SHARE

Tuesday, December 15, 2015

సనాతన ధర్మపు రహస్యము--- మొదటి భాగము

సనాతన ధర్మపు రహస్యము--- మొదటి భాగము



అనేక సార్లు , " సనాతన ధర్మము ఎటు పోతున్నది ? రోజురోజుకూ మన ధర్మాన్ని కించపరుస్తూ తూలనాడేవాళ్ళే ఎక్కువవుతున్నారు.. మిగిలిన మతాలన్నిటికీ మార్గదర్శనము నిచ్చిన సనాతన ధర్మమును ఎందుకు ఇతరులు ద్వేషిస్తున్నారు ? ఇతరుల మాట అలా ఉంచితే , మనవారే ఎందుకు మన గొప్పదనాన్ని అర్థము చేసుకొనుట లేదు ? ఎవరికి ఇష్టము వచ్చినట్లు వారెందుకు వ్యాఖ్యానిస్తున్నారు ? అపౌరుషేయమైన వేదములే పునాదిగా గల మన ధర్మానికి గ్లాని కలుగుతుంటే మూఢుల వాదనలను  , వక్రభాష్యాలనూ తిప్పికొట్టి కనువిప్పు కల్గించే వారే లేరా ? సనాతన ధర్మపు గొప్పతనము తెలిసిననూ , దానిని అందరికీ సరిగ్గా వివరించలేక ఇంకా అయోమయానికి గురి చేస్తున్న నేటి కొందరు గురువులకు మార్గదర్శనమే లేదా ?  పీఠాధిపతుల మొదటి కర్తవ్యము ఇట్టి సందేహ నివృత్తి చేసి అందరికీ ఒక విశ్వాసాన్నీ , ధైర్యాన్నీ , ప్రశాంతతనూ కలిగించుట కాదా ? వారెందుకు మాట్లాడరు ? ఇతర మతస్థుల ఉన్మాదపు వాదనలకు దీటైన సమాధానము నెందుకు ఇవ్వకున్నారు....
అన్న ఆలోచనలు మొన్నటిదాకా నన్ను తొలిచేవి...

అటువంటి ఆలోచన అహంకార పూరితమైనదనీ , నాకు కలిగిన ఈ సందేహాలు , వాటికి సమాధానాలూ  మన జగద్గురువులకు తెలియనివి కావనీ , అందరికన్నా ముందే వారు ఇట్టి విషయాలపై దృష్టి సారించడమే గాక , తగు వివరణా , ఉపదేశమూ , హితబోధా చేసినారనీ , అది తెలుసుకోకపోవడము నా మూర్ఖత్వమేననీ సమయము వస్తేనే గానీ ఏదీ మన కళ్ళకు కనపడదనీ ఈ మధ్యే బోధ అయినది...
అప్పటి జగద్గురువులు శ్రీ చంద్రశేఖర భారతీ స్వాముల వారు ఇటువంటి అనేక విషయములపై , స్పష్టముగా , తార్కికముగా , మానవాళి శ్రేయస్సు కోసము ఎంతో విలువైన సమాచారమును ఇచ్చి ఉన్నారు.
ఒకానొక కన్నడ బ్లాగులో నాకు సమాధానాలు దొరికినాయి..ముఖ్యముగా " మతమార్పిడులను " గురించిన వివరణ నన్ను అప్రతిభుడిని చేసింది.. అక్కడ నేను చదివినది మీ , మన అందరి సౌలభ్యము కోసము అనువదించి ఇస్తున్నాను.

1925-27  మధ్య రెండు సంవత్సరముల కాలము శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామివారు తమిళనాడులోని వివిధ ప్రదేశాలలో సంచారము చేసినపుడు అక్కడి అనేక జిజ్ఞాసువులు - భక్తులూ స్వామీజీ వారిని సందర్శించి , తమ తమ సందేహాలను నివృత్తి చేసుకొనే వారు. ఆ సమయములో స్వామివారితోపాటూ ఉన్న కృష్ణ స్వామి అయ్యర్ అనువారు , అక్కడ జరిగిన సంభాషణలను రాసుకొని ఆంగ్లములో ,." From the master's lips "  అను పేరుతో 1930  లో ప్రచురించినారు.. ఆ తరువాత   " Dialogues with the Guru "  అను పేరుతో ముంబైలో పునర్ముద్రితమైనదని , ఇప్పుడు ఆ పుస్తకాలు దొరకుట లేదనీ ఆ బ్లాగరు రాసినారు. ఆ పుస్తకములో పన్నెండు అధ్యాయాలున్నాయట. వాటిలో మొదటి అధ్యాయము / మొదటి సంభాషణ జిజ్ఞాసువులకు అనుకూలము కాగలదను సంకల్పముతో ఆ బ్లాగరు కన్నడ భాషకు అనువదించినారు. దానినే నేను తెలుగులోకి అనువదిస్తున్నాను.

శ్రీ చంద్రశేఖర భారతీ స్వాములు కేవలము ఒక పీఠాధిపతి మాత్రమే కాదు , ఆ పీఠమును అధిరోహించినారు అన్న కారణము చేత మాత్రమే కాదు , శాస్త్రాధ్యయనము , తపస్సు మొదలగు అనేక కారణముల వలన విశిష్టముగా గుర్తింపబడినవారు. కాబట్టి వారి మాటలకు ఎంతో మహత్త్వము ఉన్నది. కన్నడలో " శారదా పీఠద మాణిక్య " అను పుస్తకములో వారి వ్యక్తిత్వపు వైశిష్ట్యత గురించి విపులముగా నున్నదట ..

రెండో భాగములో వారి ఉపదేశము , ప్రవచనమూ చదవగలరు... పైన పేర్కొన్న పుస్తకాలు ఎవరివద్దనైనా ఉంటే దయచేసి తెలియజేయ గలరు ..


నేను చూసిన ఆ కన్నడ బ్లాగు ఇదీ...
http://herige.blogspot.in/2014/07/blog-post_6.html


1 comment:

  1. శ్రీ మల్లేశ్వరరావు గారికి నమస్సులు. మీ వ్యాఖ్య వలన మీకు ఈ బ్లాగులోని విషయములు నచ్చినవని తెలుస్తున్నది.. చాలా సంతోషము.. పుస్తకాన్ని కనుక్కున్నందుకు అభినందనలు. నా మెయిల్ ఐడీ ఇస్తున్నాను... దయచేసి ఆ పుస్తకాన్ని పంపగలరు. అనేక ధన్యవాదములు

    janardhan36@gmail.com

    ReplyDelete