన మొదలు పెట్టి మాఘ శుక్ల ద్వాదశిన గానీ , పౌర్ణమి యందు గానీ సమాప్తి చేయాలి. రోజు భూమిపై పరుండాలి ( మంచము వదలి ) నెలరోజులు మితాహారుడై , లేదా నిరాహారుడై త్రికాలములయందు స్నానము చేసి , భోగములను వదలి , జితేంద్రియుడై త్రికాలాలలోను విష్ణువును అర్చించాలి.
భవిష్యపురాణము ప్రకారము , బ్రహ్మచారి , గృహస్థు, వానప్రస్థుడు , భిక్షకుడు , బాలురు , వృద్ధులు, యువకులు , స్త్రీలు , నపుంసకులు అందరూకూడా మాఘమాసమందు శుభమైన తీర్థమందు స్నానం చేసి, కోరిన ఫలమును పొందుతారు. అవయవములు దృఢం గా ఉన్నవారు చన్నీటి తోను , లేనివారు వేడి నీటి తోను స్నానం చెయ్యవచ్చు. పుష్య పౌర్ణమి గడిచాక మాఘ పౌర్ణమి వచ్చే వరకు విష్ణుపూజ విధిగా చేయాలి. పితరులకు , దేవతలకు ముల్లంగి ఇవ్వరాదు. బ్రాహ్మణుడు ముల్లంగి తింటే చాంద్రాయణ వ్రతాన్ని ఆచరించాలి. అలాగే క్షత్రియ , వైశ్య , శూద్రులు కూడ..ప్రతిరోజు స్నానము చేయునపుడు , ఈ మంత్రాన్ని ఉచ్చరించి , మౌనముగా స్నానమాచరించాలి
దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణోః తోషణాయ చ
ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘే పాప వినాశనం ॥
మకరస్థే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ
స్నానేనానేన మే దేవ యథోక్త ఫలదో భవ ॥
ప్రతి రోజు సూర్యార్ఘ్యమివ్వాలి.
రథ సప్తమి
దీన్నే , అచలాసప్తమి , మాఘ శుక్ల సప్తమి , మకర సప్తమి అని అంటారు
ఇది కోటి సూర్యుల సమానము. అందు స్నాన , అర్ఘ్య దానములు చేయాలి. అందువల్ల ఆయుస్సు , ఆరోగ్య సంపదలు లభిస్తాయి. నదిలో స్నానము చేస్తే , షష్టి యందే ఏకభుక్తం ( ఒంటి పూట భోజనము ) ఆచరించి , సప్తమియందు అరుణోదయ స్నానము చేయాలి. నిశ్చల జలము యొక్క పైభాగాన దీపముంచాలి. ఈ దీపాన్ని బంగారు , లేదా వెండి లేదా ఆనపకాయ పాత్రలో చేసి భక్తితో నూనె , వత్తి వేయాలి. పసుపు రంగు , కేసరి రంగుతో అలంకరించాలి. మొదట మనసును పదిలపరచుకొని శిరస్సు యందు దీపముంచుకొని సూర్యుని హృదయము నందు ధ్యానించి ఈ మంత్రాన్ని పలకాలి
॥ నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః
వరుణాయ నమస్తే`స్తు హరివాస నమో`స్తుతే..॥
సూర్యుణ్ణి ధ్యానించి దీపాన్ని నీట వదలాలి. నీటిలో , చందనం తో , ఎనిమిది ఆకులు గల పద్మమును వ్రాసి , కర్ణికను కూడా రాయాలి . మధ్యలో పత్నితో కూడిన శివుని ప్రణవముతో కూడా రాయాలి. తూర్పు దళముతో మొదలుపెట్టి , రవి , భాను , వివస్వత్ , భాస్కర , సవితృ , అర్క , సహస్ర కిరణ , సర్వాత్మకులను ధ్యానించి పూజించి ఇంటికి వెళ్ళాలి.
ఇంటి యందు స్నానం చేస్తే ( పాదోదక స్నానం ) చెరుకు గడ తో నీటిని కదిలించి , ఏడు జిల్లేడాకులు , రేగు ఆకులు తలపైన , భుజాలపైన ఉంచుకొని , ఈ మూడు మంత్రాలు చెప్పాలి
॥ యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు
రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమీ ॥
॥ ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం
మనో వాక్కాయజం ఉచ్చ జ్నాతాౕజ్నాతేచ యే పునః ॥
॥ ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్తసప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి ॥
స్నానం చేసి , నువ్వుల పిండితో చేసిన అపూపములతో బంగారు సూర్యుణ్ణి పూజించి బ్రాహ్మణుడికి దానమివ్వాలి. కింది మం త్రముతో సూర్యుడికి అర్ఘ్యము ఇవ్వాలి
॥ సప్తసప్తి వహప్రీత సమలోక ప్రదీపన
సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర ॥
********************************************************
వీటికి తోడు, ప్రవచనాలు, భజనలు, అనుష్ఠానాలు, శ్రాద్ధాలు, తర్పణాలు, సత్సంగాలు, దానాలు ఎన్నెన్ని ఉన్నాయి? కుంభమేళా అంటే వీటన్నిటి కలయిక.
ఇంతేకాక, కుంభమేళాకే ప్రత్యేకమైనదొకటి ఉంది
అదే, " కల్ప వాసము " అంటే త్రిసంధ్యా స్నానాలు, జపాలు, అనుష్ఠానాలు, దానాలు, సాత్విక శాకాహారము, నక్తాలు [ ఒంటి పూట భోజనం] .. ఇవన్నీ ఆచరిస్తే దాన్ని కల్పవాసం అంటారు. ఈ పేరు ఎందరికి తెలుసు? అక్కడికి వెళ్ళి వచ్చినవారికైనా తెలుసా?
పైన చెప్పినవన్నీ ఈ కల్పవాసము కిందకే వస్తాయి.
కుంభమేళాలో ఆచరించవలసిన వాటిని తెలియనివ్వకుండా, ఆచరించేలా చేయనీకుండా తద్వారా ధర్మ భ్రష్టులను చేసే భయంకర కుటిల వ్యూహము ఒకటి నడుస్తోంది.
కొందరు వ్యక్తులు, కుంభమేళా నుండి జనాల దృష్టి మరల్చి, తుచ్ఛమైన వాటి వెంట పడేలా యుక్తులు పన్నారు. వారిలో కొందరిని అక్కడక్కడా నిలబెట్టి, వారికి విపరీతమైన ప్రచారము కల్పించటము, --ఇప్పుడు ఏవేవో చదువుతున్నాము.. ఎవరో వ్యక్తి కళ్ళు బాగున్నాయి, ఒళ్ళు బాగుంది, జడలు బాగున్నాయి అంటూ వారు నిలబెట్టిన మనుషులకు విపరీత ప్రచారం కల్పించి, జనాలను ధర్మ భ్రష్టులుగా చేయడము--, ఎవరో ఒక సాధువును దేవుడిగా మార్చడము, మిగతావన్నీ మరచేలా చేసి, జనాలు వారి వెంట బడేలా చేయడము--ఇదంతా కుట్ర కాక మరేమిటి? ఇందులో విదేశీ చేతులు, దావూద్ చేతులు లేవంటే నమ్మలేము.
ఒకవేళ, అదంతా కేవలం ఊహ, అలాంటిదేమీ లేదు---అనుకుంటే,
మరి జనాలెందుకు వేలం వెర్రిలా అటువంటి వ్యక్తులకు ప్రాముఖ్యత ఇచ్చి, అసలైన తమ విధులను మరచిపోతున్నారు? ఆలోచించవలసిన అవసరం లేదా?
అక్కడ ప్రభుత్వం ద్వారానూ, హిందూ సంఘాల ద్వారానూ ఏర్పాటైన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. వాటి గురించి ఒక్క టీవీలోనూ రాదు. ఎంతసేపూ పక్కదారిపట్టించే సమాచారాలే. అక్కడే మనం అప్రమత్తులం కావాలి.
వారు చానెళ్ళలో చూపించకపోతే పోయింది, వెళ్ళిన భక్తులు ఆయా వీడియోలు చేసి, సామాజిక మాధ్యమాల్లో పెట్టవచ్చు కదా, ఆ పని అతి కొద్ది మందే చేస్తున్నారు. వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పని సరిగా అక్కడి ఆధ్యాత్మిక విషయాలను వీడియోలు తీసి పంచుకోవాలి.
గతం లో అంటే, ఇప్పటిలాగా ఇంటర్ నెట్లూ, ఏ ఐ, వంటివి లేవు కాబట్టి కేవలము ప్రాయోజిత కార్యక్రమాలు మాత్రమే దూరదర్శన్ లో వచ్చేవి. ఇప్పుడా ప్రతి బంధకం ఏమీ లేదు. ఎవరైనా అక్కడి విశేషాలను పంచుకోవచ్చు.
ధర్మ విరోధ శక్తుల కుటిల వ్యూహాలను త్రిప్పికొట్టేలా ఇప్పుడైనా మనం తగు చర్యలు తీసుకుందాము, ఇంకా సమయం ఉంది
దయచేసి ఎవ్వరూ ఆ చిల్లర వీడియోలను పంచుకోవద్దు. కేవలం ఆధ్యాత్మిక వీడియోలను మాత్రమే పంచుకుందాము.
॥ శుభం భూయాత్ ॥

This post was restricted in Facebook. No one could see this there
 

Thursday, December 26, 2024

దర్భంగా మహరాజు రామేశ్వర్ సింగ్

 దర్భంగా మహరాజు రామేశ్వర్ సింగ్

------------------------------
ఇదొక ఆసక్తికరము, విచిత్రమూ అయిన చరిత్ర.
.
భారత్ లో స్వాతంత్ర్యానికి పూర్వము అనేక స్వతంత్ర రాజ్యాలు ఉండేవి, రాజులుండేవారు. మొఘలుల దాడి వల్ల అనేక రాజులు రాజ్యాలు పోగొట్టుకున్నారు.
అయితే , దీనికి భిన్నంగా, అసలు రాజ్యమే లేని రాజపురోహితులు, అక్బర్ నుండీ ఒక ప్రాంతాన్ని నవాబు పరంగా పర్యవేక్షించడానికి తీసుకొని, సొంతము చేసుకొని, స్వతంత్రులై, రాజ్యాని పాలించిన వైనము.
.
ఈ దర్భంగా[ ఇప్పటి బీహార్ ] ను పాలించిన వారు, బ్రాహ్మణ రాజులైన ఖండ్వాలా రాజవంశము వారు. అది మిథిలా ప్రాంతము. ఇప్పటి భారత్, నేపాల్ సరిహద్దులో ఉంది.
తుగ్లక్ వంశ పాలన అంతము అయ్యాక, మిథిలా ప్రాంతములో అరాజకము నెలకొని ఉండినది. 1526 లో మొఘలు సామ్రాజ్యము స్థాపన వరకూ అక్కడ సరయిన రాజు లేక , పాలన లేక తిరుగుబాట్లు, దోపిడీలు వంటివి ఎక్కువగా ఉండేవి. అక్కడి ప్రజలనుండీ పన్నులు వసూలు చేయడము దాదాపు అసాధ్యముగా ఉండింది.
.
మొఘలు వంశములో అక్బర్ సింహాసనానికి వచ్చిన తరువాత, ఆ ప్రాంతములో ఉన్న అరాజకాన్ని తొలగించి, ఎవరైనా ఒక సామంతరాజును నెలకొల్పితేగాని పరిస్థితి చక్కబడదు అని తెలుసుకున్నాడు.
అంతకు ముందు ఆ ప్రాంతాన్ని బ్రాహ్మణ రాజులు పాలించి ఉండినారు. కాబట్టి, అక్బర్, రాజపండితుడైన ’ చంద్రపతి ఠాకుర్’ ను ఢిల్లీకి పిలిపించి , అతడి ముగ్గురు కొడుకుల్లో ఒకరిని పన్నులు వసూలు చేయుటకు అధికారిగా నియమించాలన్న తన ఉద్దేశాన్ని తెలిపాడు.
.
చంద్రపతి ఠాకుర్, తన రెండవ కుమారుడు ’ మహేష్ ఠాకుర్ ’ పేరును సూచించాడు.
.
1557 సంవత్సరము రామనవమి నాడు మహేష్ ఠాకుర్ మిథిలకు పర్యవేక్షకుడిగా నియమింపబడినాడు.
ఒక వైపు అక్బర్ కు అనుకూలముగా ఉంటూనే, మహేష్ ఠాకుర్ కింది తరాలవారు నెమ్మదిగా ఆ మొత్తము మిథిలా ప్రాంతములో పట్టు సాధించి, 1762 లో మొదటిసారిగా ఆ మొత్తము ప్రాంతానికి [ దానిని మధుబని ప్రాంతము అని కూడా అంటారు ] పాలకులైనారు.
.
అయితే తరువాతి కాలములో 1860 నుండీ 1880 వరకూ, ఆ రాజ్యము అనేక వ్యాజ్యాలలో చిక్కుకొని, బ్రిటిష్ వారి పాలన వచ్చాక, ఎన్నోసార్లు కోర్టులకు వెళ్ళాల్సి వచ్చింది. మనకు స్వాతంత్ర్యము వచ్చేనాటికి ఖండ్వాలా వంశపు చివరి రాజైన రామేశ్వర్ సింగ్ ఎన్నో మార్పులు తెచ్చి, తన రాజ్యాన్ని వ్యవసాయము, వాణిజ్యాల్లో అగ్రగామిని చేసి, ఒక ముఖ్యమైన రాజ్యముగా పేరు తీసుకువచ్చాడు.
.
స్వాతంత్ర్యానంతరము భారత ప్రభుత్వపు అనేక భూసంస్కరణల వల్ల , జమీందారీ వ్యవస్థ కూలిపోవడముతో, దర్భంగా పాలన క్షీణించింది. చివరి మహారాజు అయిన రామేశ్వర్ సింగ్ 1962 లో నిస్సంతుగా మరణించడముతో వారి వంశపాలనకు భరతవాక్యము పలికినట్టైంది.
.
ఇదంతా కేవలము బ్రాహ్మణులు రాజులుగా పాలించిన వైనమైతే, వారి ఆచార వ్యవహారాలు, అనుష్ఠానాలు ఎలాగుండేవి చదివితే నిర్ఘాంత పోతారు.
.
రాజా రామేశ్వర్ సింగ్ దినచర్యను చూస్తే విస్మయాశ్చర్యాలు కలిగి శరీరములోని రోమాలు నిక్కబొడుచుకోక తప్పదు.
.
ఈయన కాలము, 1860 నుండీ 1929 వరకూ.
.
రామేశ్వర సింగ్ మహరాజు, మూడవ జామున రెండు గంటలకే నిద్రలేచేవాడు. తన శయ్యపైన కూర్చుండి, అలాగే దేవీ సప్తశతి మొత్తము పాఠాన్ని పఠించేవాడు.
.
అటుతరువాత, స్నానాదికాలు ముగించి, సంధ్యావందనము చేసి, సహస్ర గాయత్రి జపము చేసేవాడు.
అటుతర్వాత , నిత్య శ్రాద్ధము లో భాగముగా ప్రతిరోజూ సుమారు నలభై కేజీల బియ్యముతో పిండదానము చేసేవాడు.
ఆ తరువాత తన నిత్య పూజలో భాగముగా పార్థివ లింగానికి పూజాభిషేకాలు చేసేవాడు.
అయిన తరువాత , భగవతీ దేవి అమ్మవారి ఆలయానికి వెళ్ళి, అమ్మవారి అర్చన తరువాత, ’ తాంత్రిక సంధ్యావందనము ’ చేసి, తంత్ర ప్రకారముగా ’ పాత్ర స్థాపన చేసి, మహా కాళీ పూజ చేసేవాడు. అందులో భాగముగా ఆవరణ పూజ, జపము, పంచాంగ పాఠము చేసి, కకారాది సహస్ర నామాలతో పుష్పాంజలి సమర్పించేవాడు.
.
అటు తరువాత, కుమారి, సువాసిని, వటుక లకు పూజ, తర్పణము చేసి, సామయిక పూజ చేసేవాడు.
ఉదయము పది గంటలకల్లా ఇవన్నీ ముగించి, ప్రసాదము స్వీకరించేవాడు.
.
ఒక గంట విశ్రాంతి తరువాత, రాజ్యపాలనలో భాగముగా తన కర్తవ్యాలను ఉదయము పదకొండు నుండీ మధ్యాహ్నము మూడున్నర వరకూ నిర్వర్తించేవాడు.
.
అటు తర్వాత, స్నానము చేసి, సంధ్యావందనము చేసి, మరలా సహస్ర గాయత్రి చేసి, ప్రదోషకాలములో మరలా పార్థివ లింగానికి పూజాభిషేకాలు చేసేవాడు.
.
రాత్రి కాగానే దేవీ భగవతికి " సాంగోపాంగ నిశార్చన "--అందులో భాగముగా, నూట ఎనిమిది మంది బ్రాహ్మణులు సామూహిక సప్తశతీ పారాయణ చేయగా, యాభై ఒక్క బ్రాహ్మణులు రుద్రాభిషేకము చేసేవారు.
.
ఇవి కాక, ప్రతిరోజూ , నిరంతరాయంగా సూర్యోదయము నుండీ సూర్యాస్తమయము వరకూ దేవీ సప్తశతీ పారాయణలు, రుద్రాభిషేకాలు దేవాలయములో జరుగుతూనే ఉండేవి.
.
ఈ విధముగా తన జీవితాన్ని ’ మహానుష్ఠానము ’ నకే అంకితము చేసిన ఆ మహారాజు రామేశ్వర్ సింగ్, గొప్ప పండిత విద్వాంసుడు కూడా.
.
సంస్కృతము, హింది, బెంగాలి, ఇంగ్లీషు, ఫ్రెంచ్ భాషలలో అనర్గళముగా మాట్లాడేవాడు.
తంత్రములోనే కాక, వేదాంతము, వ్యాకరణము, సాంఖ్యము, యోగము లలో అతడు గొప్ప పండితుడు.
.
1908 శరదృతువులో వేద విద్వత్ సభలు నిర్వహించాడు. ఆ సభలకు, ఆ కాలములో విద్వాంసులుగా ప్రసిద్ధి చెందిన పండిట్ ప్రకాశానంద ఝా [ వైద్యనాథ ధర్మము ] , పండిత శివచంద్ర భట్టాచార్య [ కాశీ ] , శ్రీవిద్యా సాధకులైన పండిత సుబ్రహ్మణ్య శాస్త్రి, అప్పటి ఆగమ అనుసంధాన సమితి యొక్క అధ్యక్షుడు అయిన ’ జాన్ ఉడ్రోఫ్ ’ వంటి మహామహులు భాగము వహించినారు.
.
ఆ విద్వత్ సభకు అధ్యక్షుడు గా శ్రీ పండిత శివచంద్ర భట్టాచార్య వ్యవహరించినారు. మహారాజుకు తంత్ర సాధన, తాంత్రిక విద్యలలో మార్గ దర్శనమునిచ్చినవారు వీరే.
ఈ విద్వత్ సభ గురించి ఎన్నెన్నో విశేషాలు ఈ క్రింది లింకులో చదవవచ్చు.

Wednesday, September 18, 2024

తర్పణం

 తర్పణం

-----


పితృ పక్షము ప్రారంభమవుతున్నది, పితృలోకములోని పితరులు తమ వంశజులు ఇచ్చే శ్రాద్ధాలు, తర్పణాల కోసము భువికి దిగివస్తారు అని నమ్మకము. గరుడపురాణము, మత్స్య పురాణము వంటి పురాణాలలో విషయము మీద చాలినన్ని వివరణలు చూడవచ్చు.


మహాభారతము ప్రకారము, కర్ణుడు మరణించిన తరువాత అతడి  సూక్ష్మ శరీరానికి ఊర్ధ్వ లోకాలలో తినడానికి, త్రాగడానికి  అన్నపానాదులు దొరకలేదు, కాని చాలినంత వెండి బంగారాలు దొరికాయట. ఎందుకంటే, అతడు ఎంత దానకర్ణుడు అని పేరు తెచ్చుకున్నా, అతడు దానాలు చేసింది ధనము,సంపదలు, ఆభరణాల వంటివే కాని, అన్నపానాదులు కాదు.  ఆ స్వర్ణ రజతాలతో  తో ఆకలిదప్పులు తీరక, అలమటించి, చివరికి యముడిని ప్రార్థించగా, యముడి దయవల్ల  అతడు తిరిగి భూమికి వచ్చి, అన్నదానము విశేషముగా చేసి తిరిగి యమలోకానికి వెళ్ళాడు. 


శ్రాద్ధాలు ఈ పక్షమంతా తమ వెనుకటి తరాల పితరులను ఉద్దేశించి అందరూ యథాశక్తిగా చేస్తారు. శ్రాద్ధాలలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఏ రకమైన శ్రాద్ధము చేసినా ఫలితము ఒకటే. పదిహేను రోజులూ చేయకపోయినా, కనీసం ముఖ్యమైన తిథులలో... అనగా, తమ పూర్వ వంశజులు మరణించిన తిథులలో అయినా తప్పక శ్రాద్ధాలు చేస్తారు. చివరకు, ఇంకేరోజు వీలుకాకున్నా, అమావాస్య రోజైన తప్పనిసరిగా శ్రాద్ధాలు చేస్తారు.


శ్రాద్ధాల సమాచారము చాలినంత అన్ని చోట్లా దొరకుతున్నది, కాబట్టి ప్రస్తుతము తర్పణాల విషయము మాత్రము చర్చిస్తున్నాను.

పితృపక్షములో పదిహేనురోజులూ శ్రాద్ధాలు చేయలేనివారు, ముఖ్యమైన రోజుల్లో శ్రాద్ధాలు ఆచరించి, మిగతా అన్ని రోజులూ తర్పణాలు తప్పక వదులుతారు.

.

తర్పణాలు అంటే కేవలము పితరులను ఉద్దేశించి చేసేది మాత్రమే అని అర్థము కాదు. పితృపక్షము వస్తున్నది కాబట్టి ఇక్కడ పితరులనుద్దేశించి చేయాలి అని చెప్పినా, తర్పణాలు నిజానికి, దేవతలు, ఋషులు, పితరులు అందరికీ వివిధ సందర్భాలలో ఇస్తాము. 


ఈ తర్పణాలు రకరకాలు. వట్టి నీళ్ళతో ఇచ్చేవి, పాలతో ఇచ్చేవి, నువ్వులు, నీళ్ళు కలిపి ఇచ్చేవి, సుగంధ ద్రవ్యాలతో ఇచ్చేవి, నెయ్యి లేదా పెరుగు కలిపి ఇచ్చేవి... ఇలా రకరకాలు. 


వినాయకుడు తర్పణ ప్రియుడు అని ప్రసిద్ధి. అందుకే గణపతి పూజలో తర్పణము తప్పని సరి. అలాగే, గణపతి మూలమంత్ర జపము చేసిన తర్వాత తర్పణాలు కూడా వదులుతాము.

 భీష్ముడు , యముడు వంటి వారికి ఆయారోజుల్లో తర్పణము వదలుట ఆచారము. అలాగే, రుద్రాభిషేకములో కూడా భవుడు, శర్వుడు మొదలుగా ఎనిమిది మంది శివ రూపాలకు తర్పణము ఇస్తాము. నవగ్రహ జపాల అనంతరము కూడా తర్పణాలు తప్పనిసరి. అలాగే, దేవీ ఉపాసకులు మూలమంత్రముతో దేవికి తర్పణాలు ఇస్తారు.  ఇంకా, నక్షత్రాలకు కూడా తర్పణాలు ఇస్తారు.

ప్రతిరోజూ బ్రహ్మ యజ్ఞములో భాగముగా దేవ, ఋషి, పితృ తర్పణాలు ఇస్తాము. అంతే కాదు, బ్రహ్మ మొదలు క్రిమికీటకాల వరకూ అందరినీ ఉద్దేశించి నీళ్ళతో నిత్య తర్పణాలు కూడా వదిలే ఆచారము ఉంది. 


అసలు తర్పణం అంటే ఏమిటి? 

తర్పణము అంటే " సంతృప్తి పరచుట "  

దేవతలకు కాని, ఋషులకు కాని, పితరులకు కానీ, నవగ్రహాలకు కానీ, తర్పణాలు వదిలేది,

౧. కృతజ్ఞతను చూపడానికి

౨. వారిని సంతుష్టి చేసి మెప్పించడానికి

౩. మనము చేసుకున్న పాపాలను కడిగివేసి శుద్ధులు కావడము కోసము

౪. దేవర్షిపితరులతో ఒక విధమైన’ సంబంధము ’ లేదా లంకె కలిగి ఉండుటకు

౫. మన కర్మ ఫలాన్ని సమతూకము చేసుకోవడము కోసము. 


తర్పణాలు వదిలేటప్పుడు రకరకాల మంత్రాలు ఉచ్చరించడము, వివిధపానీయలు[ పైన చెప్పినవి ] దోసిళ్ళతో ఇవ్వడము, ముద్రలు వేయడము, సమయపాలనగా ఆయా సమయాల్లో చేయడము వంటివి ఉంటాయి.

తర్పణాలు ఇవ్వడము వలన, ఆయా దేవఋషి పితరుల ఆశీర్వాదాలు పొందగలము, వారికి మన భక్తి ప్రపత్తులు చూపించగలము, 


ఇక పితృ తర్పణాల విషయానికి వస్తే,

అమావాస్య, సంక్రమణములందు, గ్రహణము, అర్ధోదయమ్, మహోదయము, దక్షిణాయన, ఉత్తరాయన పుణ్యకాలాల్లోను,,  మహాలయ పితృ పక్షములోను, తీర్థ క్షేత్రాలు దర్శించినపుడూ తర్పణాలు ఇస్తాము


ఒకే దినము, రెండు కారణాలకోసము రెండుసార్లు తర్పణాలు ఎన్నటికీ వదలరాదు. రెండు సందర్భాలు ఉంటే, మొదట ఏది ముఖ్యమో దానికి ఇచ్చి, తరువాతి దినము ఇంకో కారణానికి ఇవ్వవచ్చు.


ఇంటిలో తిలతర్పణాలు వదలరు, ఇంటి బయటో, బాల్కనీ వంటి వాటిలోనో, తులసి కట్ట వద్దనో ఇవ్వవచ్చు.

తండ్రి బ్రతికి ఉన్నవారు పితృ తర్పణాలు వదలరాదు. దేవ, ఋషి తర్పణాలు వదలవచ్చు.

పితృపక్షములో ద్వాదశ పితరులకు మాత్రమే కాక [ అంటే , మరణించిన వారిలో  తండ్రి వైపు మూడు తరాల దంపతులకు, తల్లి వైపు మూడు తరాల దంపతులకు ] ఇంకా మేనమామలు, మేనత్తలు, పినతండ్రి, పెదనాన్నలకు, వారి భార్యలకు, ఇంకా మరణించిన అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, బావ,మరుదులు, వదినలు, ఇలా గడచిన మూడు తరాల అందరికీ వదలాలి. వారిని " సర్వే కారుణ్య పితరులు " అంటారు. 


ఇంత విస్తారముగా చేయలేనివారు,


|| ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం దేవర్షి పితృ మానవాః 

తృప్యంతు పితరః సర్వే పితృ మాతా మహాదయః 

అతీత కుల కోటీనామ్ సప్తద్వీప నివాసినామ్

ఆ బ్రహ్మ భువనాల్లోకాదిదమస్తు తిలోదకమ్ ||


అని చెప్పి మూడు సార్లు నువ్వులు కలిపిన నీళ్ళు వదలవచ్చు. 

తర్పణాలు వదిలేటప్పుడు ఉంగరపు వేలికి పవిత్రం తప్పక ధరించాలి.

దేవర్షు లకు రెండు దర్భలతో చేసినది, పితరులకు మూడు దర్భలతో చేసినది ధరించాలి.

తర్పణాల విషయములో ఇంకొంత సమాచారము

------------------------------------

తండ్రి బ్రతికి ఉన్నవారు పితృ తర్పణాలు ఇవ్వరాదు. 

ఎందుకంటే ఆ తర్పణాలేవో ఆ తండ్రే చేస్తాడు కాబట్టి. చేసే అధికారం తండ్రికి మాత్రమే ఉంది కాబట్టి. 


తండ్రి బ్రతికి ఉండి, తల్లి పోయినవారు కూడా అంతే... తండ్రే ఇవ్వాలి.


తల్లిదండ్రులు ఇద్దరూ పోయి, ఉన్న ఒక్క కొడుకు కూడా పోయి ఉంటే, వారి మనవడు తర్పణాలు ఇవ్వొచ్చు.

కొడుకు కొడుకు అంటే మనవడు లేకపోతే, కూతురి కొడుకు  అనగా దౌహిత్రుడికి అధికారం ఉంది. 


మంత్ర పూర్వకముగా ఇచ్చే అధికారం లేనివారు, పౌరాణికముగా ఇవ్వవచ్చు.. అంటే కేవలము గోత్రనామాలు చెప్పి ఒక్కొక్కరికి తర్పణము ఇవ్వడము. 


ప్రతి సంవత్సరమూ ఆబ్దీకము పెట్టినా సరే, అక్కడ ఇచ్చే తర్పణము వేరు, పితృపక్షములో ఇచ్చేది వేరు. రెండూ చేయాలి.


తల్లిదండ్రులు ఉన్నవారు ఎంతో అదృష్టవంతులు. పితృ దేవతలు సంతుష్టులై, అనుగ్రహిస్తే, కేవలం ఆ తర్పణము ఇచ్చినవారిని మాత్రమే అనుగ్రహించినట్టు కాదు. వారి కుటుంబములో రాబోయే యేడు తరాలవారిని అనుగ్రహించినట్టే.  అది తెలీక, మా తాత ఇచ్చాడు, మా తండ్రి ఇచ్చాడు, వారు మాత్రం బాగుంటారు, నేను కూడా బాగుండాలి కాబట్టి, నాచేత్తో నేను కూడా  తర్పణాలు, శ్రాద్ధాలు చేస్తాను--అనుకోవడం అమాయకత్వం. 


అధికారం లేని కొడుకు, అధికారం ఉన్న తండ్రికి సహాయ పడాలి అంతే. 


తల్లిదండ్రులు బ్రతికి ఉన్నవారికి వేరే దేవతలు, పితృ దేవతలు అవసరం లేదు. వీరే దేవతలు, వీరు చెప్పినట్టు చేసి, వినయముగా ఉంటే అంతకన్నా పెద్ద పుణ్యము ఇంకోటి లేదు.


కొందరంటారు, మా నాన్న సరైన వాడు కాదు, ఏమీ చేయడు,  అదీ ఇదీ అని చెప్పి, ఎలా గౌరవించాలి? అని అడుగుతారు. 

.

తండ్రి అంటే కేవలము కంటికి కనబడే దేహము కాదు, ఆ దేహములోని బుద్ధులు కాదు.  "ఆత్మా వై పుత్ర నామాసి " అన్నారు. అంటే, తండ్రి ఆత్మే పుత్రుడిగా ఇంకో రూపము తీసుకొని ఉంటుంది.  మనము గౌరవించేది, పూజించేది, ఆ భౌతిక శరీరాన్ని కాదు, అందులోని పితృ దేవతా రూపమైన ఆత్మను. 


ఒక వేళ తండ్రి ఉండి, కారణాంతరాల వల్ల చేయుటకు వీలు కాకపోతే, అప్పుడు ఆ తండ్రి అనుమతి తీసుకొని కొడుకు నిరభ్యంతరంగా చేయవచ్చు.  తండ్రి అనుమతి తో శ్రాద్ధాలు, శవదహనాలు, కర్మలు--ఇవన్నీ చేయవచ్చు. 

మహాలయ పితృ తర్పణాలు ఇచ్చే విధానము ఇదే   బ్లాగులో ఉంది.

Friday, May 28, 2021

" ప్రవర్గ్య హోమము "



" ప్రవర్గ్య హోమము " గురించి  ఒక వీడియో అంతర్జాలములో లభ్యమగుచున్నది.. అందులో ఒక దర్విలో వేసిన తక్కువ ప్రమాణములోనున్న హవిస్సు ను యజ్ఞేశ్వరుడికి ఆహుతి ఇవ్వగానే అణ్వస్త్రము విస్ఫోటమైనట్టు పెద్దఎత్తున మంటలు, వెలుగు యాగశాల అంతా నిండిపోయినది చూడవచ్చు. అది ఎలా సాధ్యము ? 

యజురారణ్యకములో ఈ ప్రవర్గ్యము గురించిన ఉటంకింపు ఉంది. కొన్ని విశేషాలు ఉన్నాయి. 
.
" ప్రవర్గ్యము "అంటే ఏమిటో  తెలుసుకుందాము.  కాని, ఇది తెలియాలంటే మొదట, " అరుణకేతుకాగ్ని " అన్నది తెలియాలి. 

వైదిక దేవతలలో అగ్ని , ఇంద్రుడు, మిత్ర, వరుణులు, విశ్వేదేవతలు ముఖ్య దేవతలు. ఋగ్వేదమంతా ఈ దేవతల వర్ణన తో ఉంటుంది.  అగ్ని అంటే మనము అనుకునే అగ్ని కాదు.  ఋగ్వేదము ప్రకారము, ’ అగ్ని ’ అంటే పరమాత్మ. ఆ పరమాత్మ ఎన్నిరూపాలైనా తీసుకుంటాడు. మనము చూసే అగ్ని కూడా ఆ రూపాలలో ఒకటి.  సూర్యుడు కూడా అగ్ని రూపాలలో ఒకటి. అయితే సూర్యులు అనేకులు ఉన్నారు . ముఖ్యముగా ద్వాదశ సూర్యులు ద్వాదశ మాసాలకు అధిపతులు. మాసాలకు అధిపతులు ఉన్నట్టే , ఋతువులకు కూడా అధిపతులు ఉన్నారు. 
.
సూర్యరూపములో నదులనుండి, సముద్రమునుండి నీటిని తీసుకొని, ఆ నీటిని వేయిరెట్లుగా వర్షింపజేయువాడు ద్రవరూపములోని అగ్ని.  అవును , అగ్ని ద్రవరూపములో ఉంటాడు. నీటిలో ఉన్న వేడిమి ఏదుందో, అది ద్రవరూపమైన అగ్ని. ఆ ద్రవరూపుడైన అగ్ని మనకు వానలు కురిపిస్తాడు. ఆ ద్రవరూపుడైన అగ్నినే " అరుణ కేతుకాగ్ని " అంటారు. 

ఇంకో విషయము.. 
అగ్ని దేవుడు జిహ్వా రూపముగా కూడా ఉంటాడు. మనము చూసే  అగ్ని దేవుడి నాలుకలు యేడు.. అవే , కాళీ , కరాళీ , మనోజవా , సులోహితాయా, సుధూమ్ర వర్ణా , స్ఫులింగినీ , విశ్వ రుచి అనేవి.. "

" మనము చేసే అనేక  యాగాల ముఖ్యోద్దేశము , రాజ్యము సకాల వృష్ఠులతో సస్య శ్యామలముగా ఉండి , ప్రజలు సుఖజీవనము సాగించుట . దానికి సహాయపడువాడే అగ్నిదేవుడు. సూర్యుడు నదీ జలములను తీసుకొనుట , వేయిరెట్లు వర్షించుటకే గదా, ఆ వర్షమును కలిగించువాడే , ద్రవరూపుడైన అగ్నిదేవుడు. ఆ అగ్నిదేవుడినే " అరుణ కేతుకాగ్ని " అంటారు..."  అని తెలుసుకున్నాము గదా.. 
అదీ కాక, 
.

" క్షణములు , ఘడియలు , దివారాత్రాలు , పక్షములు , మాసములు , ఋతువులు , సంవత్సరమును కలిగించు సూర్య రూపుడే ఈ అరుణ కేతుకాగ్ని. అంటే , ఈ అరుణ కేతుకాగ్నియే కాలము యొక్క విభాగములను కలిగించువాడు...  ఒకో రుతువుకు ఒక్కో దేవతను అధిపతి లేక అధిదేవత గా నియమించినాడు. ఆయా అధి దేవతలు అందరూ అరుణకేతుకాగ్ని ప్రతిరూపాలే. 

 కాలము లోని ఈ విభాగాల్లో ఋతువులు ఒకటి అని మనకు తెలుసు కదా, 

శిశిర  ఋతువుకు అధిదేవతలైన విశ్వేదేవతలు కూడా అరుణకేతుకాగ్ని కి ప్రతి రూపాలు. మరి, ఈ విశ్వే దేవతలు అంటే ఎవరు ? 
ఏయే దేవతలకు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు ఉండవో, ప్రత్యేక నామములు ఉండవో, వారే విశ్వేదేవతలు. అంటే యుగాలు గడిచేకొద్దీ వీరు ఒక సమూహముగా పిలవబడ్డారు. [ ఆదిత్యులు, మరుత్తులు , వంటి వారు కూడా అటువంటి సమూహాలే ..]
.
ఈ దేవతలు ముఖ్యముగా ధర్మాన్ని, నైతికతను --అంటే ’ ఋతము ’ ను కాపాడు వారు. తమ భక్తుల శత్రువులను నాశనము చేసి, మంచిని కాపాడి, వారికి ఉన్నత లోకాలను కలిగించేవారు ఈ విశ్వేదేవతలు. 
.

 ఒకసారి ఈ విశ్వే దేవతలు అరుణకేతుకాగ్ని రూపమయిన తమ  జిహ్వలతో  బిగ్గరగా కేకలు వేస్తూ , ఒకానొక సందర్భములో , ’  మానవులు , వరుణుడు , ఇంద్రుడు , అగ్నిహోత్రుడు , వాయువు ఎవరైనా గానీ మాతో సమానులు గారు’ అని ఉచ్ఛ స్వరముతో ధ్వనులు చేసినారు.. 
.
అందు చేత , ఇంద్రుడు భయపడినాడు. అంతేగాక , విశ్వేదేవతల జిహ్వా రూపమైన అరుణ కేతుకాగ్ని యొక్క ధనుస్సు , భూమ్యాకాశములను నిండియుండుట చేత , ఇంకా భయపడి , ఒక చలి చీమ రూపములో వెళ్ళి ఆ ధనుస్సు యొక్క నారిని కొట్టివేసినాడు. అలా కొట్టివేయగా , ఆ ధనువు ఆకాశమునకు ఎగిరి , ధనుస్సు యొక్క ఒక కొన తగిలి , అరుణకేతుకాగ్ని యొక్క శిరస్సు తెగి , చూర్ణమై కిందపడినది. ఆ చూర్ణము , యజ్ఞములో ఉపయోగించు ’ ప్రవర్గ్యము ’ అను ఒక హవిస్సుగా మారినది. కాబట్టి , యే మనుష్యుడు ప్రవర్గ్యముతో కూడిన యజ్ఞము చేస్తాడో , అతడు అరుణకేతుకాగ్ని యొక్క శిరస్సును తిరిగి కూర్చినవాడే యగుచున్నాడు. 
.
ఇది తెలుసుకొన్న వాడిని అరుణకేతుకాగ్ని హింసింపదు. కావలసిన కోరికలను తీర్చును. అందుచేతనే ఈ ప్రవర్గ్యేష్టి చేయుట.  తపస్సు చేయువారిని అగ్ని కానీ ఇతరులుకానీ అన్ని ఋతువులలోనూ బాధించక , కాపాడవలెనంటే  ఈ ఇష్టి చేయుట మిక్కిలి లాభదాయకము. "

ఈ ఇష్టిని కేవలము ప్రవర్గ్యేష్టి గా మాత్రమే ప్రత్యేకముగా చేయరు. సామాన్యముగా ’ సోమయాగము ’ లో ఒక భాగముగా ఈ ప్రవర్గ్యేష్టి ని చేస్తారు. 
.
పైదంతా అలాగే జరిగి ఉండవచ్చు, లేక జరిగినదానిని ఒక చిహ్న రూపములో అలా చెప్పి ఉండవచ్చు. వేదము నేరుగా దేనినీ చెప్పదు. బీజరూపములో మాత్రమే చెపుతుంది. దానిని విస్తృత పరచుటకే వేదవ్యాసులు అష్టాదశ పురాణాలను వ్రాసినది. 
.
 [  సంస్కృతము వచ్చినంత మాత్రాన వేదార్థమును తెలుసుకోలేము,  వేదానికి భాష్యము చెప్పలేము. దానికి ’ నిరుక్తము ’ అనే వేద సంస్కృతపు నిఘంటువు అవసరమవుతుంది. మామూలు సంస్కృతము వేరే, వేదములోని సంస్కృతము వేరే. రెండూ ఒక్కలాగే ఉంటాయి. అర్థమయినట్టే అనిపిస్తాయి. కాని అవే పదాలకు ఈ రెండు సంస్కృతాలలోనూ అర్థాలు వేరువేరు ఉండచ్చు.  అన్ని పదాలకూ అలా వేరు వేరు అర్థాలు ఉంటాయని కాదు. అనేక పదాలకు విపరీత, వ్యతిరేక అర్థాలు కూడా ఉన్నాయి. 
.
ఆచార్య సాయణుడు ఒక్కరు మాత్రమే అన్ని వేదాలకూ భాష్యము వ్రాసినారు. వారి భాష్యమే ప్రామాణికముగా ఇప్పటివరకూ అనుసరింపబడుతున్నది. ]
( ఇది తెలియని ఈనాడు కొందరు మ్లేఛ్ఛులు నాలుగు సంస్కృతము ముక్కలు నేర్చుకొని వేదాలకు వక్రభాష్యాలు చెబుతున్నారు... అది విషయాంతరము ) 
.
మరి, ఇప్పటి కాలములో ఈ ఇష్టిని చేయడము ఎలాగ ? ప్రవర్గ్యము అంటే ఏమిటి, ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది ? 
ఈ కాలము అరుణకేతుకాగ్ని శిరస్సును అతికించగల  తంత్రాలు లేవు, అయితే మంత్రాలు ఉన్నాయి. అగ్ని దేవుడి కి ఇష్టమైనవి గా చెప్పబడిన సద్యోఘృతము, ఆవు పాలు, మేకపాలతో ఈ ప్రవర్గ్యాన్ని చేస్తారు. ఈ పదార్థాలతో చేసిన ’ ఘర్మము ’నే ప్రవర్గ్యము అంటారు. 
.
ఉడుకుతున్న నేతిలోకి ఆవుపాలు, మేకపాలు ప్రత్యేక నిష్పత్తిలో ప్రత్యేక మంత్రాలతో కలిపి ఘర్మాన్ని తయారు చేస్తారు. అదే ప్రవర్గ్యము. అది ప్రవర్గ్యముగా మారాలంటే , దానిని హవిస్సుగా అర్పించేటప్పుడు ప్రత్యేక  సిద్ధియైన మంత్రాలు పఠించాలి.  అలా పఠించి హవిస్సును తయారు చేసి, ఆయా ప్రత్యేక మంత్రాలతో ఆ ప్రవర్గ్యమును హవిస్సుగా ఇవ్వాలి.  అప్పుడు అది అరుణకేతుకాగ్ని శిరస్సును తిరిగి అతికించిన ఫలాన్నే ఇస్తుంది.
.
 వీడియోలో మనము చూసే విస్ఫోటనము ఆయా పదార్థాల వల్ల కాదు. ఆ మంత్ర శక్తి వల్ల మాత్రమే. 
.
// సర్వం జగదంబార్పణమస్తు //
-- విభాతమిత్ర 
[ భాస్కర జనార్దన శర్మ ]



 

Sunday, July 19, 2020

" శంఖము " ప్రాశస్త్యము







శంఖము
--------
సనాతన ధర్మములో శంఖానికి ఉన్న ప్రాముఖ్యత అంతాఇంతా కాదు.
దేవుళ్ళు, దేవతల చేతులలో శంఖము ఉన్నట్టు వర్ణింపబడి ఉంటుంది. శంఖాన్ని పూరించడము వలన అత్యంత శుభములు కలుగుతాయి.
క్షత్రియులకు శంఖము ఎలాగ యుద్ధపరమైన ఒక ఆభరణమో, బ్రాహ్మణులకు ఆది ధార్మికపరమైన ఆభరణము.
.
చండీ సప్తశతిలోనూ, భగవద్గీతలోను, ఇతర పురాణాలలోను , దేవతలు దానవులతో యుద్ధానికి వెళ్ళేటప్పుడు , పాండవులు కౌరవులతో మహా సంగ్రామము చేసినపుడు, ప్రతి దినమూ  ఆరంభములో శంఖనాదము చేసి గానీ యుద్ధము మొదలు పెట్టరు అని చదువుతాము. అలాగే యుద్ధాని విరమించే సంకేతముగా కూడా శంఖనాదము చేస్తారు.
.
బ్రహ్మవైవర్త పురాణములో, శ్రీకృష్ణ పరమ భక్తుడైన గోప సుదాముడు శాపవశమున శంఖచూడుడు అను రాక్షసుడిగా జన్మించి, దేవతలను బాధించుటచే, శంకరుడు అతడిని వధించెననీ, ఆతడి అస్థికలనుండీ మహా శంఖము ఆవిర్భవించెననీ చెప్పబడి ఉంది. దానిని విష్ణువు సంగ్రహించి తన వద్ద ఉంచుకున్నాడు.
.
మరొక కథనము ప్రకారము, " పంచజన " అనే భయంకరుడైన దానవుడు, సూక్ష్మ రూపములో సముద్ర గర్భములోని ఒక శంఖములో నివశించేవాడు. అవసరమైనపుడు తన నిజరూపము దాల్చి, బయటకు వచ్చి, దేవతలను, మనుషులను పీడించేవాడు.
.
ఒకసారి వాడు, ’ సాందీపని ’ మహర్షి యొక్క ఏకైన కుమారుడిని అపహరించుకొనిపోయి మింగేసినాడు.  అటుతరువాత కొంత కాలానికి, శ్రీకృష్ణుడు, బలరాముడు సాందీపని మహర్షి గురుకులములో విద్యాభ్యాసము పూర్తి చేసిన తరుణములో, గురువు గారిని ’ గురుదక్షిణ స్వీకరించవలసినదనీ, ఏమి అడిగినా ఇచ్చుటకు తాము సిద్ధమనీ ’  ప్రార్తిస్తారు. అప్పుడు సాందీపని మహర్షి, పంచజనుడు ఎత్తుకుపోయిన తన కుమారుని రక్షించి తీసుకురమ్మని గురుదక్షిణగా అడుగుతాడు.
.
బాలకుని వివరాలు అన్నీ తెలుసుకున్న శ్రీకృష్ణ బలరాములు, సముద్రములోకి దూకి, పంచజనుడిని వెదకి వెళ్ళి పట్టుకుని చంపేస్తారు. అతడు నివసిస్తున్న శంఖాన్ని సంగ్రహించుకుని వస్తారు. అయితే బాలకుడు అప్పటికే మరణించాడని తెలుసుకుని, యమలోకానికి వెళ్ళి, ఆ బాలకుడిని బ్రతికించుకుని  తీసుకువచ్చి గురువుగారికి అప్పజెపుతారు.
పంచజనుడి నుండీ వచ్చింది కాబట్టి ఆ శంఖానికి ’ పాంచజన్యము ’ అనే పేరు వచ్చింది.

అందుకే, || త్వం పురా సాగరోత్పన్నః, విష్ణునా విధృతః కరే, దేవైశ్చ పూజితస్సమ్యక్ పాంచజన్య నమోఽస్తుతే || అను శ్లోకము ప్రకారము, మనము పూజించే శంఖము పాంచజన్యమే .
ఈ పాంచజన్యము అనే శంఖమును కృష్ణుడు సంగ్రహించి తనవద్ద ఉంచుకొన్నాడు.
.
శంఖము లో బ్రహ్మ విష్ణు రుద్రులు ఉంటారు. గంగా , సరస్వతీ నదులు మొదలుకొని అనేక తీర్థాల ఆవాస స్థానమే ఈ శంఖము.
అందుకే, శంఖాన్ని చెవి దగ్గర పెట్టుకొని వింటే సముద్రపు హోరు వినిపిస్తుంది. మరే ఇతర వస్తువును పెట్టుకున్నా ఆ హోరు వినపడదు.
.
ఒక అతి ముఖ్యమైన విషయము మీరు గమనించి ఉంటారు.
కలిప్రభావము అని చెప్పినా కూడా, ఈ తరములో విపరీత భావాలు, రాక్షస ప్రవృత్తి గల వారు అధికముగా పుట్టుకొని వస్తున్నారు. ఒక తరము వెనుక ఇంతటి సంఖ్య లో ఉండేవారు కాదు. ఇంకా వెనుకటి తరాలలో అస్సలు ఇటువంటి మనుషులు ఉండేవారు కాదు.
.
దీనికీ, శంఖానికీ ఒక అతి దగ్గర సంబంధము ఉంది.
శంఖాన్ని పూజించేటప్పుడు చెప్పే శ్లోకాలలో,
|| గర్భా దేవారి నారీణాం విశీర్యంతే సహస్రశః |
తవ నాదేన పాతాళే పాంచజన్య నమోఽస్తుతే ||
అని పూజిస్తాము.
శంఖాన్ని గట్టిగా పూరిస్తే, ఆ నాదానికి రాక్షసులు , దానవులు, దైత్యులు బెదరి పారిపోవడమే కాదు, ఆ నాదము విన్న ఆయా రాక్షసుల భార్యలు గనక గర్భవతులై ఉంటే, వారి గర్భాలు విఛ్ఛిన్నమై పోయి పాతాళములో పడిపోతాయి.
.
సనాతన ధర్మములో చేసే పూజలలో శంఖ పూజ, శంఖనాదము చాలా ముఖ్యమైనవి.
ఇప్పటికీ కాశీ వంటి శివ క్షేత్రాల్లో , పూజలో అందరూ శంఖాన్ని పూరిస్తారు. జంగమ దేవరలు ఇంటింటికీ వచ్చి శంఖాన్ని పూరించేవారు. ఇప్పుడేదీ? శంఖాన్ని చూచిన వారు ఎందరు ? ఇంట్లో పెట్టుకున్నవారు ఎందరు ? పూజించేవారు, పూరించే వారు ఎందరు ?
.
శంఖ భయమనేది లేక పోవడముతో, ఇళ్ళలో శంఖ నాదాలు వినపడకపోవడముతో, , దానవ అంశతో , దానవ వాసనలు గల ఆత్మలు నిర్భీతిగా, నిరాటంకముగా మనుషులకు సంతానముగా పుడుతున్నాయి. అందుకే ఇటువంటి విపరీత ధోరణులున్న మానవులు పుట్టుకొస్తున్నారు.
శంఖములో నుంచిన నీరు దేవతలకు ప్రీతి పాత్రములు. శంఖనాదము దేవతలకు ఆహ్వానము వంటిది.  శంఖము ప్రతిధ్వనించు ప్రదేశమున శ్రీమహాలక్ష్మి సుస్థిరముగా ఉంటుంది. శంఖజలముతో స్నానము చేయువారు సర్వ తీర్థములలోను స్నానము చేసినట్లే. శంఖము ఉన్నచోట అమంగళములు ఉండవు.
.
శంఖములో పోసిన నీటికి అత్యంత ప్రాశస్త్యము కలదు. అది అతి పవిత్రమైనది. సర్వ దోషములను పోగొట్టగల జలమే, శంఖ జలము. అందుకే శంఖములో పోస్తే గానీ తీర్థము కాదు అన్నారు.

ఇక ఈ శంఖాలలో అనేక రకాలున్నాయి
వామావర్తము[ శంఖ మూలాన్ని పైనుండీ చూస్తే, ఎడమవైపున తెరచుకొని ఉండేది ], దక్షిణావర్తము [ కుడివైపున తెరచుకొని ఉండేది ] అని రెండు రకాలు. వీటిలో దక్షిణావర్తము ప్రశస్తమైనది అని చెపుతారు.
ఇవి కాక, నాలుగు వర్ణాల వారికీ నాలుగు రకాల శంఖాలు చెపుతారు.
.
కృష్ణుడి శంఖము పేరే పాంచజన్యము.
 అర్జునుడి శంఖము పేరు ’ దేవదత్తము ’
యుధిష్టిరుడి శంఖము పేరు ’ అనంత విజయము ’
భీముడి శంఖాన్ని ’ పౌండ్ర ’ అంటారు.
కుబేరుడికి ఉన్న నవ సంపదలలో  శంఖము కూడా ఒకటి.
.
శంఖాలు ఇంకా అనేక ఆకృతుల్లో సహజంగా ఏర్పడి ఉంటాయి. కొన్ని ’ గోముఖ ’ ఆకారంలో సహజంగా ఏర్పడి ఉంటాయి. ఇక్కడ ఇచ్చిన ’ గోముఖ శంఖము ’ బొమ్మ మాయింటిలోనిది. ఇందులో కూడా సముద్ర ఘోష వినిపిస్తుంది. దీనినే గణేశ శంఖము అని కూడా అంటారు. 

Saturday, June 1, 2019

సంతాన భాగ్యము- వేదవిహిత ఉపాయము

సంతాన భాగ్యము- వేదవిహిత ఉపాయము
-----------------------------------------------------



సంతానము లేక చాలా మంది దంపతులు అన్ని రకాల ప్రయత్నాలూ చేసి ఫలము దక్కక విసిగి వేసారి ఉంటారు. భౌతికంగా, లైంగికముగా , మానసికముగా వారిలో ఎట్టి లోపాలూ ఉండవు. అయినా సంతానము కలగదు. దానికి కారణము ఎవరూ చెప్పలేరు.

 అయితే వేదము మనకు ఆ కారణాన్ని తేటతెల్లము చేస్తుంది. 
నిజానికి ఇదేమీ కొత్తవిషయము కాదు. వేదోక్తమైన కర్మలను అనాదిగా ఆచరిస్తూ, సంతానాన్ని పొందినవారు అన్నికాలాల్లోనూ ఉన్నారు.
సంతానము కోసము యాగాలు చేయుట మనకు తెలిసినదే. దశరథుడి వంటివాడే పుత్రకామేష్టి యాగము చేసినాడని పురాణము చెబుతుంది. 
అయితే, సంతానము కోసము, యాగమే ఎందుకు చేయాలి ? ఇతర పద్దతులు లేవా ? 

ఈ ప్రశ్నకు సమాధానము కూడా వేదమే చెబుతుంది.

కృష్ణ యజుర్వేదములోని రెండవ కాండములోని , మొదటి ప్రశ్నలో ఈ విషయము దీర్ఘముగా చర్చించబడినది.

అసలు, సంతానము కలుగుటకు, కలగక పోవడానికి గల కారణాలు తెలిస్తే, మిగతావి సులభముగా అర్థము అవుతాయి..

మొదట తెలుసుకోవలసినది, సంతానానికి కారణము మన దేహములో చరించే వాయువు. ఈ వాయువే ఐదురకాలుగా పిలవబడుతుంది. వీటినే పంచప్రాణాలు అంటారు. దేహములో  వాయు సంచారమే ప్రాణము ఉండుటకు, లేకపోవుటకు కారణము. ఉఛ్చ్వాస నిశ్వాసాలు లేకపోతే ప్రాణము ఉంటుందా ? 

ఈ ఐదు ప్రాణాలలో, ప్రాణము, అపానము-- ఇవి రెండే సంతానానికి కారణము. 
మన ముఖమునుండీ బయటికి సంచరించే వాయువే ప్రాణము.
మన దేహములో ఉదరభాగములో లోలోపలే సంచరించు వాయువే అపానము. దీనినే నియుత్ అని వేదభాషలో అంటారు. 
ఈ ప్రాణము, అపానము ఒకదానినొకటి పొందినపుడు-- అనగా కలసినపుడు మాత్రమే , సంతానము కలిగే సాధ్యత ఉంటుంది. ప్రాణము , అపానము ఒకదానినొకటి కలియక, వేరువేరు అయిపోతే అప్పుడు ఆ మనుష్యుడికి సంతానము కలుగదు. 

కాబట్టి, ఎన్ని ప్రయత్నాలు చేసినా సంతానము కలుగక పోవుటకు, ఈ ప్రాణాపానాలు దూరమగుటయే  కారణము. 

మరి, వాటిని కలుపుట ఎలాగ ? 

దీనికి వాయువే మనకు సహకరించాలి. అనగా , వాయువు మనకు సహకరించుటకు తగ్గ ప్రయత్నాలు మనము చేయాలి. 
అది ఎలాగ అంటే, వాయువు అతివేగముగా సంచరించువాడు. అందుకే వాయువేగము... అంటుంటాము. వాయువు అతివేగముగా సంచరించినట్టే , అతివేగముగా ఫలము కూడా ఇస్తాడు. 
.
కాబట్టి వాయువు అనుగ్రహము పొందాలంటే మనము చేయవలసినది-- శ్వేతపశు యాగము. శ్వేత పశువు వాయువుకు ప్రియమైనది. 
అపానవాయువును ’ నియుత్ ’ అంటారని తెలుసుకున్నాము కదా , నియుత్ అంటే , వాయువు సంచరించే రథము ను లాగే గుర్రాలు. అంటే దేహములో ఏదో రథము పరుగెడుతూ ఉంటుంది అని అర్థము కాదు. వేదము ఏమి చెప్పినా నేరుగా చెప్పదు. ఒక చిహ్నారూపముగానో, సంజ్ఞా రూపముగానో చెబుతుంది. ఈ నియుత్ అనే వాయువు దేహములో తిరుగుతుంది కాబట్టి, వాయువును ’ నియుత్వంతుడు ’ అంటుంది వేదము. ఈ నియుత్వంతుడికి, శ్వేత పశువు అతి ప్రియమైనది.....అని కూడా వేదము చెబుతుంది. 
కాబట్టి, శ్వేతపశువు నుండీ వచ్చిన ద్రవ్యాలతో [ అనగా తెల్లటి పశువు-- అది గుర్రము, మేక, ఆవు, గొర్రె వీటిలో ఏదైనా కావచ్చు.. అయితే గోవుకున్నంత శ్రేష్ఠత్వము, ప్రాముఖ్యత వలన పంచగవ్యాలతో]  ఇట్టి యాగము చేయుట ఈ కలికాలములో రూఢియైనది .

ఈ  శ్వేత పశుయాగము చేయడము వలన , వాయువు, తన భాగము తనకు దొరకుట వలన తృప్తుడై, దేహములో ప్రాణాపానములను కలియునట్లు చేస్తాడు.  అప్పుడు సంతాన నిరోధకముగా ఉన్న దోషము తీరి, సంతానము కలుగుతుంది. 

_____________
ఇదే విధముగా దీర్ఘరోగుల శరీరములో కూడా ప్రాణాపానాలు కలియక, ఆ రోగి మరణించే అవకాశము ఉంటుంది. దీర్ఘ రోగులు ఈ శ్వేత పశుయాగము చేయడము వల్ల, వారుకూడా రోగము పోగొట్టుకొని ఆరోగ్యము పొందుతారు. 

ఇదేవిధముగా ధనప్రాప్తి కోసము కూడా ఈ యాగము చేస్తారు. 
అదే విధముగా, ప్రజల మీద అధికారము సంపాదించి నాయకుడు కాగోరినవారు కూడా ఇదే యాగాన్ని చేసి ఫలితాన్ని పొందవచ్చు.]

ఇప్పుడొక ముఖ్య ప్రశ్న 
--------------------------------
ఈ యాగము వలన అనేక ఫలితాలు కలుగుతాయి నిజమే, కానీ అందరికీ ఇది సాధ్యమా? 
అందరికీ సాధ్యము కాకపోవచ్చు. యాగమంటేనే ఖర్చుతో కూడినది. పైగా ఎన్నెన్నో వసతులు, సౌకర్యాలు ఉండాలి. అవిలేనివారు, ప్రతి దినమూ బ్రహ్మ యజ్ఞములో వేదములోని ఈ రెండవ కాండము, మొదటి ప్రశ్న లోని మొదటి అనువాకాన్ని [ వాయుర్వై క్షేపిష్ఠా దేవతా.... ] పారాయణము చేసినా అంతే ఫలితము ఉంటుంది. బ్రహ్మ యజ్ఞములో కాకపోయినా, మామూలుగా అయినా పారాయణ చేయవచ్చు. అది కూడా వీలుకాని వారు, వేదవిదుడైన బ్రాహ్మణుడితో తమ స్వగృహమునందు నలభై రోజులు ఈ పారాయణము చేయించవచ్చు. 
. వేదము ఉన్నది మానవుల అభ్యుదయము , క్షేమము కోసము మాత్రమే గనుక, వేదములో చెప్పబడిన ఈ విధానాన్ని పాటించి సత్ఫలితాలను పొందుదాము. 
*************************

|| జగదంబార్పణమస్తు || 
|| వేద నారాయణార్పణమస్తు || 

_____________________
దీనినే ఈనాటి శాస్త్రజ్ఞులు, వైద్యులు పరిశోధనలు చేస్తే, ఈ కారణాలను, పరిష్కారాన్ని ఇప్పటి పదజాలము ఉపయోగించి, సంతాన సాఫల్య కేంద్రాలలో కొత్తపేరు పెట్టి , యాగానికి ప్రత్యామ్నాయాలను కనుగొని అదే ఫలితము వచ్చునట్టుగా చేయగలరేమో.. 

Wednesday, May 1, 2019

కల్ప సూత్రములు -ఒక లఘు పరిచయము



కల్ప సూత్రములు -ఒక లఘు పరిచయము 
________________________________________

ఈ వ్యాసములో కల్ప సూత్రములు ఏవి అనునది చర్చించలేదు.
అసలు కల్ప సూత్రముల గురించి తెలియని వారికి, అవంటే ఏమిటి, వాటి పేర్లు, వాటిలోని భేదములు, వాటి ఉపయోగము--వంటి విషయాలు మాత్రమే ఇవ్వడము జరిగింది.
కల్పసూత్రములు అంటే ఏమిటో చాలా మందికి తెలియకున్నా, వాటిని దాదాపు అందరు హిందువులూ నిత్యజీవితములో ఆచరించి, ఉపయోగిస్తున్నారు. 
వేదములో ఉపయోగింపబడిన భాష వల్ల కానీ, అందులో వివరింపబడిన సంక్లిష్టమైన అనుష్ఠాన పద్దతుల వల్ల కానీ, వేదాలను చదివి అర్థము చేసుకొనుట దుస్సాధ్యము. దాదాపు అసంభవము. 
కానీ వేదాల ఉనికి మానవుల అభ్యుదయము కోసము మాత్రమే. అటువంటప్పుడు అర్థము కాకపోవుట వల్ల ప్రయోజనము లేదు. వేదాలు ఆ విధముగా సామాన్యులకు అందుబాటులో ఉండకపోవుటకు కారణము, కేవలము వాటి పరిరక్షణార్థము మాత్రమే. 
మరి వాటిని అర్థము చేసుకొనుట ఎలాగ అంటే , వాటి అంగాల వల్ల మాత్రమే. ఇవే వేదాంగాలు. 
దాదాపు వేదములు ఆవిర్భవించిన కాలము నుండే ఈ అంగాలు కూడా ఉన్నాయి. వీటివల్ల, వేదములయందున్న ధర్మ సూక్ష్మాలను, వాటి రహస్యాలను తెలుసుకొనుట, వాటిలోని  విషయములను అర్థము చేసుకొనుట, ఆచరించుట సులభము అవుతుంది.
ఆ వేదాంగాలు, 
శిక్ష, 
ఛందస్సు,
వ్యాకరణము,
నిరుక్తము, 
జ్యౌతిష్యము [ జ్యోతిష్యము కాదు ] ... జ్యౌతిష్యము అంటే ఖగోళ శాస్త్రానికి సంబంధించినది.
ఆఖరిది, ’ కల్పము ’.. ఈ ఆరింటినీ శాస్త్రములు అనికూడా అంటారు, వాటి  విషయ ఆధిక్యత వల్ల. 
ఆఖరిదైన ఈ కల్పమే మన అనుష్ఠాన, ఆచారములను వివరించేది. 

కల్పము అంటే ప్రయోగము అనవచ్చు కూడా. 
 ఇందులో నాలుగు శాఖలున్నాయి, శ్రౌత, గృహ్య, ధర్మ, మరియు శుల్బ సూత్రములు. ఇవన్నీ కలిపితే కల్పసూత్రములు అవుతాయి. 
ఇప్పుడు ఈ నాలుగింటి గురించీ క్లుప్తముగా తెలుసుకుందాము..
మొదటిది, 
****************
శ్రౌత సూత్రములు 
****************
శ్రౌత సూత్రములు ముఖ్యముగా వైదిక యజ్ఞ యాగాదుల గురించీ, వాటిని ఆచరించవలసిన పద్దతులు, వివరాలను వర్ణిస్తాయి. 
కొన్ని శ్రౌత సూత్రములను కిందివిధముగా వర్గీకరించవచ్చు.
యజమానుడు, ఋత్త్విక్కులు, వారి ధర్మములు, వారి కార్య కలాపములు
అగ్న్యాధేయము --అనగా, అరణులను రాపిడి చేసి అగ్నిని పుట్టించుట 
దర్శపూర్ణమాస యాగము, సోమయాగము, చాతుర్మాస్య బలులు, సత్రయాగములు వంటివాటి వర్ణన, వివరణ.
అగ్నిచయనము --అనగా, ఇటుకలను యాగవేదికలు చేయుటలో ఉపయోగించు పద్దతులు, విధములను వర్ణించుట.
వేదములోని అన్ని శాఖలలోను వాటికి సంబంధించిన శ్రౌత సూత్రములు ఉన్నాయి. 
వాటిని కింది విధములైన పేర్లతో తెలుసుకొనవచ్చును.

ఋగ్వేదము ; ఆశ్వలాయన శ్రౌత సూత్రములు, సాంఖ్యాయన శ్రౌత సూత్రములు.
శుక్ల యజుర్వేదము : కాత్యాయన శ్రౌత సూత్రములు.
కృష్ణ యజుర్వేదము : ఆపస్తంబ శ్రౌత సూత్రములు, బౌధాయన శ్రౌత సూత్రములు, భారద్వాజ శ్రౌత సూత్రములు, మానవ శ్రౌత సూత్రములు, మరియూ వైఖానస శ్రౌత సూత్రములు.
సామవేదము : ఆర్షేయ కల్పసూత్రములు [ లేక ] మశక కల్పసూత్రములలోని శ్రౌత సూత్రములు, ద్రాహ్యయణ శ్రౌత సూత్రములు, జైమినీయ శ్రౌత సూత్రములు, లాట్యాయన శ్రౌత సూత్రములు.
అథర్వ వేదము : వైతాన శ్రౌత సూత్రములు.
ఈ శ్రౌత సూత్రములు లేకున్నచో, అనేకములైన వైదిక యజ్ఞాలు చేయుట అసాధ్యము. 
*****************
గృహ్య సూత్రములు 
*****************
మనము గృహములలో ఆచరించతగిన, ఆచరించవలసిన సాంప్రదాయాలను , తంతులను --అనగా షోడశ సంస్కారములను , పాకయజ్ఞములను  వివరించేవి గృహ్య సూత్రాలు.. 
నాలుగు వేదశాఖలకు చెందిన గృహ్య సూత్రాల పేర్లు[ ఇప్పటికి తెలిసినవి ]
ఋగ్వేదము :  ఆశ్వలాయన గృహ్య సూత్రములు, సాంఖ్యాయన గృహ్య సూత్రములు
శుక్ల యజుర్వేదము : పారస్కర గృహ్య సూత్రములు
కృష్ణ యజుర్వేదము : ఆపస్తంబ గృహ్య సూత్రములు, బౌధాయన గృహ్య సూత్రములు,భారద్వాజ గృహ్య సూత్రములు.
సామవేదము : గోభిల గృహ్య సూత్రములు, జైమినీయ గృహ్య సూత్రములు, ఖాదిర గృహ్య సూత్రములు.
అథర్వ వేదము : కౌశిక గృహ్య సూత్రములు. 


*****************
ధర్మ సూత్రములు 
*****************
ధర్మ సూత్రములనే, " సామయాచారిక సూత్రములు " అని కూడా అంటారు. ఈ ధర్మ సూత్రములు ముఖ్యముగా ఆచారములు, వ్యవహారములు , మరియు వర్ణాశ్రమ ధర్మములను గురించి వివరిస్తాయి. 
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయమును గుర్తుంచుకొనుట అవసరము. ధర్మ సూత్రములు, గృహ్య సూత్రములు ఇంచుమించు కలగలసి ఉండి, రెంటికీ దగ్గర సంబంధము ఉండును. అందులోని సూత్రములు ఇందులోను, ఇందులోనివి అందులోను ఉండే అవకాశము ఉంది.  అయినా, వాటి ముఖ్య భేదము ఏమనగా, గృహ్య సూత్రములు పాకయజ్ఞములకు, సంస్కారములకూ పరిమితము కాగా, ధర్మ సూత్రములు వర్ణాశ్రమ ధర్మాలను ఎత్తి చూపుతాయి. 
ధర్మసూత్రములు కింది విధములుగా ఉంటాయి. 
ఋగ్వేదము : వాశిష్ట ధర్మ సూత్రములు.
శుక్ల యజుర్వేదము : శంఖ లిఖిత ధర్మ సూత్రములు.
కృష్ణ యజుర్వేదము : ఆపస్తంబ ధర్మ సూత్రములు, బౌధాయన ధర్మ సూత్రములు, హారీత ధర్మ సూత్రములు, హిరణ్యకేశి ధర్మ సూత్రములు, వైఖానస ధర్మ సూత్రములు, విష్ణు ధర్మ సూత్రములు.
సామవేదము : గౌతమ ధర్మ సూత్రములు
అథర్వ వేదమునకు ధర్మ సూత్రములు ఉన్నవీ లేనిదీ తెలియదు. ఒకవేళ ఉంటే , వాటిపేర్లు తెలియవు. 

******************
శుల్బ సూత్రములు  
 ******************
శుల్బము అనగా, కొలతలు కొలుచుటకు ఉపయోగించు దారము , లేక తాడు. 
యజ్ఞ వేదికలు, యాగవాటికలు, యాగ శాలలు నిర్మించుటకు పాటించవలసిన కొలతలను ఈ శుల్బ సూత్రములు వివరిస్తాయి. 
శుల్బ సూత్రములను అధ్యయనము చేసి పరిశీలిస్తే , వేదకాలములోనే రేఖాగణితము యొక్క అద్భుత జ్ఞానము మన ప్రాచీన ఋషులు అందించినది చూసి ఆశ్చర్యపోక తప్పదు. ఆయా కొలతలు, ఆకారములు చూస్తే అబ్బురముతో నిశ్చేష్టులము కాక తప్పదు. 
ప్రస్తుతము మనకు ఏడు శుల్బ సూత్రములు లభ్యముగా ఉన్నవి.  అవి కూడా శ్రౌత సూత్రాలకు చాలా సన్నిహితముగా సంబంధించి ఉన్నాయి.  అవి, 
ఆపస్తంబ శుల్బ సూత్రములు, 
బౌధాయన శుల్బ సూత్రములు ,
కాత్యాయన శుల్బ సూత్రములు ,
మైత్రాయణ శుల్బ సూత్రములు ,
మానవ శుల్బ సూత్రములు ,
వాధూల శుల్బ సూత్రములు ,
వరాహ శుల్బ సూత్రములు 
*****************
 ఈ కల్ప సూత్రములన్నీ కూడా , వేదాంతములైన ఉపనిషత్కాలానికి తరువాత ఉనికిలోనికి వచ్చినాయి. 
___________________
బ్రహ్మ సూత్రములు
___________________
 సూత్రముల గురించి విన్నపుడు, చదివినపుడు, సహజముగా గుర్తొచ్చేది " బ్రహ్మ సూత్రములు " అనే పేరు. కల్ప సూత్రములకు , బ్రహ్మ సూత్రములకు ఎట్టి సంబంధమూ లేదు. వీటిలో కల్ప సూత్రములు ప్రాచీనమైనవి, బ్రహ్మ సూత్రములు అర్వాచీనమైనవి. 
బ్రహ్మ సూత్రముల గురించిన లఘు పరిచయము మరొకసారి. 

|| శుభం భూయాత్ ||

  సర్వం జగదంబార్పణమస్తు.. 

Wednesday, April 3, 2019

ఆన్ లైన్ సంస్కృత భాషా బోధన-రిజిస్ట్రేషన్ ఫారం




మిత్రులకు, ఇది చదివిన వారు అందరికీ ఒక సూచన.
" మిత్ర పరిషత్ తరఫున ఆన్ లైన్ సంస్కృత భాషా బోధన విషయము మీకు తెలిసినదే. ఈ ఆన్ లైన్ క్లాసులో చేరదలచుకున్నవారికి వారి మెయిల్ ఐడీ లకు ఒక రిజిస్ట్రేషన్ ఫారం పంపాము. కారణాంతరాలవల్ల ఎవరికైనా రాకున్నచో, కింది లింకులో నుండీ డౌన్ లోడ్ చేసుకొని, పూర్తి చేసి, అందులో ఉన్న మెయిల్ ఐడీ కి పంపగలరు. 
ఈ ఫారం ’ ఎడిటబుల్ పీడీఎఫ్ ’ ఫార్మాట్ లో ఉంది. అందులో అడిగిన మీ వివరాలు అందులోనే నింపవచ్చు. నింపి సేవ్ చేయవచ్చు. 
నింపిన ఫారాన్ని పంపండి.
ధన్యవాదాలు. ఇది అందరికీ షేర్ చేయవచ్చు.
Pl. send filled in forms to: mitraparishat@gmail.com

https://drive.google.com/file/d/199f5F3VsHrAy5kfMz8wKNFXTnIO7WpmV/view?usp=sharing




Wednesday, March 6, 2019

సంస్కృత భాషా బోధన -అధ్యాపకులు

సంస్కృత భాషా బోధన -అధ్యాపకులు 

అందరికీ నమస్కారము 
సంస్కృత భాషా బోధన గురించి నిన్న మేము పెట్టిన టపా కు అనూహ్య స్పందన లభిస్తున్నది. సంస్కృతము దేవభాష. దీనిని మృతభాషగా మార్చాలని ఎందరెందరో చేసిన ప్రయత్నాలకు గొడ్డెలిపెట్టుగా మీ స్పందన ఒక్కటీ చాలు. అనేక కృతజ్ఞతలు.

ఇక విషయానికి వస్తే,  మాకు టపా పంపిన వారందరూ విద్యార్థులే...సంస్కృతము నేర్చుకోవాలన్న ఆసక్తి చూపినవారే. 
అధ్యాపకుల నుండీ ఇంకా స్పందన రావలసి ఉంది. సంస్కృత భాషను నేర్చి, ఇతరులకు నేర్పించగల ప్రతిభ గల అధ్యాపకులకు ఇదే అవకాశము. మా  విన్నపము ఆలించండి. 
మీ సుముఖతను తెలియజేస్తూ స్పందించండి. సనాతన ధర్మ రక్షణలో పాలు పంచుకోండి. 
ఇది ఉచిత సేవ కాదు. మీరు చేయబోయే సేవకు తగిన పారితోషికము ఉంటుంది కాబట్టి, ఇది ఉభయతారకమైన మార్గము అని మేము చేపట్టడము జరిగింది. 
ఎలా నేర్పాలి, పాఠ్యాంశాలు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు వంటి వాటి గురించి మీరు చింతించవద్దు. తలపెట్టినది దైవకార్యము. ఆ దైవమే చూసుకుంటాడు. మన పని కేవలము మానవ ప్రయత్నము. 
కాబట్టి మరొక్కసారి ప్రార్థిస్తున్నాము, సంస్కృత అధ్యాపకులు ముందుకు రండి.

సనాతన ధర్మానికి జయము కలుగుగాక
ధన్యవాదం