SHARE

Sunday, April 8, 2018

దానము-ధర్మము-దక్షిణ

దానము-ధర్మము-దక్షిణ 






             దానము, ధర్మము , దక్షిణ అనేవి వేరు వేరు పదాలే అయినా వాటికి చాలా దగ్గర సంబంధము ఉంది. 

            సనాతన ధర్మములో దానానికి ఉన్న మహత్తు అంతా ఇంతా కాదు. మనము బాగుండాలంటే ’ పెట్టిపుట్టి ఉండాలి ’  అంటారు.. అంటే దానము చేసి ఉండాలి అని.  పూజకొద్దీ పురుషుడు, దానము కొద్దీ పిల్లలు అన్నారు. ఈ దానము అనే ఒక్క కర్మ మాత్రమూ విడవక చేస్తే ఇక వారికి జీవితమంతా పువ్వులబాటే అని శాస్త్రాలు  ఘోషిస్తున్నాయి. 

ఈ ’ దానము ’ అనే పదము మనకు మొట్టమొదట ఋగ్వేదములో కనపడుతుంది.  కేవలము ఒక సూచనాప్రాయముగా ఉటంకింపబడిన ఈ దానము అనే పదము రానురాను అత్యంత విస్తృతమైన అర్థము సంతరించుకొని, ముఖ్యమైన పుణ్యకర్మలలో ఒకటిగా భావింపబడుతున్నది. 

తపస్సు, జపము , ఇతర అనుష్టానాలతో సమానముగా ఈ దానము యొక్క విశిష్టత వర్ణింపబడినది. దీనిని ఋగ్వేదము ’ దక్షిణ ’ గా పేర్కొనింది [ 1. 125. 6 ] . అప్పటికాలములో దానము అంటే కేవలము ఆవులు , బంగారము మాత్రమే. అటుపిమ్మట అన్నదానము , విద్యాదానము , వంటి అనేక దానాలు గొప్పవని కీర్తింపబడినాయి. 

ఈ దానాలు / లేక దక్షిణలను రెండు విధాలుగా చూడవచ్చు
ఒకటి, సార్వజనికముగా సర్వేసర్వత్రా ఇచ్చే దానాలు
రెండు, బ్రాహ్మణులకు ఇచ్చే దక్షిణలు. 
వీటిని పాటించుట ద్వారా ధర్మము నిలబడుతుంది కాబట్టి , ధర్మాన్ని నిలబెట్టుట కోసము దాన దక్షిణలు ఇవ్వవలెను. ’ ధర్మము చేయండి ’ అనే మాటకు అర్థము అదే. 
అయితే ధర్మము అనే పదానికి అర్థము చాలా విస్తృతమైనది. సత్రములు , దేవాలయములు , భావులు , తోటలు, తోపులు  వంటివి కట్టించుట కూడా ధర్మము కిందకే వస్తాయి. 

దానధర్మములే మోక్షసాధనములు అని ఉపనిషత్తులు తేల్చి చెప్పాయి. 

ఉపనిషత్తుల ప్రకారము , దానము చేయుటవలన ఒక క్రమశిక్షణ కలిగి, మనుషులలో లోభము అనే దుర్గుణము పోతుంది. 
భగవద్గీత [ 16:1   మరియూ 17:20:22 ] కూడా దానమును ఒక గొప్ప దైవగుణముగా కీర్తిస్తుంది. 

వీటన్నిటినీ మించి, ధర్మశాస్త్రాలలోను, పురాణాలలోను దానము యొక్క విశిష్టత గొప్పగా వివరింపబడింది.

         దానమనేది నిత్యకర్మ కావచ్చు , లేదా నైమిత్తికమో, కామ్యమో, విమలమో [ అతి స్వఛ్ఛము ] అయిన కర్మ కావచ్చు. 
ఆకలిగొన్నవారికి ఆహారమును ఇచ్చుట నిత్య దానము లేదా నిత్యాన్నదానము.  దీనిని మనము అనేక దేవస్థానాలలోను , ఇతర ధార్మిక సంస్థలలోనూ చూస్తూనే ఉంటాము. 


        ఇక నైమిత్తికమంటే , ప్రత్యేక దినాలలో చేసే దానాలు. ఉదాహరణకు , గ్రహణాలు, సంక్రమణాల వంటి రోజుల్లో చేసేవి. అనేకులు తమ పుట్టినరోజునాడో, ఇతర ప్రత్యేకమైన దినాలలోనో చేస్తుంటారు..ఉగ్రరథ , భీమరథ శాంతులలో భాగముగా కూడా దానాలు ఇస్తారు. ఎవరైనా మరణిస్తే , వారి కర్మలు అయ్యాక, పదవరోజు దానాలు ఇస్తారు. . ఇవన్నీ నైమిత్తికమైనవి. 

     కామ్యములంటే  , ఏదైనా ఒక కోరిక తీరుట కోసము చేసిన పూజలు లేదా యజ్ఞాలలో భాగముగా దానములిచ్చుట. సాధారణముగా బంగారము , గోవులు దానము ఇస్తారు. 

      ఇక నాలుగోది, యతులు, సన్యాసులకు ఇచ్చే దానములు ’ విమలము ’ అనిపించుకుంటాయి. అక్కడ దాతకు యే కోరికా , అవసరమూ ఉండదు. కేవలము భక్తితోనో , దైవ చింతతోనో ఇచ్చేవి. 

ఈ దానాలు అన్నీ కూడా , మూడో కంటికి తెలియకుండా గొప్పకోసము కాకుండా ఇచ్చినపుడే , ఫలవంతములవుతాయి. 

         దానాలు, దక్షిణలు ధర్మానికి సంబంధించినవి కాబట్టి, వీటికి కొన్ని నియమాలు, కట్టుబాట్లూ ఏర్పడ్డాయి. 

దానము చేసే దాత, తనకు ఏ విధమైన ’ నివారింపలేని’  రోగములూ లేనప్పుడు, తనకు పాతకములు చుట్టుకొని లేనపుడు, తాను అనేక పుణ్యాలు చేసి, సద్గుణ సంపన్నుడై ఉన్నపుడు , ధనాన్ని న్యాయమార్గములో సంపాదించినప్పుడు మాత్రమే దానము చేయుటకు అర్హుడు. 
అంతే కాదు, గ్రహీత కూడా , ఆ దానమును తీసుకొనుటకు అర్హుడై ఉండవలెను. అతడు / ఆమె చెడు అలవాట్లు, చెడు శీలము కలిగిఉండరాదు. తాగుబోతులకు, జూదగాళ్ళకు, నేరస్తులకు దానము తీసుకొనే అర్హత లేదు. అట్టివారికి ఇవ్వరాదు. గ్రహీతలకు అన్న వస్త్రాలు , భూములు, ధనము వంటివి ఆ సమయములో అత్యంత అవసరమై ఉండవలెను. అట్టివారికి మాత్రమే దానము ఇవ్వవచ్చును. 

దాతకు ఉండాల్సిన మరికొన్ని అర్హతలు , దానము మీద శ్రద్ధ , భక్తి కలిగి ఉండటము , పుణ్యసంపాదన అనే ఉద్దేశము కలిగిఉండటము ముఖ్యము. అంతే కానీ, వారు ఎంత ఇస్తున్నారు అనేది ముఖ్యము కాదు. అయితే తాముఇచ్చే వస్తువులు / పదార్థములు ఉపయోగయోగ్యములుగా ఉండవలెను. పాడైపోయిన పదార్థాలు , వట్టిపోయిన ఆవులు , ఇతరలోహములు కలిపిన బంగారము--వంటివి ఇవ్వరాదు. 

దాత , గ్రహీత కూడా , అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన ధనమును దానములో విసర్జించాలి. అట్టివి ఇవ్వరాదు, తీసుకొనరాదు. అలాచేస్తే విపరీత పరిణామములు కలుగుతాయి. 

ఒక గృహస్తు, తనకు శక్తికి మించిన దానములు ఎన్నటికీ చేయరాదు. పుణ్యము వస్తుందని , అప్పులు చేసి దానములు ఇవ్వరాదు. తాను ఇచ్చే దానమువలన తన కుటుంబ సభ్యులు నష్టము, కష్టము అనుభవింపరాదు. సాధారణముగా , గృహస్తులు తమ ఆదాయములో పది శాతము వరకూ దానాలు ఇవ్వవచ్చు. కనీసము పదిశాతము ఇవ్వవలెను-అని దీని అర్థము కాదు. 

ఇక దానము ఇవ్వకూడని వస్తువులు/ పదార్థములు

తనకు చెందని వస్తువులు / పదార్థములను ఎన్నటికీ దానము చేయరాదు, అటువంటివని తెలిస్తే తీసుకోరాదు. ఇతరుల నుండీ అరువు తెచ్చుకున్నవీ, ఇతరులు తమవద్ద రక్షణకోసము ఉంచినవీ దానాలు ఇవ్వరాదు. 

ఇక గ్రహీతలు కూడా , ’ స్వధర్మానికి ’ సంబంధించని దానాలు స్వీకరించరాదు. ఉదాహరణకు , ఒక శ్రోత్రియ బ్రాహ్మణుడు, ఆయుధములు , మత్తుపదార్థములు వంటివి ఇచ్చిననూ తీసుకోరాదు. 
దానాలు ఇవ్వవలసిన / తీసుకోతగిన దినములు

ముందే చెప్పినట్టు, ఉత్తర దక్షిణాయన పుణ్యకాలములందూ, గ్రహణకాలము లందూ , సంక్రమణ కాలములందూ , అమావాస్య, పౌర్ణమిలయందూ , ఏదైనా ప్రత్యేక పర్వదినములందూ  దానము ఇచ్చుట, తీసుకొనుట ప్రశస్తమైనది. 
తీర్థయాత్రలలో, పుణ్యక్షేత్రములలో ఇచ్చిన దానాలు అత్యంత శ్రేష్టమైనవి. 
ఒకసారి దానము ఇచ్చిన తరువాత దానిని తిరిగి తీసుకోరాదు. దానము ఇస్తానని మాట ఇచ్చిఉంటే , ఆమాట తిరిగితీసుకోరాదు. దానము ఇచ్చే తీరవలెను. అయితే , మతిస్థిమితము లేనివారు, తీవ్రమైన రోగములతో బాధపడువారు, పరిపక్వత లేని చిన్నపిల్లలు ఇచ్చిన దానాలకు ఇది వర్తించదు. 

దానములన్నిటిలోకి గోదానము , సువర్ణ దానము , తులాపురుషదానము గొప్పవిగా శాస్త్రాలు చెపుతాయి. 
" తులా పురుషదానము " నకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ బ్లాగులోనే ఇక్కడ చూడవచ్చు. 

http://vibhaataveechikalu.blogspot.in/2014/03/blog-post_28.html

జ్ఞానదానము , విద్యాదానము , ధర్మమునకు సంబంధించిన విషయ దానము అతిగొప్పవని శాస్త్రాలు చెబుతాయి. దానమువలన శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు అని మహానారాయణోపనిషత్ అంటుంది. 

ఇక దక్షిణ ల గురించి. 

దక్షిణ కూడా ఒక విధమైన దానమే అయిననూ, దక్షిణ ఇచ్చుటలో దాతకు ఒక బద్ధత అనేది ఉంటుంది. అనగా , ఇక్కడ దానమిచ్చుట అనేది దాత ఇష్టాఇష్టాలపై పూర్తిగా ఆధారపడదు. అది ఒక బాధ్యత. ఒకరినుండీ ఏదైనా ఒక ఉపకారము పొందినపుడు, ప్రత్యుపకారముగా ఇచ్చేదే దక్షిణ లేక సంభావన. 

ఇది ఎవరికైనా ఇవ్వతగినదేకానీ ఎక్కువగా ధార్మిక కార్యాలు జరిపించి ఇచ్చే పురోహితులకు , బ్రాహ్మణులకు ఎక్కువగా ఇది వర్తిస్తుంది. దక్షిణ అనేది వారి సేవలకు ప్రతిఫలము అనో, భత్యము అనో, జీతము అనో , రుసుము అనో అనుకుంటే అది పూర్తిగా దోషభూయిష్ఠమైన ఆలోచన. ఋణమును తీర్చుకొనుట ఎటువంటి బాధ్యతో, మనకు పాపమును పోగొట్టి, పుణ్యమును పక్వమునకు వచ్చునట్లు చేయు బ్రాహ్మణులకు దక్షిణ నిచ్చుట కూడా అటువంటి బాధ్యతే.  దురదృష్టముకొద్దీ ఈ కాలములో దక్షిణ అంటే అది ఒక రుసుముగా  భావిస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు. 

ధార్మిక కార్యక్రమాలు చేయించుట ద్వారా బ్రాహ్మణులు యజమానికి తన పుణ్యము పక్వమునకువచ్చునట్లు చేయుటే గాక, అతడిచ్చు దక్షిణ స్వీకరించి అతడి పూర్వ పాపములో భాగము పంచుకొంటున్నాడు. ఆ పాపాన్ని పోగొట్టుకొనుటకు ఆ బ్రాహ్మణుడు ప్రాయశ్చిత్తములు చేసుకొనవలెను. 

సాధారణముగా త్రికాల సంధ్యావందనము వలన ఆ పాపములు శమించుచుండును. కానీ ఒక్కొక్కసారి అంతకుమించిన ప్రాయశ్చిత్తములు కూడా చేసుకొనవలసి వచ్చును. 

బ్రాహ్మడికి దక్షిణ ఇంత అనీ ఎక్కడా నిర్వచనము లేదు. అయితే , " విత్త శాఠ్యము " లేకుండా , తనకు ఉన్న శక్తికొలదీ వీలైనంత ఎక్కువగా ఇచ్చి బ్రాహ్మణుడిని సంతృప్తి పరచవలెను. బ్రాహ్మణుడు చేయించిన పూజల/ హోమాల ఫలితము పూర్తిగా యజమానికి దొరకవలెనంటే అతడు  తన శక్తికొలదీ దానము దక్షిణగా ఇవ్వవలెను. పీనాసితనము చేయరాదు. శక్తి ఉండీ తక్కువ దక్షిణను ఇచ్చినచో అతడి కార్యము అంతమేరకు కుంటుబడుతుంది. కావలసిన కార్యములు దానివలన పూర్తిగా సఫలము కావు. శక్తిలేనివాడు తక్కువ ఇచ్చినా కూడా అతడి కార్యము పూర్తిగా సఫలమవుతుంది. కాబట్టి, తన శ్రేయస్సు కోసము , బ్రాహ్మణుడి చేత కార్యములు చేయించుకొను యజమాని ఎప్పుడూ కూడా వీలైనంత ఎక్కువగా దక్షిణ ఇచ్చుచుండవలెను. 

ఇక, దక్షిణ ఎప్పుడు ఇవ్వాలి అనునది-
ఏదైనా కార్యము ముగిసిన వెంటనే దక్షిణ ఇచ్చినచో అది యజమానికి సర్వశుభములనూ కలుగజేయును. 
అలాకాకుండా , ఏ కారణము చేతనైనా వెంటనే ఇవ్వలేక పోతే , ఒక రాత్రి గడిచాక ఇస్తే , ఆ దక్షిణను రెట్టింపుగా ఇవ్వవలెను. 
ఒక మాసము గడిచినా ఇవ్వకుండా, తరువాత ఇస్తే దక్షిణను , తాను అనుకున్నదానికన్నా వందరెట్లు ఎక్కువ ఇవ్వవలెను. 
రెండు మాసముల తరువాత ఇస్తే , వెయ్యిరెట్లు ఇవ్వవలెను.
 సంవత్సరము గడిచాక ఇస్తే , అది నిష్ప్రయోజనమే కాక, ఆ యజమానికి నరక ప్రాప్తి తప్పక కలుగును అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. 

ఈ కాలము ’ ఎంత ఇవ్వాలి ?’ అని ముందే అడుగుతున్నారు. లేదా , అతి తక్కువ ఇవ్వ జూపి, బ్రాహ్మణుడి చేత " అంత చాలదు, ఇంకాఎక్కువ ఇవ్వండి " అని చెప్పించుకునేలా చేస్తున్నారు. బ్రాహ్మణుడిచేత అలాగ నోరుతెరచి ’ దక్షిణ ఇంత ఇవ్వాలి ’ అని చెప్పించుకుంటే , అది మరొక పాపముగా పరిగణింపబడుతుంది. దానికి ప్రాయశ్చిత్తముగా ఇంకా ఎక్కువ ఇవ్వవలసి ఉంటుంది. ఇవన్నీ ధర్మ శాస్త్రాలలో విపులముగా చర్చించిన విషయాలు. 

బ్రాహ్మణుడి చేత తమకు కావలసిన కార్యము  జరిపించుకుని , తామేదో దానము ఇస్తున్నట్టు అహంకారము చూపిస్తూ బ్రాహ్మణులను తక్కువ చేసి వేధించేవారికి కులనాశనము , వంశ క్షయము , కుటుంబములో ఈతి బాధలు మొదలవుతాయి. 
బ్రాహ్మణుడు కూడా ఎప్పుడూ తన నోటితో ’ నాకు ఇంత కావలెను, ఇది కావలెను ’ అని అడుగరాదు. అలా అడిగితే , ’ మీ పాపము నాకు రావలెను ’ అని అడిగినట్టే. అలా వచ్చిన పాపమును పోగొట్టుకొనుట అంత సులభము కాదు. 
" ఈ కాలములో ఇంత ఇస్తున్నారు, మీరు చూసి, శక్తివంచన లేకుండా ఇవ్వండి ’ అని చెప్పవచ్చును. 

ఇక చివరగా " గురుదక్షిణ " 
గురువుగారు తాను విద్యాదానము చేసిన శిష్యుడి నుండీ తీసుకునే దానమే " గురుదక్షిణ " 
గురుదక్షిణ ’ ఇది ’  లేక ’ ఇంత ’ అని గురువు చెప్పవచ్చును. లేదా గురువుగారికి ఏది అవసరమో, ఏది ఇష్టమో చూసి శిష్యుడే తెలుసుకొని ఇవ్వవచ్చును. గురుదక్షిణ ఇవ్వడానికి ఒక కాలపరిమితి అంటూ లేకపోయినా , సాధారణముగా విద్యార్జన అయిన తరువాత వెంటనే ఇచ్చుట ఆనవాయితీ. 

|| స్వస్తినో బృహస్పతిర్దధాతు || 

Friday, March 30, 2018

శృంగేరీ జగద్గురువుల సంస్కృత అనుగ్రహ భాషణము-- తెలుగు అనువాదము

|| ఓం శ్రీ గురుభ్యో నమః ||


శృంగేరీ జగద్గురువులు గత జనవరి నెలలో శృంగేరీ క్షేత్రములోని ఒక సంస్కృత విద్యాపీఠపు రజత మహోత్సవములో , సంస్కృత భాష , శాస్త్రములు , వేదములు మానవజీవితానికి ఎందుకు అవసరమో తెలుపుతూ చేసిన సంస్కృత భాషలోని అనుగ్రహ భాషణమును తెలుగులోకి అనువదించాను. 

ఇందులో  సరిగ్గా నేను అనువాదము చేసి ఉంటే , అదంతా జగద్గురువుల ఆశీర్వాద బలముచేతమాత్రమే . ఏవైనా తప్పులు ఉంటే అవి నా అజ్ఞానము వల్లనే. దానికి ముందస్తు క్షమాపణలు .


|| నిత్యాక్ష హారం మణివలయ 
మనోజ్ఞేః పాణి పద్మైర్దధానా ||
|| సితవసన లలామా  తుంగ ముక్తాభిరామా |
| వసతు శశినిభాస్యా వాచి వాగ్దేవతా నః ||


పాతిక సంవత్సరాల పూర్వము ఈ శృంగగిరి క్షేత్రములో  ప్రారంభించబడిన ’ రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయము’   పేరుతో వ్యవహరింపబడుతున్న ఈ సంస్కృత విద్యాలయము యొక్క రజత మహోత్సవము ప్రస్తుతము జరుపుకుంటున్నందుకు  అత్యంత సంతోషించినాము.

ఈ విద్యాలయము యొక్క ప్రారంభము ఏవిధముగా జరిగినది అన్నది , ఈ మఠము యొక్క ప్రశాసనములో స్వకీయమైన భాషణము ద్వారా నిరూపించబడినది . 

దీనికి ముందే , శృంగగిరి క్షేత్రములో చాలా కాలమునుండీ వేద, శాస్త్రముల ప్రచారము కోసము ఒక సంస్కృత పాఠశాల నడుస్తున్నది. మా పూజ్య గురువులు , ప్రాతఃస్మరణీయులుయైన జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ స్వామి వారి చేత నూట ఇరవై ఐదు సంవత్సరముల ముందు ఈ క్షేత్రములో " సద్విద్యా సంజీవిని " పేరుగల సంస్కృత మహాపాఠశాల ఆరంభింపబడినది. ఆ పాఠశాలయొక్క ఏకైక లక్ష్యము, ’ వేద, శాస్త్రముల ’ ప్రచారము చేయుట. 

’ వేద శాస్త్రముల గురించి మాత్రమే ఎందుకు ’ అని మీరు అడిగితే , వేదశాస్త్రముల ప్రచారమే లేకపోతే , అప్పుడు మనము మన ధర్మము యొక్క స్వరూపాన్ని తెలుసుకొనుటకు అశక్తులము అవుతాము. ఏలననగా , ధర్మముయొక్క స్వరూపము వేదశాస్త్రముల చేతమాత్రమే తెలుసుకొనదగినది. వేదశాస్త్రాల్లో ధర్మము యొక్క స్వరూపము నిక్షిప్తమై ఉంటుంది. ఒకవేళ వేదముయొక్క , లేదా శాస్త్రము యొక్క జ్ఞానము లేకుంటే , ఆ ధర్మమును ఇంకేవిధముగానూ తెలుసుకోలేము. ఎప్పుడైతే ధర్మముయొక్క స్వరూపమునే  తెలుసుకోలేమో, అప్పుడు దాన్ని ఎలాగ అనుష్ఠించగలము , ధర్మానుష్ఠానము లేకుండా సుఖము ఏలాగున లభ్యమగును ?. సర్వజనులూ తమకు సుఖమునే కోరుకొందురు. ఆత్మ సుఖము కోరనివాడు, లేదా తనకు దుఃఖము కోరుకొనువాడు ఎవరూ ఉండడు. అట్టి సుఖముయొక్క అభిలాష ధర్మాచరణ చేత మాత్రమే సిద్ధిస్తుంది. ధర్మాచరణము లేకుండా సుఖప్రాప్తిగానీ , సుఖవాంఛ గానీ అత్యంత అనుచితమైనది. అసాధ్యమైనది కూడా!  కాబట్టి, ధర్మాచరణము చేయవలెనంటే , ధర్మపు జ్ఞానము అవసరము , ధర్మాన్ని తెలుసుకొనుటకు వేదశాస్త్రాల పరిచయము అత్యావశ్యకము. 

అందుకని ఈ వేదశాస్త్రముల ప్రచారము అత్యంత అపేక్షితమైనది అని భావించి ఆ పాఠశాల ఈ క్షేత్రములో నూట ఇరవై అయిదు సంవత్సరాల పూర్వము ప్రారంభింపబడినది. 

ప్రస్తుతము, లోకుల మనసులలో విదేశసంస్కృతి , మన సంస్కృతికన్నా ఎక్కువగా ప్రచారములో ఉంది. విదేశ సంస్కృతి చేత ఆకర్షింపబడిన ప్రజలు విదేశ సాంప్రదాయాలను ఆచరించుట చాలా సముచితము అన్న భ్రమలో ఉన్నారు. విదేశీయులు దేన్ని ఆచరిస్తున్నారో, వారు ఎలాగ వేషభూషణ భాషలను ప్రదర్శిస్తున్నారో , వారు ఏ విధముగా భోజనము చేస్తారో ,ఏ విధముగా గానము చేస్తారో అదే మంచిది అన్న భ్రమ, మనవారి మనసులలో నిలచిపోయింది. మన వాస్తవికమైన స్థితి ఎటువంటిది, మన నిజమైన సాంప్రదాయాలు ఎట్టివి అన్నది మనవారు అందరూ మరచిపోయారు.


 ఈ దుష్ట పరిస్థితి, రెండువందల యాభై సంవత్సరాలనుండీ, ఆంగ్లేయుల పరిపాలన జరగడము వలన మన మనసులు కలుషితమై  ప్రావిర్భవించినది . ఆ ఆంగ్లేయులు, " ఎప్పుడైతే ఈ భారతీయులు తమ స్వధర్మాన్ని మరచిపోతారో,  తమ సంస్కృతిని మరచిపోతారో,  తమ సంస్కృత భాషను మరచిపోతారో, అప్పుడే తమ కార్యము సులభముగా చేయవచ్చును "  అని వారు అనేక కార్యాలను చేయనెంచినారు.  వారికి ఇఛ్ఛ వచ్చినట్టు చేయవచ్చని , మన సంస్కృత భాషను ’ మృత భాష ’ గా ప్రచారము చేయాలని భావించి అటువంటి కార్యాలను మొదలుపెట్టారు. 

" ఎప్పుడైతే   మన సంస్కృత భాషపై జనులకు శ్రద్దాసక్తులు తగ్గిపోతాయో , అప్పుడు ఎవరూ ఈ భాషను అభ్యసించరు, మరియు, ఈ భాషయొక్క అనభ్యాసము వలన వేద శాస్త్రాల అభ్యాసము లుప్తమవుతుంది, సనాతన ధర్మపు గ్లాని కలుగుతుంది అప్పుడు అందరూ విదేశీ సంస్కృతిని ఆచరిస్తారు " అని వారు తలచి, సర్వ ప్రథమముగా సంస్కృత భాషను ’ మృతభాష ’ అని ప్రచారము చేసి మన మనసులలో సంశయాలకు బీజము వేసినారు.

 మనలోని కొందరు మూర్ఖులు, వారు చెప్పినది సత్యమని తలచి మన భాషను విస్మరించి, సంస్కృత భాషపైన శ్రద్ధను వహించక తాత్సారము చేసి సంస్కృత భాషాభ్యాసము మానేసి తమ జీవితాలను గడుపుచుండేవారు. దానితో ఆంగ్లేయులు తాము కృతార్థులమైనట్టు భావించారు. తాము అనుకున్నది జరిగింది, అందరూ తమ సంస్కృతభాషను మరచేటట్టు చేశాము , దీనితో మేము పూర్తిగా కృతార్థులము అయినట్టే అని వారనుకున్నారు. 


అయితే పరమేశ్వరుని కృపవల్ల, మన భారతీయుల మనసులలో సంస్కృతభాష పైన శ్రద్ధ అంకురించింది. ఆ శ్రద్ధను అంకురింపజేయుటకు , ఆ శ్రద్ధను వృద్ధిచెందించుటకే మన పరమపూజ్య గురుసమానులు కొన్ని ప్రయత్నాలను చేయాలని అనుకున్నట్టుగానే , వారి ప్రయత్నములచేతనే శృంగేరీ ’ సద్విద్యా సంజీవిని ’ సంస్కృత పాఠశాల సమారంభమైనది. వారిమార్గములోనే నడుస్తున్న మనము , ఆ సంస్కృత భాషా ప్రచారము కోసము ఎన్నో దారులు వెతికాము. " సుర సరస్వతీ సభా" యొక్క ప్రతిష్ఠాపనము, అక్కడక్కడ సంస్కృత పాఠశాలల ఉద్ఘాటన , శాస్త్ర సభల ఆయోజనము , శాస్త్రవిద్వాంసుల సమ్మానము, శాస్త్రాధ్యయనము చేసేవారికి ప్రోత్సాహము , ఇటువంటి విహితమైన క్రమములు మాచేత చేపట్టబడినవి. 

దీని ఫలితముగా అక్కడక్కడా సంస్కృత విద్వాంసులను ఈనాడు మనము చూస్తున్నాము. సంస్కృతము మీద ఉత్సాహము , శ్రద్ధ గల విద్యార్థులను చూడగలుగుతున్నాము.  మరియూ , శాస్త్ర , వేద విషయములలో కూడా శ్రద్ధ కలిగిన ఆస్తికులను కూడా చూడగలుగుతున్నాము. ప్రస్తుతము చాలామంది ఆస్తికులు ఉన్నారు. వారు స్వయముగా సంస్కృతము గానీ , వేదమునుగానీ నేర్వకున్ననూ , ఎరుగకున్ననూ , వాటిలో అతిగొప్ప శ్రద్ధను కలిగిఉన్నారు. 

సంస్కృతముయొక్క ప్రచారమునకు సహాయము చేయుటకు ’ నేనంటే నేను ’ అంటూ ముందుకు వస్తున్నారు. అందువల్ల ఈ సంస్కృత ప్రచారము కొరకు మేము చేస్తున్న ప్రయత్నాలలో ఇక్కడ , శృంగేరీ సంస్కృత విద్యాపీఠము యొక్కస్థాపనము అనన్యమైనది . 

పూర్వ ప్రధాని , మమ్ములను చూచుటకు శృంగేరికి వచ్చినపుడు, వారి సమక్షములో ఈ విషయము మాచేత ప్రస్తావించబడినది. వారు కూడా మా మనసులోని ఈ సంకల్పాన్ని  ఎంతో శ్రద్ధతోను, సంతోషముతోను ఆమోదించినారు. మా సంకల్పము ను తప్పక నెరవేర్చెదమని ప్రతిజ్ఞ చేసినారు. వారి ప్రతిజ్ఞాపాలనము వల్లనే , ఈ ’ రాజీవ్ గాంధీ విద్యాలయము ’ అను  సంస్కృత విద్యాపీఠముయొక్క స్థాపనము జరిగినది. మా మనస్సు అత్యంత ప్రమోదమును పొందినది. భగవతీ శారద మా పైన అత్యంత అనుగ్రహము కలిగియున్నది అన్న తృప్తి కలిగినది. 


విద్యాపీఠముయొక్క స్థాపనమయితే అయింది కానీ అందులో అధ్యాపకులు ఎటువంటి వారుండవలెను , ఇక్కడ అధ్యయనము ఏ విధముగా జరగాలి, అని మరలా మా మనసులో కొంత దిగులు కలిగినది. ఆ దిగుళ్ళు కూడా భగవతీ కృపవల్ల నివారించబడి,  న్యాయము , వేదాంతము , వ్యాకరణములలోను, మీమాంస లోనూ నిష్ణాతులైన విద్వాంసులు ఇక్కడ నియమింపబడినారు.  మరి యే విద్యాపీఠములలోనూ చూచుటకు దొరకనటువంటి విద్వాంసులు ఇక్కడ అధ్యాపనములో నిరతులై ఉండుట మేము భగవతీ శారద యొక్క కృపగా భావిస్తున్నాము. 

ఇక్కడ అధ్యయనము చేస్తున్న విద్యార్థులు కూడా అమిత ఉత్సాహముతో , గొప్ప శ్రద్ధాభక్తులతో అభ్యసిస్తున్నారు. ఇదంతయూ సాక్షాత్కరించుకోవడము , సర్వులకూ శుభము కలుగుట ,  భగవతీ శారద యొక్క అనుగ్రహము తప్ప మరొకటి కాదు అనుటలో యేమాత్రమూ  సంశయమూ లేదు. 


ఈ సురభారతి యొక్క ప్రచారము మా అందరి అన్ని కర్తవ్యములకన్నా అత్యంత ముఖ్యమైనది అని మేమందరమూ  భావిస్తున్నాము. అందరికీ ఒక్కొక్క కర్తవ్యము ఉంటుంది ,  కానీ అందరూ కలసి ఒక్క కార్యమును చేయుట అనేది సుర సరస్వతి యొక్క ప్రచారము. కాబట్టి మా కర్తవ్యమునుండి  ఎప్పుడైనా కూడా , యే మాత్రము కూడా విచలితులము కాకూడదని , ఏ విధమైన కష్టములు వచ్చినా కూడా  ఈ కర్తవ్యము తప్పక నిర్వహించవలసినదే అని, ఈ కర్తవ్యాన్ని మేము నెరవేర్చవలసినదే ఈ సంకల్పము అందరి మనసులలోనూ సుదృఢముగా ఉండాలని నా కోరిక. 

చాలామంది , " శాస్త్రములను అధ్యయనము చేస్తే ప్రయోజనమేమి ? "  అని సంశయిస్తారు. అయితే ఒక్కొక్క శాస్త్రమునూ అధ్యయనము చేస్తేనే గానీ అక్కడ ఎన్నెన్ని విషయములు ఉన్నవి , మన జీవితాలను సార్థకము చేయుటకు ఎన్ని మార్గములు శాస్త్రములలో చెప్పబడినవి , అన్న విషయము శాస్త్రాధ్యయనము  తరువాత మాత్రమే తెలుస్తుంది. శాస్త్రము చదవకుండా వాటిని అర్థము చేసుకొనుట వీలుకాదు. కాబట్టి, శాస్త్రములను అవగాహన చేసుకొని , జీవితమును ఫలవంతముగా గడిపే దారి ని శాస్త్రాధ్యయనము ద్వారా సరిగా  తెలుసుకోగలుగుతాము. 


సర్వులకూ జీవిత అంతిమ లక్ష్యము మోక్ష ప్రాప్తి. మోక్షప్రాప్తితోనే  జీవితము సార్థకము అవుతుంది.  లేకపోతే మరల మరల ఈ జీవన ప్రవాహములో మగ్నము , నిమగ్నము అగుటయే మన భాగ్యము అవుతుంది. ఎంతవరకూ మనము ఈ జనన , మరణ ప్రవాహము నుండీ బయటకు రాలేమో , అంతవరకూ  మనకు సుఖలేశమూ ఉండదు , లేదు.  ఈ జనన మరణ ప్రవాహమునుండి బయటకు ఎప్పుడు రాగలమంటే , శాస్త్రములలో యే సాధన మార్గములు చెప్పబడి ఉన్నవో , వాటి అనుసరణము చేత మాత్రమే అది సాధ్యము. ఆ మార్గములు శాస్త్రములచేత మాత్రమే ప్రదర్శింపబడినవి, శాస్త్రములచేత ఉక్తమైన  ప్రదర్శింపబడిన అట్టి సన్మార్గములు మాత్రమే మన చేత పాటింపదగినవి. కాబట్టి అందుకోసమే మనమందరికీ శాస్త్రాధ్యయనము అనివార్యము అయినది. 

పూర్తిగా శాస్త్రాధ్యయనము చేయలేకున్ననూ , వాటిలోని సారాన్ని గ్రహించి పాటించి , జీవితాలను సార్థకము చేసుకొనుట మన విధి. కాబట్టి మన అందరి అభ్యుదయము కొరకూ మూలభూతమైనవే ఈ రెండూ-- శాస్త్రము , మరియూ సంస్కృత భాష. కాబట్టి శాస్త్రముల అధ్యయనము , వేదాభ్యాసము అనునవి మన శ్రేయస్సుకోసమే కల్పింపబడినవి. మన శ్రేయస్సును మనమే సాధించాలి. వేరొకరు మన శ్రేయస్సుకు సాధకులు కాలేరు. మన శ్రేయస్సును మనమే సాధించాలంటే , శాస్త్రాలను , సంస్కృత భాషను అవశ్యము అభ్యసించవలెను. దానికోసమే ఈ విద్యాపీఠము సమారంభమైనది .. 

ఇప్పుడు దీనికి ఇరవై అయిదేళ్ళు గడచినవి. ఇరవై ఆరో సంవత్సరములో ఈ విద్యాపీఠము అడుగు పెట్టబోతున్నది. ఇదే విధముగా ఇంకో ఇరవై అయిదేళ్ళ తరువాత స్వర్ణోత్సవము , అటు పిమ్మట శతమానోత్సవము కూడా జరుగుతుంది. అటువంటి ఆ ఉత్సవాలలో భాగము వహించుటకు మాకు సాధ్యము కాకున్ననూ , ఈ ఉత్సవాలు తప్పకుండా జరుగుతాయి అని విశ్వసిస్తున్నాము. శారదా భగవతిని మీ అందరి శ్రేయస్సు అనే పరంపరలో భాగము వహించమని ప్రార్థిస్తున్నాము. 


ఈ రజత మహోత్సవము యొక్క ఆచరణలో గొప్ప శ్రద్ధతోను, ఉత్సాహముతోను అనేకులు తమ కర్తవ్యాన్ని నిర్వహించినందుకు మీ అందరికీ ఆశీర్వాదములను ఇస్తున్నాను. 
ఈ కర్నాటక రాజ్యము యొక్క రాజ్యపాలులైన  సహృదయాగ్రేసరులు వజుభాయి వాలా  మహోదయులు ఇక్కడికి వచ్చి , తమ భావములను ఇక్కడ ప్రకటించినారు. అది విని మాకు అత్యంత ప్రమోదము కలిగినది. మన భారతీయ సంస్కృతి , మన సంస్కృత భాషలలో వారికున్న శ్రద్ధ ఎంతో శ్లాఘనీయము. అందుకు వారికి విశిష్ట ఆశీర్వాదములను అందిస్తున్నాము. ఇదేవిధముగా , మన కర్నాటక సంసద్ సదస్యులు , మన శృంగేరీ శాసక సభ్యులు , కర్నాటక విత్తకోశపు మహా ప్రబంధకులు మొదలుగా అనేకులు ఇక్కడికి వచ్చి సంసృత భాష మీద తమకు గల శ్రద్ధను ఇక్కడ ప్రకటించినారు. వారందరికీ కూడా మా ఆశీస్సులు.  ఈ సంస్థానము యొక్క కులపతి ’ పరమేశ్వర నారాయణ భట్టులు , ఈ  విద్యాపీఠముయొక్క ప్రాచార్యులు సచ్చిదానంద భట్టు లు ఈ కార్యక్రమమును ఎంతో శ్రద్ధతో చేసినందుకు వారికి నా ఆశీర్వాదములు. ఇక్కడ సమావేశమైన సర్వులకు భగవతీ శారద తన శ్రేయః పరంపరతో సర్వదా సర్వులనూ  అనుగ్రహించాలని  ప్రార్థించి , అందరికీ ఆశీర్వాదములతో నా భాషణమును ముగిస్తున్నాను. 

https://www.youtube.com/watch?v=c2Fduv_9dz8

Friday, April 7, 2017

వేదములో గో రక్షణ



            ఈనాడు గోవధ గురించి విశేష చర్చ జరుగుతున్నది. గోవులను హింసించరాదనీ , గోమాంస భక్షణ చేయరాదనీ సనాతన ధర్మ పరాయణులు అంటుంటే , ఒకరి ఆహారపుటలవాట్లను నియంత్రించుటకు ఇంకొకరికి అధి కారము లేదు అంటూ మరి కొందరు వాదిస్తున్నారు. 
మానవుడు సహజముగా స్వేచ్ఛాజీవి. తన మనసుకు నచ్చినట్లు ఉండుట , ప్రవర్తించుట ...అతని ప్రాథమిక హక్కులు. కానీ ఇక్కడ గమనించవలసినది యేమంటే , ఆ ప్రాథమిక హక్కుల వలన అతడికి సంతృప్తి కలిగినంత మాత్రాన చాలదు. ఇతరులకు అసంతృప్తిగానీ కష్టము గానీ కలుగరాదు. ఎందుకు ?  
           ఎందుకంటే , మానవుడు సంఘజీవి.. అరణ్యాలలో , ఇతరుల సంపర్కము లేకుండా జీవించేవారికి అంతటా స్వేచ్ఛే ఉంటుంది. కానీ ఎప్పుడైతే సంఘములో ఉండి జీవించాలనుకుంటాడో అప్పుడే కట్టుబాట్లు మొదలవకా తప్పదు , వాటిని పాటించకా తప్పదు. నేను ఇవేవీ పాటించను , నా అలవాట్లు , నా ఇష్టము అంటూ వాదిస్తే , దాని అర్థము , " నేను ఆదిమ వాసిని , నాకు యే సంస్కారమూ లేదు , నాకు ఒకరి కష్టాలతో గానీ భావాలతో గానీ పని లేదు " అని నిర్లజ్జగా చెప్పుకున్నట్టే. 

ఒకవేళ , దీనికి కూడా సమ్మతించని  వారుంటే , నిస్సందేహముగా వారు తమ వాదనను , తమ హక్కులను గురించి తగిన వేదికలలో [ కోర్టులు వంటివి] చర్చించి ఒక తెన్నుకు రావచ్చు.

ఈ వ్యాసపు ఉద్దేశము , గోమాంస భక్షణ చేయవచ్చునా కూడదా అన్నది కానేకాదు. 
మరోసారి చదవండి , 
ఈ వ్యాసపు ఉద్దేశము , గోమాంస భక్షణ చేయవచ్చునా కూడదా అన్నది కానేకాదు.

అది నిర్ధారించుటకు సాధికారికత కలిగిన అనేకులున్నారు. 

       గోమాంసము తినవచ్చు అని  వాదించేవారు కొందరు , సనాతన ధర్మములో అతి పవిత్రముగనూ , ప్రామాణికము గనూ భావించి పూజించే వేదాలను వక్రీకరించే ప్రయత్నము చేస్తూ , తమ వాదనకు బలము తెచ్చుకోవడానికి సమాయత్తమవుతున్నారు. వారి వక్రీకరణలు , వాదనలూ  సత్యదూరాలనీ , యే మాత్రమూ బలము లేనివనీ , ఎంతమాత్రమూ గౌరవించవలసినవి కావనీ సత్యాలతో , సాక్ష్యాలతో సహా నిరూపించుటయే ఈ వ్యాసపు ఉద్దేశము.  

         వేదాలలో వర్ణించిన యజ్ఞ యాగాదులలో గోవధ , గోమాంస భక్షణ ఉన్నాయనీ కాబట్టి గోవధ తప్పేమీ కాదని గోమాంస భక్షణ అనాదిగా హిందువులు చేస్తూనే ఉన్నారనీ ఇప్పుడు కొత్తగా వాటిని నిషేధించడము యేమిటనీ ... ఇటునుంచీ నరుక్కు రావడానికి వారు ప్రయత్నిస్తున్నారు. మనసంతా మురికి పట్టిన మరి కొందరు , ఆ నటుడు , ఈ రాజకీయ వేత్త , ఫలానా పాత్రికేయుడూ హిందువులు మాత్రమే కాక , బ్రాహ్మణులు కూడా అనీ , వారే గోమాంసము తింటున్నారనో , లేక తప్పుకాదంటున్నారనో.... తమ వాదనను ఇతరులచేత ఒప్పించాలని విశ్వ ప్రయత్నము చేస్తున్నారు.. ఆ స్థాయికి దిగిపోయిన వారిని పట్టించుకోవడమే వృథా. అసలు వేదములో చెప్పినదేమిటి ?



 వేదాలలో గోవును పూజించి రక్షించమనే చెప్పి ఉంది గానీ గోవును హింసించమని ఎక్కడా చెప్పలేదు. 

         యజ్ఞయాగాలను సంపూర్ణముగా వివరించేది యజుర్వేదము మాత్రమే. యజ్ఞ యాగాలకు సంబంధించిన సమగ్ర సమాచారమూ సాధికారికముగా చర్చించినది యజుర్వేదములో మాత్రమే.. ఇతర వేదాలలో కూడా అక్కడక్కడా కనపడవచ్చు.. అది కూడా యజుర్వేదముతో అంగీకరిస్తూ ఒకదానినొకటి సమర్థించుకుంటూ సమభావముతో వివరింపబడి ఉంటుందే తప్ప ఒకదానికొకటి ఎక్కడా విరోధము ఉండదు. యాగాలకూ పశువధకూ సంబంధము ఉందా లేదా అనేది, ఆయా మంత్రాల నిజమయిన అర్థము తెలిస్తేనే అవగతమయ్యేది. కేవలం  సంస్కృత భాష తెలిసినంత మాత్రాన మంత్రాల అర్థాలను తెలుసుకోలేము. అసలు వేద మంత్రాలే బీజాక్షరాలతో , బీజార్థములతో ఉంటాయి.. అంటే , అతితక్కువ అక్షరాలలో అనంతమైన అర్థము ఇమిడి ఉంటుంది. వేదమంత్రాలంటే మామూలు సంస్కృత శబ్దాలు కాదు. అందుకే ఆ శబ్దాల యొక్క ప్రభావము అంత ఎక్కువ. వాటిని ఎంతో విజ్ఞతతో సమన్వయము చేయాల్సి ఉంటుంది

యజుర్వేదపు ప్రారంభములోనే ,  మొట్టమొదటి మంత్రము.. " ఇషేత్వోర్జేత్వా  వాయవస్థో పాయవస్థ... -----బహ్వీర్యజమానస్య పశూన్ పాహి " 

        పై మంత్రార్థము చూస్తే , ఇది పశువులను , ముఖ్యంగా వత్సములను ( దూడలను ) కాపాడుటకోసం ప్రయోగించబడుతుంది.  దర్శ యాగములో ఇంద్ర దేవతలకు పెరుగును ’ హవిస్సు ’ గా అర్పిస్తారు. ఆ పెరుగు దొరకాలంటే గోవులను ఆశ్రయించక తప్పదు. పాలు దొరికితేనే కదా , పెరుగు తయారయ్యేది ! ఆ పాల కోసము , ఆవుదూడలను కొంతపాలు తాగిన తర్వాత తల్లినుండీ వేరు పరచక తప్పదు. పాలు కావాలంటే ఇదే విధి.  ఆ దూడలకు , వేరే ఆహారాన్ని ఏర్పాటు చేయాలి. దూడలను ఆవునుండీ వేరు చేయాలంటే , వాటిని అదిలించో , ఆశపెట్టో ఆ పని చేయాలి. వాటికి హింస కలుగరాదు. కాబట్టి , ఒక మోదుగ కొమ్మను చెట్టునుండీ కత్తరించి , ఆకులు గల ఆకొమ్మతో దూడలను అదిలిస్తారు. తర్వాత వాటిని పచ్చిక మేయడానికి పంపిస్తారు. వాటికేమాత్రం బాధ కలగరాదని , వాటిని ఇలాగ ప్రార్థిస్తారు. " ఓ దూడలారా , మీరు వాయువులు కండి ( అంటే , ఇంకో అర్థము , మాతృ సమీపము నుండీ దూరము వెళ్ళండి.) . ఆ వాయువే మిమ్మల్ని రక్షించు గాక ( పశువులకు దేవత అంతరిక్షము , ఆ అంతరిక్షానికి అధ్యక్షుడు వాయువు ) గడ్డి మేసి , సాయంకాలానికి మరలా యజమాని ఇంటికి తిరిగి రండి.." 

      తర్వాత , గోవులను ఇలాగ ప్రార్థిస్తారు, " ఓ గోవులారా , సర్వప్రేరకుడైన ఆ సవితృ దేవుడు మిమ్మల్ని శ్రేష్టమైన కర్మ అగు యాగానికి హవిస్సును కలుగజేయుటకు ప్రేరేపించనీ.. దేవతలకు ఇవ్వతగిన పాలు , పెరుగు , నేయి మొదలైనవి , మీనుండీ గాక , ఇంకెక్కడ లభించును ? గోవులారా , మీరు హింసకు ఏమాత్రమూ అర్హురాళ్ళు కాదు. ( గోవులను ’ అఘ్ని ’ అని అంటారు... అంటే హింసింపకూడనివి ) మీరు మొదట మీ బిడ్డలకు , తర్వాత మనుషులకూ పాలిచ్చి , పుష్టిని కలిగిస్తున్నారు. ఇప్పుడు బాగా గడ్డి మేసి , ఇంద్రాది దేవతలకు కావలసిన హవిస్సును కూడా ఇవ్వండి.. మిమ్మల్ని , దొంగలు అపహరించకుందురు గాక. కౄర మృగాలు హింసింపకుండు గాక , రుద్రుడూ , రుద్రాయుధాలూ మిమ్మల్ని తాకకుండు గాక ( రుద్రుడి పని , కనిపించినవారిని హింసించుటయే ) మీ సంతతి వృద్ధియై , యజమానుని శాల నిండనీ ! 

     తర్వాత , మోదుగ చెట్టును ( కొమ్మను ) ఇలాగ ప్రార్థిస్తారు. ఓ పాలాశమా , దేవతలకు కావలసిన ఆహారము కోసము , నిన్ను వాడుకుంటున్నాను.  నిన్ను నమస్కరించి నిన్ను కత్తరిస్తున్నాను. దూడలు నిన్ను చూడగనే , బెదురు లేకుండా మరలిపోయేటట్టు చేయి , [ మోదుగకు మనసును ప్రభావితం చేసే సమర్థత ఉంది. యాగాలలో మోదుగను ఉపయోగించుట అందుకే ]  అలాగే యజమానుని గోవులను రక్షించు..

లోకకల్యాణార్థమై , ఒక్క యాగము కోసము , యాగము సక్రమంగా జరిగి , ఎవరికీ ఏ బాధా కలుగరాదని , వాటికి అవసరమైన అన్నిటినీ ప్రార్థించి గానీ మొదలుపెట్టని సంప్రదాయాన్ని మనకు వేదము నేర్పింది.. ఇవే కాదు , ఇంకా వేరు మంత్రాలలో , మట్టినీ , నీటినీ ఇతర పదార్థాలనీ ఇలాగే ప్రార్థించే సన్నివేశాలు కనిపిస్తాయి. 

ఈ అవగాహన లేకుండా , వేదాలలో హింసను ప్రేరేపించే అంశాలు ఉన్నాయనీ , పశు వధ ధర్మ సమ్మతమేననీ తమ స్వార్థము కోసము వక్రీకరించేవారు.. రేపు ఇంకెటువంటి పనిని అయినా చేయగల సమర్థులే. 

అసలు , వేదముతో మాకేమిటి పని , మేము వేదములో చెప్పినదాన్ని ఎందుకు పట్టించుకోవాలి ? అది మా మతము కాదే ? అనే వారూ ఉన్నారు.. అలాంటి వారు తెలుసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి..

వేదము భారతీయులకు మాత్రమే సంబంధించినది అని కొందరూ , కాదు , హిందువులకు మాత్రమే సంబంధించినవి అని మరికొందరూ , కానేకాదు , బ్రాహ్మణులకు మాత్రమే అని మరి కొందరూ.. యే మాత్రమూ కాదు , బ్రాహ్మణులలో మగవారికి , అందులోనూ ఉపనయనము అయిన వారికి మాత్రమే అంటూ అనేకులు భావిస్తుంటారు..

 అవన్నీ తప్పే. 

       వేదాలున్నవి సర్వ మానవాళి కోసము .. ఎందుకలా ?  ఎందుకంటే , అందులో ఉన్నవి అభిప్రాయాలు కావు. మానవాభ్యుదయానికి ఎలా జీవించాలో యేయే ధర్మాలను పాటించాలో యేది చేస్తే మానవులకు శుభమో , యేది అశుభమో , యేది మంచో యేది చెడో... స్పష్టముగా చెప్పి ఉంది. ఇవన్నీ కూడా ప్రకృతి సహజమైన ’ న్యాయాల ’ మరియూ ’ ధర్మాల ’ ఆధారముగా చెప్పబడినవే. ఈ న్యాయాలు , ధర్మాలూ సర్వమానవులకూ సమానమే.. ఉదాహరణకు భూమ్యాకర్షణ అనే న్యాయం ఉందనుకోండి... అది మనుషులకే కాక సమస్త జీవులకూ అన్వయించేదే .. మతాలను బట్టి అది మారదు.. అలాగే వేదము లోని న్యాయాలు సమస్తజీవులకూ సౌహార్ద వాతావరణములో జీవించుటకు చెప్పబడినవే గానీ , ఒక దేశము వారికో , ఒక మతము వారికో , మగవారికో ఆడవారికో  అని కాదు. 

       భూమ్యాకర్షణ న్యాయాన్ని అనుసరిస్తూ మరెన్నో ఇతర సూత్రాలు , సమీకరణాలూ తయారయ్యాయి... అవన్నీ సూత్రాలూ సమీకరణలే గానీ , స్వతంత్రముగా న్యాయాలు కావు. అవన్నీ భూమ్యాకర్షణ అనే న్యాయానికే కట్టుబడి ఉంటాయి.. అలాగే సనాతన ధర్మము అటువంటి అనేక ప్రకృతి సహజమైన న్యాయాల పుట్ట. సత్యము , అహింస , బ్రహ్మ చర్యము , మిత్రత్వము... ఇటువంటి వన్నీ సనాతన ధర్మాలే. ఇవే మన జీవన విధానాలు.  ఇక మతాలు అనేవి మతాలే గానీ న్యాయాలు కావు , కాలేవు.. మతము అంటే అభిప్రాయము మాత్రమే..ధర్మము కాదు.  మతాలెన్నున్నా అవి ప్రకృతి సహజమైన న్యాయాలకు లోబడి ఉంటూనే కొన్ని సమీకరణాలను కలిగి ఉంటాయి.. వాటికి ప్రత్యేక ప్రతిపత్తి లేదు. అవన్నీ ఒక మూల పురుషుడి అభిప్రాయాలనుండీ పుట్టినవి మాత్రమే.  అటువంటి యే మతములో కూడా పరస్పర మైత్రి గురించి , అహింసను గురించీ  వేదములో చెప్పినంత దృఢముగా , గాఢముగా చెప్పలేదు. ఇది తెలుసుకోవడానికి ఆయా మత గ్రంధాలను చదివే అవసరము లేదు. సర్వమత సామరస్యము , సహనము వంటివి ఒక్క సనాతన ధర్మాన్ని పాటించే వారికి తెలిసినంతగా ఇతర ’ మతాల ’ వారికి తెలియదు అని వారి చర్యలే చెబుతున్నాయి .. మా మతాన్ని పాటించకపోతే చంపేస్తామని కొందరూ , మా మతము లో చేరకపోతే నరకమే గతి యని మరికొందరూ భయపెట్టో , ప్రలోభపరచో చేస్తున్న ప్రయత్నాలే దానికి సాక్ష్యము. సర్వ మానవ మైత్రిని ఆకాంక్షించే వారయితే అటువంటి ఆలోచనలే రావు కదా... 
             సనాతన ధర్మము అలాగ కాదు,ప్రకృతి సహజమైన న్యాయాలకు అనుగుణంగా ఒక జీవన విధానాన్ని నిర్వచించేదే సనాతన ధర్మము. వేదాలు అనేవి అభిప్రాయాలు కావు. ప్రకృతి సహజ న్యాయాలు. లోకములో ఫలానా ఋతువులో ఫలానా పనులు చేయాలి , ఆ ఫలానా పనులను ఫలానా విధముగా చేయాలి , వంటి దేశకాలాలకు తగ్గట్టు చేయవలసిన కార్యాలను వివరిస్తాయి , అది కూడా మానవాభ్యుదయము కోసము మాత్రమే. ఎవరినో సంతోషపెట్టుటకు కాదు. మానవులందరికీ సమానముగా , మిత్రతా భావముతో లాభము కలిగించే అంశాలే ఉన్నాయి కానీ వేరు అభిప్రాయము గలవారికి నాశనము అంటూనో , కష్టాలు అంటూనో బెదిరింపులు ఎక్కడా లేవు.  వేదాలకు మూలపురుషుడంటూ ఎవరూ లేరు.. అందుకే వాటిని " అపౌరుషేయాలు " అంటారు.. అవి మానవుడు రాసినవీ , తయారు చేసినవీ కాదు... భూమ్యాకర్షణ మానవుడు తయారు చేశాడా ?  అలాగే. 

మరి వేదాలలో అక్కడక్కడా కనబడే గోవధ , మాంస భక్షణ , అశ్వమేధము , పశుబలి , బలిపశువులను కట్టి వేయు  యూప స్థంభము  వంటి వాటి అర్థమేమిటి ? 

 అవన్నీ అవగాహనా రాహిత్యముతో ఊహించుకున్నవి మాత్రమే ... 

మరి సత్యమేమిటి ? 

దీనికి కొందరు ఇలాగ సమాధానమిస్తారు..
" గోవధ వేదకాలంలో యజ్ఞాలలో ఉండినదే. కానీ బ్రాహ్మణులు గోమాంసము తినేవారా అన్నదే వివాదాస్పదము.. అయితే , గోవధ " హింస " కాదా అని మీరు అడగొచ్చు. కాదు. 
ఈనాటి మన సంకుచిత అర్థాలతోనూ , దృష్టితోనూ చూస్తే అది హింస అనిపించవచ్చు. ఈనాడైతే అది హింసే.  కానీ ఆనాడు కాదు. ఎలా ?
||మా హింస్యాత్ సర్వా భూతాని , అహింసా పరమో ధర్మః || 

అనే శ్రుతి వాక్యము అన్నివేదాల ఒట్టు సారాంశపు మాట. హింస , అహింస అనేవాటికి సందర్భాన్ని బట్టి  అర్థాలు మారుతాయి. దేశ రక్షణ చేసే సైనికులు శత్రువులను చంపితే అది అహింసే కానీ , హింస కాదు. ఒక రోగి కాలో చెయ్యో తీయాల్సి వస్తే , అది అహింసే. ఒక కార్యపు పరమార్థాన్ని చూడక , కార్యాన్ని మాత్రమే చూస్తే వచ్చే అనర్థమే అనేకులకు కలిగే అయోమయం. "

పై వాదనలో కొంత నిజముందని మొన్న మొన్నటి వరకూ నేను కూడా అనుకునే వాణ్ణి.. కానీ అది శుద్ధ తప్పని నిరూపణ అయింది [ ఎలాగో , కింద ఉంటుంది]

మరికొందరేమో , వేదకాలములో గోవధ ఉన్నా రానురాను అది సమంజసము కాదని అర్థము చేసుకున్న హిందువులు దానిని వ్యతిరేకించారు.  కానీ వేదాలను పూర్తిగా కొట్టి పారేయలేక , గోవులను , అశ్వాలను , మేకలనూ పిండితో తయారు చేసి వాటిని బలి ఇచ్చే ఆచారము మొదలైంది.." 
అని అంటున్నారు.

పై రెండు వాదనలూ సంపూర్ణముగా అసత్యములు , అవగాహన లేని మాటలూనూ. 
మరి వాస్తవమేమిటి ? 

    వేదాలకు అనేకులు భాష్యాలు రాసినా , అన్ని వేదాలకూ భాష్యాలు రాసింది సాయణాచార్యుడు ఒక్కడే. వేర్వేరు వేద భాగాల్లో వచ్చే అవే మంత్రాల అర్థాల నిజమైన ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని సాయణాచార్యులంటారు , 
|| బిభేత్యల్ప శ్రుతాద్వేదః మామయం ప్రతరిశ్యతి ||
వేదమే ఇలా అంటుందట , " అల్ప జ్ఞానులైన మనుషులు నన్నే వక్రీకరించి మోసగించగలరు " 

సత్యము తెలియాలంటే అతి ముఖ్యముగా ఒక సంగతి తెలుసుకోవాలి. 

సంస్కృత పదాలకు సాధారణముగా లౌకికార్థము , వేదార్థము అని రెండు అర్థాలుంటాయి . ఆ భేదము తెలుసుకోకపోతే కలిగేది మనుషుల మధ్య , జాతుల మధ్య వైషమ్యాలే .వేదములోని మంత్రాలూ , శబ్దాలు అన్నీ కూడా ఒక ప్రత్యేకమైన " వైదిక " మరియూ " యౌగిక " శబ్దాలు. మామూలు సంస్కృత పదాలకు , వేదములోని అవే పదాలకూ అజగజాంతరము ఉంటుంది.  ఆయా మంత్రాలను , సందర్భాన్ని బట్టి అర్థము చేసుకోవాల్సి ఉంటుందే గానీ ఆ పదాల సంస్కృత అర్థాలు తెలిసినంత మాత్రాన మంత్రపు అర్థము తెలిసినట్టు కాదు. అసలు వేద మంత్రాలే బీజార్థములతో ఉంటాయి.. వాటిని ఎంతో విజ్ఞతతో సమన్వయము చేయాల్సి ఉంటుంది.

     మరి శంకరాచార్యుల వంటి వారు కూడా వేదాలలోని గోవధను వర్ణించినారు కదా , దానికేమి సమాధానము చెబుతారు ? అని మరి కొందరు అడుగుతారు.  
     వేదాలకూ , ఉపనిషత్తులకూ భాష్యాలు రాసిన శంకరులు అంతకు ముందరి భాష్యాలను చదవలేదనీ , అసలు శంకరులు వేదాలలో చెప్పిన దానికి భిన్నముగా కొత్తగా ఏదైనా చెప్పినారనీ అనుకుంటే అంతకన్నా అజ్ఞానము మరొకటి ఉండదు. వేదములలోని మంత్రాలు ఎలాగ బీజరూపములో , వాటి సరైన అర్థాన్ని వాటి ధాతువుల మూలముగా ఎలాగ అర్థము చేసుకోవాలో , శంకరుల భాష్యములనుకూడా అలాగే అర్థము చేసుకోవలెను. శంకరులు కూడా వైదిక , యౌగిక అర్థాలతోనే ప్రతిపాదించినారు కానీ లౌకిక అర్థాలతో కాదు. వారి భాష్యాలకు విపరీతార్థాలు కనిపిస్తే అది మన దోషమే గానీ వారి భాష్యాలలోని దోషము కాదు. 

       అలాగే , కొన్ని పురాణాలు , ఇతిహాసాలలో ఉన్న హింసకు సంబంధించిన వ్యాఖ్యలు ఒకానొక కాలములో " ధూర్తుల " చేత చేర్చబడినవే.. శాంతి పర్వములో " యూపం ఛిత్వా , పశూన్ హత్వా .." అంటూ స్వర్గానికి పోగల మార్గమును వర్ణించినారు. పశువులను అలాగ బలి ఇచ్చి స్వర్గానికి వెళ్లగలిగితే లోకం లో అందరూ స్వర్గానికే వెళ్ళవలెను కదా.. స్వర్గప్రాప్తి ఎంత సులభము ? అటువంటి మాటలన్నీ ఇతరులచేత ఆయా భాగాలలో చేర్చబడినవి. అవి మనకు ప్రమాణము కావు.  వేదము మాత్రమే స్వతః ప్రమాణమైనది. ఎవరిచేతనూ మార్చబడుటకు అవకాశము లేనిది ఒక్క వేదము మాత్రమే. వేదము తనకు రక్షణగా వేదాంగాలైన జ్యోతిష్యము , [గణితము , ఖగోళము ], శిక్ష , వ్యాకరణము , ఛందస్సు , నిరుక్తము వంటివే కాక , పదపాఠము , క్రమ పాఠము , జటా పాఠము , ఘనపాఠములను  కలిగియున్నది. వాటివల్ల ఎవరు ఎక్కడ ఏ చిన్నపాటి మార్పు , అక్షరములో గానీ స్వరములో గానీ-- చేస్తే వెంటనే తెలిసిపోతుంది. కానీ మిగతావి అలాగ కాదు. భారతము , రామాయణము , చివరకు భగవద్గీతలో కూడా ధూర్తులు అనేక మార్పులు , చేర్పులు చేశారు. 
అందుకే వేదము మాత్రమే స్వతః ప్రమాణమైనది. మిగతావి ’ పరతః ’ ప్రమాణమైనవి.

       కొందరు ’ మేధావులు "  గా తమను తాము భావించుకునే వారు , ’ అశ్వమేధ ’ యాగము గురించి రాస్తూ , గుర్రమును చంపి వండుకోవటము , వండుతుండగా వచ్చే దాని సువాసనలనూ వర్ణించడమూ , అంతేనా , ,  గుర్రముతో యజమాని భార్య ఏమేమి చేస్తుందో... అలాంటివన్నీ  తమ మకిలి పట్టిన మనసుతీరా ఉన్మత్తపు రాతలు రాసి శునకానందము పొందుతుంటారు. 
        తాము ఆధునిక వైజ్ఞానికులమనీ , ఎన్నెన్నో పరిశోధనలు చేసి  మానవ జాతి " చరిత్ర ’ ను ఔపోసన పట్టామనీ , ఏవేవో పిచ్చిరాతలు రాసేవారు , సంస్కృతము ఒక్కటీ నేర్చుకుంటే చాలు , వేదాలను , సనాతన ధర్మాన్నీ భ్రష్టు పట్టేలా ఏదైనా , ఎలాగైనా వక్రీకరించి రాయొచ్చనీ , ఈ కాలము యువత సంస్కృతము  నేర్చుకోదనీ , తెలిసిన పాతవారు వీటన్నిటినీ పట్టించుకోరనీ ధీమాతో తమ మనసులలోని అశుద్ధాన్ని ఏ మాత్రమూ సంకోచమూ, సంశయమూ, మొహమాటమూ లేకుండా బయట పెట్టుకుంటున్నారు. 

శివపురాణములో కథానాయకుడు శివుడు , విష్ణు పురాణములో కథానాయకుడు విష్ణువు అంటూ ఇలాంటి వాళ్ళు చెప్పే ప్రతీదీ ఒప్పేసుకుంటూ పోతే మన ముఖాన మనమే మసి పూసుకున్నట్లే. అసలు నిజాలేమిటో కొన్ని చిన్న చిన్న ఉదాహరణలతో వివరిస్తాను.

యజుర్వేదములో " మా మా హిగ్ంసీ " అనగా , గోవులనూ , జంతువులను హింసించుట ఎంతమాత్రమూ తగదు " అని అంటుంది
యజుర్వేదములో కనపడే " పశుబలి " అనే మాటలకు అర్థము పశువులను బలి ఇచ్చుట కాదు , అది నిజానికి " పశుత్వ" బలి. కావాలన్న వారు " ధాతు రూప " శబ్దాలు ఎలా వచ్చాయీ , వాటి అర్థాలు ఎలా ఉంటాయీ అన్నది ధాతురూప కోశములలో చూడవచ్చు. వేదములోని శబ్దాలన్నీ ధాతువులనుండీ వచ్చినవే.. 
" మాంసము " అనగానే ఈనాడు ," నాన్ వెజిటేరియన్ " అనే అర్థము బలపడి పోయింది. వేదకాలములో ’ మాంసము ’ అంటే , ఫలములలోని గుజ్జు , దుంపలలోని గుజ్జు , అని మాత్రమే అర్థము.. ఈనాటి అర్థాలతో ఆనాటి వేదశబ్దాలను సంధానం చేస్తే జరిగే దుష్పరిణామమే ఇలాంటి వక్రీకరణలు. 

పిశాచి అంటే దయ్యం అని అర్థం చేసుకుంటున్నాము.. అది ’ పిశం అస్తి’ పిశ అవయవే ’ అనే ధాతువుల నుండీ వచ్చినది  అనగా , ఈ నాడు మనము చెప్పుకునే " నాన్-వెజిటేరియన్
"  పిశాచమంటే అదే ! 

" భ్రాతృ " అనే పదానికి సంస్కృత అర్థము , ’ సోదరుడు ’ అని. కానీ దాని  వేదార్థము యేమిటంటే , " శత్రువు " . 
" న " అంటే కాదు అని సంస్కృతార్థము. కానీ " అదే విధమైన "  అని వేదార్థము.
అంతేగాక , వేదమంత్రాలకు వర్ణాలతోపాటూ స్వరాలున్నాయని గుర్తుంచుకుంటే , ఒక్క చిన్న స్వర భేదముతో మంత్ర అర్థమే పూర్తిగా మారిపోతుందని ఎన్నో ఉదాహరణల ద్వారా చెప్పవచ్చు. అతి ప్రసిద్ధి పొందిన " ఇంద్ర శత్రు " అన్న పదాల అర్థాలు తెలిసినవే. 

" ఆగఛ్చతు " అంటే రమ్మని అర్థము.. దాన్నే స్వరము మార్చి పలికితే , వెళ్ళమని అర్థము.

తెలుగులో మాత్రం అటువంటి పదాలు లేవా ? నేను వెళ్ళను అనుటకు , దీర్ఘము తీసి" నేను వెళ్ళనూ ? " అనుటకు భేదము లేదా ? 

|| ఋచో ఆక్షరే పరమే వ్యోమన్ | యస్మిన్ దేవా అధి విశ్వే నిషేదుః | 
యస్తన్న వేద | కిమ్ ఋచా కరిష్యతి  ||

అన్న ఋగ్వేదపు మంత్రము కూడా , " ఒకడికి మంత్రార్థము తెలియకుంటే దానికి ఋగ్వేదము ఏమి చేస్తుంది ? " అని ప్రశ్నిస్తుంది. 

[ బ్రహ్మాణమ్ బ్రహ్మ వాహసమ్--ఋగ్వేదమ్--౬-౪౫-౭

బ్రహ్మాణమ్ పరివృఢం , బ్రహ్మ వాహసమ్ బ్రహ్మభిః  స్తుతిరూపైర్ మంత్రైర్ వహనీయమ్ --సాయన భాష్యమ్ 

ద్రవ్య పక్షేపి సర్వ శబ్దానామ్ అసత్యోపాద్య వచ్చిన్నం బ్రహ్మతత్త్వం వాచ్యమితి నిత్యతా || --కైయటః , మహా భాష్య పస్పశాహ్నికమ్ 

" అప్యేకం దేవపథ మథీయీతేవ --శతపథ బ్రాహ్మణం --౧-౧౫-౬౯ ]

" సంస్కృత పదాలైన కొన్ని నామవాచకాలు , నదులు , జంతువుల పేర్లు వాటి అర్థాలను ఇచ్చినా , వాటి నిజమైన స్వభావము , ప్రవృత్తులు మాత్రము బ్రహ్మమును కీర్తించుటయే " అని దాని అర్థము. 

ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించేముందు , దాని అసలైన వైదిక అర్థాన్ని తెలుసుకోవడము వివేకమైన పని. సంచలనము కలిగించుట కోసమో , వక్రీకరణ కోసమో దానిని నిర్ధారణ చేసే ముందు అందులోని వైరుధ్యాన్ని, లోపాలనూ , ఆ సిద్ధాంతము చేసేవాడే , " నేఽతి" [ ఇది కాదు , ఇది కాదు ] అంటూ ఆత్మ విమర్శగా పరీక్షించుట అవసరము. ఎందుకంటే ఆ పని ఇతరులు ఎలాగూ చేసి తప్పని చెబుతారు కాబట్టి. 

ఇక , అశ్వ మేధము.. 

      విపరీతముగా అపార్థము చేసుకోబడిన వేద శబ్దములలో ఇది ఒకటి. దీని అసలు అర్థము గ్రహింపుకు వచ్చిన తరువాత , అశ్వమేధాన్ని వక్రీకరించినవారు ప్రాయోపవేశము చేసుకున్నా ఆశ్చర్యము లేదు. అంత ఘోరమైన తప్పిదము అది. 
తాము మహామేధావులమని భావించుకొనే సనాతన ధర్మ వ్యతిరేకులు కొందరు సంకోచాలు , మర్యాదలూ హుందాతనమూ మరచిపోయి , అశ్వమేధ యాగములో యజమాని భార్య అశ్వము [అనగా వారి అర్థములో ’ గుర్రము ’ ] తో యేమేమి చేస్తుందో వారివారి నీచమయిన ప్రవృత్తులను తృప్తిపరచుకొనుట కోసము వర్ణించి శునకానందము పొందేవారు ఉన్నారు. వీరి వంటి వారే అయిన ప్రాచీనులైన " పువ్వటుడు ", మహీధరుడు " వంటి వారిని ఉటంకిస్తూ అటువంటి వ్యాఖ్యలు చేస్తారు. 

ఇటువంటి వైదిక శబ్దాలను అర్థము చేసుకొనుటకు ఒక ప్రత్యేకమయిన క్రమముంది. దానిని " ఆర్షేయ క్రమము " అంటారు. దాని పేరే తెలియని ఈ మేధావులు వేదాలకు భాష్యము చెప్పబోవుట అనేది గుడ్డివాడు సినిమా గ్రాఫిక్స్ ను వర్ణించినట్లే ఊహాజనితములై ఉంటాయి. 
అశ్వ అనే పదము , ’ అశ్ భక్షణి ’ అనే ధాతువు నుండీ వచ్చింది. అనగా , దారిని తినివేయునది. 
తినుట , గ్రహించుట అనే అర్థాలకోసము అశ్ శబ్దము వాడతారు. అశనము , ప్రాశనము అలా వచ్చిన పదాలే. 
వేదములో చెప్పిన అశ్వ మేధ శబ్దానికి, గుర్రానికీ యే విధమైన సంబంధమూ లేదు. 

ఏదైతే ఇంకొకదానిని గ్రహించునో , అది అశ్వము
నీటిని గ్రహించే సూర్య కిరణము అశ్వమే.
వెలుతురును గ్రహించే కన్నూ , శబ్దాన్ని గ్రహించే చెవీ, రుచిని  గ్రహించే నాలుకా... ఇవన్నీ అశ్వాలే.  కాబట్టి ఇంద్రియాలను అశ్వములు అని పిలుస్తారు. 
శరీరాన్ని రథముతోనూ , రథము నడిపేవాణ్ణి ఆత్మతోనూ , ఇంద్రియాలను గుర్రాలతోనూ పోల్చే ప్రసిద్ధమైన శ్లోకాలు ఈ వైదిక అర్థముతో రాయబడినవే.  
సంస్కృతములో అశ్వము అంటే గుర్రమే. కానీ వేద శబ్దాలకు ఆ అర్థము లేదు. సందర్భాన్ని బట్టి ఎక్కడ ఏ అర్థము వస్తుందో చూడాలే గానీ అశ్వము వచ్చిన చోటంతా గుర్రము రాదు. 

అశ్వానికి ఇంకో అర్థము కూడా ఉంది అ-శ్వః అంటే రేపు లేనిది. - నిరంతరంగా ఉండేది. అశ్వమితి రాష్ట్రం-- దేశము ఎప్పుడూ నిరంతరంగా ఉంటుంది. వేదికను కూడా అశ్వము అంటారు. నటీనటులు వస్తూ పోతుంటారు, వేదిక నిరంతరముగా ఉంటుంది. 

ఇక మేధ అనే శబ్దానికి రెండు ధాతువులున్నాయి
మేధృ - " సంప్రహ " మరియూ మేధృ- సంగమం.
అశ్వమేధమంటే ఇంద్రియాలను సంగమములోకి అనగా స్వాధీనములోనికి తెచ్చుకొనుట. వేదములో చెప్పిన ’ అశ్వ మేధ ’ పదానికి అర్థము ఇదే. 
రాష్ట్ర మేధ -- రాష్ట్రాన్ని అనగా రాజ్యాన్ని అధీనములోకి తెచ్చుకొనుట. రాజ్య ఐక్యత. 

యూపము అంటే , గుర్రాన్ని కట్టివేయు కొయ్య స్థంభము కాదు. యూపమను పదాన్ని,  ఇంద్రియాలను , మనసును అదుపులో ఉంచు విషయములో వాడతారే గానీ పశువును కట్టు గూటము అనే అర్థములో కాదు. 

కాబట్టి అశ్వ మేధములో గుర్రమూ లేదు , హింస అంతకన్నా లేదు. దోష పూర్ణమైన అర్థాలు తీసి వేదవాఙ్మయాన్ని వక్రీకరించుటలో కొందరు మేధావులు సిద్ధ హస్తులు. 
అయితే , ఎంతమంది మేధావులు ఎన్ని వక్రీకరణలు , కుతర్కాలు , చేర్పులు మార్పులూ చేసినా , వేదాన్ని ఎవరూ ఆవిధముగా అంటలేరు కాబట్టి వేదమే వారికి దీటైన సమాధానము చెబుతుంది.

ఇలాగ ఎన్నెన్నో పదాలకు తప్పుడు అర్థాలు తీసి అయోమయాలు , వైషమ్యాలూ సృష్టించుటే వారి పని. 

 భారతాన్ని పంచమ వేదము అంటారు.. అందులో కూడా చేర్పులు జరిగాయి. అది మానవుడు రాసింది కాబట్టి.. అలాగే మతాచార్యులు రాసిన వాటిని కూడా కొందరు వేదమనే అంటారు. ఎవరేమి రాసినా మూల వేదానికి విరుద్ధము కానంతవరకే దానికి విలువ , ఆదరము. లేకపోతే వేదము అన్న పదాన్ని చేర్చుకున్నంత మాత్రాన ఏ రాతలూ ’ సత్య వేదాలు ’ కాలేవు, అభాసు పాలూ కాకుండానూ పోవు.   

భారత దేశములో అనాది నుండీ మన బలాలు యేమిటంటే , శిక్షణ , పశుపాలన , కృషి-- ఈ మూడే . ఆంగ్లేయుల పాలనలో ఈ మూటిమీదా అటకాయింపు జరిగింది. శిక్షణను ’ మెకాలే ’ ప్రతిపాదించిన " ఇంగ్లీషు చదువుల’ తోనూ , పశుపాలనను ’ మాంస భక్షణను’ అలవాటు చేయడము వలననూ , కృషి ని వాణిజ్యము చేయడము వల్లనూ మూడూ పతనము చెందినాయి. 

సనాతన ధర్మములో మాంసాహార భక్షణ అనునదే లేదు. అంతెందుకు , ఓ యాభై యేళ్ళ కిందవరకూ కాఫీ అంటే అదొక " మైల " గా భావించే వారు . ఇంటి బయట ఒక మూలలో బొగ్గులపొయ్యి మీద రహస్యంగా తయారు చేసేవారు. 

సనాతన ధర్మమును కించపరచి విమర్శించే వారు రెండు రకాలు.
ఒక్కసారిగా గొప్పవాళ్ళము కావాలనుకొనేవారు , సనాతన ధర్మము గురించి అసలేమీ తెలీని వాళ్ళు. 

కానీ వీళ్ళు తమ వరకూ వస్తే , మరలా సనాతన ధర్మపు సందేశాలనే పాటిస్తారు. శాకాహార భోజనము యొక్క గొప్పదనము వారికి తెలీక కాదు , వారి మొదటి ప్రాధాన్యత అదే. అంతే కాదు , వారిలో సంతానము లేని వారికి , కృత్రిమ పద్దతిలో సంతానము కలగాలంటే , మొదటగా కోరుకొనేది బ్రాహ్మణుల వీర్యాన్నే. సంతాన ప్రాప్తి కేంద్రాలలో ఎక్కడ కనుక్కున్నా ఈ విషయము తెలుస్తుంది. ఎన్నిసార్లు పేపర్లలో చదవలేదు ? శాకాహారులై , నియమబద్ధమైన జీవనము గడుపుతూ , వేద వేత్తలై ఉంటే , వారి వీర్యానికి వీరిచ్చే విలువ అంతా ఇంతా కాదు. వ్యక్తి గతముగా అలాగ సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ , సామాజికంగా ఆ సనాతన ధర్మాన్నే విమర్శించే వారు యేనాటికైనా సనాతన ధర్మానికి బాహాటముగా తలవంచవలసినదే. 
నిన్న నాతమ్ముడితో మాట్లాడుతున్నపుడు కొన్ని ఆశ్చర్య కరమైన విషయాలు చెప్పాడు. అతడు జర్మనీలో ఉంటాడు.. మనం ఊహించుకునేట్టుగా , విదేశీయులందరూ మాంసాహారులూ , తాగి తందనాలాడేవారూ కాదనీ , చెట్లకు కూడా హాని కలిగించక బ్రతికేవారున్నారనీ అన్నాడు. అక్కడ అనేకులు , చెట్లనుండీ కాయలూ , పళ్ళూ కోయరట. అవే పండి రాలితే గానీ వాటిని తీసుకోరట.  మనం మృత్యుంజయ మంత్రములో , " ఉర్వారుకమివ బంధనాత్ ... " అంటూ , పండిన పండువలె రాలిపోదామనీ , అపమృత్యువు రాకూడదనీ ప్రార్థిస్తాము.. దాని అర్థాన్ని తెలుసుకొని వారు ఎంతబాగా ఆచరిస్తున్నారు అనిపిస్తుంది. పాలు పిండితే పశువులకు బాధ అని , చాలామంది పాలు , పెరుగు ముట్టుకోరట. 

మనము సనాతన ధర్మము , సాంప్రదాయాలు , అంటూ మాట్లాడుకునే మనము , నిజంగా అందులోని సారాంశాన్ని తెలుసుకొని పాటిస్తున్నామా ? అనిపిస్తుంది , ఒకోసారి. ఎందుకంటే మన వేదాలని అర్థం చేసుకొని , వాటి సారాంశాన్ని ఉపయోగిస్తూ మనకన్నా ఎక్కువగా పాటించేవారు.. విదేశాల్లో ఎక్కువ ఉన్నారని అవగతమవుతున్నది. 
అంతే కాదు , నూరేళ్ళనుండే అక్కడ సంస్కృతపు వాడకము ఉందనీ , ఇప్పటికీ సంస్కృతం లో వార్తలు ప్రసారమవుతాయనీ , వేదమంతా అనువదించి లైబ్రరీలలో నిక్షిప్తము చేసుకున్నారనీ అన్నాడు. 
వేదాన్ని మనకన్నా వారే క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఆచరిస్తున్నారని ఆనందించడమే గాక , మనము కూడా అలాగే ఆచరించాలని దానికి తగ్గ అవగాహనను ఇమ్మనీ , కుసంస్కారంతో ఎదుటివారిపై బురద జల్లేవారిని సంస్కరించమనీ వేడుకుందాము. 


వేదములో గోవధ చెప్పబడి ఉందా  అని ఒక వివాదాన్ని కొందరు మ్లేఛ్ఛులు తీసుకొచ్చి సనాతన ధర్మాన్ని కించపరచాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి... వేదములో అటువంటి గోవధను ప్రేరేపించే విషయములేవీ లేవని నిర్ద్వంద్వముగా  తేల్చబడినది.. ఇంకా అనుమానము ఉంటే , --గోవధను ప్రేరేపించుట కాదు-- గోవధను చేయకండి అవివేకులారా  --అని స్పష్టముగా ఏకాగ్ని కాండములో వివరింపబడి ఉంది..

 వేదములో " గోవధ కూడదు " అని స్పష్టముగా చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యముగా , ఉపనయన సమయములో వటువు, పలికే ఈ మాటలు చూడండి.. వీటికి ఎంతో ప్రాముఖ్యము ఉంది.. ఎందుకంటే , ఉపనయనము అయితే గానీ , వేదాధ్యయనము చేసి , యజ్ఞయాగాదులు చేయుట --చేయించుటకు వటువుకు యోగ్యత రాదు .. .. కాబట్టి , వటువు ఉపనయన సమయములో ఏమి నేర్చుకుంటున్నాడో  చూడండి..


|| యజ్ఞోవర్ధతాం యజ్ఞస్య వృద్ధిమను వృద్ధాఽపచితి రస్యపచితిం మా కుర్వపచితోఽహం మనుష్యేషు భూయాసం || 

|| గౌరస్యపహత పాప్మాఽపపాప్మానం జహి మమచాఽముష్య చ || 


" ఓ ధేనువా !! నీవు అతి పవిత్రవంతమైన దానివి.. నీ యందు ఎటువంటి దోషములూ ఉండుటకు సాధ్యము కాదు.. కాబట్టి, నాయొక్కయు , కన్యాదాత యొక్కయు పాపములను నీవు మాత్రమే నశింపజేయ గలవు.. 

నీ సంబంధమైన పూజ లోకములో వృద్ధిపొందుగాక.. నీ పూజ వృద్ధియైనట్లే  నీవుకూడా వృద్ధి పొందుము , పూజనీయవైన నీ పూజ చేసి నేను కూడా పూజనీయుడనయ్యెదను.. నీ పూజాఫలమును నాకివ్వు. "

|| గౌర్ధేనుభవ్యా మాతా రుద్రాణాం దుహితావసూనాగ్ స్వసాఽదిత్యానామమృతస్య నాభిః | ప్రణువోచం చికితుషే జనాయ మా గామనాగా మదితిం వధిష్ఠ || 

|| పిబతూదకం తృణాన్యత్తు ||

|| ఓముత్సృజత || 

" యజ్ఞయాగాదులలో సమస్త దేవతలూ పొందదగిన ఆజ్యము మొదలగు హవిస్సును ఇచ్చుటవలన ఈ ధేనువు అతి యోగ్యమై, పూజార్హమైనది. ఆ కారణము చేతనే ఈ ధేనువు ఏకాదశ రుద్రులకు తల్లియైనది. అష్ట వసువులకు కుమార్తె యైనది. ద్వాదశాదిత్యులకు తోబుట్టువైనది. అమృతమునకు ఆధారమైనది.. కాబట్టి  లోకములలోని యేదోషములూ ఈ గోవును అంట జాలవు. ఈ గోవు అణుమాత్రమైననూ హింసింపకూడనిది. కాబట్టి ఓ అవివేకులారా , పరమ పవిత్రమైన గోవును హింసింపవద్దు , వధింపవద్దు.. దానిని జలములు త్రాగుటకు , తృణ ఘాసములను దినుటకు వదలిపెట్టండి..   "

వేదము గోవును ఎంత పవిత్రముగా ఆరాధిస్తుందో  తెలుసుకొనుటకు  ఇది చాలు కదా.. 

Wednesday, February 3, 2016

సనాతన ధర్మపు రహస్యము---మూడవ[చివరి] భాగము

సనాతన ధర్మపు రహస్యము---మూడవ[చివరి] భాగము

గురువులు :- " మీకు పూర్తిగా అర్థము కావలెనంటే నేను క్రైస్తవ మతపు ఉదాహరణ తీసుకొని వివరిస్తే తమరు నన్ను క్షమిస్తారని భావిస్తున్నాను. 

మోక్షానికీ, లేదా స్వర్గానికీ అవశ్యకమైనది క్రీస్తుపైన విశ్వాసము మాత్రమే అన్నపుడు , క్రీస్తు కన్నా ముందు పుట్టి చనిపోయిన వారందరికీ ముక్తి దొరికే అవకాశము లేకుండినది అని వారికి స్వర్గము నిరాకరించవలసి వస్తుంది. వారంతా యే తప్పూ చేయకున్ననూ కేవలము వారు క్రీస్తు కన్నా ముందు పుట్టినారు అన్న క్షుల్లకమైన కారణముచేత మనము అలాగ చేయవలసి వస్తుంది. అదేవిధముగా , ఆ అవకాశాన్ని , జీసస్ గురించి తెలియని , వినని అతని సమకాలీకులకూ , మరియూ క్రీస్తు గురించి యేమీ తెలియక , ఈ యుగములోనే బతుకుతున్న కోటానుకోట్ల మంది ప్రజలకూ కూడా ముక్తికి అవకాశమే లేకుండా పొమ్మనవలసి వస్తుంది. 

సృష్టి మొదలైన అనేక యుగాల తరువాత ,  అకస్మాత్తుగా ఏదో ఒకరోజు  జ్ఞానోదయమై తెలివితెచ్చుకొని , మానవ కులానికంతటికీ  ముక్తికి సాధనమైన మార్గము ఇదీ ...అంటూ భగవంతుడు  ఒక ధర్మాన్ని విధించినాడా ? అది భగవంతుని లక్షణము కాదని  మీరు గమనించలేదా ?  అలాగచేయుట భగవంతునికి ఉచితమని భావిస్తున్నారా ? ఆ భగవంతుడు , జీసస్ పుట్టుటకు ముందే పుట్టిన వారికి కూడా ఆత్మ ఉంటుంది , ఆ ఆత్మలకు కూడా ముక్తి అవసరము అనేమాట మరచినాడా ? లేకపోతే ముక్తిసాధనమును రూపించుటలో అతడు జాగ్రత్త వహించినాడా ? అలాగ జాగ్రత్త వహించి ఉంటే , అతని ముక్తి సాధనము , ’ ముందు ముందు ఎప్పుడో జనించబోయే జీసస్ పైన నమ్మకము దానికి అత్యవసరము ’  అనే నియమానికి అది లోబడి ఉండుట సాధ్యము కాదు కదా ? కాబట్టి , సృష్టికి ఆదికాలములోనే మొట్టమొదటి వ్యక్తిని  పుట్టించినపుడే , ఆ వ్యక్తికి ముక్తి సాధనమును కూడా కల్పించియే ఉండవలెను. దీన్నే వైచారిక నిరూపణ అంటారు. 
ఎందుకంటే ఆ మొట్టమొదటి మానవుడికి కూడా మోక్షపు అవసరము ఉంటుంది. అందుకే మేము , వేదము మరియూ మొట్టమొదటి మానవుడు [ హిరణ్యగర్భుడు ] ఇద్దరూ కూడా ప్రారంభము నుండే కలిసే ఉన్నారని నమ్మేది. కలిసే ఉన్నారు అంటే ఒకేసారి సృష్టించ బడినారు అని అర్థము కాదు. సృష్టికి ఆరంభమే లేదు. అంతా అనాది అనేది మా నమ్మకము. [ శాస్త్ర ప్రక్రియల అధికరణముల మూలముగా ఈ మాటను ఋజువు చేయవచ్చు ] . ఇవి కలిసే ఉన్నాయి అంటే , భగవంతుని చేత అవి రెండూ ఏకకాలములో వ్యక్తమైనాయి అని అర్థము. [ వేదపు మూలమును , అపౌరుషేయత్వమును అర్థము చేసుకొనవలెనంటే మీమాంసా శాస్త్రమును చదివితే చాలు ] . మొత్తానికి సృష్టి తరువాత " భగవంతుడు కాని " ఎవరో ఒక వ్యక్తి లేదా బోధకుడి ద్వారా తన ప్రారంభాన్ని పొందిన యే ధర్మమైనా దోషపూరితము మరియూ అశాశ్వతము కూడా. 

మిస్టర్ " ఎ ":- " అర్థమయినది.. అయితే మానవుడు ముక్తిసాధనమును లేదా ధర్మమును స్వతః తనంత తానే కనుక్కొనుటకు అసమర్థుడు , అతడికి ఇతరుల సహాయము లేనిదే అది జరగదు అని మీరే చెప్పుచున్నారు కదా .. అటువంటి సహాయాన్ని మానవుడికి ఇచ్చినవారు దేవుడే కావచ్చు లేదా ఇంకెవరైనా కావచ్చు .. కాదంటారా ? "

గురువులు :- " అలాగ ఇతరులనుండీ సహాయము తెచ్చుకొనుటకు , మానవునికి తాను పొందవలసిన ఒకానొక ’ వస్తువు ’ లేదా ’ లక్ష్యము ’ అనేది ఒకటి ఉంది అన్న అవగాహన ఉండవలెను. అటువంటి వస్తువు యొక్క ’ నిజానుభవము ’ పొందినపుడు మాత్రమే అటువంటి వస్తువు ఉంది అని అతడు తెలుసుకొనుటకు సాధ్యము. అటువంటి లక్ష్యము గురించి అవగాహన లేకుండా ఆ ప్రయత్నము ఎలాగ ప్రారంభమవుతుంది " 

అదీకాక , ఒకటోది---నిర్దిష్ట సాధనము ఒకటి ముక్తికి ఖచ్చితముగా తీసుకొని పోగలదు అని ఒకడికి అవగతము కావలెనంటే , అతడు దానిని మొదటే అవలంబించి , అనుసరించి ఉండవలెను. దీనిని ఒప్పుకుంటే , ఒక వ్యక్తి తాను అనుసరించి సఫలము కాకముందే ఆ మార్గాన్ని ఎలా ఎరుగును ? అనే ప్రశ్న ఉద్భవిస్తుంది.

లేదా , రెండోది--- ఆ వ్యక్తి సర్వజ్ఞత్వము వలన , ’ లక్ష్యము ’ మరియూ ’ సాధనా మార్గము ’ రెంటినీ ఏకకాలములో చూడగల సామర్థ్యము పొందిన వాడై ఉండాలి.. దీనిని ఒప్పుకుంటే , అతడు తనలో ఇంతకు ముందు లేని సర్వజ్ఞత్వాన్ని ఎక్కడ నుండీ , ఎలాగ పొందినాడు ? అనే ఆటంకము వస్తుంది..

కాబట్టి , మూడోది--- అతడు , తానే సాక్షాత్తూ ’ లక్ష్యము ’ అయి ఉండి , తనను పొందే విధానమును ఈ జగత్తుకు బోధించవలెను. అటువంటి వ్యక్తి మనకు ఎవరూ సాక్షాత్కారము కాలేదు... అయితే ,

శృతి లేదా ’ వేదము ’ మోక్షపు దారిని మనకు చూపిస్తుంది కాబట్టి , ఆ వేదము తన మూలాన్ని భగవంతుడిలోనే కలిగి ఉన్నది అనే ఈ మూడోదాన్ని మాత్రమే మనము తార్కికముగా ఒప్పుకోవలసి వస్తుంది.  [ సామాన్య ఇంద్రియాలూ మరియూ మనోబుద్ధుల అనుభవపు పరిధిని దాటితే కలిగే ఈ జ్ఞానమే శృతి లేదా వేదము అని పిలువబడుతుంది ].

మిస్టర్ " ఎ ":- " మోక్షాన్ని , దైవాన్నీ తెలుసుకొనుట కష్టము కావచ్చు . అదే కాక , దానిని తెలుసుకొనుటకు ఒకడికి , అది తెలిసిన మరొకడి మార్గదర్శనపు అవసరమూ ఉండవచ్చు. కానీ అతడికి మోక్షము అనే దొకటి ఉండవచ్చు అనే అవగాహన కలుగుటకు శృతి యొక్క సహాయమేమీ అవసరము లేదు కదా ? మన బుద్ధి శక్తి నుండే మనము దానిని ఊహించవచ్చు కదా ? "

గురువులు :- భగవంతుడి అస్తిత్వమును అంత స్వతంత్రముగా , మరియూ సులభముగా ఊహించగలిగితే , ప్రపంచములోనున్న నాస్తికుల గురించి ఏమి చెపుతారు ? మీకన్నా వారి ఆలోచనా పటిమ , విచార శక్తి తక్కువ స్థాయి లోనిది అనేది మీ అభిప్రాయమా ? భగవంతుడి అస్తిత్వము గురించి ఆలోచించే లక్ష్యాన్ని తీసుకొని ఆ ప్రయత్నములో విఫలమై , దేవుడు లేడు అనే వారు కూడా అసామాన్య బుద్ధిశక్తితో కూడి ఉంటారు. వారి వైఫల్యానికి వారి బుద్ధి , మేధస్సులలోని దోషము కాదు కారణము. " భగవంతుడు మూలతః విచారమునకు నిలుచు వాడు , దొరకువాడూ కాదు " అనేదే దానికి కారణము. ఒక వేళ అలాగ తర్కముతో భగవంతుడిని  ఊహించగలిగితే , అలాగ ఊహకు నిలచు " దైవము ’ లేదా ’ మోక్షము ’ అనే వస్తువొకటి ఉంది అని మీకెవరు చెప్పినారు ? అనే ప్రశ్న వస్తుంది. దైవాన్ని గురించి తర్కించుటకు , లేదా ఊహించుటకు మొదట మీరు ఖచ్చితముగా దైవాన్ని గురించి తెలిపే ఏదో ఒక మూలము నుండీ దానిని గురించి వినియే ఉండవలెను. ఆ మూలమును అవలంబించియే ఉండవలెను. ’ దేవుడున్నాడు ’ అని ఎవరో ఒకరు చెప్పిన తరువాతే  , ఆ మాటను ఒప్పుకొనుటకో లేక విమర్శించుటకో మీరు మీ బుద్ధి శక్తిని , విచార మాధ్యమమునూ ఉపయోగించుటకు సాధ్య పడేది.. దేవుడి గురించి మీరు విననే లేదన్నప్పుడు , మీ బుద్ధిశక్తి ఆవైపు మళ్ళే ప్రసక్తే ఉండదు. 
"

మిస్టర్ " ఎ ":- " నా బుద్ధిశక్తిని ఉపయోగించే ముందు నేను దేవుడి గురించి వినియే ఉండవలెను అనేదేమీ లేదు. ’ దేవుడు ’ అనే పదము మనసులో లేకుండవచ్చు , కానీ , సతతమూ మార్పు చెందుతున్న ఈ జగత్తుయొక్క నేపధ్యములో ఉన్న నిత్యముగనూ , అవికారముగనూ ఉన్న వస్తువొకటి ఉంది అనేది సహజముగానే నా బుద్ధికి గోచరిస్తుంది . "

గురువులు :- కొంచము వివరించండి 

మిస్టర్ " ఎ ":- " జగత్తులో చీకటి- వెలుగు , చైతన్యము- జడత్వము , సుఖము-దుఃఖము , చావు-పుట్టుక మొదలగు అనేక వైరుధ్యములను --లేక ద్వంద్వములను నిర్లక్ష్యము చేయుటకు లేదు. నా ఊహ ఇలాగ ఉంటుంది.... ’ జగత్తులో మార్పులు ఉన్నట్లే , దానికి విరుద్ధముగా , మార్పు పొందని, వికారము లేని వస్తువొకటి జగత్తు నేపధ్యములో ఉండవలెను. ప్రతి క్షణమూ , ప్రతి వస్తువూ నాశము పొందునట్లే , ఆ నాశపు వెనకాల నాశ రహితమైన వస్తువొకటి ఉండే తీరవలెను. ఇలాగ నేను , అనేకము , అనిత్యము , అసమరూపము మరియూ వికారమూ అయిన వస్తువుల ఆధారముతో , ఏకము , నిత్యము , సమరూపమూ మరియూ అవికారమూ అగు వస్తువును తర్కిస్తాను. నా ఈ విధమైన ఊహ జగత్తులోని అన్ని వస్తువులకూ అన్వయిస్తుంది కూడా". 

గురువులు :- " అలాగైతే , ఉదాహరణకు , " గుర్రము " అనే వస్తువు యొక్క విరుద్ధ వస్తువు ఏది ? గుర్రము అనేది ఇంద్రియములకు గోచరమగు ఒక భావాత్మకమైన విషయము. కాబట్టి , దానికి విరుద్ధమైన అస్తిత్వాన్ని ఊహించుటకు మీకు సాధ్యము కావలెను కదా ? ఆ విరుద్ధ వస్తువు ఏది ? నా ప్రశ్న కొంచము అసంగతముగా కనపడవచ్చు.. కానీ మీ సందేహాలను తీర్చుటకు దీనికి ఉత్తరము ఇవ్వవలసిన అవసరముంది".

మిస్టర్ " ఎ ":- " గుర్రానికి " అగుర్రము " లేదా గుర్రము లేకుండుటే దానికి విరుద్ధము. 

గురువులు :- సరిగ్గా చెప్పినారు.. అయితే ఈ " అగుర్రము " ఒక భావాత్మక నైజ వస్తువా ? లేక నిషేధాత్మక మిథ్యా వస్తువా ? " అదొక జంతువా లేక మీ ఈ ’ అగుర్రపు ’  కల్పన జగత్తులోని మిగిలిన [ గుర్రము తప్ప ] అన్ని వస్తువులనూ తనలో కలిగి ఉన్నదా ? "

మిస్టర్ " ఎ ":- " ఖచ్చితముగా చెప్పవలెనంటే అది జగత్తులోని ఇతర అన్ని వస్తువులనూ తనలో కలిగి ఉన్నది.. ఆ అర్థములో ఒక రాయి కూడా ’ అగుర్రము ’ అవుతుంది. కానీ మేము అన్వయిస్తున్న నిషేధము కేవలము గుర్రానికి సంబంధించి నందువల్ల ’ అగుర్రము ’ అనేది ఒక భావాత్మక వస్తువనే చెప్పవలెను. అనగా , గుర్రము లోనున్న " అశ్వత్వము " అనే విశేషణమును దాని విరుద్ధములో నిషేధించుట చాలు అనుకుంటాను. అంటే అగుర్రములో అశ్వత్వము ఉండదు.. కాబట్టి అగుర్రమంటే గుర్రము కాని ప్రాణి అనవచ్చు. "

గురువులు :- " అంటే ఒక వస్తువు యొక్క విరుద్ధము , ఆ వస్తువుయొక్క వర్గానికే చెందినది.. అయితే ఆ వస్తువు పొందిఉండే ఏదో ఒక విశేషణపు విషయములో మాత్రము వస్తువుకన్నా భిన్నముగా ఉంటుంది.. అంతే కదా ? ఇంకా స్పష్టముగా చెప్పాలంటే , ఆ వస్తువుకు , ప్రపంచములోని వేరే యే వస్తువుకూ " సంపూర్ణమైన " విరోధము అనేదే ఉండదు. విరోధము యేమున్ననూ ’ విశేషణము ’ మాత్రమే. అంటే  ఒక వస్తువులో ఉన్న , మరియూ ఇంకో వస్తువులో లేని " విశేషణమే " మనలను అవి రెండూ " పరస్పర విరుద్ధ " ములు అని అనుకునేటట్టు చేస్తుంది. అవునా ? 

మిస్టర్ " ఎ ":- " అవును " 

గురువులు :- అయితే , ఉదాహరణకు , మీరు చెప్పిన  పరస్పర విరుద్ధాలైన చీకటి వెలుగులను తీసుకుందాము. రెంటికీ ఉన్న విశేషణము ఏమంటే , కాంతి యొక్క ఎక్కువ తక్కువలు. అయితే  వెలుగు యొక్క తీక్ష్ణతను మనము చీకటి యొక్క దృష్టికోణము నుండీ చూచుటకు సాధ్యము.. అలాగే , చీకటిని వెలుగు యొక్క మానిని తో కొలుచుటకు సాధ్యము.  అలాగ సాధ్యమయినపుడు , కాంతి యొక్క ఎక్కువ తక్కువలు రెంటిలోనూ ఉంటాయి కాబట్టి అవి ఒకదానికొకటి విరోధములు కావు.  ఇలాగ చీకటి వెలుగులు సంపూర్ణ విరోధములు కాకపోగా , పరస్పర సాపేక్ష వస్తువులుగా పరిణమించి మీ వైరుధ్య సిద్ధాంతము వీగిపోతుంది. 

తర్కపు ఎల్ల [ సీమ ] గురించి మీరు తప్పుగా అర్థము చేసుకున్నా రనిపిస్తుంది. నేను మొదటే చెప్పినట్లు , " తర్కించతగిన వస్తువు ఒకటుంది " అన్న పూర్వ జ్ఞానము లేకుండా తర్కపు ప్రక్రియయే ప్రారంభము కాదు. .. తన జీవితములో ఎన్నడూ మంటను కనీ , వినని వాడు , దూరమునుండీ పొగను చూడగనే అక్కడ దానికింద మంటకానీ నిప్పు కానీ ఉందని ఊహించలేడు. అలాగ ఊహించవలెనంటే అతడు దానికి ముందు ఒకసారైననూ అగ్గిని చుసి ఉండవలెను మరియూ దానినుండీ పొగ వెలువడడము అతడికి తెలిసియే ఉండవలెను. 

దీనిని ఇంకో రకంగా చెప్పాలంటే , నిప్పును ఎన్నడూ చూడని వాడికి , పొగయే సత్యము. అగ్గి కాదు. " గోచరమవుచున్న వస్తువు నిరపేక్షము కాదు. అది తన అస్తిత్వానికి ఇంకొక వస్తువు పై ఆధారపడి ఉంది." అని మొదటే మీకు తెలియక పోతే , ఆ వస్తువు వెనుక ఉండే మరొక వస్తువును తెలుసుకోవలెను అన్న ఆసక్తే మీకు కలగదు. అలాగే , మనము ’ అవికారమైన " వస్తువు గురించి విని ఉండకపోతే మనము ప్రపంచాన్ని , అది మన ఇంద్రియాలకు గోచరించే రీతిలోనే గ్రహిస్తాము. ఈ వికారి యైన జగత్తే మనకు అంతిమ సత్యముగా కనబడుతుంటుంది. అట్టి జగత్తే అందరి ఇంద్రియాలకూ గోచరమగుట వలన దాని ఉనికి గురించి పెద్ద వివరణ అవసరము లేదు. మార్పు చెందే దానిలో చెప్పడానికి ఏముంటుంది ? వికారమే దాని స్వభావము. తన ఆ ’ స్వభావాన్ని ’ అది పోగొట్టుకుంటే అది " ప్రపంచము " అనిపించుకోదు. మనకు  అవికారి అయిన వస్తువుయొక్క పూర్వ జ్ఞానమున్నపుడు మాత్రమే దానికీ , మరియూ ఈ జగత్తుకూ ఉన్న సంబంధమును మనము ఋజువు చేయవచ్చు. అవికార వస్తువు యొక్క అస్తిత్వాన్ని తెలిపి  దాని ద్వారా మనలను విచారపు జాడలోకి వెళ్ళుటకు ప్రేరేపించుటకు మనకు వేదపు అవసరము ఉంది. తర్కము , విచారము , బుద్ధి , యుక్తి/లేదా అనుమానము --ఇవన్నీ ఈ విషయములో సహకారులైననూ , శృతి యొక్క సురక్షిత మార్గ దర్శనము లేక , కేవలము తర్కాన్ని మాత్రమే ఆశ్రయిస్తే చీకట్లో వెదుకులాటే అవుతుంది.
అదీ కాక , " ఈ జగత్తులోని ప్రతీ వస్తువూ వికారానికి లోనవుతుంది " అన్న ఇంద్రియ గోచరమైన విషయపు ఆధారముతో మీరు ఇంకదేన్నో తర్కించుటకు మొదలు పెట్టితే , మీ ఆ తర్కము ఈ [కింది] విధముగా ఉంటుంది...

" ఈ జగత్తులోని ప్రతీ వస్తువూ వికారానికి లోనవుతుంది " కాబట్టి దాని నేపథ్యములో ఉండే ఇంకే వస్తువైనా వికారియే ..--అనుకుంటే , మీ అనుభవము మీకు , ’ ఉన్నదంతా వికారము చెందేదే ’ అని చెప్పినపుడు , మీ తర్కము , వికారి కాని ఇంకో వస్తువు గురించీ తెలుపుటకు సాధ్యము లేదు. అదేకాక , ఆ ’ ఇంకో వస్తువు ’ కూడా ఇంద్రియ ప్రపంచము వలెనే వికారి.... అని ఆ తర్కము చెబుతుంది. అలాగ ,ఆ  తర్కముతో మీరు ఎక్కడెక్కడికి వెళ్ళిననూ ఇంద్రియ విషయములనుండీ తప్పించుకొనుటకు సాధ్యము కాదు. ఎందుకంటే మీ తర్కము ఆ ఇంద్రియ గ్రాహ్య విషయముల వ్యాప్తిలో మాత్రమే తిరుగుతుంటుంది...[ అంటే అది ఇంద్రియముల ద్వారా పొందిన జ్ఞానపు ఆధారము మీదే నిలచిఉంటుంది.] 
ఒకవేళ మీకు అదృష్టముంటే  మీ తర్కము మిమ్మల్ని " అవికారి అయిన ఏదో ఒక వస్తువు ఉండవచ్చు " అనే స్థాయి వరకూ తీసుకు వెళ్ళవచ్చే గానీ " అటువంటి వస్తువు ఒకటుంది " అని చెప్పజాలదు. 

మిస్టర్ " ఎ ":-" శృతి అపౌరుషేయము " వేదమే ప్రపంచపు అన్ని ధర్మాలకూ మూలము [ వేదోఽఖిలో ధర్మ మూలం ] అనే మాట కేవలము ఉత్ప్రేక్ష అనీ , అతిశయమనీ నేను ఇన్ని రోజులూ భావిస్తూ వచ్చినాను. దాని గురించి ఇటువంటి వివరణను నేను ఇంతవరకు వినే ఉండలేదు. ఈ వివరణ ఇచ్చినందుకు మీకు నేను ఋణపడిఉన్నాను. 

కానీ నా మొదటి సమస్యే మళ్ళీ ఉద్భవిస్తుంది కదా ? వాస్తవానికి ఈ ప్రపంచములో అనేక ధర్మాలున్నాయి. అవన్నీ కూడా  ’ మనిషిని వెలుగుకు తెచ్చేది తమ ధర్మము ఒకటే " అంటూ తమకు తామే ఘోషించుకుంటాయి. అలాగ పరస్పర విరోధములైన ఆ అనేక ధర్మాల ఔచిత్యాన్ని గురించిన నా మొదటి ప్రశ్న పరిహారము దొరకకనే అలాగే ఉండిపోయింది కదా ? "

గురువులు :- " ఈ వైవిధ్యము ’ అధికార తత్త్వము ’ పైన నిలచి ఉందిఅని నేను మీకు మొదటే చెప్పినాను. వాస్తవానికి అధికారమే మానవుని చర్యలను నియంత్రించేది. ఈ అధికారములో వివిధ మెట్లున్నాయి. వాటికి అనుసారముగనే వివిధ ధర్మాలున్నాయి "

మిస్టర్ " ఎ ":-" అర్థమయినది. అయితే ఏ ధర్మము కూడా తనను ఒక నిర్దిష్టమైన స్థాయిలోని ప్రజలకు పరిమితము చేసుకొనుటకు సిద్ధముగా లేదు. ప్రతియొక్క ధర్మమూ తనను ప్రపంచములోని అత్యంత శ్రేష్ఠమైన ధర్మముగా పరిగణించుకొంటుంది"

గురువులు :- " బాలకుడు ఒకడికి, ఒకే సమయములో నలుగురు మనుషులు నాలుగు రకాలైన ఆదేశాలను ఇచ్చినారనుకుందాము... ఒకరు " దీపం వెలిగించు " అంటే , మరొకరు , " వత్తిని సరిచేయి " అంటారు. మూడోవాడు ," నూనె నింపు " అంటే , నాలుగవ వాడు, " దీపము ఆర్పు " అంటాడు. ఇటువంటి పరిస్థితిలో బాలకునికి ఏమి చేయాలో తోచదు. వాడికి ఈ నాలుగు పనులనూ ఏకకాలములో చేయుటకు సాధ్యము కాదు. కానీ ఆ నలుగురూ తన ఆజ్ఞనే పాలించమని బెదిరించో , వత్తిడి చేసో చెబుతారు. అప్పుడు ఆ అర్భకుడు ఏమి చేయవలెను ? అదే సమయములో , ఐదో వాడొకడొచ్చి " ఒక కత్తిని తీసుకొని రా " అని చెబితే , అప్పటికే ఉన్న నాలుగు ఆజ్ఞలకు తోడు మరోదాన్ని కలిపినట్టవుతుంది. పరస్పర విరోధములైన ఆజ్ఞల వలన బాలకుని మనసు అప్పటికే అయోమయమును పొంది ఉంటుంది. వాడిప్పుడు , నాలుగింటికి బదులు , ఐదింటిలో ఒకదాన్ని ఎంచుకోవలసి వస్తుంది. ఈ ఐదోవాడి ఆగమనము వలన ఆ బాలకుని అయోమయము తగ్గక పోగా , మరింత ఎక్కువవుతుంది. అయితే , ఆ ఐదోవాడు ఆ పిల్లవాడిమీద కనికరము కలిగి , పిల్లవాణ్ణి ఇరకాటమునుండీ తప్పించవలెను అనిపిస్తే , మరియూ ఆ పిల్లవాడు కూడా ఆ ఐదోవాడిపై , మిగిలిన నలుగురిపై చూపిన శ్రద్ధ కన్నా ఎక్కువ శ్రద్ధ చూపినపుడు , " కత్తి మాత్రము తీసుకొని రా , మిగిలిన వారి ఆజ్ఞలను పాలించ వలసిన అవసరము లేదు " అని గట్టిగా చెప్పవలసి ఉంటుంది. అనగా , అప్పటికే అయోమయములో ఇరుక్కున్న బాలకునికి మార్గదర్శనము చూపించుటకు ఆ ఐదోవాడు తన ఆజ్ఞ  తప్ప ఇతరుల యే ఆజ్ఞ కూడా పాలించుటకు యోగ్యము కాదు అని చెప్పవలసి ఉంటుంది. శ్రద్ధతో తనను ఆశ్రయించిన సాధకునికి మార్గదర్శనము నివ్వవలె ననుకునే ఏ గురువైనా , [ శిష్యుని పై కనికరముతో అతడి అయోమయమును నివారించుటకు , సమయము వ్యర్థము కాకుండా తప్పించుటకు ]  " ఇతరుల ఆదేశాలను పట్టించుకోక నేను చెప్పినట్లు మాత్రమే చేస్తే చాలు " అనవలసి ఉంటుంది. 

మిస్టర్ " ఎ ":- " కానీ ఆ ధర్మ ప్రవర్తకులు , మత ప్రవర్తకులూ తమ దగ్గరికి వచ్చు వారి యోగ్యత , సందర్భము లకు అనుసారముగా తమ బోధనలను చేసినారు. ఇంకోరీతిలో చెప్పాలంటే , స్వతః నిరపేక్ష సత్యమును తెలిసినవారై ఉండి కూడా వారు జనులకు సాపేక్షమైన సత్యమును మాత్రమును చెప్పేవారు. జనులకు ఏమి బోధించవలెను అనుదాన్ని నిర్ధారించుటలో వారు సత్య నిష్ఠ కన్నా ఎక్కువగా అనుకూల / అవకాశ వాదాన్ని అనుసరించినారు... కాదా ? "

గురువులు :- " వారు జనుల అవసరాలనూ , అర్హతలనూ గమనములో ఉంచుకొని ఆ విధముగా చేసినారు. [ సత్యమును దాచిపెట్టే ఉద్దేశముతో కాదు ] . నేను మొదటే చెప్పినట్టు చన్నీరు ఆరోగ్యవంతుడి దాహాన్ని తీరిస్తే , జ్వరపీడితుడైన వాడి రోగాన్ని అది ఎక్కువ చేస్తుంది. వైద్యుడొకడు , ఒకడికి చన్నీటిని తాగమని చెప్పి , మరొకడికి దాన్ని నిషేధిస్తే ఆ వైద్యుడిని పక్షపాతి లేదా మోసగాడు అనవచ్చునా ? ఒక వ్యక్తి ఆయాసాన్నీ దప్పికనూ పరిహరించి , మరొకడి రోగాన్ని ఎక్కువ చేసిందంటూ నీటిని కూడా దూషించలేము. "

మిస్టర్ " ఎ ":- " అయితే , ఒక ’ గురువు ’ బోధించే సత్యము [ ధర్మము ] సాపేక్షమో నిరపేక్షమో తెలుసుకొనుట ఎలాగ ? 

గురువులు :- " దానిని మీరు ఎందుకు తెలుసుకోవలెను ? మీ ఉద్దేశము , జగత్తులోనున్న గురువులలో నున్న ఉచ్చ-నీచాల అంతరాలను కొలవడమా ? లేక మీ బ్రతుకు నియంత్రణ ద్వారా ’ సుఖ శాంతులను పొందు మార్గాన్ని ’ తెలుసుకొనుటా ? "
మిస్టర్ " ఎ ":- " నా ఉద్దేశము రెండూ అయి ఉంది. ఏ గురువు లేక ధర్మము ’ సత్యానికి ’ సమీపముగా ఉంది ? అనేది మొదట నేను తెలుసుకోవలెను. అది తెలుసుకున్న తరువాతే ఆ ధర్మపు , మరియూ ఆ గురువుయొక్క బోధనకు అనుగుణముగా నేను నా బ్రతుకును మార్చుకొనుటకు సాధ్యము " 

గురువులు :- " ఇద్దరు వ్యక్తుల సామర్థ్యమును పరీక్షించి పోల్చాలనుకొనే వ్యక్తి , ఆ ఇద్దరు వ్యక్తులకన్నా ఎక్కువ సామర్థ్యమును పొంది ఉండవలెను. అలాగ లేకుంటే ,  వారిలోనున్న అనేక దోషములు ఆ పరీక్షించేవాడి గమనానికే రావు. క్రీస్తు , మహమ్మద్ , బుద్ధుడు మొదలగు మత ప్రవర్తకుల బుద్ధి సామర్థ్యములను నిర్ణయించ గలిగేటంతటి  బుద్ధి సామర్థ్యములను మీకు దేవుడు కరుణించినాడు అని మీరు భావిస్తున్నారా ? రెండు ధర్మాలలో ఏది శ్రేష్ఠము అని తెలుసుకోవలెనంటే ఆ రెంటినీ కూలంకషముగా అధ్యయనము చేయవలసి ఉంటుంది. రెండు ధర్మాల సంగతి అటుంచుదాము , ఒకే ఒక ధర్మాన్నయినా మీరు సంపూర్ణముగా తెలుసుకున్నారా ? మన జీవితము , ధర్మపు ఒకే ఒక్క మెట్టును కూడా అర్థము చేసుకొనునంతటి దీర్ఘమైనది కాదు. [ ఆయుష్షు చాలదు ] అలాగున్నపుడు , మీ ’ అన్ని ధర్మాల  అధ్యయనము ’ ముగిసిన తరువాత , మీరు ఒప్పుకొన్న ఏదో ఒకధర్మాన్ని కార్య రూపానికి తెచ్చుటకు మీ వద్ద సమయము ఉంటుందా ? "

మిస్టర్ " ఎ ":-" మరి అలాగయితే , మీరు ఇప్పుడు నాకు ఇవ్వబోయే అనుష్ఠాన యోగ్యమైన ఉపదేశము ఏమిటి ? నేనేమి చేయవలెను ? "

గురువులు :- " మీరు దేవుడిని నమ్ముతారు కదా ? "

మిస్టర్ " ఎ ":-" అవును , నమ్ముతాను "

గురువులు :- " ఆ దేవుడు సర్వజ్ఞుడు [ సర్వమూ తెలిసిన వాడు ] అని నమ్ముతారా ?"

మిస్టర్ " ఎ ":- " ఖచ్చితముగా నమ్ముతాను "

గురువులు :- " జగత్తులో జరిగే అన్ని సంఘటనల లోనూ ఆతడి సర్వజ్ఞత్వము ప్రకటమవుతుంది అనేదాన్ని ఎప్పుడైనా తెలుసుకున్నారా ? " 

మిస్టర్ " ఎ ":- " అవును నేను గమనించినాను "

గురువులు :- " అలాగయితే ఆ సర్వజ్ఞత్వము మీ జీవితములో కూడా వ్యక్తమయినది... ఔనంటారా కాదా ? "

మిస్టర్ " ఎ ":-" ఔను " 

గురువులు :- " మిమ్మల్ని పుట్టించుటలో భగవంతుడికి ఒక ఉద్దేశము , అది కూడా సదుద్దేశమే అయి ఉండవలెను కదా ? "

మిస్టర్ " ఎ ":- " ఔను. ఈ జగత్తులో జరిగే యే ఘటన కూడా అనుకోకుండా యాదృచ్చికముగా జరిగినది కాదు అనేది నా దృష్టికి వచ్చింది "

గురువులు :- " అలాగయితే , భగవంతుని దృష్టిలో క్రైస్తవ ధర్మము మాత్రమే మీ అర్హతకు సరిగ్గా అలవడుతుంది. క్రైస్తవులైన దంపతుల కడుపున మీరు పుట్టిన దాని వెనుక ఉండే ఉద్దేశపు వివరణను  ఎంచే పని లేదు. మనము పాలించవలసిన ధర్మమును గురించి మనము భగవంతుని నిర్ణయములో విశ్వాసము నుంచుటయే మంచిది. మన మార్గాన్ని నిర్ణయించుటకు మన అల్ప బుద్ధికి సాధ్యము కాదన్నది ఆతడికి తెలుసు. కాబట్టి ఆతడే మన మార్గాన్ని నిర్ధారించే బరువు ఎత్తుకున్నాడు. మన మనోభావాలకు సరిగ్గా సరిపోయే దేశము , కాలము , పరిసరములు మరియూ ధర్మములో మనకు జన్మనిచ్చినాడు. ఆతడు ఈ విధముగా మనమీద కరుణతో , మన అనుకూలము కోసమై చేసిన యోజనను మనము ఎందుకు తిరస్కరించవలెను ? " వివిధ ధర్మాల తులనాత్మక అధ్యయనము " అనే అసాధ్యపు సాహసానికి ఒడిగట్టి సమయాన్ని ఎందుకు పాడు చేసుకోవలెను ? "

మిస్టర్ " ఎ ":- " క్రైస్తవ ధర్మాన్ని అర్థము చేసుకొనుటకూ , మరియూ దాన్ని అనుసరించుటకూ నేను సాధ్యమయినంత శ్రమించినాను. కానీ మరలా మరలా సందేహాలు కలుగుతుంటాయి. వాటిని పరిష్కరించగల వ్యక్తులను సంధించుటలో విఫలుడనైనాను. ఆ కారణము చేతనే నేను నా దృష్టిని ఇతర ధర్మాల వైపు సారించినాను. "

గురువులు :- " కేవలము ధర్మాన్ని అధ్యయనము చేసిన పండితులను  సంధిస్తే ప్రయోజనము లేదు. తమ దైనందిన జీవితములో ధర్మాన్ని కార్య రూపానికి తెచ్చుకున్న వారిని , ధర్మాన్ని జీవితములో అలవరచుకొన్న వారిని కలిసేవరకూ మీకు ధర్మపు సందేహాలను పరిష్కరించుకొనుటకు సాధ్యమే కాదు. లౌకిక ప్రయోజనాల కోసము మీరు సముద్రాలనూ , ఆకాశాన్నీ దాటుటకు సిద్ధముగా ఉంటారు. కానీ సత్యాన్ని గురించిన సందేహాలను పరిహరించే గురువులు మీ ఇంటివాకిలికే రావాలని కోరుకుంటారు.  " ధర్మము అనేది బ్రతుకులో ఒక ఆసక్తికరమైన అంశము " అనే  మీ భావన మొదట మార్చుకోవలెను. ఎప్పుడైతే మీరు , " ధర్మమనేది బ్రతుకు యొక్క ఒక అంగము మాత్రము కాదు ,  అది పూర్తీ బతుకే అయిఉంది " అని తెలుసుకుంటారో , అప్పుడు మాత్రము మీరు సరియైన గురువులను వెదుకుతారు. అంతవరకూ అటువంటి అనివార్యత కనబడదు.  ఆ అవగాహన వచ్చిన తరువాత వెదుకులాట తీవ్రమవుతుంది . గురువు కూడా దొరకనే దొరుకుతాడు. ఎందుకంటే గురువు ఎప్పుడూ సిద్ధముగనే ఉంటాడు. మన పరిసరాల్లోనే ఉంటాడు. అయితే మనలో జ్ఞానపు ఆకలి తీవ్రమై , మనము ప్రామాణికముగా వెతుకు వరకూ అతడు దొరకడు. కంటికి కనబడినా తెలుసుకోలేము. క్రైస్తవ ధర్మములో అటువంటి గురువులు లేరు అనే మాటను మేము ఒప్పుకోము. అటువంటివారు జనసందడితోనున్న ఈ ప్రపంచములో మీ పరిసరాల్లోనే ఉండవచ్చును. గమనానికి రాలేదు. ఎందుకంటే అటువంటివారు ఈ జగత్తుకు అవసరము లేదు. వారికీ ఈ జగత్తుయొక్క గుర్తింపు అవసరము లేదు. ఆ గుర్తింపు వల్ల వారికి యే ప్రయోజనమూ లేదు. కాబట్టి మీరు అటువంటి గురువును మీ పరిసరాల్లోనే వెదకండి. " దయతో నా సందేహాలను తీర్చండి " అని వినమ్రులై వేడుకోండి. ఆ క్షణములోనే వారు మీ సందేహాలన్నిటినీ దూరము చేస్తారు. క్రమేణా , ’ క్రైస్తవ తల్లిదండ్రులకే మీరు ఎందుకు పుట్టినారు , దానిలో భగవంతుని ఉద్దేశమేమి అనేది మీకే అర్థమవుతుంది.. "

మిస్టర్ " ఎ ":-" మీ కృపాపూరితమైన ఉపదేశానికి నేను తమకు ఎంత నమస్కరించిననూ తక్కువే. దయచేసి ఈ ఒక్క మాటను చెప్పుటకు నాకు అనుమతినివ్వండి ,.. నేను ఇక్కడికి వచ్చునపుడు , నేను మొదటికన్నా ఉత్తమ క్రైస్తవుడిని కావలెను అన్న ఉద్దేశాన్ని పొంది ఉండలేదు. నా అభిలాష , హిందువుగా మారవలెనని ఉండినది. అయితే తమరి ఉపదేశము నన్ను ఇంకా ఉత్తమమైన క్రైస్తవుడిగా అగుటకు ఉపయోగపడుతుంది. క్రైస్తవుడిని ఉత్తమ  క్రైస్తవుడిగాను , ముసల్మానును ఇంకా ఉత్తమ ముసల్మాను గానూ , హిందువును ఇంకా ఉత్తమ హిందువుగానూ చేసే , ఇలాగ , ఆయా ధర్మపు వారిని ఆయా ధర్మాల పరిధులలోనే , ఇంకా ఉత్తములను చేయుటయే సనాతన ధర్మమయినపుడు , మీ ఈ సనాతన ధర్మము నిశ్చయముగా , నేను వెనుక భావించిన దానికన్నా విశాలమూ , గొప్పదీ అయి ఉన్నది.. మీనుండీ వీడుకొలుపుకు ముందు మరొకసారి తమ ఆశీర్వాదాన్ని వేడుకుంటున్నాను. " 

గురువులు :- " ఆశీర్వాదమునిచ్చు యోగ్యత ఉన్నది భగవంతునికి మాత్రమే. ఆతని కృపాశీర్వచనముల కోసము మనమందరమూ అతడిని ప్రార్థించవలెను. " అతడు మీకు దృఢమైన  శరీరమును మరియూ సూక్ష్మమైన బుద్ధి శక్తినీ  కరుణించినాడు " అని నేను మీకు మరొకసారి గుర్తు తెచ్చుటకు   ఇష్ట పడుతాను "

" ఒకడు అత్యుత్తమ చిత్రకారుడై ఉండి , అతడికి అత్యుత్తమ గుణముగల రంగులూ మరియూ కుంచెలు ఉండి ఉండవచ్చు.. అతడు తన కళాకృతిని రచించుటకు ఉత్తమమైన వస్తువు- విషయాన్నే ఎంచుకొని ఉండవచ్చు.. కానీ అతడు ఏ ఆధారమూ లేక కేవలము గాలిలో చిత్రాన్ని చిత్రించలేడు. చిత్రించుటకు అతడికి ఒక స్థిరమైన నేపథ్యపు అవసరము ఉంటుంది. ఆ నేపథ్యము , ఒక బట్ట , గోడ , లేక ఉపయోగము లేని ఒక మొరటు వస్తువై ఉండవచ్చు. కాబట్టి మీరు దైవదత్తమైన మీ బుద్ధిశక్తులను వివిధ ధర్మాల తులనాత్మక అధ్యయనానికి , మౌల్యముల గురించి పసలేని వ్యర్థ చర్చలకు ఉపయోగించవద్దు. ఆ బుద్ధిని మీ జన్మతః లభించిన క్రైస్తవ ధర్మపు నేపథ్యాన్ని మరింత స్థిరముగా చేసే వైపుగా తిప్పుకోండి. ఆ క్రైస్తవ నేపథ్యము పైన , సాధన అనే చిత్రము పూర్తి అయిన పిమ్మట , మీరు దాని సౌందర్యాన్ని ధ్యానించుటకు సమర్థులైనపుడు మీ దృష్టినుండీ ఆ నేపథ్యము తనంతట తానే చెరిగిపోతుంది. అయితే దానికన్నా ముందు అది సాధ్యము కాదు "  ఈ చివరి మాటను గుర్తుపెట్టుకోండి "
|| సమాప్తమ్ ||

Tuesday, January 26, 2016

శివలింగాలు- సాలగ్రామాలు

శివలింగాలు- సాలగ్రామాలు 



" శివమ్ " అంటే ’ శుభం ’ అని అర్థము. " శివ లింగము " అంటే " శుభచిహ్నము " అని అర్థము.
" లింగ పురాణము " ప్రకారము , ఒకసారి విష్ణువు , బ్రహ్మ ఇద్దరూ మాయలో పడి " నేను గొప్ప " అంటే " నేను గొప్ప " అని అహంకరించుతుండగా , శివుడు వారి ముందు ఒక అనంతమైన పొడవు గల అగ్నిస్థంభమై ప్రత్యక్షమై , ’ ఈ స్థంభపు కొనలేవో తెలుసుకున్నవారే గొప్ప ’ అంటాడు. బ్రహ్మ విష్ణువులు అది కనుగొనుటలో విఫలులై , శివుడే తమ ఇద్దరికన్నా గొప్ప అని అంగీకరిస్తారు. ఆ అగ్ని స్థంభమే " లింగము " గా పిలవబడింది. ఎందుకంటే , సర్వ ప్రాణులూ ప్రళయకాలములో ఆ స్థంభములోనే లయించి పోతాయి [ లీయతే అస్మిన్ , లేక లయం గఛ్చంతి ] 


లింగాలు ముఖ్యముగా రెండు రకాలు. అకృత్రిమ లింగాలు-- ఇవే స్వయంభూ లింగాలు , బాణ లింగాలు. అవి ప్రకృతిలో సహజ సిద్ధముగా ఏర్పడతాయి.
 రెండో రకము , " కృత్రిమమైనవి " అనగా మానవ నిర్మితమైనవి. 
ఇంకోవిధమైన విభాగము , " చల " మరియు " అచల " లింగాలు. కదిలేవి , కదలనివి. అనగా ఇళ్ళలోనూ ఉత్సవాల్లోనూ పూజించేవీ , గుళ్ళలో ప్రతిష్ఠింపబడినవీ...

ఈ లింగాలు రెండు భాగాలుగా ఉంటాయి. ఒకటి పీఠము లేక యోని... దీన్నే సోమసూత్రము అంటారు. రెండు , దానిపైన ఉన్న లింగము. శివలింగములోని అధో భాగాన్ని " బ్రహ్మ భాగము " అనీ , మధ్య భాగాన్ని " విష్ణు భాగము " అనీ , ఊర్ధ్వ భాగాన్ని " రుద్ర భాగము " అనీ అంటారు. సాధారణముగా బ్రహ్మభాగము భూమిలో పాతిపెట్టబడి ఉంటుంది.
నిర్ణయ సింధువు ప్రకారము , 
శివలింగాన్ని మనకు కావలసిన ఫలితాలను బట్టి ఎంచుకోవాలి . చర శివలింగము , అంటే ఒకేచోట స్థాపితము కానిది--మరియూ మానవ నిర్మితమైనది:-- పన్నెండు అంగుళాలకన్నా పెద్దదిగా ఉండరాదు.  రత్నము , బంగారము , వెండి , రాగి, ఇత్తడి , ఇనుము, రాతిది , కర్రది మరియూ మట్టిది-- ఇవన్నీ అదే క్రమములోనే ఒకదానికన్నా ఒకటి అధమమైనది.. అనగా రత్నముతో చేసినది అత్యుత్తమమైనది.. తర్వాత బంగారము... అలాగ. 

వీటిని తొమ్మిది నుండీ ఏడు అంగుళాల పొడవుగా చేయించుకొనుట ఉత్తమము. ఆరు , ఐదు, నాలుగు అంగుళములవి మధ్యరకాలు.  అంతకన్నా చిన్నవి అధమము. బొటనవేలికన్నా చిన్నది ఎప్పుడూ చేయించరాదు. 
వీటి ఎత్తూ , లావూ సమానముగా ఉండి , పీఠము తప్పనిసరిగా ఉండవలెను. పీఠపు ఎత్తు , లింగపు ఎత్తుకు రెట్టింపు ఉండాలి. లింగపు పైభాగపు విస్తీర్ణము ,[ లేదా వ్యాసము , లేదా కర్ణము]  లింగపు ఎత్తుతో సమానముగా ఉండాలి.ఇవి స్థూలముగా , మానవ నిర్మితమైన లింగాల కొలతలు. 

మట్టి , భస్మము , ఆవుపేడ , పిండి , రాగి, కంచు-- వీటిలో దేనితోనైనా లింగము చేయించి ఒకసారి పూజిస్తే , దేవలోకములో పదివేల కల్పములు నివసించుటకు అర్హత , యోగ్యతా సిద్ధిస్తాయి. 

కర్రతో చేసినదాన్ని ధనప్రాప్తికి పూజిస్తారు. వీటిని ఎర్ర చందనము , తుమ్మ ,బిల్వ చెక్కలతో చేస్తారు.  స్ఫటిక లింగాన్ని అన్నిరకాల కోరికలు తీరుటకు మరియూ చిత్తనైర్మల్యానికీ పూజిస్తారు. ముత్యపు లింగము పాపాలను హరిస్తుంది. 

బ్రాహ్మణులు నాలుగు లింగాలనూ , క్షత్రియులు మూడు లింగాలను , వైశ్యులు రెంటినీ , శూద్రులు ఒక లింగాన్నీ పూజించాలి. ఇంటిలో రెండు లింగాలను బ్రాహ్మణులు ఎన్నటికీ పూజించరాదు. శివ , సూర్య అర్చన లలో శంఖమును వాడకూడదు.

పగిలిన , దగ్ధమైన లింగాలను పూజింపరాదు. 

ఇక పార్థివ లింగాలు--అనగా మట్టితో కానీ బంకమట్టితో కానీ చేసిన లింగాలు. 

పార్థివ లింగపూజతో సర్వ కార్యములనూ సాధించవచ్చును. పార్థివలింగాన్ని పూజించేవాడు ఆయుష్మంతుడూ ,బలవంతుడు , శ్రీమంతుడు , పుత్రవంతుడు , ధనవంతుడు , సుఖి ఔతాడు. 

అలాగే , పేడతోను , బంగారముతోను , పట్టు వస్త్రముతోనూ చేసిన లింగాలు కూడా సర్వ కార్యాలనూ సాధించి ఇస్తాయి. 

పార్థివ లింగానికై మట్టిని తెచ్చేటప్పుడు " ఓం హరాయ నమః " అనే మంత్రాన్ని పఠించాలి.
మట్టిని కలుపుతూ లింగాన్ని చేసేటప్పుడు " మహేశ్వరాయ నమః " అని ధ్యానిస్తుండాలి. 
" శూలపాణయే నమః " అంటూ ప్రతిష్ఠ చేయాలి. 
" పినాక ధృతయే నమః " అంటూ ఆవాహన చేయాలి.
" శివాయ నమః " అంటూ స్నానము చేయించాలి.
" పశుపతయే నమః " అంటూ పూలతోను , బిల్వ పత్రాలతోను పూజించాలి.
" మహా దేవాయ నమః " అంటూ విసర్జన చేయవలెను. 
బిల్వపత్రాలు ఎండినవైననూ శుభమే. వాడినవైననూ " నమశ్శివాయ " అంటూ నీటితో కడిగి మళ్ళీ వాడవచ్చు. 
పార్థివ లింగాన్ని ఉమ్మెత్త పూలతో పూజించుట అతి శుభప్రదము. లక్ష గోవులను దానము చేసినంత ఫలాన్ని పొందుతాము. ఒకసారి తీసివేసిన రుద్రుని నిర్మాల్యాన్ని [ నిన్నటి పూజ తర్వాత వాడిన పూలను , పత్రాలను ] ముట్టుకోరాదు , తొక్కరాదు , తినరాదు. అట్లా చేస్తే వెంటనే వస్త్రాలతోపాటూ స్నానము చేయాలి. పూలను , మధ్యవేలు మరియు ఉంగరపు వేళ్ల మధ్యలో పట్టుకొని పూజించాలి. బొటన వేలు , చూపుడు వేళ్ళతో నిర్మాల్యము తీసేయాలి. నుదుట భస్మము , మెడలో రుద్రాక్షలూ లేకుండా శివపూజ చేయరాదు. పార్థివ లింగాన్ని ఎడమచేతిలో ఉంచుకొని , కుడిచేత్తో ప్రోక్షణ , పూజ చేసే వాడుక కర్నాటకలో ఉంది.  ఆంధ్రలో కూడా ఉండి ఉండవచ్చు. 

ఇక , మానవ నిర్మితము కాని--అనగా ప్రకృతిలో వాటంతట అవే సిద్ధముగా దొరికే కొన్ని లింగాల విషయము:-

సాలగ్రామములు, బాణ లింగాలు 



బాణలింగాలు పాలరాతినిపోలి ఉంటాయి. వాటిని పూజించుట వలన ఆత్మ జ్ఞానము , చిత్త నైర్మల్యము కలుగుతాయి. బాణ లింగాల విశేషత ఏమంటే వాటికి ప్రాణ ప్రతిష్ఠ చేయకనే నేరుగా పూజించి అభిషేకము చేయవచ్చును. ఇవి ఎంత చిన్నగా ఉంటే ఫలము అంత అధికము. 

కానీ ముట్టుకోకుండా ఎవరైనా పూజ చేయవచ్చును. ఇది సాలగ్రామములకు మాత్రమే వర్తిస్తుంది. మానవ నిర్మితమైన శివలింగాలకు కాదు. మణులతో చేసిన లింగాలను కూడా సర్వులూ పూజించవచ్చు. పాదరసపు లింగాలను కూడా అందరూ పూజింప వచ్చు. 

" సాలగ్రామము " అనేది నిజానికి నేపాల్ లో గండకీ నది ఒడ్డున ఉన్న ఒక గ్రామము పేరు. అక్కడ ’ సాల ’ వృక్షాలు అధికము కాబట్టి ఆ పేరు. సాలగ్రామములనే రాతి చిహ్నాలు కూడా గండకీ నది ఒడ్డున దొరకుతాయి కాబట్టి వాటిని కూడా సాలగ్రామములు అనే అంటారు. 
వాటంతట అవే సహజ సిద్ధముగా ఏర్పడి దొరికే లింగాలలో బాణ లింగాలు , సాలగ్రామములు ముఖ్యమైనవి. బాణ లింగాలు నర్మదా , గండకీ నదిలోనూ ఒడ్డునా దొరుకుతాయి. 

సాలగ్రామములో నారాయణుడే ప్రతిష్ఠింపబడి ఉంటాడని ప్రతీతి. 

బదరీనాథ్ లోని నారాయణ విగ్రహము , ఉడుపిలోని కృష్ణ విగ్రహమూ సాలగ్రామ శిలతోనే మలచినట్టు గాథలున్నాయి. 

ఇతర విగ్రహాలలో పూజకు ముందు ఆయా దేవతలను మంత్రోక్తముగా ప్రతిష్ఠ , ఆవాహన చేయవలెను, కానీ సాలగ్రామములలో సహజముగానే  , ఎల్లపుడూ నారాయణుడి అస్తిత్వము కలిగి ఉంటాయి. 
సాలగ్రామాలను పూజించటానికి మంత్రాలూ , ఉపదేశాలూ అవసరము లేదు.
 స్వచ్చమైన మనసు , అహంకారము లేని చిత్తము , మంచి నడవడిక , ప్రాపంచిక విషయాలపై అనాసక్తి మాత్రము చాలును. సాలగ్రామాలను పూజించుతకు అతి సరళమార్గము ఏదంటే , సాలగ్రామాన్ని నీటితోగానీ పాలతో కానీ కడిగి [ స్నానము చేయించి ] దానిపై ఒక తులసీ దళమునుంచి , ఏదైనా ఒక తీపి పదార్థాన్ని నివేదించుటే. 

సాలగ్రామాలు కూడా గండకీ మరియూ ఇతర నదులలోనూ దొరుకుతాయి. సాలగ్రామములంటే రాళ్ళు కాదు.  అవి జీవముతో కూడుకున్నవి. ఒకానొక పురుగు తనచుట్టూ ఏర్పరచుకొన్న కోశమే [శిలాజము ]  గట్టిగా , రాతిలాగా కనపడుతుంది. వీటిని అభిషేకిస్తున్నపుడు ఒక్కోసారి అవి ప్రాణము వచ్చిన వాటిలా నీటిలో ఈదుతూ కదలుతాయి. ఇవి కూడా ఎంత చిన్నగా ఉంటే ఫలము అంత అధికము.

ఇంటిలో రెండు సాలగ్రామములను పూజింపరాదు. అయితే మిగిలిన సమ సంఖ్యలో [అనగా నాలుగు , ఆరు , ఎనిమిది .... అలాగ]  సాలగ్రామములను ఉంచుకొని పూజించవచ్చు. సాలగ్రామములు ఇంటిలో ఉంటే ప్రతిరోజూ తప్పక అభిషేకమూ నైవేద్యమూ చేసి పూజించాలి. అలాగే బేసిసంఖ్యలో [ మూడు , అయిదు, ఏడు... అలాగ]సాలగ్రామములను ఇంటిలో పూజించరాదు. కానీ ఒక్క సాలగ్రామమును పూజింప వచ్చు. 

సాలగ్రామ శిల , భగ్నమైనా కూడా [ పగిలినా కూడా ] , చక్రము కలదైతే పూజించవచ్చు. సాలగ్రామములపై చక్రాలు ఏర్పడి ఉంటాయి. అవి తెలిసినవారు గుర్తిస్తారు. వారాహ పురాణము  , " సాలగ్రామ శిలను , కొద్దిపాటి బంగారముతో అయినా సరే , దానము చేసిన నరుడు భూదానము చేసిన ఫలాన్ని పొందుతాడు , మరియూ భక్తితో నూరు సాలగ్రామములను పూజించిన వాడికి కలిగే గొప్ప ఫలితాన్ని నూరు సంవత్సరములు వర్ణించినా సరిపోదు." అంటుంది. 

ఈ సాలగ్రామాలు దానముగా ఇచ్చినవే ఉత్తమము , శుభదమూ అయినవి. డబ్బులిచ్చి కొన్నవి మధ్యమములు , యాచించి తెచ్చుకున్నవి అధమములు. 

సాలగ్రామాన్ని ఉపనీతుడు [ ఉపనయనము అయినవాడు ] మాత్రమే ముట్టుకొని పూజించుటకు అర్హుడు. ఉపనయనము కానివారు , స్త్రీలు ముట్టుకొనరాదు. అలాగ ముట్టుకుంటే నరకదోషము కలుగును అని ’విష్ణు ధర్మము’ గ్రంధములో ఉన్నది.

౧ సాలగ్రామాన్ని , శంఖాన్నీ , తులసీ దళాన్నీ ఒక పళ్ళెములో ఒకే చోట ఉంచినంతనే శుభాలు కలుగుతాయి.
౨. దానము , వ్రతము , పూజ లేక శ్రాద్ధములు సాలగ్రామపు సమక్షములో చేస్తే ఎక్కువ ఫలితాన్నిస్తాయి.
౩. సాలగ్రామాన్ని అభిషేకించిన తీర్థము తాగితే సర్వ పాపాలూ నశిస్తాయి.
౪. గ్రహణాదులలో చేసే జపతపాలు సాలగ్రామపు సమక్షములో చేస్తే అధిక ఫలాన్నిస్తాయి. 
౫. భక్తిలేకున్నా , సాలగ్రామాన్ని పూజిస్తేనే ఫలము దొరకుతుంది.
౬. సాలగ్రామము దానము చేయుట అత్యంత శుభమైన కర్మ. 


శివరాత్రికి అందరూ తమ తమ ఇష్టమైన శివలింగాలను , సాలగ్రామాలనూ పూజించి ధన్యులు అయ్యెదరని ఆకాంక్షిస్తూ.. 

శుభం భూయాత్ ||