SHARE

Monday, April 8, 2013

73. " మహాదర్శనము "--డెబ్భై మూడవ భాగము--వారికీ సద్గతి అయినది.


73.  డెబ్భై మూడవ భాగము --వారికీ సద్గతి అయినది. 


         భగవానులకు ఆ దినము సభ అర్పించిన కానుక సుమారు పది లక్షలకు పైనే ఐంది. రాజు అదంతా తీసుకొని వెళ్ళి రాజ భండారములో ఉంచి , భగవానుల ఆజ్ఞ ప్రకారము ఉపయోగించవలెను అని ఆదేశించినారు. భగవానులు తల్లిదండ్రులూ , పత్నీ శిష్యులతో పాటూ ఇంటికి వచ్చినారు. రాజు , దేశాధిపతులూ , విద్వాంసులూ భగవానుల వెనకే వచ్చి వారిని ఇంటికి చేర్చి , వారి అనుమతితో వెనుతిరిగినారు. అందరికీ ఉత్సవమే ఉత్సవము. ఒక జీవము మాత్రము మంటకు చిక్కిన అరిటాకువలె ముఖము మాడిపోగా భగవానుల వెనకే ఇంటిలోపలికి వచ్చింది. మైత్రేయీ , కాత్యాయనీ , ఆలంబిని ఆమెను విశ్వాసముతో ఆహ్వానించినారు. ఆమెకు భగవానులను చూస్తే ఎక్కడలేని ఏడుపూ వచ్చింది. దెబ్బతిని వెక్కుతూ ఏడ్చు పాప వలె గోడుమని ఏడ్చింది. అందరికీ ఆశ్చర్యమే ఆశ్చర్యము. గార్గి ఏడ్చుటను కాదు , ఆమె నిస్తేజమగుటను కూడా ఎవరూ చూచియుండలేదు. అదీకాక, భగవానులు ఆమెను నిండు సభలో భగవతి అని పిలచినారు. మరి ఆమె దుఃఖమునకు కారణమేమి ? 

          ఇంటివారందరూ అనునయించినారు. దేవరాతుడు అభిమానముతో , ’ ఎందుకమ్మా ? ఏమయినది ? " అని విచారించినారు. భగవానులు మాత్రము , ఏమీ మాట్లాడక , శాంతముగా ఉన్నారు. చివరికి కొంతసేపు ఏడ్చిన తరువాత , గార్గి , భగవానుల పాదములపైన పడింది. ఏడుపు మధ్యలోనే ఏమో చెప్పబోతుంది , అలాగే ఇంకా కొంత సేపయింది. 

          చివరికి భగవానులు , ’ ఏమైందని భగవతి ఇంతగా ఏడుస్తున్నారు ? "అన్నారు. వారి శబ్దమును వినగానే మేఘములు తొలగగా ప్రకాశించిన సూర్యుని వలె భగవతి ఏడుపు నిలచిపోయినది. 

         ఆమె కాత్యాయని తెచ్చిచ్చిన నీటితో ముఖమూ , కాళ్ళు చేతులూ కడుక్కొని శుద్ధాచమనము చేసి కూర్చున్నది. అదే సమయములో మిగిలినవారు కూడా వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని శుద్ధాచమనము చేసి కూర్చున్నారు. దేవరాతుడు ఆసనములో కూర్చున్న తరువాత భగవానులు కూడా కూర్చొని భగవతిని విచారించినారు.

భగవతికి ఏడుపు ఆగిపోయింది. అయినా శోకపు వేడిమి ఆరలేదు. ఆమె అడిగినారు, " విదగ్ధుల గతి యేమైనది ?"

         భగవానులు నిట్టూర్చి అన్నారు: " వారు వచ్చినపుడు వేదికపైన వారికి నేను చూపిన గౌరవము చూసి , వారిని చూచి నేను బెదరిపోయి అలాగ చేస్తున్నాననుకున్నారు. అప్పుడే ఆదిత్య అగ్ని వాయువులు కోపగించినారు. అప్పుడు నేను శాంతింపజేసినాను. అనంతరము శాకల్యులు దేవతల విచారము నెత్తినారు. మనము కంటికి కనపడరు అన్న కారణము చేత దేవతలు లేరు అనుకుంటాము , భగవతీ.  కానీ , వారు పరోక్షప్రియులు. కనిపించని చేయిగా ఉండి అన్ని పనులనూ చేయిస్తారు. దేవతా విభూతి సంకోచములను అడుగుతున్నట్లల్లా దేవతల రుద్ర రూపమైన తేజస్సు అక్కడ సంభృతమగుతూ వచ్చింది. ( ఆవహించుటకు సిద్ధముగా , పెరుగుతూ వచ్చినది ). ప్రాణపు వికాసములను గురించి చెప్పునపుడు విదగ్ధుల లోనున్న ప్రాణము విద్రుతమైనది (  కరగి, తగ్గినది ) దానిని తిరిగి తనలోపలికి ఆకర్షణ చేసుకోనీ యని నేను దిక్కుల విచారమునెత్తినాను. వారు గమనింపలేదు. చివరికి అన్నిటినీ సరిపరచు ఔపనిషదిక పురుషుని విచారము నెత్తినాను. అప్పుడు కూడా వారు దానిని అందుకోలేదు. అంతవరకూ సంభృతమయిన తేజస్సు ప్రకటమైనది. దానికి వారు ఆహుతి అయినారు. "

        గార్గి ఆ వేళకు శాంతురాలై ఉండినది. అన్నది , " భగవాన్ , అసలే పార్థివ దేహము , చాలదన్నట్టు జరా జీర్ణమయినది. ఎప్పుడైనా పోవలసినదే. పోయింది. దానికోసము నేను వ్యథ పడుట లేదు. అయితే , వారికి సద్గతి అయినదో లేదో ? అన్నదే నా వ్యథ. " 

" తమ వ్యథ సాధువైనది . అయితే తమరెందుకు ఆలోచించలేదు ? దేవతల కోపానికి పాత్రులైనవారికి సద్గతి ఎక్కడిది ? "

        భగవతి అది విని దుఃఖమును తట్టుకోలేకపోయినది. " భగవాన్ , కాపాడవలెను. విదగ్ధులకు దుర్గతి పట్టకూడదు. కాపాడవలెను. " అని గోడుపెట్టింది." కావలెనన్న , ఈ జన్మలో నేను ఆర్జించిన పుణ్యమునంతా ఇచ్చివేస్తాను. వారికి బ్రహ్మజ్ఞులకు కలుగు సద్గతి కలగవలెను " 

         భగవానుల హృదయము పసిపిల్లవాడి వంటిది. ఎప్పుడూ ఆనందముతో నిండి రసార్ద్రముగానే ఉండును. అది భగవతి గోడును విని కరగక ఎలాఉండును ? అన్నారు :" భగవతీ , ఇప్పుడు వారికి దొరకు దుర్గతి కూడా బహుకాలముండదు. ఆ దుర్గతియొక్క స్వరూపమేమో తెలుసా ? శరీరమే తాననుకొని , శరీరమునకగు బాధలన్నిటినీ తనవనుకొని , సుఖ దుఃఖానుభవము పొందును. దుఃఖానుభవమునకై వేరే లోకమున్నది. అది నరకము. ఇదంతా మీకు తెలుసు. కావాలంటే ఇక్కడే ఉండి దానిని చూడవచ్చును. అక్కడ కొంతకాలము విదగ్ధులు ఉండవలసినది. అయితే మీరు అడ్డువచ్చినారు. వారికి సద్గతి కావలెనంటిరి. తప్పకుండా కానీ. అందరి ఆత్మ ఒకటే అన్నట్టయితే , మనము అది తెలిసినవారమైతే , మన ఆత్మే అయిన విదగ్ధుల ఆత్మ ఎందుకు లేని భ్రాంతికి లోనై నలగవలెను ? బ్రహ్మ లోకము సదా ఆత్మదర్శనమగు లోకము. అక్కడికి వెళ్ళువాడు అక్కడే శాశ్వతముగా ఆత్మదర్శనము వలన బ్రహ్మానందమును పొందుతూ ఉంటారు. చివరికి బ్రహ్మలో తృప్తి పొంది బ్రహ్మమును పొందును. ఇంతయితే చాలుకదా ? "

         భగవతి భగవానుల వచనములను విన్నది. ఆమెకు సంతోషమయినది. విదగ్ధులకు నరకవాసము తప్పి, శాశ్వతమైన బ్రహ్మలోకము దొరికినది కదా అన్న సంతోషముతో భగవానులకు నమస్కారము చేసి , " అట్లయిన చాలు. వారు మా గురువులు. దానికోసమే ఇంత కష్టమును పొందినాను, క్షమించవలెను " అన్నది. భగవానులు నవ్వి , " ఇటువంటి సూటి చర్చ మాకు వద్దనిపించలేదు " అన్నారు. 

         భారమైన హృదయముతో సంకట పడుతూ వచ్చిన భగవతి లఘువైన హృదయముతో బయలు దేరింది. భగవానులు ఆమెను నిలిపి , " వరమును అడిగి పొందినవారు ప్రతిగా ఒక వరమును ఇచ్చి కదా వెళ్లవలసినది ? " అన్నారు. బయల్వెడలిన ఆమె, ’ పరిపూర్ణ బ్రహ్మయై , ఆప్త కాములైన వారు వరమును అడిగితే , బెల్లపు గణపతికి బెల్లమే నివేదన అన్నట్టవుతుంది , అంతే కదా ? ఈ ముఖముతో అడుగుతారు , ఇంకొక ముఖముతో ఇస్తారు. దానికేమి ? తప్పకుండా " అన్నది. 

         భగవానులు గంభీరముగా అన్నారు :" ఇక మీదట భగవతి ఎప్పుడూ కూడా దేహోహం భ్రాంతికి లోనుకాకుండా ఆత్మాహం మతి తో వర్తించవలెను. ఈ వరమును ఇవ్వవలెను " 

         భగవతి కళ్ళు  నందముతో హర్షించగా అన్నారు : " ఇది తమరు ఇచ్చిన వరమా ? అడిగిన వరమా ? దేవతలు ఇచ్చినది సుఖమునకూ కావచ్చు, దుఃఖమునకూ కావచ్చును. అయితే సాధువులు ఇచ్చునది ఎల్లపుడూ సుఖమునకే అవుతుంది అని విన్నాను. ఇప్పుడు అది నిజమయినది. ఇది నిజంగా వరమే. ఎప్పుడూ ఇలాగే ఉండునట్లు అనుగ్రహించండి " అని నమస్కారము చేసినది.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                        

72. " మహాదర్శనము " --డెబ్భై రెండవ భాగము --సర్వజ్ఞాభిషేకము


72.  సర్వజ్ఞాభిషేకము


         గార్గి వెనుకకు తిరిగిన తరువాత , కురు పాంచాల విద్వాంసులు కూర్చున్న చోట కలకలమైనది. ప్రముఖులందరూ వచ్చి విదగ్ధులను చుట్టుకున్నారు. " విదగ్ధా , కురు పాంచాల దేశములు సరస్వతి ఆవాస స్థానములనీ , బ్రహ్మలోకమునకు సమానమైన భూమియనీ ఇంతవరకూ ప్రఖ్యాతమైనవి. ఈనాడు ఆ ప్రఖ్యాతి చెరగిపోవునట్లుంది. వైదేహుడొకడు అందరినీ ఓడించి , రణములో వచ్చిన ఇతర గజములను అణచి ఓడించిన మదగజము వలె తిరుగుతున్నాడు. ఇంకా కాలాతీతము కాలేదు. ఇంకొక ఘడియ చూసి ఎవరూ వాదమునకు రాకుంటే జనకుడు యాజ్ఞవల్క్యునికి సర్వజ్ఞాభిషేకమును చేయుటకు సిద్ధముగా ఉన్నాడు. లేవండి , మా మానమును మిగిలించండి. మీ దేశపు మానమును కాపాడండి. " అని అందరూ విదగ్ధుని మెడకు చుట్టుకున్నారు. 

         విదగ్ధుడు ఆలోచించినాడు:" యాజ్ఞవల్క్యుడు ఇతరులవలె కాదు. మాంత్రికుని వలె ఏదో చేసి ఎదుటివారిని పట్టివేయును. గార్గి రెండవ సారి అడిగిన ప్రశ్నలను ఎంత సులభముగా గ్రహించినాడు ? అంతే సులభముగా ఉత్తరమును ఇచ్చినాడు. గార్గి అన్నది , " మీలో ఎవరూ ఇతడిని బ్రహ్మవాదములో గెలువలేరు " అన్నది. గార్గి అబద్ధమును చెప్పునది కాదు. "

          విదగ్ధుడు అన్యమనస్కుడై కూర్చున్నది చూసి ఆ విద్వత్ప్రముఖులు మరలా అన్నారు. " మన విద్వత్కులానికే అపమానకరమైన ఈ ఓటమిని ఒప్పుకొని మనము ఎంతకాలము బ్రతుకగలము విదగ్ధా ? మీ తండ్రిగారు ఎంతటి విద్వాంసులన్నది పరిగణించండి. విద్యకు విఖ్యాతమైన మన దేశములోనే ఆతనిని మించిన విద్వాంసులు ఉండలేదు. అంతటివారి పుత్రులైన మీరు ఈ వాదమునకు వెనుకంజ వేయుటయా ? " 

          విదగ్ధుడు మరలా ఆలోచించినాడు: " ఔను, శకలుల కొడుకు వాదానికి బెదరనవసరము లేదు. అయితే యాజ్ఞవల్క్యుడు అందరివలె వాదము చేయుట లేదు. కానీ మావాళ్ళు చెప్పుచున్న మాట కూడా నిజము. ఇక్కడేమవుతుంది ? వాదములో ఓటమో , గెలుపో.  అయితే , కురుపాంచాలములలో మాత్రమే కాదు , గంగా యమునా మధ్యనున్న దేశములన్నిటా ప్రఖ్యాతుడనైన విద్వాంసుడనై , ఈ బ్రహ్మవాదములో ఓడిపోయి బతుకుటకగునా ? తలయెత్తుకొని తిరుగుటకగునా ? అలాగని ఇక్కడ ప్రాణమును పణముగా పెట్టవచ్చునా ? ఆ సర్వజ్ఞాభిషేకమొకటి. నేను వాదములో ఓడి ఆ సర్వజ్ఞపీఠపు సోపానములలో చివరి మెట్టునవుతానా ? "

         చివరికొక విద్వాంసుడు రెచ్చిపోయి అన్నాడు:" విదగ్ధా , నువ్వు లేస్తావా ? నన్ను లేవమంటావా ? ఎంతైనా నేను నీ అంతటి వాడను కాను, నువ్వు అగ్రగణ్యుడవు. నేను రెండవ శ్రేణి వాడిని. కురు పాంచాలులు ఇంతమంది వచ్చినా ఎవరూ వాదభూమికి దిగలేదు అను అపఖ్యాతియైనా తప్పనీ. " 

         ఆ మాట ఎందుకో ఏమో విదగ్ధుని గ్రుచ్చినట్లాయెను. " సరేలేవయ్యా, మీయందరి కోరిక మేరకు నేను వాదమునకు వెళతాను. అయితే ఈ యాజ్ఞవల్క్యుడు నా కళ్ళముందు పెరిగిన పిల్లవాడు. వీడితో వాదము చేయుటయా అని శంక. "

          " నువ్వు శంక విశంక అని లెక్కపెడుతూ కూర్చో. ఇంకొక ఘడియలోపల సర్వజ్ఞాభిషేకము అయిపోనీ . నువ్వు రేపు , ’ నేను వాదమునకు వెళ్ళవలసినది , వెళ్ళిఉంటే ఆ అభిషేకము నాకు అయ్యెడిది, అనుకొని ఇంటిలోపల తిరుగు. విను , ఈ సర్వజ్ఞ పీఠమునకు నువ్వొక్కడవే అధికారివి. ఇంకెవరూ యోగ్యులే కాదు. నువ్వుగా వదలి ఇది ఇతరుల పాలు కాకూడదు. అలాగవరాదు. యేరీతిగా చూచిననూ ఇది మనవారిది. కురు పాంచాలులు తప్ప, వేరే దేశములలో విద్వాంసులెక్కడ ? కాబట్టి , లెమ్ము. ప్రాణమునైననూ పణముగా పెట్టి దీనిని ఏదో విధముగా సాధించు. ఈ రాజు కూడా నీ శిష్యుడే , మరవద్దు. "

          విదగ్ధుడు నిశ్చయించుకున్నాడు. పైకి లేచినాడు. అతని గాంభీర్యమునూ , గాంభీర్యమును ఉట్టిపడునట్లు ఆ నిలుచున్నదీ చూచి అనేకులు మెచ్చుకున్నారు. అతడు నిలుచున్న తీరే అతడు విద్వాంసుడని ఉద్ఘోషిస్తున్నది. కొందరు శంకించినారు : " ఈతడేమో మహా విద్వాంసుడి వలెనే కనబడుచున్నాడు , అయితే ఆ సింహముతో తలపడ గలడా ? "  

          విదగ్ధుడు కట్టుకున్న ధోవతి అంచులను సరి చేసుకొని, కప్పుకున్న ఉత్తరీయమును క్రమపరచుకున్నాడు. దానిపైనున్న శాలువను సరిగ్గా కప్పుకొన్నాడు. అది నేలపైన జీరాడుతున్నది. దానిని అంగుళీయకములతో అలంకృతమైన హస్తములతో పట్టుకొని మత్తగజము వలె అడుగులు వేస్తూ వేదిక  వైపుకు నడచినాడు. 

         కృష్ణాజినమును కప్పుకొని దర్భల పవిత్రమును ఉంచుకొని పవిత్రమూర్తి వలె కనబడుతున్న భగవానులు వయస్సులో తనకన్నా పెద్దవారైన విద్వాంసులు వస్తున్నది చూచి కూర్చున్నవాడు లేచి నిలబడినాడు. 

         విదగ్ధుడు వస్తూ దారిలో ఆలోచించినాడు. " ఈతడు నేను వస్తున్నది చూచే బెదరినాడు. " అని సంతుష్టుడై , ఆ సంతోషమును ప్రకటముగా చూపిస్తూ తనను లేవమన్న విద్వాంసుల వైపు తిరిగి ఒక నవ్వు నవ్వి ముందుకు వచ్చినాడు. వేదిక సమీపమునకు వచ్చి , " యాజ్ఞవల్క్యుల వారూ,  ఈ మర్యాదను చూపించనవసరము లేదు. ఎంతైనా ఇది వాద భూమి. ఇప్పుడు మనమిద్దరమూ సమానము. కూర్చోండి. విద్వాంసులు వినయమును వదలరాదు. అట్లని ఇంత వినమ్రులు కూడా కాకూడదు. ఇంకొక ఘడియ లోపల సర్వజ్ఞాభిషేకమును పొందు తమరే ఇంత నమ్రమయితే ఎలాగ ? " అన్నాడు.

భగవానులు దానికి ప్రతిగా   ఏమీ మాట్లాడక ,  రెండు చేతులతో ఆసనమును చూపిస్తూ , " దయ చేయవలెను. సర్వ వృద్దులైన శకలుల పుత్రుడికి ఇవ్వకూడని మర్యాద ఉంటుందా ? " అని పలికి, వారు కూర్చున్న తరువాత తామూ కూర్చున్నారు. 

విదగ్ధుడు ఠీవిగా పద్మాసనములో నేరుగా కూర్చొని , చుట్టూ చూచి, రాజు వైపు చూచి , నవ్వి, వాదమును ఆరంభించినాడు: " యాజ్ఞవల్క్యా , దేవతలు ఎందరు ? "

భగవానులు నవ్వుతూ , " వైశ్వదేవములో నివిదవల్లి చెప్పినట్లు మూడువందల మూడు అథవా మూడువేల మూడు. అయితే ఇవన్నీ ముప్పైముగ్గురు దేవతల మహిమ. " అన్నారు.

" ఆ ముప్పైమూడు మంది ఎవరు ? "

" ఎనమండుగురు వసువులు , పదకొండు మంది రుద్రులు , పన్నెండు మంది ఆదిత్యులు , ఇంద్రుడు , ప్రజాపతి . కర్మఫలమును తమలో ఉంచుకున్నారని వసువులు , శరీరములో కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ , మనోరూపములుగా ఉండి , అది పడిపోయినపుడు వెళ్ళిపోయి సంబంధములనన్నిటినీ చెరిపివేయువారు అని రుద్రులు , సంవత్సరపు పన్నెండు మాసములు ఆదిత్యులు-- ప్రాణులందరి ఆయుష్షునూ  కర్మఫలమునూ మోసుకొని వెళ్ళతారని ఆదిత్యులు . మెరుపులూ ఉరుములూ ఇంద్రుడు  , పశువులూ యజ్ఞమూ ప్రజాపతి. "

" సరే  , వీటిని సంకోచింపజేస్తే ? "

" ఆరు , మూడు, రెండు , ఒకటిన్నర , ఒకటి అగును. పృథ్వి  , అగ్ని  , అంతరిక్షము, వాయువు , ద్యులోకము, ఆదిత్యుడు అని ఆరు. ఆయా లోకములలో అగ్ని , వాయు , ఆదిత్య దేవతలను చేర్చితే అగు పృథ్వీ అంతరిక్ష ద్యులోకములే మూడు. దానిని కూడా సంకోచింపజేస్తే , అన్నము  అన్నాదమైన ప్రాణము; ఇలాగ రెండు. వాటినీ సంకోచింపజేస్తే , వాటిలో ముందుకు పెరుగు సూచన ఉన్నదొకటి  మరియూ సగమై ఉన్న వాయువు, ఇవి ఒకటిన్నర.  వాటినీ సంకోచింపజేస్తే, మిగిలేది ప్రాణమొక్కటే. ! "

" ప్రాణము పగిలి ఎనిమిది విధములై ఈ లోకములనన్నిటినీ ఏర్పరచినది. అదంతా తెలిసిన వాడే సర్వజ్ఞుడు యాజ్ఞవల్క్యా. " 

" ఔను, ఆ ఎనిమిది విధములైన పురుషులనూ , ఎనిమిది కార్యములనూ , ఎనిమిది కరణములనూ ఎనిమిది దేవతలనూ ఎరుగుదును. అది నిజమైన పాండిత్యము కాదు , శాకల్యా. " 

శాకల్యునికి ఆ మాట విచిత్ర మనిపించినది. ఈత రాని వాడిని నీటిలోకి తోసినట్లాయెను. ముందుకు సాగి అడుగుదామా అంటే ఏమీ తోచదు. లేచి వెళదామా అంటే ఆసనమునకు కీలలు కొట్టబడి అంటుకుపోయి నట్లయినది.

ఒక ఘడియయైనది. సభ ఆ మౌనమును సహించలేక అశాంత మయ్యే వరకూ వచ్చింది. అశాంతమూ అయ్యింది. అయినా శాకల్యుడు ఇంకా మౌన ముద్రను వీడలేదు. 

భగవానులు కరుణతో చూస్తూ అన్నారు : " శాకల్యా , మీరు నిష్ఠాపరులు. ఉపాసకులు , అయితే యేమి, పాపము ఈ కురు పాంచాల విద్వాంసులు తమరిని మంటను పట్టుకొను దీపము పురుగును చేసి  మంటలోకి తోసినారు. "

విదగ్ధుడు ఆ మాటను సహించలేదు , రేగిపోయినాడు. " నోరు మూసుకో యాజ్ఞవల్క్యా , మూసుకో. నువ్వు యే ’ మహాబ్రహ్మము’ ను ఎరుగుదువని కురుపాంచాల బ్రాహ్మణుల నందరినీ నిందిస్తున్నావు ? " అన్నాడు. తాను యాజ్ఞవల్క్యులను ఏకవచనముతో సంబోధిస్తున్నా నన్నది కూడా ఆతని మనసుకు తట్టలేదు. 

భగవానులు ఆ తిరస్కారముతో కొంచము కూడా ఖిన్నులు కాలేదు. :" శాకల్యా , మీరు చెప్పిన ప్రాణ పురుషులను మాత్రమే కాదు , ఆ ప్రాణము ఐదు  దిక్కులై, ఈ విశ్వమై , ఈ విశ్వపు దేవతలై,  ధ్యాత్మములో ప్రతిష్ఠితమై ఉన్నది ఎరుగుదును " అన్నారు. 

" అయితే ఏదీ , వాటిని ఒక్కొక్కటిగా చెప్పు." అన్నారు. 

" అటులనే , సావధానముగా వినండి. ఈ ప్రాచీ దిక్కులో ఆదిత్యదేవుడై , చక్షురూపములో ప్రతిష్టితుడై, ఇవన్నీ ( ఐదు దిక్కులు , విశ్వమూ , విశ్వ దేవతలు ) హృదయములో ప్రతిష్టితమై ఉండును. ఈ దక్షిణ దిక్కులో యమ దేవుడై, యజ్ఞ దక్షిణా శ్రద్ధలలో ప్రతిష్టితుడై ఇవన్నీ హృదయములో ప్రతిష్టితమై ఉండును. ఈ పశ్చిమ దిశలో వరుణదేవుడై, బయట జలమై, లోపల రేతస్సై ప్రతిష్టితుడై,  ఇవన్నీ హృదయములో ప్రతిష్టితమై ఉండును. ఈ ఉత్తర దిశలో సోమదేవుడై బయట దీక్షయై , లోపల సత్యమై ప్రతిష్టితుడై ఇవన్నీ హృదయములో ప్రతిష్టితమై ఉండును. పైనున్న ధృవా దిశలో అగ్ని దేవత. అది వాక్కై , హృదయములో ప్రతిష్టితమై ఉండును. : శాకల్యా, మరలా ఒకసారి చెప్పెదను , వినండి. పూర్వదిక్కు రూపాత్మకమైనది, దక్షిణము కేవలము కర్మాత్మకమైనది , పశ్చిమము పుత్రోత్పాదన రూప కర్మాత్మకమైనది , ఉత్తరము  విద్యా సహిత కర్మాత్మకమైనది. ఊర్ధ్వము నామాత్మకమైనది. ఇలాగ రూప కర్మ నామాత్మకమైన సర్వమూ ఈ హృదయములో ఉండును. "

" అ హృదయము ఎక్కడ ఉండును ? "

" ఇదేమిటి ఇలాగ మాట్లాడుచున్నారు ? శాకల్యా , హృదయము శరీరములో ఉండును. ఆ శరీరమును నేను అని ప్రతిఒక్కరూ అంటున్ననూ , ఆ నేను వేరేగా ఉండును. " 

" ఆ శరీరములో నున్న ఆ నేను ఉండేదెక్కడ ? "

భగవానులు నిట్టూర్చినారు. బ్రహ్మవాదమునకని వచ్చి కూర్చున్న వాడు ఎదుటి మనిషి చెప్పినదాంట్లో , అదెక్కడ ఉంటుంది , దాని ప్రతిష్ట ఏమి అని అడిగినట్లాయెను అని వారికి అయ్యో పాపము అనిపించినది. అయితే , ఈతడు ఇలాగ వేరుపరచి చూచునపుడు , వీటన్నిటినీ ఒకటి చేసి పట్టగల ఔపనిషదీకరుడైన ( ఉపనిషత్తును తెచ్చిన )  పురుషుడు ముందుకు రావలెను కదా అనిపించి , నిట్టూర్చి ప్రశ్నకు ఉత్తరము చెప్పినారు:

" శరీరము ప్రాణ , అపాన , వ్యాన , ఉదాన , సమానములలో ఉండును. ఇలాగ ఒకదానినొకటి పట్టుకొని ఉండకపోతే ఒక్కొక్కటీ ఒక్కొక్క వైపుకు వెళ్ళి పోయెడివి. ఇవన్నీ కార్యములు. కరణమైన హృదయము నుండీ బయల్వెడలి జగద్రూప కార్యమై పరిణమించి , అక్కడినుండీ వెనుతిరిగి వచ్చి హృదయములో మరలా ప్రతిష్ఠితుడగు ఆత్ముడిని , శాకల్యా , ’ నేతి ’ ( ఇది కాదు , ఇది కాదు ) వాదమొక దానితో మాత్రమే తెలుసుకోవలెను. అలాగ తప్ప ఇంకే విధముగనూ దానిని తెలియలేము. కార్య కరణములు రెండూ తానే అయిఉన్ననూ , కారణమైన దానిని మరింకెలా తెలుసుకోగలము ? ఖండఖండములైన  ఈ సర్వమూ అఖండమగు పరిణామములో ఉన్నది. దానిని ఉపనిషత్తులచేత మాత్రమే తెలుసుకోగలమే తప్ప , ఇక దేనినుండీ తెలుసుకోలేము. దానిని తెలియకనే ఎరుగుదును అంటే అతడు మంటలో పడిన గడ్డిపోచ వలె యగును. ఆ ఆత్మను , ఈ మూర్తీభవించిన విశ్వము నంతటినీ నిండి , దీనినుండీ బయటికి కూడా ప్రసరిస్తున్న పురుషుడు అంటారు, అది తెలుసా శాకల్యా ? "

శాకల్యునికి ఖండము అఖండమగును అనునది తెలియదు. అతడు బిక్కచచ్చి చిన్న గొంతుతో '  నాకు తెలియదు ' అన్నాడు. అయితే తత్పురుషోపాసనలోనే ఉన్న భగవానుల "  దానిని తెలియకనే ఎరుగుదును అంటే అతడు మంటలో పడిన గడ్డిపోచ వలె యగును"  అన్న మాట ఆ తత్త్వమును , అగ్నిని కెలికినట్లే కెలికింది. విదగ్ధుడు దానికి స్వాహా అయినాడు. విదగ్ధుడు బ్రహ్మవాదములో విదగ్ధుడే అయిపోయినాడు. భగవానుల వాణి ఎక్కడినుండీ ఎక్కడికి ఎంతవరకూ వ్యాపించి ఉందో అంతవరకూ ఉన్న అందరికీ ఆ వాణి వినిపించినంత సేపూ ఒక రెప్పపాటు కాలములో అఖండపు జ్ఞానము అయినది. జ్ఞాన గంగా స్నానమయినది. సభలోని వారంతా దారుమయ యంత్రముల వలె , పర ప్రేషితులైన వారి వలె , స్వాతంత్ర్యము లేశమైనా లేనివారి వలె , లేచి కాయేన వాచా మనసా భగవానులకు నమస్కారములను సమర్పించినారు. జయ భగవతే యాజ్ఞవల్కాయ నమః అన్న నినాదము మంటపమును లేపి మోసుకొని పోవునా అన్నట్టయింది. 

భగవానులు అంతసేపూ సమాధిలో ఉన్నారు.

రాజా జనకుడు ముందుకు వచ్చి సర్వజ్ఞాభిషేకమునకు సభానుజ్ఞను పొంది భగవానులకు పాండిత్య కిరీటమును ధరింపజేసి , నమస్కరించినాడు. అక్కడున్న సర్వులూ అతనికి యథోచితముగా కానుకలను అర్పించి, నమస్కారము చేసినారు. 

71. " మహాదర్శనము"-- డెబ్భై ఒకటవ భాగము--మరలా వాదము


71. డెబ్భై ఒకటవ భాగము-- మరలా వాదము


          విదగ్ధశాకల్యుడు గార్గిని పిలచినాడు. : మీ పద్దతి నాకెందుకో సరిపోలేదు. అశ్వలుడు ఒక్కరు తప్పితే ఇంకెవరూ మనఃపూర్వకముగా ప్రశ్నలు వేసినట్టులేదు. కహోళుడైతే సమర్పణము చేసుకున్నవాడి వలె ఉన్నారు. మీరైతే భగవానులు అనగానే అర్దనిమీలితులై  నేను మీ శిశువును అన్నట్టు మాట్లాడినారు. ఎదిటివాడిని గెలిచే పద్దతి ఇదేనా ? ఆతడు తాను బ్రహ్మిష్ఠతముడ నన్నది నోటితో కాకుండా చేతలతో చేసి చూపినాడు. ఆతని పైన పడునపుడు మత్తగజము పైన మశకము పడినట్లు పడితే ఉపయోగమేమున్నది ?  ఇదేమైనా బాగుందా ? "

         గార్గికి మర్మాఘాతమైనట్లాయెను. ఏనుగును అంకుశముతో పొడిచినట్లాయెను. మంత్రబద్ధమైన మహాసర్పమును బెత్తముతో కొట్టినట్టాయెను. ఆమె అదంతా మింగుకొని నిట్టూర్పు విడచినది. 

          అంతలో ఒకడు వేదిక వద్దకు వచ్చినాడు.   నడుస్తున్న పద్దతి చూస్తేనే అతడు సామాన్యుడు కాదు అని తెలుస్తున్నది. ముఖమును చూస్తే, ఎవరి లక్షమూ ఉన్నట్టు లేదు. వచ్చిన వాడు ఉద్ధాలకుడు. మహా విద్వాంసులని ప్రసిద్ధులైన అరుణుల కొడుకు. మదించిన విద్వాంసుడు అని ప్రసిద్ధి కెక్కినవాడు. బ్రహ్మవాదము లోనైతే అసమానుడు అని పేరు గన్నవాడు. 

         ఉద్ధాలకుడు , నేరుగా , దిట్టంగా వేదిక పైకి వెళ్ళి ,  ఆసనములో కూర్చున్నాడు. కూర్చొనుటకు ముందు ఆసనము పైన ఉన్న ధూళిని అంగవస్త్రముతో విదిలించి , దానిపై కృష్ణాజినమును వేసుకున్న రీతిని చూస్తే అంతవరకూ అక్కడ కూర్చున్న వారి సంపర్కము వలన కలిగిన పరాభవము నంతా విదిలించి పారేసినట్టుంది. 

          " యాజ్ఞవల్క్యులు నావైపు తిరిగి గమనము నుంచి వినవలెను. మేము శ్రౌతమును నేర్చుకుంటూ మద్రదేశపు కపిగోత్రుడైన పతంజలుల వద్ద ఉంటిమి. ఆతని భార్య ఒంటిపై గంధర్వుడు పూనకము పూని, వచ్చేవాడు. కబంధుడను ఆ గంధర్వుడు ఒక దినము మా అందరి సమక్షములో కావ్యమును రాస్తూ , " ఇహ లోకము , పరలోకము, మరియూ   సర్వభూతములనూ బంధించి ఉన్న సూత్రము తెలుసా ? అలాగే , ఈ అన్నిటిలోనూ ఉండి , వీటిని ఇలాగ ఉండవలెనని నియమించు అంతర్యామిని ఎరుగుదువా ? ఈ సూత్రమును, ఈ అంతర్యామిని ఎరిగినవాడే , బ్రహ్మలోకము , వేదము , భూతములు , ఆత్మ-అన్నిటినీ తెలిసినవాడు. ’ అని, మా అందరికీ ఆ జ్ఞానమును ఉపదేశించి నాడు. యాజ్ఞవల్క్యా , మీకు ఆ సూత్రపు మరియు , అంతర్యామి యొక్క  జ్ఞానముందా ? అలాగ లేకుంటే , మీరు ఆ జ్ఞానమున్న వారికి  మాత్రమే లభ్యము కావలసిన గోధనమును తీసుకొని పోతే , దానికి పరిహారముగా మీరు మీ తలనే ఇవ్వవలసి ఉంటుంది! "

         ఆ ప్రశను విని అందరూ చకితులైనారు. ’ ఇప్పుడే ఇది నిజమైన బ్రహ్మ వాదము , భలే! ’ అన్నారు. విదగ్ధుడు కూడా తలాడించినాడు. దేశాధిపతులంతా తలలూపినారు. ప్రశ్న , ఎంతటివారైనా కళ్ళు పెద్దవి చేసి కనుబొమలను పైకెత్తునంత గొప్పగా ఉంది.     

         భగవానులు అచలమైన శిలా ఖండము వలె కూర్చున్నారు. కనులు మూసి , తెరచి ఉద్ధాలకులను చూసి , చిరునవ్వు ముఖముమీద చిందుతుండగా , చీమ చిటుక్కుమన్నా వినిపించు ఆ నిశ్శబ్దములో , ఉద్ధాలకుని ఆతని గోత్రముతో సంబోధించి, " గౌతమా , నేనది ఎరుగుదును " అన్నారు. 

          ఉద్ధాలకులకు భగవానులు సమాధానముగా ఇచ్చిన ఉత్తరము కోపమును తెచ్చిపెట్టింది. అయిననూ , సహజ సంయమియైన అతడు తనకైన ఆశాభంగమును ఎర్రబడ్డ ముఖము తెలుపుతున్ననూ, కోపమును దమనము చేసుకొని అన్నాడు : " యాజ్ఞవల్క్యా , ఎవరు కావాలన్నా ఎరుగుదును అనవచ్చును. మీకు తెలుసునని మేము నమ్మేటట్లు చెప్పండి."   

          భగవానులు ఆనుకొని ఉన్న దిండును వదలి , పద్మాసనమును సరిగ్గా వేసుకొని, అరచేతులను ఒకదానిపై నొకటి పెట్టుకొని , గంభీరముగా అన్నారు : " ఉద్ధాలకులు అంతఃస్థితిని ముఖ ముద్రాదులతో  గుర్తు పట్టగలరు అని నేను విన్నాను. వాక్కు కన్నా అర్థము గొప్పది. ఉన్న అర్థము నంతా వాక్కు చెప్పలేక పోతే కుంటుపడును అని తెలిసిన వారు అనుకున్నాను. ఓ వాక్కూ! పలుకు ! వేదసమ్మతమై , అనుభవములో నున్నదానిని ఇక్కడ ఎంత చెప్పవచ్చునో అంత చెప్పి కృతార్థురాలవు కమ్ము. విని మేమూ కృతార్థులమయ్యెదము. ఉద్ధాలకులవారూ , మీరు కూడా వినండి. " అన్నారు.   

          ఉద్ధాలకులు మేఘరహితమైన ఆకాశములో  ఉన్నట్టుండి వినిపించిన గర్జన విని బెదరినట్లు బెదరినారు. " నేనెందుకు ఇంత నిష్టూరముగా పలికినాను ? ఇదే మాటనే మృదువుగా చెప్పిననూ  సరిపోయేది కదా ? " అనిపించినది. 

భగవానులు మేఘ గర్జనవలె మ్రోగు కంఠముతో అన్నారు: "

         " గౌతమా , ఆ సూత్రమే వాయువు. ఇహలోక, పరలోకములు మాత్రమే కాదు , సర్వమూ వాయువు వల్లనే కట్టుబడి యుండునది. వాయువు శరీరమును వదలి వెళితే అంతా శిధిలమగును. కాబట్టి , గౌతమా , వాయువే ఆ సూత్రము. "

        భగవానుల ఒక్కొక్క మాటా పడగ విప్పిన పాము యొక్క పడగ పైన పడిన దెబ్బలవలె ఉద్ధాలకులకు భావన కలిగించినవి. అతడికి ఇష్టము లేకున్ననూ , అతని నోటి వెంట , " ఔను , సరియే , ఇక అంతర్యామి విషయము " అని మాటలు బయటపడినాయి. 

         భగవానులన్నారు: " ఎవడు పృథివ్యాది పంచభూతములలోను , వాటివల్ల ఏర్పడిన అంతరిక్ష ద్యులోకములలోను , అంతరాంతరములలో ఉండునో , ఎవడికి ఇవన్నీ శరీరములు గా ఉన్నాయో , ఎవడిని ఇవేవీ ఎరుగలేవో , ఎవడి నియమము ప్రకారము ఇవన్నీ నడచునో, అతడే మీ ఆత్మ. అతడే అంతర్యామి. అతడొక్కడే అమృతుడు. " 

        " ఆదిత్య , చంద్ర నక్షత్రాది తేజోమండలముల లోపల ఉండి , నియమించుతున్ననూ , అవి ఇతడి శరీరమై ఉన్ననూ ఎవడిని ఇవి తెలుసుకోలేవో అతడే మీ ఆత్మ అతడే అంతర్యామి. అతడే అమృతుడు. " 

          " అటులనే , శరీరములన్నిటా ఉన్నట్లే మీ శరీరములో కూడా ఉన్న ఇంద్రియ, మనః, ప్రాణ ,విజ్ఞాన , రేతస్సులలో కూడా అతడు అంతస్థుడై నియామకము చేయును. అవన్నీ అతడి శరీరములు. అయిననూ అవి యేవీ అతడిని తెలియవు. ఎవరికీ కనిపించకుండా అన్నిటినీ చూచేవాడు అతడు. ఎవరికీ వినిపించకుండా అన్నిటినీ వినువాడు అతడు. అతడు తప్ప ఇంకెవరూ లేరు.  అతడు మీ ఆత్మ. అంతర్యామి కూడా ! అతడొక్కడే అమృతుడు. మిగిలినవన్నీ మృతములు." అన్నారు. 

ఉద్ధాలకులు స్వప్రయత్నము లేకనే " సరియే " అని చేతులు జోడించి వెను తిరిగినాడు. 

         గార్గి మరలా లేచినది. సభకు నమస్కారము చేసినది. " పూజ్యులారా , నేనిప్పుడు ఇంకో రెండు ప్రశ్నలు అడగవలెనని యున్నాను. తమరి అనుమతి కావలెను " అని చేతులు జోడించినది. విదగ్ధుడు , ’ గార్గి చెలరేగుతుంది , ఇక యాజ్ఞవల్క్యుడు నిలబడుట కష్టము’ అనుకున్నాడు. ’ ఒక వేళ ఈమె ప్రశ్నకూ యాజ్ఞవల్క్యుడు వంగక పోతే ? " విదగ్ధుడు సభనంతటినీ చూచినాడు. ఎక్కడెక్కడ చూచిననూ ప్రశ్నలను అడుగువారు ఎవరూ ఉన్నట్టులేదు. అతడి మనసు ఎగసింది. ’ ఎవరూ లేవకుంటే నేనే లేచెదను ’ అనుకున్నాడు. అయితే , కురు పాంచాలులందరిలో  విద్వద్రత్నము అనిపించుకున్నవాడు స్వతంత్రించి వాదమునకు వెళ్ళుట యెలాగ ? సరే , కానిమ్ము , దైవము ఏమి చేయునో చూచెదము ’

         సభ వారు గార్గి వినయమును చూసి సంతోషించినారు. మొదటిసారి అడుగునది సభలో నున్న వారందరికీ స్వతఃసిద్ధముగా వచ్చిన అధికారము.  రెండవ సారి అధికారము పొందవలెనంటే సభవారి అనుజ్ఞ కావలెను. అది సరే , అయితే , ఇంకొకరు , మరియొకరు ఇదే దారి పట్టితే ? .... చివరికి ఎక్కడికక్కడ చిన్న వాద వివాదములై , సభ ఆమెకు అనుజ్ఞనిచ్చినది. 

          గార్గి  వేదిక వద్దకు వచ్చినది. ఈ సారి కావాలని భగవాన్ శబ్దమును ఉపయోగించకుండానే ఆమె అన్నది, " ఆర్యా , యాజ్ఞవల్క్యా , ఇదిగో నేను మరలా వచ్చినాను. శూరుడని ప్రసిద్ధుడైన కాశీరాజు పుత్రుడో,  విదేహ రాజు పుత్రుడో కిందకు దింపిన ధనుస్సుకు మరలా నారిని కట్టి , ఎదుటివాడికి వ్యథ కలుగవలెనని బాణ ప్రయోగము చేసినట్లు , మీరు సమాధానము చెప్పలేని రెండు ప్రశ్నలను మీపైకి సంధించుటకు మరలా వచ్చినాను. సిద్ధముగా ఉన్నారా ? "

         భగవానులు ఆమె అంత విస్తరణగా పలికిననూ , ఏమీ లెక్కలేనట్టు విన్నారు: " భగవతి ఏమి కావాలన్ననూ అడగవచ్చును. " అన్నారు. 

          " బ్రహ్మాండము రెండు భాగములై ద్యావాపృథ్వులైనది యని తెలిసినవారు అంటారు. ఈ ద్యావా పృథ్వుల బయటా  లోపలా నిండి ఒకటుంది యని అంటారు. అది భూత, భవ, భవిష్యత్తు మూడు కాలములకు కారణమయినది అంటారు. ఇలాగ కాల దేశ విభాగములకు లోను కాని దానిని సూత్రము అంటారు. ఆ సూత్రము దేనిలో ఓతప్రోతమైపోయి ఉంటుంది ? "

          భగవానులు ఆ స్త్రీ బుద్ధి యొక్క వైభవమును చూచి బహు సంతుష్టులైనారు. " భలే ! గార్గి , వెనుక నేను , ఆగమము వలన , ఉపదేశము వలన పొందవలసిన దానిని అనుమానముచేత ఊహించకూడదు అన్నాను. ఇప్పుడు ఆగమమును ముందుంచుకొని మరలా అనుమానమును ఒడ్డుతున్నారు. భలే , భగవతి చెప్పిన ఆ సూత్రము దేశకాలముల చేత వ్యాకృతమైనది ( వేరు పరచబడినది ) అలాగ వ్యాకృతమైన సూత్రుడే వాయువు. ఆ వాయువు దేశకాలములను మీరిన అవ్యాకృతమైన ఆకాశములో ఓతప్రోతమైపోయి ఉండును. తృప్తియైనదా ? " 

          గార్గి , భగవానులు తన ప్రశ్నకు తగ్గ ఉత్తరమును చెప్పినారని సంతోషపడినది. దానితో పాటూ , తాను అతి ప్రయాసతో సిద్ధము చేసుకున్న ప్రశ్న తాను నిరీక్షించినట్లు కాకుండా  విఫలమైనదే అని ఆమెకు దుఃఖమూ కలిగింది. అయినా ఆ దుఃఖమును సంతోషము మించిపోగా , ముక్త కంఠముతో అన్నది :

         " భగవానులకు నమస్కారము. దుస్సాధ్యమైన ఈ ప్రశ్నకు ఇంత సరళముగా ఉత్తరము చెప్పిన తమకు ఇంకా ఒకసారి నమస్కారము. అయితే , భగవానులు దీనికన్నా కఠినమైన మరొక ప్రశ్నకు సిద్ధము కావలెను. "

         భగవానులు ఆమె నమస్కారమును యథోచితముగా సహజమే అన్నట్లు స్వీకరించి , అన్నారు : " కావచ్చును. మేము ఎప్పుడూ సిద్ధమే " 

         గార్గి అన్నది, " సూత్రమైన వాయువు ఆకాశములో ఓతప్రోతమైపోయి ఉండును అన్నారు. ఆ ఆకాశము దేనిలో ఓతప్రోతమైపోయి ఉండును ? "

          భగవానులు ఆ ప్రశ్నను విని సంతోష భరితులైనారు. " భగవతి అసాధ్యురాలు మరియు లౌకికురాలు అనుదానిని ఈ ప్రశ్న ప్రకటముగా చెప్పుచున్నది. ఈ ప్రశ్నకు మేము అది అవాచ్యము అని ఊరకే ఉండవలెను. లేదా , ఏదైనా ఉత్తరమును చెప్పవలెను. ఉత్తరము చెప్పకుంటే చెప్పలేదని బంధనము. చెప్పబోతే అవాచ్యమును వాక్కులో చెప్పుటకు ప్రయత్నించినారని బంధనము. ఇలాగ రెండు విధములు గానూ మాకు ఓటమి కలుగవలెనని ప్రశ్నను వేసిన భగవతీ , ఈ రెండు దోషములకూ దొరకకుండా తమకు ఉత్తరము ఇచ్చెదను ....సిద్ధము కండి . "

          సభవారందరూ ఆ ప్రశ్న , దాని నిర్వచనములను విని ఆశ్చర్య చకితులై ఆవాక్కైపోయినారు. నోటితో ఎవరూ అనకపోయిననూ , అందరూ మనసులో , ’ ప్రశ్నంటే ఇలాగ ఉండవలెను , భలే! భలే! ’ అని మెచ్చుకున్నారు. దానికన్నా ఎక్కువగా దానిలోనున్న గాంభీర్యమునూ , ఉభయతో వ్యాఘాతమునూ కనుక్కొని , దానికీ ఉత్తరమును చెప్పుటకు సిద్ధమైన భగవానులను చూచి , " ఈతడు మానవ మాత్రుడు కాడు " అని ప్రతి ఒక్కరి మనసూ ప్రశంసించింది. విద్యా ప్రాశస్త్యమునకు పేరైన కురు పాంచాల దేశపు వారు భయపడిపోయినారు. విదగ్ధుడు కూడా , ’ ఏమి ? ఇతడు మాకు కూడా అసాధ్యుడా ? " అనుకున్నాడు. అందరూ ఉత్తరమును వినవలెనని జాగృతులై, సావధానులై సువ్యవస్థితులై కుతూహలముతో కూర్చున్నారు. మైత్రేయిని కాత్యాయని , ’ అక్కా! గార్గి గారి ముఖమును చూడు! ఎంత ఎర్రబడిందో! ’ అని లాగుచున్ననూ గమనింపక , మైత్రేయి నోరు వెళ్లబెట్టి భగవానుల ముఖమును చూస్తూ కూర్చుంది. 

          భగవానులు నిశ్శబ్దమైన సభ యొక్క మౌనపు ముద్దను పగల గొట్టునట్లు అన్నారు: " భగవతీ , ఆకాశము దేనిలో కలసిపోయి ఉన్నదో , దానిని బ్రహ్మజ్ఞానమున్న బ్రాహ్మణులు అక్షరము అంటారు. ఈ మూర్ఖ ప్రపంచములో గుణములు అని పిలవబడే ఏది కూడా దానికి అన్వయించుటకు లేదు కాబట్టి దానిని నిర్గుణమందురు. అది అన్నము కాదు , అన్నాదుడు కాదు, అయినా అది లేదనుటకు లేదు. ఎందుకంటే గార్గీ , దాని ప్రశాసనములోనే ఈ సూర్య చంద్ర ద్యావా పృథ్వులూ , నిమేషాదిగా సంవత్సరాంతమైన కాలమూ ఉన్నవి. నది , గట్ల మధ్య ప్రవహించునది ఆ అక్షరము పాలించుట వలననే!  అంతేనా ? సర్వమూ యథా స్థానములలో నున్నది దాని బలము తోనే ! గార్గీ , దీనిని తెలియకుండా చేసిన కర్మలన్నీ సాంతములు. ఇది తెలియని వాడు కృపణుడు( కుత్సితుడు ). ఇది తెలిసినవాడు బ్రాహ్మణుడు. ఇదిలేకుంటే ఇంకేదీ లేదు. ఉన్నదంతా ఇదొకటే! అంతటి అక్షరములో ఆకాశము ఓతప్రోతమైపోయి ఉంటుంది. "

          గార్గి ఇది విని మిక్కిలిగా సంతోషించినది. " భగవానులకు నమస్కారము. నమస్కారము. భగవత్స్వరూపమైన బ్రాహ్మణులారా , వీరు మీ నమస్కారములను పరిగ్రహించి వదిలేస్తే అదే మీ అదృష్టము. బ్రహ్మవాదములో ఈతడిని గెలిచెదను అనునది కలలోని మాట" అని మరలా భగవానులకు నమస్కారము చేసి వెనక్కుతిరిగి వెళ్ళి కూర్చున్నది. 

Sunday, April 7, 2013

70. " మహాదర్శనము " --డెబ్భైయవ భాగము--కర్మ-బ్రహ్మ వాదులు


70. డెబ్భైయవ భాగము -- కర్మ-బ్రహ్మ వాదులు


         ఆర్తభాగుడు అలాగ వెళ్ళిపోవుటను చూచి సభ ఆక్రోశము చెందినది. " అతడు లేచినపుడు ఏమి ఠీవి ? ఏమి అట్టహాసము ? అంతటివాడు అడగకూడని ప్రశ్నను అడిగి చివరికి ఎవరిని విరోధించుటకు వెళ్ళినాడో వారినుండే రక్షణ తీసుకొని ఉండిపోవలసి వచ్చెను. ఇటువంటివాడు వారిపైన ఎందుకు పడవలసినది ? " అని మాట్లాడుకున్నది. భగవానులు ఏమీకానట్లే నిర్విషణ్ణులై కూర్చున్నారు. 

        కాశీ విద్వాంసులు కూర్చున్న వైపు గుసగుసలు మొదలైనాయి. ఒకడన్నాడు : " భుజ్యూ , నువ్వు గంధర్వుల నుండీ విద్యను పొందినవాడవు. వెళ్ళు , అయితే అడగకూడనివి అడగవద్దు. చూడు , దీనిలో ఓడిపోయిననూ నీ పేరు శాశ్వతమగును. లే మరి ? " 

భుజ్యుడు సిద్ధమైనాడు. లేచి వేదికవైపుకు వెళ్ళినాడు. 

" ఇతడెవరు ? "

" మంచిది , ఇతడిని చూడలేదా ? భుజ్యుడు. ఆ పరమ విద్వాంసులు లహ్యులు ఉన్నారు కదా ? వారి మనవడే ఇతడు. "

భుజ్యుడు వేదిక పైకి ఎక్కి భగవానుల ఎదురుగా కూర్చున్నాడు. ప్రశ్నోత్తరములు ఆరంభమయినవి. 

         " యాజ్ఞవల్క్యా ! మేము విద్యార్థులై మద్ర దేశములోనున్న కాప్య గోత్రులైన పతంజలుడి ఇంటికి వచ్చినాము. అక్కడ అతని కూతురును గంధర్వుడు  పూనుటను గురించి అతనితో మాట్లాడుతూ , పరీక్షితులు ఎక్కడికి వెళ్ళినారు అని అడిగినాము. అదే ప్రశ్నను మిమ్మల్ని అడుగుతున్నాను. పరీక్షితులు ఎక్కడికి వెళ్ళినారు ? "

" పరీక్షితులు అశ్వమేధయాజులు ఉన్నచోటికి వెళ్ళినారు. "

" అశ్వమేధయాజులు ఎక్కడున్నారు ? "

        " భుజ్యూ , సూర్యుడి రథము ఒక దినమునకు ఎంత దూరము వెళ్లునో దానికి ముప్పై రెండు రెట్లు ఈ లోకము. ఈ లోకమును దీనికి రెట్టింపు ఉన్న భూమి చుట్టియున్నది. దానిని ,  దానికి రెట్టింపు ఉన్న సముద్రము ఆవరించి యున్నది. అక్కడే బ్రహ్మాండపు కొన. అక్కడ కత్తిమొన అంత ఒక చిన్న రంధ్రమున్నది. దానినుండి బయటకు వాయువు పరచుకొని యున్నది. అశ్వమేధపు అగ్ని , సుపర్ణుడై అశ్వమేధ యాజులను, మీరు చెప్పిన పరీక్షితులనూ తనలో ఉంచుకొని తీసుకొని వెళ్ళి ఆ వాయువుకు ఇచ్చును. ఆతడు వారిని తనలో ఉంచుకొని తీసుకొని వెళ్ళి పూర్వపు అశ్వమేధ యాజులున్న బ్రహ్మలోకమును చేర్చును. "

       భుజ్యుడు ఆశ్చర్యపడుతూ , " ఔను , నిజము. మీరు చెప్పినది సరిగ్గా ఉంది. గంధర్వుడు కూడా ఇలాగే చెప్పినాడు " అని చేతులు జోడించి, ఆసనము నుండీ లేచి వేదిక నుండీ దిగి వెళ్ళి కూర్చున్నాడు. 

        ఇక్కడ కాత్యాయని మైత్రేయితో , " అక్కా , భుజ్యులు ఒకటి మరచినారు. వారు గంధర్వుడి అనుగ్రహము పొంది ఉంటే , వీరు ఆదిత్యుని అనుగ్రహమును పొందినవారు  అన్నది వారు మరచినారు " అన్నది. మైత్రేయి,  " వారి స్థానములో నువ్వు ఉంటే , ప్రతిపక్షము వారు మిగిలేవారు కాదు , కదా ? " అని భుజమును తట్టి నవ్వింది. 

       అంతలో మరలా గుసగుసలయినాయి . ఉషస్తుడు లేచినాడు. సభకు నమస్కారము చేసి , దిట్టముగా నడచుకొని వచ్చి వేదికను ఎక్కి , భగవానుల ఎదురుగా కూర్చున్నాడు. ఆ ఠీవి మనోహరముగా నుండినది. ఉషస్తునికి భగవానులను ఓడించెదనను పట్టుదల గానీ , వారికి ఓడిపోతానని భయముగానీ లేవు. సములను సములు చూచినపుడు ఉన్న సమభావమే ఉండినది. 

అతడు వినయముతో అడిగినాడు: " యాజ్ఞవల్క్యుల వారూ , నేను ప్రశ్నను అడగవచ్చునా ? " 

       భగవానులు ముఖమును చూచి , " మీరు చక్రాయణుల పుత్రులు ఉషస్తులు కదా ? బ్రహ్మ విద్యా సంపత్తుకు పేరెన్నిక గన్న వంశపువారు. అనుష్ఠానమునకు ప్రఖ్యాతులైనవారు. తప్పకుండా అడగండి. "

" సంతోషము , ఏది సాక్షాత్తయి ఉండి , అపరోక్షమై ఉంటుందో , ఆ సర్వాంతస్థమైన బ్రహ్మమును గూర్చి నాకు చెప్పండి. " 

       " మాకు ఇష్టమైన విషయమునే అడిగినారు. దానికి వందనములు. ఉషస్థుల వారూ , చూచే మన ఇంద్రియములు బయటి ముఖమైనవి. ఇంద్రియములకూ , దృశ్యములకూ ఉన్న సంబంధము తప్పితే ,( అనగా , ఇంద్రియములు బహిర్ముఖములగుట తప్పి అంతర్ముఖములయితే )  అప్పుడు ఆత్ముడు సాక్షాత్తుగా కనిపించును. దేనిని సుఖమనుకొని కోరి కోరి దానిచుట్టూ లోకము తిరుగునో , ఆ సుఖమంతటికన్నా ఎక్కువ సుఖమని , అన్నిటికీ కారణమైనదని , అన్నిటికన్నా గొప్పది యని అపరోక్షమైనది.. అది అన్నిటిలోనూ ఉన్ననూ , చూచువాడికి వాడి వాడి ఆత్మగా కనిపిస్తుంది. కాబట్టి , సర్వాంతస్థుడైన ఆత్ముడు ఇంకెవరూ కాదు , అడుగుతున్న మీరే! " 

        ఉషస్తుడు గంభీరుడైనాడు. తాను ఏదో అడిగితే ఏమేమో ఉత్తరము వచ్చినట్లు, అసంతృప్తిని చూపించు ముఖముద్ర ఉన్నవాడైనాడు. మరలా అదే ప్రశ్నను అడిగినాడు , " సర్వాంతస్థుడైన ఆత్ముడు ఎవరు ? " భగవానులు చెప్పుటకు ఆరంభించినారు:

         భగవానులు ఎదుటివాడి యొక్క ఉద్దేశమును సులభముగా అర్థము చేసుకున్నారు. తల ఆడిస్తూ అన్నారు : " అటులనా ? అయితే వినండి ఆత్మ అంటే ఈ శరీరము కావలెను , లేదా ఆత్మ అంటే కార్య కరణ సంఘాతమైన లింగము, కావలెను , లేదా ఆత్మ అంటే ఈ రెండింటీలో నున్న ఇంకొకడు కావలెను.. శరీరము సర్వాంతస్థము కాదు , కాబట్టి ఆత్మ కాదు. ఎందుకంటే శరీరము కార్య కరణ సంఘాతమైన ప్రాణము చేత ఎన్నుకోబడుతుంది. లింగము కూడా ఆత్మ కాదు. ఎందుకంటే , అదీ కరణమే! పంచాత్మకమై , ఈ భూత సంఘాతమైన దేహమును ఆడించుచున్న ఆ పంచప్రాణముల క్రియను చేయించు వాడతడు. కాబట్టి , ఈ కార్యము లన్నిటికీ కారణుడైన , ఈ కరణముల నన్నిటినీ ఆడించుచున్న, ఆ చేతనాచేతనుడు ఉంటాడే , వాడు సర్వాంతస్థుడు. "

        ఉషస్తుడు ముఖము గంటు పెట్టుకున్నాడు. అసంతృప్తి ఆవరించుకుంది. అరిచినాడు , " యాజ్ఞవల్క్యా , ఇది మోసము. ’ కొమ్ములు పట్టి తెచ్చి ఇది  ఎద్దు అని చూపిస్తాను ’ అన్నవాడు , దానిని ప్రత్యక్షముగా తెచ్చి ఇవ్వక ,  నడిచేది ఎద్దు , పరుగెత్తేది గుర్రము , మొదలుగా చెప్పినట్లాయెను. మీరు తీసుకున్నది బ్రహ్మిష్ఠతముడికి అట్టిపెట్టిన గోధనము. బ్రహ్మమును అడిగితే , ఇప్పుడు సాక్షాత్తుగా చూపించకుండా , ఇలాగ వేరే వేరే గుర్తులతో ఆనవాలు చెపుతున్నారా ? "

         భగవానులు మందహాసమును వదలకనే అన్నారు : " బ్రహ్మజ్ఞులకు ఈ విక్షోభము తగనిది. బ్రహ్మమనునది ఆకారము లేనిది. ఇంద్రియములు దానిని చూడలేవు. ఇటువంటిదానిని ఇంద్రియ గోచరము చేయుట ఉన్నదా ? సువర్ణాలు పదివేలు అంటే చూడవచ్చు. అర్బుదము అంటే ఊహించవచ్చు. అసంఖ్యాకమంటే , ఏ ఇంద్రియముతో దానిని సాక్షాత్కరించుకునేది ? చూపులోనూ ఉండి , చూపులకు చిక్కని దాన్నెలా చూచేది ? చూపించేది ? కాబట్టి ప్రతిజ్ఞా హాని మాకు లేదు. అసాధ్యమైనదానిని చూపించమని అన్న మీలోనే ప్రతిజ్ఞాహాని ఉన్నది. దాన్ని ( ఆత్మను ) వాక్కు , మనసు కూడా ముట్టలేదు. అనుభవించి మాత్రమే తెలుసుకో వలసిన దానిని మాటలతో తెలుసుకొనుట సాధ్యమా ? మాటలకు అందని దానిని వర్ణించుటకు పోతే , మాట నిలచిపోదా ? మనసుకు అందని దానిని మననము చేసుకోబోతే అన్యమనస్కమవదా ? ఔనా , కాదా ? చెప్పండి "

        ఉషస్తుడు ఏమో చెప్పబోయాడు. మాట పెగల లేదు. బెదిరినాడు. లేచి నమస్కారము చేసినాడు. నాలుక పలికింది. ’ తప్పయింది. ఖండించి నందుకు క్షమించవలెను. తమరు చెప్పినదే సరైనది " అని ప్రతివచనమును నిరీక్షించకయే వెళ్ళిపోయినాడు.  

         అనంతరము కౌషీతకేయ కహోళుడు సభనుంచీ వచ్చి ఆసనములో కూర్చున్నాడు. ఆతని ముఖ ముద్రను చూడగా, ఆ మంటపములో తానూ , భగవానులూ తప్ప ఇంకెవరూ లేరనుకున్నట్టే కనిపించు చుండినది. అతడు గోధనము , బ్రహ్మిష్ఠతముడు మొదలైనవి అంత ప్రధానముగా ఎన్నడూ చూచినట్లు లేదు. అతనికి తన జీవితములో ఇంతటి సమయము వస్తుందా అని కాచుకున్నట్లు , అంతటి యోగము కలసి వచ్చినట్లు , దానిని తాను ఉపయోగించు కోకుండా వదిలితే మరలా అది లభ్యమేకాదు అన్న దిగులున్నట్లు తోచుచున్నది. అయినా గురుశిష్య భావమున్నట్లే కనపడదు. ఆసనములో కూర్చొని అతడు ఏదో మరచినదానిని జ్ఞాపకము తెచ్చుకుంటున్న వాడివలె , అథవా అనేకమైన విషయాలను ఎదురుగా ఉంచుకొని యేది సరియైనది అని ఎంచుకొనుటకు ఒక్కొక్కదానినీ తీసుకొని పరీక్షిస్తున్న వాడివలె  ఒక ఘడియ నేలను చూస్తూ కూర్చున్నాడు. సభ నీరవమై , అతని నోటినుండీ ఏమి వస్తుందో అని కాచుకున్నది. 

        ఆ సమయమును చూసి కాత్యాయని మైత్రేయిని మోచేతితో పొడిచి , ’ చూడు ’ అన్నది. మైత్రేయి, కాత్యాయని చూపించిన చోట చూస్తే , గార్గి , పైకి లేచునపుడు చేయునట్లే చీర చెరగును , ఉత్తరీయమును సవరించుకుంటున్నది. భగవానుల వైపు సూటిగా చూస్తున్నది. చూడబోతే ఆమె కూడా భగవానులను ప్రశ్నించుటకు సిద్ధమగునట్లున్నది. 

      అది చూచి మైత్రేయి చిన్నగొంతుతో , కాత్యాయనితో అన్నది , " చెల్లీ , ఇవన్నీ మేఘాలు. వారు పర్వతము వంటి వారు. గాలికి సాగిపోయే ఈ మేఘాలు ఆ పర్వతమును ఏమి చేయగలవు ? పాపం ! " అన్నది. 

కాత్యాయనికి ఆ అభిమానపు మాట ఎంతో ముచ్చటగా అనిపించినది. ఏమో చెప్పబోయింది , అంతలో కహోళుడు మాట్లాడినాడు. 

" యాజ్ఞవల్క్యా , పెద్ద మనసు చేసి మరలా అదే ప్రశ్నకు ఉత్తరము నివ్వవలెను. " 

" అనగా ? "

"సాక్షాత్తుగా, అపరోక్షముగా , సర్వాంతస్థముగా ఉన్న బ్రహ్మవిచారమును గురించి చెప్పవలెను. "

         " మంచిది , చెపుతాను , దానికేమి ? శరీర ధర్మములూ , ప్రాణ ధర్మములూ , మనోధర్మములూ ఆ ఆత్మను ముట్టలేవు. ఆతడు వీటి నుండీ దూరము. శరీర ధర్మములు జరామరణములు. ఆత్ముడు అజరుడు. అమరుడు. జరామరణములు  ఏమైననూ శరీరమును , అంటే , వేరొకదాని కార్యమై , ఇంకొకదాని కరణమై యున్న శరీరమును పట్టుకోగలవే తప్ప ఆ శరీరి యొక్క ఆత్మను అంటుకోలేవు. ఇక ఈ శరీరము లోపల ఉండి శరీరమును స్వేఛ్చగా ఆడిస్తున్న  ప్రాణపు ధర్మములు క్షుత్పిపాసలు. అవి కూడా ఆత్మను ముట్టలేవు ప్రాణము ఆత్మ యొక్క నీడ. ప్రాణము కార్యము కూడా మరియూ కరణము కూడా!. అవి రెండూ కాని ఆత్మను అవి రెండూ అయిన ప్రాణపు ధర్మములు ఎలా ముట్టగలవు ? ప్రాణము వలెనే శరీరములో ఉండి ఇంద్రియముల చలనమును ప్రేరేపించు మనస్సు యొక్క ధర్మములు శోక మోహములు. శోకమే కామము. మోహమే అజ్ఞానము. గడ్డి అగ్నిని ముట్టి ఎలాగ బ్రతకలేదో , అలాగే కామము అకామమైన ఆత్మను ముట్టి బతుకలేదు. కామకామములూ , లుప్తకామమమైన ఆత్మను ముట్టి ఎలా బతకగలవు ? అలాగే , అజ్ఞానము కూడా , జ్ఞానమే తానైన ఆత్మను ఎటుల చేరగలదు ? తెలిసిందా ? "

" తెలిసింది. శరీర ధర్మము , ప్రాణ ధర్మము, మనో ధర్మములకు బయట, వాటికి అందకుండా ఉండువాడు ఆత్ముడు. "

         " ఆ ఆత్ముడు మీరు చెప్పిన సర్వాంతస్థుడు. ఎందుకంటే అది నిత్యమై అంతటా ఉండుట చేత, ఒకసారి చూచినవాడు మరచిపోలేక , దానినే సర్వదా సర్వత్రా చూచుట వలన సాక్షాత్తుగా , అణువుకే అణువైననూ మహత్తు కన్నా మహత్తై ఉన్నందువలన అపరోక్షమైన అదే అందరిలోనూ ఉండి అన్నిటినీ ఆడిస్తున్నందు వలన దానిని తెలుసుకుంటే ఫలమేమి ? తెలుసా ? "

" తమరే చెప్పవలెను "

          " దానిని తెలిసినవాడు ఆ తెలిసినదే బలమని నిశ్చింతగా ఉంటాడు. వాడికి అది తప్ప ఇంకేదీ అవసరము లేదు. పుత్రాదుల వైపుకు కూడా వాడి మనసు లాగబడదు. లాగబడే తత్త్వమే అతనికి ఉండదు. అతడు తన అవగాహన , దానివలన కలుగు బలము వలన మౌనియగును. మౌని యైనవాడు తాను మౌని యైనంతసేపూ తాను అదే అయినాను అనునది చూచి బ్రాహ్మణుడై కృతకృత్యుడగును. ఆ మహా దర్శనము ఒక్కటి తప్ప  మిగిలినవన్నీ నశించునవే. "

" పరమోపకారమయినది "

కహోళుడు వేరేమీ మాట్లాడకుండా లేచి , భగవానులకు నమస్కారము చేసి వెళ్ళినాడు. 

      అనంతరము గార్గి లేచినది. అందరూ వేదికపైకి వెళ్లండి అన్ననూ ఆమె ఒప్పుకోలేదు. గార్గి , "  భగవానులు ప్రసన్నులై నా ప్రశ్నకు ఉత్తరమును అనుగ్రహించవలెను. " అన్నది. 

        భగవానులు నవ్వుచూ , " ఔను, భగవతి అడుగు ప్రశ్న అటువంటిది. దానికి రక్ష కానే కావలెను. కాబట్టి మొదటే కోటను కట్టి కాపాలా కూడా ఉంచుకొని బయలుదేరినారు. అనుజ్ఞ ఇవ్వండి " అన్నాడు. 

        గార్గి అడిగినది  , " ఈ పృథ్విలోనున్న సర్వమూ జలములో పరచుకొని చేరి ఓతప్రోతమై ( కలగలసి ) యుండును. ఆ జలము దేనిలో అలాగ పరచుకొని చేరి ఓతప్రోతమై యుండును ? "

         " భలే , భలే , భగవతి వారి ప్రశ్న యొక్క జాతి బాగుంది. పరంపరగా పెంచవచ్చు. అయితే భగవతీ , నిష్ఠతో (ఆధారములు చూసి )  తెలుసుకోవలసిన దానిని యుక్తితో, అనుమానముతో ( ఊహతో ) తెలుసుకుంటే , తెలిసినది యని సంతృప్తి కలగ వచ్చును, కానీ అది చిత్రాగ్ని. అది గుర్తుండనీ. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు ఉత్తరము చూద్దాము. ఈ పృథ్వి , జల , అగ్ని , వాయు , ఆకాశములు ఒకదానితో ఒకటి చేరి లోకలోకములనూ ఏర్పరచును. అవి , జలము వాయువులో , వాయువు అంతరిక్షములో ,  ఆ అంతరిక్షము  గంధర్వ లోకములో , అది ( గంధర్వ లోకము ) ఆదిత్య లోకములో , అది చంద్రలోకములో , అది నక్షత్ర లోకములో , అది దేవలోకములలో , అది ఇంద్రలోకములలో  , అది ప్రజాపతి లోకములలో , అవి బ్రహ్మ లోకములలో  అల్లిబిల్లిగా ఓతప్రోతమైపోయి ఉంటాయి. సంతోషమయినదా ? "

" బ్రహ్మ లోకములు దేనిలో అల్లుకొని ఓతప్రోతమైపోయి ఉంటాయి ? "

          " దానికి ముందర అడగ వద్దు. గార్గి , ఆ బ్రహ్మలోకములలో బ్రహ్మాండములను నిర్మించు భూతములు ఉన్నాయి. భూతములు ఉన్నంతవరకూ జ్ఞానము బాహ్యము. జ్ఞానము భూతములను దాటిననూ అంతటా నిండిపోదు. అప్పుడు  విషయమును తెలుసుకొనుట ఆగమము వలన. అనుమానము వలన కాదు. కాబట్టి ఆగమమును వదలి , అనుమాన ప్రధానముగా వెళితే , విషమును అన్నమని తిన్నట్టగును. వదిలివేయండి. "

గార్గి అది విని, విధేయురాల వలె చేతులు జోడించి , తన చోటుకి వచ్చింది.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                 

69 ." మహాదర్శనము "--అరవై తొమ్మిదవ భాగము-- అతి ప్రశ్నల ఫలము


69.  అరవై తొమ్మిదవ భాగము--  అతి ప్రశ్నల ఫలము

         మరుసటి దినము దేవరాతుని ఇంటికి రాజభవనము నుండీ రెండు పల్లకీలు వచ్చినాయి. ఒకటి ఆచార్య దంపతులకు , ఇంకొకటి భగవానుల దంపతులకు. వాటిని తెచ్చిన రాజపురుషులు భగవానులకు తెలియజేసినారు , " గోవులన్నీ నిన్ననే ఆశ్రమమునకు వెళ్ళిపోయినవి. అక్కడ ఈ దినము నుండీ కొట్టములు , పాకలు , ధాన్యములు , గడ్డి , గోదాములు , గాదెలు , మనుషులు , వారికి ఇళ్ళు , పశువులకు తాగునీటి భావులు అన్నీ చేయుటకు ప్రయత్నములు మొదలైనవి. 

భగవానులు కాత్యాయనిని పిలచి అన్నారు : " చూడు , నీ ఇఛ్చ ప్రకారము వేయి గోవులను దేవతలు ఇచ్చినారు. ఇంకేమి చేస్తావో చెయ్యి. " 

      ఆమె నవ్వుతూ అన్నది , " ఔను , మనము దైవ ద్రవ్యము వారము. మనకు దేవతలు ఇస్తే ఉంటాయి , లేకుంటే లేదు. సరే , ఇప్పుడు మీరు చెప్పేది నన్ను అక్కడికి వెళ్ళి వాటిని చూచుకొమ్మనా ? "

         భగవానులు ఆమె ప్రశ్నలో నున్న భావము తెలిసి నవ్వివారు: " ఇప్పుడు నిన్ను వెళ్ళమనుటకు అవుతుందా ? ఇక్కడ విద్వత్సభలో జరుగునదంతా నువ్వు చూడకపోతే ఎలాగు ? అలాగని , ఆశ్రమమునకు వచ్చిన గోవుల యోగక్షేమములను చూచుకొనుటకు నువ్వుకాక శక్తులు వేరెవ్వరు ? నీకు మంచి ధర్మ సంకటమే ప్రాప్తమయినది కదా ? " 

        " ధర్మ సంకటమేమీ లేదు. దేవతలు ఇచ్చిన ఈ వరము వలన నాకు ఏ విధమైన ఇబ్బందీ , ఆటంకమూ ఉండకూడదని ముందరే మాట అయినది. కాబట్టి రాజపురుషులే ఈ సభ ముగియువరకూ చూచుకొనునట్లు విధాయకము చేస్తే సరిపోతుంది. " 

" అలాగా ? ఉండవే , రాజపురుషులను అడుగుదాము"

     రాజపురుషుడు మరలా తెలియజేసినాడు: " కొట్టములు కట్టి వాటిలో పశువులను కట్టివేయు వరకూ అంతా మా బాధ్యత. వాటిని సరియైన స్థలములో కట్టిన తరువాత తమరి బాధ్యత. అలాగని , అప్పుడే అనుజ్ఞ అయినది. "

       కాత్యాయని సంతుష్టురాలై భగవానుల ముఖమును చూచినది. వారు, " నువ్వు బుద్ధిమంతురాలివి. దేవతలకు నీ స్వరూపము బాగా తెలుసు. కాబట్టి నీ ఇష్ట ప్రకారమే అంతా చేసినారు కదా ? "

" అదీ మీ కృపయే , ఇదీ మీ కృపయే " 

      అందరూ జ్ఞాన మంటపమునకు సకాలములో వచ్చినారు. రాజువచ్చి వందనము చేసి , " ఈ దినము మీరు కూర్చొని మాట్లాడవలెను. పృఛ్చకులు కూడా ఎదురుబదురుగా కూర్చొనే మాట్లాడుతారు " అని విజ్ఞాపన చేసినారు. 

       భగవానులు అన్నారు , " నిన్ననే నాకు అనిపించినది. శాస్త్ర విచారములో మాట్లాడునపుడు నిలుచుకొని మాట్లాడుట శ్రేయస్కరము కాదు. అయితే , నిన్నటి సందర్భములో దానిని నేనుగా నొక్కి చెప్పరాదు అని ఊరకున్నాను. ఈదినము మీరు చేసిన విధానము ఉచితముగా నున్నది, అటులనే " అన్నారు. 

        సభ ఆరంభమగుచుండగనే భగవానులు వేదికను ఎక్కివచ్చి ఒక ఆసనములో కూర్చున్నారు. సభనుండీ ఆర్తభాగుడు వచ్చి రెండో ఆసనములో కూర్చున్నాడు. ప్రశ్నోత్తరములు ఆరంభమయినవి. ఆర్తభాగుడు అడిగినాడు : " యాజ్ఞవల్క్యా , నేను ప్రశ్నలను అడుగవచ్చునా ? "

      " మీరు ప్రసిద్ధమైన జరత్కారు వంశపు వారు. ఋతభాగుల పుత్రులు. మీయంతటి విద్వాంసులు నన్ను ప్రశ్నలు అడుగుటయే ఒక గౌరవము. అటులే కానివ్వండి. సిద్ధముగా ఉన్నాను " 

" మృత్యువంటే ఏమి ? దానిని గెలుచుట అంటే ఏమి ? "

" మృత్యువు ప్రవృత్తి కారణము. ప్రవృత్తిలో ఆసక్తుడు కాకుండా నివృత్తిలో మనసును నిలుపుటయే మృత్యువును గెలుచుట. " 

" విశ్వమంతా బ్రహ్మమే అయినపుడు , విశ్వములో నున్నవారు ఎందుకు ప్రవృత్తిలో ఆసక్తులై ఉంటారు ? "

" ఒక్కొక్క వ్యక్తీ , గ్రహాతిగ్రహములచే నియమితుడై ఉన్నాడు. అందువలన. "

" అలాగయితే , ప్రవృత్తికారణములైన ఆ గ్రహాతిగ్రహములు యేవి ? అవి ఎన్నున్నాయి ? "

         " ఆర్తభాగా , ఆ గ్రహములు ఎనిమిది. వాటిని తమ పట్టులో ఉంచుకొన్న అతి గ్రహములూ ఎనిమిదే. వినండి : ఘ్రాణము ( నాసిక )  , జిహ్వ ( నాలుక )  , చక్షువులు  ( కన్నులు ), శ్రోత్రములు ( చెవులు ), హస్తములు , త్వక్ ( చర్మము ), వాక్కు , మనస్సు అనునవి గ్రహములు. ఇవన్నీ బహిర్ముఖములు ( బాహ్యముగా కనిపించేవి ). కాబట్టి ఇవి గ్రహములు. ఇవి ఎల్లపుడూ మనుష్యుని పట్టి లాగుతూ , బహిర్ముఖుని చేసి ప్రవృత్తి కారణములైనవి. వీటిని అలాగ చేయునట్లు నియమించినవి అతి గ్రహములు. అవీ ఎనిమిది. ఘ్రాణమును గంధము లాగును. జిహ్వను రసము లాగును. ఇటులే చక్షువులను రూపమూ , శ్రోత్రములను శబ్దమూ , హస్తములను కర్మలూ , త్వక్కును స్పర్శ, వాక్కును నాదమూ , మనస్సును కామమూ లాగుచుండును. అందువలననే గంధాదులను ఘ్రాణాదుల చేతనే గ్రహించునది. ఇవన్నీ శరీరములో ఉండి శరీరి( ప్రేతము ) ని ప్రవృత్తి పరుడగునట్లు చేసి , చివరికి తాము మృత్యువు వశమగును. " 

" ఇవన్నీ మృత్యువశమగునంటే , మృత్యువు ఏది ? అది ఎవరి వశమగును ? "

     " ఆర్తభాగా , లోకమంతా అన్నము-అన్నాదుడు అను రెండే భాగములై ఉన్నది. ఇవన్నీ మృత్యువుకు నోటి ముద్దలగునన్నాను కదా ? ఆ మృత్యువే అగ్ని. దానికి అన్నీ అన్నమగును. ఇలాగ , అన్నము- అన్నాదుడు విభాగమును తెలిసినవాడు మృత్యువును గెలుచును. "

" యాజ్ఞవల్క్యా , శరీరము మృత్యు వశమైనపుడు శరీరి( ప్రేతము ) ఏమవుతాడు ? వాడిని వదలి పోవునవి ఏవేవి ? అవి ఏమవుతాయి ? "

      " బాగా అడిగినారు., ఆర్తభాగా ! శ్రద్ధగా వినండి. శరీరము మృత్యు వశమైనపుడు శరీరి( ప్రేతము ) వేరుపడును. నామము ఒక్కటీ తప్ప మిగిలినవన్నీ తాము ఎక్కడెక్కడి నుండీ వచ్చినాయో అక్కడికి తిరిగిపోవును. ఇలాగ వాణి అగ్నిని , ప్రాణము వాయువును , చక్షువులు ఆదిత్యుని , శ్రోత్రములు దిక్కులను , శరీరము పృథివినీ , బుద్ధి ఆకాశమునూ , రోమ కేశములు ఔషధులూ వనస్పతులనూ , రక్త , బల , తేజస్సులు నీటిని , మనసు చంద్రునీ చేరును. " 

" అలాగయితే అప్పుడు ఆ శరీరి( ప్రేతము )కి స్థానమేది ? ఎక్కడుంటాడు ? "

       భగవానులు అదివిని నవ్వేసినారు : " ఆర్తభాగా , ప్రశ్న చాలాబాగుంది. మీరు అడిగిన ప్రశ్నలకన్నిటికీ ఉత్తరమును ఇచ్చుటకే కూర్చున్న నేను , ఈ ప్రశ్నకు ఉత్తరమిస్తే , ఈ సభలోని ఎవరో ఒక్కరైనా శరీరమును వదలవలసి వస్తుంది. అంతటివారు ఎవరు ? వారికి మీరు ఎట్టి రక్షణ నివ్వగలరు ? చెప్పండి. నేనయితే విఘటనాత్మక మయిననూ ఉత్తరము నిచ్చుటకు సిద్ధముగా నున్నాను. " 

      ( అనువాదకుని వివరణ : బ్రహ్మ జ్ఞానులు పాలుపంచుకొనే సదస్సులో యే విషయమైననూ అనుభవ , ప్రయోగ పూర్వకములుగా అనుభవించియో , ప్రదర్శించియో చెప్పినగానీ సార్థకత ఉండదు. కేవలము శాస్త్రపు మాట చెప్పిన అది ఒక సిద్ధాంతమగునే తప్ప ప్రయోగము కాదు. అలాగ ప్రయోగించుటకు ఎవరైనా ఒకరి  శరీరములోని భూతములు వేరై ఆత్మ యేమగునో చూపవలసి వచ్చును. ) 

          ఆర్తభాగుడి కనులు తెరచుకున్నాయి. " నేనెందుకు అడగరాని ఈ ప్రశ్నను అడిగినాను ? " అని అతడికి కంట నీరు వచ్చినది. భగవానులు అది చూచి కరుణావిష్టులై, " ఆర్తభాగా , అయినదేమో అయినది. ఫరవాలేదు. కావలసిన రక్షణను ఇచ్చుటకు నేను సిద్ధముగా ఉండగా మీకు బెదురెందుకు ? " అని ధైర్యము చెప్పి ఉత్తరము నిచ్చినారు :

          " మొదట రక్షణను ఇచ్చెదను. దేవతలు అగ్నిలో శ్రద్ధను హోమము చేసెదరు. దానినుండీ సోమము పుట్టును. ఆ సోమమును పర్జన్యుడను అగ్నిలో హోమము చేస్తే , వానలు వచ్చును. ఆ వానలను పృథివి యను అగ్నిలో హోమము చేస్తే అన్నము సంభవించును. ఆ అన్నమును పురుషుడను అగ్నిలో హోమము చేస్తే రేతస్సు అగును. ఆ రేతస్సును యోషిదగ్నిలో హోమము చేస్తే గర్భమై , అది శిశువగును. దీనిని మనసులో ఉంచుకొని మీ ప్రశ్నకు ఉత్తరమును వినండి. అంతా మరలిపోవు నపుడు శరీరి( ప్రేతము ) తన కర్మమును మాత్రము తీసుకొని చంద్రుని వద్దకు వెళ్ళును. అక్కడినుండీ పుణ్యము ఎక్కువగా ఉంటే పుణ్య శరీరమును, పాపము ఎక్కువ గా ఉంటే పాప శరీరమును పొందును. " 

( అనువాదకుని వివరణ : ఒకవేళ ఎవరైనా అటుల శరీరము నుండీ వేరు పడినచో , తిరిగి శరీరమును పొందు విధానమును తెలుసుకొనుటయే రక్షణ. )

          ఆర్తభాగుడు తానేమైనానో యని మొదట తనను పరీక్షించుకున్నాడు. అంగాంగములన్నీ స్వస్థానములో ఉండుట చూసి సంతుష్ట హృదయుడై, పులి చేతికి చిక్కిన హరిణి పరుగెత్తినట్లే , అక్కడ నుండీ లేచి పరుగెత్తినాడు. రెండు అడుగులు వెళ్ళిన తరువాత భగవానులకు నమస్కారము చేయలేదని గుర్తొచ్చి , వెనక్కు తిరిగి అక్కడి నుండే సాష్టాంగ ప్రణామము చేసి, దుర్దానమును తీసుకున్నవాడిలాగా ఎవరికీ చెప్పకుండా సభనుండీ వెళ్ళిపోయినాడు. 

Saturday, April 6, 2013

68. " మహాదర్శనము -- అరవై ఎనిమిదవ భాగము --ప్రతిఘటన


68.  అరవై ఎనిమిదవ భాగము--  ప్రతిఘటన


          చివరికి విద్వత్సమూహములో కూర్చున్న ఒకడు లేచినాడు. అందరి దృష్టీ అతని మీదే కేంద్రీకృతమైనది. కట్టుకున్న మడి ధోవతి ఆతని హృదయ పరిశుద్ధతను తెలియజేస్తున్నది. చేతికున్న పవిత్రమూ , కప్పుకున్న అజినోత్తరీయమూ ఆతని గురిని ఉద్ఘోషిస్తున్నవి. ముఖము పై తేజస్సు , యజ్ఞేశ్వరుడే ఈ రూపముతో వచ్చినాడా అన్నట్లుంది. చూడగా ,  భగవానులు !! భగవాన్ యాజ్ఞవల్క్యులు. 

         సభను ఆవరించిన మౌనాన్ని పగలగొట్టి , మేఘజాలమును ఛేదించుకొని వచ్చు ఉరుము గర్జన వలె ఆతని గొంతు మ్రోగింది. దూరంగా కూర్చున్న శిష్యుడిని పిలచి , " ఈ గోగణమును మా ఆశ్రమమునకు తోలుకొని వెళ్ళు " అన్నారు. గొంతులో గాంభీర్యము తొణికిస లాడుతుండినది. తానే ఎక్కువ అన్న అహంకారము ఉండలేదు. ఆతని ముఖములో కూడా అంతే! ప్రశాంతత నిండి ఉంది. ఏకాంతములో అగ్నిహోత్రము చేసి , కర్మ సాద్గుణ్యమైనది అను నమ్మికతో నిండిన భావము అక్కడ తానేతానై యున్నది. 

       సభ , భగవానుల ప్రకటనను అన్నివిధములా అంగీకరించినది. అదేమిటో ఏమోగానీ , అంతవరకూ వారిని చూడనివారు కూడా వారి తేజస్సుకు అమ్ముడు బోయినారు. అందరికీ , ఇతడిప్పుడు సర్వజ్ఞ పదవికి అర్హుడు అనిపించినది. అందరూ హర్షముతో చేతులెత్తి చప్పట్లు కొట్టినారు. 

          ఉన్నట్లుండి విద్వత్సభ వైపునుండీ ఆర్భాటమైన ఒక  గర్జన వినపడింది. అందరి దృష్టీ అటువైపు మరలింది. రాజపురోహితుడైన అశ్వలుడు లేచి నిలుచున్నాడు. ముఖము ఎర్రనై ఉంది. అతనికయిన ఆశాభంగము ఆతనికి కోపమును తెప్పించినది అన్నది స్పష్టముగా కనబడు చుండినది. అదీగాక , తాను రాజపురోహితుడనన్న అహంకారము ముఖములో యెత్తి కనబడుతున్నది.  

          ఆతడు భగవానులను మాట్లాడించినాడు. తన మనసును దాచుకోనట్లు,   ఆతని మాటనుండే ఆతని భావము వ్యక్తమగుచుండినది . : " యాజ్ఞవల్క్యులవారూ , ఇప్పుడు తమరాడిన మాట ఏమిటి ? అర్థము చేసుకున్నారా ? ఆ గోగ్రహణముతో మీరు మమ్మెల్లరనూ తిరస్కరించినట్టయింది. తమరే మనందరిలో బ్రహ్మిష్ఠతములు అని చెప్పుకున్నట్టయింది. " 

          భగవానుల ముఖముపై నున్న గంభీరభావము వికసించి మందస్మితమైనది. అటులే సన్నగా నవ్వుచూ , " బ్రహ్మిష్ఠతములైన వారెవరో వారికి మాది కూడా ఒక నమస్కారము. ఇప్పటికి మేము గోవులను ఆకాంక్షించు వారము " అన్నారు. 

          అశ్వలుడు అన్నాడు , " ఆ గోవులు మనలో బ్రహ్మిష్ఠ తములకు కానుక యని మీకు తెలుసు కదా, వాటిని ఆకాంక్షించి వాటిపై అధికారము మీదే యని చెప్పినట్లాయెను.  ఈ కార్యము వలన మాలో ఎవరు కావాలన్నా , తమను ఏమికావాలన్నా అడుగవచ్చును అన్నట్టయింది " 

       " బ్రహ్మవిచారమై ఏమికావాలన్నా అడగవచ్చును. అది ఈనాడు ఈ కార్యము వల్ల మాత్రమే అయినది కాదు, ఎప్పుడు కావాలన్నా అయి ఉండవచ్చును. " 

" అయిన , అడగవచ్చునా ? "

" దానికేమి సందేహము ? "

" అయితే చెప్పండి , అంతా తానే అయి ఉన్న మీ బ్రహ్మకూ , మాకూ వ్యత్యాసము ఏమిటి ? " 

         " మీరు చెప్పినది ఎంతో సరిగా ఉన్నది. అయితే , ఈ బ్రహ్మము ,మాది , మీది అని కాదు. బ్రహ్మము బ్రహ్మది. ఇక , దానికీ మనకూ వ్యత్యాసము అనుకున్నదాని సంగతి. అది  , అనగా ఆ వ్యత్యాసము అవిద్యా కామ కర్మల నుండీ కలిగినది. కాబట్టి , తాను వేరే అనుకొన్న సర్వమూ మృత్యువశమగును. ఆ మృత్యువును దాటినది బ్రహ్మ.  అదగుట ముక్తి. "

" మీమాట ప్రకారము ఇదంతా మృత్యువశము , కదా ? "

" ఔను "

’ అట్లయిన , ఈ యజ్ఞమును చేయు యజమానుడు ముక్తిని పొందుట , అతిముక్తుడగుట ( ముక్తిని మించినవాడగుట )  ఎటుల ? " 

        " యజమానుడు కర్మ ఫలము కావలెనని ఆశిస్తూ ( ఆశించినచో ) మృత్యువశుడగును. అలాగ కాక , అధ్యాత్మమైన ( పరమాత్మ ) తన ప్రాణమే అధిభూతమైన ( పరబ్రహ్మ )  హోతృడు అని తెలిసి చేసినచో  అదే , అధి దైవమై ( దేవతల దైవము )  అగ్ని, యనగాచేసిన కర్మము అధియజ్ఞమగును ( అన్నిటికన్నా గొప్ప యజ్ఞము ).  పరిఛ్చిన్నమైన ( తాము వేరు వేరని భావనతో నున్న )  ఈ సాధనము అప్పుడు  అపరిఛ్ఛినమై ముక్తినిస్తుంది. అదే అతిముక్తి. ." 

" మంచిది , కర్మరూపమైన మృత్యువును దాటుటెట్లో చెప్పితిరి. ఇక కాలరూపమైన మృత్యువును దాటుటెట్లు ? అది చెప్పండి. " 

       " కాలము నియతము , అనియతము అని రెండు రూపములుగా ఉంటుంది. అనియత కాలము అహోరాత్ర స్వరూపమైనది. నియతకాలము తిథి పక్షాది రూపమైనది. మీరు అడిగేది దేనిని ? " 

" రెండూ చెప్పండి "

         " సరే , యజమానుని చక్షువులున్నాయి కదా , అవి అనియత కాలమును చూపించును. దానిని,  అధ్యాత్మ వలన అధిభూతమైన అధ్వర్యుడు , అధి దైవమైన ఆదిత్య రూపముగా భావించుట చేత చేసిన కర్మ అధియజ్ఞమై కాలమను మృత్యువును ,  అనియత స్వరూపమును దాటును. 

       ఇక యజమానుని ప్రాణమున్నది కదా , దానిని,  అధ్యాత్మ వలన అధిభూతము చేసి ఉద్గాతృడిని చేసుకొని అక్కడినుండీ అధిదైవమును చేసి వాయువును చూసిన ,  కర్మము అధియజ్ఞమై కాలపు నియత స్వరూపమైన తిథి పక్షాదులను అతిక్రమించి మృత్యువును దాటును. " 

" సరే , ఇదంతా కర్మ ఫలము వద్దన్న వాడి సంగతి. కర్మఫలమును కావాలనువాడు తన స్వర్గమును ఎటుల పొందును ? "

      " అంతరిక్షము నుండీ !   ఫలము కావాలనునదీ , వద్దన్నదీ మనసు చేత. ఆ మనస్సును యజ్ఞ రక్షకుడైన బ్రహ్మ గా చేసి , చంద్రుని అనుసంధానము చేస్తే , అంతరిక్షము దారి ఇచ్చి , స్వర్గమును చూపించును. "


(  అనువాదకుని వివరణ :  యజమాని ( కర్త ) తాను చేయు ప్రతి యజ్ఞము / కర్మ  లోనూ , తన ప్రాణమును పరమాత్మ యైన పరబ్రహ్మ  ( అనగా అధిభూతము ) గా మార్చి ,  క్రమముగా హోతృడు , అధ్వర్యుడు , ఉద్గాతృడు , బ్రహ్మ ల పాత్రలు వహించి కర్మ చేయవలెను. దీనినే మనకు అర్థమగునట్లు చెప్పవలెనన్న , ఈ హోతృడు , అధ్వర్యుడు , ఉద్గాతృడు , బ్రహ్మ రూపములలో  నలుగురు ఋత్త్విజులు కర్త పరముగా యజ్ఞము చేయుదురు.  వీరు ఒక్కో వేదమునకు ప్రతినిధులుగా యజ్ఞమును పూర్తి చేయుదురు.  యజ్ఞమును కర్మ ఫలము ఆశించి చేస్తే , మృత్యువశుడగును , అనగా , కోరికలు తీరుట వలన మరలా కొత్త కోరికలు పుట్టుచూ , వాటిని తీర్చుకొనుటకై  కర్మ ఫలము వలన జన్మలు ఎత్తుతూ మరణిస్తూ ముక్తికి దూరమగును.  యజ్ఞమును కర్మ ఫలము ఆశించకుండా  చేస్తే అది ’ అధి యజ్ఞమై,’ ముక్తినిచ్చును.  

       ’అధియజ్ఞము ’ చేయుట అనగా, కర్త, తాను హోతృడై తన ప్రాణమును అగ్నితోనూ , అధ్వర్యుడై తన చక్షువులను ఆదిత్యుడితోనూ , ఉద్గాతృడై తన ప్రాణమును వాయువుతోనూ , బ్రహ్మయై తన మనసును చంద్రునితోనూ అనుసంధానము చేయవలెను. 

        దీనినే మనకర్థమగుటకు ఇలాగ చెప్పవచ్చును. అధియజ్ఞముగా చేయుటకు ఒక్కో ఋత్త్విజుడు చేయవలసినది యేమనగా , తన ప్రాణమును పరమాత్మ రూపములైన అగ్ని, వాయు , ఆదిత్యులుగా తెలుసుకొని ( భావించి , ) అనగా ,  ఋగ్వేదమునకు ప్రతినిధిఅయిన  హోతృడు తన ప్రాణమును అగ్ని తోనూ , యజుర్వేదమునకు ప్రతినిధియైన అధ్వర్యుడు తన చక్షువులను ఆదిత్య రూపముతోనూ , సామవేద ప్రతినిధియైన ఉద్గాతృడు తన ప్రాణమును వాయువుతోనూ , బ్రహ్మ స్థానములో నున్నవాడు తన మనసును చంద్రుడితోనూ అనుసంధానమూ చేసి తానే పరమాత్మయన్న భావనతో చేసే యజ్ఞము అధియజ్ఞమగును. ) 


          అశ్వలుడు తబ్బిబ్బైనాడు. బంధకమై , మృత్యురూపమైన కర్మ , కాలములను రెంటినీ దాటుటెలాగో భగవానులు ఎరుగుదురు. అలాగే కర్మ ఫలము ఎలాగ వచ్చును అన్నదీ ఎరుగుదురు. అనగా , శ్రేయస్సు ప్రేయస్సులు రెండింటీనీ తెలిసినవారు. ఇంతటి వాడి దగ్గర తానేమి వాదము చేయగలడు ? సగము తెలిసి సగము తెలియని వాడి దగ్గర వాదము చేసి గెలుచుకోవచ్చును. అన్నీ తెలిసినవాడి దగ్గర వాదమనగానేమి ? పులితో సరసమాడినట్లు కాదా ? వదిలేస్తే చాలుదేవుడా అనిపించినది. ప్రశ్న అడగకుండా ఉండుటకు లేదు  , ఏమి అడగవలెనో తెలియదు. ఇటువంటి దిగ్భ్రాంతిలో ఏదో అడిగివేసినాడు, 

" యజ్ఞములో ఋత్త్విక్కులు ఏమేమి చేయుదురు ? ఆయా కర్మలవలన యజమానునికి ఏయే ఫలములగును ? "

          ఆ ప్రశ్నను అడగగనే అందరికీ అశ్వలుల దిగ్భ్రాంతి తెలిసిపోయింది. భగవానులు నవ్వుతూ అన్నారు, " హోతృడు మూడు జాతుల మంత్రములను ఉపయోగించును, అవి : పురోనువాక్యములు , యాజ్యములు, శస్యములు అనునవి. యజ్ఞానికి ముందు చెప్పు మంత్రాలన్నీ పురోనువాక్యములు. యజ్ఞకాలములో చెప్పు మంత్రములన్నీ యాజ్యములు. యజ్ఞమైన తరువాత చెప్పునవన్నీ శస్యములు. దీనివలన యజమానుడు , ప్రాణము ఎక్కడెక్కడ ఉంటుందో , ఆ లోకముల నన్నిటినీ జయించును. 

         " అధ్వర్యువు మూడు జాతుల ఆహుతులను ఇచ్చును. మంట వలె పైకి లేచునవి  , అతిగా శబ్దము చేయునవి , కిందకు పడునవి. జ్వలించు ఆహుతుల వలన యజమానుడు దేవలోకములను గెలుచును. సశబ్దములైన ఆహుతుల వలన సశబ్దమైన పితృలోకములను గెలుచును. కిందకు పడు ఆహుతులవలన మనుష్యలోకములను గెలుచును. 

         " ఉద్గాతృడు మూడుజాతుల సామములను పాడును. యజ్ఞారంభమునకు ముందువి , యజ్ఞ కాలమునందు పాడునవి , యజ్ఞమైన తరువాత పాడునవి అని. వాటినే అధ్యాత్మముగా చూచినచో, అవి ప్రాణాపాన వ్యానములగును. వాటి వలన మనుష్యలోకము , అంతరిక్షలోకము , ద్యులోకములను గెలుచును. 

        " బ్రహ్మ ,  యజ్ఞమును మనస్సుతో రక్షించును. మనస్సు అనంతమైనది. అనంతము విశ్వే దేవతలను సూచించును. కాబట్టి , విశ్వేదేవతల వలెనే అనంతములైన లోకములను గెలుచును. " 

అశ్వలుడు ఇంకేమీ అడుగుటకు కనపడక , చేతులు జోడించి కూర్చున్నాడు. ఆనాటి సభ అక్కడికే ముగిసింది. 

67. " మహాదర్శనము--అరవై యేడవ భాగము -- జ్ఞాన సత్రము


 67.  అరవై యేడవ భాగము--  జ్ఞాన సత్రము


          జ్యేష్ఠ శుద్ధ సప్తమి వచ్చినది. దానివెనుక ఎనిమిది దినములనుండీ రాజధానిలో ఒకటే కలకలము. కోలాహలము. సంభ్రమము. పదిమంది దేశాధిపతులు వచ్చినారు. ఒక్కొక్కరినీ రాజే స్వయముగా వెళ్ళి మంగళవాద్యాది పరివారములతో పిలుచుకొని వచ్చి ఒక్కొక్క భవనములో దింపినాడు. అటులనే విద్వాంసులు పల్లకీలలోనూ , మేనాలలోనూ శిష్యులతో పాటు వచ్చినారు. వారినందరినీ రాజపురుషులు పిలుచుకొని వెళ్ళి నియమిత స్తలములలో దింపినారు. 

         జ్ఞాన సత్రము ఒక జాతరవలె అయినది. దానిని చూడవలెనని జనాలు మూగుతున్నారు. " మా జన్మలో మనము ఇంతమంది విద్వాంసులను ఒక్కచోటే ఇలాగ చూచుట సాధ్యము కాదు. " అని వచ్చినవారెందరో. " జ్ఞాన సత్రమంటేనేమి , చూడవలెను " అని వచ్చినవారెందరో. అన్నిటికనా ఎక్కువగా , ’ ఇదొక వినోదము, చూడవలెను ’ అని వచ్చినవారు అసంఖ్యాకులు. మొత్తానికి రాజధాని నిండిపోయినది. ఎక్కడ చూచిననూ జనము. ఇళ్ళలో జనము , వీధులలో జనము, చెట్లకిందా జనాలు , బయలు లోనూ జనాలు. ఎక్కడెక్కడ చూచినా జనమే జనము. 

         వెనుకటి రోజే రాజు వెళ్ళి విద్వాంసులలో అగ్రగణ్యులైన వారిని చూసి వచ్చినారు. బ్రహ్మవాదిని యైన గార్గి , శ్రౌతములో ప్రసిద్ధులైన అశ్వలుడూ వెంట ఉన్నారు. శ్రౌతములో ప్రఖ్యాత విద్వాంసులైన ఆర్తభాగుడూ , భుజ్యులూ , బ్రహ్మవాదులైన ఉషస్తుడు , కహోళుడు , ఉద్ధాలకులు , విదగ్ధులనూ చూసి వచ్చినారు. విదగ్ధుడు రాజును అడిగినాడు, " ఏమిటి ? మీరు అప్పుడే మీ సర్వజ్ఞులను వరించినారంట ? "

         రాజు సహజమైన వినయముతో అన్నారు : " అటువంటిదేమీ లేదు. మా రాజ్యములో యాజ్ఞవల్క్యులు కర్మ బ్రహ్మలు రెంటిలోనూ ప్రసిద్ధి చెందిన విద్వాంసులు. అంతేగాక ఆనువంశికముగా వచ్చిన పాండిత్యమున్నవారు. కాబట్టి నేనే వెళ్ళి పిలుచుకొని వచ్చినాను. " 

       విదగ్ధుడు విస్మితుడై అన్నాడు : " దానిలో తప్పేమీ లేదు. చెవి విన్నదానిని నోరు అడిగింది, అంతే! దీనిపైన , విద్వద్బృందపు పరముగా గార్గి ఉన్నారు , మీ వారే అయిన అశ్వలులున్నారు. ఒకవేళ ఇలాగ మీరు సర్వజ్ఞాభిషేకము  ఫలానా వారికి కావలెనని నిర్ణయిస్తే వారు ప్రతిఘటించకుండా ఉంటారా ? "

        గార్గి అన్నది , " లేదు గురువుగారూ , సర్వజ్ఞత్వము మీ ఇద్దరిలో అంటే , మీరు , యాజ్ఞవల్క్యులు ఇద్దరిలో ఒకరికి కట్టి ఉంచబడిన సొత్తు. "

        " ఇది మీ అభిమానముతో చెప్పు మాట. ఆతనికి దేవతా ప్రసాదము చాలా ఉంది. ఆతడే సర్వజ్ఞుడైతే విశేషమేమీ లేదు. దానికై మేము సంకట పడునది కూడా లేదు. ఒక సంహిత , ఒక బ్రాహ్మణము, ఒక ఉపనిషత్తు పొందుట అంటే సామాన్యమా ? కానీ ఇంత అయిననూ మాకు అతడిని ఎదురించుటకు బెదురేమీ లేదు. ఏమి గార్గి , మీరేమంటారు ? మీరు ఆతని వెంట తీర్థయాత్రకు వెళ్ళినవారు. ఆతని విద్యా వైభవమును చూచి మొదటే ఓడిపోయినారా యేమి ? "

’ ఎంతైనా నేను మీ శిష్యురాలిని. ఆతనికి విద్యానుగ్రహము కావలసినంత ఉన్నదని ఒప్పుకున్ననూ , సమయము వస్తే నేను కూడా ఎదుర్కోవచ్చును. " 

        " భలే! భలే! చూడండి , ఎంతచెప్పినా , మానుషము రజోగుణ స్థానము. సమయము వచ్చినపుడు గర్జించుటయే స్వభావము. వశవర్తిని యైన భార్య కూడా ఒక్కొక్కసారి ఎదురు తిరగదా ? అందులోనూ మేము విద్వాంసులమని అహంకారము. మేము ప్రతిఘటించకుండా ఉంటే అదొక అవమానము. విద్యాదేవికి అది ద్రోహము చేసి నట్లగునని శంక. ఇవన్నీ చేరి మమ్ములను ప్రతిఘటించు నట్లు చేస్తాయి. అయితే , మా అభిమానము రాగ ద్వేషముల పట్టుకు చిక్కి , దురభిమానులమైతే మేమే చెడిపోతాము. అది సరే , పాండిత్య కిరీటమును అందరూ చూచినారా ? " 

         రాజు అన్నాడు: " పాండిత్య కిరీటము శారదా మంటపములో అందరికీ కనబడునట్లు ఉంచబడినది. అయితే అదేమీ గొప్పది కాదు. కానీ ఆ గోధనమును చూస్తే ఎంతటి అపరిగ్రాహికి అయినను మనసు లాగుతుంది. వివరాలన్నీ నేనే చెప్పరాదు. కాబట్టి అనుజ్ఞ అయితే అశ్వలులు చెప్పెదరు " 

         " చెప్పండి అశ్వలులవారూ! మీ భాషణము విని చాలా దినములయినది. పైగా , మీరేమి , సామాన్యులా ? తెచ్చుకుంటే వరము , ఇచ్చుకుంటే శాపము అనునట్టి విద్వద్వరేణ్యులు. ఏమి చేయుట ? మా అందరి దురదృష్టము. మీరు బ్రహ్మవిద్య వైపుకు గమనము సారించలేదు. మీ సర్వస్వమునూ శ్రౌతమునకే ధారపోసినారు. సరే , మీ పురోహితులు భార్గవులెక్కడ ? "

        " వారు రాజ పౌరోహిత్యమును వదలి ఇప్పుడు యాజ్ఞవల్క్యుల ఆశ్రమములో తపస్సుకు కూర్చున్నారు. అంతే కాదు , యాజ్ఞవల్క్యుల అగ్నులను తాను చూసుకుంటానని చెప్పి , మైత్రేయి గారిని పంపించినారు. "

" ఆమె యాజ్ఞవల్క్యుల మోక్షపత్ని కదా ? "

" ఔను "

      " సంతోషము. అంతటి బ్రహ్మవాదిని రాకుంటే మీ సభకు కాంతి ఎక్కడిది ? ఏమి గార్గీ ? ..సరే , అశ్వలులు ఏమో చెపుతారన్నారు కదా ? "

          అశ్వలుడు చెప్పినాడు, : ఒక వేయి గోవులు. వత్సములతో కూడిన వాటితో పాటూ రాజభవనపు ఇరవై అయిదు ఆబోతులు. వీటిని కట్టివేయుటకు కనీసము యజ్ఞమంటపానికి రెండింతలున్న ఆ ఎదురుగా ఉన్న తోపులో స్థానము ఏర్పాటు చేసినాము. ఆ మందను చూస్తేనే చాలు. కనులు చెదరి పోతాయి. వాటినన్నిటినీ కడిగి , పసుపూ కుంకుమా పెట్టిన తరువాత ఇక చెప్పవలసినదేమి ? అంతేకాక ఒక్కొక్కదానికీ పైన కప్పుటకు జరీతో కూడిన ఒక్కొక్క జలతారు వస్త్రము. కాళ్ళకు , కొమ్ములకూ వెండి మువ్వలు , కుప్పెలు , మెడకు ఇత్తడి పట్టీ , ముఖానికి జలతారుతో చేసిన కడ్డీలు గల  ముఖవాడము , వీటన్నిటికీ మించి రెండు కొమ్ములకూ ఐదైదు మను సువర్ణములు. ఒక్కొక్కదానికీ పాలు పితుకుటకు ఒక చిన్న పాత్ర ,  ఒక బిందెడైనా పాలు పట్టు మరియొక పెద్ద పాత్ర. వాటికి కావలసిన మనుషులు , తిండిగింజలు, పత్తి గింజలు , పచ్చిగడ్డి, ఎండు గడ్డి,  తవుడు , గానుగ చెక్క . ఇంతేనా , ఆ సువర్ణాలే పదివేలవుతాయి. "

" మను సువర్ణములు అంటేనేమి ? "

        అశ్వలుడు మహారాజు ముఖాన్ని చూసి , అనుమతి పొంది , నిక్షేప లాభపు వృత్తాంతమంతా చెప్పినాడు. " ఆ సువర్ణము ఒక్కొక్కటీ మూడు వేళ్ళ వెడల్పు ఉండి , మన సువర్ణములు దానితో ఇరవై అయిదవుతాయి. " 

" అంత భారీ సువర్ణమా ? "

          " రేపు తమరే చూస్తారుగదా ? ఇంకొక విశేషము , ఆ పశువులను తీసుకొని పోవుటకు లేశమైననూ కష్టము , ఖర్చు , దుఃఖమూ కారాదని , వాటికి కావలసిన కొట్టములు , పాకలు , వాటిని చూచుకొను మనుషులకు గృహములు , వాటికి ఒక సంవత్సరమునకు కావలసిన ధాన్యము , మేతలను నింపి యుంచుకొనుటకు గోదాములు,  గాదెలూ , చివరికి వాటిని కట్టియుంచుటకు గూటములను, సర్వమునూ మహారాజుగారే సొంత వెచ్చముతో కట్టించి ఇస్తారు. " 

       " కానుక అంటే అలాగ ఉండవలెను. మహారాజులు ఇలాగ చేయించుట బహు సమంజసముగా నున్నది . చివర , సర్వజ్ఞాభిషేకపు నాడు ఈ దేశాధిపతులు ఇచ్చు కానుకలూ చేరుతాయి. అన్నీ చేరి అయిదు లక్షలు కావచ్చునా ? "


" హెచ్చుతక్కువగా అక్కడికి రావచ్చును. "

         విదగ్ధుడు సంతోషముతో తలయూపినాడు. " చాలా బాగుంది. ఈ జ్ఞాన సత్రములో, లేదా జ్ఞాన పణ ద్యూతములో గెలిచినవాడు నిస్సందేహముగా , నిరాలోచనగా  రెండు మూడు తరాలు సుఖముగా ఉండవచ్చును. అలాగ చేసిన విద్య తప్పక పెరుగును , రాణించును. ఇది ఎంతో బాగున్నది. " అన్నాడు. 

       సప్తమి నాడు విద్వాంసులు , దేశాధిపతులు , పుర ప్రముఖులు , అతిథులు , ఆహ్వానితులు , రాజాధికారులు , మొదలగు అందరూ మధ్యాహ్నాత్పరము సవాహనులై దయచేసినారు. చివరగా భగవానులు తల్లిదండ్రులను పల్లకిలో కూర్చో బెట్టుకొని తామూ , తమ ప్రధాన శిష్యుడు కణ్వుడూ ముందరి కొమ్ములనూ , మైత్రేయీ కాత్యాయనీ వెనుకటి కొమ్ములనూ భుజాలకు ఎత్తుకొని ఇంకొక ప్రధాన శిష్యుడైన మాధ్యందినుడు పల్లకీ ముందర బెత్తమును పట్టుకొని , జ్ఞాన మంటపమునకు సాగుతూ వచ్చినారు. ఆచార్యుని తేజస్సు విజృంభిస్తున్ననూ , భగవానుల తేజస్సు దానికి మూలముగా ఉన్నట్లు ఉండినది. 

          భగవానుల నిరీక్షణలో నున్న మహారాజుకు ఇది తెలిసింది. " హా!  హా!  " అని పరుగెత్తి వెళ్ళి , భగవానుల బదులు తామే పల్లకీని భుజాని కెత్తుకున్నారు. ఆతని వెంట పరుగెత్తి వచ్చిన మంత్రి, దళపతి , కోశాధికారులు మిగిలిన కొమ్ములను పట్టుకున్నారు. ఆచార్యుడు తాను ఇంకా పల్లకీలో కూర్చొని యుండుట సమంజసము కాదని , ఎవరెంత బలవంతము చేసిననూ వినక , కిందకు దిగినాడు. భగవానులు సపత్నీ శిష్యులై తల్లిదండ్రులను ముందుంచుకొని వచ్చినారు. మేస్త్రీ ముందర బెత్తమును పట్టుకొని నడుస్తుండగా , అతని వెనుక రాజు , మంత్రి , దళపతి , కోశాధికారులు  దేవరాత కుటుంబమునకు దారి చూపిస్తూ పిలుచుకు వచ్చినారు. 

మహారాజులు స్వయముగా వెళ్ళి పిలుచుకొని వచ్చినారు , వచ్చిన వారెంతటివారో యని మంటపానికి మంటపమే లేచి నిలుచుంది. విదగ్ధ శాకల్యులకు మాత్రమే కాళ్ళు కడిగిన మహారాజు , ఆచార్య దంపతులకూ , భగవానులకూ , వారి పత్నులకు కూడా కాళ్ళు కడిగినారు. వారందరూ వచ్చి విద్వత్సభలో తమతమకు కేటాయించిన స్థానములలో కూర్చున్నారు. భగవానులు తండ్రికి సరిసమానముగా కూర్చోక , తమ ఆసనమును కొంచము అడ్డముగా తిప్పి కూర్చున్నారు. సభవారు, వారు యాజ్ఞవల్క్యులని తెలిసి ఉపశాంతులై , వారి తేజస్సును చూసి బహు సంతోషించినారు. అందరూ యథావిధిగా ఉపస్థితులైన తరువాత , సుశ్రావ్యమైన స్వాగత సంగీతమైన తరువాత, రాజు వేదిక పైకి వచ్చి , సభాపూజను నెరవేర్చినారు. సభలోనున్నవారికి భయభక్తులతో అన్నారు: " సర్వ సన్మాన్యులైన విద్వద్వరేణ్యులకు నమస్కారములు. జ్ఞానసత్రమును ఆరంభించుటకు తమరి అనుమతిని వేడుకుంటున్నాను. ఏ జన్మలో నేను చేసిన పుణ్యము పరిపక్వమైనదో తామందరినీ , తమంతటి వారికి ఆశ్రయము నిచ్చిన ఈ దేశాధిపతులనూ ఒకచోట చూచే సుయోగము నాకు లభించినది. ఇక నేను తమకు రెండు అంశములను విజ్ఞాపించు కొనెదను. ఈ మహాసభ , యే మహాత్ముడిని సర్వజ్ఞుడని నిర్ణయించునో , ఆతనికి ఈ పాండిత్య కిరీటమును కట్టబెట్టి సర్వజ్ఞాభిషేకమును చేయుట, రెండోది , ఈదినము తామందరూ వచ్చునపుడు , ఆ దిన్నె పక్కగా నున్న తోపులో కట్టిన వేయి గోవులను చూచినారు కదా ? అవన్నీ సాలంకృతములు , సోపస్కరములు , సపరివారములు. వాటిని తమలో బ్రహ్మిష్ఠులు ఎవరో , వారు తీసుకొనవచ్చును. "

అక్కడ కూర్చున్న విద్వాంసులు ఎన్నో సభలను ఎదిరించినవారు. కీర్తి సంపన్నులు. విద్యా వైభవమున్నవారు. అయినా , వారందరికీ ఈ సభ ముందర నిలచి నేను బ్రహ్మిష్ఠతముడను యని చెప్పుకొనుటకు ధైర్యము చాలలేదు. అందరూ గోవులను కోరిననూ, అవి మాకు కావలెను అని చెప్పలేక పోయినారు. ఎందుకో అందరికీ మనసులో జంకు కలిగింది. విద్యాకీర్తులలో పెద్దవారు కురు పాంచాలులు . వారిలోనూ పరమ శ్రేష్ఠుడు విదగ్ధశాకల్యుడు. అతడు కూడా ఎందుకో లేచి నిలబడుటకు సిద్ధము కాలేదు. 

రాజు మరలా వేదికపై నిలచి , ముందు చెప్పినదే మరలా చెప్పినాడు.  

ఒక్క ఘడియ వేచియుండినాడు. అదే మౌనము. ఇప్పుడు నిరీక్షణము ఘనముగా పెరిగి , మౌనము ఇంకా గంభీరమైనది. 

రాజు తాను చెప్పినది మూడవ సారిగా మరలా చెప్పినాడు. రాజు మాట ప్రతిధ్వనించునట్లు సభ మౌనముగా ఉంది. గట్టిగా ఊపిరి వదలనివారే లేరు అంటే అతిశయోక్తి కాదు. 

Friday, April 5, 2013

66. " మహాదర్శనము "--అరవై ఆరవ భాగము--జ్ఞాన సత్రమునకు పిలుపు


66.  అరవై ఆరవ భాగము జ్ఞాన సత్రమునకు పిలుపు


         కాత్యాయని మైత్రేయిని వెతుక్కుంటూ వచ్చింది. మైత్రేయి , తాను అంతర్ముఖియై కూర్చొనుటకు అన్నీ సిద్ధము చేసుకుంటున్నది. " అక్కా " అని లోపలికి వస్తున్న కాత్యాయనిని ఆమె అభిమానముతో రమ్మని పలికి , పక్కనే కూర్చోబెట్టుకొని , ఆదరముతో , " ఏమిటి చెల్లీ ? ఈ వేళకు నువ్వు వంట యింటిలో పొయ్యి ముందర వుంటావు కదా ! ఇదేమిటి ఇప్పుడు ఈ అకాలములో వచ్చినావు ? " అని అడిగినది. 

కాత్యాయని అడిగింది : " భగవానులు జ్ఞాన సత్రమునకు వెళ్ళు సంగతిని నీ దగ్గర ఏమైనా ప్రస్తావించినారా ? "

        మైత్రేయి నవ్వింది. " అటువంటి విషయము ఏదైనా ఉంటే అదంతా భగవతితోనే! నాదేమున్ననూ మీరిద్దరూ ఎక్కడికి రమ్మంటే అక్కడికి మీ వెంట వచ్చుట. అవకాశముంటే ఏకాంతములో కనులు మూసుకొని కూర్చొనుట. అంతే! "

" సరే , అక్కా , నిన్ను చాలా నాళ్ళ నుండీ ఒకటి అడుగవలెను అనుకొంటున్నాను. ఇప్పుడు సమయము దొరికింది, అడిగేదా ? "

         " ఇది బాగుంది , నా సర్వస్వమూ నువ్విచ్చినది. ఇలాంటపుడు , నువ్వు నన్నేమైనా అడుగవలెనంటే నా అనుమతి కావలెనా ? అడుగు. నువ్వు ఏమి అడిగిననూ అదెంతటి రహస్యమైననూ నీకు చెప్పెదను. " 

" నువ్వు సందు దొరికితే కనులు మూసుకుని కూర్చుంటావు కదా , అప్పుడు ఏం చేస్తుంటావు ? "

         " ఇంతేనా ? ఇంకేదైనా రహస్యము అడుగుతావేమో అనుకున్నా. విను , నేను కనులు మూసుకొని ఉన్నపుడు కళ్ళు , ముక్కు , చెవి మొదలైనవి ఊరికే ఉండవు. పని చేస్తుంటాయి. మనకు మనసుంటే ఒక పని , లేకుంటే ఇంకొక పని. మనసు మాత్రం ఒక ఘడియ కూడా ఊరికే ఉండదు. ఏదైనా వెనకటిదో , ముందరిదో తెచ్చుకుని దాని గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. అంతే కాదు , మనలను లాగుకు వెళ్ళి ఈ దేహమే నువ్వు అనిపిస్తుంది. దీనిని తప్పించుకొనుటకే మేము కళ్ళు మూసుకుని కూర్చొనేది. అప్పుడు ఏ పనీ లేక నిశ్చలముగా కూర్చొనుటే పని. "

" అది సాధ్యమా ? "

" చూడు చెల్లెమ్మా , నువ్వు దినమూ నిద్రపోతావుకదా ? అప్పుడు ఏమవుతుంది ? "

        " ఏమవుతుందో ఎవరికి తెలుసు ? తుండు బట్ట మాదిరి పడి ఉండుట ఒక్కటే తెలుసు. ఏమైనా కానీ , అలాగ పడి ఉండి , లేస్తే అప్పుడు ఒళ్ళునొప్పులు మటుమాయమవుతాయి. ఏదో కొత్తదనము వస్తుంది. " 

         " ఇక్కడ కూడా అట్లే చెల్లీ , నిద్రలో ’ నేను ’ అనునది ఎక్కడికో పోతుంది. ఇక్కడ కూడా అట్లే అవుతుంది . విశేషమేమంటే , నిద్ర లేచినవారికి, తానుగా , ’ నేను ఫలానా , ఈ దేహము నేను ’ అని నామరూపముల తెలివి ఉండనే ఉంటుంది. ఇక్కడ నిద్రలో వలె మైమరిచిపోము. ఎప్పుడూ మెలకువగా ఉంటాము. అయితే , అది ఈ మెలకువవలె ఇంద్రియ మనో వ్యాపార పూర్వకముగా కాదు , ఇంద్రియములూ మనసూ వ్యాపారము చేయకున్ననూ మెలకువగా ఉంటాము. "

" కాదే అక్కా , కొంచము నాకు తెలిసేటట్లు చెప్పవే ! " 

" అలాగేలేవే అట్లే చెపుతాను , కండ్లు మూసుకొని నన్ను ముట్టుకో. " కాత్యాయని అట్లే చేసింది. 

" ఇప్పుడేమవుతున్నది ? చెప్పు ? "

" ఇదేమిటే ఇది ? ఏదో అంతా నింపినట్లవుతున్నది.."

" అట్లే చూస్తూండు. "

కాత్యాయని గంభీరముగా అయింది. ఆమె నుండీ ఏ మాటా రాలేదు. ఒక ఘడియ తరువాత , మైత్రేయి మెల్లగా , " లేవే ..లే "  అంది. కాత్యాయని కనులు తెరచింది. 

" ఇప్పుడు చెప్పవే కాత్యాయినీ , ఏమయ్యింది ? "

        " నేను నేను అనేది కరగిపోయింది..ఇప్పుడేమో దట్టంగా పొగమంచు ముసురుకున్నట్లుంది. తెల్లవారినా , సూర్య దర్శనము కాకున్ననూ ఆ వెలుగు మందముగా పరచుకున్నట్లుంది కదా , కానీ కనులు మూసుకున్నపుడు , ఈ పొగమంచును కరగించి పారేసి ఎండ ఎక్కిపోతే ఎట్లో అట్లుండినది. "

" ఔను , అదే సమాధి  యంటే. సరే చెప్పు , అది నిద్ర అంటావా ? "

" కాదు, అది నిద్ర కాదు. " 

" అయితే ఇంకేమిటి ? "

       " అది నేను చెప్పలేను. నేను చూసి ఉన్న ఏదీ దానివలె లేదు. మనము ఏది చేసిననూ ఇంకేమో చేయలేదే అన్న కొరత ఉండనే ఉంటుంది. అయితే అప్పుడా కొరత ఉండలేదు."

        " నిజము చెల్లీ , నీ మాటలలో చెప్పవలెనంటే ఆ కొరతను పోగొట్టుకొనుటకే నేను కన్నులు మూసుకొని ఉండేది. ఇంకా ఏమవుతుందో తెలుసా ? పుల్లలను మంటలోకి వేస్తే , అవన్నీ మండుతాయి. కాలి బూడిద అయితే , పుల్లల బూడిద ఉన్ననూ పుల్లలు ఉండవు కదా , అట్లే , నేను అన్నది పుల్లవలె కాలి బూడిద అగును. చెల్లీ , ఆ వెలుగు చూచినావా ? అది చూస్తూ ఉండగా అంతా నిండిపోవును. అప్పుడేమవుతుందో తెలుసా ? ఇంకేమీ అవసరము లేదు అనిపిస్తుంది. "

        " అప్పుడపుడు భగవానుల సమీపములో ఉన్నపుడు నాకు ఇట్లయ్యేది. అయితే , ఉన్నమాట చెప్పవలెనంటే , నేను కాత్యాయనిని , భగవానుల సేవకే అంకితమైన దానిని అనునది మరచుట నాకు ఇష్టము లేదు. ఇలాగ కనులు మూసుకుంటే అది మరచిపోతాను. కాబట్టి అది నాకు వద్దు. సరే , భగవానులకు కూడా ఇట్లే తాను ఎవరన్నదీ మరపు వస్తుందా ? "

       " ఔను చెల్లీ , అది అలాగ మరచిపోవుట అనుట కన్నా , ఈ మన నిజ స్థితిలోకి రావడము ఆ సమాధిలోని సొగసు. నీమాటే చెప్పవలెనంటే ఏ కొరతా ఉండదు. "

" అప్పుడు , చేసినదీ , చేయనిదీ రెండూ ఒకటేయగును కదా ? "

" అవును , అయితే పెండ్లి కానపుడూ సంభ్రమము లేదు , పెండ్లి అయినపుడూ సంభ్రమము లేదు. రెండూ ఒకటేనా ? "

        " అదెట్లవుతుంది ? పిల్లలు లేకపోవుటను తీసుకో. ఇతరులు పిల్లలు లేరే యని కలత పడితే , నాకు పిల్లలు లేరని నిశ్చింత. అలాగే , అక్కడ మొదటిదానిలో సంభ్రమము లేకున్ననూ కలత ఉంది. రెండవదానిలో సంభ్రమమూ లేదు , కలత కూడా లేదు. "

" ఏది సరైనది అంటావు ? "

" రెండోదే సరి. దానిలో చింత లేదు"

" ఔను  , సమాధి అట్లుండును. " 

" అందుకేనేమో , భగవానులు జ్ఞాన సత్రపు పేరే ఎత్తడము లేదు. మరచినారో ఏమో ? "

" మరచినారనుట కన్నా, వారి మనసులో  అది లేదు అనుట సరికాదా చెల్లీ ? "

        " నువ్వు చెప్పేదే సరిగ్గా ఉందనుకుంటా. అప్పుడు తీర్థ యాత్రకు వెళ్ళినాము చూడు , అప్పుడూ ఇట్లే . అమ్మ చెప్పిందని బయలుదేరినారు. తమకు కావాలనలేదు , వద్దనలేదు. "

        " సరిగ్గా చెప్పినావు. భగవానులకు అవసరము లేదు. అట్లని అనవసరము కూడా కాదు. ఎవరైనా బలవంతము చేస్తే , పని అవుతుంది: లేదంటే లేదు. వారికి అయినా ఒకటే , కాకున్నా ఒకటే. " 

         " నువ్వేమయినా చెప్పు , నేనేమో ఈ లోకము దానిని. ఇంకొక లోకములో అంటే , మీ లోకములో ఎట్లుండునో అది నాకు తెలియదు. ఇక్కడున్నంత వరకూ ఇక్కడివారి లాగే ఆడవలెనా లేదా ? నేను మాత్రము ఈపొద్దు మధ్యహ్నము అయిన తరువాత భగవానుల వద్ద  జ్ఞానసత్రపు విషయము ప్రస్తావన చేస్తాను. " 

" చేయవమ్మా  చేయి. మాకేమి ? రమ్మంటే మీతోపాటూ వస్తాము. అంతే కదా ? " 

         " నువ్వు సరే , ఈ లోకమంతా కాలిపోయినా కండ్లు మూసుకొనే ఉంటావు. నీ మాదిరి నేనుంటే అవుతుందా ? ఈ ఆశ్రమమంతా  నా తలపై వేసినారు. ఇప్పుడు చూడు , ఇక్కడ మాట్లాడుతూ కూర్చున్నాను. అక్కడ వంట ఏమయిందో ? పప్పు వేసి ఇక్కడికి వచ్చినాను. "

" భయపడ వద్దు. అక్కడ పప్పు ఉడికింది. అన్నమయింది. "

" నీకెలాగే తెలిసిందీ ? "

         " అది నువ్వు నాకిచ్చిన వరము. ఇప్పుడు నువ్వు నీ దేహము ఉన్నచోట మాత్రమే నువ్వున్నావు అనుకుంటున్నావు. మా దారి పట్టితే , నువ్వైనా నేనైనా , ఉండని స్థలమే ఉండదు. " 

" అంటే , ఇక్కడ కూర్చొనే వంటింట్లో ఏమవుతున్నదో చూడవచ్చా ? "

         " ఏమి కష్టము ? అంతే కాదు, నువ్వు వంటమనిషిని ఉంచుకొని ఉంటే , నువ్వు చూసుకోకున్ననూ ఆమె వంట చేసిపెట్టేది కదా ? అట్లే వంట చూసుకో అంటే అదే చూసుకుంటుంది. అయితే , ఈ విద్యను నేర్చినవారు అటువంటివి పట్టించుకోరు , అంతే! "

         " నువ్వు ఏమేమో చెపుతున్నావు. అయితే , వారు చెప్పేదానికీ , నువ్వు చెప్పేదానికీ వ్యత్యాసము లేదు. కాబట్టి అబద్ధము కాదేమో ? మనకు తెలియనివి, ఏమేమి , ఎన్నెన్ని ఉన్నాయో ఎవరికి తెలుసు ? నేనింక వస్తాను. "

         " న్యాయము. ఇంటి యజమానురాలివి నువ్వు. ఇంటి భారమునంతా నెత్తిన వేసుకొని ఉన్న నువ్వు మా వలె బాధ్యత లేకుండా కూర్చొనుటకవుతుందా ? వెళ్ళిరా. ఒక మాట. చెల్లీ , నువ్వు నిద్ర పోవునపుడు ఈ భారమునంతా ఎవరి తలపై ఉంచుతావు ? "

" పోవే , మాట్లాడ నివ్వకుండా చేసి నా నోరు కట్టివేయుటలో మీరిద్దరూ ఒకటే! " 

         కాత్యాయని భగవానులను చూసి జ్ఞాన సత్రము సంగతి మాట్లాడ వలెనని నిర్ధారించు కొని వంట ఇంటి వైపుకు పరుగెత్తింది. ఇంకో ఘడియలో ఆమె అన్నము దింపి , ఉడికిన పప్పుకు పులుసుపోసి దానికి ఉప్పు వేస్తుండగా భగవానులే అక్కడికి వచ్చినారు..

" ఏమి కాత్యాయినీ , పిలిచినావా ? "

        కాత్యాయని ఆ గొంతు విని తల తిప్పింది.  వారిని చూసి  తనకైన సంతోషమును ప్రకటముగా చూపిస్తూ , " పిలవలేదు  , ధ్యానిస్తున్నాను " అన్నది. 

భగవానులు కూడా ఏమీ తెలియనివారి వలె అడిగినారు , " ఏ విషయము ? "

" మీతో కొంతసేపు మాట్లాడ వలెనని ఉన్నాను. కానీ అదేమో , మరచి పోయినానే ? "

        " ఒక్కోసారి అలాగ అవుతుంది. నువ్వు ఏదో మాట్లాడాలని ఉన్నావని వేళకన్నా ముందే మాధ్యాహ్నికాదులను ముగించుకొని వచ్చినాను. సరే , పోనివ్వు. తరువాత మాట్లాడ వచ్చును. " 

" ఆ..ఆ గుర్తొచ్చింది. అది సరే , ఇది వంట ఇల్లు కదా ? ఇక్కడే మాట్లాడుదామా ? "

         " మాట్లాడేది మనము మనమే. వంటిల్లయితే ఏమి ? ఇంకో గది అయితేనేమి ? పైగా ఇది నీ క్షేత్రము. నువ్వు చెప్పినట్లు వినాలని అనుకొనే ఇక్కడికి వచ్చినానో ఏమో ? సరే గానీ నువ్వు కూరకు ఒప్పులు తరుగుతూ కూర్చొని మాట్లాడు. నిన్ను అలాగ చూసి చాన్నాళ్ళయింది. రండి , ఈ కత్తిపీట ముందర సమాసీనులు కండి. " 

" మీ వినోదము మరీ చోద్యము. "

         " కాదు , వినోదము కాదు. నువ్వు  ఈ కత్తిపీట మీద కాలు వేసుకుని కూర్చో . నేను ఇక్కడ ఒక దర్భాసనమును వేసుకొని కూర్చుంటాను. మాటలు సాగనీ.."

     కాత్యాయని సంకోచపడింది. భగవానులు బలవంతము మీద ఆమెను అక్కడ కూర్చోబెట్టినారు. మాటలు ఆరంభమయినాయి. 

" జ్ఞాన సత్రపు సంగతి ఏమి చేసినారు ? "

   " నేను చేయుట ఏమి ? రాజు కావలసినట్లు ఖర్చు చేసి దానిని చేయిస్తున్నాడు. దేశ విదేశముల నుండీ విద్వాంసులు వస్తారు. జరుగుతుంది , నేనేమి చేయవలెను ? " 

" మీకు ఆహ్వానము వచ్చిందా లేదా ? "

" వచ్చింది "

"మీరు వెళ్ళరా ? "

" నేను ఆ సంగతే ఆలోచించలేదు. అయినా , అక్కడికి వెళ్ళి చేసేదేముంది ? " 

" ఇదింకా చోద్యము. అదంతా చేసినదే మీ కోసమంట ! మిమ్ములను సర్వజ్ఞులని అందరెదురుగా పట్టాభిషేకము చేయవలెనంట! " 

" చూడు కాత్యాయనీ , బ్రహ్మిష్ఠులైన వారు తన లోకమునకు వస్తే , చతుర్ముఖ బ్రహ్మ ఎదురువచ్చి పిలచుకొని వెళ్ళి తన ఆసనములో కూర్చోబెట్టి అర్ఘ్య పాద్యాదులను ఇస్తాడంట. అప్పుడు దానికి కూడా మోహపడక ’ నేను ముందుకు సాగవలెను ’ అని వెళ్ళిపోవలెనంట! దానిని వైరాగ్యము అంటారు. అలాంటపుడు , ఇక్కడ , ఈ సామాన్య రాజు జరిపే జ్ఞానసత్రములో సర్వజ్ఞుడనయితే వచ్చేదేముంది ? చేసేదేముంది ? చెప్పు ? "

" అంటే వెళ్ళరా ? "

" వెళ్ళనని నేనేమీ ప్రతిజ్ఞ చేయలేదు. నేను వెళ్ళకపోతే , సర్వజ్ఞ పదవి ఇంకొకరికి వస్తే గతియేమి? అంటావా ? ఈ విశ్వములోనున్న చరావరములన్నీ నేనే అయి ఉన్నపుడు సర్వజ్ఞత్వము ఎవరికి వచ్చినా నాకు వచ్చినట్లే కాదా ? "

కాత్యాయనికి ఏమి చెప్పవలెనో తెలియలేదు. ఆ లోపలి భావము అద్దములో ప్రతిబింబించినట్లు ముఖములో స్పష్టముగా కనిపిస్తుండగా అడిగినది , " వెళ్ళకూడదు అని ప్రతిజ్ఞ లేదు. వెళ్ళవలెను అని నిర్ణయించలేదు. ఇలాగంటే నేనేం చెప్పేది ? "

భగవానులు ఆమెను చూసి నవ్వినారు: " నేను వెళ్ళితీరవలెను అన్నట్లయితే యజ్ఞేశ్వరుడు ఆజ్ఞ ఇవ్వనీ , వెళ్దాము" అన్నారు

కాత్యాయని , ’ రాజే వచ్చి పిలిస్తే ? " అన్నది. 

భగవానులు లేస్తూ అన్నారు, " అప్పుడు నామీద రెండు మోపులు పడినట్లే. ఒకటి నీది , రెండోది రాజుది. అయినా సరే , యజ్ఞేశ్వరుని ఆజ్ఞ లేనిదే వెళ్ళుటకు లేదు. " 

" అదెప్పుడు తెలుస్తుంది ? "

" దేవతలు అంతటా , అన్ని వేళలా ఉంటారు. వారు ఎప్పుడంటే అప్పుడు , ఎక్కడంటే అక్కడ , ఎలాగంటే అలాగ చెప్పవచ్చు. "

" అయితే అడిగేయండి " 

" అలాగ వారు దొరికినారు కదా అని అడుగుట న్యాయము కాదు . అయినా నువ్వు నా గృహిణివి. నీ తృప్తి కోసము అడుగుతాను. "

భగవానులు శుద్ధాచమనము చేసి కూర్చొని కనులు మూసుకున్నారు. కాత్యాయని ఏమగునోయని ఆందోళనతో నిండి చూస్తున్నది. వంటింట్లోని పొయ్యి అరచింది. కట్టెలు భగభగమని మండుతూ శబ్దము చేస్తున్నాయి. కాత్యాయని సందేశము దొరికింది అనుకుంటుండగనే  భగవానులు నవ్వుతూ కళ్ళు తెరచి , " వెళ్ళ వలెనంట. ఆజ్ఞ అయినది. ఇక మంచీ చెడూ అంతా వాడిదే. తప్పకుండా వెళదాము. రేపు షష్ఠి. ప్రయాణానికి అంత అనుకూలము కాదు. ఈరాత్రికే భోజనమయినాక వెళదాము. మైత్రేయి ఇక్కడే ఉండనీ. " అన్నారు. 

" ఆమె కూడా రావలెను. "

" అలాగే కానీ. దానికి అన్ని ఏర్పాట్లూ చేసుకోండి. ’ 

అతిథి గృహమునుండీ వటువు ఒకడు పరుగెత్తి వచ్చినాడు. భగవానులు ’ ఏమి ? ’ అని అడిగినారు. వటువు , " మహారాజులు ఏనుగు మీద వచ్చినారు.  అంబారీలో కూర్చున్నారు. " అన్నాడు.

భగవానులు కాత్యాయని ముఖమును చూసి నవ్వుచూ , ’ వస్తున్నా , పద ’ అని వటువు వెనకే వెళ్ళినారు. "