SHARE

Monday, September 14, 2015

క్రైస్తవ మత ప్రచారకునితో జగద్గురువుల సంభాషణ-1973


శ్రీ గురుభ్యో నమః ||

శ్రీ శ్రీ శృంగేరీ శారదాపీఠము యొక్క ముప్పైఐదవ జగద్గురువులైన శ్రీ అభినవ విద్యాతీర్థుల వారి కాలములో [1973] ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది.





గురువుల వద్దకు దర్శనానికి ఒక క్రైస్తవ మత ప్రచారకులు వచ్చినారు. ఆయన ఉద్దేశము , వారి మతము సర్వశ్రేష్ఠమయినది , కాబట్టి తమ మతానికి జనులను ఆకర్షించి వారికి స్వర్గ ప్రాప్తికి మార్గాన్ని చూపించవలెను. అందుకోసము జగద్గురువులను ఒప్పించి జనాలను క్రైస్తవ మతానికి చేర్పించాలని కోరడానికి వచ్చినారు. విషయము తెలిసిన జగద్గురువులు , వారి మతపు గొప్పదనము యేమిటో తెలుసుకోవలెనని ఆదరముతో ఆహ్వానించి సంభాషించినారు. 


యోగక్షేమాలు , కుశల ప్రశ్నలతర్వాత జగద్గురువులు అడిగినారు , 


జగద్గురువులు :" మీరు ఇక్కడికి వచ్చిన కార్యమేమిటి ? "


" క్రైస్తవ మత ప్రచారకులు [ క్రై. మ. ప్ర. ] : " స్వామీ , నేను మీ ఊరిలో , మీ మఠము సమీపములో ఒక క్రైస్తవ సంస్థను తెరవాలనే ఉద్దేశముతో వచ్చినాను. "


గురువులు : " ఇక్కడ సంస్థను తెరచుటకు కారణము ?" 

క్రై. మ. ప్ర.: " నేను ప్రజలకు ఇక్కడనుండే ధర్మోపదేశమును ఇవ్వాలని ఆశిస్తున్నాను. "

గురువులు : " మీరు ఉపదేశించునది యేమి ?"

క్రై. మ. ప్ర.:"  "మా మతమును గురించి, దాని శ్రేష్ఠతను గురించీ , జనులకు ఉపదేశము చేసి , వారందరినీ మా మతానికి మార్చుకోవాలనుకొంటున్నాను. "

గురువులు :" మీరు జనులకు ఉపదేశము ఇచ్చే ముందు నాకు కూడా మీ మతమును గురించి తెలిపితే , నేను కూడా తెలుసుకుంటాను గదా ? "

క్రై. మ. ప్ర.:" అట్లే కానివ్వండి, మీరు నన్ను ప్రశ్నలు అడగండి, నేను వాటికి సూక్త సమాధానములను ఇవ్వగలవాడను  "

గురువులు : " మీ మతము మొదలై ఎన్ని సంవత్సరాలయినది ?"

క్రై. మ. ప్ర.:" మా మతము పుట్టి 1973  సంవత్సరాలయినాయి "

గురువులు :" సంతోషము , మీ మతపు ఆరంభమును గుర్తించుటకు ఒక నిర్దిష్టమైన  కాలము , సమయము ఉన్నాయని స్పష్టమైంది. మీ మతము పుట్టుటకు ముందు ప్రజలు ఉన్నారా లేరా ? మీ మతము లేనప్పుడు జనులు జీవిస్తుండేవారా లేదా ?"

క్రై. మ. ప్ర.:" జనులే లేకపోతే మేము మతబోధ ఎవరికి చేస్తాము ? మేము మా మత విషయములను నేర్చుకొని ప్రచారము చేయుటకు ముందు కూడా ప్రజలు ఉండనే ఉన్నారు. "

గురువులు : మీ మతములోకి జనులు మారితే వారికి కలుగు ప్రయోజనమేమి?"

క్రై. మ. ప్ర.:" మా మతములో చేరిన వారందరికి మాత్రమే తప్పక స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. నరకము తప్పుతుంది  "

గురువులు :" సరే , మీరు మీ మతమును అనుసరించే వారికి మాత్రము స్వర్గప్రాప్తి కలుగుతుందంటున్నారు. ఇతరులకు నరకప్రాప్తి అంటున్నారు. కానివ్వండి , మీ మతము పుట్టుటకు ముందు బ్రతికి జీవించిన కోటానుకోట్ల ప్రజలు స్వర్గానికి వెళుతుండేవారా లేక నరకానికి వెళుతుండేవారా ? "

క్రై. మ. ప్ర.:" వారంతా నరకానికే వెళుతుండేవారు. మా మత ధర్మాన్ని పాలించనందువల్ల. "

గురువులు :" ఇదెక్కడి న్యాయము ? ఈ కాలపు ప్రభుత్వాలూ , న్యాయస్థానాలు కూడా ఇటువంటి చట్టాన్ని చేయవు కదా , మీరు మీ ధర్మాన్ని, నియమాన్నీ ఏర్పరచక ముందు ఉన్నవారు మీ ధర్మాన్ని పాలించుట లేదు అన్న కారణానికి వారు నరకభాజనులవుతారు అనేది న్యాయమేనా ? ముందెప్పుడో రచించబోయే నియమాలను ఊహించుకొని వారు అనుసరించుట ఎక్కడైనా సాధ్యమా ? కాబట్టి , మీరు మీ మతమునకు సంబంధించిన నియమాలను రచించుటకు ముందే ఉన్నవారు నరకానికే వెళ్ళినారు అని చెప్పుట సమంజసమా ?"


క్రై. మ. ప్ర.:" [ బిక్క చచ్చి ], ఔను స్వాములూ , వారు అందరూ నరకానికి కాదు , స్వర్గానికే వెళ్ళిఉండాలి  " 


గురువులు :" ఇది కూడా అన్యాయమే అవుతుంది, ఎందుకంటే మీ మతపు నియమాలను రాయుటకు ముందు పుట్టి పెరిగిన వారందరూ స్వర్గానికే వెళ్ళేవారు కదా? ఇప్పుడు మీరు రచించిన మత నియమాల వల్ల , వాటిని అనుసరించే కొందరు మాత్రమే స్వర్గానికి వెళుతున్నారు. అనుసరించని వారు నరకానికే వెళుతారు అన్నట్లయింది కదా ?  అందువల్ల , మీరు మీ మత నియమాలను రచించకుండా ఉండిఉంటే అందరూ తప్పక స్వర్గానికే వెళ్ళేవారు. ఇప్పుడు మీ నియమాల వల్ల అనేకులకు అన్యాయము జరిగింది కదా ?"

క్రై. మ. ప్ర.:" [ తన మాటలకు తానే చిక్కుకొని గాభరా పడి] స్వామీ , మీరు నన్ను ఇటువంటి ప్రశ్నలను అడుగుతున్నారే ? దయచేసి నన్ను వదిలేయండి " అన్నాడు.

గురువులు :" సరే , అట్లాగే కానివ్వండి , ఆ సంగతి వద్దు. చూడండి , ఈ ప్రపంచములో ప్రజలు అనేక విధములైన దుఃఖ కష్టాలకూ , సుఖ సంతోషాలకూ లోనగుటను చూస్తున్నాము కదా , దానికేమిటి కారణము ?"

క్రై. మ. ప్ర.:" దీన్నంతటినీ భగవంతుడే  చేసినాడు "

గురువులు :" ఒకడికి ముష్టి అడుక్కోవలసిన హీన స్థితినీ , ఇంకొకడికి దానము చేయునట్టి ఉత్తమ స్థితినీ దేవుడు అనాదిగా ఇస్తున్నాడంటే , భగవంతుడు తనకు ఇష్టమైనవాడిని సుఖములోనూ , తనకు అప్రియమైన వాడిని దుఃఖములోనూ ఉండేటట్టు చేసినాడనే చెప్పవలెను కదా ?" 

క్రై. మ. ప్ర.:" అది భగవంతుని స్వంత ఇఛ్చ , స్వామీజీ , మనమేమీ చేయలేము. వాడు ఏమికావాలన్నా చేయగలడు. అది వాడిష్టము.  "

గురువులు :" భగవంతుడు ఏమి కావాలన్నా చేయవచ్చు అన్నట్టయితే , అందరికీ సుఖాన్నే ఇవ్వవచ్చును కదా ? ఆ సుఖాన్ని కొందరికి మాత్రమే ఎందుకు ఇచ్చినాడు ?దానికి కారణమేమయి ఉంటుంది ?"

క్రై. మ. ప్ర.:" [అప్రతిభుడై], అదంతా భగవంతునికి చెందిన విషయము. నేనేమి చెప్పగలను ? "

గురువులు :" మీ వాదానికి ఒక యుక్తి గానీ , తర్కము గానీ ఉన్నట్టే కనిపించుట లేదు. సరే , అదీ ఉండనివ్వండి , మరొక విషయము ; చిన్న పిల్లలుగా ఉన్నపుడే కొందరు చనిపోతారు. కొందరేమో వయసయిన తర్వాత. ఇలాగున్నపుడు , చిన్నపిల్లలు చనిపోయాక స్వర్గానికి వెళతారా లేక నరకానికా ? "

క్రై. మ. ప్ర.:" చిన్న పిల్లలు పాపము ఎలాచేయగలరు ? వారు ఒక తప్పును కూడా చేయలేరు. వారింకా చిన్నపిల్లలే కాబట్టి వారికి పాపపుణ్యాల ప్రసక్తే రాదు. వారికవి అంటవు "

గురువులు : " అందుకే అడిగినాను , వారు వెళ్ళేది స్వర్గానికా , లేక నరకానికా ?"

క్రై. మ. ప్ర.:" చిన్న పిల్లలందరూ స్వర్గానికే వెళతారు  "

గురువులు :" అట్లయితే మన తల్లిదండ్రులంతా మనగురించి చాలా పెద్ద తప్పే చేసినారు అనవలెను. మనలనందరినీ చిన్న పిల్లలుగా ఉన్నపుడే చావడానికి వదిలేయకుండా  పెంచి పోషించి పెద్ద చేసినారు. ఇది చాలా పెద్ద తప్పు కదా ? శిశువులను పుట్టగానే చంపి వేసుంటే, మనము పెరిగి పెద్దయి, తప్పు చేసేందుకు అవకాశమే ఉండేది కాదు. మనందరకూ స్వర్గమే దొరికేది ? కాదా ?"

క్రై. మ. ప్ర.:"[ మరలా చిక్కుకొని], స్వామీ మీరు ఇలాంటి ప్రశ్నలు వేస్తే నేను జవాబివ్వలేను  "  

గురువులు :" సరే , వదిలేయండి, చనిపోయే వారందరూ స్వర్గానికో లేక నరకానికో వెళతారు తప్పదు కదా, ఎప్పుడు వెళతారు అన్నది చెపుతారా ?"

క్రై. మ. ప్ర.:" భగవంతునికి ఎప్పుడు నిర్ణయించాలనిపిస్తే అప్పుడు నిర్ణయిస్తాడు , అప్పుడే పోతారు  "

గురువులు :" ఇదేమయ్యా ఆశ్చర్యము ? భగవంతుడు పిచ్చివాడా యేమి , తనకిష్టమొచ్చినపుడు న్యాయ నిర్ణయము చేయుటకు ?"

క్రై. మ. ప్ర.:" అలాగ కాదు , అక్కడ అదంతటికీ ఒక క్రమ విధానముంటుంది "

గురువులు :" సరే , మీ పుస్తకములో అదేమి క్రమ విధానమును వివరించినారో కొంచము చెపుతారా ? [ ఆయన మాట్లాడేందుకు తటపటాయించినాడు; గురువులే కొనసాగించినారు] మీ మతములో ఈ విషయము గురించి ఏమి సిద్ధాంతము ఉందో , దాన్ని నేను చెపుతాను. అది సరియా కాదా మీరే చెప్పండి"

క్రై. మ. ప్ర.:" కానివ్వండి స్వామీ , చెప్పండి "

గురువులు :" ఈ ప్రపంచములో ఉన్నవారందరూ చనిపోయిన తరువాత , దేవుడు , ఏదో ఒకరోజు , న్యాయ నిర్ణయమును చేసి, కొందరికి స్వర్గాన్నీ , కొందరికి నరకాన్నీ ఇస్తాడు. కదా ? సరియేనా ? "

క్రై. మ. ప్ర.:"  ఔనౌను , తమరు చెప్పింది సరిగ్గా ఉంది"

గురువులు :" ఈ ప్రపంచములోనే జరుగుతున్న సంగతిని చూడండి , ఎప్పుడైనా ఎవరైనా ఒక తప్పు చేసినారంటే , విచారణకు మొదట , ఆ తప్పు చేసినవాడిని పోలీసులు కొన్నిరోజులు నిర్బంధములో ఉంచుతారు. దాని తర్వాత కూడా అతడిని పోలీసులు లాకప్ లో ఉంచాలంటే ,దానికి న్యాయాధీశుల అనుజ్ఞను పొందవలసి ఉంటుంది. అలాగ , కారణమూ , అనుమతీ లేకుండా , విచారణ చేయకుండా  ఎక్కువ రోజులు ఉంచుటకు వీలు లేదు. న్యాయాధీశులు ఒప్పుకోకుంటే అతడిని పోలీసులు నిర్బంధము నుండీ వదిలివేయ వలసి ఉంటుంది. ఇలాగున్నపుడు , ఒకడు మృతుడయిన తరువాత వాడికి , " ఈ ప్రపంచములో ఉన్నవారందరూ చచ్చిపోయే వరకూ , అనగా , కోటి కోటి సంవత్సరాలయ్యే వరకూ జనాలు పుట్టుతూ చస్తూ ఉంటారు కాబట్టి , అదంతా అయ్యే వరకూ , ’ నువ్వు విచారణ లేకుండానే కాచుకొని ఉండాలి" అంటూ ఆ భగవంతుడు చెబితే ,అది న్యాయమనిపించుకుంటుందా ? మీరే చెప్పండి?"


జగద్గురువుల ఈ మాటను విని ఆ క్రైస్తవ మత ప్రచారకుడు దిక్కుతోచనివాడైనాడు. అప్పుడు గురువులు ఆతనికి సమాధనము చెబుతూ , 


" మీకు మీ మతమే గొప్పది. మీరు దానిని అత్యంత శ్రద్ధతో అనుసరించవలెను. అంతే కానీ , ఇతరులతో , ’ మా మతమే శ్రేష్ఠమైనది, దానినే అందరూ అనుసరించవలెను, అలాగ ఏమైనా మీరు మా మతాన్ని అనుసరించకపోతే మీకు , నరకమూ , దుఃఖమే గతి’ అని చెప్పుట సాధువైనది కాదు. మీకు మీ తల్లి పూజనీయురాలు. ఇతరులకు వారి వారి తల్లులు పూజనీయులు. ’ మాతల్లి మాత్రమే పూజనీయురాలు , ఇతరుల తల్లులు కాదు’ అంటూ మీరు చెప్పితే అది మీ మూఢత్వమే అవుతుంది. నా తల్లి కూడా ఇతరుల తల్లులవలె సమానముగా పూజనీయురాలు అని తెలుసుకున్నపుడే మనలను ప్రపంచము ఆదరిస్తుంది. లేకుంటే ఛీత్కరిస్తుంది. " అని ఉపదేశించినారు. ఆతడిని వీడ్కొనునప్పుడు ఆతనికి జగద్గురువులు ఎప్పటివలెనే ఫలమునిచ్చి సత్కరించినారు. అతడు దానిని ఆదరముతో స్వీకరించి వెళ్ళిపోయినాడు. 


ఆ తరువాత గురువులు భక్తులను ఉద్దేశించి ,


 || సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః |

అనేన ప్రసవిష్యధ్వమేష వోఽత్తిష్వ కామధుక్ ||

" మొదట యజ్ఞములతోపాటు ప్రజలను సృష్టించి ప్రజాపతి, ’ ఈ యజ్ఞములు మీకు కామధేనువులగు గాక ’ యని అంటాడు. బ్రహ్మ దేవుడు , జగత్తును సృష్టి చేయునపుడే అది సరిగ్గా నడుస్తూ ఉండుటకు అవసరమైన విధి-నియమములను రచించినాడు. ఇది మన మతపు గొప్పతనము. మన సనాతన ధర్మపు సిద్ధాంతము ప్రకారము , భగవంతుడు అనాదియైనవాడు. అలాగే ఈ ప్రపంచమూ , మన ధర్మమూ కూడా అనాదిగా ఉన్నవి. జీవరాశులకు వాటి వాటి కర్మలకు తగినట్లు ఫలము ప్రాప్తిస్తుంది. దుష్టులకు దుష్టఫలము , సత్కర్ములకు మంచి ఫలము. కర్మలు అచేతనమైనవి-అంటే జడమైనవి. ఫలము నిచ్చేది భగవంతుడే. 


భగవంతుడు దయాళువు అనునది దిటమైన మాట.. తప్పుచేసినవాడు తన తప్పును ప్రామాణికముగా ఒప్పుకొని క్షమాభిక్ష వేడితే న్యాయాధీశులు శిక్షను తగ్గిస్తారు కదా ? కానీ ఇతడు పదే పదే తప్పులు చేస్తూ ప్రతిసారీ క్షమాభిక్షను కోరితే న్యాయాధీశుడు క్షమిస్తాడా ? భగవంతుడు కూడా అట్లే. ప్రామాణికులైనవారిని క్షమిస్తాడు. కానీ పదే పదే తప్పుచేసే వాడిని ఖచ్చితముగా క్షమించడు. మన శాస్త్రములు శ్రద్ధతో పాటూ వివేకము కూడా ఉండవలెనని బోధిస్తాయి. ఇతరమతాలు శ్రద్ధ ఒక్కటీ ఉంటే చాలని చెబుతాయి. మత ధర్మములలో భావుకత మాత్రమే కాక విచారము చేయు ప్రవృత్తి కూడా ఉండవలెను. 


శ్రీరామచంద్రుడు , శ్రీ కృష్ణుడు వంటి అవతారాలు మన ధర్మములో మాత్రమే కనిపిస్తాయి. మన ధర్మము వారివల్ల యేదో కొత్తగా స్థాపించబడినది కాదు. మన ధర్మము , అటువంటివారిని ఈ జగత్తుకు ప్రసాదించింది. ఇంతటి మహాత్మ్యమున్న సనాతన ధర్మములో మనందరమూ జన్మించినాము. ఈ సనాతన ధర్మపు బోధనలను పాలించి మనమందరమూ శ్రేయస్సుకు తగినవారము కావలెను. " అని ఉపదేశించినారు. 


[ శ్రీ శృంగేరీ శారదా పీఠము వారు కన్నడ భాషలో ప్రచురించిన " శృంగేరీ పుణ్యక్షేత్రము " పుస్తకమునుండీ అనువాదము }

Thursday, April 23, 2015

ఆది శంకరుల అద్వైత సిద్ధాంతము-- శ్రీ భారతీ తీర్థ మహా స్వాముల మాటలలో.


|| శ్రీ గురుభ్యో నమః ||

ఆది శంకరుల అద్వైత సిద్ధాంతము-- శృంగేరీ జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ మహా స్వాముల మాటలలో.




పరమ పూజ్యులగు శ్రీ శంకర భగవత్పాదాచార్యులు , ధరపైన అవతరించి అద్వైత సిద్ధాంతమును ఈ ప్రపంచమునకు దయపాలించినారు. అయితే , అద్వైత సిద్ధాంతపు పుట్టుకకు శ్రీ శంకరులే కారణము అనేది సరికాదు. ఉపనిషత్తులలో అద్వైత సిద్ధాంతపు ప్రతిపాదన స్పష్టముగా ఉంది. శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత యొక్క అంతరార్థము కూడా అద్వైతమే. శ్రీ వేదవ్యాసులు కూడా బ్రహ్మ సూత్రములలో అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినారు. 

అయినా కూడా శ్రీ శంకరుల అవతారము అగు వరకూ అద్వైత సిద్ధాంతము జటిలముగనే ఉండిపోయినది. ఉపనిషత్తులలోని కొన్ని వాక్యములను ఆధారముగా చేసుకొని కొందరు , తమకు తోచినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. నాస్తికులు కూడా తమ మొండి సిద్ధాంతాలను సమర్థించుకోవాలంటూ కొన్ని వేద వాక్యాలను నిదర్శనముగా చూపుతున్నారు. ఇలాగ అద్వైత సిద్ధాంతము గురించి బలము లేని చర్చలు నడుస్తుండేవి. అటువంటి సందర్భములో జనులను సరియైన దారికి తెచ్చు క్రమములో భగవత్పాదులు శంకరాచార్యులు ధరపై అవతరించినారు.  ఉపనిషత్తులలోని గూఢార్థముగా ఉన్న సిద్ధాంతమును సరళముగా జనులముందు విప్పి పెట్టినారు. 
వేదవాక్యములను విశ్లేషించుటకు సూక్త ఆధారములను ముందర పెట్టుకోవలెను. మనము చేయు విశ్లేషణలు సరియైన దారిలోనుండవలెను. అద్వైతము  శృతి , యుక్తి  మరియూ అనుభవవేద్యమై యున్నది. 

|| వేదస్య హి నిరపేక్షమ్ ప్రామాణ్యం రవేరివ రూపశయే || 

ఈ [ అద్వైత ] సిద్ధాంతమును ప్రతిపాదించునపుడు మనము వేదమును పరమ ప్రమాణముగా అంగీకరించ వలెను అంటారు శంకరులు. కొందరు , " వేదములలో అయోమయము కలిగించు అంశములున్నాయి , కాబట్టి అవి ప్రమాణములు కాదు " అంటారు. కానీ అది సరి కాదు , పూర్వాపర విరోధము రాకుండా , సమగ్ర ప్రకరణమును చూసి , ఆ తరువాతనే వేదమునకు అర్థమును చెప్పవలెను. ఉదాహరణకు ,ఉపనిషత్తులోనున్న , " న తస్య ప్రతిమాఽస్తి " అనే వాక్యానికి కొందరు , " దేవుడికి ప్రతిమా మూర్తి అనేది లేదు , కాబట్టి విగ్రహారాధన చేయకూడదు " అని అర్థము చెపుతారు. అయితే , ఆ వాక్యానికి అర్థము అది కాదు , ’ ప్రతిమా ’ అంటే , ఉపమ ...లేదా పోలిక. దేవుడికి సమానమైనవాడు , వాడికి ఉదాహరణగా ఇవ్వతగ్గ ’ మరొక ’ వస్తువు కాదు" అని ఆ వాక్యానికి అర్థము. ఇదే అర్థాన్ని, " న తత్ సమశ్చ అభ్యధికశ్చ  దృశ్యతే " అనే ఉపనిషద్వాక్యము బోధిస్తుంది. అతడికి సమానమైన మరియూ అతడికన్నా అధికుడైన ఇంకొకడు లేడు అని దానర్థము. 

భగవంతుడు వర్ణనాతీతుడు , ఊహాతీతుడు , అనంతానంత సామర్థ్యమున్నవాడు. అచింత్యుడు , అపరిమితుడూ అయి ఉన్నాడు. అతడికి పోల్చదగిన మరొక వస్తువే లేదు. అదే , ఆ ఉపనిషత్ వాక్యపు అర్థము. అట్లున్నపుడు మనము వేదవాక్యములను తప్పుగా అర్థము చేసుకోకుండా , ప్రతీ దానినీ , యే విరోధమూ కలుగకుండా స్పష్టముగా అర్థము చేసుకోవలెను. ఆ కారణము చేతనే భగవత్పాదులు శంకరులు , వేద వాక్యాలను సరిగ్గా అర్థము చేసుకొనవలెను అని చెవిమాట చెప్పినారు. సర్వ ఉపనిషత్తుల పూర్తి సారమూ అద్వైతమే అన్నారు. పూర్తి వేదాంతపు మార్గమే అద్వైతమని అర్థము చేసుకుంటే , వేరే ప్రశ్నలే పుట్టవు. 

కొందరు , శంకరులను గురించి , " అద్వైత సిద్ధాంతము ప్రకారము , పరబ్రహ్మమే నిత్యము , సత్యము , మిగిలినదంతా మిథ్య " - ఇదే నిజమయినట్టైతే , ఈ ప్రపంచములో జరిగే ప్రతియొక్క క్రియ గురించి ఏమని చెపుతారు ? గురువులైన తమరు , శిష్యులైన మాకు జ్ఞానమును బోధిస్తున్నారు , ఇది సత్యమా లేక మిథ్యయా ?  మీరే చెప్పండి . బ్రహ్మ తప్ప మిగిలినవన్నీ మిథ్య అన్నట్టైతే , మీ బోధనలు , మా గ్రహింపు... మిథ్యయేనా ? ఈ ప్రపంచములో నడచు అన్ని కార్యములూ అబద్ధాలేనా ? జరిగే సర్వ క్రియలూ మిథ్య అనే అర్థమా ? " అని ప్రశ్నిస్తారు. 

అప్పుడు భగవత్పాదులైన శంకరులు ఇలాగ ఉత్తరమిస్తారు , 
|| సర్వ వ్యవహారాణామేవ ప్రాగ్ బ్రహ్మాత్మతా విజ్ఞానాత్ సత్యత్వోపపత్తేః |
స్వప్న వ్యవహారస్యేవ ప్రాక్ ప్రబోధాత్ ||

జగత్తులో మూడు విధముల సత్యములున్నాయి. 
మొదటిది , " పారమార్థిక సత్యము " అది ’ త్రికాలాబాధితమైన ’ సత్యము. ఆ పరబ్రహ్మమనేది , మొదటా ఉండింది , ఇప్పుడూ ఉంది. ఇక ముందూ ఉంటుంది. అది పరమ సత్యము. 
రెండవది ,బ్రహ్మ జ్ఞానము పొందక ముందు ఉన్న స్థితిలో ఉండేది , " వ్యావహారిక సత్యము ". 
మూడోది, " ప్రాతిభాసిక సత్యము ".  అంటే , వస్తువు కనిపించునంత కాలము మాత్రమే అది సత్యముగా కనపడేది. ఉదాహరణకు , మృగతృష్ణ [ ఎండమావి ] లో నీరున్నట్టే కనబడుతుంది. అక్కడ నిజముగా నీరు లేకున్ననూ భ్రాంతి వలన నీరున్నట్టే కానవస్తుంది. ఇది ప్రాతిభాసిక సత్యము. ఈ మూడింటికన్నా భిన్నముగా ఉన్న వస్తువేదైనా , తుఛ్చమైన అసత్యమే ! 
ఉదాహరణకు , గగన కుసుమము , శశశృంగము [ కుందేటి కొమ్ము ]. 
ఈ ప్రపంచమనునది గగన కుసుమము మొదలగువాటి వలె అసత్యమైనది కాదు. ఎందుకంటే ఇది మన అనుభవానికి గోచరమవుతున్నందు వలన ఇది అబద్ధమని చెప్పుటకు సాధ్యము కాదు, అలాగే ,ఇది పరబ్రహ్మ వస్తువు వలె పారమార్థికముగా సత్యమైన వస్తువూ కాదు. ఎందుకంటే ఇది నిరంతరమూ మారుతూనే ఉండుట వలన దీనిని ’ త్రికాలాబాధమైన ’ సత్యము అనుటకు సాధ్యము కాదు. అందువలన ఈ ప్రపంచము ’ మిథ్య ’ అని పిలవబడినది. ’ మిథ్య ’ అంటే ’ అబద్ధము ’ అని అర్థము కాదు. ’ ఇది ఇలాగ ’ అని నిర్ధారించుటకు సాధ్యము కానిది , అనిర్వచనీయమైనది అని అర్థము. 

ఈ ప్రపంచమనేది వ్యావహారిక సత్యము. బ్రహ్మ జ్ఞానము పొందు వరకూ ఇది సత్యమని అనిపిస్తుంది. బ్రహ్మ జ్ఞానమును పొందినప్పుడు , బ్రహ్మమే సత్యము. మిగిలినదంతా మిథ్య అని తెలుస్తుంది. ఎలాగైతే నిద్రించు వ్యక్తి కలలో అనెక ఘటనలను చూసి కూడా , మెలకువ అయినాక , అవన్నీ అబద్ధము అని తెలుసుకుంటాడో , అలాగే , బ్రహ్మము ఒకటే సత్యము.  ’ ఆ బ్రహ్మము నేనే అయి ఉన్నాను ’ అన్న జ్ఞానము వచ్చిన తక్షణమే స్వప్న సదృశమైన ద్వైత ప్రపంచమంతా నష్టమవుతుంది. 

దీనిని అద్వైత సిద్ధాంతమును సరిగ్గా అర్థము చేసుకోనివారు ఆక్షేపించవచ్చు , ’ అద్వైతము ’ అనగానే అన్నీ మిథ్య అని అర్థము కాదు. వాస్తవాన్ని ఎవ్వరూ తోసిపారేయుటకు సాధ్యము కాదు అనేదేమో నిజము. అద్వైత సిద్ధాంతము వలన కర్మ మార్గమునకు ప్రాముఖ్యత లేదని కాదు , ఎవరికైతే అద్వైత సాక్షాత్కారమయినదో , వారికి కర్మలు వదిలేయండి అని చెప్పే అవసరమే లేదు , అటువంటి వారిని కర్మ తానే వదలిపోతుంది. కానీ అద్వైత సాక్షాత్కారమగు వరకూ అతడు కర్మాసక్తుడై ఉండవలెను. కాబట్టి , అద్వైత సిద్ధాంతము కర్మలను , ఉపాసనలను తిరస్కరించదు అనవచ్చు. 
భగవత్పాదులైన శంకరులు అద్వైత సిద్ధాంతాన్ని సదృఢముగనే ప్రతిపాదించిననూ , కొందరి[ సరిగ్గా అర్థము చేసుకొనలేని వారి ] దృష్టిలో , అద్వైతము టీక చేయవలసిన వస్తువు. అయితే , ద్వైతము-అద్వైతము-విశిష్టాద్వైతము - ఈ అన్నింటినీ కూలంకషముగా పరీక్షిస్తే , అద్వైత సిద్ధాంతములో మాత్రమే అన్ని ఆక్షేపణలకూ సరియైన సమాధానము దొరకుతుంది. అద్వైత సిద్ధాంతమే శ్రేష్ఠము అనేది ’ అయ్యణ్ణ దీక్షితుల’ స్పష్ట అభిప్రాయము. ఈ అంశాన్ని వారు " వ్యాస తాత్పర్య నిర్ణయ " అనే గ్రంథములో ప్రతిపాదించినారు. శంకరులు , ’ ఉపనిషత్ సారమే అద్వైతము ’ అన్నారు. వారు ప్రతిపాదించిన అద్వైతము , తరువాతి కాలములో కావలసినంత విస్తారమూ , ప్రసిద్ధీ అయినది. 

ఓం తత్ సత్

[ బోధివృక్ష --కన్నడ ప్రచురణ నుండీ అనువాదము ]

Sunday, February 1, 2015

జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతి గారి అనుగ్రహ భాషణము

                                    || శ్రీః || 





ముప్పై యేడవ శ్రీ శారదా పీఠపు జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతి గారు సన్యాసాశ్రమము తీసుకున్న తరువాత తమ మొట్ట మొదటి అనుగ్రహ భాషణమునిచ్చినారు. 

[ కన్నడ భాషణమునకు తెలుగు అనువాదము- పూర్తి పాఠము ] 

|| శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే |
సర్వదా సర్వదాఽస్మాకం సన్నిధిం సన్నిధిం కుర్యాత్ ||

|| శ్రుతిః స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం |
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం ||

|| అజ్ఞానాంజాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం |
సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే ||

ఈ జగత్తులోనున్న సర్వ ప్రాణులకన్నా మనుష్యుడు అత్యంత శ్రేష్ఠమైనవాడు అని శాస్త్రములు చెపుతాయి. అయితే  మనుషులమై పుట్టినంత మాత్రమునకే మనము కృతార్థులము కాలేము. దానిని, అంటే ఆ మనుష్య జన్మను మనము సార్థకము చేసుకోవలెను. మన జీవితానికి సార్థకత అనేది ఎప్పుడు కలుగునంటే , మోక్షమును పొందినపుడు మాత్రమే. మనుషుడై పుట్టినదానికి ఫలమేమిటి అంటే , మోక్షమును పొందుటే ఫలము .  కానీ ఆ మోక్షమనేది అంత సులభముగా దొరికేది కాదు. దానికి మహాపురుషుల అనుగ్రహము అనేదొకటుండ వలెను. భగవంతుని కృప అనేది కూడా ఉండవలెను.  ఎన్నో జన్మలలో చేసినట్టి పుణ్యము , పుణ్య విశేషమూ ఉండవలెను. అయితే ఈ మహాపురుషుల అనుగ్రహము అనేది అత్యంత దుర్లభమైనది.
దీనినే శంకరాచార్యులు అంటారు , 
|| దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహ హేతుకం |
మనుష్యత్వం , ముముక్షుత్వం , మహాపురుష సంశ్రయః ||
అని.
మనుష్య జన్మ పొందుట , అలాగే , మోక్షమును పొందవలెనన్న తీవ్రమైన ఇఛ్చ ఉండుట , అట్లే , మహాపురుషుల సాన్నిధ్యము-ఇవన్నీ కావలెనంటే , భగవంతుని కృప అనేది మనకు ఉండే తీరవలెను. ఆ కృప ఉండుట వల్లనే మనకు ఈ మూడూ దొరకుతాయి. నాకు , ఆ మహాపురుషుల సంశ్రయము... అంటే సాన్నిధ్యము అనేది ఆ శారదామాత కృప వల్ల దొరికింది. అందులోనూ , మహాపురుషులు అనగా , సాక్షాత్తూ ఆది శంకరుల పరంపరలో వచ్చినట్టి , అలాగే ఆ ఆదిశంకరుల స్వరూపులైనట్టి జగద్గురువుల సాన్నిధ్యము అనేది నాకు లభించింది. వారి అనుగ్రహము నాకు దొరికింది.

మొదటినుండీ కూడా నాకు ఆధ్యాత్మిక మార్గములో జీవనము గడపవలెను, నా జీవితాన్ని సార్థకము చేసుకోవలెను అనే ఇఛ్చ ఉండింది. అలాగే , శృంగేరీ జగద్గురువుల వద్దనే శాస్త్రాధ్యయనము చేయవలెను అన్న కోరిక కూడా ఉండేది. దానికై జగద్గురువులను ప్రార్థించినపుడు , వారు నామీద పరమానుగ్రహమును చూపి, న్యాయాది సర్వ శాస్త్రములనూ నాకు నేర్పించినారు. నామీద అపారముగా వారి కృప ఉండింది. వారు ప్రతీ క్షణమూ నా ఉన్నతినే కోరుచుండెడి వారు. ఈ దినము నాకు కలిగిన ఈ గొప్ప భాగ్యములో మాకు సొంతముగా యేదీ రాలేదు , అంతా కూడా ఆ జగద్గురు మహాస్వాముల అనుగ్రహము వల్లనే మాకు దొరికింది. 

నేనైతే ఇక్కడికి.. ఈ శృంగేరికి వచ్చినది, శాస్త్రాధ్యయనము కోసము మాత్రమే. అట్లే , ఆధ్యాత్మికముగనూ , శాస్త్రోక్తముగానూ జీవితము గడపవలెను అన్న కోరితోనూ వచ్చినాను. అయితే  జగద్గురు మహాస్వాములవారు నన్ను పరిపూర్ణముగా అనుగ్రహించి వారి కరకమలములతోనే నాకు సన్యాసాశ్రమమును అనుగ్రహించినారు. తమ ఉత్తరాధికారిగా నన్ను స్వీకరిస్తాను అని వారు చెప్పినపుడు నాకు అవధులులేని ఆనందము కలిగింది. ఎందుకంటే సాక్షాత్తూ ఆ ఆది శంకరుల పరంపరలో వచ్చిన వారు , ఆ ఆదిశంకరుల స్వరూపులే యైనట్టి ఆ జగద్గురువుల అనుగ్రహము నాకు ఇంతగా దొరకడము , ఈ దినము నా జీవితము ధన్యమైనట్లే అని భావిస్తున్నాను. 

నన్ను తమ ఉత్తరాధికారిగా స్వీకరిస్తున్నామని వారు చెప్పినపుడు నేను అడిగినాను , " తమరు ఇంతటి బాధ్యతను నాపైనుంచినారే , దీనిని వహించుటకు నాకు సాధ్యమవుతుందా ? " అని. దానికి వారు మందహాసముతో అన్నారు , " దాని గురించి నువ్వేమీ ఆలోచించవద్దు , ఆ శారదామాత ప్రేరణతో నీ మీద నా అనుగ్రహము సంపూర్ణముగా ఉంది. అదొక్క దాని వల్లనే సర్వమూ సాధింపబడును " అని అన్నారు. అంటే , గురువుల అనుగ్రహము ఒక్కటీ ఉంటే చాలు , మనము దేనినైనా సాధించవచ్చును , అందులో యే సంశయమూ లేదు అన్నది నాకు బోధ పడింది. వారు నాపై ఇంతటి నమ్మకము , విశ్వాసమూ చూపుట కేవలము వారి అనుగ్రహ కటాక్షమే తప్ప నా గొప్పదనము ఏమీ లేదు. ఇదంతా కూడా ఆ జగద్గురు మహా స్వాములు నాకు అనుగ్రహించి ఇచ్చినదే. అట్లే , నా మీద ఉంచిన ఈ బాధ్యతను కూడా , వారి అనుగ్రహము చేతనే సమంజసముగా నిర్వర్తిస్తాను అని చెప్పతగినది. అలాగే, ఈ మఠపు ఉత్తరోత్తర అభివృద్ధికై కూడా , వారి అనుగ్రహ బలముతోనే నేను పరిశ్రమ చేయగలవాడను. ఇంతటి మహత్కార్యమునకు మీ అందరి సహకారము కూడా అవశ్యముగా కావలెను. మీరందరూ ఇంత సంఖ్యలో ఇక్కడికి వచ్చినారు , ఈ మఠము మీద , గురువుల మీద మీకందరికీ అపారమైన శ్రద్ధ ఉంది, ఈ శ్రద్ధా భక్తులను ఎల్లపుడూ ఇదేరీతిలో కొనసాగిచవలెనని ఈ శుభ సందర్భములో మీకందరికీ నా అభ్యర్థన. ఆ గురుభక్తే మనలను అత్యున్నతమైన స్థితికి తీసుకువెళ్ళగలదు అని చెప్పి , ఆ జగద్గురు చరణారవిందములకు సాష్టాంగ ప్రణామములను అర్పిస్తూ , నా ఈ భాషణమును ముక్తాయిస్తున్నాను. 

[ కింది భాషణము వారు ముందటి దినము కొన్ని వార్తా పత్రికలకు ఇచ్చినది]

||  శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం 
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం || 

భగవత్పాద శంకరాచార్యులు , " జంతూనాం నర జన్మ దుర్లభం " అన్నారు. అటువంటి నరజన్మను పొందిన తరువాత , మోక్షమును పొందుటే ముఖ్యమైన ధ్యేయముగా ఉండవలెను. ఆధ్యాత్మ సాధన యొక్క ముఖ్య ఉద్దేశము కూడా అదే అయి ఉన్నది. కాబట్టి ఆధ్యాత్మ సాధనే ప్రతి యొక్కరికీ మొదటినుండీ చివరి వరకూ లక్ష్యముగా ఉండవలెను. మోక్ష మార్గమునకు సన్యాసాశ్రమమే శ్రేష్ఠమైన మార్గము. ఎందుకంటే సన్యాసికి ఎటువంటి బంధనాలూ ఉండవు. ఎట్టి అంతరాయములూ లేక పరమాత్ముని గురించి నిరంతరమూ ధ్యానము చేయుటకు అవకాశముంటుంది. అందువలన , సన్యాసమే ఉత్తమ మార్గమని నా భావన.
గృహస్థాశ్రమములో ఆ అవకాశము లేదు. గృహస్థులకు కుటుంబ నిర్వహణా బాధ్యతలుంటాయి కాబట్టి సంపూర్ణముగా ఆధ్యాత్మ సాధనలో నిమగ్నమగుట సులభము కాదు.  

సన్యాసాశ్రమము తీసుకున్ననూ మోక్షమును పొందాలంటే గురువు యొక్క అనుగ్రహము అత్యంత అవసరమైనది. శంకరాచార్యులే వారి శిష్యులకు మహా వాక్యమును ఉపదేశము చేసినారు. ఇది పరంపరానుగతముగా వస్తున్నది. అటువంటి పరంపరలో వచ్చిన గురువులే నాకు సాక్షాత్తూ ఉపదేశము అనుగ్రహించుట , నా జీవితములో నేను పొందిన  అతిపెద్ద సౌభాగ్యము . శ్రీ జగద్గురువులు నన్ను అనుగ్రహించుటలో నా గొప్పతనమేదీ లేదు. అది కేవలము వారి దయ. అట్టి గురువుల వద్ద శిష్యరికము చేయుట నా భాగ్యము. ఇది నేనేనాడూ ఊహించనిది. 
ఆరు సంవత్సరాల క్రిందట , శృంగేరికి వచ్చినపుడు , శాస్త్రాధ్యయనము చేయుట మాత్రమే నా ఉద్దేశము. అపుడు ఇంతపెద్ద  బాధ్యత నాకు వస్తుందనీ , దానిని నేను తీసుకోవాలనీ అనుకోలేదు , కోరుకోలేదు. అయితే గురువుల సాన్నిధ్యము , వారి విశేషమైన అనుగ్రహము మరియూ వారు చూపిన మార్గ దర్శనము నన్ను మూక విస్మితుడిని చేసింది. వారు నాపై ఉంచిన నమ్మకము , బాధ్యతలను దైవానుగ్రహముగాను , దైవాదేశముగానూ  తీసుకుంటాను. వారి అనుజ్ఞను పాలించుతున్నాను అన్న ఆత్మతృప్తి , సంతోషమూ నాకున్నాయి.  

గురుపాదుకాభ్యో నమః 









Saturday, January 31, 2015

జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ స్వాముల శిష్య స్వీకార మహోత్సవ సందర్భంగా అనుగ్రహ భాషణము

                               || శ్రీః ||





జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ స్వాములు , తమ శిష్య స్వీకార మహోత్సవ సందర్భంగా చేసిన అనుగ్రహ భాషణము
[ కన్నడ భాషణమునకు తెలుగు అనువాదం- పూర్తి పాఠం ]

ఇది అత్యంత స్ఫూర్తి దాయకము , విజ్ఞానదాయకము , ఆసక్తి కరమూ అయినది. దీనిలో ఎంతో విలువైన సమాచారము ఉంది

*****************************************************

|| శరదిందు వికాస మందహాసాం

స్ఫురదిందీవర లోచనాభిరామాం|
అరవిందసమాన సుందరాస్యాం|
అరవిందాసన సుందరీముపాసే ||

ఆదిశంకరుల గురించి మనదేశములోనే ... దేశములోనే కాదు , ఈ విశ్వములోనే తెలియనివారుండరు. మన సనాతన ధర్మానికీ , ఉపనిషత్ సిద్ధాంతానికీ వారు చేసిన సేవ , ఎన్ని సహస్ర మానములు గడచినా ఈ జనత , గుర్తుపెట్టుకొనునటువంటిది. కేవలము ముప్పైరెండు సంవత్సరముల కాలము ఈ భూమిపై కనిపించినట్టి ఆ మహాపురుషుడు చేసినట్టి కార్యము మాత్రము యుగయుగములవరకూ  నిలుచునట్టిది. మనుష్యుని పురోగతికి ఏకమాత్రమైన సాధనము ’ధర్మము’ అని చెప్పతగినట్టిది. అట్లే , మనుష్యుని పతనానికి ఏకమాత్రమైన సాధనము ’ అధర్మము ’ అని చెప్పతగినది.ఈ ధర్మము , అధర్మమూ అను ఈ రెండూ , మనిషి గొప్పదనానికీ , నీచత్వానికీ సాధనమైనటువంటివి. ఇందులో ఏవిధమైన అనుమానమూ , మార్పూ లేదు. 


శృతి , స్మృతి , ఇతిహాసములు , పురాణములు , దర్శనములు --వీటన్నిటిలోనూ , వేరే ఇతర విషయములలో అభిప్రాయ భేదమున్ననూ , ఈ ఒక్క  విషయములో మాత్రము ఎటువంటి అభిప్రాయ భేదమూ లేదు. ధర్మము సుఖానికీ , పుణ్యానికీ హేతువనీ , అధర్మము కష్టానికీ , పాపానికీ హేతువని ప్రతియొక్క దార్శనికుడూ ఒప్పుకున్నట్టిదే. అందుకే , శాస్త్ర పరిభాషలో కొన్ని ’ సర్వతంత్ర సిద్ధాంతములు ’, మరికొన్ని ’ ప్రతి తంత్ర సిద్ధాంతములూ ’ అని చేయబడినవి. వాటిలో ’ సర్వతంత్ర సిద్ధాంతము ’  అంటే సర్వులూ , సర్వమూ ఒప్పుకునేదే అని అర్థము.. ఈ ధర్మాధర్మములే సుఖ దుఃఖాలకు హేతువులు అన్నది సర్వతంత్ర సిద్ధాంతము. 


అద్వైతులుకానీ , ద్వైతులు కానీ , విశిష్టాద్వైతులైనా కానీ , శక్తి విశిష్టాద్వైతులైనా కానీ , బౌద్ధులు కానీ , జైనులు కానీ,  వీరశైవులే కానీ , ఈ విషయములో మాత్రము ఎవరికీ యే భిన్నాభిప్రాయమూ లేదు. కాబట్టి మనము , నిత్య సత్యమైనట్టి ఈ యొక్క సిద్ధాంతమును అనుసరిస్తూ మన జీవితాలను సాగించినపుడే మన జీవితము పవిత్రమవుతుంది, ఉత్తరోత్తరా మనకు ఇంకా ఉత్కృష్టమైన జన్మ లభిస్తుంది. ఈ సిద్ధాంతాన్ని గనక మరచి మనమేదైనా అధర్మపు దారి తొక్కితే , అధర్మ మార్గములో నడచుకుంటే మన జీవితాలను మనమే వ్యర్థము చేసుకున్నట్టవుతుంది.


ఇది నిత్య సత్యమైన విషయము. ఆది శంకరులు మనకు  కొత్తగా దేనినో ఉపదేశము చేసినారు అని మేమేనాడూ చెప్పము. దేనిని శాస్త్రములు స్పష్టముగా చెప్పినాయో, దానిని జనులు మరచిపోయినప్పుడు , జనులకు దానిని గుర్తుచేసినారు. ఈ సిద్ధాంతాన్ని మరచి ప్రజలు కేవలము పశువులు , మృగములవలెనే జీవితాలను గడుపుతున్నటువంటి సందర్భములో , శంకర భగవత్పాదులు , ’ ఈ రీతిలో మీరు జీవితాలను వ్యర్థము చేయుట సరియైనది కాదు , జీవితము అత్యమూల్యమైనది , ఇది పదే పదే దొరకునట్టిది కాదు , ఇటువంటి అమూల్యమైన జీవితాలను వ్యర్థము చేసుకొనకండి, సార్థకము చేసుకొనండి , సార్థకము చేసుకోవాలంటే ఏకమేవ మార్గము ధర్మాచరణమే. ధర్మమార్గమును ఎవ్వరూ తప్పకండి. ధర్మ మార్గమును తప్పితే మీకు ఇహములో దుఃఖము కలుగును అని అనిపించకున్ననూ ఈ శరీరమును వదలిపోయిన తరువాత మీరు అధిక దుఃఖాన్ని అనుభవిస్తారు. '


మనిషికి ఒక ఆశ యేమంటే , యే జన్మలోనైనా సరే నేను సుఖముగా ఉండవలెను. యే జన్మలోనూ నాకు దుఃఖము కలుగకూడదు , కష్టములు కలుగకూడదు-- ఇది ప్రతి మనిషికీ అంతరాళములో ఉండే ఆశ. శంకరులన్నారు , ’ నిజముగా మీకు ఈ ఆశ ఉంటే దానికి తగినట్టే ప్రవర్తించండి. విద్యార్థులకు , తాము పరీక్షలో మొదటి శ్రేణిలో పాసు కావలెనన్న ఆశ ఉంటుంది, కానీ పుస్తకము ముట్టేందుకు మనసు రాదు. శంకరులంటారు , ’ నువ్వు పుస్తకమే ముట్టకపోతే మొదటి శ్రేణిలో లో ఎలా పాసవుతావు ? నీకు నిజంగా మొదటి శ్రేణిలోపాస్ కావలెనన్న ఆశ ఉంటే తీవ్రముగా కృషి చేయ వలెను. అట్లే , జీవితమును సార్థకము చేసుకోవాలంటే ధర్మమార్గము లోనే నడవవలెను. అధర్మ మార్గములో నడవద్దు. ఒకోసారి అనిపిస్తుంది, ధర్మ మార్గములో నడచుట చాలా కష్టము అని. అయితే , మనకు ఉత్తమమైన ఫలము దొరకాలంటే మొదట కష్టము అనుభవించే తీరవలెను. విద్యార్థులకు కూడా చదవడం అంటే చాలా కష్టము అనిపిస్తుంది. మరి మొదటి శ్రేణిలో లో పాసవవలెనంటే కొంచమైనా కష్టము పడవద్దా ? అట్లే , ధర్మ మార్గమున నడచుట కష్టము అని ఎవరైనా దానిని వదలివేస్తే , తమకు అపేక్షితమైన ఫలము మాత్రము దొరకదు. 


దానినే శంకరులు చాలా స్వారస్యముగా చెప్పినారు, ’ ఈ జనులలో ఒక విచిత్రమైన ప్రవృత్తి కనిపిస్తున్నది, 


|| పుణ్యస్య ఫలమిఛ్చంతి పుణ్యం నేఽఛ్చంతి మానవాః | 

న పాప ఫల మిఛ్చంతి పాపం కుర్వంతి యత్నతః || " అని. 

పుణ్యఫలమైన సుఖము కావాలని అందరూ కోరుతారు , కానీ ఆ  సుఖము కోసము పుణ్యమును చేయుటకు మాత్రము ఎవరూ ముందుకు రారు. పాప ఫలమైన దుఃఖము ఎవరికీ వద్దంట , కానీ ఆ దుఃఖాన్ని ఇచ్చునటువంటి పాప కార్యాన్ని అందరూ ప్రయత్నపూర్వకంగా చేస్తారు. ఇది మనుషులలో ఒక విచిత్రమైన ప్రవృత్తి అని , నేను చెప్పుట లేదు , వందలాది సంవత్సరములుగా  వెనుకతరాల వారు మనుషుల ప్రవృత్తులను అధ్యయనము చేసినవారు చెప్పిన మాట. 


కానీ ఈమాట నిజమనిపించేటట్టు మనం ఉండకూడదు. పుణ్యఫలమైన సుఖాలను అనుభవించాలనుకుంటే , ఆ సుఖాలను ఇచ్చే పుణ్యకార్యాలను మనం చేయవలెను. అనగా , ధర్మమునే ఆచరించవలెను. పాప ఫలమైన దుఃఖమును మనము అపేక్షించుట లేదు అంటే , ఆ దుఃఖజనకములైన పాప కార్యములను మనము చేయరాదు. దీనినే శంకర భగవత్పాదులు మనకు విస్తారముగా వివరించి చెప్పినారు. వారు అనేక విధములైన భాష్యములు , ప్రకరణములు , స్తోత్రములూ రాసినారు, అతి సంక్షిప్తమైన గ్రంధములనూ రాసినారు. అన్నిటి సారాంశమూ ఒక్కటే , ’ ధర్మ మార్గములో ఉండు , అధర్మ మార్గమునకు పోవద్దు .’ అలాగే , ప్రజలకు దీనిని మనము పదే పదే చెప్పుచుండవలెను. అలాగే పిల్లలకు , ’ నువ్వు బాగా చదవవలెను , గురువుల వద్ద వినయముతో ఉండవలెను , సహ పాఠుల వద్ద స్నేహముతో ఉండవలెను , ఇతరుల పెన్సిలూ , పెన్నూ దొంగతనము చేయకూడదు , గురువుల ఎదుట ఏనాడూ అబద్ధము చెప్పవద్దు , ’ అని వారికి ఒకసారి చెప్పితే చాలదు , ప్రతి దినమూ పదే పదే చెప్పుతూనే ఉండవలెను. ఎందుకంటే ఒకసారి చెబితే మరచిపోవచ్చు. పిల్లలకు దినమూ అలాగ చెప్పునట్లే , ప్రజలకు కూడా అలాగే ధర్మమును గురించిన ప్రబోధము నిరంతరమూ చేయవలెను అను కారణము చేతనే , శంకరులు ఈ మఠముల వ్యవస్థ చేసినారు. దీనికి సన్యాసులను నియమించినారు. ఎందుకనగా , సన్యాసులకు ఉండే ఒక వైశిష్ట్యమేమనగా ,  అతనికి భార్యా బిడ్డలు ఉండరు కాబట్టి , అతడికి మొదటగా , స్వార్థము ఉండదు. భార్యా బిడ్డలుంటేనే కదా స్వార్థము వచ్చేది ?  భార్యకు నగలు చేయించాలి , పిల్లలను చదివించాలి ,పెళ్ళిళ్ళు చేయాలి... ఇటువంటి లంపటాలు సన్యాసికి ఉండవు , ఆవైపుకే అతని మనసు పోదు. 


ఇంకొకటేమంటే , ఆ సన్యాసి వేదాంతమును అధ్యయనము చేసి ఉండుట వలన అతడికి ఏ విధమైన ఆశలూ ఉండవు. -- నేను చెప్పేది నిజమైన సన్యాసుల గురించే.  దేనిమీదా అతడికి వ్యామోహము ఉండదు కాబట్టి ధర్మ ప్రచారము చేయుటకు సన్యాసికి ఎక్కువ అవకాశము  ఉంటుంది. స్వార్థము ఎప్పుడైతే ఉండదో , అప్పుడతడికి ఇంకే విధమైన పనులూ ఉండవు. అందువలన సన్యాసి పరంపరను శంకరులు తమ చతురామ్నాయ పీఠములలో ఏర్పరచినారు. సన్యాసులే ఈ పీఠములకు అధిపతులుగా ఉండవలెను , ఈ పీఠానికి వచ్చినవారు సర్వ కాలములలోనూ జనులకు ధర్మ ప్రచారమునే చేయుచుండవలెను, తాము స్వయముగా ధర్మాచరణము చేయవలెను. ఇతరులకు ఉపదేశము చేయుటలో మాత్రమే నిమగ్నమై ఉండరాదు. కన్నడ భాషలో ఒక సామెత ఉంది,మీకందరికీ తెలిసే ఉండును , " చెప్పేదేమో పురాణములు , తినేదేమో వంకాయలు " అని. అట్లుకారాదు. ఇతరులకేమి ఉపదేశము చేస్తారో దాన్ని మీరుకూడా అక్షరాలా పాటించండి.


దీనినే శంకరులు ,తమ మఠములకు అన్వయించునట్టుగా ఒక చట్టాన్ని రాసినారు. ఆ చట్టం పేరే ’ మఠామ్నాయము ’ . నాలుగు మఠముల లోనూ ఉన్న సన్యాసులు ఇలా ఇలాగుండవలెను , అలాగుండవలెను అని చెప్పునపుడు , ఆ సన్యాసుల యోగ్యతను చెప్పునపుడు

|| శుచిర్జితేంద్రియో వేద వేదాంగాది విశారదః   ||  అంటే , ఆ సన్యాసి శుచిగా , శుద్ధంగా ఉండవలెను , అనగా శుద్ధ చారిత్ర్యవంతుడై ఉండవలెను. చరిత్ర శుద్ధి ఉండవలెను , జితేంద్రియుడై , వేద వేదాంగముల అధ్యయనము చేసిఉండవలెను , శాస్త్రజ్ఞుడై ఉండవలెను , || సః మదాస్థానమర్హతి || అంతటివాడే ఈ పీఠములో కూర్చొనుటకు యోగ్యుడై ఉంటాడు. అటువంటి యోగ్యత లేనివాడిని ఈ పీఠమునకు తీసుకొని రాకూడదు. --అని శంకరులు ఆనాడే అనుజ్ఞనిచ్చినారు. ఆ అనుజ్ఞను శృంగేరీ శారదాపీఠము మాత్రమే ఆనాటినుండీ పాటిస్తూ వస్తున్నది . ఈ పీఠపు విశిష్టత అదే.  ఆ యోగ్యత లేని వ్యక్తిని ఈ పీఠమునకు ఎవ్వరూ తీసుకురాలేదు. శృంగేరీ పీఠపు ఇతిహాసాన్ని శంకరుల నుండీ ఈనాటి వరకూ చూస్తే  ఆ యోగ్యత లేని యే ఒక్క వ్యక్తి కూడా ఈ పీఠానికి అధికారిగా రాలేదన్నదే ఇక్కడి విశిష్టత. 

మరియూ ఇంకొక వైశిష్ట్యత ఏమనగా , ఈ పీఠములో బ్రహ్మచారిగానే సన్యాసాశ్రమమునకు వచ్చుట. గృహస్థాశ్రమము నుండీ సన్యాసాశ్రమము నకు వచ్చుట లేదు. మా పరంపరలో ప్రతి ఒక్కరూ బ్రహ్మచర్యాశ్రమము నుండే సన్యాసియై , సన్యాసి ధర్మమును తు. చ. తప్పక పాలించి , శాస్త్రానుగుణముగా తమ జీవితాన్ని గడిపి, ప్రజలకు ధర్మ ప్రబోధనము చేసి , ఈ పీఠమునకు తాము వచ్చి సార్థకతను చేకూర్చినారు అనునది , నాటి నుండీ నేటి వరకూ వచ్చిన పీఠాధిపతులను చూస్తే మనకు తెలియునటువంటి నిత్యసత్యమైన మాట. దీన్ని మేము వెనుకటి గురువుల చరిత్రను గ్రంధాల మూలముగా చూసియున్నాము , మా గురువులలో ప్రత్యక్షముగనే చూసినాము. మా గురువులైన జగద్గురు శ్రీమదభినవ విద్యాతీర్థ స్వామి వారు , తమ పదునాలుగో యేటనే సన్యాసమును స్వీకరించినారు. పదునాగేళ్ళ వయసులో బ్రహ్మచర్యాశ్రమము నుండీ సన్యాసి అయినారు. సకల శాస్త్రములనూ 
ధ్యయనము చేసినారు.  సకల శాస్త్ర పారంగతులూ అయినారు. మఠపు  సాంప్రదాయములను తమ గురువుల ముఖమున సంపూర్ణముగా తెలుసుకున్నారు. మఠపు ఉన్నతి కోసము , శిష్యుల ఉన్నతి కోసము తమ జీవితమును ధారపోసినారు. వారు ముప్పైఅయిదు సంవత్సరముల పాటు ఈ పీఠాధిపత్యమును నెరపినారు, దానిలో సుమారు పదునైదు సంవత్సరములు యాత్రలలోనే గడిపినారు. దేశసంచారము చేసినారు. సంచారములోనే తమ జీవితపు అర్ధ భాగాన్ని గడిపినారు. సంచారము ఎందుకు చేసినారు అనగా , ధర్మము గురించి ప్రచారము , ఉపదేశముల కోసమే. ప్రజలకు వేదాంత తత్త్వమును తెలుపుటకోసమే. జనులను సన్మార్గములో నడిపించుట కోసమే. యాత్రలు చేయుటే కాదు , శృంగేరీని విశేషముగా అభివృద్ధి చేసినారు. వారి దర్శనము చేసినవారు , వారి అనుగ్రహమును పొందినవారు వారి అద్భుతమైన మహిమను అనుభవించినట్టి వారు ఈనాడు కూడా మన మధ్యలో చాలామందే ఉన్నారు. 

వారు 1974 లో నాకు సన్యాస దీక్షనిచ్చి ,నన్ను తమ ఉత్తరాధికారిగా నియమించినారు. వారిది అత్యంత విశాలమైన దృష్టి, నేను ఎక్కడో ఆంధ్ర దేశములో పుట్టినవాడిని,నాకు ఈ దేశపు చరిత్ర కానీ , ఈ మఠపు చరిత్ర కానీ ఇక్కడి సంస్కృతిగానీ , ఇక్కడి ఆచార వ్యవహారములు గానీ ఏమీ తెలిసి ఉండలేదు. అటువంటి నన్ను ఈ మఠపు ఉత్తరాధికారిని చేసి , ఇప్పుడు నేను నాకు ఏమేమి లేకుండెను అని చెప్పినానో అవన్నీ సంపూర్ణముగా నాకుండునట్లు చేసి నన్ను ఈ పీఠపు రక్షణకు నియమించినారు. వారు యే భరోసాతో నన్ను ఉత్తరాధికారిగా చేసినారో ,ఆ భరోసాను కాపాడుకున్నానన్న తృప్తి నాకుంది. వారు , ఈ పీఠాన్ని నేను అభివృద్ధి చేస్తాను , ప్రజలకు ఎక్కువగా ఉపకరించు కార్యములను చేస్తాను ,ఇంకా ఎక్కువ ధర్మ ప్రచారము చేస్తాను , మన భారతీయ సంస్కృతికి దోహదమగునట్లుగా అనేక పనులను చేస్తాను అన్న నిరీక్షణ కలిగి ఉండేవారు. ఈ దినము ఇక్కడ జరిగినదంతా చూసినవారందరూ , వారి నిరీక్షణ అంతా సత్యమైనది అన్న తృప్తితో కూడిన భావనలో ఉన్నారు. ఇదంతా కేవలము వారి కృప వల్లనే అయింది. 


నేను పదే పదే చెప్పునదేమంటే , దీనిలో ఏదైనా నాగొప్పతనముందని నేను అనుకొని ఉంటే అది కేవలము మూర్ఖత్వము. నా గొప్పదనమేదీ లేదు , ఇది కేవలము వారి కృప , మరియూ ఆ జగన్మాత శారదాదేవి యొక్క కృప మాత్రమే. నాకు ఎన్నో సందర్భములలో అనేకమైన సమస్యలు వచ్చినపుడు , నా గురువులనూ , ఆ జగన్మాత శారదనూ స్మరించినపుడు , అన్ని సమస్యలూ పరిహారమై, యేది అసాధ్యమైన పని అని భయపడి ఉంటానో అది పువ్వును ఎత్తిపెట్టినంత తేలికగా అయిపోయిన సన్నివేశములు అనేకములున్నాయి. అవి నాకు గుర్తున్నాయి , ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా నాతోపాటే ఉన్న మన గౌరీశంకర్ కు తెలుసు. 


ఇటువంటి ఉజ్జ్వలమైన పరంపరయే శృంగేరీ శారదా పీఠపు పరంపర  , ఈ పరంపరను ముందుకు కొనసాగించి తీసుకు వెళ్ళవలసిన భారము నామీద ఉన్నందువలననే , దీన్ని సరిగ్గా నిర్వహించుట నా కర్తవ్యమైనందువల్ల , ఈ దినము ఈ ఉత్తరాధికారియగు శిష్య పరిగ్రహణము చేసినాను , ఈ దినము,  ఆనంద నామ సంవత్సరపు,  ఆశ్వయుజ మాసపు కృష్ణ పక్షపు ద్వాదశి ,సోమవారము అంటే 1974 వ సంవత్సరము నవంబరు పదకొండో తారీఖును గుర్తు చేస్తున్నది. ఇదే రీతి యైనటువంటి సన్నివేశము  ఆనాడు కనిపించింది ,  అదే నేడు మరలా పునరావృత్తమయింది. జయనామ సంవత్సరపు , మాఘ మాసపు శుక్ల పక్షపు తృతీయ శుక్రవారము , 2015 , జనవరి 23 వ తారీఖున . నా గురువులు నాచే శాస్త్రాధ్యయనము చేయించి, నాకు మఠపు సాంప్రదాయములను తెలిపి, మఠపు శిష్యులనందరినీ పరిచయము చేసి, నాకు ఈ భారమును అప్పగించినారు. అదే విధముగా , మా శిష్యులను అదే రీతిలో సిద్ధం చేసి, వారికి సన్యాస దీక్షను ఇచ్చినాను. 


జాతకమును చూసి సన్యాసమును ఇచ్చే పద్దతి ఇక్కడ మా దగ్గరలేదు. పిల్లవాడి జాతకము అనేకులకు చూపించి, ఆ అనేకులలో యే ఒక్కరైనా , ’ ఈ పిల్లవాడి జాతకములో సన్యాస యోగము లేదు ’ అని చెప్పితే , ’ అయితే వద్దు , ఈ పిల్లవాడికి సన్యాస దీక్ష ఇచ్చుట తగదు ’ అని నిర్ధారించుట కొన్ని చోట్ల ఉందని విన్నాము , అయితే మా గురువులు అలాగ చేయలేదు , నేను కూడా అలాగ చేయలేదు. మా గురువులు , నాకు సన్యాసము ఇచ్చిన తరువాత అడిగినారు , " స్వామీ , మీరు పుట్టిన తిథి యేది ? " అని. ఎందుకడిగినారంటే , స్వాముల పుట్టిన దినమున మఠములో ’ వర్ధంతి ’ అని చేస్తారు , అందుకని అడిగినాను ' అన్నారు. నేను కూడా వీరిని అదే అడిగినాను. ’ మీరు పుట్టిన తిథి యేదయ్యా , ఎందుకంటే మఠములో స్వాముల పుట్టిన రోజు ’ వర్ధంతి’ జరుపవలెను అని. 


జాతకమును చూసి సన్యాసమును ఇచ్చుట కాదు , వ్యక్తి గుణమును , స్వభావమునూ చూసి ఇవ్వవలెను. ఆ వ్యక్తికి ఉండవలసిన మనస్సును చూసి. ఈ వ్యక్తి స్వభావము ఎట్లుంది, మనసెట్లుంది, వైరాగ్యము ఎట్లుంది, జనులపైన మమత , ప్రేమ ఎట్లున్నాయి.. వీటిని చూసి మేము సన్యాసము నిస్తాము, ఇది శృంగేరీ మఠపు పద్దతి. ఆ పద్దతికి అనుగుణముగా మా గురువులు యేరీతిలో జరిపించినారో , అదే పద్దతిలో జరిపించుట మాకర్తవ్యము అని భావించి , అట్లే చేసినాము. దిలీప మహారాజు యొక్క రాజ్యమును వర్ణించునపుడు కాళిదాస మహాకవి ఒక మాటంటాడు , 

|| రేఖామాత్రమపిక్షుణ్ణాదామనోర్వర్త్మనఃపరమ్
 నవ్యతీయుర్ప్రజాః తస్య నియంతుర్నేమివృత్తయః ||

దిలీప మహారాజుయొక్క రాజ్యములో ఉండే ప్రజలు , వెనుకటి రఘువంశ రాజులు ఏ మార్గమును యేర్పరచినారో , ఆ మార్గము నుండీ ఒక్క అంగుళము కూడా ఇటుపక్కకు , అటుపక్కకు వెళ్ళేవారు కారు. అదేరీతిలో నడచుకునేవారు. అదే మార్గమును అనుసరించేవారు.  శృంగేరీ పీఠములో కూడా అదే ఉత్క్రమము.వెనుకటి గురువులు యేమార్గమును మనకు వేసి ఇచ్చినారో , ఆ మార్గమునుండీ అటూ ఇటూ వెళ్ళే ప్రశ్నే లేదు. ఈ రోజు ఇక్కడ  శిష్య స్వీకార మహోత్సవమును  ఉదయము మనము జరిపిన క్రమమునే  ,1974 నవంబరులో చూసినవారు ఒక ఐదారు మంది ఉన్నారిక్కడ.  ఆ దినము యేమేమి ఎలాగ జరిగిందో , అదే పద్దతిలో ఈ దినము జరిగింది అన్న సంతోషము వారి ముఖములో నేను చూసినాను. ఇది ఈ శృంగేరీ మఠపు వైశిష్ట్యత. ఆ జగదంబ శారదాంబయే  ఇక్కడి ఉత్తరాధికారిని నిర్ణయించినది. మేము కాదు. ఆ మాత ఎవరిని నిర్ణయిస్తుందో వారికే మేము ఉత్తరాధికారమునిస్తాము. కాబట్టి మేము ఆ బాధ్యతను మాపైన వేసుకున్నదే లేదు. అందువలన , మా గురువులు ఆ సంవత్సరము నవరాత్రులలో చివరిరోజు , పల్లకీ ఉత్సవము అయిన  తరువాత వచ్చి అమ్మ దగ్గరకు వెళ్ళి , అక్కడ ఒక అయిదు నిమిషాలుండి, అమ్మ అనుజ్ఞ పొంది బయటకు వచ్చి ప్రకటన చేసినారు. అంతవరకూ వారు ప్రకటించలేదు. అనేక శిష్యులు వారిని అడిగేవారు ," తమకు వయసు యాభై ఆరు వచ్చిందే , ఉత్తరాధికారి గురించి యేమైనా ఆలోచించినారా ? ’ అని. ’ నాకెందుకయ్యా , ఆ భారము ఆ మహామాతదే.  ఆ మహామాత ఎప్పుడు తీర్మానము చేయునో అప్పుడే అగును , నేనెందుకు దానిగురించి బుర్ర పాడుచేసుకోవలెను ’ అన్నారు. 

ఆ నవరాత్రులలో చెప్పినారు , " ఆ జగన్మాత నాకు అనుజ్ఞనిచ్చింది, ఈ వ్యక్తిని నువ్వు ఉత్తరాధికారిగా నియమించు అంటూ జగన్మాత అనుమతినిచ్చింది,ఇకఎటువంటి ప్రశ్నలకూ తావులేదు , ముందరి ద్వాదశినాడు వీరికి సన్యాసము అగును "  అన్నారు. 


అదే , ఈసారీ పునరావృత్తి అయింది. ఈ పద్దెనిమిది దినముల వెనుక , ఇప్పుడే మన శాస్త్రులు చెప్పినట్టే ,  మనవూరివారందరూ చేరి ,’ తమకు పట్టాభిషేకమై ఇరవై అయిదు సంవత్సరాలైనది, దానిగుర్తుగా ఒక రజతోత్సవము చేయవలెను ’ అని విజృంభణగా చేసినారు. ఆ దినము గురువుల పల్లకీ ఉత్సవము జరగవలెను అని అందరూ భీష్మించినారు. సరేలెమ్మని పల్లకీ ఉత్సవము అయినాక లోపలికి వెళ్ళి అమ్మదగ్గర ప్రార్థన చేసినపుడు , అమ్మ నాకు ప్రేరణ ఇచ్చినారు. ’ ఈ పిల్లవాడికి సన్యాసము నిచ్చివేయవయ్యా ’ అని. ఆ దినము మా గురువులకు యే విధముగా అమ్మ అనుజ్ఞ దొరికినదో , అదే విధముగా నాకు కూడా అమ్మవారి అనుజ్ఞ దొరికినది. ఆ అనుజ్ఞనే నేను ఆ సభాముఖముగా చెప్పినాను. మా అధికారులన్నారు , ’ అదెవ్వరికీ తెలియనే లేదు , గురువులతో పాటే ఎల్లపుడూ ఉండేవారికి కూడా ఆ సంగతే తెలియలేదు , ఉన్నపాటున ఒక్కసారిగా గురువులు చెప్పినారే ’ అని. అమ్మ అనుజ్ఞ లేనిదే నేను మాత్రం ఎలాగ చెప్పగలను ? అమ్మవారి అనుజ్ఞ దొరకగానే వెంటనే చెప్పినాను. కాబట్టి ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమము , శృంగేరీ మఠములో అనూచానముగా వస్తున్నట్టి ఒక కార్యక్రమమే.


 నాకు సంతోషము కలిగించేదేమిటంటే , మన రాష్ట్రపు అనేకులు , మరియూ మన అధికారులు చెప్పినట్లుగా మన రాష్ట్రపు చుక్కానిని పట్టినట్టి అనేక అధికారులు , విశేషమైన అభిమానముతోవచ్చి ఈ కార్యక్రమములో పాలు పంచుకున్నారు.  ప్రతి ఒక్కరికీ , మన రాష్ట్రపు వారే కాదు , బయటి రాష్ట్రాలవారే కాదు , మన దేశపు వారందరికీ ’ శృంగేరీ మఠము యే రాజకీయాలకూ సంబంధించిన మఠము కాదు , శృంగేరీ జగద్గురువులు రాజకీయాలకు అతీతముగా ఉండేవారు , తమ కర్తవ్యములో మాత్రమే నిరతులై ఉండేవారు. తమకు సంబంధము లేని విషయములలో యేమాత్రమూ తలదూర్చనివారు , ’ అన్నట్టి పరిపూర్ణమైన భావము మన దేశములో ప్రతి ఒక్కరికీ ఉంది. కాబట్టి, సర్వులకూ , ఇక్కడికి వచ్చుట , ఆశీర్వాదము పొందుట అనేది ఒక గర్వించతగ్గ విషయము , అదొక సంతోషించ వలసిన విషయము. 


అందువలననే , ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఆశీర్వాదము తీసుకొనుట అనేది ఎప్పటినుండో జరుగుతున్నది. వెనుక , మైసూరు మహారాజుల పాలన మన రాష్ట్రములో ఉన్నపుడు , శృంగేరీపీఠములో ఉత్తరాధికారి నియమితులై శిష్య స్వీకారము చేయువేళ , మహారాజులకు శ్రీముఖమును పంపుట , మహారాజులు స్వయముగా తామే వచ్చుట , లేదా , ఒకవేళ అత్యవసరమైన పరిస్థితిలో వారికి వచ్చుటకు వీలుకాకపోతే , తమకు అత్యంత ఆప్తులైన ప్రతినిధులను , అనగా , దివాను వంటి ప్రతినిధులను పంపుట అనేది, శృంగేరీ మఠములో శత శతమానములనుండీ వస్తున్న ఆచారము. మరియూ , అమ్మవారి అనుజ్ఞ చేత  గురువులు ఎవరిని ఉత్తరాధికారులుగా ఎంచి ప్రకటిస్తారో వారిని కూడా అత్యంత సంతోషముతో స్వీకరించి,  జగద్గురువుల వలెనే గౌరవించే ఒక సంప్రదాయము ఆనాటినుండే వస్తున్నది. ఆ సంప్రదాయము ప్రకారమే  , ఈనాడు కూడా మన రాష్ట్ర ప్రభుత్వపు ప్రతినిధులుగా జయచంద్రులు , అభయ చంద్రులు వచ్చినారు , అంతే కాక , ఎడ్యూరప్ప , శంకరమూర్తి ,  అనంత కుమార్ , రామచంద్ర గౌడులు , జీవ రాజు  వంటి అనేక ప్రముఖులు అత్యంత ప్రేమ , అభిమానము , మమతలతో ఇక్కడికి వచ్చి  ఈ కార్యక్రమములో  భాగము వహించినారు.  వారందరికీ నా పరిపూర్ణమైన ఆశీర్వాదములు. 


మన మఠపు శాఖా మఠములు మన రాష్ట్రములోనూ , బయటి రాష్ట్రములలోనూ ఉన్నాయి, వాటిలో శివగంగ మఠము , మరియూ ఎడత్తిరి యోగానందేశ్వర మఠముల వారు  మాపై అత్యంత  శ్రద్ధాభక్తులు కలవారు. ఆ మఠాధిపతులు , పురుషోత్తమ భారతీ స్వాములు , మరియూ  శంకర భారతీ స్వాములు అత్యంత సంతోషము , శ్రద్ధాభక్తులతో ఇక్కడికి వచ్చినారు, వారిని నేను పరిపూర్ణముగా ఆశీర్వదిస్తున్నాను. అలాగే , ఆంధ్ర దేశములోని ’ ధర్మపురి ’ అను ఊరిలో ఉన్నట్టి ’ సచ్చిదానంద సరస్వతీ స్వాములు’  కూడా  ఎంతో శ్రద్ధాభక్తులతో వచ్చినారు , వారికి కూడా నా ఆశీర్వాదములు. 


మా అధికారులు చెప్పినారు, పత్రికా ప్రతినిధులు మరియూ టీవీ మాధ్యమము వారు ఈ కార్యక్రమములో మాకు అధికముగా సహకరించినారు , వారందరికీనూ నా ఆశీర్వాదములు. 


అందరికన్నా ముఖ్యముగా మా మఠపు శిష్యులు , ఈ దినము ఇంత సంఖ్యలో వస్తారని నేను ఊహించనేలేదు. ఎక్కడెక్కడినుండో వచ్చినారు, కేవలము ఈ కార్యక్రమమును చూడవలెనన్న అభిలాషతోనే. ’ నేను ఈ రోజు ఎవరినీ చూచుటకుగానీ మాట్లాడుటకుగానీ వీలుకాదని చెప్పినాను , అయితే , ’ తమరు మమ్మల్ని చూచుట , మాట్లాడుట కాకపోయినా , తమరిని చూచుటకు మేము వస్తాము , మమ్ములను తమరు చూడవలెనని నిర్భంధము చేయము ’ అంటూ అంతటి ప్రేమాభిమానాలతో మా శిష్యులు వేల వేల సంఖ్యలో వచ్చినారు. వారందరికీ కూడా నా పరిపూర్ణ ఆశీర్వాదములు. 


ఇక ఇంతకన్నా ఎక్కువ నేను చెప్పవలసినది యేమీ లేదు , మా ఉత్తరాధికారి స్వాములకు మేము . ’ విధుశేఖర భారతీ ’ అనే యోగపట్టమును ఇచ్చినాము. అనేకులు అడిగినారట , ’ దీని అర్థమేమి ? ’ అని. మా పరమ గురువులు , ’ చంద్రశేఖర భారతీ ’ అను అవిధానముచేత జగత్ప్రసిద్ధి పొందినవారు , వారి నామమును వినని వారెవరూ ఉండరు , వారి నామధేయమునే వీరికి పెట్టవలెను అని నాకు అభిప్రాయముండినది. కానీ , అదే పేరునే పెడితే , మాకు అత్యంత గౌరవ పాత్రులైన వారి పేరుతో మా శిష్యులను పిలుచుట అన్నది మా మనసుకు సమంజసము అనిపించలేదు. చంద్రశేఖర భారతులు మాకు పరమ గురువులైనప్పుడు , చంద్రశేఖర భారతులు మా శిష్యులు అని అంటే అది సమంజసము కాదు, అయితే , ఆ పేరంటే నాకు అత్యంత అభిమానము , కాబట్టి , సంస్కృతములో చంద్రుడికి ’ విధు ’ అన్నది పర్యాయ పదము కాబట్టి, 


|| హిమాంసుశ్చంద్రమాః చంద్రః ఇందుః కుముదవాన్ భవః విధుఃసుధాంసుః శుభ్రాంశుః || అని కోవై. 


చంద్రునికి ’ విధు ’ అనేది పర్యాయ పదము , ఎలాగంటే , రామః అన్నా , సీతాపతి అన్నా , దాశరథి అన్నా రాముని పేరే అన్నట్లు , అలాగే , చంద్రః అనేది, విధుః ’ అనేది రెండూ ఒకే అర్థాన్ని కలిగి ఉన్నాయి. అందువల్ల , ’ చంద్రశేఖర భారతీ ’ అనుటకు బదులుగా , ’ విధుశేఖర భారతీ ’ అని అంటున్నాను. అంతే తప్ప దీనికి ఇంకే విధమైన అర్థమునూ కల్పించవలసిన అవసరము లేదు. ఆ చంద్ర శేఖర భారతులను జ్ఞాపకము చేసుకొని , వారిని మేము మరలా చూస్తున్నాము అనే అభిప్రాయముతో , ’ విధుశేఖర భారతీ ’ అనే పేరు వారికి పెట్టినామే తప్ప మరేమీ కాదు. 


ఈ మా శిష్య స్వాములు , అత్యంత యోగ్యులై, శాస్త్రములో విశేషమైన పాండిత్యమున్న వారై, మా మనసును అత్యంత సంతోష పరచినారు. అయిదారు సంవత్సరముల నుండీ వారు మాదగ్గర శాస్త్రాధ్యయనము చేస్తున్ననూ కూడా వేరే యే ఇతర విషయములకూ వెళ్ళక , వేరే యే వ్యవహారములకూ తలదూర్చక , ఎవరితోనూ సంబంధములు  పెట్టుకోక , తామేదో , తమ  పాఠమేదో అంతే తప్ప ఇంకే విధమయిన వాటితోనూ సంబంధము లేక ,  వేరే దేనియందూ ఆశ అన్నదే లేకుండా ఉన్న ఈ అన్ని విధముల యోగ్యతలను చూచియే అమ్మవారు అనుజ్ఞ నిచ్చినందు వలన వారికి దీక్షనిచ్చి మా ఉత్తరాధికారులుగా చేసినాము , వారిని సమస్త విధములుగా శక్తియుక్తులను చేసి ఈ మఠాన్ని ఇతోధికంగా ఉఛ్చ్రాయ స్థితి
కి తీసుకువెళ్ళగల సామర్థ్యమును  వారికి ఇవ్వవలెనని ఆ అమ్మవారిని ప్రార్థించి , దానికి మీ అందరి సహకారమూ కూడా అత్యగత్యము అని చెప్పి , మీ అందరికీ నా పరిపూర్ణమైన ఆశీర్వాదములను తెలుపుతూ ఈ ప్రవచనమును సమాప్తి చేస్తున్నాను. 


|| హర నమః పార్వతీ పతయే హరహర మహాదేవ || 




https://www.youtube.com/watch?v=CXNr8p41xyc







Monday, December 15, 2014

ధనుర్మాసము విశిష్టత- కర్తవ్యములు

ధనుర్మాసము  విశిష్టత- కర్తవ్యములు



రేపటినుండీ ధనుర్మాసము మొదలగుతున్నది. 

         సూర్యుడు వృశ్చికరాశి నుండీ ధనూరాశి కి వచ్చు సమయము నుండీ ధనుర్మాసము మొదలవుతుంది. 
 ఆగ్నేయ పురాణము ప్రకారము ఈ మాసము శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది.  ధనుర్మాస వ్రతమును  ఆచరించువారికి  ఈ నెల  అత్యంత ప్రాముఖ్యమైనది. 

       మహా విష్ణువు పుష్ప , శ్రీగంధమాల్య , మణి మౌక్తిక , పీతాంబర  అలంకార ప్రియుడు అని ప్రతీతి. ఈ ధనుర్మాసములో ప్రతి దినమూ సూర్యోదయమునకు ముందే శ్రీమహావిష్ణువును సహస్ర నామార్చనతో పూజింపవలెను అని శాస్త్రములు నిర్దేశిస్తున్నాయి. ఈ మాసములో యే దేవాలయములో చూసినా బ్రాహ్మీ ముహూర్తములోనే పూజలు మొదలవుతాయి. అనేక విష్ణు దేవాలయములలో పెసర పప్పుతో చేసిన పులగమును  ఆ పరమాత్మునికి నైవేద్యముగా సమర్పించి ప్రసాదం గా భక్తులకు ఇస్తారు. 

ధనుర్మాస వ్రతపు నేపథ్యము 

          పురాణము ప్రకారము ఒకసారి బ్రహ్మ దేవుడు హంసరూపములో లోక సంచారము చేస్తున్నాడు. అప్పుడు సూర్యునికి అకారణముగా గర్వము పొడుచుకు వచ్చి , కావాలని , ఆ హంస పైన తన తీక్షణమైన కిరణాలతో తాపమును ప్రసరించినాడు. అందుకు నొచ్చుకుని బ్రహ్మ , సూర్యుడికి తన తప్పు తెలిసిరావలెనని , ’ నీ తేజో బలము క్షీణించు గాక ’ యని శపించినాడు. వెంటనే సూర్యుడు తేజోహీనుడై , తన ప్రకాశము నంతటినీ పోగొట్టుకున్నాడు. దానితో మూడు లోకములందూ అల్లకల్లోలమైనది. సూర్యుడి తేజము చాలినంత  లేక , జపములు , తపములు , హోమములు అన్నీ నిలచిపోయినాయి. దేవతలకు , ఋషులకే గాక , సామాన్య జనాలకు కూడా నిత్యకర్మలలో ఇబ్బందులు మొదలైనాయి. పరిస్థితి మరింత క్షీణించడముతో , దేవతలు  అనేక  సంవత్సరములు బ్రహ్మను గూర్చి తపము చేసినారు. బ్రహ్మ ప్రత్యక్షము కాగానే , సూర్యుని శాపాన్ని తొలగించమని వేడుకున్నారు. 

          " సూర్యుడు , తాను ధనూరాశిని ప్రవేశించగనే , ఒక మాసము పాటు శ్రీ మహా విష్ణువును పూజిస్తే , అతడి శాపవిమోచనము అవుతుంది " అని బ్రహ్మ తెలిపినాడు.  బ్రహ్మ చెప్పిన విధముగా సూర్యుడు , పదహారు సంవత్సరముల పాటు , ధనుర్మాస విష్ణు పూజను చేసి , తిరిగి తన తేజస్సును , ప్రకాశమునూ పరిపూర్ణముగా పొందినాడు. సూర్యుడినుండీ మొదలైన ఈ పూజ , తదనంతరము మిగిలిన దేవతలూ మరియూ ఋషులలో ప్రాచుర్యము పొంది , తమ కర్మానుష్ఠానములు నిర్విఘ్నముగా , విజయవంతంగా జరుగుటకు , వారుకూడా ధనుర్మాస పూజ , సూర్యోదయపు మొదటి జాములో  ఆచరించుట మొదలు పెట్టినారు.

         అగస్త్య మహర్షి , విశ్వామిత్రుడు , గౌతముడు , భృగువు వంటి మహర్షులే కాక, అనేక దేవతలు , ఉపదేవతలు కూడా ఈ ధనుర్మాస వ్రతమును ఆచరించినారని వివిధ పురాణములలో ఉంది. 

          ధనుర్మాసము అత్యంత మంగళకరమైన మాసమే అయినా , ఇది శుభకార్యములు జరప కూడని శూన్య మాసము. ఈ నెలలో శుభకార్యములైన వివాహ , గృహ ప్రవేశ , ఉపనయనము మొదలగు కార్యములు చేయు పద్దతి లేదు. యేమి చేసిననూ ఈ మాసము సంపూర్ణముగా మహా విష్ణువు సంప్రీతి కొరకే కేటాయించవలెను. వైకుంఠ ఏకాదశి కూడా ఈ మాసములోనే వచ్చును. 


ముద్గాన్న నైవేద్యము 
ఈ ధనుర్మాసములో మహా విష్ణువుకు ముద్గాన్నమును నైవేద్యముగా సమర్పిస్తారు. [ పెసర పప్పుతో చేసిన పులగము ]  దీని గురించి ’ ఆగ్నేయ పురాణము ’ లో ఇలాగుంది , 
|| కోదండస్తే సవితరి ముద్గాన్నం యో నివేదయేత్ |
సహస్ర వార్షికీ పూజా దినేనైకేన సిధ్యతి ||

" ధనూరాశిలో సూర్యుడుండగా పులగమును ఒక్క దినమైనా విష్ణువుకు సమర్పించిన మనుష్యుడు ఒక వేయి సంవత్సరముల పాటు పూజ చేసిన ఫలాన్ని పొందుతాడు " అని వివరిస్తుంది

ఈ నైవేద్యమును  పాకము చేయు విధమును కూడా పురాణమే తెలుపుతుంది. దాని ప్రకారము ,

         " బియ్యమునకు సమానముగా పెసర పప్పును చేర్చి వండు పులగము ఉత్తమోత్తమము. బియ్యపు ప్రమాణములో సగము పెసరపప్పు చేర్చితే అది మధ్యమము. బియ్యపు ప్రమాణములో పావు వంతు పెసరపప్పు చేర్చితే అది అధమము. అయితే , బియ్యపు ప్రమాణమునకు  రెండింతలు పెసరపప్పు చేర్చితే అది పరమ శ్రేష్టమైనది. భక్తులు తమకు శక్తి ఉన్నంతలో శ్రేష్ట రీతిలో పులగము వండి పరమాత్మునికి నివేదించవలెను. ఎట్టి పరిస్థితిలోనూ పెసర పప్పు ప్రమాణము , బియ్యమునకంటే సగము కన్నా తక్కువ కాకుండా చూసుకోవలెను. "

          అంతే కాదు , ’ పెసర పప్పు , పెరుగు , అల్లము , బెల్లము , కందమూలములు , ఫలములతో కూడిన పులగమును భగవంతునికి సమర్పిస్తే  సంతుష్టుడై భక్త వత్సలుడైన మహా విష్ణువు తన భక్తులకు సకల విధములైన భోగములను మోక్షమును కూడా ప్రసాదిస్తాడు ’ అని పురాణము తెలుపుతుంది. 

        అందుకే , ధనుర్మాసమనగానే విష్ణు పూజ మరియు పులగము [ పొంగల్ ] తప్పని సరియైనాయి. శ్రద్ధాళువులు తమ తమ శక్తి మేరకు ధనుర్మాసములో శ్రీ మహావిష్ణువును పూజించి కృతార్థులై , ఆయన కృపకు పాత్రులు కాగలరు. 

|| లోకాస్సమస్తా సుఖినస్సంతు ||


[ కన్నడ ప్రచురణ ’ బోధి వృక్ష ’ ఆధారంగా ] 

Saturday, November 1, 2014

కార్తీక మాసము--తులసి పూజ

కార్తీక మాసము--తులసి పూజ





             కార్తీక మాసమంతా పరమ పుణ్యప్రదము. ఇందులో అతి ముఖ్యమైనవి కార్తీక  శుక్ల ద్వాదశి , పౌర్ణమి మరియూ అమావాస్య. కార్తీక సోమవారాలు శివప్రీతి కరమైనవి అయితే ఏకాదశి , ద్వాదశులు విష్ణువుకు ప్రీతి పాత్రమైనవి . బిల్వపత్రములు శివుడికైతే , తులసీ దళములు , ఉసరి ఫలములు విష్ణువుకు.

 ఇం కార్తీక మాసములో విడువ వలసినవి , నల్లావాలు , కందులు , మినుములు ,పెసలు ,  నువ్వుల నూనె మరియూ బహుబీజకములైన వంకాయలు , మెంతులు , మొదలగునవి. కార్తీకమాసములో కేశకర్తనము [ క్షవరము ] చేసుకొనరాదు.

          పూజా ప్రతీకగా విష్ణు సంబంధమైన  సాలగ్రామము అగ్రగణ్యమైతే , పూజాద్రవ్యములలో తులసిది అగ్ర స్థానము. సాలగ్రామము లేనిదే పుణ్య తీర్థము లేనట్టే , తులసి లేనిదే పూజ లేదు. జంతువులలో గోవు , మనుషులలో జ్ఞాని , సస్యములలో తులసి ప్రత్యేకమైనవి.  దేవతలు లేని ప్రదేశమే లేదు , భగవంతుడు లేని చోటే లేదు. అయినా , సకల దేవతలు వెలసిన చోట్లు రెండే రెండు. ఒకటి గోవు , రెండు తులసి.  తులసిలో సకల దేవతలే కాక పుష్కర క్షేత్రములు , గంగాది సకల తీర్థములు కూడా ఉన్నాయని పురాణములలో వర్ణించబడినది. చరించు దేవాలయం గోవైతే , సస్యరూపమైన దేవాలయమే తులసి. తులసి అంటేనే ’ తులనము లేని సస్యము ’  అనగా , దేనితోనూ సమానము కాని సస్యము. తులసికి అధిదేవత సాక్షాత్తూ మహా లక్ష్మియే ! తులసి గురించి , " తులస్యుపనిషత్ " అను యొక ఉపనిషత్తే ఉన్నతర్వాత , తులసి మాహాత్మ్యము ఎంత గొప్పదో అర్థము చేసుకోవచ్చు. మహాలక్ష్మి సాన్నిధ్యము వల్లనే తులసి కూడా ఐశ్వర్యప్రదమైనది. పద్మ పురాణము , స్కంధ పురాణము , బ్రహ్మాండ పురాణము మొదలగువాటిలో తులసి మహిమ కీర్తించబడినది. 

         యే దానము చేయవలెనన్నా తులసి ఉండవలెను. జపతపములు పూర్ణముగా  ఫలించవలెనంటే తులసిమాల అత్యావశ్యకము. తులసి ఎక్కడుంటే అక్కడే విష్ణువు సన్నిధానముండును. తులసి మాలలేకున్నచో ఒక ఆకైనా చాలు. తులసీ కాష్టము కూడా శ్రేష్టమే. తులసి ఎండిపోయి ఉన్ననూ యే దోషమూ లేదు. అనివార్యమైనపుడు , నిర్మాల్య తులసిని కూడా మరలా కడిగి , పూజకు ఉపయోగించవచ్చును. అథమ పక్షము తులసీ నామమును జపించినా విశేష ఫలమే. 

         ఈ తులసి , దర్శనమాత్రము చేతనే సకల పాపములనూ పరిహరించును. స్పర్శనము చేత శరీరమును పావనమొనరించును. నమస్కారము చేత రోగములను పోగొట్టును, తులసినీటిని ప్రోక్షణ చేసుకున్నంత మాత్రమున మృత్యు భయమును పోగొట్టును , తులసి మొక్కను ఇంటిలో పెంచుకొనుట వలన కృష్ణ భక్తిని పెంపొందించును. శ్రీహరి పాదార్పణము చేసినంతనే ముక్తి ఫలము దొరకును. ఈ తులసి , రాక్షస శక్తులను కూడా నశింపజేయగల పరిణామకారి. ఆ కారణమువల్లనే పురాణములన్నీ , ’ సదా తులసి ఇంటియందు ఉంచుకోతగినది ’ యని ఘోషిస్తాయి. ఈ తులసికి పురాణములలో అనేక నామములు గలవు. 

        తులసిని బృందావనములో పెంచి పూజించుటవలన విశేష పుణ్యము దొరకును. కార్తీక పౌర్ణమినాడు తులసి ప్రాదుర్భవించినది కాబట్టి ఆ దినమే తులసీ జయంతి. ఆ దినము తులసిని భక్తితో పూజించువారు సకల పాపములనుండీ ముక్తిని పొంది విష్ణులోకాన్ని చేరగలరని  బ్రహ్మ వైవర్తస పురాణము తెలుపుతుంది. 

         కార్తీకమాసము తులసి జన్మ మాసము కాబట్టే ఆ మాసములో తులసి పూజకు అంత ప్రాముఖ్యము. ఉత్థాన ద్వాదశి నాడే తులసీ వివాహమైన పుణ్యతిథి. ఆనాడు విష్ణువును ఉదయమే పూజించి తులసీదళాన్ని సమర్పించవలెను. సాయంత్రము , తులసి సాన్నిధ్యములో ధ్వజపతాక రంగవల్లుల అలంకారము గావించి , దామోదర రూపుడైన ఆ శ్రీహరిని పూజించాలి. తోరణములతో శోభించే మంటపమునేర్పరచి , ముత్యాల మాలలతో అలంకృతమైన సింహాసనములో దామోదర మూర్తిని పంచరాత్ర విధానముతో భక్తితో పూజించవలెను. మనోహరములైన రకరకాల పూలమాలలతోను , అనేక విధములైన రత్నములతోను , అసంఖ్యాకమైన నేతిదీపాలతోను శ్రీహరిని ఆరాధించవలెను. 

          పాలు , వెన్న , పెరుగు , నేయిలను , వాటితో చేసిన పంచ భక్ష్యాలను , సుగంధ ద్రవ్య పూరితమైన జలములను , లవంగ సహితమైన తాంబూలమును , దక్షిణతో పాటు సమర్పించవలెను. పరిమళభరితములైన వివిధ పుష్పాలతో సమర్చించవలెను. తులసీ దళములచేతను , ఉసరిక ఫలముల చేతను , పూజింపవలెను. ఉసరికలు మహా విష్ణువుకు ప్రీతి పాత్రమే కాదు , సర్వ పాపములనూ పరిహరించగలదు. అందుకే , ఉసరి చెట్టు నీడలో పిండదానమాచరించినవాని పితరులు మాధవుని అనుగ్రహము వలన ముక్తి పొందుతారు. కార్తీకమాసములో శరీరం నిండా ఉసరిఫలాల గుజ్జును పూసుకొని , ఉసరికాయలతో అలంకరించుకొని , ఎండిన ఉసరి ఫలాలను ఆహారముగా స్వీకరించిన నరులు నారాయణులే అవుతారు. ఉసరి చెట్టు నీడలో విష్ణువును అర్చిస్తే వారు అర్పించిన ప్రతి పుష్పం వల్లనూ అశ్వమేధ ఫలం లభిస్తుంది. కార్తీక మాసములో ధాత్రీ వృక్షములు[ ఉసరి చెట్లు ] గల వనములో విష్ణువును చిత్రాన్నములతో సంతోషపరచి , బ్రాహ్మణులను భుజింపజేసి , తాము భుజించాలి. 

       కార్తీక మాసములో రోజు విడచి రోజు మూడు రాత్రులు ఉపవాసము చేసిన కానీ , ఆరు , పన్నెండు , లేదా పక్షము రోజులు లేదా నెలరోజులూ , ఒంటిపూట భోజనము చేసి గడపినవారు పరమపదాన్ని చేరుకుంటారు. 

           ప్రతి సాయంకాలమూ ఇంటి బయట నువ్వులనూనెతో ఆకాశదీపమును పెట్టవలెను.  చతుర్దశి , అమావాస్యలలో ప్రదోషకాలపు దీపము పెట్టటం వలన యమ మార్గాధికారులనుండీ విముక్తుడౌతాడు. కృష్ణ చతుర్దశి యందు గోపూజ చేయాలి. కార్తీక పౌర్ణమిలో దేవాలయములలో దీపాలు పెట్టాలి. పురుగులు , పక్షులు , దోమలు , వృక్షములు, మరియూ నీటిలోను , భూమియందు తిరుగుతున్న జీవులూ-- ఈ దీపాలను చూస్తే తిరిగి జన్మను పొందవు. చండాలులు , విప్రులూ కూడా ఈ దీపాలను చూస్తే మరుజన్మను పొందరు. 

       కార్తీకమాసమందు కృత్తికా నక్షత్రము రోజున కార్తికేయుని దర్శనము చేసుకున్నవారు ఏడు జన్మలు విప్రులౌతారు. ధనవంతులూ , వేదపారగులూ అవుతారు. [ ఈ నెల ఎనిమిదవ తేదీ నాడు కృత్తికా నక్షత్రము.. మధ్యాహ్నము వరకూ ] 

కార్తీకమాస నియమాలను పాటించి సర్వులూ శుభములను , సుఖములను పొందెదరు గాక. 

                        || శుభం భూయాత్ ||

Thursday, October 16, 2014

అగ్నికార్యము--ఔపాసన పీడీఎఫ్

ఇప్పుడు అగ్నికార్యము-ఔపాసన  ఈ రెండూ చేయు విధానము విపులముగా ,  ఇంకొంత  మెరుగు  పరచి పీడీఎఫ్ రూపములో  ఇవ్వడమైనది ఈ క్రింది లింకులో కొనవచ్చును.  దీని ద్వారా వచ్చు నది , మా ట్రస్ట్ కార్య కలాపాలకు ఉపయోగపడును.  ఆదరిస్తారని ఆశిస్తున్నాము.

http://kinige.com/kbook.php?id=3847

Thursday, October 2, 2014

రజస్వలా ధర్మాలు.

రజస్వలా ధర్మాలు. 

          ఈ కాలములో అంటు , ముట్టు అనేవి ఎవరికీ అర్థము కావు. అర్థమయినవారు , తెలిసిన వారు అనేకులు వాటిని పాటించడము లేదు. అదంతా ఒక మూఢ నమ్మకమనీ , అశాస్త్రీయమనీ , ఇంకా రకరకాలుగా హేళన చేసేవారు పుట్టుకొచ్చారు.. మతమార్పిడులకు ఇది కూడా ఒక కారణమట ! అనాదిగా అన్ని మతాలవారూ  దీన్ని పాటిస్తున్నారు, అయితే సనాతన ధర్మములో మాత్రము ఇంకా కొద్దో గొప్పో ఇది మిగిలి ఉంది. అంటు , ముట్టు లను గురించిన నేటి శాస్త్రీయమైన / అశాస్త్రీయమైన అవగాహన ఏమిటి అన్నది అటుంచితే , అసలు మన సనాతన ధర్మము దీన్ని గురించి యేమంటున్నది అని తెలుసుకోవడము ముఖ్యము.

          సనాతన ధర్మములో అంటు , ముట్టు అనేవే లేవని మిడిమిడి జ్ఞానముతో వాదించే పండిత పుంగవులు కూడా పుట్టుకొచ్చారు. 

          కృష్ణ యజుర్వేదము రెండో కాండలో ఐదో ప్రశ్న చాలాభాగము దీనిగురించే వివరిస్తుంది. అందులో ఈ ఉదంతము ఉంది, దీనికన్నా ముందు , ఋగ్వేదపు ( 1-20-6 ) సూక్తము నొకదాన్ని చూద్దాము, 

          ద్వాదశాదిత్యులలో ఒకడైన "  త్వష్ట  " ను ’ విశ్వ కర్మ ’ అని కూడా అంటారు. ఇతడే దేవ శిల్పి. ఇతడు కశ్యప ప్రజాపతి ( మానస ) పుత్రుడు .ఋగ్వేదము ఇతడిని బ్రాహ్మణుడు అంటే , యజుర్వేదము ఇతడిని ప్రజాపతి యనీ , అథర్వణ వేదము పశుపతి యనీ , శ్వేతాశ్వతరోపనిషత్ ప్రకారము రుద్రశివుడనీ వర్ణిస్తాయి. ప్రహ్లాదుడి కుమార్తె , ’ రచన ’  ఇతడి భార్య. వీరి పుత్రుడు " విశ్వరూపుడు "  ఇతడికి మూడు తలలుండుట చేత , " త్రిశీర్షుడు "  అంటారు. 

          ఈ విశ్వరూపుడు , ప్రహ్లాదుడి దౌహిత్రుడు కాబట్టి , రాక్షస పక్షపాతి అని పేరు, అయితే కొంతకాలము దేవతల పురోహితుడుగా ఉన్నాడు. అతడి మూడు తలలలో  ఒకతలతో సోమపానము చేసేవాడు , ఇంకొక తలతో సురాపానమూ , మూడో తలతో అన్న భక్షణమూ చేసేవాడు. పురోహితుడిగా యాగములు చేయించేటప్పుడు , దేవతలకు హవ్యభాగాన్ని ప్రత్యక్షంగా ఇప్పించేవాడు , అయితే , రహస్యంగా రాక్షసులకు కూడా హవ్యభాగాన్ని ఇప్పించేవాడు. ఇది తెలుసుకున్న ఇంద్రుడు , ’ ఇతడు దేవలోకాన్ని రాక్షసుల పరం చేయవచ్చు’ నని బెదరినాడు. కాబట్టి , స్వామిద్రోహి , దేవ ద్రోహి యైన విశ్వరూపుడి మూడు తలలూ  తన వజ్రాయుధముతో  నరికివేస్తాడు. ( సోమపానము చేయు తల ’ కపింజలము’  అను పక్షిగాను , సురాపానము చేయు తల గుడ్లగూబ గాను , అన్నము తిను తల , ’ తిత్తిరి పక్షి ’ గాను రూపాంతరము చెందుతాయి ) 

          ఆత్మ జ్ఞాని యైన ఇంద్రుడికి దుష్ట శిక్షణ చేసినందువల్ల , బ్రాహ్మణ హత్య పాపము కాదని తెలుసు. అయినా సామాన్యులకు జనాపవాద నివృత్తి చేయుట ఎలాగ అన్న విషయము తెలుపుట కోసము , ఇలా చేస్తాడు. 

          ధర్మ దేవతల ఎదురుగా తన అంజలితో బ్రహ్మ హత్యా పాపాన్ని స్వీకరిస్తాడు. తాను తప్పుచేయలేదన్న భావనతో ఆ పాపాన్ని ఒక సంవత్సరము భరిస్తాడు. అయితే సృష్టిలోని ప్రాణులన్నీ , ఇంద్రుడిని " బ్రహ్మ హత్య చేసినవాడు " అని ఆక్షేపిస్తాయి. కాబట్టి , సామాన్యుల దృష్టిలోకూడా దాని నివృత్తి కోసము బ్రహ్మ హత్యా పాపాన్ని ఇతరులకిచ్చి , తీసుకున్నందుకు ప్రతిగా వారికి వరాలను ఇవ్వాలనుకుంటాడు. 

          మొదట , భూదేవిని ప్రార్థించి , తన పాపములో మూడో భాగాన్ని తీసుకోమని కోరుతాడు. భూమి , వరాన్ని ఇలా అడుగుతుంది , " జనులు నన్ను త్రవ్వేటప్పుడు నేను పీడను అనుభవిస్తాను , దానివలన నాకు హింస కలుగుతుంది. కాబట్టి , నాకు వ్యథ తెలియకుండా , హింస కలుగకుండా చూడు " . ఇంద్రుడు దానికి సమ్మతించి , జనులు భూమిని త్రవ్వేటప్పుడు భూమికి నొప్పి కాకుండానూ , అంతేకాక, ఆ త్రవ్విన చోట ఒక సంవత్సరములోపల దానికదే పూడుకొనే లాగానూ వరమిచ్చి , పాపపు మూడో భాగాన్ని వదిలించుకుంటాడు. బ్రహ్మ హత్యా పాపం తో కూడుకొన్నది కావున తనకుతానుగా పూడుకొన్న అటువంటి బంజరు భూమిని ఎవరూ నివాసము కోసమూ , యాగముల కోసము ఉపయోగించరాదు. 

          తర్వాత  ఇంద్రుడు, వృక్షములను , సస్యములనూ ప్రార్థించి , బ్రహ్మ హత్యా పాపంలో ఇంకో భాగాన్ని తీసుకొమ్మని కోరుతాడు. అప్పుడా సస్యజాలము , "జనులు మమ్మల్ని కత్తరించుటవలన మేము నశిస్తుంటాము, కాబట్టి మేము నాశనము కాకుండా వరమియ్యి " అని అడుగుతాయి. ఇంద్రుడు ఒప్పుకుని , " నరికినచోట అనేక చిగుళ్ళు మొలవనీ " అని వరమిచ్చి , పాపపు రెండో భాగం వదిలించుకుంటాడు. అందుకే , చెట్లను కొట్టివేస్తే అక్కడే అనేక చిగుళ్ళు పుట్టుకొస్తాయి. అయితే , అది బ్రహ్మ హత్యా పాపంతో కూడుకున్నది కాబట్టి , ఆ కొట్టివేసిన చోట , గట్టియైన రసము ( బంకపాలు లేదా జిగురు) కారుతుంది. కాబట్టి ఆ రసమును తాగరాదు. ( కల్లు వచ్చేది ఇలాగే , అందుకే కల్లుతాగుట నిషేధము. ) కాబట్టి , ఎరుపు రంగుతో ఏదైతే కారుతుందో , లేక , కొట్టివేసిన చోటే బయటికి కారుతుందో , అది తినుటకు యోగ్యము కాదు. అయితే , కొట్టివేయకుండానే కారే రసాలకు ఈ నిషేధము లేదు. 

          ఆ తర్వాత , మిగిలిన బ్రహ్మ హత్యా పాపంలోని మూడోభాగాన్ని తీసుకోమని ఇంద్రుడు , స్త్రీ సమూహాలను కోరుతాడు. అప్పుడు స్త్రీలు , "  నిషిద్ధ దినములలో పురుష సంయోగము వల్ల కలిగే దోషము లేకుండా , దానివలన గర్భమునకు హాని కలుగకుండా వరమునియ్యి "  అని అడుగుతారు. ( పురుష సంయోగము కేవలము సంతాన ప్రాప్తికే అయిననూ , ప్రసవము వరకూ , ఇచ్చానుసారముగా పురుష సంయోగమును యే దోషమూ లేకుండా పొందుటకు యోగ్యతను పొందుతారు ) ఆ వరము వలన , ప్రథమ రజోదర్శనముతో మొదలు పెట్టి , ఋతుకాల సంబంధమైన వీర్య సంయోగము వలన సంతానము పొందుతారు , ప్రసవము అయ్యేవరకూ , ఇచ్చానుసారము పురుష సంయోగము పొందే శక్తిని పొందుతారు. అయితే , అది బ్రహ్మహత్యా సంబంధమయినది కాబట్టి , ఆ పాపము స్త్రీల రజోరూపమైనది. అనగా రజస్సును అంటిపెట్టుకొని ఉండును. 

          రజస్వల అయిన స్త్రీ మలిన వస్త్రములను ధరించినదానితో సమానము. అట్టి రజస్వలతో  ఎవరూ సంవాదములు చేయరాదు. పక్కన కూర్చొనరాదు. ఆమె ముట్టిన అన్నమును తినరాదు. బ్రహ్మ హత్యారూపాన్ని శరీరం లో ధరించినది కావున , స్త్రీలకు ప్రియమైన అభ్యంగనాది  తైలములను  రజస్వలలు తీసుకోకూడదు. సౌందర్య సాధనములను వాడరాదు. ( ఇతర వస్తువులను తీసుకొన వచ్చును ) 

ముఖ్య నియమములు :-


ఎవడైతే రజస్వలతో సంయోగిస్తాడో , ఎవడైతే ఆ సంయోగము వలన పుట్టునో , వాడు నీలాపనిందల పాలై కష్టములనుభవిస్తాడు.

అడవిలో రజస్వలతో సంయోగఫలముగా పుట్టినవాడు , దొంగ అవుతాడు. 

సిగ్గుతోగానీ , భయం తోగానీ , నిరాకరించిన స్త్రీని ఎవరైనా కూడితే , ఆమెకు పుట్టువాడు , సభలలో మాట్లాడుటకు సిగ్గుపడి , తలవంచుకొనెడు పుత్రుడు అవుతాడు

యే రజస్వల అయితే స్నానము చేస్తుందో , ఆమెకు , నీటిలో మునిగి చనిపోగల సంతానము కలుగును ( రజస్వలలు ఆ మూడు రోజులూ స్నానము చేయరాదు) 

యే రజస్వల అభ్యంగన స్నానము చేస్తుందో , ఆమెకు కుష్టు రోగము , చర్మ రోగములు కల సంతానము కలుగును. 

యే స్త్రీ అయితే గోడలమీద బొమ్మలు వేస్తుందో , ఆమెకు కేశములు లేని , బట్టతల కలుగువారునూ , దుర్మరణము / అకాల మరణమునకు పాలగువారు పుడతారు. 

ఎవతె కంటికి కాటుక పెట్టుకొనునో , ఆమెకు , కళ్ళులేనివారు , నేత్రరోగులు పుడతారు.

ఎవతె , దంతధావనము చేయునో ( వేపపుల్లతో )  ఆమెకు పాచి పళ్ళు , పుచ్చుపళ్ళు కలవారై పుడతారు. 

యేస్త్రీ గోళ్ళను కత్తరించుకొనునో , ఆమెకు వికృత గోళ్ళు కలవారు పుడతారు.

యేస్త్రీ గడ్డి కోస్తుందో , చాపలల్లుతుందో , ఆమెకు నపుంసకులు పుడతారు. 

ఎవరైతే పగ్గములను ( తాళ్ళను ) పేని తయారు చేస్తారో , ఆ స్త్రీలకు ఉరిపోసుకొని చచ్చువారు పుడతారు. 

యేస్త్రీ ఆకులతో నీరు తాగునో , ఆకులలో భోజనము చేయునో , ఆమెకు ఉన్మాదులు / పిచ్చివారు పుడతారు.

ఎవరైతే అగ్నిలో కాల్చిన మట్టికుండలలో నీరు తాగుతారో , ఆమెకు మరుగుజ్జులు ( పొట్టివారు ) పుడతారు. 

ఈ నియమాలు మూడురాత్రుల కాలము ముగియువరకూ పాటించవలెను. పచ్చికుండలలో , పచ్చి మూకుడులలో నీళ్ళు తాగడము , భోజనము చేయడము చేయవచ్చును. 

ఈ నియమాలు పాటిస్తే ఉత్తమ సంతానము కలుగును. ఇతరులకు కామోద్రేకము కలుగులాగ ప్రవర్తించరాదు. ఈ నిషిద్ధ కార్యములకు ఫలము అరిష్టమే కాబట్టి , అరిష్టము తెచ్చు యే పనినీ చేయరాదు. 

శ్రద్ధాళువులు సనాతన ధర్మపు సాంప్రదాయములను , ఆచారములను పాటించి శుభమును పొందెదరు గాక . 



సంప్రదించిన గ్రంధములు :
 కృష్ణ యజుర్వేద  భాష్యము ,
  Encyclopedia of Hinduism ,
 బోధివృక్ష  --కన్నడ వార్తా పత్రిక ,
పురాణ భారత కోశము

Monday, August 11, 2014

పంచగవ్యము ---దాని ప్రాశస్త్యత

పంచగవ్యము ---దాని ప్రాశస్త్యత 

పంచగవ్యము అంటే గోవు నుండీ లభించే అయిదు పదార్థాలతో చేసిన ఒక లేహ్యము వంటిది. 




అవి , ఆవుపాలు , ఆవుపాలు తోడుపెట్టిన  పెరుగు , ఆవు వెన్నతో చేసిన నెయ్యి , గోమూత్రము మరియు గోమయము. ఈ అయిదింటినీ ఒక ప్రత్యేక నిష్పత్తిలో  ఆయా మంత్రాలతో అభిమంత్రించి  కలిపి , చేసిన ద్రవమునే పంచగవ్యము అంటారు. 

సనాతన ధర్మములో గోవుకున్న ప్రాముఖ్యత , గౌరవము , విలువా అంతాఇంతా కాదు.  వేదములో అనేకచోట్ల , ’ గోబ్రాహ్మణ ’ అన్న పదము తరచూ వస్తుంది. బ్రాహ్మణుల , గోవుల హితము కొరకు పనిచేయుట చాలా పవిత్రమైన కార్యము. గోవులను పూజించుట వేలయేళ్ళ నుండీ  వాడుకలో ఉంది.. అనేకులు ఋషులతో పాటు , భగవంతుని అవతారాలయిన శ్రీ కృష్ణుడు , శ్రీ రాముడు వంటి వారు కూడా గోపూజను చేసినవారే.. అట్టి గోవునుండీ లభించు పదార్థాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. 

 మానవుడు చేసే అనేక పాపాలలో , పొరపాట్లలో ఎన్నింటికో ,  సనాతన ధర్మశాస్త్రములలో అనేక ప్రాయశ్చిత్తాలు విధింపబడినవి.  పంచ గవ్యము యొక్క ప్రాశన ( తాగుట ) వాటిలో ఒకటి. దీనిని బట్టే  గోవులకు గల ప్రాశస్త్యము  ఎట్టిదో తెలుస్తున్నది. 

ఒక కపిల గోవు ( ఎర్రావు )పాల నుండీ చేసిన పంచగవ్యము ఇంకా ఫలవంతమైనది. 

పంచగవ్య పదార్థాలను కలపవలసిన నిష్పత్తి ఈ క్రింది విధముగా ఉండాలి.::   

గోక్షీరము ఎంత తీసుకుంటే , అంతే పెరుగు కూడా తీసుకోవాలి.. గోక్షీరములో సగము గోఘృతము ( ఆవు నెయ్యి ) , గోఘృతము లో సగము గోమూత్రము , గోమూత్రములో సగము గోమయము ( ఆవుపేడ ) 

ఈ పంచగవ్యాన్ని అనేక ప్రయోజనాలకోసము వాడతారు... 
* పాపనివృత్తియై , దేహము శుద్ధముగా ఉండుట కోసము పంచగవ్యమును స్వీకరిస్తారు. , 
* యజ్ఞోపవీత ధారణ సమయములో శరీర శుద్ధి కోసము పంచగవ్యమును మొదట ప్రాశన చేస్తారు. 
* కొన్ని పూజలముందరకూడా పంచగవ్య ప్రాశన చేస్తారు...,
*  ఏదైనా ఒక శివలింగముకానీ , సాలిగ్రామము కానీ , రుద్రాక్షకానీ , లేక చిన్న విగ్రహముకానీ పూజగదిలో ఉంచి పూజించుటకు ముందు , వాటిని పంచగవ్యముతో మంత్ర సహితముగా అభిషేకము చేసి , ఆ తర్వాతనే పూజించాలి. 

పంచగవ్యమును ఉపయోగించు విధము

యే ప్రయోజనము కోసము పంచగవ్యమును వాడుతున్నామో , ఆ సంకల్పాన్ని మొదట చెప్పాలి, ఉదాహరణకు , యజ్ఞోపవీత ధారణ  సమయములో శరీర శుద్ధి కోసము చేస్తుంటే , మొదట  ఆచమనము , ప్రాణాయామము చేసి , దేశకాల సంకీర్తనానంతరము , 

1.  "||  మమ శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్ఠాన యోగ్యతా సిధ్యర్థం , శరీర శుద్ధ్యర్థం , పంచగవ్య ప్రాశన -యజ్ఞోపవీత ధారణమహం కరిష్యే  || తదంగ పంచగవ్య మేళనం యజ్ఞోపవీత సంస్కారమహం కరిష్యే ||| అని చెప్పాలి. తర్వాత , 

పంచగవ్యము కలుపవలసిన పద్దతి :-

ఒక అరిటాకులోగాని , పళ్ళెం లో గానీ శుభ్రమైన బియ్యం పోసి , దానిపైన స్వస్తిక గుర్తు వేలితో రాయాలి. ఆ గుర్తుపైన ఒక మట్టి పాత్రగానీ , ఇత్తడి లేక కంచు లేక వెండి పాత్రగానీ పెట్టి , దానికి తూర్పు దిక్కున అటువంటిదే ఒక చిన్న పాత్రలో గోమూత్రాన్ని ఉంచాలి. దక్షిణాన ఒక పాత్రలో గోమయమునుంచాలి. పశ్చిమాన వేరొక పాత్రలో ఆవుపాలను పోయాలి. ఉత్తరాన అటువంటిదే ఇంకో పాత్రలో ఆవుపెరుగు పోయాలి . మధ్యలోని పాత్రలో ఆవునెయ్యి పోయాలి. ఇవికాక , వాయవ్యములో ఒక పాత్రలో కుశోదకం పోయాలి ( దర్భలు ఉంచిన నీరు ) . 

ఇప్పుడు అన్ని పాత్రలలోనూ , ఆయా పదార్థాల అధిదేవతలను ఆవాహన కింది విధంగా చేయాలి

తూర్పు పాత్రలో , || గోమూత్రే ఆదిత్యాయ నమః ఆదిత్యమావాహయామి  || ( అని పలకాలి ) 

దక్షిణ పాత్రలో , || గోమయే వాయవే నమః వాయుమావాహయామి ||

పశ్చిమ పాత్రలో , || గోక్షీరే సోమాయ నమః సోమమావాహయామి ||

ఉత్తర పాత్రలో , || గోదధ్ని శుక్రాయ నమః శుక్రమావాహయామి  ||  ( గో దధి అంటే ఆవుపెరుగు ) 

మధ్య పాత్రలో , || ఆజ్యే వహ్నయే నమః వహ్నిమావాహయామి ||  (  వహ్ని అంటే అగ్ని ) 

వాయవ్య పాత్రలో , || కుశోదకే గంధర్వాయ నమః గంధర్వమావాహయామి ||

ఇలాగ ఆవాహన చేసి , కుంకుమ , గంధము , పూలతో పూజించాలి, తర్వాత మధ్యలో ఉంచిన పాత్రలో , ఒక్కొక్క పదార్థాన్నీ కింది మంత్రాలతో కలపాలి ( మంత్రము పూర్తిగా ఇవ్వడము లేదు , వాటిని స్వరముతో పలుకవలెను. మంత్రము రానివారు , ఆయా దేవతలకు  ఆయా పదార్థాలతో అభిషేకం చేసినట్లు  భావించుకుంటూ  )

మధ్యలోని పాత్రలోకి , గాయత్రీ మంత్రం పలుకుతూ గోమూత్రాన్ని , 

" || గంధ ద్వారే  ...|| " అను మంత్రముతో గోమయాన్ని , 
"|| ఆప్యాయస్వ ...|| " అనే మంత్రంతో గోక్షీరాన్ని , 
"|| దధిక్రావ్‌ణ్ణో....|| " అనే మంత్రముతో  పెరుగునూ , 
" || శుక్రమసి జ్యోతిరసి.... || " అనే మంత్రముతో నేతినీ , 
" || దేవస్యత్వా   సవితుః .....|| " అనే మంత్రముతో కుశోదకాన్నీ  కలపాలి. 

దర్భలు తీసుకొని , " || ఆపోహిష్ఠా ... || " అనే మంత్రముతో మధ్యపాత్రలో కలయబెట్టాలి 

" || మానస్తోకే తనయే ....|| " అను మంత్రముతో అభిమంత్రించి , అందులోకి మరలా గాయత్రీ మంత్రము చెబుతూ సూర్యుడిని ఆవాహన చేయాలి. 

తర్వాత పంచగవ్యానికి పంచమానసపూజలు చేయాలి ( లం  పృథివ్యాత్మనే నమః  .... ఇత్యాది ) మరలా వ్యాహృతులతో గాయత్రీ మంత్రం జపించి ,  || యత్త్వగస్థి గతమ్ పాపమ్ దేహే తిష్ఠతి మామకే ( ఇతరులకోసం చేస్తుంటే , ’ తావకే ’ )

|| ప్రాసనం పంచగవ్యస్య దహత్వగ్నిరివేంధనం ||  అని పలికి , ఓంకారము పలికి , పంచగవ్యాన్ని ప్రాశనము చేయవలెను ( త్రాగ వలెను ) శరీర శుద్ధికోసము అయితే  ఇంతవరకే. 

2. యజ్ఞోపవీత ధారణ కోసమయితే పైదంతా చేసి , 

తర్వాత రెండుసార్లు ఆచమించి , కొత్త  యజ్ఞోపవీతాన్ని ఎడమ చేతిలో ఉంచుకొని , " ||  ఆపోహిష్ఠా  ..|| . మంత్రముతో మొదలుపెట్టి సంధ్యావందనములోని మార్జన మంత్రాలన్నీ చెప్పవలెను.  తర్వాత , ఉదకశాంతి మంత్ర పాఠము అయినవారు , "||  పవమానః సువర్జనః .... నుండీ మొదలుపెట్టి , "|| జాతవేదా మోర్జయంత్యా పునాతు ...||. "  వరకూ చెప్పి , యజ్ఞోపవీతాన్ని నీటితో అభ్యుక్షణము చేసి ( మూసిన పిడికిలితో నీళ్ళను ప్రోక్షించి ) మూడు తంతువులలోకి వ్యాహృతులను , దేవతలను ఆవాహన చేయాలి.

ప్రథమ తంతౌ ఓం భూః  ఓంకారమావాహయామి , ఓం భువః ఓంకారమావాహయామి , ఓం సువః ఓంకారమావాహయామి , ఓం భూర్భువస్సువః ఓంకారమావాహయామి ,అని వ్యాహృతులను ఆవాహన చేయాలి. తర్వాత , ద్వితీయ తంతి లోకూడా ‘అలాగే వ్యాహృతులను ఆవాహన చేయాలి

తృతీయ తంతౌ అగ్నిమావాహయామి , నాగమావాహయామి , సోమమావాహయామి , పితౄనావాహయామి , ప్రజాపతిమావాహయామి , వాయుమావాహయామి , సూర్యమావాహయామి , విశ్వాన్దేవానాహయామి... అని పలికి , మూడు సూత్రములలోనూ , బ్రహ్మాణమావాహయామి, విష్ణుమావాహయామి , రుద్రమావాహయామి , అని ఆవాహన చేసి అక్షతలు వేసి పూజించాలి. 

తర్వాత , "|| స్యోనా పృథివి......  సప్రథా || "  అని పలికి , యజ్ఞోపవీతా(ల)న్ని కింద భూమిపైన గానీ ఒక పళ్ళెములోగానీ పెట్టవలెను. "|| ఓం దేవస్యత్వా సవితుః ....హస్తాభ్యామాదదే || " అనే మంత్రముచెప్పి చేతిలోకి తీసుకొని , "||  ఉద్వయం తమసస్పరి....... జ్యోతిరుత్తమం ||  " అనే మంత్రాలను పలికి యజ్ఞోపవీతాన్ని ఆదిత్యుడికి చూపించవలెను. 

తర్వాత హృదయాది న్యాసములు చేసి , " ముక్తా విద్రుమ ... " ధ్యాన శ్లోకము చెప్పి ,  ఒక్కొక్క యజ్ఞోపవీతాన్నీ పది సార్లు గాయత్రీ మంత్రముతో అభిమంత్రించి , 

" ||  యజ్ఞోపవీతమిత్యస్య పరబ్రహ్మ పరమాత్మా త్రిష్టుప్ ఛందః  | శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్ఠాన యోగ్యతా సిద్ధ్యర్థే యజ్ఞోపవీత ధారణే వినియోగః || "

|| యజ్ఞోపవీతం పరమం ... తేజః ||" అని పలికి యజ్ఞోపవీతాన్ని ధరించవలెను. మరలా ఆచమించి , 

|| అజినం బ్రహ్మ సూత్రం చ జీర్ణం కశ్మల దూషితం | 
విసృజామి సదా  బ్రహ్మవర్చో దీర్ఘాయ్తురస్తు మే || 

అని పాత యజ్ఞోపవీతాన్ని తీసివేయవలెను. 

|| అనేన మయాకృత పంచగవ్య ప్రాశన- యజ్ఞోపవీత ధారణ విధి కర్మణా శ్రీ పరమేశ్వరః ప్రీయతాం ||

మళ్ళీ ఆచమనము చేయాలి. 


3. కొత్త శివలింగము , సాలిగ్రామము , విగ్రహము , రుద్రాక్ష మొదలగునవి మొదటిసారి ధరించుటకు ముందు , పైన చెప్పినట్లే పంచగవ్య మిశ్రణము చేసి ,  మిశ్రణముతో  " పవమానస్సువర్జనః ..."  అనే మంత్రములతోను , మలాపకర్షణ మంత్రములతోను , అభిషేకము చేయవలెను.  తర్వాతనే వాటిని ఉపయోగించవలెను.  

4. పంచగవ్యపు ప్రయోజనాలు ఇంకా చాలానే కలవు.  వాటిలో ముఖ్యమైనది , ఇంట్లో అంటు , ముట్టు పాటించుటకు వీలు కాకపోతేనో , అంటు కలసిపోతేనో , ప్రతిరోజూ కానీ , నాలుగవ రోజుకానీ ఈ పంచగవ్య ప్రాసనము చేయాలి. 

చివరిగా , పంచగవ్యముతో  క్రిమి నివారకాలను  కూడా తయారు చేస్తారు 

|| శుభం భూయాత్ ||





Sunday, July 27, 2014

ఉపాకర్మ

ఉపాకర్మ అనగా , " ఉపక్రమణ కర్మ " ( ఆరంభించుట ) 

ప్రాచీన కాలములో , వేదాధ్యయనము చేయు  బ్రహ్మచారులు గురుకులం లో నివశిస్తూ ఉండేవారు. వేదాధ్యయనము సంవత్సరము పొడగునా ఉన్నా , మధ్య మధ్యలో కొంత వ్యవధి ఉండేది.. ఆ వ్యవధిలో వారు తమ ఇళ్ళకు వెళ్ళిరావడమో , లేక ఆచార్యుని ఇంటనే ఇతరపనులు చూసుకోవడమో చేసేవారు. వేదాధ్యయనమును తాత్కాలికముగా నిలిపివేయడము , తర్వాత మళ్ళీ మొదలుపెట్టడము అన్నవి గొప్ప ఉత్సవాలు. ఈ రెంటినీ మంత్రపూర్వకముగా , సంస్కారపూర్వకముగా , గృహ్యసూత్రానుసారము  ఆచరిస్తారు. వేదాధ్యయనాన్ని తాత్కాలికంగా నిలిపివేయడాన్ని " ఉత్సర్జనము "  అనీ , నిలిపిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టడాన్ని " ఉపాకర్మ " అని అంటారు.  రెంటినీ కలిపి ఉత్సర్జనోపాకర్మ అంటారు. 


ఈ ఉపాకర్మను ఆచార్యుడు శిష్యులతో పాటూ ఏదైనా నదీతీరములో ఆచరించుట శ్రేష్ఠమని చెప్పబడినది. కొన్ని సమయాల్లో నదులకు దోషాలుంటాయి.. అప్పుడు ఆ సమయాల్లో నదీస్నానము వంటివి చేయరు. కానీ ఉపాకర్మ నాడు నదులలో ఎట్టి దోషమున్ననూ అది దోషము కాదు అని గార్గ్యోక్తి. విద్యార్థులు ఆనాడే వపనము చేయించుకొనవలెను. వారికి కూడా వపనము నకు చూడవలసిన తిథివార దోషములు ఆనాడు వర్తించవు. 



ఉత్సర్జనము 

ఉత్సర్జనములో భాగముగా , దర్భలతో చేసిన కూర్చలలో కాండఋషులను ఆవాహన చేసి , షోడశోపచార పూజచేసి , తర్పణము ఇచ్చి , ప్రతిష్టిత అగ్నిలో షట్పాత్ర ప్రయోగపూర్వకముగా నవకాండ ఋషులకు , చతుర్వేదాలకు హోమము చేసి హవ్యమునర్పిస్తారు. 

ఉపాకర్మ

 ఉపాకరణము ( ఉపాకర్మ ) అనేది కూడా రెండు రకాలు. 

ఒకటి అధ్యాయోపాకరణం , రెండోది కాండోపాకరణం. 

ఉపనయనము అయిన తర్వాత , వేదాధ్యయన ప్రారంభాన్ని అధ్యాయోపాకరణము అంటారు.  అధ్యాయోపాకరణానికి ముందర , వేదములోని కాండఋషులకు హోమములు చేసి, ఆ తర్వాతనే అధ్యయనము చేయవలెను. కాండఋషులకు చేయు హోమాలనే కాండోపాకరణం అంటారు. 

యజుర్వేదులకు ,  కాండోపాకరణము అంటే , ప్రాజాపత్య , సౌమ్య , ఆగ్నేయ , వైశ్వ దేవ , మొదలుగాగల తొమ్మిది  కాండముల ఋషులకు ( నవకాండ ఋషులు )  హోమము చేయుట. తర్వాత ఆయా కాండములను అధ్యయనము చేయవలెను.   కాని ,  యజుర్వేదములో మంత్రాలు , ( సంహిత , బ్రాహ్మణము , ఆరణ్యకములలోని మంత్రాలు ) ప్రత్యేకముగా ఉండక అన్నీ కలగలసి ఉంటాయి. ఇలా కలగలసి ఉన్న మంత్రాల పాఠమును సారస్వత పాఠము అంటారు. కాండ పాఠానికి అనుగుణముగా , అదే క్రమములో సారస్వత పాఠము ఉండదు. ( అంటే , ఒక కాండ ఋషి కనుగొన్న మంత్రాలు అన్నీ ఆ కాండములోనే ఉండవు. మిగిలినవాటిలో కలగలసి ఉంటాయి )   కాబట్టి , కాండోపాకరణము ఎప్పటికప్పుడు కాక, అధ్యయనోపాకరణము తర్వాత , సర్వ కాండఋషి హోమము ( కాండోపాకరణము )  చేయుట రూఢియై ఉన్నది. 

కాబట్టి యజుర్వేద ఉపాకర్మలో భాగముగా , మొదట గణపతి పూజ , పుణ్యాహవాచనము చేసి , తర్వాత ఉత్సర్జనలో వలెనే ,  కాండఋషులను ప్రతిష్టించి, షోడశోపచార పూజ చేసి , తర్పణమునిచ్చి , షట్పాత్ర ప్రయోగము ద్వారా హోమము చేసి , బ్రహ్మముడిని విప్పిన యజ్ఞోపవీతమును హోమములో అర్పిస్తారు. అంతేకాక , నూతన యజ్ఞోపవీతాలకు పూజచేసి , దక్షిణలతో పాటు పెద్దలకు దానము చేసి , ఆశీర్వాదముపొంది , తర్వాత , తాముకూడా " శ్రౌత స్మార్త కర్మానుష్ఠాన యోగ్యతా సిద్ధి " కోసము నూతన యజ్ఞోపవీతాన్ని ధరించి , జయాది హోమములను , ( ప్రతి ముఖ్యమైన హోమములలోనూ ఈ జయాది హోమములు చేయుట తప్పని సరి ) , తర్వాత , హోమకాలములో సంభవించు అనేక లోపదోషములకు ప్రాయశ్చిత్తముగా ’ ప్రాయశ్చిత్త హోమము ’ చేసి , ప్రత్యేక మంత్రాలతో పూర్ణాహుతి చేసిన ఉపాకర్మ సమృద్ధి అవుతుంది. 

అనంతరము , గడచిన సంవత్సరంలో   వేదాధ్యయనములోను , సంధ్యావందనాది అనుష్ఠానములలోను ,మరియు  ఇతర వైదిక కర్మల దోషములు , లోపముల పరిహారము కోసము  నువ్వులు , బియ్యపు పిండి , మరియూ నెయ్యి కలిపిన పురోడాశము ( హవిస్సు ) తో రెండుచేతులతోనూ " విరజా హోమము " ఆయా మంత్రములతో చేయవలెను. 

తర్వాత ’ బ్రహ్మ యజ్ఞము ’ చేసి , అగ్ని మరియు ఋషులకు నమస్కారములు చేయవలెను. బ్రహ్మచారులు " ఆయుర్వర్చో యశోబలాభివృధ్యర్థం " అని చెప్పుకొని ప్రాతరగ్ని కార్యము చేయవలెను. ఆచార్యుడిని , దక్షిణ , తాంబూల , నూతన వస్త్రములతో సత్కరించవలెను. నవకాండఋషులను విసర్జించి , పర్జన్య సూక్తముతో నదీనీటిలో విడువవలెను. 

మరునాడు , గాయత్రీ హోమమును కానీ , సహస్ర గాయత్రిజపము కానీ చేసి , పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించవలెను. 


ఇక , ఉత్సర్జనం ఎప్పుడు చేయాలి , ఉపాకరణం ఎప్పుడు చేయాలి ?

గృహ్య సూత్రాల ప్రకారము , 

యజుర్వేదీయులు  ఉత్సర్జనమును పుష్యమాసపు పౌర్ణమియందు చేయవలెను. ఋగ్వేదులైతే ఈ ఉత్సర్జనమును మాఘ పౌర్ణమి నాడు చేస్తారు. 


యజుర్వేదీయులు ఈ ఉపాకర్మను శ్రావణమాసపు పౌర్ణమి యందు , ఋగ్వేదీయులు శ్రావణ మాసములో శ్రవణ నక్షత్రము వచ్చిన దినమందు , సామవేదులు భాద్రపద మాసపు హస్తా నక్షత్రపు దినమందు ఆచరించుట వాడుకలో ఉంది.

అయితే , ఉత్సర్జనమును పుష్యమాసములో ఒకసారి , తర్వాత ఉపాకర్మను శ్రావణములో ఒకసారి చేయుట అనుకూలము లేనివారు , ఉత్సర్జనమును కూడా ఉపాకర్మ నాడే , ఉపాకర్మకన్నా ముందుగా చేయుట ఆచారములో ఉంది. అయితే ఇలా చేస్తే  ఉత్సర్జనము చేయుటకు కాలాతీతము అగును కాబట్టి , దానికి పరిహారముగా , మొదట పాహిత్రయోదశ హోమమును చతుష్పాత్ర ప్రయోగముతో ఆచరించవలెను. 

వేదాధ్యయనమును ద్విజులు అందరూ , వీరు వారు అనుభేదములేక చేయవలెను.  ఈ కాలము , పౌరోహితులు మాత్రమే వేదాధ్యయనము చేయవలెను / చేస్తారు  అన్న ఒక అపోహ చాలామందిలో ఉంది. అది సర్వథా అసత్యము. ప్రతి ఒక్క ద్విజుడూ వేదాధ్యయనము చేసి , క్రమం తప్పకుండా ఈ ఉత్సర్జన ఉపాకర్మలను ఆచరిస్తే , వారి జీవితాలు అద్భుతంగా అభ్యుదయ మార్గంలో పయనించి ధన్యులవుతారు. 

ప్రథమోపాకర్మ 

నూతనముగా ఉపనయనము అయిన వటువులు , ఉపాకర్మను ప్రథమముగా జరుపుకొనేటప్పుడు మొదట నాందీ పూజ చేయవలెను. బ్రహ్మచారులు యజ్ఞోపవీతానికి ఒక చిన్న కృష్ణ జింక చర్మపు ముక్కను తగిలించుకోవడము ఆనవాయితీ . దీనికి రెండు కారణాలు.

ఒకటి , యజ్ఞాలలోను , బలులలోను  కృష్ణాజినమును కప్పుకొనుట , కృష్ణాజినముపై  కూర్చొనుట విహితమని చెప్పబడినది. అది ధరించిన వటువు , " ఈ దినము నుండీ నా జీవితము ఒక యజ్ఞము లేక త్యాగము వంటిది. నా జీవితాన్ని లోకకల్యాణమునకై అర్పించవలెను " అని భావించవలెను. రెండోది , కృష్ణాజినము వలన , చిత్తము నిర్మలమై , సాత్త్వికమైన ఆలోచనలు కలుగుతాయి. 

ఈ కాలము ఇవన్నీ కేవలము సూత్రప్రాయముగా మిగిలిపోతున్నాయి. కొందరు కేవలము యజ్ఞోపవీతము మార్చుకొనుటే దీని పరమార్థముగా భావిస్తున్నారు. 

ఉపాకర్మ ఎందుకు చేయవలెను , అందులోని ముఖ్యాంశాలేమిటి అన్నది మాత్రమే ఇక్కడ చర్చించడమైనది. ఉపాకర్మ పద్దతి , వివరాలతో , ఇంకోసారి. 

యజ్ఞోపవీత ధారణ విధి ఈ మధ్య విరివిగా పుస్తకాలలోనూ , అంతర్జాలములోనూ దొరకుతున్నందున ప్రత్యేకించి రాయలేదు. యజ్ఞోపవీతాన్ని , సూతకము తర్వాతా , ఉపాకర్మ సమయములోనూ , అలాగే ప్రతి నాలుగు నెలలకొకసారీ  మార్చుకోవలెను.