SHARE

Thursday, September 27, 2012

జీవిత చుక్కాని -ఉపోద్ఘాతము


            జీవిత చుక్కాని -ఉపోద్ఘాతము 

       అంతరిక్షం లో ఒక అపారమైన తేజో రాశి మిరుమిట్లు గొలుపుతోంది. ఆ తేజో రాశి చిన్న చిన్న దీపాల వంటి కాంతి పుంజాల సమూహము. దూరం నించీ చూస్తే ఒకే రాశి లాగా కనిపిస్తోంది. ఆ దీప పుంజాలు కొన్ని వేలు ఉంటాయి. ఎంతో ఆసక్తిగా , ప్రతీక్షిస్తున్నాయి. అది తరచుగా జరిగే సమావేశమే అయినా ప్రతిసారీ ఆ సమూహములో కొత్త కొత్త కాంతి పుంజాలు పాల్గొంటాయి. 

     పరమాత్మ సన్నిధిలో జరిగే ఆ సమావేశము ఎంతో అద్భుతమైనది. ఎప్పుడెప్పుడా అని ఉత్సాహముతో , ఒక నూతన ఉత్తేజముతో , అన్ని దీపాలూ ఎదురుచూస్తున్నాయి. ఆ దీప పుంజాలని మన సౌకర్యము కోసము " ఆత్మలు " అని పిలుద్దామా ? ఆ ఆత్మలు తమ తమ కర్మల ఫలితాన్ని అనుభవించడానికి ఆత్రం గా ఎదురుచూస్తున్నాయి. 

     తమ కర్తవ్యాలను అప్పటికే తెలుసుకున్నాయి , ఇక మిగిలింది, ఆ భూమి పైన జన్మ తీసుకోవడమే ! 

అక్కడే  పేచీ వచ్చింది. 

     అన్ని వేల ఆత్మలలో ఎక్కువ శాతము తమ భావి తల్లి దండ్రులని తామే ఎంపిక చేసుకున్నాయి కూడా !

అయితే , ఆ పరమాత్ముని అంతిమ నిర్ణయము కోసము వేచి ఉన్నాయి. 

     విచిత్రంగా , ఎన్నో వేల ఆత్మలు తమ రాబోయే జన్మలో ఒకే కుటుంబములో జన్మించడానికి ఉత్సుకత చూపుతున్నాయి. 

     ఆ రోజు భూమిపై ఏకాదశి. భూమి పైన ఏ తిథి ఉంటుందో,  ఆ తిథి సూచించే  సంఖ్యని బట్టి అంతమంది మాత్రమే ఒకే కుటుంబములో జన్మించడానికి అనుమతి ఉంటుంది. అయితే ప్రతిసారీ అంతమందీ తప్పనిసరిగా ఒకే కుటుంబాన్ని ఎంచుకోవాలని లేదు. ఆ సంఖ్య , ఆ కుటుంబములో జన్మించదలచిన ఆత్మల యొక్క గరిష్ట పరిమితి మాత్రమే. అంతకు తక్కువగానో , ఒక్కరుకూడా లేకుండా కూడా ఉండవచ్చు.

     అన్ని వేల ఆత్మలలో పదకొండు మందిని ఎంపిక చేయడము ఆ పరమాత్మునికి కూడా కష్టముగానే ఉంది. 

     వారి వారి భూతకాల , గత జన్మల  కర్మల ఫలితాన్ని ఎంతో కూలంకషంగా పరిశీలించిన మీదట కూడా పదకొండు మందిని ఎంపిక చేయడము కష్టముగా ఉంది. ఎందుకంటే, అన్ని వేల ఆత్మలలో చాలావరకు అందరూ ఆ కుటుంబములో జన్మించడానికి అర్హులే. 

పరమాత్మ ఒక పరీక్ష పెట్టాడు. 

" రాబోయే జన్మలో మొదటి భాగము దరిద్రముతో , కష్టాలతో బాధ పడడానికి ఎందరు సిద్ధం గా ఉన్నారు ? " 

దానికి అన్ని ఆత్మలూ ఒప్పుకున్నాయి . 

" రెండవ భాగములో కష్టాలు ఎవరు అనుభవించడానికి సిద్ధం గా ఉన్నారు ? " 

మళ్ళీ అన్ని ఆత్మలూ ఒప్పుకున్నాయి . 

ఇక ఆ పరమాత్మునికి కూడా కర్తవ్యం తోచలేదు. 

     వేరే కుటుంబములో జన్మ నిర్ణయమైన వారిలో ఒకరు అన్నారు ," ఇక పాచికలు వేసి ఎంపిక చేయడమే మార్గము "
     పరమాత్మునికి అదే సరియైనదిగా తోచింది. అటువంటి పరిస్థితిని ఎన్నో వేల సంవత్సరాలకు ఒకసారి గానీ ఆయన ఎదుర్కోలేదు మరి !.

అన్న విధం గానే పాచికలు వేసి పదకొండు మందిని ఎంపిక చేశారు.

     ఈ తతంగమంతా అయి నిర్ణయమైనాక , ఎంపికకాని వారు నిరాశగా వేరే తల్లిదండ్రులని ఎన్నుకున్నారు. కానీ ఒక ఆత్మ మాత్రము సమయము కోసము వేచిచూస్తున్నది.
సమయము చూసి , ఇలా అంది " ఓ పరమాత్మా , ఇప్పడు భూమిమీద ద్వాదశి ఘడియలు వచ్చాయి కాబట్టి అదనంగా ఇంకొకరికి అవకాశం ఇవ్వడం న్యాయము . అప్పుడు పన్నెండు మంది అవుతారు . " అని. 

     పరమాత్మకు తప్పలేదు, అయితే, ఒక షరతు పెట్టాడు, " ద్వాదశి వచ్చినా , ఈ రోజుకి అతి కొద్ది ఘడియలే ఉంటుంది కాబట్టి, నీవు ఆ కుటుంబములో అతితక్కువ కాలమే ఉండి తిరిగి నావద్దకి రాగలవు " అని.

     ఆ ఆత్మ సంతోషముగా ఒప్పుకున్నది. " ఆ తల్లి దండ్రుల కడుపున పుట్టడమే ఒక వరము. నాకు అది చాలు " అన్నది.

     అదిచూసి ఇంకా రెండు ఆత్మలు పోటీ పడ్డాయి. కానీ తిథి ప్రకారము వారికి అవకాశము లేదు కాబట్టి, వారిపై కనికరముతో భగవానుడు అన్నాడు ," మీరు ఆ తల్లిదండ్రుల కడుపున పడి , పుట్టకముందే మరణించి నా వద్దకు రాగలరు. దీనిలో మీకు సంపూర్ణ స్వేఛ్చ ఉన్నది " 

  " మహా భాగ్యము " అని ఆ రెండు ఆత్మలూ ఒప్పుకున్నాయి. 

     పరమాత్ముడు తేలికగా నిట్టూర్చాడు. అతి క్లిష్టమైన ఘట్టం ముగిసింది , ఇక జన్మల సమయాలు వారి వారి కర్మఫలం నిర్దేశిస్తుంది అని తలచి, " మీకందరికీ శుభమగుగాక ! " అని ఆశీర్వదించాడు. 

     ఒకసారి ఆ భావి మాతాపితరులను అవలోకించాడు.
" వారికి ఇంకా వివాహమే కాలేదే , ఈ ఆత్మలది ముందస్తు ప్రణాళిక అన్నమాట, కలియుగ ప్రభావము ఇంత తీవ్రమా ?"  అని ఆశ్చర్య పోయాడు. 

     ఆ భావి తల్లిని చూడగానే అంతటి భగవానునికి కూడా ఉద్వేగము ఉప్పొంగింది. " వీరి ఆతృత ఎంతైనను సమంజసమే , ఈ కలియుగమున అటువంటి మాత దొరకుట దుర్లభము. తల్లీ , నీవు ధన్యురాలవు " అని అక్కడినుండే ఆశీర్వదించాడు.


No comments:

Post a Comment