ఆచమనము
మానవులందరికీ, అన్ని జీవుల లాగానే, ప్రాణము ఉంటుంది కదా... అయితే ఈ ప్రాణానికి అనుక్షణమూ రక్షణ అవసరము. కేవలము అనారోగ్యము, ప్రమాదాలు వంటి వాటి నుండీ మాత్రమే కాదు, ఈ జగత్తులో ఎక్కడ చూసినా మైల, అశౌచము ఉంటుంది. ఆ అశౌచము పదేపదే వచ్చి ప్రాణాన్ని ఆవరిస్తూ ప్రాణశక్తిని క్షీణింపజేస్తూ ఉంటుంది. ప్రాణ శక్తి క్షీణిస్తే మనిషి భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా నిర్వీర్యుడు , నిర్బలుడు అవుతాడు. అలా అహర్నిశలూ క్షీణించే ప్రాణశక్తిని కాపాడుటకు చేసే క్రియయే, " ఆచమనము " . ఈ ఆచమనము వలన సర్వకాలాల్లోనూ వచ్చే సాధారణ అశౌచము నివారణ అవుతుంది.
కాబట్టి, శరీరాన్ని వస్త్రాలు కప్పి రక్షణ ఇచ్చినట్టే, ఆచమనము అనేది ప్రాణాన్ని కప్పి రక్షణ ఇస్తుంది.
ఇప్పుడు ఆచమనము ఎలా చేయాలి, ఆచమనము ఎప్పుడెప్పుడు చేయాలి, అందులో ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ రకము యెప్పుడు చేయాలి అనేది తెలుసుకుందాము.
నిజానికి ఏ వర్ణము వారైనా సరే, ఎటువంటి శుభకార్యము గానీ, అపర కార్యము గానీ చేసినా, అందులో ఈ ఆచమనము అనేది తప్పనిసరిగా చేయాలి. ప్రతి కార్యానికీ మొట్ట మొదట ఆచమనము చేయాలి, అది కూడా రెండు సార్లు. మొట్టమొదట చేసే ఆచమనము రెండు సార్లు చేయాలి. ఇది చాలా మంది పురోహితులకే తెలియదు. ఏ ప్రయోగ పుస్తకము చూసినా, " ద్విరాచమ్య " అని మొదట ఉంటుంది. అంటే,’ రెండు సార్లు ఆచమనము చేసి, ’ అని అర్థము.
ఆచమనము అంటే మరేమో కాదు, దోసిలిని ఆవు చెవి ఆకారములో చేసి, అందులో మినపగింజ మునిగే అంత స్వఛ్ఛమైన నీరు పోసి త్రాగుట! అదీ, మంత్ర పూర్వకముగా!!
దోసిలిని ఆవుచెవి ఆకారముగా చేయుట ఎలా?
కుడి చేతి బొటనవేలిని మధ్యవేలు, ఉంగరపు వేళ్ళ కిందుగా అరచేతిలోకి మడచి పెట్టి, ఆ బొటన వేలిని కుడి చూపుడు వేలితో నొక్కిపట్టి ఉంచి, మిగతా మూడు వేళ్ళను కలిపి, కొద్దిగా పైకి వంచితే అప్పుడు అరచేయి ఒక దొన్నెలాగా తయారు అవుతుంది. ఇది చూచుటకు గోకర్ణము --అంటే ఆవు చెవిలాగా కనపడుతుంది. ఇలా చేసిన తర్వాత, అందులో ఒక్కొక్కసారి నీరుతీసుకొని, బొటనవేలి క్రింది భాగము నుండీ, మణికట్టు కలిసే చోటు నుండీ,[ దీన్నే బ్రహ్మ తీర్థము అంటారు . తీర్థాలు వేర్వేరు ఉన్నాయి , అవి ముందు చదువుతారు ] అరచేతిలోని నీటిని త్రాగవలెను. అది కూడా మంత్ర పూర్వకముగా!! -- ఇలా మూడుసార్లు నీరు త్రాగాక,
ఆచమనము అంటే కేవలము నీరు త్రాగుట మాత్రమే కాదు, గనక, మిగిలిన మంత్రాలతో వేళ్ళను తడి చేసుకుంటూ, శరీరములోని ఒక్కొక్క భాగాన్నీ తాకవలెను. ఇదంతా చేస్తే ఆచమనము పూర్తి అయినట్టు. శరీరములోని ఒక్కొక్క భాగాన్నీ తాకవలెను అని చెప్పుకున్నాము కదా, ఏ మంత్రముతో / లేక నామముతో ఏ భాగాన్ని తాకవలెను అనేది ఇప్పుడు తెలుసుకుందాము.
అయితే, ఆచమనములో వేర్వేరు రకాలు ఉన్నాయి. ఏ రకపు ఆచమనములో ఏ మంత్రాలు/ నామాలు వాడవలెను అనేది ముందు తెలుసుకోవాలి.
గమనిక : ఈ ఆచమనము విధానము యజుర్వేదము ననుసరించి వ్రాయబడినది. ఋగ్వేదములోను, ఇతర వేదములను అనుసరించేవారికి స్వల్పమైన తేడాలు ఉంటే ఉండవచ్చు అంతేకాక, ప్రాంతీయ ఆచారాలను బట్టి కూడా కొన్ని తేడాలు ఉండచ్చు.
ఆచమనము ౩ రకాలు
౧. శ్రుత్యాచమనము [ దీన్నే శ్రౌతాచమనము అంటారు ]
౨. స్మృత్యాచమనము [దీన్నే స్మార్తాచమనము అంటారు ]
౩. పురాణాచమనము..
ఈ మూడు ఆచమనాలూ సంధ్యావందనములో చేయవలసి ఉంటుంది. మిగతా కార్యాల్లో శ్రౌతాచమనము స్మృత్యాచమనము మాత్రమే చేస్తాము. కొన్ని కార్యాల్లో పురాణాచమనము కూడా చేస్తారు. కేవలము సంధ్యావందనపు మొదట, చివర మాత్రమే శ్రౌతాచమనము వస్తుంది కాబట్టి, చాలా మటుకు వాడుకలో శ్రౌతాచమనము బదులుగా స్మృత్యాచమనమే అనేకులు చేస్తారు. [ రెండూ వేర్వేరు కాబట్టి, అయోమయమును తప్పించుటకో, లేక శ్రౌతాచమనము అంటే తెలియకో ..]
సంధ్యావందనము మొదట్లో మరియూ చివర మాత్రము శ్రౌతాచమనము చేయవలెను అని చెప్పుకున్నాము కదా, కాని , స్మృత్యాచమనము సంధ్యావందనము అంతటా చేయవచ్చు...నిషేధము లేదు కాబట్టి మామూలుగా అందరు సంధ్యావందనము మొదట్లో అయినా, మధ్యలో అయినా, చివర్లో అయినా స్మృత్యాచమనమే చేస్తారు. అలా వాడుక అయింది.
ముఖ్య గమనిక : ఈ ఆచమనములో నీళ్ళు చల్లుకోవడము, అంగాలను స్పృశించడము వంటివి కుడిచేతితో, కుడి చేతి వేళ్ళతో నే చేయాలి. ఎడమ చేతిలో కేవలము ప్రత్యేకముగా చెప్పినచోట నీరు పోసుకోవడము, ఉద్ధరిణ పట్టుకోవడము మాత్రమే చేయాలి.
శ్రౌతాచమనము :- ఈ శ్రౌతాచమన విధి అనేకులకు తెలిసియుండక పోవచ్చు . ఇందులో కూడా నీరుత్రాగుట, అవయవములను తాకుట, నీరు చల్లుకొనుట వంటివి ఉన్నాయి. [ శ్రౌతాచమనములో విష్ణు నామాలు కాక, గాయత్రి మంత్రములోని మొదటి మూడు పాదాలతో మూడు సార్లు నీరు తాగుతారు.. ఇది చాలామటుకు వాడుకలో లేదు. ]
అయితే ఒక్కోదాన్ని ఒక్కో ’ అంగము ’ గా పిలిస్తే [ ఇది కేవలము అర్థము కావడానికి ఇచ్చిన ఉదాహరణ ] శ్రౌతాచమనములో మొత్తము ఇరవై నాలుగు అంగాలు ఉన్నాయి . అవి ఇలాగు ఉంటాయి
౧. ఓం తథ్స॑వి॒తుర్వరే॑ణ్య॒గ్గ్॒ స్వాహా॓ ||
[ అని ఒకమారు బ్రహ్మ తీర్థములో జలము త్రాగవలెను ]
౨. భర్గో॑దే॒వస్య॑ ధీమహి॒ స్వాహా॓ |
[ అని రెండవమారు బ్రహ్మ తీర్థములో జలము త్రాగవలెను ]
౩.ధియో॒యోనః॑ ప్రచో॒దయా॒త్ స్వాహా॓ |
[అని మూడవమారు బ్రహ్మ తీర్థములో జలము త్రాగవలెను ]
౪. ఆపో॒హిష్టా మ॑యో॒ భువ॑ః | ౫. తాన॑ ఊ॒ర్జే ద॑ధాతన |
[ ౪, ౫ ఈ మంత్రాలతో రెండు అరచేతులు నీటితో తుడుచుకొన వలెను ]
౬. మహే రణా॑య చక్ష॑సే | ౭. యోవ॑శ్శి॒వత॑మో॒ రస॑ః|
[ ౬, ౭ ఈ మంత్రాల చేత ఎడమచేతిలో పోసుకొనిన నీటిలో [ లేదా ఉద్ధరిణలో పోసుకొని ] కుడి చేతి బొటన వేలు ముంచి ఎడమనుండి కుడికి పై పెదవి ఒకసారి, కింది పెదవి ఒకసారి వేర్వేరుగా తుడుచుకోవలెను.]
౮. తస్య॑భాజయతే॒హన॑ః | ౯. ఉ॒శ॒తీరి॑వమా॒తర॑ః|
[ ౮,౯ ఒక్కో మంత్రముతో ఒక్కోసారి ఎడమచేతిలోని నీటిని దర్భలతో కానీ వ్రేళ్ళతో కానీ శిరముపై చల్లుకొనవలెను.]
౧౦ తస్మా॒ అర॑ంగ మామవః | [ ఎడమ చేతిలోని నీటిని కుడి చేతితో తాకి పైన చల్లుకొనవలెను.
౧౧ యస్య॒ క్షయా॑య॒ జిన్వ॑థ | [ ఎడమ చేతిలోని నీటిని కుడి చేతితో తాకి రెండు పాదముల మీద చల్లుకొనవలెను ]
౧౨. ఆపో॑జ॒నయ॑థాచనః | [ ఎడమ చేతిలోని నీటిని శిరముపై చల్లుకొనవలెను
౧౩ ఓం భూః || [ కుడి చేతి వ్రేళ్ళను ముడిచి వ్రేళ్ళ మొదళ్ళతో గడ్డమును తాకవలెను ]
౧౪ ఓం భువః || [ బొటన వేలు, చూపుడు వ్రేళ్ళతో ఎడమ ముక్కును తాకవలెను ]
౧౫ ఓగ్ం సువః || [ బొటన వేలు, చూపుడు వ్రేళ్ళతో కుడి ముక్కును తాకవలెను ]
౧౬. ఓం మహః || [ బొటన వేలు, ఉంగరపు వ్రేళ్ళతో ఎడమ కంటిని తాకవలెను ]
౧౭. ఓం జనః || [ [ బొటన వేలు, ఉంగరపు వ్రేళ్ళతో కుడి కంటిని తాకవలెను ]
౧౮. ఓం తపః || [ [ బొటన వేలు, ఉంగరపు వ్రేళ్ళతో ఎడమ చెవిని తాకవలెను ]
౧౯. ఓగ్ం స॒త్యం || [ బొటన వేలు, ఉంగరపు వ్రేళ్ళతో కుడి చెవిని తాకవలెను ]
౨౦. ఓం తథ్స॑వి॒తుర్వరే॑ణ్యమ్ || [ బొటన వేలు, చిటికెన వ్రేళ్ళతో నాభిని ( బొడ్డు ) తాకవలెను ]
౨౧. భర్గో॑దే॒వస్య॑ ధీమహి॒ | [ కుడి అరచేతితో హృదయమును తాకవలెను ]
౨౨.ధియో॒యోనః॑ ప్రచో॒దయా॒త్ [ కుడి చేతి వ్రేళ్ళతో శిరసును తాకవలెను ]
౨౩. ఓమాపో॒జ్యోతీ॒ రసో॒మృతం॒ బ్రహ్మ [ కుడి చేతి వ్రేళ్ళను ముడిచి ఎడమ భుజమును తాకవలెను ]
౨౪. భూర్భువ॒స్సువ॒రోమ్ [ కుడి చేతి వ్రేళ్ళను ముడిచి కుడి భుజమును తాకవలెను ]
ఇదే శ్రుత్యాచమనము . ఈ శ్రుత్యాచమనమును సంధ్యావందనములో గాయత్రీ మంత్ర జపానికి ముందు, వెనుక చేయవలెను.
స్మృత్యాచమనము
ఇందులో కేశవాది విష్ణు నామాలు చెపుతూ చేస్తారు. నిజానికి ఇందులొ ౨౪ నామాలు ఉంటాయి .. మొదటి మూడు నామాలతో నీరు తాగుతారు.. మిగతా నామాలతో శరీరములోని ఆయా భాగాలు స్పృశిస్తారు. [ ఈ స్పృశించడము పురాణాచమనము లో ముఖ్యము ]
ఇది ఇలా చేస్తారు
౧. కేశవాయ స్వాహా | ౨. నారాయణాయ స్వాహా | ౩. మాధవాయ స్వాహా |
( అని ఉచ్చరించి , కుడిచేతితో ఒక్కొక్క సారి ఉద్ధరిణె తో బ్రహ్మ తీర్థమున నీరు త్రాగవలెను )
౪. గోవిందాయ నమః |
( అని ఉచ్చరించి కుడి అర చేతితో ఎడమ అరచేతిని తుడుచుకొనవలెను )
౫. విష్ణవే నమః [ఎడమ అర చేతితో కుడి అరచేతిని తుడుచుకొనవలెను ]
౬.మధుసూదనాయ నమః [ఎడమ చేతిలో నీరు పోసుకొని , ఆ నీటితో పై పెదవిని కుడి చేతితో కుడి నుండీ ఎడమకు తుడుచుకొన వలెను
౭. త్రివిక్రమాయ నమః | [ కింది పెదవిని కుడి చేతితో కుడి నుండీ ఎడమకు తుడుచుకొన వలెను ]
౮. వామనాయ నమః [ కుడి చేతితో నీళ్ళు శిరస్సుపైన చల్లుకొన వలెను ]
౯. శ్రీధరాయ నమః [ కుడి చేతితో నీళ్ళు శిరస్సుపైన చల్లుకొన వలెను ]
౧౦. హృషీకేశాయ నమః [ ఎడమ చేతి పైన నీరు చల్లుకొన వలెను.]
౧౧. పద్మనాభాయ నమః [ కుడి చేతితో పాదముల పై నీరు చల్లుకొన వలెను ]
౧౨. దామోదరాయ నమః [ తలపైన నీరు చల్లుకొన వలెను ]
౧౩. సంకర్షణాయ నమః [ అయిదు వేళ్ళతో గవదను తాక వలెను ]
౧౪. వాసుదేవాయ నమః [ ఎడమ ముక్కును తాక వలెను ]
౧౫. ప్రద్యుమ్నాయ నమః [ కుడి ముక్కును తాక వలెను ]
౧౬. అనిరుద్ధాయ నమః [ ఎడమ కంటిని తాక వలెను ]
౧౭. పురుషోత్తమాయ నమః [ కుడి కంటిని తాక వలెను ]
౧౮. అధోక్షజాయ నమః [ ఎడమ చెవిని స్పృశించ వలెను ]
౧౯. నారసింహాయ నమః [ కుడి చెవిని స్పృశించ వలెను ]
౨౦. అచ్యుతాయ నమః [ నాభిని స్పృశించ వలెను ]
౨౧. జనార్దనాయ నమః [ కుడి హస్తాగ్రముతో హృదయమును స్పృశించ వలెను
౨౨. ఉపేంద్రాయ నమః [ శిరస్సును వేళ్ళతో స్పృశించ వలెను ]
౨౩. హరయే నమః [ ఎడమ భుజమును స్పృశించ వలెను ]
౨౪. శ్రీ కృష్ణాయ నమః [ కుడి భుజమును స్పృశించ వలెను ]
ఇదే స్మృత్యాచమనము
ఇక పురాణాచమనము
సంధ్యావందనములో కాక, మిగతా అనేక సందర్భాలలో ఆచమనము చేయాల్సి ఉంటుంది..[ సంధ్యావందనము చివరిలో కూడా ఈ పురాణాచమనము చేయవచ్చు , అంతేకాక, భోజనం తర్వాత , అశౌచ గృహానికి వెళ్ళివచ్చిన తర్వాత , తాక కూడనివి తాకినప్పుడు--] ఆ సందర్భాలలో ఈ పురాణాచమనము చేస్తారు..
ఇందులో స్మృత్యాచమనము వలె కేశవ నామాలు , అంగ స్పర్శ ఉంటుంది. తేడా ఏమీ ఉండదు. మరి యెందుకు రెండు పేర్లు ఉన్నాయి అంటే,
కొన్ని పుస్తకాలలో పైన చెప్పిన స్మృత్యాచమనమే నిజానికి పురాణాచమనము అనీ, నిజమైన స్మృత్యాచమనములో మంత్రాలు కానీ నామాలు కానీ ఉండక, కేవలము ఆయా అంగాలను స్పృశించాలి అని ఉంది. ఇది కొంత అయోమయాన్ని కలుగచేస్తుంది కాబట్టి, స్పష్టత కొరకు, స్మృత్యాచమనము, పురాణాచమనమూ ఒకే లాగే చేసినా దోషము లేదని చెప్పవలసి ఉంటుంది.
ఈ పురాణాచమనము గురించి ఎక్కువ సమాచారము ఉన్నవారు ఇవ్వవచ్చును.
మరియొక విషయము
ఆచమనములో శుద్ధమైన, నురుగు లేని నీటినే వాడాలి. బావి నీరు, సరస్సు, నదీ జలాలు శ్రేష్టమైనవి, వడగట్టి వాడవచ్చును. ఇప్పుడు కొళాయిలో వచ్చే నీటినే వాడవలసి వస్తోంది. కొందరు, శుద్ధత కొరకు దర్భలు/ లేక తులసీ దళములు వేసిన నీటిని వాడుతారు
అసలు, మన క్రతువులలో నీటి ఉపయోగము ఎందుకు? నీరు లేకుండా చేయలేమా?
నీళ్ళు, నీరు, అంబువులు, సలిలము, జలము, తోయము, ఉదకము --వీటిలో కొన్ని సంస్కృత పదాలు. ఆపః అంటే కూడా సంస్కృతం లో నీరే. ఈ ఆపః అనే పదం వేదంలో ఎక్కువగా కనబడుతుంది. పంజాబ్ అంటే పంచ ఆపః అని --జీలమ్ , చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ ఐదు నదులు ప్రవహించే ప్రదేశము కాబట్టి పంజాబ్ అయింది ఇది విషయాంతరము...
సాధారణముగా నీరు అనేది మన దప్పిక తీర్చుటకు ఉంది ---అని మనం అనుకుంటాము. నీరు తప్పకుండా దాహము తీరుస్తుంది, అంతేకాదు, శరీరానికి అలసట పోగొట్టి సుఖాన్ని ఇస్తుంది, ఆకలి కూడా తీరుస్తుంది. కొన్ని ప్రదేశాలలో, ముఖ్యంగా హిమాలయాలలోని ఊటలలో దొరికే నీరు రోజుకు ఒకసారి తాగితే చాలు, ఆకలి దప్పులు ఉండవు, స్వచ్చమైన నీరు రోగాలను రానివ్వదు, ఉన్నవాటిని పోగొడుతుంది కూడా.
శరీరానికి శక్తిని ఇస్తుంది, ఆహారాన్ని జీర్ణము గావిస్తుంది, మనో వ్యాకులతను పోగొడుతుంది. అందుకే కొన్ని నదుల జలాలను అమృతమయము అని పిలుస్తారు.
తియ్యటి నూతి నీళ్ళు, త్రిదోషాలను హరిస్తాయి, అగ్ని దీప్తిని [ ఆకలిని కానపుడు ] ఆరోగ్యాన్ని ఇచ్చును. అన్నిరోగాలకూ పథ్యమైనవి మంచినీళ్ళు.
సరే, ఇవన్నీ అందరికీ తెలిసే ఉండును... ఇంకా తెలియనివి యేమంటే, శుద్ధమైన జలానికి జ్ఞాపక శక్తి ఉంటుంది. అది భావాలను కలిగించగలదు, ఒకరి నుండీ ఇంకొకరికి అనుభూతులను, భావాలను, ఉద్దేశాలను కూడా పంచగలదు.
నీరు ,తనలో సమాచారాన్ని నిలువ ఉంచుకుంటుంది. ఆ సమాచారాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఎవరికి పంచాలో , తెలిసిన తెలివి ఉంది.
నీటిలో స్నానము చేసినపుడు, శుద్ధిపరచుట మాత్రమేకాక, మనసుకు ఆహ్లాదాన్ని, శరీరానికి కొత్త శక్తిని ఇస్తుంది. మనసును తేలిక పరుస్తుంది. భయము, విహ్వలత, ఆందోళన వంటివి ఉంటే పోగొడుతుంది.
సంధ్యావందనములో నీటిని అనేకరకాలుగా ఉపయోగిస్తాము.
మొదట ఆచమనము చేసినపుడు, అంతఃశ్శుద్ధి కోసము, మార్జనము చేసినపుడు బాహ్యశుద్ధి తోపాటు చిత్తశుద్ధి కోసము, అర్ఘ్యము వదలినపుడు చెప్పే ,మంత్రము వలన మన సందేశాన్ని సూర్యుడికి అందజేస్తుంది. మన సందేశము నీటికి చేరి, నీటి నుండీ సూర్య కిరణాలకు చేరుతుంది.
తర్పణాలు వదిలేటప్పుడు, ఆయా దేవతలకు హవ్య కవ్యాలు గామారి, వారి సూక్ష్మ శరీరాలకు క్షుత్పిపాసలు తీరుస్తుంది. మంత్రించిన నీటిని శరీరభాగాలకు తాకిస్తే, ఆయా భాగాలలోని చెడు తత్వాలు[ గుణాలు, లేక చెడు శక్తి ] వదలి స్వఛ్ఛంగా చేస్తుంది.
పూజలలో దేవతలకు ఏ ఉపచారము చేసినా, దానితోపాటు ఉద్దరిణె నీరు వదలి, ’ సమర్పయామి ’ అంటాము. అప్పుడే అది ఆయా దేవతలకు చెందుతుంది. నైవేద్యములో నీటిని ప్రోక్షణకు, ఆచమనీయానికి, పరిషేచన కు వాడుతాము. మనము చేసే నివేదన అమృతమయము అవనీ--అని [ అమృతోపస్తరణమసి ] భావిస్తే అది అమృతమే అవుతుంది.
పుణ్యాహ వాచనము చేసిన నీరు అతి శ్రేష్టమైనది. అది గంగ వలె సర్వ పాపాలనూ పొగొడుతుంది, అందుకే ఆ నీటిని గృహ, భూ, భాండ, పాక శుద్ధికి ఉపయోగిస్తారు.
శ్రాద్ధాలలో నీరు లేకపోతే ఆ కార్యమే లేదు. ఆచమనాలు, తర్పణాలు, దానాలు, ఔపోశనాలు, పరిషేచనాలు, హోమాలలో హోమకుండాన్ని పరిస్తరణ చేసేదానికి, చివరికి అగ్నిని శుద్ధి చేయడానికి కూడా నీరే వాడుతాము.
ఏదైనా దానము ఇచ్చినపుడు, మన ఉద్దేశాన్ని నీటిలోకి ప్రవేశింపజేసి, ఆ నీటిధారతో అవతలివారికి ఆ దానము అందేలా చేస్తాము. అంతేకాదు, నీటిని దానము చేయడము వలన కూడా ఎంతో గొప్ప ఫలము లభిస్తుంది. అందుకే ఎండాకాలంలో చలివేంద్రాలు కట్టిస్తారు. భావులు, చెరువులు తవ్వించుట [ దీన్ని ఇష్టాపూర్తం అంటారు ] గొప్ప పుణ్య కార్యము . వసంత నవరాత్రుల్లో బ్రాహ్మడికి ఉదక కుంభము దానము చేస్తే విశేష ఫలితము.
ఋషులు, మునులు శాపాలు ఇచ్చేటప్పుడు కూడా నీటికి ఆ శాపోద్దేశాన్ని ఆపాదించి, మంత్రించి పైన చల్లుతారు
మైల పోగొట్టుకొని పవిత్రులు కావడానికి కూడా మంత్రోచ్చారణతో సంప్రోక్షణ చేస్తారు.
దేవుడికి అభిషేకించిన నీరు ఎంతో పవిత్రమైన శక్తిని పొంది ఉంటుంది. అందుకే ఆనీటిని తీర్థముగా ఇస్తారు. ప్రోక్షణ కు కూడా వాడుతారు.
ఇక పుష్కరాలు వంటి సమయాల్లో నదుల నీరు కొత్త శక్తిని కలిగి ఉంటాయి. ప్రకృతిలోని సకారాత్మక శక్తులన్నీ ఆ నీటిలో చేరుతాయి. అందుకే పుష్కరాల్లో నదీస్నానం ఎంతో పాపహరము, కొత్త శక్తిని కూడా ఇస్తుంది.
నీళ్ళు అనేక రకాలు. అన్ని నీళ్ళ కన్నా గంగానది నీరు ఎంతో పవిత్రమైనది. గంగ పేరు విన్నా, తలచుకున్నా, పలికినా, పవిత్రతను ఇస్తుంది. గంగా స్తోత్రము చేసేవారు, ఎక్కడున్నా గంగా సమీపములో ఉన్నవారే. వేదపారాయణము, యజ్ఞయాగాదులు ,క్రతువులు చేసిన ఫలము గంగా స్తోత్రముతో వస్తుంది. శ్రాద్ధాలలో అభిశ్రవణ మంత్రాలతో పాటూ గంగా స్తోత్రము చదివితే ఆ పుణ్యము మనకు అనేక జన్మలలో ఫలాన్ని ఇస్తుంది.
సన్యాస స్వీకార సందర్భం లో, ఉత్తరాధికారి/ లేదా శిష్య స్వీకార సందర్భంలో నదీస్నానము తప్పనిసరి. కొన్ని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో చెరువు, తటాకము వంటివి ఉంటేనే కార్యాలు సిద్ధిస్తాయి... సర్పసంస్కారము వంటివి.
శ్రాద్ధాలలో పిండాలను నీటిలో కలిపే ఆచారము కూడా ఉంది.
కొన్ని సాంప్రదాయాలలో యతులు మరణిస్తే, జలసమాధి మాత్రమే చేస్తారు
అలాగే, కొన్ని ఋతువుల్లో, సందర్భాల్లో, గ్రహణాల్లో నీటికి, ముఖ్యంగా నదీజలాలకు రజోగుణము ఆవరిస్తుంది. అప్పుడు ఆ నీటిలో స్నానము చేయరాదు.
చెడు గుణాలు, చెడు తలపులు ఉన్నవారు ఇచ్చిన నీరు తాగితే మనకు ఆ చెడు ఆవరిస్తుంది.
అన్నిటికన్నా విశేషము,
నీటిని ఎప్పుడూ కూడా నిలుచుకొని త్రాగకూడదు. నేల మీదో, కుర్చీ మీదో కూర్చొని మాత్రమే తాగాలి. నిలుచొని తాగితే శరీరములోని వాయువు కీళ్ళ మధ్య చేరి, మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఆచమనాలు కూడా ఎప్పుడూ నిలుచుకొని చేయరాదు. మామూలుగా బాసింపట్టు వేసుకొనో, సుఖాసనం లోనో, గొంతుక్కూర్చొనో చేయాలి, తాగాలి.
తీర్థం తీసుకున్నా, కూర్చొనిమాత్రమే తీసుకోవాలి.
మనిషి నీరు లేకున్నా చనిపోతాడు, నీరు ఎక్కువైనా చనిపోతాడు.
నీటికి ఇన్ని విశేషాలు, ప్రత్యేకతలు ఉన్నాయి. నీరే కదా..అని అలసత వద్దు.
పైన చెప్పినదంతా, సంధ్యావందనములో మొదటి మెట్టు అయిన ఆచమనము గురించి మాత్రమే!! దీనికే ఇంత విశేషము ఉంది, ఇక మొత్తం సంధ్యావందనపు విలువ, ప్రాశస్త్యము చెప్పనవసరము లేదు.
సంధ్యావందనము లేనిదే మరి యే ఇతర శ్రౌత కర్మలూ చేయకూడదు. మరి ఆయా శ్రౌత కర్మలు ఎంత ఉత్కృష్టమైనవి?
సంధ్యావందనము అనేది సముద్రములో కాలి బొటనవేలి గోరు ముంచినంత చిన్న విషయము. మొత్తము వేదరాశి లోను, ఆ వేదరాశి ని ఉపయోగించి చేస్యే కర్మలు, తంతులు, క్రతువులు, యజ్ఞ యాగాదులు వంటి వాటిని అధ్యయనము కాదు, కేవలము తెలుసుకోవాలంటేనే మనిషి జన్మము సరిపోదు. అలాంటప్పుడు వాటిని కూలంకషముగా చిన్నప్పటి నుండీ అధ్యయనము చేసి, ఆయా క్రతువులను నిర్వర్తిస్తూ, పౌరోహిత్యము చేయడము మామూలు విషయమా? అవి చేసేవారికి ఇవ్వవలసిన విలువ, గౌరవము ఇస్తున్నామా అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవలెను.
/ శుభమ్ భూయాత్ /

















