SHARE

Friday, December 26, 2025

" గయ " క్షేత్రము

 


" గయ " క్షేత్రము

గయా క్షేత్రము హిందువులకు అత్యంత పవిత్రమైన క్షేత్రము. ఇతర క్షేత్రాల్లో కేవలము దేవతలకు, దైవారాధనకు, అనుష్ఠానాలకు మాత్రమే ప్రాధాన్యత.

పితృదేవతలు, దేవతలకు కూడా పూజనీయులు. అటువంటి పితరుల ఆరాధన జరిగే క్షేత్రాలలో అతి ముఖ్యమూ, ప్రాచీనమూ అయినది గయ.

బీహారు రాష్ట్రం లోని " ఫల్గు " నదీతీరములో ఉంది గయ. గయ లోని ముఖ్యమైన యాత్రా కేంద్రాన్ని " బ్రహ్మగయ " అంటారు.

కాశీలో దండము, ప్రయాగలో ముండనము, గయలో పిండము
అని ప్రతీతి. గయకు వచ్చేవారు దాదాపు అందరూ తమ పితరులకు పిండ ప్రదానము చేయుటకే వస్తారు. గయలో పిండప్రదానము చేస్తే తమ పితరులకుమోక్షము నిశ్చయము--అని పురాణాల ఆధారంగా విశ్వసింపబడుతున్నది.


|| జీవతోర్వాక్య కరణాత్ ప్రత్యబ్దం భూరి భోజనాత్ |
గయాయాం పిండదానాశ్చ తస్మాత్ పుత్రస్య పుత్రతా ||

తా|| తల్లిదండ్రులు బ్రతికి ఉన్నంత వరకూ వారి మాటప్రకారమే నడచుకోవలెను . వారు మరణించిన తర్వాత ప్రతి సంవత్సరమూ, వారి మృతతిథి నాడు శ్రాద్ధం ఆచరించి భూరి భోజనాలు చేయించవలెను. మరియూ గయ లో వారి గురించి పిండ ప్రదానము చేయించవలెను. ఈ మూడు తప్పకుండా ఎవరు చేస్తారో, అతడే పుత్రుడు.

గయా శ్రాద్ధము పుత్రుడి అత్యంత ఆవశ్యకమైన కర్తవ్యాల్లో ఒకటి .
|| ఏష్టవ్యా బహవః పుత్రాః అపి కశ్చిత్ గయాం వ్రజేత్ ||

" తమ అనేక పుత్రులలో ఒక్కడైనా గయ కు వెళ్ళి తమ కు శ్రాద్ధం చేస్తాడా " అనే ఆశతోనే తల్లిదండ్రులు బహు పుత్రులను అపేక్షించేది.

|| గయాభిగమనం కర్తుం యః శక్తో~పి న గఛ్ఛతి|

శోచంతి పితరస్తస్య వృథా చాస్య పరిశ్రమః ||

గయకు వెళ్ళగలిగే సామర్థ్యం ఉన్నాకూడా అక్కడికి పోకుండా ఉన్న పుత్రుని పుట్టుక వ్యర్థమైనది. అటువంటి పుత్రుడి గురించి పితరులు శోకిస్తారు.

|| ఆత్మజోహ్యన్యజో వాపి గయాకూపే యదా తదా |

యన్నామ్నా పాతయే పిండం తం నయేద్బ్రహ్మ శాశ్వతం ||

తన పుత్రుడు కానీ, ఇంకొకరి పుత్రుడు కానీ, ఎవరైనా సరే, గయాకూపములో తన పేరుమీద పిండప్రదానము చేస్తే శాశ్వతమైన బ్రహ్మప్రాప్తియగును.

|| శ్రాద్ధ భూమిం గయాంధ్యాత్వా , ధ్యాత్వా దేవం గదాధరం ||

అంటే, ఎప్పుడు ఎక్కడ పితృకర్మలు చేసినా, గయా క్షేత్రాన్ని, ఆ క్షేత్రపు అధిష్ఠాన దేవత అయిన గదాధరుని స్మరణ చేయవలెను.
అందుకే ప్రతి శ్రాద్ధం లోనూ, " విష్ణుర్విష్ణుర్విష్ణుః " అనీ, " గయ గయ గయ " అనీ పలికిస్తారు.

గయలో ముఖ్య ఆకర్షణ, దాదాపు పదహారు అంగుళాల పొడవున్న " విష్ణుపాదము " . ఈ విష్ణుపాదము 1.5 గజాల వ్యాసము ఉన్న అష్టభుజి లో పదహారు అంగుళాల పొడవు, ఆరు అంగుళాల ఎత్తు ఆ దేవాలయము చుట్టూ ఇతర పవిత్ర స్థానాలు ఉన్నాయి. వీటన్నిటినీ రాణీ అహల్యాబాయి హోల్కర్ 1787 లో కట్టించారు. ఈ ఆలయాన్ని తప్పక దర్శించాలి.

" స్థల పురాణము " :-

గయ కు ఆ పేరు ఎలా వచ్చింది?

పురాణ కాలంలో " గయుడు " అనే రాక్షసుడు ఉండేవాడు. అయితే, అతడు గొప్ప విష్ణు భక్తుడు.
విష్ణువు గురించి కఠోర తపస్సు చేసి, విష్ణువు అనుగ్రహాన్ని పొంది, ఒక వరము కూడా పొందినాడు. అదేమంటే, " ఎవరు అతణ్ణి ముట్టుకున్నా, వారు స్వర్గానికి పోవాలి " అని. విష్ణువు నుండీ ఆ వరము పొందినాడు అని తెలియగానే జనాలు తండోపతమ్డాలుగా వచ్చి అతణ్ణి ముట్టుకునేవారు. దానితో, చనిపోయిన ప్రతిఒకరూ స్వర్గానికే వెళ్ళడం వలన రానురాను నరకము ఖాళీ అయిపోయింది. యముడి కోరిక మేరకు, ఆ పరిస్థితిని తప్పించుటకు, విష్ణువు, బ్రహ్మదేవునికి ఒక సూచన ఇచ్చినాడు. ఆ సూచన ప్రకారము, బ్రహ్మ దేవుడు, గయుడి శరీరము మీద ఒక వైదిక క్రతువును చేయాలి. దానికి గయుణ్ణి కూడా ఒప్పించినారు. క్రతువు మొదలైంది. అలా క్రతువు సాగుతుండగా, గయుడి తల విపరీతంగా కంపించుట మొదలైంది. దానితో క్రతువు భంగమయ్యే పరిస్థితి వచ్చింది. గయుడి తల కంపించకుండా ఉండేందుకు, యమలోకము నుండీ " ధర్మశిల " నొకదానిని తెచ్చి గయుడి తలపైన ఉంచినారు. అయినా తల కంపించుట ఆగలేదు. దానితో, విష్ణువు తన గదతో పాటూ గయుడి తలపైన నిలుచున్నాడు. దేవతలందరూ వచ్చి గయుడి తలపైన నిలుచున్నారు. అప్పుడు గయుడి తల కంపించుట ఆగిపోయింది. క్రతువు సంపన్నమయింది.

అప్పుడు గయుడు విష్ణువును ప్రార్థించాడు, " దేవతలందరూ, నీతోపాటు నా తలపైన శాశ్వతంగా నెలకొని ఉండాలి" అని. విష్ణువు ఆ వరాన్ని కూడా ఇచ్చాడు. దాని ఫలితంగా, గయుడి శరీరము ఎక్కడైతే విష్ణ్వైక్యము చెందిందో, అది ఒక అత్యంత పవిత్ర స్థలముగా మారింది. అదే నేటి " గయ "

గయా క్షేత్ర దర్శనానికి ఉపక్రమించే ముందు, యాత్రీకులు తమ ఊరిని ఒకసారి ప్రదక్షిణ చేయవలెను. చేసి, ఒక శ్రాద్ధాన్ని ఆచరించవలెను. దాని వలన ఆ యాత్రీకుల పితరులు జాగరూకులై, శ్రాద్ధాదులు స్వీకరించడానికి గయకు వస్తారు.

అక్కడ చూడవలసినవి, చేయవలసినవి

విష్ణుపాద ఆలయము తర్వాత,

* రామశిలా పర్వతము : శ్రీరాముడు పిండప్రదానము చేసిన స్థానముగా చెప్పబడుతున్నది ఈ రామశిలా పర్వతము అనే చోటు. కొండపైకి దరిదాపు మూడు వందల యాభై మెట్లు ఎక్కితే రామాలయం దర్శించవచ్చు. దాని పక్కనే " సీతా కుండము " ఉంది

* ప్రేతశిల [ భూతాల పర్వతము ] : గయ నుండి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరములో యముడి ఆలయం ఉంది. అక్కడ కూడా పిండ ప్రదానాలు చేస్తారు.

* అక్షయ వట వృక్షము : ఇది ఏనాటిదో... కృతయుగము నుండీ ఉందని చెప్పబడే అక్షయ వట వృక్షము [ మర్రి చెట్టు ] వేళ్ళూని, ఇప్పటికీ సజీవముగా అనేక పక్షులు, కోతులు, ఇతర చిన్న జంతువులకు ఆలవాలమై ఉన్న ఈ వట వృక్షము దగ్గర కూడా అంత్యేష్టులు జరుపుతారు. ఇది విష్ణుపాద ఆలయం పక్కనే ఉంది. అయితే ఇది అప్పటి ప్రాచీన వృక్షము కాదనీ, తరతరాలుగా ఆ ప్రాచీన వృక్షపు బీజములు, కొమ్మల నుండీ మరలా చెట్టును మొలకెత్తించడము చేస్తున్నారనీ, ఇప్పుడున్న వృక్షము 1876 లో నాటినదనీ కొందరి వాదము.

* : మంగళగౌరీ శక్తి పీఠము : గయ లోనే అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన మంగళ గౌరీ శక్తి పీఠము ఉంది. అమ్మవారి స్తనాలు ఇక్కడ పడినాయని ప్రతీతి.

* : బ్రహ్మ సరోవరము, సూర్య కుండము : ఇవి పుష్కరిణి వంటివి, పవిత్ర స్నానాలు చేసే చోట్లు. పితృ పక్షాలలో సూర్య కుండము భక్తులచే క్రిక్కిరిసి ఉంటుంది

* : బుద్ధ గయ " తొమ్మిది కిలో మీటర్ల దూరములో, మహాబోధి ఆలయము, బోధి వృక్షము ఉన్నాయి. హిందువులకు, బౌద్ధులకు ఇది పవిత్ర యాత్రా స్థలము. సిద్ధార్థుడు ’ బుద్ధుడు ’ గా మారిన ప్రదేశము.

చేయవలసినవి :

విష్ణు పాదము, రామశిల, ప్రేతశిల, అక్షయ వట వృక్షము లవద్ద పిండదానము చేయవచ్చును.

ఫల్గు నదిలో [ జలాలు ఉన్నపుడు మాత్రమే ] మరియు సూర్య కుండములలో పవిత్ర స్నానాలు, అలాగే అక్కడ నీరు తక్కువ ఉన్నా కూడా, చిన్న చెలమ[ చేతితో గొయ్యి తవ్వి ] చేసి వచ్చిన నీటితో పితరులకు శ్రాద్ధము, తర్పణాలూ చేయాలి.

అక్టోబర్ నుండి మార్చి వరకూ పితృపక్ష మేళా జరుగుతుంది. అప్పుడు సామూహిక క్రతువులు చేయిస్తారు

దర్శనీయ స్థలాలకు వేకువనే లేచి స్నానాలు చేసి వెళ్ళడము మంచిది, రద్దీని తప్పించుకోవడానికి/

విష్ణుపాద ఆలయ ప్రదక్షిణ చేయడము మరవకండి. ఆ ప్రదక్షిణ చేస్తేనే యాత్ర సిద్ధిస్తుంది అని నమ్మకము

తేలికగా ఆరిపోయే దుస్తులు, చిన్న తువ్వాలు, అనుష్టానాలకు పంచపాత్ర వంటివి ఉంచుకోండి. అక్కడ ఇస్తారు గానీ అవి మనకు సౌకర్యం కాదు. ఒకోసారి ఆకులే గరిటలుగా[ దర్వి ] హోమాలు చేయిస్తారు.

ఒక ముఖ్య ప్రశ్న :

గయలో తమకు ఇష్టమైన వాటిని త్యజించాలి అని ప్రతీతి ఉన్నందున అప్పడి పూజారులు, శ్రాద్ధం చేయించాక, మనకు ఇష్టమైన కాయ/ ఫలాన్ని అక్కడ వదిలిస్తారు. దీనికి అనేక అర్థాలు, విశ్లేషణలు ఉన్నాయి. వాటిని చర్చించుట లేదు, అయితే దీనికి అనుబంధముగా, " గయలో ఒకసారి శ్రాద్ధం చేశాక పితరులకు మోక్షము తథ్యము కదా, అలాంటప్పుడు తర్వాత వచ్చే ప్రతి సంవత్సరమూ శ్రాద్ధాలు చేయనవసరము లేదు కదా ?" అని అనేకులు ధర్మ సందేహము వ్యక్తము చేస్తుంటారు.

గయలో పితరులకు ఒక సారి శ్రాద్ధము చేస్తే వారికి మోక్షము కలుగుతుంది, ఇది నిశ్చయము. అయితే వారికి శ్రాద్ధాలు మానాలి అని ఎక్కడా లేదు. శ్రాద్ధాలు చేయవలసినదే, ఎందుకంటే అది పితరులకోసము కాదు, మనకోసము, శ్రాద్ధాలు చేయుట వలన పితరులు వచ్చి మనలను అనుగ్రహించి ఆశీర్వదిస్తారు. ఇతర దేవతలను ప్రసన్నము చేసుకొనుట కన్నా, మన పితరులను ప్రసన్నులను చేసుకొనుట సులభ సాధ్యము. దానివల్ల ఎంతో శ్రేయస్సు కలుగుతుంది.

ఇంకో అతి ముఖ్యమైన విశేషము :- గయలో అక్కడి పూజారులు --వీరిని " గయా పాల్ పండిట్ " అంటారు. , వారు చేసిన చేస్తున్న అతి గొప్ప కార్యము ఏమంటే, శతాబ్దాలుగా ఎవరైతే గయ కు వచ్చి తమ పితరులకు పిండదానాలు చేస్తారో, వారి వంశ వివరాలు--అంటే, పేరు, గోత్రము, ఊరు, వచ్చిన తేదీ, ఇలాంటివన్నీ చేతితో వ్రాసి ఒక సంగ్రహాలయము వంటిది నిర్వహిస్తున్నారు. ఆ వివరాలు వ్రాయుటకు భూర్జ పత్రాలు, రాగి రేకులు వాడేవారు. ఆ వివరాలు ఎంత అధికారికంగా ఉంటాయంటే, కొన్ని సార్లు కోర్టులు కూడా వంశ వృక్షాలను నిర్ణయించుటలో వాటి మీద ఆధారపడేవి. వాటిని * అకారాది క్రమంలో ఊర్ల పేర్లు * వచ్చినవారి సంతకాలు వచ్చినవారి ఉద్యోగము, చిరునామా వంటివి మూడు అంచెలుగా వ్రాసేవారు. ఏ ఒక్కటి దొరికినా వివరాలు తెలుసుకోవచ్చని. అక్కడి పండిట్లు ఆ గ్రంధాలను అతి జాగ్రత్తగా , ఒక ఖజానాను కాపాడినట్టు కాపాడుతుంటారు. వాటిని వర్షకాలం ముందర బాగా ఆరబెట్టి, ఒక ఎర్రటి వస్త్రములో చుట్టి పెడతారు. ఇది ఈనాటి " డిజిటల్ డేటా బేస్ " కన్నా ఎంతో భద్రమైనది, క్షేమమైనది, అధికారికమైనది. అక్కడికి వెళ్ళినవారు తమ వివరాలు ఇస్తే, వారి పూర్వజులు ఎవరెవరు, ఎప్పుడెపుడు వచ్చి పిండదానాలు చేసారో చెప్పగలుగుతారు. అక్కడికి వెళితే, విష్ణుపాద ఆలయము కార్యాలయము లో గానీ అక్కడి పూజారుల కుటుంబీకులను గానీ వినయంగా అర్థిస్తే వారు వచ్చినవారి వాలకాన్ని బట్టి సహాయం చేయవచ్చు. అక్కడికి ఎందరో కేవలం కుతూహలంతో వెళ్ళి అడుగుతుంటారు. వాఇకి సరైన వివరాలు ఇవ్వాలి. వీలైతే వంశ వృక్షపు ఆధారాలు చూపాలి. వారికి అంతో ఇంతో దక్షిణగా ఇస్తే పని త్వరగా అవుతుంది. వారు చెప్పినవిధంగా చేస్తే పని సానుకూలం అవుతుంది. ఈ విషయము కేవలము నేను విన్నదీ, చదివినిదీ మాత్రమే. అక్కడికి వెళ్ళినపుడు సమయాభావము చేత చూడలేకపోయాను. కాబట్టి ఎవరైనా వెళ్ళి వాటిని సంపాదిస్తే వివరాలు పంచుకోగలరు.



// శుభం భూయాత్ //





4 comments:

  1. Not seen any posts from you from last few weeks on Facebook. Hope all is well with you andi.. gurubhyonamaha...

    ReplyDelete
    Replies
    1. I am fine Thank you, My FB account was suspended for no reason. Came up with another account" Janardhan Bhaskara " pl send a request if not there already

      Delete
  2. Hope you are doing well . You FB profile is inactive.. cant see your posts. Hope all is well

    ReplyDelete
    Replies
    1. I am fine Thank you, My FB account was suspended for no reason. Came up with another account" Janardhan Bhaskara " pl send a request if not there already

      Delete