SHARE

Wednesday, February 3, 2016

సనాతన ధర్మపు రహస్యము---మూడవ[చివరి] భాగము

సనాతన ధర్మపు రహస్యము---మూడవ[చివరి] భాగము

గురువులు :- " మీకు పూర్తిగా అర్థము కావలెనంటే నేను క్రైస్తవ మతపు ఉదాహరణ తీసుకొని వివరిస్తే తమరు నన్ను క్షమిస్తారని భావిస్తున్నాను. 

మోక్షానికీ, లేదా స్వర్గానికీ అవశ్యకమైనది క్రీస్తుపైన విశ్వాసము మాత్రమే అన్నపుడు , క్రీస్తు కన్నా ముందు పుట్టి చనిపోయిన వారందరికీ ముక్తి దొరికే అవకాశము లేకుండినది అని వారికి స్వర్గము నిరాకరించవలసి వస్తుంది. వారంతా యే తప్పూ చేయకున్ననూ కేవలము వారు క్రీస్తు కన్నా ముందు పుట్టినారు అన్న క్షుల్లకమైన కారణముచేత మనము అలాగ చేయవలసి వస్తుంది. అదేవిధముగా , ఆ అవకాశాన్ని , జీసస్ గురించి తెలియని , వినని అతని సమకాలీకులకూ , మరియూ క్రీస్తు గురించి యేమీ తెలియక , ఈ యుగములోనే బతుకుతున్న కోటానుకోట్ల మంది ప్రజలకూ కూడా ముక్తికి అవకాశమే లేకుండా పొమ్మనవలసి వస్తుంది. 

సృష్టి మొదలైన అనేక యుగాల తరువాత ,  అకస్మాత్తుగా ఏదో ఒకరోజు  జ్ఞానోదయమై తెలివితెచ్చుకొని , మానవ కులానికంతటికీ  ముక్తికి సాధనమైన మార్గము ఇదీ ...అంటూ భగవంతుడు  ఒక ధర్మాన్ని విధించినాడా ? అది భగవంతుని లక్షణము కాదని  మీరు గమనించలేదా ?  అలాగచేయుట భగవంతునికి ఉచితమని భావిస్తున్నారా ? ఆ భగవంతుడు , జీసస్ పుట్టుటకు ముందే పుట్టిన వారికి కూడా ఆత్మ ఉంటుంది , ఆ ఆత్మలకు కూడా ముక్తి అవసరము అనేమాట మరచినాడా ? లేకపోతే ముక్తిసాధనమును రూపించుటలో అతడు జాగ్రత్త వహించినాడా ? అలాగ జాగ్రత్త వహించి ఉంటే , అతని ముక్తి సాధనము , ’ ముందు ముందు ఎప్పుడో జనించబోయే జీసస్ పైన నమ్మకము దానికి అత్యవసరము ’  అనే నియమానికి అది లోబడి ఉండుట సాధ్యము కాదు కదా ? కాబట్టి , సృష్టికి ఆదికాలములోనే మొట్టమొదటి వ్యక్తిని  పుట్టించినపుడే , ఆ వ్యక్తికి ముక్తి సాధనమును కూడా కల్పించియే ఉండవలెను. దీన్నే వైచారిక నిరూపణ అంటారు. 
ఎందుకంటే ఆ మొట్టమొదటి మానవుడికి కూడా మోక్షపు అవసరము ఉంటుంది. అందుకే మేము , వేదము మరియూ మొట్టమొదటి మానవుడు [ హిరణ్యగర్భుడు ] ఇద్దరూ కూడా ప్రారంభము నుండే కలిసే ఉన్నారని నమ్మేది. కలిసే ఉన్నారు అంటే ఒకేసారి సృష్టించ బడినారు అని అర్థము కాదు. సృష్టికి ఆరంభమే లేదు. అంతా అనాది అనేది మా నమ్మకము. [ శాస్త్ర ప్రక్రియల అధికరణముల మూలముగా ఈ మాటను ఋజువు చేయవచ్చు ] . ఇవి కలిసే ఉన్నాయి అంటే , భగవంతుని చేత అవి రెండూ ఏకకాలములో వ్యక్తమైనాయి అని అర్థము. [ వేదపు మూలమును , అపౌరుషేయత్వమును అర్థము చేసుకొనవలెనంటే మీమాంసా శాస్త్రమును చదివితే చాలు ] . మొత్తానికి సృష్టి తరువాత " భగవంతుడు కాని " ఎవరో ఒక వ్యక్తి లేదా బోధకుడి ద్వారా తన ప్రారంభాన్ని పొందిన యే ధర్మమైనా దోషపూరితము మరియూ అశాశ్వతము కూడా. 

మిస్టర్ " ఎ ":- " అర్థమయినది.. అయితే మానవుడు ముక్తిసాధనమును లేదా ధర్మమును స్వతః తనంత తానే కనుక్కొనుటకు అసమర్థుడు , అతడికి ఇతరుల సహాయము లేనిదే అది జరగదు అని మీరే చెప్పుచున్నారు కదా .. అటువంటి సహాయాన్ని మానవుడికి ఇచ్చినవారు దేవుడే కావచ్చు లేదా ఇంకెవరైనా కావచ్చు .. కాదంటారా ? "

గురువులు :- " అలాగ ఇతరులనుండీ సహాయము తెచ్చుకొనుటకు , మానవునికి తాను పొందవలసిన ఒకానొక ’ వస్తువు ’ లేదా ’ లక్ష్యము ’ అనేది ఒకటి ఉంది అన్న అవగాహన ఉండవలెను. అటువంటి వస్తువు యొక్క ’ నిజానుభవము ’ పొందినపుడు మాత్రమే అటువంటి వస్తువు ఉంది అని అతడు తెలుసుకొనుటకు సాధ్యము. అటువంటి లక్ష్యము గురించి అవగాహన లేకుండా ఆ ప్రయత్నము ఎలాగ ప్రారంభమవుతుంది " 

అదీకాక , ఒకటోది---నిర్దిష్ట సాధనము ఒకటి ముక్తికి ఖచ్చితముగా తీసుకొని పోగలదు అని ఒకడికి అవగతము కావలెనంటే , అతడు దానిని మొదటే అవలంబించి , అనుసరించి ఉండవలెను. దీనిని ఒప్పుకుంటే , ఒక వ్యక్తి తాను అనుసరించి సఫలము కాకముందే ఆ మార్గాన్ని ఎలా ఎరుగును ? అనే ప్రశ్న ఉద్భవిస్తుంది.

లేదా , రెండోది--- ఆ వ్యక్తి సర్వజ్ఞత్వము వలన , ’ లక్ష్యము ’ మరియూ ’ సాధనా మార్గము ’ రెంటినీ ఏకకాలములో చూడగల సామర్థ్యము పొందిన వాడై ఉండాలి.. దీనిని ఒప్పుకుంటే , అతడు తనలో ఇంతకు ముందు లేని సర్వజ్ఞత్వాన్ని ఎక్కడ నుండీ , ఎలాగ పొందినాడు ? అనే ఆటంకము వస్తుంది..

కాబట్టి , మూడోది--- అతడు , తానే సాక్షాత్తూ ’ లక్ష్యము ’ అయి ఉండి , తనను పొందే విధానమును ఈ జగత్తుకు బోధించవలెను. అటువంటి వ్యక్తి మనకు ఎవరూ సాక్షాత్కారము కాలేదు... అయితే ,

శృతి లేదా ’ వేదము ’ మోక్షపు దారిని మనకు చూపిస్తుంది కాబట్టి , ఆ వేదము తన మూలాన్ని భగవంతుడిలోనే కలిగి ఉన్నది అనే ఈ మూడోదాన్ని మాత్రమే మనము తార్కికముగా ఒప్పుకోవలసి వస్తుంది.  [ సామాన్య ఇంద్రియాలూ మరియూ మనోబుద్ధుల అనుభవపు పరిధిని దాటితే కలిగే ఈ జ్ఞానమే శృతి లేదా వేదము అని పిలువబడుతుంది ].

మిస్టర్ " ఎ ":- " మోక్షాన్ని , దైవాన్నీ తెలుసుకొనుట కష్టము కావచ్చు . అదే కాక , దానిని తెలుసుకొనుటకు ఒకడికి , అది తెలిసిన మరొకడి మార్గదర్శనపు అవసరమూ ఉండవచ్చు. కానీ అతడికి మోక్షము అనే దొకటి ఉండవచ్చు అనే అవగాహన కలుగుటకు శృతి యొక్క సహాయమేమీ అవసరము లేదు కదా ? మన బుద్ధి శక్తి నుండే మనము దానిని ఊహించవచ్చు కదా ? "

గురువులు :- భగవంతుడి అస్తిత్వమును అంత స్వతంత్రముగా , మరియూ సులభముగా ఊహించగలిగితే , ప్రపంచములోనున్న నాస్తికుల గురించి ఏమి చెపుతారు ? మీకన్నా వారి ఆలోచనా పటిమ , విచార శక్తి తక్కువ స్థాయి లోనిది అనేది మీ అభిప్రాయమా ? భగవంతుడి అస్తిత్వము గురించి ఆలోచించే లక్ష్యాన్ని తీసుకొని ఆ ప్రయత్నములో విఫలమై , దేవుడు లేడు అనే వారు కూడా అసామాన్య బుద్ధిశక్తితో కూడి ఉంటారు. వారి వైఫల్యానికి వారి బుద్ధి , మేధస్సులలోని దోషము కాదు కారణము. " భగవంతుడు మూలతః విచారమునకు నిలుచు వాడు , దొరకువాడూ కాదు " అనేదే దానికి కారణము. ఒక వేళ అలాగ తర్కముతో భగవంతుడిని  ఊహించగలిగితే , అలాగ ఊహకు నిలచు " దైవము ’ లేదా ’ మోక్షము ’ అనే వస్తువొకటి ఉంది అని మీకెవరు చెప్పినారు ? అనే ప్రశ్న వస్తుంది. దైవాన్ని గురించి తర్కించుటకు , లేదా ఊహించుటకు మొదట మీరు ఖచ్చితముగా దైవాన్ని గురించి తెలిపే ఏదో ఒక మూలము నుండీ దానిని గురించి వినియే ఉండవలెను. ఆ మూలమును అవలంబించియే ఉండవలెను. ’ దేవుడున్నాడు ’ అని ఎవరో ఒకరు చెప్పిన తరువాతే  , ఆ మాటను ఒప్పుకొనుటకో లేక విమర్శించుటకో మీరు మీ బుద్ధి శక్తిని , విచార మాధ్యమమునూ ఉపయోగించుటకు సాధ్య పడేది.. దేవుడి గురించి మీరు విననే లేదన్నప్పుడు , మీ బుద్ధిశక్తి ఆవైపు మళ్ళే ప్రసక్తే ఉండదు. 
"

మిస్టర్ " ఎ ":- " నా బుద్ధిశక్తిని ఉపయోగించే ముందు నేను దేవుడి గురించి వినియే ఉండవలెను అనేదేమీ లేదు. ’ దేవుడు ’ అనే పదము మనసులో లేకుండవచ్చు , కానీ , సతతమూ మార్పు చెందుతున్న ఈ జగత్తుయొక్క నేపధ్యములో ఉన్న నిత్యముగనూ , అవికారముగనూ ఉన్న వస్తువొకటి ఉంది అనేది సహజముగానే నా బుద్ధికి గోచరిస్తుంది . "

గురువులు :- కొంచము వివరించండి 

మిస్టర్ " ఎ ":- " జగత్తులో చీకటి- వెలుగు , చైతన్యము- జడత్వము , సుఖము-దుఃఖము , చావు-పుట్టుక మొదలగు అనేక వైరుధ్యములను --లేక ద్వంద్వములను నిర్లక్ష్యము చేయుటకు లేదు. నా ఊహ ఇలాగ ఉంటుంది.... ’ జగత్తులో మార్పులు ఉన్నట్లే , దానికి విరుద్ధముగా , మార్పు పొందని, వికారము లేని వస్తువొకటి జగత్తు నేపధ్యములో ఉండవలెను. ప్రతి క్షణమూ , ప్రతి వస్తువూ నాశము పొందునట్లే , ఆ నాశపు వెనకాల నాశ రహితమైన వస్తువొకటి ఉండే తీరవలెను. ఇలాగ నేను , అనేకము , అనిత్యము , అసమరూపము మరియూ వికారమూ అయిన వస్తువుల ఆధారముతో , ఏకము , నిత్యము , సమరూపమూ మరియూ అవికారమూ అగు వస్తువును తర్కిస్తాను. నా ఈ విధమైన ఊహ జగత్తులోని అన్ని వస్తువులకూ అన్వయిస్తుంది కూడా". 

గురువులు :- " అలాగైతే , ఉదాహరణకు , " గుర్రము " అనే వస్తువు యొక్క విరుద్ధ వస్తువు ఏది ? గుర్రము అనేది ఇంద్రియములకు గోచరమగు ఒక భావాత్మకమైన విషయము. కాబట్టి , దానికి విరుద్ధమైన అస్తిత్వాన్ని ఊహించుటకు మీకు సాధ్యము కావలెను కదా ? ఆ విరుద్ధ వస్తువు ఏది ? నా ప్రశ్న కొంచము అసంగతముగా కనపడవచ్చు.. కానీ మీ సందేహాలను తీర్చుటకు దీనికి ఉత్తరము ఇవ్వవలసిన అవసరముంది".

మిస్టర్ " ఎ ":- " గుర్రానికి " అగుర్రము " లేదా గుర్రము లేకుండుటే దానికి విరుద్ధము. 

గురువులు :- సరిగ్గా చెప్పినారు.. అయితే ఈ " అగుర్రము " ఒక భావాత్మక నైజ వస్తువా ? లేక నిషేధాత్మక మిథ్యా వస్తువా ? " అదొక జంతువా లేక మీ ఈ ’ అగుర్రపు ’  కల్పన జగత్తులోని మిగిలిన [ గుర్రము తప్ప ] అన్ని వస్తువులనూ తనలో కలిగి ఉన్నదా ? "

మిస్టర్ " ఎ ":- " ఖచ్చితముగా చెప్పవలెనంటే అది జగత్తులోని ఇతర అన్ని వస్తువులనూ తనలో కలిగి ఉన్నది.. ఆ అర్థములో ఒక రాయి కూడా ’ అగుర్రము ’ అవుతుంది. కానీ మేము అన్వయిస్తున్న నిషేధము కేవలము గుర్రానికి సంబంధించి నందువల్ల ’ అగుర్రము ’ అనేది ఒక భావాత్మక వస్తువనే చెప్పవలెను. అనగా , గుర్రము లోనున్న " అశ్వత్వము " అనే విశేషణమును దాని విరుద్ధములో నిషేధించుట చాలు అనుకుంటాను. అంటే అగుర్రములో అశ్వత్వము ఉండదు.. కాబట్టి అగుర్రమంటే గుర్రము కాని ప్రాణి అనవచ్చు. "

గురువులు :- " అంటే ఒక వస్తువు యొక్క విరుద్ధము , ఆ వస్తువుయొక్క వర్గానికే చెందినది.. అయితే ఆ వస్తువు పొందిఉండే ఏదో ఒక విశేషణపు విషయములో మాత్రము వస్తువుకన్నా భిన్నముగా ఉంటుంది.. అంతే కదా ? ఇంకా స్పష్టముగా చెప్పాలంటే , ఆ వస్తువుకు , ప్రపంచములోని వేరే యే వస్తువుకూ " సంపూర్ణమైన " విరోధము అనేదే ఉండదు. విరోధము యేమున్ననూ ’ విశేషణము ’ మాత్రమే. అంటే  ఒక వస్తువులో ఉన్న , మరియూ ఇంకో వస్తువులో లేని " విశేషణమే " మనలను అవి రెండూ " పరస్పర విరుద్ధ " ములు అని అనుకునేటట్టు చేస్తుంది. అవునా ? 

మిస్టర్ " ఎ ":- " అవును " 

గురువులు :- అయితే , ఉదాహరణకు , మీరు చెప్పిన  పరస్పర విరుద్ధాలైన చీకటి వెలుగులను తీసుకుందాము. రెంటికీ ఉన్న విశేషణము ఏమంటే , కాంతి యొక్క ఎక్కువ తక్కువలు. అయితే  వెలుగు యొక్క తీక్ష్ణతను మనము చీకటి యొక్క దృష్టికోణము నుండీ చూచుటకు సాధ్యము.. అలాగే , చీకటిని వెలుగు యొక్క మానిని తో కొలుచుటకు సాధ్యము.  అలాగ సాధ్యమయినపుడు , కాంతి యొక్క ఎక్కువ తక్కువలు రెంటిలోనూ ఉంటాయి కాబట్టి అవి ఒకదానికొకటి విరోధములు కావు.  ఇలాగ చీకటి వెలుగులు సంపూర్ణ విరోధములు కాకపోగా , పరస్పర సాపేక్ష వస్తువులుగా పరిణమించి మీ వైరుధ్య సిద్ధాంతము వీగిపోతుంది. 

తర్కపు ఎల్ల [ సీమ ] గురించి మీరు తప్పుగా అర్థము చేసుకున్నా రనిపిస్తుంది. నేను మొదటే చెప్పినట్లు , " తర్కించతగిన వస్తువు ఒకటుంది " అన్న పూర్వ జ్ఞానము లేకుండా తర్కపు ప్రక్రియయే ప్రారంభము కాదు. .. తన జీవితములో ఎన్నడూ మంటను కనీ , వినని వాడు , దూరమునుండీ పొగను చూడగనే అక్కడ దానికింద మంటకానీ నిప్పు కానీ ఉందని ఊహించలేడు. అలాగ ఊహించవలెనంటే అతడు దానికి ముందు ఒకసారైననూ అగ్గిని చుసి ఉండవలెను మరియూ దానినుండీ పొగ వెలువడడము అతడికి తెలిసియే ఉండవలెను. 

దీనిని ఇంకో రకంగా చెప్పాలంటే , నిప్పును ఎన్నడూ చూడని వాడికి , పొగయే సత్యము. అగ్గి కాదు. " గోచరమవుచున్న వస్తువు నిరపేక్షము కాదు. అది తన అస్తిత్వానికి ఇంకొక వస్తువు పై ఆధారపడి ఉంది." అని మొదటే మీకు తెలియక పోతే , ఆ వస్తువు వెనుక ఉండే మరొక వస్తువును తెలుసుకోవలెను అన్న ఆసక్తే మీకు కలగదు. అలాగే , మనము ’ అవికారమైన " వస్తువు గురించి విని ఉండకపోతే మనము ప్రపంచాన్ని , అది మన ఇంద్రియాలకు గోచరించే రీతిలోనే గ్రహిస్తాము. ఈ వికారి యైన జగత్తే మనకు అంతిమ సత్యముగా కనబడుతుంటుంది. అట్టి జగత్తే అందరి ఇంద్రియాలకూ గోచరమగుట వలన దాని ఉనికి గురించి పెద్ద వివరణ అవసరము లేదు. మార్పు చెందే దానిలో చెప్పడానికి ఏముంటుంది ? వికారమే దాని స్వభావము. తన ఆ ’ స్వభావాన్ని ’ అది పోగొట్టుకుంటే అది " ప్రపంచము " అనిపించుకోదు. మనకు  అవికారి అయిన వస్తువుయొక్క పూర్వ జ్ఞానమున్నపుడు మాత్రమే దానికీ , మరియూ ఈ జగత్తుకూ ఉన్న సంబంధమును మనము ఋజువు చేయవచ్చు. అవికార వస్తువు యొక్క అస్తిత్వాన్ని తెలిపి  దాని ద్వారా మనలను విచారపు జాడలోకి వెళ్ళుటకు ప్రేరేపించుటకు మనకు వేదపు అవసరము ఉంది. తర్కము , విచారము , బుద్ధి , యుక్తి/లేదా అనుమానము --ఇవన్నీ ఈ విషయములో సహకారులైననూ , శృతి యొక్క సురక్షిత మార్గ దర్శనము లేక , కేవలము తర్కాన్ని మాత్రమే ఆశ్రయిస్తే చీకట్లో వెదుకులాటే అవుతుంది.
అదీ కాక , " ఈ జగత్తులోని ప్రతీ వస్తువూ వికారానికి లోనవుతుంది " అన్న ఇంద్రియ గోచరమైన విషయపు ఆధారముతో మీరు ఇంకదేన్నో తర్కించుటకు మొదలు పెట్టితే , మీ ఆ తర్కము ఈ [కింది] విధముగా ఉంటుంది...

" ఈ జగత్తులోని ప్రతీ వస్తువూ వికారానికి లోనవుతుంది " కాబట్టి దాని నేపథ్యములో ఉండే ఇంకే వస్తువైనా వికారియే ..--అనుకుంటే , మీ అనుభవము మీకు , ’ ఉన్నదంతా వికారము చెందేదే ’ అని చెప్పినపుడు , మీ తర్కము , వికారి కాని ఇంకో వస్తువు గురించీ తెలుపుటకు సాధ్యము లేదు. అదేకాక , ఆ ’ ఇంకో వస్తువు ’ కూడా ఇంద్రియ ప్రపంచము వలెనే వికారి.... అని ఆ తర్కము చెబుతుంది. అలాగ ,ఆ  తర్కముతో మీరు ఎక్కడెక్కడికి వెళ్ళిననూ ఇంద్రియ విషయములనుండీ తప్పించుకొనుటకు సాధ్యము కాదు. ఎందుకంటే మీ తర్కము ఆ ఇంద్రియ గ్రాహ్య విషయముల వ్యాప్తిలో మాత్రమే తిరుగుతుంటుంది...[ అంటే అది ఇంద్రియముల ద్వారా పొందిన జ్ఞానపు ఆధారము మీదే నిలచిఉంటుంది.] 
ఒకవేళ మీకు అదృష్టముంటే  మీ తర్కము మిమ్మల్ని " అవికారి అయిన ఏదో ఒక వస్తువు ఉండవచ్చు " అనే స్థాయి వరకూ తీసుకు వెళ్ళవచ్చే గానీ " అటువంటి వస్తువు ఒకటుంది " అని చెప్పజాలదు. 

మిస్టర్ " ఎ ":-" శృతి అపౌరుషేయము " వేదమే ప్రపంచపు అన్ని ధర్మాలకూ మూలము [ వేదోఽఖిలో ధర్మ మూలం ] అనే మాట కేవలము ఉత్ప్రేక్ష అనీ , అతిశయమనీ నేను ఇన్ని రోజులూ భావిస్తూ వచ్చినాను. దాని గురించి ఇటువంటి వివరణను నేను ఇంతవరకు వినే ఉండలేదు. ఈ వివరణ ఇచ్చినందుకు మీకు నేను ఋణపడిఉన్నాను. 

కానీ నా మొదటి సమస్యే మళ్ళీ ఉద్భవిస్తుంది కదా ? వాస్తవానికి ఈ ప్రపంచములో అనేక ధర్మాలున్నాయి. అవన్నీ కూడా  ’ మనిషిని వెలుగుకు తెచ్చేది తమ ధర్మము ఒకటే " అంటూ తమకు తామే ఘోషించుకుంటాయి. అలాగ పరస్పర విరోధములైన ఆ అనేక ధర్మాల ఔచిత్యాన్ని గురించిన నా మొదటి ప్రశ్న పరిహారము దొరకకనే అలాగే ఉండిపోయింది కదా ? "

గురువులు :- " ఈ వైవిధ్యము ’ అధికార తత్త్వము ’ పైన నిలచి ఉందిఅని నేను మీకు మొదటే చెప్పినాను. వాస్తవానికి అధికారమే మానవుని చర్యలను నియంత్రించేది. ఈ అధికారములో వివిధ మెట్లున్నాయి. వాటికి అనుసారముగనే వివిధ ధర్మాలున్నాయి "

మిస్టర్ " ఎ ":-" అర్థమయినది. అయితే ఏ ధర్మము కూడా తనను ఒక నిర్దిష్టమైన స్థాయిలోని ప్రజలకు పరిమితము చేసుకొనుటకు సిద్ధముగా లేదు. ప్రతియొక్క ధర్మమూ తనను ప్రపంచములోని అత్యంత శ్రేష్ఠమైన ధర్మముగా పరిగణించుకొంటుంది"

గురువులు :- " బాలకుడు ఒకడికి, ఒకే సమయములో నలుగురు మనుషులు నాలుగు రకాలైన ఆదేశాలను ఇచ్చినారనుకుందాము... ఒకరు " దీపం వెలిగించు " అంటే , మరొకరు , " వత్తిని సరిచేయి " అంటారు. మూడోవాడు ," నూనె నింపు " అంటే , నాలుగవ వాడు, " దీపము ఆర్పు " అంటాడు. ఇటువంటి పరిస్థితిలో బాలకునికి ఏమి చేయాలో తోచదు. వాడికి ఈ నాలుగు పనులనూ ఏకకాలములో చేయుటకు సాధ్యము కాదు. కానీ ఆ నలుగురూ తన ఆజ్ఞనే పాలించమని బెదిరించో , వత్తిడి చేసో చెబుతారు. అప్పుడు ఆ అర్భకుడు ఏమి చేయవలెను ? అదే సమయములో , ఐదో వాడొకడొచ్చి " ఒక కత్తిని తీసుకొని రా " అని చెబితే , అప్పటికే ఉన్న నాలుగు ఆజ్ఞలకు తోడు మరోదాన్ని కలిపినట్టవుతుంది. పరస్పర విరోధములైన ఆజ్ఞల వలన బాలకుని మనసు అప్పటికే అయోమయమును పొంది ఉంటుంది. వాడిప్పుడు , నాలుగింటికి బదులు , ఐదింటిలో ఒకదాన్ని ఎంచుకోవలసి వస్తుంది. ఈ ఐదోవాడి ఆగమనము వలన ఆ బాలకుని అయోమయము తగ్గక పోగా , మరింత ఎక్కువవుతుంది. అయితే , ఆ ఐదోవాడు ఆ పిల్లవాడిమీద కనికరము కలిగి , పిల్లవాణ్ణి ఇరకాటమునుండీ తప్పించవలెను అనిపిస్తే , మరియూ ఆ పిల్లవాడు కూడా ఆ ఐదోవాడిపై , మిగిలిన నలుగురిపై చూపిన శ్రద్ధ కన్నా ఎక్కువ శ్రద్ధ చూపినపుడు , " కత్తి మాత్రము తీసుకొని రా , మిగిలిన వారి ఆజ్ఞలను పాలించ వలసిన అవసరము లేదు " అని గట్టిగా చెప్పవలసి ఉంటుంది. అనగా , అప్పటికే అయోమయములో ఇరుక్కున్న బాలకునికి మార్గదర్శనము చూపించుటకు ఆ ఐదోవాడు తన ఆజ్ఞ  తప్ప ఇతరుల యే ఆజ్ఞ కూడా పాలించుటకు యోగ్యము కాదు అని చెప్పవలసి ఉంటుంది. శ్రద్ధతో తనను ఆశ్రయించిన సాధకునికి మార్గదర్శనము నివ్వవలె ననుకునే ఏ గురువైనా , [ శిష్యుని పై కనికరముతో అతడి అయోమయమును నివారించుటకు , సమయము వ్యర్థము కాకుండా తప్పించుటకు ]  " ఇతరుల ఆదేశాలను పట్టించుకోక నేను చెప్పినట్లు మాత్రమే చేస్తే చాలు " అనవలసి ఉంటుంది. 

మిస్టర్ " ఎ ":- " కానీ ఆ ధర్మ ప్రవర్తకులు , మత ప్రవర్తకులూ తమ దగ్గరికి వచ్చు వారి యోగ్యత , సందర్భము లకు అనుసారముగా తమ బోధనలను చేసినారు. ఇంకోరీతిలో చెప్పాలంటే , స్వతః నిరపేక్ష సత్యమును తెలిసినవారై ఉండి కూడా వారు జనులకు సాపేక్షమైన సత్యమును మాత్రమును చెప్పేవారు. జనులకు ఏమి బోధించవలెను అనుదాన్ని నిర్ధారించుటలో వారు సత్య నిష్ఠ కన్నా ఎక్కువగా అనుకూల / అవకాశ వాదాన్ని అనుసరించినారు... కాదా ? "

గురువులు :- " వారు జనుల అవసరాలనూ , అర్హతలనూ గమనములో ఉంచుకొని ఆ విధముగా చేసినారు. [ సత్యమును దాచిపెట్టే ఉద్దేశముతో కాదు ] . నేను మొదటే చెప్పినట్టు చన్నీరు ఆరోగ్యవంతుడి దాహాన్ని తీరిస్తే , జ్వరపీడితుడైన వాడి రోగాన్ని అది ఎక్కువ చేస్తుంది. వైద్యుడొకడు , ఒకడికి చన్నీటిని తాగమని చెప్పి , మరొకడికి దాన్ని నిషేధిస్తే ఆ వైద్యుడిని పక్షపాతి లేదా మోసగాడు అనవచ్చునా ? ఒక వ్యక్తి ఆయాసాన్నీ దప్పికనూ పరిహరించి , మరొకడి రోగాన్ని ఎక్కువ చేసిందంటూ నీటిని కూడా దూషించలేము. "

మిస్టర్ " ఎ ":- " అయితే , ఒక ’ గురువు ’ బోధించే సత్యము [ ధర్మము ] సాపేక్షమో నిరపేక్షమో తెలుసుకొనుట ఎలాగ ? 

గురువులు :- " దానిని మీరు ఎందుకు తెలుసుకోవలెను ? మీ ఉద్దేశము , జగత్తులోనున్న గురువులలో నున్న ఉచ్చ-నీచాల అంతరాలను కొలవడమా ? లేక మీ బ్రతుకు నియంత్రణ ద్వారా ’ సుఖ శాంతులను పొందు మార్గాన్ని ’ తెలుసుకొనుటా ? "
మిస్టర్ " ఎ ":- " నా ఉద్దేశము రెండూ అయి ఉంది. ఏ గురువు లేక ధర్మము ’ సత్యానికి ’ సమీపముగా ఉంది ? అనేది మొదట నేను తెలుసుకోవలెను. అది తెలుసుకున్న తరువాతే ఆ ధర్మపు , మరియూ ఆ గురువుయొక్క బోధనకు అనుగుణముగా నేను నా బ్రతుకును మార్చుకొనుటకు సాధ్యము " 

గురువులు :- " ఇద్దరు వ్యక్తుల సామర్థ్యమును పరీక్షించి పోల్చాలనుకొనే వ్యక్తి , ఆ ఇద్దరు వ్యక్తులకన్నా ఎక్కువ సామర్థ్యమును పొంది ఉండవలెను. అలాగ లేకుంటే ,  వారిలోనున్న అనేక దోషములు ఆ పరీక్షించేవాడి గమనానికే రావు. క్రీస్తు , మహమ్మద్ , బుద్ధుడు మొదలగు మత ప్రవర్తకుల బుద్ధి సామర్థ్యములను నిర్ణయించ గలిగేటంతటి  బుద్ధి సామర్థ్యములను మీకు దేవుడు కరుణించినాడు అని మీరు భావిస్తున్నారా ? రెండు ధర్మాలలో ఏది శ్రేష్ఠము అని తెలుసుకోవలెనంటే ఆ రెంటినీ కూలంకషముగా అధ్యయనము చేయవలసి ఉంటుంది. రెండు ధర్మాల సంగతి అటుంచుదాము , ఒకే ఒక ధర్మాన్నయినా మీరు సంపూర్ణముగా తెలుసుకున్నారా ? మన జీవితము , ధర్మపు ఒకే ఒక్క మెట్టును కూడా అర్థము చేసుకొనునంతటి దీర్ఘమైనది కాదు. [ ఆయుష్షు చాలదు ] అలాగున్నపుడు , మీ ’ అన్ని ధర్మాల  అధ్యయనము ’ ముగిసిన తరువాత , మీరు ఒప్పుకొన్న ఏదో ఒకధర్మాన్ని కార్య రూపానికి తెచ్చుటకు మీ వద్ద సమయము ఉంటుందా ? "

మిస్టర్ " ఎ ":-" మరి అలాగయితే , మీరు ఇప్పుడు నాకు ఇవ్వబోయే అనుష్ఠాన యోగ్యమైన ఉపదేశము ఏమిటి ? నేనేమి చేయవలెను ? "

గురువులు :- " మీరు దేవుడిని నమ్ముతారు కదా ? "

మిస్టర్ " ఎ ":-" అవును , నమ్ముతాను "

గురువులు :- " ఆ దేవుడు సర్వజ్ఞుడు [ సర్వమూ తెలిసిన వాడు ] అని నమ్ముతారా ?"

మిస్టర్ " ఎ ":- " ఖచ్చితముగా నమ్ముతాను "

గురువులు :- " జగత్తులో జరిగే అన్ని సంఘటనల లోనూ ఆతడి సర్వజ్ఞత్వము ప్రకటమవుతుంది అనేదాన్ని ఎప్పుడైనా తెలుసుకున్నారా ? " 

మిస్టర్ " ఎ ":- " అవును నేను గమనించినాను "

గురువులు :- " అలాగయితే ఆ సర్వజ్ఞత్వము మీ జీవితములో కూడా వ్యక్తమయినది... ఔనంటారా కాదా ? "

మిస్టర్ " ఎ ":-" ఔను " 

గురువులు :- " మిమ్మల్ని పుట్టించుటలో భగవంతుడికి ఒక ఉద్దేశము , అది కూడా సదుద్దేశమే అయి ఉండవలెను కదా ? "

మిస్టర్ " ఎ ":- " ఔను. ఈ జగత్తులో జరిగే యే ఘటన కూడా అనుకోకుండా యాదృచ్చికముగా జరిగినది కాదు అనేది నా దృష్టికి వచ్చింది "

గురువులు :- " అలాగయితే , భగవంతుని దృష్టిలో క్రైస్తవ ధర్మము మాత్రమే మీ అర్హతకు సరిగ్గా అలవడుతుంది. క్రైస్తవులైన దంపతుల కడుపున మీరు పుట్టిన దాని వెనుక ఉండే ఉద్దేశపు వివరణను  ఎంచే పని లేదు. మనము పాలించవలసిన ధర్మమును గురించి మనము భగవంతుని నిర్ణయములో విశ్వాసము నుంచుటయే మంచిది. మన మార్గాన్ని నిర్ణయించుటకు మన అల్ప బుద్ధికి సాధ్యము కాదన్నది ఆతడికి తెలుసు. కాబట్టి ఆతడే మన మార్గాన్ని నిర్ధారించే బరువు ఎత్తుకున్నాడు. మన మనోభావాలకు సరిగ్గా సరిపోయే దేశము , కాలము , పరిసరములు మరియూ ధర్మములో మనకు జన్మనిచ్చినాడు. ఆతడు ఈ విధముగా మనమీద కరుణతో , మన అనుకూలము కోసమై చేసిన యోజనను మనము ఎందుకు తిరస్కరించవలెను ? " వివిధ ధర్మాల తులనాత్మక అధ్యయనము " అనే అసాధ్యపు సాహసానికి ఒడిగట్టి సమయాన్ని ఎందుకు పాడు చేసుకోవలెను ? "

మిస్టర్ " ఎ ":- " క్రైస్తవ ధర్మాన్ని అర్థము చేసుకొనుటకూ , మరియూ దాన్ని అనుసరించుటకూ నేను సాధ్యమయినంత శ్రమించినాను. కానీ మరలా మరలా సందేహాలు కలుగుతుంటాయి. వాటిని పరిష్కరించగల వ్యక్తులను సంధించుటలో విఫలుడనైనాను. ఆ కారణము చేతనే నేను నా దృష్టిని ఇతర ధర్మాల వైపు సారించినాను. "

గురువులు :- " కేవలము ధర్మాన్ని అధ్యయనము చేసిన పండితులను  సంధిస్తే ప్రయోజనము లేదు. తమ దైనందిన జీవితములో ధర్మాన్ని కార్య రూపానికి తెచ్చుకున్న వారిని , ధర్మాన్ని జీవితములో అలవరచుకొన్న వారిని కలిసేవరకూ మీకు ధర్మపు సందేహాలను పరిష్కరించుకొనుటకు సాధ్యమే కాదు. లౌకిక ప్రయోజనాల కోసము మీరు సముద్రాలనూ , ఆకాశాన్నీ దాటుటకు సిద్ధముగా ఉంటారు. కానీ సత్యాన్ని గురించిన సందేహాలను పరిహరించే గురువులు మీ ఇంటివాకిలికే రావాలని కోరుకుంటారు.  " ధర్మము అనేది బ్రతుకులో ఒక ఆసక్తికరమైన అంశము " అనే  మీ భావన మొదట మార్చుకోవలెను. ఎప్పుడైతే మీరు , " ధర్మమనేది బ్రతుకు యొక్క ఒక అంగము మాత్రము కాదు ,  అది పూర్తీ బతుకే అయిఉంది " అని తెలుసుకుంటారో , అప్పుడు మాత్రము మీరు సరియైన గురువులను వెదుకుతారు. అంతవరకూ అటువంటి అనివార్యత కనబడదు.  ఆ అవగాహన వచ్చిన తరువాత వెదుకులాట తీవ్రమవుతుంది . గురువు కూడా దొరకనే దొరుకుతాడు. ఎందుకంటే గురువు ఎప్పుడూ సిద్ధముగనే ఉంటాడు. మన పరిసరాల్లోనే ఉంటాడు. అయితే మనలో జ్ఞానపు ఆకలి తీవ్రమై , మనము ప్రామాణికముగా వెతుకు వరకూ అతడు దొరకడు. కంటికి కనబడినా తెలుసుకోలేము. క్రైస్తవ ధర్మములో అటువంటి గురువులు లేరు అనే మాటను మేము ఒప్పుకోము. అటువంటివారు జనసందడితోనున్న ఈ ప్రపంచములో మీ పరిసరాల్లోనే ఉండవచ్చును. గమనానికి రాలేదు. ఎందుకంటే అటువంటివారు ఈ జగత్తుకు అవసరము లేదు. వారికీ ఈ జగత్తుయొక్క గుర్తింపు అవసరము లేదు. ఆ గుర్తింపు వల్ల వారికి యే ప్రయోజనమూ లేదు. కాబట్టి మీరు అటువంటి గురువును మీ పరిసరాల్లోనే వెదకండి. " దయతో నా సందేహాలను తీర్చండి " అని వినమ్రులై వేడుకోండి. ఆ క్షణములోనే వారు మీ సందేహాలన్నిటినీ దూరము చేస్తారు. క్రమేణా , ’ క్రైస్తవ తల్లిదండ్రులకే మీరు ఎందుకు పుట్టినారు , దానిలో భగవంతుని ఉద్దేశమేమి అనేది మీకే అర్థమవుతుంది.. "

మిస్టర్ " ఎ ":-" మీ కృపాపూరితమైన ఉపదేశానికి నేను తమకు ఎంత నమస్కరించిననూ తక్కువే. దయచేసి ఈ ఒక్క మాటను చెప్పుటకు నాకు అనుమతినివ్వండి ,.. నేను ఇక్కడికి వచ్చునపుడు , నేను మొదటికన్నా ఉత్తమ క్రైస్తవుడిని కావలెను అన్న ఉద్దేశాన్ని పొంది ఉండలేదు. నా అభిలాష , హిందువుగా మారవలెనని ఉండినది. అయితే తమరి ఉపదేశము నన్ను ఇంకా ఉత్తమమైన క్రైస్తవుడిగా అగుటకు ఉపయోగపడుతుంది. క్రైస్తవుడిని ఉత్తమ  క్రైస్తవుడిగాను , ముసల్మానును ఇంకా ఉత్తమ ముసల్మాను గానూ , హిందువును ఇంకా ఉత్తమ హిందువుగానూ చేసే , ఇలాగ , ఆయా ధర్మపు వారిని ఆయా ధర్మాల పరిధులలోనే , ఇంకా ఉత్తములను చేయుటయే సనాతన ధర్మమయినపుడు , మీ ఈ సనాతన ధర్మము నిశ్చయముగా , నేను వెనుక భావించిన దానికన్నా విశాలమూ , గొప్పదీ అయి ఉన్నది.. మీనుండీ వీడుకొలుపుకు ముందు మరొకసారి తమ ఆశీర్వాదాన్ని వేడుకుంటున్నాను. " 

గురువులు :- " ఆశీర్వాదమునిచ్చు యోగ్యత ఉన్నది భగవంతునికి మాత్రమే. ఆతని కృపాశీర్వచనముల కోసము మనమందరమూ అతడిని ప్రార్థించవలెను. " అతడు మీకు దృఢమైన  శరీరమును మరియూ సూక్ష్మమైన బుద్ధి శక్తినీ  కరుణించినాడు " అని నేను మీకు మరొకసారి గుర్తు తెచ్చుటకు   ఇష్ట పడుతాను "

" ఒకడు అత్యుత్తమ చిత్రకారుడై ఉండి , అతడికి అత్యుత్తమ గుణముగల రంగులూ మరియూ కుంచెలు ఉండి ఉండవచ్చు.. అతడు తన కళాకృతిని రచించుటకు ఉత్తమమైన వస్తువు- విషయాన్నే ఎంచుకొని ఉండవచ్చు.. కానీ అతడు ఏ ఆధారమూ లేక కేవలము గాలిలో చిత్రాన్ని చిత్రించలేడు. చిత్రించుటకు అతడికి ఒక స్థిరమైన నేపథ్యపు అవసరము ఉంటుంది. ఆ నేపథ్యము , ఒక బట్ట , గోడ , లేక ఉపయోగము లేని ఒక మొరటు వస్తువై ఉండవచ్చు. కాబట్టి మీరు దైవదత్తమైన మీ బుద్ధిశక్తులను వివిధ ధర్మాల తులనాత్మక అధ్యయనానికి , మౌల్యముల గురించి పసలేని వ్యర్థ చర్చలకు ఉపయోగించవద్దు. ఆ బుద్ధిని మీ జన్మతః లభించిన క్రైస్తవ ధర్మపు నేపథ్యాన్ని మరింత స్థిరముగా చేసే వైపుగా తిప్పుకోండి. ఆ క్రైస్తవ నేపథ్యము పైన , సాధన అనే చిత్రము పూర్తి అయిన పిమ్మట , మీరు దాని సౌందర్యాన్ని ధ్యానించుటకు సమర్థులైనపుడు మీ దృష్టినుండీ ఆ నేపథ్యము తనంతట తానే చెరిగిపోతుంది. అయితే దానికన్నా ముందు అది సాధ్యము కాదు "  ఈ చివరి మాటను గుర్తుపెట్టుకోండి "
|| సమాప్తమ్ ||

Tuesday, January 26, 2016

శివలింగాలు- సాలగ్రామాలు

శివలింగాలు- సాలగ్రామాలు 



" శివమ్ " అంటే ’ శుభం ’ అని అర్థము. " శివ లింగము " అంటే " శుభచిహ్నము " అని అర్థము.
" లింగ పురాణము " ప్రకారము , ఒకసారి విష్ణువు , బ్రహ్మ ఇద్దరూ మాయలో పడి " నేను గొప్ప " అంటే " నేను గొప్ప " అని అహంకరించుతుండగా , శివుడు వారి ముందు ఒక అనంతమైన పొడవు గల అగ్నిస్థంభమై ప్రత్యక్షమై , ’ ఈ స్థంభపు కొనలేవో తెలుసుకున్నవారే గొప్ప ’ అంటాడు. బ్రహ్మ విష్ణువులు అది కనుగొనుటలో విఫలులై , శివుడే తమ ఇద్దరికన్నా గొప్ప అని అంగీకరిస్తారు. ఆ అగ్ని స్థంభమే " లింగము " గా పిలవబడింది. ఎందుకంటే , సర్వ ప్రాణులూ ప్రళయకాలములో ఆ స్థంభములోనే లయించి పోతాయి [ లీయతే అస్మిన్ , లేక లయం గఛ్చంతి ] 


లింగాలు ముఖ్యముగా రెండు రకాలు. అకృత్రిమ లింగాలు-- ఇవే స్వయంభూ లింగాలు , బాణ లింగాలు. అవి ప్రకృతిలో సహజ సిద్ధముగా ఏర్పడతాయి.
 రెండో రకము , " కృత్రిమమైనవి " అనగా మానవ నిర్మితమైనవి. 
ఇంకోవిధమైన విభాగము , " చల " మరియు " అచల " లింగాలు. కదిలేవి , కదలనివి. అనగా ఇళ్ళలోనూ ఉత్సవాల్లోనూ పూజించేవీ , గుళ్ళలో ప్రతిష్ఠింపబడినవీ...

ఈ లింగాలు రెండు భాగాలుగా ఉంటాయి. ఒకటి పీఠము లేక యోని... దీన్నే సోమసూత్రము అంటారు. రెండు , దానిపైన ఉన్న లింగము. శివలింగములోని అధో భాగాన్ని " బ్రహ్మ భాగము " అనీ , మధ్య భాగాన్ని " విష్ణు భాగము " అనీ , ఊర్ధ్వ భాగాన్ని " రుద్ర భాగము " అనీ అంటారు. సాధారణముగా బ్రహ్మభాగము భూమిలో పాతిపెట్టబడి ఉంటుంది.
నిర్ణయ సింధువు ప్రకారము , 
శివలింగాన్ని మనకు కావలసిన ఫలితాలను బట్టి ఎంచుకోవాలి . చర శివలింగము , అంటే ఒకేచోట స్థాపితము కానిది--మరియూ మానవ నిర్మితమైనది:-- పన్నెండు అంగుళాలకన్నా పెద్దదిగా ఉండరాదు.  రత్నము , బంగారము , వెండి , రాగి, ఇత్తడి , ఇనుము, రాతిది , కర్రది మరియూ మట్టిది-- ఇవన్నీ అదే క్రమములోనే ఒకదానికన్నా ఒకటి అధమమైనది.. అనగా రత్నముతో చేసినది అత్యుత్తమమైనది.. తర్వాత బంగారము... అలాగ. 

వీటిని తొమ్మిది నుండీ ఏడు అంగుళాల పొడవుగా చేయించుకొనుట ఉత్తమము. ఆరు , ఐదు, నాలుగు అంగుళములవి మధ్యరకాలు.  అంతకన్నా చిన్నవి అధమము. బొటనవేలికన్నా చిన్నది ఎప్పుడూ చేయించరాదు. 
వీటి ఎత్తూ , లావూ సమానముగా ఉండి , పీఠము తప్పనిసరిగా ఉండవలెను. పీఠపు ఎత్తు , లింగపు ఎత్తుకు రెట్టింపు ఉండాలి. లింగపు పైభాగపు విస్తీర్ణము ,[ లేదా వ్యాసము , లేదా కర్ణము]  లింగపు ఎత్తుతో సమానముగా ఉండాలి.ఇవి స్థూలముగా , మానవ నిర్మితమైన లింగాల కొలతలు. 

మట్టి , భస్మము , ఆవుపేడ , పిండి , రాగి, కంచు-- వీటిలో దేనితోనైనా లింగము చేయించి ఒకసారి పూజిస్తే , దేవలోకములో పదివేల కల్పములు నివసించుటకు అర్హత , యోగ్యతా సిద్ధిస్తాయి. 

కర్రతో చేసినదాన్ని ధనప్రాప్తికి పూజిస్తారు. వీటిని ఎర్ర చందనము , తుమ్మ ,బిల్వ చెక్కలతో చేస్తారు.  స్ఫటిక లింగాన్ని అన్నిరకాల కోరికలు తీరుటకు మరియూ చిత్తనైర్మల్యానికీ పూజిస్తారు. ముత్యపు లింగము పాపాలను హరిస్తుంది. 

బ్రాహ్మణులు నాలుగు లింగాలనూ , క్షత్రియులు మూడు లింగాలను , వైశ్యులు రెంటినీ , శూద్రులు ఒక లింగాన్నీ పూజించాలి. ఇంటిలో రెండు లింగాలను బ్రాహ్మణులు ఎన్నటికీ పూజించరాదు. శివ , సూర్య అర్చన లలో శంఖమును వాడకూడదు.

పగిలిన , దగ్ధమైన లింగాలను పూజింపరాదు. 

ఇక పార్థివ లింగాలు--అనగా మట్టితో కానీ బంకమట్టితో కానీ చేసిన లింగాలు. 

పార్థివ లింగపూజతో సర్వ కార్యములనూ సాధించవచ్చును. పార్థివలింగాన్ని పూజించేవాడు ఆయుష్మంతుడూ ,బలవంతుడు , శ్రీమంతుడు , పుత్రవంతుడు , ధనవంతుడు , సుఖి ఔతాడు. 

అలాగే , పేడతోను , బంగారముతోను , పట్టు వస్త్రముతోనూ చేసిన లింగాలు కూడా సర్వ కార్యాలనూ సాధించి ఇస్తాయి. 

పార్థివ లింగానికై మట్టిని తెచ్చేటప్పుడు " ఓం హరాయ నమః " అనే మంత్రాన్ని పఠించాలి.
మట్టిని కలుపుతూ లింగాన్ని చేసేటప్పుడు " మహేశ్వరాయ నమః " అని ధ్యానిస్తుండాలి. 
" శూలపాణయే నమః " అంటూ ప్రతిష్ఠ చేయాలి. 
" పినాక ధృతయే నమః " అంటూ ఆవాహన చేయాలి.
" శివాయ నమః " అంటూ స్నానము చేయించాలి.
" పశుపతయే నమః " అంటూ పూలతోను , బిల్వ పత్రాలతోను పూజించాలి.
" మహా దేవాయ నమః " అంటూ విసర్జన చేయవలెను. 
బిల్వపత్రాలు ఎండినవైననూ శుభమే. వాడినవైననూ " నమశ్శివాయ " అంటూ నీటితో కడిగి మళ్ళీ వాడవచ్చు. 
పార్థివ లింగాన్ని ఉమ్మెత్త పూలతో పూజించుట అతి శుభప్రదము. లక్ష గోవులను దానము చేసినంత ఫలాన్ని పొందుతాము. ఒకసారి తీసివేసిన రుద్రుని నిర్మాల్యాన్ని [ నిన్నటి పూజ తర్వాత వాడిన పూలను , పత్రాలను ] ముట్టుకోరాదు , తొక్కరాదు , తినరాదు. అట్లా చేస్తే వెంటనే వస్త్రాలతోపాటూ స్నానము చేయాలి. పూలను , మధ్యవేలు మరియు ఉంగరపు వేళ్ల మధ్యలో పట్టుకొని పూజించాలి. బొటన వేలు , చూపుడు వేళ్ళతో నిర్మాల్యము తీసేయాలి. నుదుట భస్మము , మెడలో రుద్రాక్షలూ లేకుండా శివపూజ చేయరాదు. పార్థివ లింగాన్ని ఎడమచేతిలో ఉంచుకొని , కుడిచేత్తో ప్రోక్షణ , పూజ చేసే వాడుక కర్నాటకలో ఉంది.  ఆంధ్రలో కూడా ఉండి ఉండవచ్చు. 

ఇక , మానవ నిర్మితము కాని--అనగా ప్రకృతిలో వాటంతట అవే సిద్ధముగా దొరికే కొన్ని లింగాల విషయము:-

సాలగ్రామములు, బాణ లింగాలు 



బాణలింగాలు పాలరాతినిపోలి ఉంటాయి. వాటిని పూజించుట వలన ఆత్మ జ్ఞానము , చిత్త నైర్మల్యము కలుగుతాయి. బాణ లింగాల విశేషత ఏమంటే వాటికి ప్రాణ ప్రతిష్ఠ చేయకనే నేరుగా పూజించి అభిషేకము చేయవచ్చును. ఇవి ఎంత చిన్నగా ఉంటే ఫలము అంత అధికము. 

కానీ ముట్టుకోకుండా ఎవరైనా పూజ చేయవచ్చును. ఇది సాలగ్రామములకు మాత్రమే వర్తిస్తుంది. మానవ నిర్మితమైన శివలింగాలకు కాదు. మణులతో చేసిన లింగాలను కూడా సర్వులూ పూజించవచ్చు. పాదరసపు లింగాలను కూడా అందరూ పూజింప వచ్చు. 

" సాలగ్రామము " అనేది నిజానికి నేపాల్ లో గండకీ నది ఒడ్డున ఉన్న ఒక గ్రామము పేరు. అక్కడ ’ సాల ’ వృక్షాలు అధికము కాబట్టి ఆ పేరు. సాలగ్రామములనే రాతి చిహ్నాలు కూడా గండకీ నది ఒడ్డున దొరకుతాయి కాబట్టి వాటిని కూడా సాలగ్రామములు అనే అంటారు. 
వాటంతట అవే సహజ సిద్ధముగా ఏర్పడి దొరికే లింగాలలో బాణ లింగాలు , సాలగ్రామములు ముఖ్యమైనవి. బాణ లింగాలు నర్మదా , గండకీ నదిలోనూ ఒడ్డునా దొరుకుతాయి. 

సాలగ్రామములో నారాయణుడే ప్రతిష్ఠింపబడి ఉంటాడని ప్రతీతి. 

బదరీనాథ్ లోని నారాయణ విగ్రహము , ఉడుపిలోని కృష్ణ విగ్రహమూ సాలగ్రామ శిలతోనే మలచినట్టు గాథలున్నాయి. 

ఇతర విగ్రహాలలో పూజకు ముందు ఆయా దేవతలను మంత్రోక్తముగా ప్రతిష్ఠ , ఆవాహన చేయవలెను, కానీ సాలగ్రామములలో సహజముగానే  , ఎల్లపుడూ నారాయణుడి అస్తిత్వము కలిగి ఉంటాయి. 
సాలగ్రామాలను పూజించటానికి మంత్రాలూ , ఉపదేశాలూ అవసరము లేదు.
 స్వచ్చమైన మనసు , అహంకారము లేని చిత్తము , మంచి నడవడిక , ప్రాపంచిక విషయాలపై అనాసక్తి మాత్రము చాలును. సాలగ్రామాలను పూజించుతకు అతి సరళమార్గము ఏదంటే , సాలగ్రామాన్ని నీటితోగానీ పాలతో కానీ కడిగి [ స్నానము చేయించి ] దానిపై ఒక తులసీ దళమునుంచి , ఏదైనా ఒక తీపి పదార్థాన్ని నివేదించుటే. 

సాలగ్రామాలు కూడా గండకీ మరియూ ఇతర నదులలోనూ దొరుకుతాయి. సాలగ్రామములంటే రాళ్ళు కాదు.  అవి జీవముతో కూడుకున్నవి. ఒకానొక పురుగు తనచుట్టూ ఏర్పరచుకొన్న కోశమే [శిలాజము ]  గట్టిగా , రాతిలాగా కనపడుతుంది. వీటిని అభిషేకిస్తున్నపుడు ఒక్కోసారి అవి ప్రాణము వచ్చిన వాటిలా నీటిలో ఈదుతూ కదలుతాయి. ఇవి కూడా ఎంత చిన్నగా ఉంటే ఫలము అంత అధికము.

ఇంటిలో రెండు సాలగ్రామములను పూజింపరాదు. అయితే మిగిలిన సమ సంఖ్యలో [అనగా నాలుగు , ఆరు , ఎనిమిది .... అలాగ]  సాలగ్రామములను ఉంచుకొని పూజించవచ్చు. సాలగ్రామములు ఇంటిలో ఉంటే ప్రతిరోజూ తప్పక అభిషేకమూ నైవేద్యమూ చేసి పూజించాలి. అలాగే బేసిసంఖ్యలో [ మూడు , అయిదు, ఏడు... అలాగ]సాలగ్రామములను ఇంటిలో పూజించరాదు. కానీ ఒక్క సాలగ్రామమును పూజింప వచ్చు. 

సాలగ్రామ శిల , భగ్నమైనా కూడా [ పగిలినా కూడా ] , చక్రము కలదైతే పూజించవచ్చు. సాలగ్రామములపై చక్రాలు ఏర్పడి ఉంటాయి. అవి తెలిసినవారు గుర్తిస్తారు. వారాహ పురాణము  , " సాలగ్రామ శిలను , కొద్దిపాటి బంగారముతో అయినా సరే , దానము చేసిన నరుడు భూదానము చేసిన ఫలాన్ని పొందుతాడు , మరియూ భక్తితో నూరు సాలగ్రామములను పూజించిన వాడికి కలిగే గొప్ప ఫలితాన్ని నూరు సంవత్సరములు వర్ణించినా సరిపోదు." అంటుంది. 

ఈ సాలగ్రామాలు దానముగా ఇచ్చినవే ఉత్తమము , శుభదమూ అయినవి. డబ్బులిచ్చి కొన్నవి మధ్యమములు , యాచించి తెచ్చుకున్నవి అధమములు. 

సాలగ్రామాన్ని ఉపనీతుడు [ ఉపనయనము అయినవాడు ] మాత్రమే ముట్టుకొని పూజించుటకు అర్హుడు. ఉపనయనము కానివారు , స్త్రీలు ముట్టుకొనరాదు. అలాగ ముట్టుకుంటే నరకదోషము కలుగును అని ’విష్ణు ధర్మము’ గ్రంధములో ఉన్నది.

౧ సాలగ్రామాన్ని , శంఖాన్నీ , తులసీ దళాన్నీ ఒక పళ్ళెములో ఒకే చోట ఉంచినంతనే శుభాలు కలుగుతాయి.
౨. దానము , వ్రతము , పూజ లేక శ్రాద్ధములు సాలగ్రామపు సమక్షములో చేస్తే ఎక్కువ ఫలితాన్నిస్తాయి.
౩. సాలగ్రామాన్ని అభిషేకించిన తీర్థము తాగితే సర్వ పాపాలూ నశిస్తాయి.
౪. గ్రహణాదులలో చేసే జపతపాలు సాలగ్రామపు సమక్షములో చేస్తే అధిక ఫలాన్నిస్తాయి. 
౫. భక్తిలేకున్నా , సాలగ్రామాన్ని పూజిస్తేనే ఫలము దొరకుతుంది.
౬. సాలగ్రామము దానము చేయుట అత్యంత శుభమైన కర్మ. 


శివరాత్రికి అందరూ తమ తమ ఇష్టమైన శివలింగాలను , సాలగ్రామాలనూ పూజించి ధన్యులు అయ్యెదరని ఆకాంక్షిస్తూ.. 

శుభం భూయాత్ || 

Thursday, January 21, 2016

అయుత చండీ మహా యాగము

|| శ్రీః ||

|| అయుత చండీ మహా యాగము ||





|| నతత్ర దేశే దుర్భిక్షం న చ దుఃఖం ప్రవర్తతే |
న కాలే మ్రియతే కశ్చిత్ పూజ్యతే యత్ర చండికా ||

[ అమ్మలగన్న అమ్మ , విశ్వమాత అయిన చండిక ఎక్కడ పూజింపబడుతుందో , ఆ ప్రదేశములో దుర్భిక్షమన్నదిలేక సస్యశ్యామలముగనూ , ప్రజలంతా సుఖసంతోషాలతోనూ వర్ధిల్లుతారు. అక్కడ ఎటువంటి దుఃఖముగానీ , వినాశనముగానీ రోగములుగానీ  పేదరికము , రోగములు గానీ కలహములుగానీ ప్రవేశింపజాలవు. ]
మిత్రులకు అనేక ధన్యవాదములు...

గత నెల ఇరవై మూడు నుండీ... అంటే మార్గశీర్ష శుక్ల త్రయోదశి నుండీ అయిదు రోజులపాటు తెలంగాణా ముఖ్య మంత్రి శ్రీ చంద్రశేఖరరావుగారు తమరాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి కోసము మాత్రమే గాక , యావద్భారత క్షేమాభివృద్ధి కోసము మెదక్ జిల్లాలోని ఎర్రవల్లి గ్రామములోని తమ వ్యవసాయ క్షేత్రములో " అయుత మహా చండీ యాగాన్ని " దిగ్విజయముగా జరిపించినది మీరందరూ పత్రికా , ప్రసార మాధ్యమాలలో చూసే ఉంటారు. 

దాని ముందే వారు  శ్రీ శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహా సంస్థానము దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠమ్ శృంగేరీ శారదాపీఠపు జగద్గురువులైన ,శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ స్వామి వారి , తత్కర కమల సంజాతులు జగద్గురువులు విధుశేఖర భారతీ స్వామి వారి దివ్య మంగళ ఆశీస్సులతో ఈ మహాయజ్ఞానికి దీక్షవహించి శ్రీకారము చుట్టినారు. 

 జగదంబ అనుగ్రహము చేత అయుత చండీ మహాయాగములో ఋత్త్వికుడిగా పాల్గొనే భాగ్యము నాకు కలిగినది.. శ్రీ కె వి శర్మ గారి ప్రోత్సాహ సహకారాలతో  ఆ అవకాశము కలిగినది.. జన్మలో అది మరచి పోలేని అనుభవము.. అక్కడి అనుభవము , వివరాలూ అన్నీ ఒక నివేదికగా రాద్దామని మొదట అనుకున్నాను.. కానీ తిరిగి వచ్చిన తర్వాత టీవీలో అన్నీ చూపడమూ , వార్తాపత్రికలలో సమగ్రముగా ప్రచురించడము వంటివి తెలిశాయి... అందుకని , ఆ ప్రయత్నము తగ్గించి , ఋత్త్విజులకు మాత్రమే తెలిసే అవకాశమున్న కొన్ని వివరాలను మాత్రము మొదట రాయాలనుకున్నాను. చివరికి , అయిన ఆలస్యము ఎలాగూ అయింది కాబట్టి వీలైనంత సమగ్రముగానే రాయాలని నిర్ణయించి ఇది రాస్తున్నాను. 

ఆలస్యానికి క్షంతవ్యుడను. 

అయుతచండీ యాగము జరగబోవునని తెలిసినపుడు నా మనసు కొంచము అక్కడికి  వెళ్ళాలని ఆశపడింది. ఎందుకంటే గత ఆరేడేళ్ళనుండీ నేను ఉపాసించే దేవతనుద్దేశించి జరిగే యాగమది. ఇంతకు ముందు కొన్ని చోట్ల యాగానికి వెళ్ళాను గానీ ఈ యాగపు విశిష్టత తెలిసినకొద్దీ ఆ కోరిక బలపడింది. కానీ ఎలా వెళ్ళాలి , ఎవరిని సంప్రదించాలి అన్నవి తెలీదు. ’ సరేలే భాగ్యములో ఉండాలి కదా " అన్న ఆలోచనతో దాని గురించి ఎక్కువగా ఆలోచించలేదు.  దాదాపు మరచి పోయాను. తీరా యాగము ఇక మూడే రోజులుందనగా మళ్ళీ గుర్తొచ్చింది.. కానీ అప్పటికే ఆలస్యము అయింది కాబట్టి ఆశ వదలుకున్నాను. అయితే భక్తులపాలి కల్పవల్లి అయిన అమ్మవారి నిర్ణయము మరోలా ఉండింది. శ్రీ కేవీ శర్మ గారు ఇరవైన రాత్రి నన్ను అడిగారు , వెళతారా అని. వారెవరో మీలో చాలామందికి తెలిసి ఉంటుంది గానీ వారికి చెప్పకుండా మిగతా వివరాలు రాయలేను...

నా అదృష్టాన్ని నేనే నమ్మలేక , ఆనందముగా ఒప్పుకొని వెంటనే ఏర్పాట్లు చేసుకున్నాను.. ఒకేరోజు సమయము ఉండుట చేత ఎవరికీ చెప్పడముగానీ , ఫేస్ బుక్ లో రాయడముగానీ చేయలేకపోయాను.. ఇది కావాలని దాచినది కాదు. 

సరే నా వ్యక్తిగతమైన ఈ వివరాలు పక్కన పెట్టి  , యాగపు అంశాలను చూద్దాము.

కేసీఆర్ గారికి చండీ యాగాలు కొత్తేమీ కాదు . గత ఇరవై అయిదు సంవత్సరాలనుండీ చేస్తూనే ఉన్నారు.. యాగము కాదు కదా , సప్తశతీ పారాయణము కాదు కదా ,  నవార్ణమంత్రము కాదుకదా , కేవలము అమ్మవారిని రోజూ తలచుకున్నంత మాత్రానే ఎంతటి సంతోషము కలుగుతాయో, సమస్యలు ఎలా వీడిపోతాయో , ప్రశాంతత ఎలా కలుగుతుందో ... అమ్మవారిని భక్తితో మ్రొక్కే వారికే తెలుసు. ఇక ఇన్నేళ్ళనుండీ క్రమం తప్పక ఏకంగా హోమాలూ యాగాలే చేస్తున్న కేసీఆర్ గారికి కలిగిన అభివృద్ధీ , తీరిన కోరికలూ , వచ్చిన కీర్తీ.. ఇవన్నీ వారిని యాగాలను పదేపదే చేయించేలా తహతహలాడేలా చేసి ప్రేరేపించి ప్రోత్సహించేలా చేయడములో ఆశ్చర్యము ఏమీ లేదు.  యాగపు ఆ అయిదు రోజులూ వారు చూపిన శ్రద్ధా భక్తులు , సంయమనము , ప్రశాంతత , ఏకాగ్రత , అన్నీ చూస్తుంటే కొందరికి ఆశ్చర్యమగునేమో గానీ తెలిసినవారికి అది మామూలు విషయమే. అసలు ఆ అయిదురోజులే కాదు , అంతకుముందు కొన్ని రోజులు , వారాలు , నెలలుగా వారు యాగపు ఏర్పాట్లలో మమేకమై దీక్షగా అన్నీ చూసుకున్నారు.. కేసీఆర్ గారిని పొగడుట ఈ వ్యాసపు ఉద్దేశము కాదు గానీ , వారిని ప్రశంసించకుండా  ఈ వ్యాసమును ముగిస్తే అది అసంపూర్ణమూ , అన్యాయమూ కూడా అవుతుంది. వ్యాస విస్తరణ భీతి చేత " వారిని ఎంత పొగడినా తక్కువే , వారి శ్రద్ధాభక్తులు అనితర సాధ్యము , వారికి దేనినైనా సాధించుటకు సాధ్యమే "  అన్న ఈ వాక్యముతో వారి ప్రశంస ముగిస్తున్నా. 

యాగాలు శ్రౌత యాగాలు , స్మార్త యాగాలు అని ముఖ్యముగా రెండు రకాలు.. వీటిలో మళ్ళీ అనేక ఉప విభాగాలున్నాయి. స్మార్త యాగాలలో ఉన్న అనేక పద్దతులలో " శాక్తేయము " అనేది ఒకటి. అందులో ఆయా దేవతలకు [ అమ్మవారలకు ] విడివిడిగా చేసే హోమాలు ఉంటాయి.[ శ్రీ సూక్త హోమము , సరస్వతీ హోమము , దుర్గా హోమము , లలితా హోమము ఇలా... ]  అయితే చండికా అమ్మవారికి మాత్రము విడివిడిగా కాక ,  మహాకాళి , మహా లక్ష్మి , మహా సరస్వతులకు కలిపి సమిష్టిగా చేసేదే చండికా హోమము. 

ఈ చండికా హోమాలలో మళ్ళీ ఎన్నో రకాలు--- నవచండీ యాగము , శత చండీ యాగము , సహస్ర చండీ యాగము , అయుత చండీ యాగము , ప్రయుత చండీ యాగము వంటివి ఉన్నాయి. 

ఏ చండికా హోమమైనా , ఒక నిర్దిష్ట సంఖ్యలో సప్తశతీ పారాయణము , దానిలో దశాంశము [ పదో వంతు ] హోమము , దానిలో పదోవంతు తర్పణము , దానిలో పదో వంతు బ్రాహ్మణ భోజనము--- మాత్రమే గాక ,  అన్న సంతర్పణ ,దంపతీ పూజ , సువాసినీ పూజ , కన్యకా పూజలు కూడా ఉంటాయి. 

నవచండీ యాగము :- దీన్ని ఒకే ఒక్కరోజులో ముగిస్తారు. తొమ్మిదిసార్లు సప్తశతీ పారాయణము , హోమము , మిగిలిన పూజలూ నిర్వహిస్తారు.

శత చండీ హోమము :-- ఇది అయిదు రోజులు చేస్తారు. ఋత్త్విక్కులు పది మంది ఉంటారు. 
మొదటి రోజు పది సప్తశతీ పారాయణాలు , మరియూ నలభై వేల నవార్ణ మంత్ర జపాలు చేస్తారు. 
రెండవ రోజు ఇరవై సప్తశతీ పారాయణాలు , మరియూ ముప్పై వేల నవార్ణ మంత్ర జపాలు చేస్తారు.
మూడవ రోజు ముప్పై సప్తశతీ పారాయణాలు , మరియూ ఇరవై వేల నవార్ణ మంత్ర జపాలు చేస్తారు.
నాలుగవ రోజు నలభై సప్తశతీ పారాయణాలు , మరియూ పది వేల నవార్ణ మంత్ర జపాలు చేస్తారు.
అనగా మొత్తము వంద సప్తశతీ పారాయణాలు , లక్ష నవార్ణమంత్ర జపాలు చేస్తారు. 
నాలుగు రోజుల్లోనూ ప్రతిరోజూ నవావరణ పూజ , చతుష్షష్టి యోగినీ దేవతల పూజ , దీప సహిత బలి , కల్పోక్త పూజతోబాటు కుంకుమార్చన , అవధారలు [ అంటే చతుర్వేద పారాయణాలు , శాస్త్ర , సంగీత , ఇతిహాస , పురాణ సేవలు ] చేస్తారు. 
ఐదవరోజు , అగ్ని ప్రతిష్టాపన చేసి , ఏడు వేల ఆహుతులతో అమ్మవారికి గుడాన్నము [ పరమాన్నము ]తో , పదివేల నవార్ణ మంత్రాలతో ఆజ్య హోమము , అంగ , ఆవరణ , పీఠ దేవతలకు ఆజ్య హోమము , తర్పణము చేసి ఇంద్రుడు , శక్తి మొదలగు దేవతలకు బలి దానము , పూర్ణాహుతి , దంపతీ, సువాసినీ , కన్యకా పూజలు చేసి అవభృతం [ యజమానికీ , వారి కుటుంబానికీ మంత్ర జలముతో ప్రోక్షణ ]చేస్తారు.యాగము సంపన్న మయ్యాక అన్న సంతర్పణ ఉంటుంది. 

సహస్ర చండీ యాగము :- ఇది కూడా అయిదు రోజులు చేసే యాగము. వందమంది ఋత్త్విక్కులుంటారు. 

మొదటి రోజు వంద సప్తశతీ పారాయణాలు , మరియూ నాలుగు లక్షల నవార్ణ మంత్ర జపాలు చేస్తారు.
రెండవ రోజు రెండు వందల సప్తశతీ పారాయణాలు , మరియూ మూడు లక్షల నవార్ణ మంత్ర జపాలు చేస్తారు.
మూడవ రోజు మూడు వందల సప్తశతీ పారాయణాలు , మరియూ రెండు లక్షల నవార్ణ మంత్ర జపాలు చేస్తారు.
నాలుగవ రోజు నాలుగు వందల సప్తశతీ పారాయణాలు , మరియూ ఒక లక్ష నవార్ణ మంత్ర జపాలు చేస్తారు.
అనగా మొత్తము , వెయ్యి పారాయణాలు , పది లక్షల నవార్ణ మంత్ర జపాలు చేస్తారు.

తర్వాత , నాలుగు రోజుల్లోనూ ప్రతిరోజూ నవావరణ పూజ , చతుష్షష్టి యోగినీ దేవతల పూజ , దీప సహిత బలి , కల్పోక్త పూజతోబాటు కుంకుమార్చన , అవధారలు [ అంటే చతుర్వేద పారాయణాలు , శాస్త్ర , సంగీత , ఇతిహాస , పురాణ సేవలు ] చేస్తారు. 
ఐదవరోజు , అగ్ని ప్రతిష్టాపన చేసి , ఏడు లక్షల ఆహుతులతో అమ్మవారికి గుడాన్నము [ పరమాన్నము ]తో , లక్ష నవార్ణ మంత్రాలతో ఆజ్య హోమము , అంగ , ఆవరణ , పీఠ దేవతలకు ఆజ్య హోమము , తర్పణము చేసి ఇంద్రుడు , శక్తి మొదలగు దేవతలకు బలి దానము , పూర్ణాహుతి , దంపతీ, సువాసినీ , కన్యకా పూజలు చేసి అవభృతం [ యజమానికీ , వారి కుటుంబానికీ మంత్ర జలముతో ప్రోక్షణ ]చేస్తారు.యాగము సంపన్న మయ్యాక అన్న సంతర్పణ ఉంటుంది. 

                    అయుత చండీ మహా యాగము

గతనెలలో చేసినది ఈ అయుత చండీ మహా యాగమే. 
యాగము ప్రారంభమున కన్నా ముందే ,  అనగా ఇరవై రెండవ తారీఖున ఉదయమే, యాగ స్థలములో , గురు ప్రార్థన , గణపతి పూజ , పుణ్యాహవాచనము శాస్త్రోక్తముగా వేదోక్తముగా జరిగినాయి. ఉదకశాంతి ప్రయోగముతో క్షేత్ర , భూభాండ , ఆత్మ శుద్ధులు జరిగినాయి. మరునాడు ఉదయము . ఈ మహా యాగము నిర్విఘ్నముగా జరుగుటకు మహా గణపతికి అధర్వ వేదోక్తిగా [ అధర్వ శీర్షముతోనూ , మూల మంత్రముతోను గణపతి గాయత్రితోనూ ] సహస్ర మోదక హోమము నిర్వహించబడినది. మరలా గణపతి పూజ , పుణ్యాహవాచనము , [ దేవ] నాంది, అంకురారోపణము , ఋత్విగ్వరణము , జరిగినవి.  తరువాత కలశ స్థాపన , దీప స్థాపన , చండీ యంత్ర స్థాపన , దేవతావాహన , ప్రాణ ప్రతిష్ఠ [ కలశము మరియూ యంత్రములలో ] జరిగినవి. 
శృంగేరీ జగద్గురువులు కారణాంతరముల వల్ల రాలేకపోయిననూ వారి ప్రతినిధిగా శృంగేరీ ముఖ్య నిర్వహణాధికారియైన శ్రీ గౌరీ శంకర్ గారు వచ్చి , జగద్గురువుల ఆశీర్వచనాన్నీ , యాగపు విశిష్టతనూ , కేసీఆర్ గారి భక్తిశ్రద్ధలనూ వర్ణిస్తూ భాషించినారు.

ఇదికూడా అయిదు రోజులు జరిగే యాగము. వెయ్యిమంది ఋత్త్విజులుండవలెను. [ ఇక్కడ పదమూడు వందల దాకా ఉన్నాము ]

అయుత చండీ మహా యాగము మొత్తము డామర తంత్రోక్త విధిగా , శృంగేరీ పద్దతిలో జరిగినది. సప్తశతీ పారాయణము కూడా శృంగేరీ పద్దతిలో జరిగింది. 
ఈ అయుత చండీ మహా యాగములోని మరొక వైశిష్ట్యమేమనగా , అమ్మవారికి శాక్తేయ విధానములోయాగమే గాక , అయ్యవారికి కూడా [ శివయ్యకు ] శైవ పద్దతిలో అయిదురోజులూ మహాన్యాస పూర్వక" ఏకాదశవార రుద్ర అభిషేకము  , రుద్ర పారాయణము , రుద్ర క్రమార్చన , ఇతర అనుబంధ పూజలు"  జరిగినవి . అయిదోరోజు రుద్ర ఏకాదశవార హోమము జరిగినది.

మొత్తము పదహారు వందలదాకా ఋత్త్విజులు రాగా ,దాదాపు పదమూడు వందలమంది చండీ యాగానికి , మిగతావారు రుద్రయాగానికి వరణము అయినారు. 

మొదటిరోజు వెయ్యి చండీ పారాయణాలు , నలభై లక్షల నవార్ణ మంత్ర జపాలు చేయవలసి ఉండగా , అంతకన్నా ఎక్కువే , దాదాపు పదమూడు వంద పారాయణాలు , యాభైరెండు లక్షల నవార్ణ మంత్ర జపాలు జరిగినవి.

ఒక్కొక్క ఋత్త్విజుడూ మొదటిరోజు ఒక పారాయణము , నాలుగు వేల మంత్ర జపమూ చేయడము జరిగింది.

సప్తశతీ పారాయణములో మొదట పూర్వాంగములో ఏకాదశ న్యాసాలు , చండీ కవచ , అర్గలా , కీలక స్తోత్రాలూ ఉంటాయి. రాత్రి సూక్తము తరువాత ఒక్కొక్క అధ్యాయముగా పదమూడు అధ్యాయాలూ శ్రావ్యముగా , స్పష్టముగా , ఏకకంఠముతో అన్నివేల ఋత్త్విజులమూ పఠిస్తాము. ఒక్కొక్క అధ్యాయము తర్వాతా చిన్న మంగళారతీ , నివేదనా ఉంటుంది. అన్ని అధ్యాయాలూ అయ్యాక మంగళారతీ , అటుతర్వాత  ఉత్తర న్యాసాలు , దేవీ సూక్తము , తర్పణము , మంత్ర నివేదనము,  ఆ తర్వాత రహస్య త్రయము పఠనము ఉంటుంది. నవార్ణ మంత్రము కూడా పారాయణకు ముందూ వెనుకా నూటెనిమిది సార్లు జపిస్తాము. [ ఇది పారాయణములో భాగము. వేలలో జపించేది ప్రత్యేకము. 

రెండవ రోజు రెండు వేల సప్తశతీ పారాయణాలు , మరియూ ముప్పై లక్షల నవార్ణ మంత్ర జపాలు చేయవలసి ఉండగా , అంతకన్నా ఎక్కువే , అనగా దాదాపు రెండు వేల అయిదువందల పారాయణాలు , నలభై లక్షల మంత్ర జపాలు  జరిగినవి.

అంటే ఒక్కొక్క ఋత్త్విజుడూ రెండు పారాయణాలు , మూడు వేల నవార్ణ మంత్ర జపమూ చేయడము జరిగింది.

మూడవ రోజు మూడు వేల సప్తశతీ పారాయణాలు , మరియూ ఇరవై లక్షల నవార్ణ మంత్ర జపాలు చేయవలసి ఉండగా , అంతకన్నా ఎక్కువగా , దాదాపు నాలుగు వేల పారాయణాలు , ఇరవై ఆరు లక్షల నవార్ణ మంత్ర జపాలు జరిగినవి.

ఒక్కొక్క ఋత్త్విజుడూ మూడు పారాయణాలు , రెండు వేల మంత్ర జపాలు చేయడము జరిగింది.

నాలుగవ రోజు , నాలుగు  వేల సప్తశతీ పారాయణాలు , మరియూ పది లక్షల నవార్ణ మంత్ర జపాలు చేయవలసి ఉండగా , అంతకన్నా ఎక్కువగా , యాభైరెండు వేల పారాయణాలు , పదమూడు లక్షల నవార్ణ మంత్ర జపాలు జరిగినవి.

అయుతము అంటే పదివేలు. మొత్తము పదివేల సప్తశతీ పారాయణాలు కనీస సంఖ్యగా చేయవలెను.

అనగా మొత్తము పదివేల సప్తశతీ పారాయణాలు , ఒక కోటి నవార్ణ మంత్ర జపాలు జరగవలసి ఉండగా , పదమూడు వేల సప్తసతీ పారాయణాలు , కోటీ ముప్పై లక్షల నవార్ణ మంత్ర జపాలూ జరిగినవి. 
అనగా ఒక్కొక్క ఋత్త్విజుడూ నాలుగు పారాయణాలు , వెయ్యి మంత్ర జపాలు చేయడము జరిగింది. 

నాలుగు రోజుల్లోనూ ప్రతిరోజూ నవావరణ పూజ , చతుష్షష్టి యోగినీ దేవతల పూజ , దీప సహిత బలి , కల్పోక్త పూజతోబాటు కుంకుమార్చన , అవధారలు [ అంటే చతుర్వేద పారాయణాలు , శాస్త్ర , సంగీత , ఇతిహాస , పురాణ సేవలు ] చేసాము. 

ఐదవరోజు , అగ్ని ప్రతిష్టాపన చేసి , డెబ్బై లక్షల ఆహుతులతో ,  అమ్మవారికి గుడాన్నము [ పరమాన్నము ]తో , పదిలక్షల నవార్ణ మంత్రాలతో ఆజ్య హోమము ,[ అయుతం అంటే పదివేలు కదా , అలాగే పదివేల సార్లు ఏడు వందల శ్లోకాలతో  -- అనగా డెబ్బై లక్షల ఆహుతులు..]  అంగ , ఆవరణ , పీఠ దేవతలకు ఆజ్య హోమము , తర్పణము చేసి ఇంద్రుడు , శక్తి మొదలగు దేవతలకు బలి దానము , పూర్ణాహుతి , దంపతీ, సువాసినీ , కన్యకా పూజలు చేసి అవభృతం [ యజమానికీ , వారి కుటుంబానికీ మంత్ర జలముతో ప్రోక్షణ ]జరిగినవి. యాగము సంపన్న మయ్యాక హోమములో పదో వంతు కనీస సంఖ్యగా బ్రాహ్మణ భోజనాలు జరిగాయి. అలాగే లక్షలాది ప్రజలకు అన్న సంతర్పణ జరిగింది. ప్రతిరోజూ కూడా లక్షలలో అన్న సంతర్పణ జరిగింది.
ఆ ఐదురోజుల్లోనూ ప్రతిరోజూ చతుర్వేద స్వాహాకారాలు , దుర్గా హోమము , శ్రీసూక్తహోమము , గౌరీ హోమము, సరస్వతీ హోమము , మహా సౌరమూ కూడా జరిగాయి. ముత్తైదువలు కుంకుమార్చన చేసారు. 

ప్రధాన చండీ హోమాలు నూట ఎనిమిది కుండాలలో , నూటెనిమిది సృక్కులు , పదమూడు వందల సృవాలతో , అయిదు వేల కిలోల బియ్యము , ఆరు వేల కిలోల బెల్లము , నాలుగు వేల కిలోల నెయ్యి తదితర పదార్థాలు , శాస్త్ర ప్రమాణముగా నిర్ణయించిన హోమద్రవ్యాలు ఉపయోగించడము జరిగింది. అయిదో రోజు పూర్ణాహుతి శాస్త్రోక్తముగానూ , పౌరాణికముగాను రెండు సార్లు జరుగుట అమ్మవారి అనుగ్రహాన్ని సూచిస్తుంది.


యజమాని : యాగము చేయించే కర్త ను యజమాని అంటారు.  యజమాని మొదటిరోజే దీక్ష తీసుకొని , ఒంటిపూటే భోజనము చేస్తూ , నేలపై మాత్రమే నిద్రిస్తూ , బ్రహ్మచర్యము పాటిస్తూ రెండు పూటలా స్నానము చేస్తూ సమాహిత మనస్కుడై , మనసులో సదా అమ్మవారిని ధ్యానిస్తూ ఉండవలెను. శ్రీ కేసీఆర్ గారిని ఆ అయిదురోజులూ చూసినవారు  యాగపు అన్ని రోజులలోనూ దీక్షావస్త్రాలతో వారు పాల్గొన్న విధము చూసినవారు , అత్యంత ఆదర్శ ’ యజమాని’ ఎలాగుండవలెనో అలాగే ఉన్నారు అని ముక్తకంఠముతో కీర్తించినారు. వారు గతములో కూడా యాగాలు చేయించినది ఎరుగని ఇతర రాష్ట్రీయులు వారి శ్రద్ధా భక్తులను చూసి విపరీత సంభ్రమాశ్చర్యాలకు లోనయినారు. నేను కూర్చున్న కుండము దగ్గర తెలుగు , కన్నడ , మరాఠీ , ఉత్తర ప్రదేశ్ , మధ్య ప్రదేశ్ లనుండీ వచ్చిన వారున్నారు. అలాగే అన్ని కుండాల దగ్గరా వివిధ రాష్ట్రాల వారున్నారు. శ్రీ కేసీఆర్ గారు ప్రతి రోజూ ఉదయము ఒకసారి , మధ్యాహ్నము ఒకసారి సతీ సమేతముగా యాగ శాలలోని ఋత్త్విలందరికీ మొదట అభివాదము చేయుట అందరినీ ముగ్ధులను చేసింది. వారు కనపరచిన హుందాతనము , భక్తి ప్రపత్తులు , వినయ శీలత ఈ కాలము యే రాజకీయ నేత ల వద్ద కాదు గదా , సామాన్య యజమానుల వద్ద కూడా దుర్లభము. 

ఋత్త్విజులు :-


చండీ యాగానికే కాదు , యే యాగానికైననూ ఋత్త్విజులుగా వచ్చి యాగములో భాగము వహించేవారు కొన్ని అర్హతలను కలిగి ఉండాలి. అలాగే అనేక నియమాలను పాటించాలి.  
ఋత్త్విజులందరికీ తప్పనిసరిగా నవార్ణ మంత్రోపదేశము అయి ఉండాలి. అనేక పర్యాయములు సప్తశతీ పారాయణము చేసి ఉండాలి. ప్రతి శ్లోకాన్నీ స్పష్టముగా తప్పులు లేకుండా పఠించగలిగి ఉండాలి. యాగపు రోజులలో దీక్ష వహించి , ఒంటి పూటే భోంచేస్తూ , నేలపైనే నిద్రిస్తూ , ముప్పూటలా సంధ్యావందము చేస్తూ అతి నిష్టతో నియమాలను పాటించవలెను. 

ఒంటిపూటే భోజనము , నేలపైనే పడుకొనుట అలవాటు ఉండడమూ , గత ఆరేడేళ్ళుగా నవార్ణ మంత్ర జపమూ , దేవీ ఉపాసనలతో పాటూ కనీసము ఒక నూట యాభై సార్లయినా సప్తశతీ పారాయణము  చేసిన అనుభవము ఉండుట వలన నేను ధైర్యముగా ఆర్త్విజ్యానికి ఒప్పుకోగలిగాను. యే అర్హతలూ లేకుండా ఆర్త్విజ్యానికి వెళ్ళుట ప్రమాదకరము. ఒకవేళ అటువంటి అర్హతలు లేకున్నా , అమ్మవారిమీద అత్యంత భక్తి ఉండి శ్రద్ధతో వెళ్ళిన వారిని అమ్మవారు పరీక్షలు పెట్టి , వారు నియమాలను పాటించునట్లు చేయడము అనేకులకు అనుభవమే.  

శ్రీ శ్రీ జగద్గురువుల ఆశీర్వాదములు కోరినపుడు జగద్గురువులు , " యాగము తప్పక విజయవంతముగా సమాప్తి అవుతుంది.. ఏవైనా చిన్న చిన్న అవాంతరములు వస్తే చిన్నబుచ్చుకొనే పనిలేదు " అని దీవించినారట. 

కారణములతో నిమిత్తము లేకుండా, కేవలము అమ్మవారి " పరీక్ష " గానే భావించ తగిన చిన్న చిన్న సంఘటనలు జరగకపోలేదు. యాగము చివర యాగ మంటపము ఆగ్నేయదిశలో అగ్నికి ఆహుతియగుట వాటిలో ముఖ్యమైన సంఘటన. 

అప్పటికి ఆహుతులన్నీ ఇవ్వడము జరిగింది. పొగ ఎక్కువగా ఉండడము వలన ఋత్త్విజులందరమూ కుండాలనుండీ దూరముగా , యాగశాలలోనే ,   బయటికి వచ్చాము.  పొగను పైకి పంపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాంకేతికముగా  పూర్ణాహుతి పూర్తయినట్టు ముఖ్య అధ్వర్యులు చెప్పినారు. అయినా రావలసినవారు ఇంకా రాకపోవడము వలన వారు వచ్చాక అన్ని సంభారాలతో శాస్త్రోక్తముగా జరపవలసి ఉండినది. 

పూర్ణాహుతి సమయము వరకూ అగ్నిని ’ కాపాడుకోవలెను ’ అన్న ఆత్రముతో ఒకరు అతిగా ఆజ్యము పోయుట వలన జరిగిన సంఘటన అది.  అది జరిగిన వెంటనే కొన్ని నిమిషాలలోనే , అయిదు రోజులుగా అక్కడే సిద్ధముగా ఉన్న అగ్నిమాపక దళము రంగములోకి దిగడము , వెంటనే మంటలను ఆర్పడము , వారి సాహస కృత్యాన్ని తిలకిస్తున్న వందలాది ఋత్త్విజులము చప్పట్లతో , జయ జయ ధ్వానాలతో వారిని ప్రోత్సాహ పరచి అభినందించడమూ మరచి పోలేని క్షణాలు. దానికి ముందు , అన్ని కుండములలోనూ మొదట నూట ఎనిమిది ఆజ్యాహుతుల తరువాత  హోమద్రవ్యముగా అరిటాకులు పరచిన వెదురు గంపలలో తెచ్చిన గుడాన్నమును ఆహుతులు ఇస్తున్న సమయములో , విపరీత మైన నల్లటి పొగ చుట్టుముట్టింది. కుండాలలో ఉంచిన కలప మోదుగ కలప అని కొందరు అన్నా కూడా  అవి కాలునపుడు , యే నీలగిరి కలపో కాలినట్లు , గొంతుల్లోనూ , ముక్కుల్లోనూ ఒకటే మంట మొదలై , ఊపిరాడక కొందరు లేచివెళ్ళాల్సిన పరిస్థితి రాగా , నిర్వాహక బృందము ’ ఋత్త్విజులందరూ బయటికి రావలెను " అని ప్రకటించవలసి వచ్చినది. ఆ సందర్భములో అదే సమయోచిత నిర్ణయము. యాగ శాలకు నాలుగు వైపులా తాత్కాలిక మంటపములుండి , గాలి పోవుటకు వీలులేకపోవడము వలన ఆ పరిస్థితి వచ్చి ఉండవచ్చు. 

ఆగ్నేయ దిశలో , శంకరుని ప్రతిష్టాపన అయిన మంటపము  పూర్తిగా దగ్ధమై రుద్రభూమిని తలపించగా , అమ్మవారి మంటపము ఏమాత్రమూ చెక్కుచెదరక ఉండుట అమ్మావారి లీలే కానీ మరొకటి కాదు. సంఘటనను ఎవరో జగద్గురువులకు విన్నవించగా , వారు ఏ మాత్రమూ చలించక ,’ సర్వమూ శుభముగా సమాప్తి చెందుతుంది... మీరు శాంతి మంత్రాలు పఠించండి " అన్నారని ఒక వార్త. 

ఒకరిద్దరు శాంతి మంత్రాలు మొదలు పెట్టగా , ఆశ్చర్య , ఆందోళనల మధ్య ఉన్న మరికొందరు అందుకోవడమూ , చూస్తుండగనే ఒక యాభై మందిమి పోగవడమూ , మమ్మలి చూసి వందలమంది రావడము , అలాగ వందలాది ఋత్త్విజులము శాంతి మంత్రాలు పఠిస్తూ ఒక పదినిమిషాలు అక్కడే నిలుచుండి నెమ్మదిగా నడుస్తూ , సామూహికముగా ఉఛ్చ  స్వరముతో మంత్రాలను పలుకుతూ యాగ శాలను పునః ప్రవేశించడము, చూసితీర వలసినదే గానీ వర్ణించుటకు వీలు కాదు. వందలమంది ఏకకంఠముతో మంత్రాలను పఠిస్తుంటే ఆ ప్రభావమే వేరు. ఋత్త్విజులచుట్టూ వందల, వేల సంఖ్యలో భక్తులూ ఇతరులూ చేరి ’ మంత్రముగ్ధులై ’ వింటున్నారు.   కేసీఆర్ గారు నిర్వికారముగా ప్రశాంత చిత్తులై ఉన్నారు కానీ కొందరి ముఖాలలో కొంత ఆతృత , ఆందోళనలు మొదట కనపడినా , ఆ తర్వాత శాంతి మంత్రాలు వింటూ వారు , పలుకుతూ మేము సర్వులమూ ఒక సుందరలోకములో ప్రశాంతముగా తూగుతున్నట్టు... అదొక అనుభూతి.

ఏర్పాట్లు:- ఏర్పాట్లను గురించి చెప్పకనే ఈ వ్యాసము పూర్తి చేయుట సంతృప్తినివ్వదు. దగ్గర దగ్గర రెండు వేల మందికి అయిదురోజులపాటు సకల సౌకర్యాలూ కల్పించుట [ లక్షలాది భక్తులూ , ముఖ్యులూ , గణ్యులూ దేశము నలుమూలలనుండీ ప్రతిరోజూ రాగా వారికి భోజనాదులు , వసతులు చూచుట మరొక ఎత్తు ] నిజంగా కత్తిమీద సాము వంటిది. ఎక్కడా చిన్న అసౌకర్యము కూడా కలుగకుండా ప్రతిచిన్న వివరాన్నీ గుర్తుంచుకొని చేసిన ఏర్పాట్లు నభూతో న భవిష్యతి.  యాగము జరిగిన ప్రదేశము ఊరికి దూరముగా విసిరేసినట్టు ఉండడము , మంచి రోడ్డు కూడా ఉండకపోవడము , ప్రతిచిన్న వస్తువునూ హైదరాబాదు నుండీ ఎనభై మైళ్ళ దూరానికి తీసుకు వెళ్ళవలసి రావడము వంటి అవరోధాలన్నీ అధిగమించి చేసిన యేర్పాట్లు అపూర్వము. యాగశాలవరకూ , ఎడ్లబండికూడా వెళ్ళలేని దారిలో , అంతకు కొన్ని రోజులముందే అద్భుతమైన తారు రోడ్డును వేయించారు.  వచ్చేవారు ఋత్త్విజులే కానీ యే ఆటగాళ్ళో కాదు కాబట్టి వారి అవసరాలను గుర్తించి తగినట్టు సంభారాలను సమకూర్చుట అనేది నిజంగా కష్టసాధ్యమే. ఉదాహరణకు , ఋత్త్విజులు పాదరక్షలు లేకుండా ప్రతిరోజూ ఒక కిలోమీటరైనా నడవాలి కాబట్టి వారు నడిచే దారిలో ఎటువంటి చిన్న రాళ్ళుగానీ ముళ్ళుగానీ లేకుండా ప్రతిరోజూ మెత్తటి మట్టిని పరిపించడము వంటివి ఎంత ఆలోచించి చేశారో అనిపిస్తుంది. ఒక ఎకరమో రెండెకరాలో వైశాల్యమున్న ప్రదేశములో ఇనప కడ్డీలతో పెద్ద ప్లాటుఫారము వంటి చట్రము , దానిపై చెక్కపలకలు పరవడము , దానిపై నడచుటకు మెత్తటి తివాచీలు , చుట్టూరా గాలి, నీరూ చొరకుండా మెత్తటి, కానీ బలమైన ప్లాస్టిక్ బట్టతో చేసిన డేరాలు , ప్రతిఒకరికీ పడుకోడానికి వసతులు , విద్యుద్దీపాలు , పంకాలు , --అటువంటి రెండు పెద్ద డేరాలు. దూరముగా స్నానాలకు వేడినీరు , చల్లనీరూ కూడా వచ్చే వందలాది కొళాయిలు. మరొకచోట ఆధునికమైన మరుగుదొడ్లు. వాటిని ప్రతినిమిషమూ శుభ్రము చేస్తూ ఇరవైనాలుగు గంటలూ పనివాళ్ళు.

ఇక మరొక చోట అతిపెద్ద డేరా లో భోజన శాల. వంటవారు అన్ని ప్రాంతాలనుండీ వచ్చినవారు సుమారు ఐదువందలమంది దాకా. మొదటి రోజు వారిలో ఒకింత సమన్వయములేక వంట సరిగ్గా చేయలేకపోయారు. అది తెలిసిన కేసీఆర్ గారు స్వయముగా వచ్చి తగు సూచనలిచ్చి , మరుసటిరోజు నుండీ ఎట్టి ఫిర్యాదులూ రాకుండా అద్భుతమైన వంటకాలు చేయించారు. చివరిరోజున వంటవారిలో ముఖ్యుడికి కేసీఆర్ గారు స్వర్ణ కంకణము తొడిగి శాలువా కప్పడములోనే ఆయన శ్రద్ధ , అంకితభావము తెలుస్తున్నాయి. 

ఇవికాక, ఆహూతులకు , గణ్యులకూ , జనసామాన్యానికీ వేరు వేరుగా భోజన వసతులు సర్వులకూ తృప్తికలిగేలా సాత్త్వికమయిన , రుచిగల వంటకాలు రెండుపూటలా సిద్ధము. ఇక ఫలహారాలు , పానీయాలకు , కొబ్బరిబోండాము లకూ లెక్కేలేదు. 

ఋత్త్విజులకు ప్రతిరోజూ సాయంత్రము , తర్వాతిరోజు కట్టుకోవలసిన దీక్షా వస్త్రాలు పంపిణీ చేయడము , వారికి కావలసిన సమస్త వస్తువులూ వారివద్దకే తెచ్చి ఇవ్వడము [ వస్త్రాలు , పారాయణకు పుస్తకాలు , వ్యాస పీఠాలు , కూర్చోడానికి నాణ్యమైన పీటలు , వాటిపై మెత్తటి పట్టువంటి ఆసనాలు , ఇత్తడి పంచపాత్ర , హరివాణము , చెంబు,  సామగ్రి ఉంచుకోడానికి సంచులు వంటివే గాక , సబ్బులు , సబ్బుపెట్టెలు , నూనెలు , దంతధావనానికి స్నానానికీ కావలసినవి, చివరకు మడి బట్టలు ఆరేసుకోవడానికి తంతులు...క్లిప్పులు....తాగడానికి లక్షలాది మంచినీటి సీసాలు , యాగశాలలో అనుష్ఠానాలు చేసుకోవడానికి మడినీళ్ళు...అద్భుతం.  ] అలాగ సర్వ సౌకర్యాలూ కల్పించడము అనితర సాధ్యము. 

వారికి ఈ మహత్కార్యములో సర్వవిధములా  సహాయ సహకారాలు అందించి యాగపు దిగ్విజయ పరిసమాప్తికి తోడ్పడిన శ్రీయుతులు వే|| బ్ర|| శ్రీ గోపీకృష్ణ శర్మ గారు , శశాంక ఫణిశర్మ గారు అభినందనీయులు. 

ఋత్త్విజులనూ , అతిథులను , నిర్వాహకులను ఘనముగా సత్కరించి కేసీఆర్ గారు తమ ఉదార బుద్ధినీ అంకితభావాన్నీ చాటుకున్నారు. 

తెలంగాణాకు , భారతదేశానికీ సర్వతో ముఖాభివృద్ధి కలిగి తమ ఆశలు నెరవేరగనే ఈసారి " ప్రయుత చండీ మహా యాగము " నిర్వహిస్తానని ప్రకటించిన శ్రీ కేసీఆర్ గారి కోరిక ఆ దేవి అనుగ్రహముతో త్వరలోనే ఈడేరుగాక !!!

|| సర్వేజనాః సుఖినో భవంతు ||

Thursday, December 17, 2015

సనాతన ధర్మపు రహస్యము---రెండో భాగము.

సనాతన ధర్మపు రహస్యము---రెండో భాగము.

ధర్మ విచారము

మహాస్వాములు తమిళనాట ఒక పల్లెలో 1926  లో శిబిరము వేసినపుడు వారిని దర్శించుటకు ఒక యూరోపియన్  వ్యక్తి వచ్చినారు. ఈ సంభాషణను రాసిన శ్రీ కృష్ణ అయ్యర్ గారికి ఆ యూరోపియన్ పేరు తెలియకపోవడము వల్లనో యేమో ,  అతడికి మిస్టర్ " ఎ " అని పేరు పెట్టారు...సౌలభ్యం కోసము.

భారతీయ వేదాంత శాస్త్రము గురించి అప్పటికే ఆయన కొన్ని పుస్తకాలు చదివి , వాటి బోధనల వలన ప్రభావితులైనారు. స్వామితో వారి ప్రసంగము :_

మిస్టర్ " ఎ ":- " స్వాములవారూ , హిందూ ధర్మపు బోధనల వలన నేను ఎంతో ప్రభావితుడనై ఉన్నాను. నన్ను  మీ ధర్మములోనికి  మతాంతరము చేసి చేర్చుకొన వలసినదని నా అభ్యర్థన. నా వలెనే , హిందువులుగా మారి పరివర్తన చెందవలెనన్న ఆశ ఉన్న నామిత్రులు అనేకులున్నారు. వారిని కూడా పిలుచుకు వస్తాను. మా అందరికీ ఈ హిందూ ధర్మము వలన ఎంతో ప్రయోజనము చేకూరగలదని అవగతము అయినది.. "


గురువులు :- " హిందూ ధర్మము ఈ జగత్తులోని ఆలోచనా శీలురైన జిజ్ఞాసువుల నందరినీ  తన వైపుకు ఆకర్షించుకొనుటలో ఆశ్చర్యము కానీ అబద్ధముగానీ లేవు. కానీ మా ధర్మము కానీ మేము కానీ మతాంతరములను , మత మార్పిడులను ఒప్పుకొనుట కానీ ప్రోత్సహించుట కానీ చేయము.

మిస్టర్ " ఎ ":- " మీ హిందూ ధర్మము మానవ కులానికే హితకారి అనునది తెలుసుకొని అంగీకరించినపుడే , తమరు , మతాంతరము చెందుటకు ఆశపడేవాళ్ళను అందులోకి చేరుటకు అవకాశము నియ్యవలెను అనునది స్పష్టమగుచున్నది కదా ? మతాంతరము వద్దని ఎందుకు శెలవిస్తున్నారు , తెలుసుకోవచ్చునా ? "

గురువులు :- " మా ధర్మములోనికి వచ్చి హిందువుగా పరివర్తన చెందవలెనన్న ఆశ ఉన్న  ఏ వ్యక్తి అయినా , హిందువు కాకపోయినపుడు కదా , మతాంతరపు ప్రశ్న వచ్చేది ? "

మిస్టర్ " ఎ ":- " అదెలాగ ? హిందువుగా పరివర్తన కావాలన్న కోరిక ఉన్న నా వంటివారు , హిందువుగా మారకుండానే , కేవలము కోరుకున్నంత మాత్రానే హిందువులము అనిపించుకుంటామా ? ప్రస్తుతము మా మతము వేరు కదా ? అంటే హిందువుగా మారుటకు ఏ విధమయిన సాంప్రదాయక విధి ఆచరణ కూడా అవసరము లేదని స్వాముల అభిప్రాయమా ? " 

గురువులు :- " కాదు , హిందువులము అనిపించుకోవలెనని కోరే వారు , ఆ విధముగా కోరని వారూ , అందరూ కూడా హిందువులే అన్నది నా అభిప్రాయము. "

మిస్టర్ " ఎ ":-  ఆశ్చర్యపోతూ , " అదెలా సాధ్యము ? "

గురువులు :-" మన ధర్మానికి " హిందు " అన్న పేరు వచ్చినది  ఈ మధ్య మాత్రమే. దాని నిజమయిన పేరు , " సనాతన ధర్మము ".అది ఏదో ఒక నిర్దిష్ట కాలములో గానీ , ఎవరో ఒక నిర్దిష్ట మతస్థాపకుని వల్లకానీ స్థాపించబడినది కాదు. ప్రారంభమయినది కాదు. సార్వత్రికమైన ఆ ధర్మము ఏదో ఒక భౌగోళిక ప్రాంతానికి పరిమితమయినది కాదు. ఇంతవరకూ ఈ జగత్తులో జన్మించిన , ఇకముందు జన్మించబోయే సమస్త జీవులూ , ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా , కోరినా కోరకున్నా ఈ ధర్మానికి చెందినవారే . ఇది సృష్టి నియమము. ఈ నియమానికి ఏ అడ్డూ లేదు. అగ్ని కాల్చుతుంది అన్నది సత్యము. దానికి,  తన కాల్చేగుణాన్ని నిరూపించుటకు యే ప్రమాణమూ అవసరము లేదు. మనము ఒప్పుకున్నా , లేకున్నా , అగ్ని యొక్క గుణ-స్వభావములలో ఎటువంటి మార్పులూ పరిమితులూ ఉండవు. ఒకరు ఒప్పుకోనంత మాత్రాన దానికి యే లోటూ రాదు. మనము అది తెలుసుకొని ఒప్పుకుంటే మనకు శ్రేయస్సు. లేకపోతే చెడేది మనమే. సనాతన ధర్మము కూడా అదే విధమైనది. "

మిస్టర్ " ఎ ":- " ప్రపంచములోని అందరూ హిందువులే అని తమరు అంటే , మరి వివిధ జాతులున్నాయి కదా ? దానికేమి చెపుతారు ? ఎలా సమర్థిస్తారు ? "

గురువులు :- " అందరూ హిందువులే అంటే దాని అర్థము , అందరూ తమ తమ అభిప్రాయము లేదా మతము లలో మార్గదర్శనము పొందుటకు అర్హులు అని అర్థము. అయితే ఈ మార్గదర్శనము అందరికీ ఒకే రీతిలో ఉంటుందని అర్థము కాదు. మనిషికి పుట్టుకతో వచ్చిన ఆచారాలు , స్వభావాలు , పూర్వ జన్మ సంస్కారాలు , పరిసరాలు , పరిస్థితులు , మరియు అతడు పుట్టిన తరువాత పొందే శిక్షణలు --ఇవన్నీ అందరికీ ఒకే విధముగా ఉండుట అసాధ్యము. పరస్పర వైరుధ్యాలున్ననూ ఒకదానికొకటి విరోధము కాని ఈ సత్యాన్ని గణనకు తీసుకొని , సనాతన ధర్మము ’ సామాన్య ధర్మము ’ మరియు ’ విశేష ధర్మము ’ అను విభజన మూలముగా మీ సమస్యను పరిష్కరిస్తుంది. మొదటిది [ సామాన్య ధర్మము ] సర్వ మానవాళికే సహకారి , ప్రయోజనకారి.  ఈ మొదటిదీ , రెండవదీ [ విశేష ధర్మము ]  రెండూ చేరి మతాల చట్రము లోపల వచ్చువారికి ఉపయుక్తమైనవి. వివిధ కులాల వారికి కూడా అదే విధముగా ఉపయోగమైనవి. "

మిస్టర్ " ఎ ":- " ఈ విశేష ధర్మములకు కూడా ఆధ్యాత్మిక విలువలున్నాయి , ప్రయోజనము ఉంది అన్నట్టయితే , వాటి ప్రయోజనాన్ని వర్ణ వ్యవస్థ లో లేని వారు , ఇతర మతస్థులు ఎందుకు పొందరాదు ? "

గురువులు :- " నీరు అన్ని జీవులకూ ప్రయోజనకారి. అయితే , ఎండ తాపానికి గురయిన వ్యక్తికీ , మరియూ జ్వరముతో బాధపడే వ్యక్తికీ ఒకే విధముగా ప్రయోజనము నిస్తుందా ? సందర్భమునకు తగినట్టు దాని ప్రయోజనము మారదూ ? "

మిస్టర్ " ఎ ":- " మీ ఈ ఉదాహరణ నాకు అంతగా సమ్మతము అగుట లేదు. ఒక నిర్దిష్ట వర్గానికి అన్వయించే నియమము , ఆ వర్గానికి చెందని వారికిగానీ , లేక వేరే యే వర్గానికీ చెందని వారికి గానీ హాని కారకము అంటూ సమర్థించుటకు యే ఆధారమూ కనపడుట లేదు. "

గురువులు :- " అదే విధముగా , ఆ నియమాలు " సర్వులకూ ప్రయోజనకారులు "  అని సమర్థించుటకు కూడా సాధ్యము కాదు. ఎందుకంటే , అవి ఒక నిర్దిష్ట వర్గానికి చెందినందు వల్ల మాత్రమే ప్రయోజన కారులు అయినాయి. ఆ కారణము చేతనే అవి " విశేష ధర్మాలు " అనిపించుకున్నాయి . కాబట్టి అట్టి నియమాలకు సార్వత్రికముగా అన్వయము ఉండుటకు సాధ్యము కాదు. ఈ విధమయిన నియమాల [ ధర్మాల ]  గురించి మనకు శాస్త్రాలు మాత్రమే తెలియజేస్తాయి. అలాగ , ’ శాస్త్రము చెప్పే ధర్మాలు ప్రయోజనకారులు ’ అను విషయాన్ని ఒప్పుకున్నప్పుడు , ఆ నియమాలు ఎవరికి ఉపయోగము , ఎవరికి కాదు అన్నది కూడా తెలియజేసే అవే శాస్త్రాల ఆదేశాలను పరిపూర్ణముగా ఒప్పుకోవలసి ఉంటుంది.

శాస్త్రముల ద్వారా , ధర్మము వలన ప్రయోజనము ఉంది అని తెలుసుకున్న మీరు , అందరికీ ఏకరూపముగా ధర్మాలను చెప్పలేదు , వేరు వేరు ధర్మాలను చెప్పినాయి అనే కారణము వల్ల అవే శాస్త్రాలను నిరాకరిస్తారా ? అలా చేయుటకు సాధ్యమే లేదు కదా . శాస్త్రపు ఒక ఆదేశము సరియైనది , మరొకటి సరి కాదు అనుటకు సాధ్యము కాదు. మనుషుల ప్రవర్తనను నియంత్రించుటే శాస్త్రముల ఉద్దేశము. సనాతన ధర్మము కానివ్వండి , మరే ఇతర మతము కానివ్వండి , అధికార సిద్ధాంతాన్ని పాటిస్తాయి. [ అధికారము అంటే అర్హత ] . ధర్మమును పాలించుటకు అధికార స్వరూపాన్ని నిర్ణయించుట అవసరము. వర్ణాల చట్రములోకి వచ్చే వారు విశేష ధర్మాన్ని పాలించుటకు అర్హులు. రానివారు కేవలము సామాన్య ధర్మాన్ని పాటించుటకు అర్హులు. కాబట్టి , మానవ జాతి మొత్తము ఈ రెంటిలో ఏదో ఒక ధర్మాన్ని పాటించవలసినదే. "

మిస్టర్ " ఎ ":- " సనాత
శాస్త్రాలు సర్వ మానవాళికే హితకారులు అయినప్పుడు , మరియు , తమరు చెప్పినట్టు ఈ జగత్తులో పుట్టిన వారందరూ మీ ధర్మానికే చెందిన వారు అయితే , ప్రపంచములోని ఇతర ధర్మాల గురించి ఏమి చెపుతారు ? తమరి అభిప్రాయమేది ?"

గురువులు :-" ఆయా ధర్మాలకు , మతాలకు చెందిన వారు,  ’ తమ ధర్మాలు సనాతన ధర్మమునుండే పుట్టినవి , దాని అంగములే అన్నది తెలుసుకొనకుండుట వారి తప్పు. ఇతర అన్ని ధర్మాల లోని ఉత్తమమైన , ఉత్కృష్టమైన బోధనలూ కూడా సనాతన ధర్మములోనే మూలాలను కలిగియున్నాయి. అవన్నీ సనాతన ధర్మపు ’ సామాన్య ధర్మపు ’ నియమాలలో భాగాలే. "

మిస్టర్ " ఎ ":- "స్వామీ , ఇది అతిశయముగా లేదూ ? ఇతరులు దీనిని ఎందుకు ఒప్పుకోవలెను ? "

గురువులు :- " ప్రస్తుతము మన చర్చ , సనాతన ధర్మానికి ఇతరులు మాన్యత నిచ్చుట  అనునది కాదు. ఏదైనా ఒక వస్తువులో అంతస్థముగా ఉన్న ఒక మౌల్యము , దానిని ఇతరులు ఒప్పుకున్నా లేకున్నా , ఉండనే ఉంటుంది. ప్రాథమికముగా శాస్త్రము అతి ఔదార్య స్థాయిలో చెపుతుంది గనక , ఇతరులు ఒప్పుకోరన్న కారణముతో దానిని ఇంకా కింది స్థాయికి తెచ్చుట అసాధ్యము. "

మిస్టర్ " ఎ ":- " ఎలాగ , దయచేసి వివరించండి "

గురువులు :- " మీకు పూర్తిగా అర్థము కావలెనంటే నేను క్రైస్తవ మతపు ఉదాహరణ తీసుకొని వివరిస్తే తమరు నన్ను క్షమిస్తారని భావిస్తున్నాను.

సశేషము ......

Tuesday, December 15, 2015

సనాతన ధర్మపు రహస్యము--- మొదటి భాగము

సనాతన ధర్మపు రహస్యము--- మొదటి భాగము



అనేక సార్లు , " సనాతన ధర్మము ఎటు పోతున్నది ? రోజురోజుకూ మన ధర్మాన్ని కించపరుస్తూ తూలనాడేవాళ్ళే ఎక్కువవుతున్నారు.. మిగిలిన మతాలన్నిటికీ మార్గదర్శనము నిచ్చిన సనాతన ధర్మమును ఎందుకు ఇతరులు ద్వేషిస్తున్నారు ? ఇతరుల మాట అలా ఉంచితే , మనవారే ఎందుకు మన గొప్పదనాన్ని అర్థము చేసుకొనుట లేదు ? ఎవరికి ఇష్టము వచ్చినట్లు వారెందుకు వ్యాఖ్యానిస్తున్నారు ? అపౌరుషేయమైన వేదములే పునాదిగా గల మన ధర్మానికి గ్లాని కలుగుతుంటే మూఢుల వాదనలను  , వక్రభాష్యాలనూ తిప్పికొట్టి కనువిప్పు కల్గించే వారే లేరా ? సనాతన ధర్మపు గొప్పతనము తెలిసిననూ , దానిని అందరికీ సరిగ్గా వివరించలేక ఇంకా అయోమయానికి గురి చేస్తున్న నేటి కొందరు గురువులకు మార్గదర్శనమే లేదా ?  పీఠాధిపతుల మొదటి కర్తవ్యము ఇట్టి సందేహ నివృత్తి చేసి అందరికీ ఒక విశ్వాసాన్నీ , ధైర్యాన్నీ , ప్రశాంతతనూ కలిగించుట కాదా ? వారెందుకు మాట్లాడరు ? ఇతర మతస్థుల ఉన్మాదపు వాదనలకు దీటైన సమాధానము నెందుకు ఇవ్వకున్నారు....
అన్న ఆలోచనలు మొన్నటిదాకా నన్ను తొలిచేవి...

అటువంటి ఆలోచన అహంకార పూరితమైనదనీ , నాకు కలిగిన ఈ సందేహాలు , వాటికి సమాధానాలూ  మన జగద్గురువులకు తెలియనివి కావనీ , అందరికన్నా ముందే వారు ఇట్టి విషయాలపై దృష్టి సారించడమే గాక , తగు వివరణా , ఉపదేశమూ , హితబోధా చేసినారనీ , అది తెలుసుకోకపోవడము నా మూర్ఖత్వమేననీ సమయము వస్తేనే గానీ ఏదీ మన కళ్ళకు కనపడదనీ ఈ మధ్యే బోధ అయినది...
అప్పటి జగద్గురువులు శ్రీ చంద్రశేఖర భారతీ స్వాముల వారు ఇటువంటి అనేక విషయములపై , స్పష్టముగా , తార్కికముగా , మానవాళి శ్రేయస్సు కోసము ఎంతో విలువైన సమాచారమును ఇచ్చి ఉన్నారు.
ఒకానొక కన్నడ బ్లాగులో నాకు సమాధానాలు దొరికినాయి..ముఖ్యముగా " మతమార్పిడులను " గురించిన వివరణ నన్ను అప్రతిభుడిని చేసింది.. అక్కడ నేను చదివినది మీ , మన అందరి సౌలభ్యము కోసము అనువదించి ఇస్తున్నాను.

1925-27  మధ్య రెండు సంవత్సరముల కాలము శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామివారు తమిళనాడులోని వివిధ ప్రదేశాలలో సంచారము చేసినపుడు అక్కడి అనేక జిజ్ఞాసువులు - భక్తులూ స్వామీజీ వారిని సందర్శించి , తమ తమ సందేహాలను నివృత్తి చేసుకొనే వారు. ఆ సమయములో స్వామివారితోపాటూ ఉన్న కృష్ణ స్వామి అయ్యర్ అనువారు , అక్కడ జరిగిన సంభాషణలను రాసుకొని ఆంగ్లములో ,." From the master's lips "  అను పేరుతో 1930  లో ప్రచురించినారు.. ఆ తరువాత   " Dialogues with the Guru "  అను పేరుతో ముంబైలో పునర్ముద్రితమైనదని , ఇప్పుడు ఆ పుస్తకాలు దొరకుట లేదనీ ఆ బ్లాగరు రాసినారు. ఆ పుస్తకములో పన్నెండు అధ్యాయాలున్నాయట. వాటిలో మొదటి అధ్యాయము / మొదటి సంభాషణ జిజ్ఞాసువులకు అనుకూలము కాగలదను సంకల్పముతో ఆ బ్లాగరు కన్నడ భాషకు అనువదించినారు. దానినే నేను తెలుగులోకి అనువదిస్తున్నాను.

శ్రీ చంద్రశేఖర భారతీ స్వాములు కేవలము ఒక పీఠాధిపతి మాత్రమే కాదు , ఆ పీఠమును అధిరోహించినారు అన్న కారణము చేత మాత్రమే కాదు , శాస్త్రాధ్యయనము , తపస్సు మొదలగు అనేక కారణముల వలన విశిష్టముగా గుర్తింపబడినవారు. కాబట్టి వారి మాటలకు ఎంతో మహత్త్వము ఉన్నది. కన్నడలో " శారదా పీఠద మాణిక్య " అను పుస్తకములో వారి వ్యక్తిత్వపు వైశిష్ట్యత గురించి విపులముగా నున్నదట ..

రెండో భాగములో వారి ఉపదేశము , ప్రవచనమూ చదవగలరు... పైన పేర్కొన్న పుస్తకాలు ఎవరివద్దనైనా ఉంటే దయచేసి తెలియజేయ గలరు ..


నేను చూసిన ఆ కన్నడ బ్లాగు ఇదీ...
http://herige.blogspot.in/2014/07/blog-post_6.html


Saturday, November 14, 2015

నైవేద్యము-విశేషాలు

శ్రీ గురుభ్యో నమః ||

నైవేద్యము-విశేషాలు
నైవేద్యము అన్న మాట వినగానే గుళ్ళూ , పూజలూ గుర్తొస్తాయి. సమంజసమే. గుళ్ళూ , పూజలూ మాత్రమే గుర్తుకు రావలెను.  ఈ నైవేద్యము అన్న మాటను దేవుడికి ఆహారమును నివేదించు సందర్భములో మాత్రమే వాడవలెను. 
వెంటనే ఒక ప్రశ్న:-- దేవుడు మనం ఇచ్చే ఆహారము తింటాడా ? మరి నైవేద్యము అయ్యాక , పదార్థాలన్నీ అలాగే ఉంటాయే ? వాటిని మనమే తింటున్నాము కదా ?
అవును.  వాటిని మనమే తింటున్నాము ...
అవును.  వాటిని దేవుడు తింటాడు.
పైవి రెండూ సరియైనవే. 

నివేదించిన పదార్థములు అలాగే ఉండుటకు కారణము , భగవంతుడు వాటిని ఆస్వాదించిన తరువాత , మనకు " ప్రసాదము " గా ఇస్తాడు కాబట్టి. 
అదెలాగ ? కొంచము అర్థమయ్యేటట్టు చెప్పరూ అంటారా ?  అలాగే. 

మానవులకూ , ఇతర ప్రాణులకూ ఉన్నట్టే , మానవేతర జీవులకూ , భగవంతుడికీ కూడా ఒక శరీరము ఉంటుంది. మనకు ప్రాణము ఉన్నట్టే అందరికీ ప్రాణము ఉంటుంది...దానినే చైతన్యము అనవచ్చు. ఆ చైతన్యమే అంతటా ఉండేది.  మనకున్న ప్రాణము ఒకటి కాదు. అయిదు. వాటినే పంచప్రాణాలు అంటారు. అవే , ప్రాణము , అపానము , వ్యానము , ఉదానము మరియు సమానము. 
భగవంతుడికి శరీరమేమిటి ?
శరీరమంటే మనకున్న , మనము అనుకునే పాంచభౌతికమైన శరీరం కాదు. దేవతల శరీరాలలో పృథ్వీ భూతము , జలభూతములుండవు. ఆకాశము , తేజస్సు , వాయువు రూపములలోనే దేవతలు సంచరిస్తారు. మనకు అయినట్టు వారికి ఆకలి కాదు. వారిక్ కలుగు ఆకలిని మనము మన పరిజ్ఞానముతో నిర్వచించలేము. అసలు వారున్న స్థాయి , మెట్టు వేరు. మనకు అన్వయించు అనేక విషయములు వారికి అన్వయించవు. అన్వయించేవి అదే తీరుగా ఉండవు. కాబట్టి అటువంటి పోలికలను వెదకుట పూర్తిగా అసంబద్ధమైనది.   కానీ మనము నివేదించిన పదార్థాలను చూచినంతనే సంతృప్తి చెందుతారు. వారి ఆకలి దానితో తీరినట్టే.

ముఖ్యముగా హోమములు చేసి ఇచ్చిన ఆహుతులవలన అగ్ని , ఇంద్ర , యమ , వాయు , సూర్య , చంద్ర , బృహస్పతి , మిత్ర  వరుణ , సోమ , సవితృ , రుద్ర, విష్ణువు మొదలుగా అనేక దేవతలు  తృప్తి చెందుతారు. యజ్ఞ భావనతో సమర్పించిన యే నైవేద్యమునయినా ఆయా దేవతలు సంతోషముగా స్వీకరిస్తారు.
 దీనిని వివరిస్తూ , యజుర్వేదములోని మూడో కాండములోని నాలుగో ప్రశ్నలో , " అగ్నిర్భూతానమధిపతిః..  ." మొదలుకొని పదునెనిమిది మంత్రాలను ఆయా దేవతలను తృప్తి పరచుటకొరకు వినియోగించవలెను ...అని చెబుతుంది. ఆ పద్దెనిమిది  మంత్రాలను " " అభ్యాతాన " మంత్రములు అంటారు. ఒకప్పుడు దేవతలూ , రాక్షసులూ కూడా ఒకే విధమయిన హోమములు , యజ్ఞములూ చేసేవారు. కానీ దేవతలకు మాత్రమే యజ్ఞ ఫలము దొరికేది. దానికి కారణము , దేవతలు ఈ పద్దెనిమిది అభ్యాతాన మంత్రములను కనుగొని వాటిని ఉపయోగించుకొని , తమ తమ కర్మలను సమృద్ధి పరచుకొన్నారు. రాక్షసులకు ఆ మంత్రములు తెలీక కర్మ భష్టులైనారు. యే కారణము చేత దేవతలు ఈ అభ్యాతాన మంత్రములను సంపాదించినారో , ఆ కారణము వలన ఆ మంత్రాలు " వైశ్వదేవములు " అని పిలవబడుతున్నాయి. భూతముల ఆకలితీర్చు యే ప్రక్రియ అయిననూ " వైశ్వదేవము " అనిపించుకుంటుంది. ఆ మంత్రములు దేవతలనుండీ ఋషులకూ , వారినుండీ  విప్రులకూ  వచ్చినవి. ఈనాటికీ యే చిన్న హోమమైననూ ఈ అభ్యాతాన మంత్రములు లేకుండా పూర్తి కాదు. [ ఇవే కాక జయాదులు , రాష్ట్రభృత్ మంత్రాలు అని ఉన్నాయి.. అవి ఈ చర్చలో అప్రస్తుతము ] వైశ్వదేవము అంటే  భూతముల ఆకలి తృప్తి పరచుటయే కాబట్టి , హోమమైననూ , పూజ అయిననూ యజ్ఞభావముతో చేసినపుడు , ఆయా దేవతల ఆకలి తీరి సంతుష్టులవుతారు. ఆయా మంత్రములు లేకున్ననూ , భావన ముఖ్యము. 

ఆ క్రమ విధానమే ఈనాటికీ పూజలలో పాటించబడుతున్నది. 

కాబట్టి , దేవతలకు నైవేద్యము సమర్పించుట వలన మన కర్మలు సఫలమై శుభములను పొందుతాము. 
దేవతలు మనకు వర్షాలు కురిపించగలరు. కానీ దుక్కి దున్ని పొలాలను పండించవలసినది మనమే. దేవతల శరీరాలు ఆ పని చేయలేవు.
అలాగే , దేవతలు పంటలు సమృద్ధిగా పండునట్లు చేయగలరు. కానీ ఆపండిన పంటలను శుచిగా వండుట వారికి రాదు. మానవులము మాత్రమే అది చేయగలము. 

మానవులకు వర్షాలు కురిపించు శక్తి లేదు. పొలాలను సాగుచేయ గలమే కానీ మొక్కలు , పంటలు పెరగకపోతే మనము చేయగలిగినదేమీ లేదు.  దేవతలు , మానవులు ఎప్పటికీ మిత్రులేగానీ శత్రువులు కారు. కాబట్టి ఒకరికొకరు సహకరించుకుంటాము.  
దేవతల అనుగ్రహము వల్ల పండిన పంటలను మనము వండుకు తింటూ , అనుభవిస్తూ , వారికి నివేదించకపోవడము మహా పాపము. ఎవడైతే అలా నివేదించకుండా తాను మాత్రమే తింటున్నాడో వాడు పాపమును తింటున్నట్లే. అంతేకాక , వండిదానిని కొంచమైననూ అతిథులకు సమర్పించక తాను మాత్రమే తినరాదు. అది వీలుకానప్పుడు కనీసము మొదటి ముద్దనయిననూ , పశుపక్ష్యాదులను తలచుకొని , బయట పెట్టి మిగిలినదానిని దేవుడికి సమరించినట్టు భావించి , ఆ సమర్పణా భావముతో కళ్లకద్దుకొని తాను తినవలెను. అసలు భోజనము చేయుటయే ఒక యజ్ఞము. దానిని ఆత్మ యజ్ఞము అంటారు. దేహములోని అయిదు ప్రాణములకు ఆహుతులను ఇచ్చి తాను తినవలెను. [భోజనము చేయు విధానము మరొక వ్యాసములో..]

సరే ఈ నైవేద్యమును ఎలాగ సమర్పించవలెను ? 

శుచిగా వండిన సాత్త్వికమైన ఆహారమును నేతితో అభిఘారము చేయవలెను [ నేతిని కొద్దిగా పదార్థముపై కలుపుట ]
ఒక కంచు , ఇత్తడి పత్ర లేదా , అరిటాకు , లేదా విస్తరి [  ఈ మధ్య స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు వాడుట వాడుక అయింది] లోకి వండిన పదార్థమును తీసుకోవలెను. దానిని ఆవాహన చేసి పూజించిన దేవుడి పటముగానీ విగ్రహముగానీ కలశమునకు గానీ ఎదురుగా , నేలపైన పెట్టవలెను. అయితే అలాగే పెట్టరాదు, మొదట నేలపై నీటితో ఒక చతురస్ర మండలమును గీయవలెను. దానిపై నాలుగు అక్షతలు చల్లి దానిపై పాత్రను మూత తీసి ఉంచవలెను. మండలము ఎలా గీయవలెనో బొమ్మలో చూడవచ్చు. 

నైరృతి నుండీ  మొదలు పెట్టి వాయవ్యమునకు , అక్కడనుండీ  ఈశాన్యానికి, అక్కడనుండీ ఆగ్నేయానికీ , తర్వాత  నైరృతికీ సరళరేఖలు గీసి , నైరృతి నుండీ ఈశాన్యానికి అడ్డముగా ఒక సరళరేఖ గీయవలెను. ఇదే మండలము. 

తరువాత ఆ మండలముపై నైవేద్యపు పాత్రను పెట్టి , చేతిలో తులసీ దళమును శుద్ధోదకముతో పాటూ తీసుకొని ఈ మంత్రము పలుక వలెను
ఓం విశ్వామిత్ర ఋషిః | సవితా దేవతా | గాయత్రీ ఛందః | 
తర్వాత గాయత్రీ మంత్రము పలుకుతూ నీటితో ప్రోక్షణ చేసి సవ్యముగా పాత్రచుట్టూ కూడా పరిషేచన చేయవలెను[ నీటిని వదలవలెను]. పరిషేచన చేయునపుడు, 
పగలైతే | సత్యం త్వర్తేన పరిషించామ్ | అనీ , 
 రాత్రైతే |ఋతం త్వా సత్యేన పరిషించామి| 
అనీ పలకవలెను. తర్వాత | అమృతమస్తు | అమృతోపస్తరణమసి స్వాహా | అంటూ రెండు ఉద్ధరిణెల నీరు హరివాణములో వదలాలి.

తర్వాత  పంచప్రాణములకు ఆహుతులను ఇచ్చు సంకల్పముతో,
ప్రాణాయ స్వాహా , 
అపానాయ స్వాహా , 
వ్యానాయ స్వాహా , 
ఉదానాయ స్వాహా , 
సమానాయ స్వాహా  
అని పలుకుతూ పంచ ముద్రలు చూపవలెను. ఇంకా ధేను ముద్ర కూడా చూపుట ఉత్తమము. అన్ని పదార్థాలనూ చూపి, తులసిని అన్నము మీద ఉంచవలెను. 
ఈ ముద్రలు రాని వారు , అయిదు సార్లు కుడి అరచేతితో దేవుడికి నైవేద్యాన్ని చూపవచ్చును. భావము ముఖ్యము. 
ఒక ఉద్దరిణెడు నీరు వదలి , మనము సమర్పించిన నైవేద్యము స్థిమని సూచించుటకు , 
| అమృతోపిధానమసి స్వాహా| అని పలుక వలెను. ఇది నైవేద్యముపూర్తయినదని ఉద్వాసన చెప్పుట కూడా . 
తర్వాత కింది మంత్రాలు పలుకుతూ ఆరు సార్లు ఉద్ధరిణతో నీరు వదలాలి
ఉత్తరాపోశనం సమర్పయామి , 
హస్త ప్రక్షాళనం సమర్పయామి ,
ముఖ ప్రక్షాళనం సమర్పయామి
గండూషం కల్పయామి
పునరాచమనీయం సమర్పయామి

ఇక్కడికి నైవేద్య ప్రకరము ముగిసినట్టు. ఆ పదార్థాలను తీసివేయవచ్చు. 

నైవేద్యము అంటే పైన చెప్పినవన్నీ చేస్తేనే అయినట్టు కాదు. ఇటువంటి తంతులన్నీ కేవలము మన మనో స్వచ్ఛత , ఏకాగ్రతలు పెరుగుట కొరకు మాత్రమే. ఏకాగ్రతలు బలమయినపుడు ఇటువంటి కర్మాచరణ దానంతట అదే తొలగిపోతుంది. ఒక ఆసక్తి కరమయిన సంఘటన శృంగేరీ శారదా పీఠములో , అప్పటి జగద్గురువులు శ్రీ శ్రీ చంద్రశేఖర భారతీ తీర్థుల వారి సమయములో జరిగింది.




ఒకసారి వారి దర్శనానికై వచ్చిన  శిష్యులొకరు , పెద్దదైన ఒక మరకత లింగమును తెచ్చి వారి ముందుంచినారు. " ఏమిటి సంగతి ? " అని గురువులు అడిగినారు.

" మహాస్వామీ , ఈ మహా లింగము మాయింటిలో అనేక తరాలనుండీ ఉంది. ఇప్పటి మా పరిస్థితులలో , మాకున్న సమయములో సరియైన క్రమములో దీనిని పూజించుటకు మేము అసమర్థులమై ఉన్నాము. అందుకని దీనిని శ్రీ గురువులకు అప్పజెప్పిపోదామని వచ్చినాము. గురువులు దీనిని  స్వీకరించవలసినదిగా మా ప్రార్థన " అన్నారు. 

" సరియైన క్రమములో పూజ చేయుట అంటే ఏమిటి ? క్లిష్ట పరిస్థితి అంటున్నారు.. మీ యింటిలో అందరూ భోజనాలు చేయుట కూడా మానేసినారా యేమి ?"

" లేదు స్వామీ , అటువంటి పరిస్థితి లేదు "

" అయితే , దీనిని పూజించుటకు మీకు ఇబ్బంది యేమిటి ? భగవంతుడు యేమీ తినడు. మనవలె అతడికి ఎన్నడూ ఆకలి కాదు. మీరు నిత్యమూ భోజనము చేయుటకు వంట చేస్తూనే ఉన్నారు కదా ? భగవంతుని కృపాశీర్వచనమును కృతజ్ఞతతో స్మరించుటకు , భోజనానికి ముందు ఆ పదార్థాలను దేవుడికి నివేదించండి. ఆ నివేదనవల్ల పవిత్రమగు ఆ ఆహారాన్ని మీరు స్వీకరించండి. దేవుడు మీనుండీ ఏమీ కోరడు. విశిష్టమైన కొన్ని ప్రత్యేక విగ్రహాలకు తప్ప , మిగిలిన విగ్రహాలకు , మీరు భుజించే , శాస్త్ర విరుద్ధము కాని పదార్థాలను నివేదిస్తే చాలు. దానికోసమై ప్రత్యేకముగా శ్రమపడనవసరము లేదు. విశేష ఖర్చులూ ఉండవు. మరి అలాంటప్పుడు పూజ చేయుటకు అసమర్థులము అని ఎందుకు భావిస్తున్నారు ? మీరు ఎంత పేదవారైననూ , భోజనమే మాను పరిస్థితి లేదు కదా ? అటువంటి పరిస్థితి ఉంటే అప్పుడు అసమర్థులము అని చెప్పుకోవచ్చును. ఒక ఫలమో , ఒక లోటా పాలో , చివరికి ఒక లోటా నీరైనా సరే , మీకు ఉన్నపుడు , అదే దేవుడికీ చాలు. దానినే భక్తితో అర్పించండి. కాబట్టి ఈ లింగాన్ని మీరే తీసుకొని వెళ్లవలెను. భగవదారాధనకు సమయాభావమని మానకండి. ఆకలైనపుడు సావకాశముగా భోజనము చేసే వ్యవధి లేకపోతే ఆత్రాత్రముగా నాలుగు ముద్దలైనా మింగుతాము కదా , ఉపవాసము ఉండము. మృష్టాన్నము లేకున్ననూ సామాన్య భోజనమైనా చేసి ఆకలి తీర్చుకుంటాము కదా , అట్లే దేవతార్చనను లఘువుగా నైననూ మీరు చేయవలెను. మానరాదు, " అని ఉపదేశించినారు.

 || సర్వే జనాస్సుఖినో భవంతు ||

Monday, September 14, 2015

క్రైస్తవ మత ప్రచారకునితో జగద్గురువుల సంభాషణ-1973


శ్రీ గురుభ్యో నమః ||

శ్రీ శ్రీ శృంగేరీ శారదాపీఠము యొక్క ముప్పైఐదవ జగద్గురువులైన శ్రీ అభినవ విద్యాతీర్థుల వారి కాలములో [1973] ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది.





గురువుల వద్దకు దర్శనానికి ఒక క్రైస్తవ మత ప్రచారకులు వచ్చినారు. ఆయన ఉద్దేశము , వారి మతము సర్వశ్రేష్ఠమయినది , కాబట్టి తమ మతానికి జనులను ఆకర్షించి వారికి స్వర్గ ప్రాప్తికి మార్గాన్ని చూపించవలెను. అందుకోసము జగద్గురువులను ఒప్పించి జనాలను క్రైస్తవ మతానికి చేర్పించాలని కోరడానికి వచ్చినారు. విషయము తెలిసిన జగద్గురువులు , వారి మతపు గొప్పదనము యేమిటో తెలుసుకోవలెనని ఆదరముతో ఆహ్వానించి సంభాషించినారు. 


యోగక్షేమాలు , కుశల ప్రశ్నలతర్వాత జగద్గురువులు అడిగినారు , 


జగద్గురువులు :" మీరు ఇక్కడికి వచ్చిన కార్యమేమిటి ? "


" క్రైస్తవ మత ప్రచారకులు [ క్రై. మ. ప్ర. ] : " స్వామీ , నేను మీ ఊరిలో , మీ మఠము సమీపములో ఒక క్రైస్తవ సంస్థను తెరవాలనే ఉద్దేశముతో వచ్చినాను. "


గురువులు : " ఇక్కడ సంస్థను తెరచుటకు కారణము ?" 

క్రై. మ. ప్ర.: " నేను ప్రజలకు ఇక్కడనుండే ధర్మోపదేశమును ఇవ్వాలని ఆశిస్తున్నాను. "

గురువులు : " మీరు ఉపదేశించునది యేమి ?"

క్రై. మ. ప్ర.:"  "మా మతమును గురించి, దాని శ్రేష్ఠతను గురించీ , జనులకు ఉపదేశము చేసి , వారందరినీ మా మతానికి మార్చుకోవాలనుకొంటున్నాను. "

గురువులు :" మీరు జనులకు ఉపదేశము ఇచ్చే ముందు నాకు కూడా మీ మతమును గురించి తెలిపితే , నేను కూడా తెలుసుకుంటాను గదా ? "

క్రై. మ. ప్ర.:" అట్లే కానివ్వండి, మీరు నన్ను ప్రశ్నలు అడగండి, నేను వాటికి సూక్త సమాధానములను ఇవ్వగలవాడను  "

గురువులు : " మీ మతము మొదలై ఎన్ని సంవత్సరాలయినది ?"

క్రై. మ. ప్ర.:" మా మతము పుట్టి 1973  సంవత్సరాలయినాయి "

గురువులు :" సంతోషము , మీ మతపు ఆరంభమును గుర్తించుటకు ఒక నిర్దిష్టమైన  కాలము , సమయము ఉన్నాయని స్పష్టమైంది. మీ మతము పుట్టుటకు ముందు ప్రజలు ఉన్నారా లేరా ? మీ మతము లేనప్పుడు జనులు జీవిస్తుండేవారా లేదా ?"

క్రై. మ. ప్ర.:" జనులే లేకపోతే మేము మతబోధ ఎవరికి చేస్తాము ? మేము మా మత విషయములను నేర్చుకొని ప్రచారము చేయుటకు ముందు కూడా ప్రజలు ఉండనే ఉన్నారు. "

గురువులు : మీ మతములోకి జనులు మారితే వారికి కలుగు ప్రయోజనమేమి?"

క్రై. మ. ప్ర.:" మా మతములో చేరిన వారందరికి మాత్రమే తప్పక స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. నరకము తప్పుతుంది  "

గురువులు :" సరే , మీరు మీ మతమును అనుసరించే వారికి మాత్రము స్వర్గప్రాప్తి కలుగుతుందంటున్నారు. ఇతరులకు నరకప్రాప్తి అంటున్నారు. కానివ్వండి , మీ మతము పుట్టుటకు ముందు బ్రతికి జీవించిన కోటానుకోట్ల ప్రజలు స్వర్గానికి వెళుతుండేవారా లేక నరకానికి వెళుతుండేవారా ? "

క్రై. మ. ప్ర.:" వారంతా నరకానికే వెళుతుండేవారు. మా మత ధర్మాన్ని పాలించనందువల్ల. "

గురువులు :" ఇదెక్కడి న్యాయము ? ఈ కాలపు ప్రభుత్వాలూ , న్యాయస్థానాలు కూడా ఇటువంటి చట్టాన్ని చేయవు కదా , మీరు మీ ధర్మాన్ని, నియమాన్నీ ఏర్పరచక ముందు ఉన్నవారు మీ ధర్మాన్ని పాలించుట లేదు అన్న కారణానికి వారు నరకభాజనులవుతారు అనేది న్యాయమేనా ? ముందెప్పుడో రచించబోయే నియమాలను ఊహించుకొని వారు అనుసరించుట ఎక్కడైనా సాధ్యమా ? కాబట్టి , మీరు మీ మతమునకు సంబంధించిన నియమాలను రచించుటకు ముందే ఉన్నవారు నరకానికే వెళ్ళినారు అని చెప్పుట సమంజసమా ?"


క్రై. మ. ప్ర.:" [ బిక్క చచ్చి ], ఔను స్వాములూ , వారు అందరూ నరకానికి కాదు , స్వర్గానికే వెళ్ళిఉండాలి  " 


గురువులు :" ఇది కూడా అన్యాయమే అవుతుంది, ఎందుకంటే మీ మతపు నియమాలను రాయుటకు ముందు పుట్టి పెరిగిన వారందరూ స్వర్గానికే వెళ్ళేవారు కదా? ఇప్పుడు మీరు రచించిన మత నియమాల వల్ల , వాటిని అనుసరించే కొందరు మాత్రమే స్వర్గానికి వెళుతున్నారు. అనుసరించని వారు నరకానికే వెళుతారు అన్నట్లయింది కదా ?  అందువల్ల , మీరు మీ మత నియమాలను రచించకుండా ఉండిఉంటే అందరూ తప్పక స్వర్గానికే వెళ్ళేవారు. ఇప్పుడు మీ నియమాల వల్ల అనేకులకు అన్యాయము జరిగింది కదా ?"

క్రై. మ. ప్ర.:" [ తన మాటలకు తానే చిక్కుకొని గాభరా పడి] స్వామీ , మీరు నన్ను ఇటువంటి ప్రశ్నలను అడుగుతున్నారే ? దయచేసి నన్ను వదిలేయండి " అన్నాడు.

గురువులు :" సరే , అట్లాగే కానివ్వండి , ఆ సంగతి వద్దు. చూడండి , ఈ ప్రపంచములో ప్రజలు అనేక విధములైన దుఃఖ కష్టాలకూ , సుఖ సంతోషాలకూ లోనగుటను చూస్తున్నాము కదా , దానికేమిటి కారణము ?"

క్రై. మ. ప్ర.:" దీన్నంతటినీ భగవంతుడే  చేసినాడు "

గురువులు :" ఒకడికి ముష్టి అడుక్కోవలసిన హీన స్థితినీ , ఇంకొకడికి దానము చేయునట్టి ఉత్తమ స్థితినీ దేవుడు అనాదిగా ఇస్తున్నాడంటే , భగవంతుడు తనకు ఇష్టమైనవాడిని సుఖములోనూ , తనకు అప్రియమైన వాడిని దుఃఖములోనూ ఉండేటట్టు చేసినాడనే చెప్పవలెను కదా ?" 

క్రై. మ. ప్ర.:" అది భగవంతుని స్వంత ఇఛ్చ , స్వామీజీ , మనమేమీ చేయలేము. వాడు ఏమికావాలన్నా చేయగలడు. అది వాడిష్టము.  "

గురువులు :" భగవంతుడు ఏమి కావాలన్నా చేయవచ్చు అన్నట్టయితే , అందరికీ సుఖాన్నే ఇవ్వవచ్చును కదా ? ఆ సుఖాన్ని కొందరికి మాత్రమే ఎందుకు ఇచ్చినాడు ?దానికి కారణమేమయి ఉంటుంది ?"

క్రై. మ. ప్ర.:" [అప్రతిభుడై], అదంతా భగవంతునికి చెందిన విషయము. నేనేమి చెప్పగలను ? "

గురువులు :" మీ వాదానికి ఒక యుక్తి గానీ , తర్కము గానీ ఉన్నట్టే కనిపించుట లేదు. సరే , అదీ ఉండనివ్వండి , మరొక విషయము ; చిన్న పిల్లలుగా ఉన్నపుడే కొందరు చనిపోతారు. కొందరేమో వయసయిన తర్వాత. ఇలాగున్నపుడు , చిన్నపిల్లలు చనిపోయాక స్వర్గానికి వెళతారా లేక నరకానికా ? "

క్రై. మ. ప్ర.:" చిన్న పిల్లలు పాపము ఎలాచేయగలరు ? వారు ఒక తప్పును కూడా చేయలేరు. వారింకా చిన్నపిల్లలే కాబట్టి వారికి పాపపుణ్యాల ప్రసక్తే రాదు. వారికవి అంటవు "

గురువులు : " అందుకే అడిగినాను , వారు వెళ్ళేది స్వర్గానికా , లేక నరకానికా ?"

క్రై. మ. ప్ర.:" చిన్న పిల్లలందరూ స్వర్గానికే వెళతారు  "

గురువులు :" అట్లయితే మన తల్లిదండ్రులంతా మనగురించి చాలా పెద్ద తప్పే చేసినారు అనవలెను. మనలనందరినీ చిన్న పిల్లలుగా ఉన్నపుడే చావడానికి వదిలేయకుండా  పెంచి పోషించి పెద్ద చేసినారు. ఇది చాలా పెద్ద తప్పు కదా ? శిశువులను పుట్టగానే చంపి వేసుంటే, మనము పెరిగి పెద్దయి, తప్పు చేసేందుకు అవకాశమే ఉండేది కాదు. మనందరకూ స్వర్గమే దొరికేది ? కాదా ?"

క్రై. మ. ప్ర.:"[ మరలా చిక్కుకొని], స్వామీ మీరు ఇలాంటి ప్రశ్నలు వేస్తే నేను జవాబివ్వలేను  "  

గురువులు :" సరే , వదిలేయండి, చనిపోయే వారందరూ స్వర్గానికో లేక నరకానికో వెళతారు తప్పదు కదా, ఎప్పుడు వెళతారు అన్నది చెపుతారా ?"

క్రై. మ. ప్ర.:" భగవంతునికి ఎప్పుడు నిర్ణయించాలనిపిస్తే అప్పుడు నిర్ణయిస్తాడు , అప్పుడే పోతారు  "

గురువులు :" ఇదేమయ్యా ఆశ్చర్యము ? భగవంతుడు పిచ్చివాడా యేమి , తనకిష్టమొచ్చినపుడు న్యాయ నిర్ణయము చేయుటకు ?"

క్రై. మ. ప్ర.:" అలాగ కాదు , అక్కడ అదంతటికీ ఒక క్రమ విధానముంటుంది "

గురువులు :" సరే , మీ పుస్తకములో అదేమి క్రమ విధానమును వివరించినారో కొంచము చెపుతారా ? [ ఆయన మాట్లాడేందుకు తటపటాయించినాడు; గురువులే కొనసాగించినారు] మీ మతములో ఈ విషయము గురించి ఏమి సిద్ధాంతము ఉందో , దాన్ని నేను చెపుతాను. అది సరియా కాదా మీరే చెప్పండి"

క్రై. మ. ప్ర.:" కానివ్వండి స్వామీ , చెప్పండి "

గురువులు :" ఈ ప్రపంచములో ఉన్నవారందరూ చనిపోయిన తరువాత , దేవుడు , ఏదో ఒకరోజు , న్యాయ నిర్ణయమును చేసి, కొందరికి స్వర్గాన్నీ , కొందరికి నరకాన్నీ ఇస్తాడు. కదా ? సరియేనా ? "

క్రై. మ. ప్ర.:"  ఔనౌను , తమరు చెప్పింది సరిగ్గా ఉంది"

గురువులు :" ఈ ప్రపంచములోనే జరుగుతున్న సంగతిని చూడండి , ఎప్పుడైనా ఎవరైనా ఒక తప్పు చేసినారంటే , విచారణకు మొదట , ఆ తప్పు చేసినవాడిని పోలీసులు కొన్నిరోజులు నిర్బంధములో ఉంచుతారు. దాని తర్వాత కూడా అతడిని పోలీసులు లాకప్ లో ఉంచాలంటే ,దానికి న్యాయాధీశుల అనుజ్ఞను పొందవలసి ఉంటుంది. అలాగ , కారణమూ , అనుమతీ లేకుండా , విచారణ చేయకుండా  ఎక్కువ రోజులు ఉంచుటకు వీలు లేదు. న్యాయాధీశులు ఒప్పుకోకుంటే అతడిని పోలీసులు నిర్బంధము నుండీ వదిలివేయ వలసి ఉంటుంది. ఇలాగున్నపుడు , ఒకడు మృతుడయిన తరువాత వాడికి , " ఈ ప్రపంచములో ఉన్నవారందరూ చచ్చిపోయే వరకూ , అనగా , కోటి కోటి సంవత్సరాలయ్యే వరకూ జనాలు పుట్టుతూ చస్తూ ఉంటారు కాబట్టి , అదంతా అయ్యే వరకూ , ’ నువ్వు విచారణ లేకుండానే కాచుకొని ఉండాలి" అంటూ ఆ భగవంతుడు చెబితే ,అది న్యాయమనిపించుకుంటుందా ? మీరే చెప్పండి?"


జగద్గురువుల ఈ మాటను విని ఆ క్రైస్తవ మత ప్రచారకుడు దిక్కుతోచనివాడైనాడు. అప్పుడు గురువులు ఆతనికి సమాధనము చెబుతూ , 


" మీకు మీ మతమే గొప్పది. మీరు దానిని అత్యంత శ్రద్ధతో అనుసరించవలెను. అంతే కానీ , ఇతరులతో , ’ మా మతమే శ్రేష్ఠమైనది, దానినే అందరూ అనుసరించవలెను, అలాగ ఏమైనా మీరు మా మతాన్ని అనుసరించకపోతే మీకు , నరకమూ , దుఃఖమే గతి’ అని చెప్పుట సాధువైనది కాదు. మీకు మీ తల్లి పూజనీయురాలు. ఇతరులకు వారి వారి తల్లులు పూజనీయులు. ’ మాతల్లి మాత్రమే పూజనీయురాలు , ఇతరుల తల్లులు కాదు’ అంటూ మీరు చెప్పితే అది మీ మూఢత్వమే అవుతుంది. నా తల్లి కూడా ఇతరుల తల్లులవలె సమానముగా పూజనీయురాలు అని తెలుసుకున్నపుడే మనలను ప్రపంచము ఆదరిస్తుంది. లేకుంటే ఛీత్కరిస్తుంది. " అని ఉపదేశించినారు. ఆతడిని వీడ్కొనునప్పుడు ఆతనికి జగద్గురువులు ఎప్పటివలెనే ఫలమునిచ్చి సత్కరించినారు. అతడు దానిని ఆదరముతో స్వీకరించి వెళ్ళిపోయినాడు. 


ఆ తరువాత గురువులు భక్తులను ఉద్దేశించి ,


 || సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః |

అనేన ప్రసవిష్యధ్వమేష వోఽత్తిష్వ కామధుక్ ||

" మొదట యజ్ఞములతోపాటు ప్రజలను సృష్టించి ప్రజాపతి, ’ ఈ యజ్ఞములు మీకు కామధేనువులగు గాక ’ యని అంటాడు. బ్రహ్మ దేవుడు , జగత్తును సృష్టి చేయునపుడే అది సరిగ్గా నడుస్తూ ఉండుటకు అవసరమైన విధి-నియమములను రచించినాడు. ఇది మన మతపు గొప్పతనము. మన సనాతన ధర్మపు సిద్ధాంతము ప్రకారము , భగవంతుడు అనాదియైనవాడు. అలాగే ఈ ప్రపంచమూ , మన ధర్మమూ కూడా అనాదిగా ఉన్నవి. జీవరాశులకు వాటి వాటి కర్మలకు తగినట్లు ఫలము ప్రాప్తిస్తుంది. దుష్టులకు దుష్టఫలము , సత్కర్ములకు మంచి ఫలము. కర్మలు అచేతనమైనవి-అంటే జడమైనవి. ఫలము నిచ్చేది భగవంతుడే. 


భగవంతుడు దయాళువు అనునది దిటమైన మాట.. తప్పుచేసినవాడు తన తప్పును ప్రామాణికముగా ఒప్పుకొని క్షమాభిక్ష వేడితే న్యాయాధీశులు శిక్షను తగ్గిస్తారు కదా ? కానీ ఇతడు పదే పదే తప్పులు చేస్తూ ప్రతిసారీ క్షమాభిక్షను కోరితే న్యాయాధీశుడు క్షమిస్తాడా ? భగవంతుడు కూడా అట్లే. ప్రామాణికులైనవారిని క్షమిస్తాడు. కానీ పదే పదే తప్పుచేసే వాడిని ఖచ్చితముగా క్షమించడు. మన శాస్త్రములు శ్రద్ధతో పాటూ వివేకము కూడా ఉండవలెనని బోధిస్తాయి. ఇతరమతాలు శ్రద్ధ ఒక్కటీ ఉంటే చాలని చెబుతాయి. మత ధర్మములలో భావుకత మాత్రమే కాక విచారము చేయు ప్రవృత్తి కూడా ఉండవలెను. 


శ్రీరామచంద్రుడు , శ్రీ కృష్ణుడు వంటి అవతారాలు మన ధర్మములో మాత్రమే కనిపిస్తాయి. మన ధర్మము వారివల్ల యేదో కొత్తగా స్థాపించబడినది కాదు. మన ధర్మము , అటువంటివారిని ఈ జగత్తుకు ప్రసాదించింది. ఇంతటి మహాత్మ్యమున్న సనాతన ధర్మములో మనందరమూ జన్మించినాము. ఈ సనాతన ధర్మపు బోధనలను పాలించి మనమందరమూ శ్రేయస్సుకు తగినవారము కావలెను. " అని ఉపదేశించినారు. 


[ శ్రీ శృంగేరీ శారదా పీఠము వారు కన్నడ భాషలో ప్రచురించిన " శృంగేరీ పుణ్యక్షేత్రము " పుస్తకమునుండీ అనువాదము }